
వియత్నామ్లోని హాలాంగ్ అఖాతం ప్రకృతి అందాలకు ఆలవాలం అనే చెప్పుకోవాలి. సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యత కలగలిసిన ఈ ప్రదేశం తప్పక చూడాల్సిందే అంటారు పర్యాటక ప్రియులు. ఇది వియత్నామ్కు, దక్షిణ–చైనాకు సముద్ర సరిహద్దు భాగం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ప్రాంతంలో సుమారు రెండువేల సున్నపురాతి దీవులు ఉన్నాయి.
ఇవి చూడటానికి వివిధ ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో ఎత్తుగా, పచ్చదనం చుట్టిన పర్వతాల్లా, లోతైన నీళ్ల మధ్యలో కనిపిస్తూ, కనువిందు చేస్తాయి. ఆ పర్వతాలను, గుహలను, నీటిలో తేలియాడే గ్రామాలను చూడటానికి పడవ ప్రయాణాలు చేస్తూ వెళ్లాలి. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఈ ప్రాంతం మరింత మనోహరంగా ఉంటుంది.
అక్కడి పురాణాల ప్రకారం, ‘ఒకప్పుడు వియత్నామ్ను కాపాడటానికి దేవతలు డ్రాగన్ల కుటుంబాన్ని పంపారు. ఆ డ్రాగన్లు తమ నోటి నుంచి రత్నాలను ఉమ్మివేశాయి. అవి సముద్రంలో పడి దీవులుగా ఏర్పడ్డాయి. అవే దురాక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించాయి’ అని చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘డిసెండింగ్ డ్రాగన్’ అని పిలుస్తారు.
(చదవండి: మంచుకొండల్లో మహిళారాజ్యం..! ఆ ఒక్క జిల్లాలో పాలనాధికారులంతా..)