
పూర్వం జానశ్రుతి అనే మహారాజు ఉండేవాడు. దానధర్మాలలో ఆయనకు సాటి వచ్చే రాజులెరూ లేరు. జానశ్రుతి ధర్మపరాయణుడు. నిత్యం పండిత గోష్ఠి నిర్వహిస్తూ సాధు సత్పురుషుల ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించేవాడు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. పండితులను ఘనంగా సత్కరించేవాడు. తరచుగా యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, విప్రులకు విరివిగా దానాలు చేస్తూ ఉండేవాడు. జానశ్రుతి పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండేది.ఒకనాడు సాయంత్రం జానశ్రుతి మహారాజు తన ఏడంతస్తుల రాజసౌధం పై అంతస్తులో డాబాపై తూగుటుయ్యాలలో కూర్చుని, విశ్రమిస్తున్నాడు. అదే సమయంలో రెండు రాజహంసలు ఆకాశంలో ఎగురుతూ తమలో తాము సంభాషించుకున్న మాటలు జానశ్రుతి చెవిన పడ్డాయి.
ఒక రాజహంస జానశ్రుతి దానశీలతను, ధర్మపరాయణతను పొగడసాగింది. ‘ఇదిగో! ఇదే జానశ్రుతి మహారాజు రాజధాని. భూలోకంలో ఆయనంతటి దాత, ధార్మికుడు, జ్ఞాని మరొకరు లేరు’ అంది.అంతలో మరో హంస ఆ మాటలను కొట్టి పారేస్తూ, ‘చాలు చాల్లే! నీ జానశ్రుతి మహారాజు సంగతి ఎవరికి కావాలోయ్! ముల్లోకాలలోనూ రైక్వుడికి మించిన మహానుభావుడు మరొకడు లేడు. జానశ్రుతి మహారాజు ఎన్ని దానధర్మాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, బండివాడైన రైక్వుడి పాదాలను కడగడానికి కూడా అర్హుడు కాడు’ అని పలికింది.
ఆ రాజహంసలు నిజానికి దేవతలు. భూలోకంలో అసలైన ధార్మికుడు ఎవరో కనిపెట్టే ఉద్దేశంతో రాజహంసల రూపంలో ప్రపంచ సంచారానికి బయలుదేరారు.జానశ్రుతి తల పైకెత్తి ఆ హంసలను గమనించసాగాడు. అవి రెండూ వాదించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ‘రైక్వుడి ముందు జానశ్రుతి మహారాజు ఎందుకూ కొరగాడు’ అందొక హంస.జానశ్రుతి చూస్తుండగానే, అవి దూరంగా ఎగురుతూ కనిపించకుండా పోయాయి.‘రైక్వుడి ముందు ఎందుకూ కొరగాడు’ అనే మాటలు జానశ్రుతి మహారాజులో కలత రేపాయి.ఆనాటి రాత్రి జానశ్రుతికి సరిగా నిద్రపట్టలేదు.మర్నాడు వేకువనే జానశ్రుతి నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, త్వర త్వరగా సిద్ధమై సభాంగణానికి చేరుకున్నాడు. వెంటనే సారథిని పిలిపించాడు.
‘సారథీ! రైక్వుడు అనే పేరు గల మహాజ్ఞాని ఎవరో ఉన్నాడట, ఆయన బండివాడట! ఆయన ఎక్కడ ఉన్నాడో వెదికి తీసుకురా! నేను ఆయన పాదపూజ చేసి, ఆయన ద్వారా బ్రహ్మజ్ఞానం పొందుతాను’ అని చెప్పాడు.రాజాజ్ఞతో సారథి రాజధాని నలువైపులా సంచరించి, గాలించాడు. మరోవైపు జానశ్రుతి ఇంకొందరు భటులను కూడా రైక్వుని వెదుకులాట కోసం పంపించాడు. వారు కూడా వెదుకులాట సాగించారు. కొన్నాళ్ల వెదుకులాట తర్వాత రాజధానికి వెలుపల చాలా దూరంలో ఒక బండి కింద గొప్ప తేజస్సుతో వెలుగొందుతున్న వ్యక్తి ఒకరు కనిపించాడు. ఎండ వేడికి అతడి శరీరం చెమటోడుతూ ఉంది. అతడి దుస్తులు మురికిగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనూ అతడి ముఖంలో దివ్యతేజస్సు కనిపిస్తూ ఉంది.రాజభటులు అతడిని సమీపించి, ‘మహానుభావా! తమరేనా రైక్వ నామధేయులు?’ అని అడిగారు.
‘ఔను! నా పేరు రైక్వుడు’ అన్నాడు.భటులు వెంటనే జానశ్రుతి మహారాజు వద్దకు వెళ్లి, రైక్వుడి తాము ఎక్కడ కనుగొన్నదీ చెప్పారు.జానశ్రుతి మహారాజు వెంటనే బళ్లు సిద్ధం చేయించి, విలువైన బంగారు హారాన్ని, ఆరువందల గోవులను తీసుకుని రైక్వుడి వద్దకు చేరుకున్నాడు.రైక్వుడికి ప్రణామం చేసి, ‘మహానుభావా! నేను జానశ్రుతి మహారాజును. నేను తెచ్చిన ఈ కానుకలను స్వీకరించి, దయతో నాకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించండి’ అని వినయంగా అభ్యర్థించాడు.రైక్వుడు ఆ కానుకల వంక ఒకసారి చూసి, వెంటనే చూపు తిప్పేసుకున్నాడు. ‘నువ్వు తగిన దాతవు కాదు. నీ కానుకలను నేను పుచ్చుకోను. వచ్చిన దారినే తిరిగి వెళ్లు’ అని కటువుగా పలికాడు.
అప్పటికే బ్రహ్మజ్ఞానం పొందిన రైక్వుడు, ఇకపై సంసారయాత్ర ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్నాడు. జానశ్రుతి మహారాజు తీసుకొచ్చిన కానుకలు అతడి సంసారయాత్రకు సరిపోవు. జానశ్రుతి మహారాజు రాజధానికి తిరిగి వచ్చి, కాస్త ఆలోచించాడు. అతడికి రైక్వుడి మనోగతం కొంత అర్థమైంది.ఈసారి రకరకాల తినుబండారాలను, వెయ్యి గోవులను, విలువైన ఆభరణాలను, ఒక కన్యను కూడా తీసుకుని రైక్వుని వద్దకు పోయాడు. ‘మహానుభావా! నా కానుకలను స్వీకరించి, ఈ కన్యారత్నాన్ని వివాహమాడి గృహస్థాశ్రమం స్వీకరించండి. నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి’ అని కోరాడు.ఈసారి రైక్యుడు ప్రసన్నుడయ్యాడు. జానశ్రుతి తీసుకువచ్చిన కన్యను పరిగ్రహించి, అతడి కానుకలను స్వీకరించి, అతడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. బ్రహ్మజ్ఞానం పొందిన జానశ్రుతి రాజులలో అగ్రగణ్యుడిగా వెలుగొందాడు.
∙సాంఖ్యాయన