
సర్వ శాస్త్ర సంపన్నం
సర్వ శిల్ప ప్రవర్తకం
నాట్యాఖ్యం పంచమం వేదం
సేతిహాసం కరోమ్యహమ్
పంచమవేదంగా పరిగణించదగిన సమస్త శిల్ప శాస్త్రేతిహాసాల సమాహారమైన నాట్యశాస్త్రాన్ని భరతముని మనకు అందించాడు. ఆరు లలితకళలలో నాట్యం ఒకటైనా, నాట్యకళకు మిగిలిన కళలు లేకుండా నాట్యం పరిపూర్ణం కాదు. మిగిలిన కళలన్నీ నాట్యానికి హంగులు సమకూర్చేవే! నాట్యం సమాహార కళ. సహస్రాబ్దాల కిందటే నాట్యానికి శాస్త్రబద్ధత ఏర్పడినా, నాట్యం పండిత పామర జనరంజకమైన కళ. ఆబాల గోపాలాన్నీ అలరించే అద్భుతమైన కళ.ఏప్రిల్ 29 అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
సంగీతం మాదిరిగానే నాట్యం కూడా విశ్వజనీనమైన కళ. వివిధ నాగరికతలలో ఆయా ప్రాంతాలకు తగినట్లుగా రూపుదిద్దుకున్న నాట్యకళ కాలానుగుణంగా అనేక మార్పులకు లోనైంది. నాట్యకళ పుట్టు పూర్వోత్తరాల గురించి ఇదమిత్థంగా చెప్పడం సాధ్యం కాదు గాని, నాట్యం తొలిసారిగా శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నది మాత్రం మన భారతదేశంలోనే! దాదాపు రెండువేల ఏళ్ల కిందటే భరతముని సంస్కృతంలో ‘నాట్యశాస్త్రం’ రచించాడు. నాట్యకళకు సంబంధించి ప్రపంచంలో ఇదే తొలి శాస్త్రీయ గ్రంథం. రెండువేల ఏళ్ల కిందటే నాట్యం శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నదంటే, నాట్యం ఉనికి అంతకు చాలా ముందు నుంచే ఉండవచ్చని ఊహించవచ్చు.
మన పురాణాలలో నాట్య ప్రస్తావన కనిపిస్తుంది. పరమశివుడిని నాట్యానికి ఆదిదేవుడిగా పరిగణిస్తారు. శివుడిని నటరాజ రూపంలో కూడా ఆరాధిస్తారు. శివతాండవంతో పాటు కాళీయమర్దనం చేసిన తాండవకృష్ణుడి లీలావినోదం మన పురాణాల్లో ఉంది. అజ్ఞాతవాస కాలంలో బృహన్నలగా మారిన అర్జునుడు నాట్యాచార్యుడిగా విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్యం నేర్పించిన ఉదంతం మహాభారతంలో ఉంది. మన పురాణాల ప్రకారం స్వర్గలోకంలోని అప్సరసలందరూ నర్తకీమణులే! నాట్యకళ ప్రాచీనతకు మన పురాణేతిహాసాలే సాక్ష్యాలు. కాలగతిలో జరిగిన అనేక పరిణామాలకు భారతదేశంలోని శాస్త్రీయనృత్యం రకరకాలుగా రూపాంతరాలు చెందింది.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విలక్షణమైన శాస్త్రీయనృత్యంగా పరిణామం చెందింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ మన దేశంలోని ఎనిమిది రకాల నాట్యశైలులను శాస్త్రీయ నృత్యాలుగా గుర్తించింది. ఈ ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యాలలో అనేక మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికీ ఎందరో యువతరం కళాకారులు ఈ శాస్త్రీయ నృత్యాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు చేస్తూ, నాట్యకళలో భారతదేశ ఖ్యాతిని చాటి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యరీతులు, వాటి కథా కమామిషు తెలుసుకుందాం..
భరతనాట్యం
భరతముని రచించిన నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందించిన ప్రాచీన నాట్యశైలి భరతనాట్యం. ఇది తమిళనాడులో పుట్టింది. కణ్ణగి విషాదగాథపై రచించిన తమిళ పౌరాణిక గ్రంథాలు ‘సిలప్పటిగారం’లోను, ‘మణిమేగలై’లోను భరతనాట్య ప్రస్తావన కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుశకం రెండోశతాబ్ది నాటిది. ఆ తర్వాతి కాలంలో దక్షిణాదిలో వెలసిన వివిధ దేవాలయాల గోడలు, స్తంభాలపై ఉన్న నాట్యభంగిమలు భరతనాట్య నృత్యభంగిమలకు నిదర్శనంగా నిలుస్తాయి. నటరాజ రూపంలోని శివుడి 108 భంగిమలనే భరతనాట్యంలో ‘కారణ’భంగిమలుగా పరిగణిస్తారు. రాచరికాలు కొనసాగిన కాలంలో వివిధ రాజ్యాలలో భరతనాట్యానికి రాజాదరణ ఉండేది.
ఆనాటి కాలంలో దేవాలయ సంప్రదాయాలలో భాగంగా దేవదాసీలు భరతనాట్య పరంపరను కొనసాగించారు. బ్రిటిష్ పరిపాలన మొదలయ్యాక మన దేశంలోని శాస్త్రీయ నృత్యరీతులకు గడ్డుకాలం మొదలైంది. ఒక దశలో బ్రిటిష్ ప్రభుత్వం దేవాలయాల్లో దేవదాసీల నాట్య ప్రదర్శనలను నిషేధించింది. ఆదరణ కరవై, దారుణమైన గడ్డు పరిస్థితులు తలెత్తినా, ఎందరో నాట్య కళాకారులు ఈ పరంపర అంతరించిపోకుండా కాపాడగలిగారు. వారి కృషి ఫలితంగానే, ఈనాడు భారతీయ శాస్త్రీయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందగలుగుతున్నాయి. దేవాలయాల్లో నాట్య ప్రదర్శనల నిషేధం తర్వాత ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లోనే నాట్య కళాకారులు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం మొదలైంది. అప్పట్లో రుక్మిణీదేవి అరండేల్, తంజావూరు బాలసరస్వతి వంటి కళాకారిణులు భరతనాట్యంలో అగ్రగాములుగా రాణించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన శాస్త్రీయ నృత్యరీతులకు పునరుజ్జీవం మొదలైంది. ఆరితేరిన గురువుల ఆధ్వర్యంలో నాట్య శిక్షణ కేంద్రాలు ప్రారంభయ్యాయి. క్రమంగా దేశ విదేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా భారతీయ శాస్త్రీయ నృత్యానికి చోటు దక్కింది. చైనాకు చెందిన ఝాంగ్ జున్ 1950లలోనే భరతనాట్యాన్ని చైనాకు పరిచయం చేశారు. చైనాలో ఆమె చేసిన ప్రదర్శన అక్కడివారిని అబ్బురపరచింది. యామినీ కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలమేల్ వల్లి వంటి కళాకారులు భరతనాట్యం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. నర్తకీమణులైన వైజయంతిమాల, హేమమాలిని వంటి సినీతారల వల్ల భరతనాట్యానికి జనాదరణ మరింతగా పెరిగింది. పలువురు విదేశీ విద్యార్థులు కూడా భరతనాట్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వారిలో కొందరు ప్రదర్శనల్లోనూ రాణిస్తున్నారు.
కూచిపూడి
మన తెలుగునేల మీద పుట్టిన శాస్త్రీయ నృత్యరీతి కూచిపూడి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఈ నృత్యశైలి రూపుదిద్దుకోవడంతో దీనికి ఆ పేరు వచ్చింది. క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికే కూచిపూడి నృత్యం ఉన్నట్లు రాగిరేకుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వైత సన్యాసి నరహరి తీర్థుల శిష్యులలో ఒకరైన సిద్ధేంద్ర యోగి పదిహేడో శతాబ్దిలో ఆధునిక కూచిపూడి నృత్యశైలికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేశారు.
వైష్ణవ సంప్రదాయ ప్రభావం వల్ల కూచిపూడి నృత్యంలో కృష్ణుడి లీలావిలాసాలే ప్రధానాంశాలు. కృష్ణలీలల నృత్యాభినయం తంజావూరు ప్రాంతంలో ‘భాగవత మేళా’గా పేరుపొందింది. కూచిపూడి నృత్య కళాకారులు తెలుగునేల మీద భాగవతులుగా, తమిళనాడులో భాగవతార్లుగా పేరుపొందారు. నారాయణ తీర్థులు రచించిన కృష్ణలీలా తరంగిణిని కూచిపూడి భాగవతులు విరివిగా ప్రదర్శించేవారు. అప్పట్లో కళింగరాజ్యం మొదలుకొని తంజావూరు రాజ్యం వరకు వీరికి గొప్ప ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలో మిగిలిన నృత్యరీతుల మాదిరిగానే కూచిపూడి కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది.
అయినా, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి వెంకటనారాయణ శాస్త్రి, వెంపటి చిన వెంకటరామయ్య శాస్త్రి వంటి వారు కూచిపూడి సంప్రదాయం కొడిగట్టిపోకుండా కాపాడారు. స్వాతంత్య్రానంతరం ఇంద్రాణి రహమాన్, యామినీ కృష్ణమూర్తి, శోభా నాయుడు వంటివారు విదేశాల్లో ప్రదర్శనలు చేసి, కూచిపూడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. వారి ప్రభావంతో పలువురు విదేశీ విద్యార్థులు కూడా కూచిపూడి నృత్యం పట్ల ఆకర్షితులై నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.
ఒడిస్సీ
ఒడిశాలో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి ఒడిస్సీ. కళింగ రాజ్యంలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి తొమ్మిదో శతాబ్ది మధ్య కాలంలో ఒడిస్సీ నృత్యశైలి ప్రత్యేకమైన శాస్త్రీయ నృత్యంగా రూపుదిద్దుకుంది. ఒడిస్సీ నృత్య ప్రస్తావన ఆనాటి జైన, బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. పూరీ, కోణార్క తదితర దేవాలయాల రాతి గోడలు, స్తంభాలపై కనిపించే నాట్య భంగిమలు ఒడిస్సీ నృత్యశైలి ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తాయి. పదిహేడో శతాబ్ది వరకు ఒడిస్సీ నృత్యానికి రాజాదరణ బాగా ఉండేది. పద్నాలుగో శతాబ్దిలో ఖుర్దా రాజు ఒడిస్సీ నృత్యంలో ‘గొటిపువొ’ సంప్రదాయాన్ని బాగా ప్రోత్సహించారు.
గురుకులంలో పరంపరాగతంగా నృత్యశిక్షణ పొందే బాలురను ‘గొటిపువొ’ అంటారు. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురైనా, ఎందరో కవులు, పండితులు, నర్తకులు ఒడిస్సీ నృత్య సంప్రదాయం కనుమరుగు కాకుండా కాపాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ‘కవిచంద్ర’ కాళీచరణ్ పట్నాయక్ వంటి కవి పండితులు, కేలూచరణ్ మహాపాత్రో, పంకజ్చరణ్ దాస్, సంజుక్తా పాణిగ్రాహి, సోనాల్ మాన్సింగ్ తదితరులు ఒడిస్సీ నృత్యానికి పునరుజ్జీవం కల్పించి, అంతర్జాతీయ గుర్తింపు దక్కేందుకు దోహదపడ్డారు.
కథాకళి
కేరళకు చెందిన శాస్త్రీయ నృత్యశైలి కథాకళి. ‘అట్టకథ’ సాహిత్య రూపంలోని నృత్యరూపకాలను కథాకళి కళాకారులు ప్రదర్శిస్తారు. ఇతర శాస్త్రీయ నృత్యరీతులతో పోల్చుకుంటే కథాకళి నర్తకుల వేషధారణ చాలా విభిన్నంగా ఉంటుంది. ‘కుటియాట్టం’, ‘కృష్ణన్ అట్టం’ అనే ప్రాచీన సంస్కృత నాటక ప్రదర్శన ప్రక్రియల నుంచి పదహారో శతాబ్ది నాటికి కథాకళి ప్రత్యేక నృత్యశైలిగా రూపు దిద్దుకుంది. రసాభినయానికి అన్ని శాస్త్రీయ నృత్యరీతుల్లోనూ ప్రాధాన్యం ఉన్నా, ముద్రలు, భంగిమలు వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది.
కథాకళిలో మాత్రం నవరసాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కేరళ ప్రాంతంలోని ట్రావెన్కోర్, పాలక్కాడ్ సంస్థానాలు కథాకళి నృత్యాన్ని బాగా ఆదరించాయి. కథాకళి నృత్యంలో గురుకుల పరంపరలో శిష్యులను తయారు చేసే పద్ధతి పంతొమ్మిదో శతాబ్ది వరకు సాగింది. స్వాతంత్య్రానంతరం కథాకళి కళాకారులు ఒకవైపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు ఆధునికతను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కాలమండలం గోపి, కోట్టక్కల్ శివరామన్ వంటి కళాకారులు కథాకళి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు.
మణిపురి
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి మణిపురి. దీనినే ‘మణిపురి రాసలీల’ అని, ‘జాగోయి రాస్’ అని కూడా అంటారు. మణిపురి నృత్యానికి మూలాలు ప్రాచీన మైతేయి నాగరికతలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మైతేయి రాజు చింగ్ థాంగ్ ఖోంబా ప్రస్తుతం ఉన్న మణిపురి నృత్యశైలికి నియమ నిబంధనలను రూపొందించారు. మణిపూర్ రాజ్యాన్ని పరిపాలించిన ఆయన ‘రాజర్షి భాగ్యచంద్ర’గా పేరుపొందారు. మణిపురి నృత్యంలో ఎక్కువగా కృష్ణ లీలలను, భాగవత గాథలను ప్రదర్శిస్తారు.
జానపద మూలాల నుంచి రూపొందిన అరుదైన శాస్త్రీయ నృత్యశైలిగా మణిపురి నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం 1891లో మణిపూర్ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాక మణిపురి నృత్యానికి వైభవం సన్నగిల్లింది. అప్పట్లో ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగోర్ మణిపురి నృత్యానికి పునరుజ్జీవం కల్పించేందుకు ఎనలేని కృషి చేశారు. రాజ్కుమార్ సింఘజిత్ సింగ్, దర్శనా ఝావేరీ, కళావతీ దేవి, బింబావతి దేవి, నిర్మలా మెహతా వంటి నర్తకులు మణిపురి నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తీసుకొచ్చారు.
సాత్త్రియా
ఈశాన్య భారతదేశానికి చెందిన మరో శాస్త్రీయ నృత్యశైలి సాత్త్రియా. అసోంలోని సంప్రదాయ ‘అంకియా నాట’ అనే ఏకాంకిల ప్రదర్శనలో భాగంగా ‘భావన’ పేరుతో నృత్యాలను ప్రదర్శించేవారు. ‘అంకియా నాట’ ప్రక్రియను పదిహేనో శతాబ్దికి చెందిన కవి పండితుడు, సంగీతకారుడు, నర్తకుడు అయిన శంకరదేవ్ రూపొందించారు. కాలక్రమేణా ‘సత్త్ర’ అనే వైష్ణవ మఠాలలో ‘అంకియా నాట’ ఏకాంకిలను పూర్తిగాను, ఒక్కోసారి ‘భావన’ నృత్యాన్ని విడిగాను ప్రదర్శించేవారు.
కొంతకాలానికి ఈ ప్రక్రియ నుంచి నృత్యం విడివడి ప్రత్యేక శైలిగా రూపొందింది. ‘సత్త్ర’లలో ప్రదర్శించడం వల్ల ఈ నృత్యశైలికి ‘సాత్త్రియా’ అనే పేరు వచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2000 సంవత్సరంలో ‘సాత్త్రియా’ను శాస్త్రీయ నృత్యంగా గుర్తించింది. అప్పటి నుంచి సాత్త్రియా నృత్యానికి ప్రాచుర్యం మొదలైంది. శరోది సైకియా, ఇందిరా బోరా, అనితా శర్మ, అన్వేషా మహంతా తదితరులు సాత్త్రియా నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తీసుకొచ్చారు.
మోహినీయాట్టం
కేరళలో పుట్టిన మరో శాస్త్రీయ నృత్యశైలి మోహినీయాట్టం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పంచిపెట్టడానికి శ్రీమహావిష్ణువు దాల్చిన మోహినీ అవతారం నుంచి మోహినీయాట్టం నృత్యానికి ఆ పేరువచ్చింది. కేరళలోనే రూపొందించిన కథాకళి అభినయ ప్రధానమైన నృత్యశైలి అయితే, మోహినీయాట్టం లాస్య ప్రధానమైనది. ఇదివరకు ఎక్కువగా మహిళలే మోహినీయాట్టం నృత్యాన్ని ప్రదర్శించేవారు. ఇటీవలి కాలంలో పురుషులు కూడా దీనిని నేర్చుకుని, ప్రదర్శిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయంలోని పురాణగాథలకు సంబంధించిన గీతాలకు అనుగుణంగా ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు.
క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నుంచి పద్దెనిమిదో శతాబ్ది వరకు అనేక పరిణామాలకు లోనై ఈ నృత్యం ప్రత్యేక శైలిగా ఆవిర్భవించింది. పద్దెనిమిదో శతాబ్ది నాటి నృత్యశాస్త్ర గ్రంథం ‘బలరామ భారతం’ ఈ నృత్యాన్ని ‘మోహినీ నటనం’గా అభివర్ణించింది. స్వాతంత్య్రానికి ముందు ట్రావెన్కోర్ సంస్థానాధీశులు కథాకళితో పాటు మోహినీయాట్టం నృత్యాన్ని కూడా సమాదరించారు. స్వాతంత్య్రానంతరం మోహినీయాట్టం అంతర్జాతీయ వేదికలపైకి కూడా చేరుకుంది. సునందా నాయర్, కళామండలం కల్యాణకుట్టి అమ్మ, గోపికా వర్మ, జయప్రభా మేనన్, పల్లవి కృష్ణన్ వంటి నర్తకులు మోహినీయాట్టం నృత్యానికి దేశ దేశాల్లో ప్రాచుర్యం కల్పించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్రీయ, జానపద నృత్యరీతులు ఉన్నాయి. కాలానుగుణంగా మరెన్నో అధునాతన నృత్యశైలులు పుట్టుకొస్తున్నాయి. సంగీతంలాగానే నృత్యం కూడా సహజ భావోద్వేగాలతో ముడిపడిన కళ. వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు ఆస్వాదించే కళ. నాట్యవేదం ఆబాల గోపాలానికీ జీవననాదం.
కథక్
ఉత్తరాదిలో ప్రజాదరణ పొందిన శాస్త్రీయనృత్య శైలి కథక్. కథక్ సహా వేర్వేరు శాస్త్రీయ నృత్యరీతులన్నిటికీ భరతుడి నాట్యశాస్త్రమే ప్రామాణిక గ్రంథం. ఉత్తరాదిలో భక్తి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో– సుమారు క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్ది కాలంలో వారణాసిలో కథక్ ప్రత్యేక నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. భక్తి ఉద్యమ ప్రభావం కారణంగా కథక్ నృత్యంలో రాధాకృష్ణుల లీలా వినోదాలు, భాగవత గాథలు ప్రధాన ప్రదర్శనాంశాలుగా కనిపిస్తాయి. తొలినాళ్లలో ఆలయాలకు పరిమితమైన కథక్ నృత్యానికి మొఘల్ కాలంలో రాజాదరణ లభించింది.
కథక్ నర్తకులకు రాజ దర్బారులో నాట్య ప్రదర్శనలు చేసే అవకాశం లభించింది. భారతీయ సంప్రదాయ పద్ధతికి తోడుగా పర్షియన్ శైలిని కలుపుకొని కథక్ ఒక విలక్షణ శాస్త్రీయ నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా, స్వాతంత్య్రానంతరం పునరుజ్జీవం పొందింది. బ్రిటిష్ కాలంలో నిరాదరణకు గురైన సంప్రదాయ కళలను ప్రోత్సహించే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం 1956తో ఖైరాగఢ్లో ఇందిరా కళా సంగీత విశ్వ విద్యాలయం ప్రారంభిం చింది.
ఇందులో కథక్ నృత్యానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కథక్ డిగ్రీ కోర్సుకు సిలబస్ను ప్రఖ్యాత నర్తకుడు పురు దధీచ్ రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎందరో కళాకారులు కథక్ నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. బిర్జూ మహారాజ్, సితారా దేవి, గోపీకృష్ణ వంటి ఎందరో నర్తకుల కృషి ఫలితంగా కథక్ నృత్యం దేశ విదేశాలకు పాకింది.