
ఒకప్పుడు ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కోసం మాత్రమే యోగాని ఒక మార్గంగా పరిగణించేవారు. ప్రస్తుతం అనారోగ్యానికి చికిత్సా మార్గంగా మారింది. దీంతో ఆధునిక వైద్యంలో అనేక దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో యోగాసనాల ప్రాముఖ్యత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒక్కో వ్యాధికీ ఒక్కో రకం మందు లాగా వ్యాధికి తగిన యోగాసనం ఉండటం విశేషం. దినచర్యలో ఈ ఆసనాలను చేర్చడం ద్వారా ఒక్కోసారి మందులు లేకుండానే లేదా మందులతో పాటు అనుసరించి శరీరాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. రానున్న ఆరోగ్య సమస్యల నివారణకు మాత్రమే కాదు, చికిత్సకు కూడా ఒక బలమైన సాధనంగా అవతరిస్తోంది. కేవలం మందులపైనే ఆధారపడే పలువురు బాధితులకు యోగా చికిత్సగా మారుతోంది. అనారోగ్య సమస్యను బట్టి ఆసనాన్ని సూచించే విధానం స్థిరపడుతోంది.
నగర జీవనశైలిలో ఎంత వేగం పెరిగినప్పటికీ ఆరోగ్యం కూడా అంతే వేగంగా దెబ్బతింటోంది. ఒత్తిడితో కూడిన జీవన శైలి కారణంగా శారీరక, మానసిక ఒత్తిడులు, జీవనశైలిలో మార్పుల కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక రోగాలు నగరవాసులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాచీన భారతీయత అందించిన వారసత్వ సంపదగా యోగా, గతంలో వ్యాధుల నివారణకు మాత్రమే అన్నట్టుగా ఉండగా, ఇప్పుడు వాటి చికిత్సకు కూడా ఉపయుక్తంగా మారుతోంది.
నివారణకు ఇలా...
యోగా సాధన ద్వారా శరీరానికి కావాల్సిన స్థితిస్థాపక శక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నాడీ వ్యవస్థ, రక్తప్రసరణ, జీర్ణవ్యవస్థ ద్వారా కొత్తగా వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న రోగాలను నియంత్రించేందుకు యోగా ఒక సహాయక పద్ధతిగా మారుతోంది.
ప్రాణాయామం, ధ్యానం, ఆసనాల ద్వారా వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేలా చేసి దెబ్బతిన్న ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. దీని కోసం అనారోగ్యాన్ని బట్టి వైద్యులు పలు ఆసనాలు సూచిస్తున్నారు..
అస్తమా (ఉపశ్వాసక సమస్యలు): శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారి ఊపిరితిత్తులకు శక్తినిచి్చ, ఆమ్లజన సరఫరా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దీని కోసం భ్రస్తిక ప్రాణాయామం, ధనురాసనం వంటి ఆసనాలను వైద్యులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ (షుగర్): నగరంలో అనేక మందికి దీర్ఘకాలికంగా ఇబ్బందులు పెడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది డయాబెటిస్. దీనికి నిరంతరం ఇన్సులిన్, మందుల వాడకం తప్పడం లేదు. అయితే ఈ వ్యాధి నుంచి కోలుకోడానికి వాడుతున్న మందులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి
పవనముక్తాసనం, అర్ధ మత్సేద్రాసనం, సూర్య నమస్కారాలు వంటివి ఉపకరిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా క్లోమగ్రంధి పనితీరును మెరుగుపరచడంలో ఆసనాల పాత్ర కీలకమని, రోజూ 15–20 నిమిషాల పాటు సాధన వల్ల రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించవచ్చని అంటున్నారు.
బీపీ (అధిక రక్తపోటు): వయసులకు అతీతంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) కూడా ఒకటి. దీని చికిత్సలో శవాసనం, వజ్రాసనం, నాడీ శోధన ప్రాణాయామం సహకరిస్తాయని వైద్యుల సూచన. ఈ ఆసనాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి హృదయ స్పందనలు సరైన విధంగా నియంత్రించవచ్చు.
జీర్ణ సమస్యలు (గ్యాస్ట్రో): వేళాపాళా లేని ఆహారపు అలవాట్ల కారణంగా నగరవాసుల్లో జీర్ణకోశ వ్యాధులు సర్వసాధారణంగా మారాయి. వీటి నుంచి కోలుకునే క్రమంలో పశి్చమోత్తానాసనం, వజ్రాసనం అనుసరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత, భోజనానంతరం వజ్రాసనంలో కూర్చోవడం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. వాయువు, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మైగ్రేన్ (పార్శ్వపు నొప్పి): ఇటీవల తలనొప్పి అదే విధంగా మైగ్రేన్ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. వీటికి మందులతో పాటు శశాంకాసనం, పద్మాసనం, బ్రహ్మరి ప్రాణాయామం వంటివి చికిత్సగా పనిచేస్తాయి. ఈ ఆసనాలు నాడీ తంత్రానికి విశ్రాంతిని అందిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు మైగ్రేన్ను తగ్గించడంలో సహాయపడతాయి.
అత్యున్నత పరిష్కారం..
యోగాసనాలు కేవలం శరీర అవయవాలను కదలించే వ్యాయామం మాత్రమే కాదు.. వ్యాధులను తగ్గించే ఔషధం. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోడంలో యోగాసనాల ప్రభావం అధికంగా ఉంటుంది. దీనిపై నగరవాసులకు మరింత అవగాహన అవసరం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు అత్యున్నత పరిష్కారం. శ్రద్ధతో సాధన చేస్తే అద్భుత ఫలితాలు పొందవచ్చు. దీనిపై సోషల్ మీడియా సహా విభిన్న మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నా.
– డా.జయప్రకాశ్ సాయి, వైద్యులు
ఊబకాయం (ఒబెసిటీ): నగరంలో చిన్నా పెద్దా తేడా లేకుండా వేధిస్తున్న సమస్య ఓవర్వెయిట్, ఒబెసిటీ(సూ్థలకాయం). దీని నుంచి బయటపడేందుకు సూర్య నమస్కారాలు, నవక్రియాసనాలు, త్రికోణాసనం సాధన చేయాలి. ఇవి శరీరానికి తగిన రక్తప్రసరణ, చక్కటి వ్యాయామం అందించటంతో పాటు శరీరంలో అధిక క్యాలరీలను ఖర్చు చేయిస్తాయి.
డిప్రెషన్, ఆందోళన: పని ఒత్తిడితోపాటు అనేక రకాల మానసిక సమస్యలతో నిత్యం పోరాటం చేస్తున్నారు. వీటిని తగ్గించుకునే క్రమంలో ధ్యానం, అనులోమవిలోమ ప్రాణాయామం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సాధనాలు. ఇవి మెదడులో సెరటోనిన్ వంటి ‘హ్యాపీ హార్మోన్ల’ను విడుదల చేస్తాయి.
అయితే యోగా ఏ ఒక్క రోజులో ఫలితమివ్వదు. దినచర్యలో భాగంగా దీన్ని కొనసాగిస్తేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి’ అంటున్నారు ప్రముఖ యోగా నిపుణురాలు డా.మంజురెడ్డి. ముందస్తుగా శరీర పరిస్థితిని తెలుసుకుని నిపుణుల శిక్షణలో ప్రారంభించాలని సూచిస్తున్నారు.
అధ్యయనాలు చెబుతోందిదే..
దీర్ఘకాలిక తక్కువ వెన్నునొప్పికి ప్రారంభ నాన్ ఫార్మాస్యూటికల్ చికిత్సలో భాగంగా యోగాను అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ సిఫార్సు చేస్తోంది. యోగాభ్యాసం గుండె జబ్బుల కారకాలను తగ్గించగలదని వృద్ధుల్లో అంతర్గత అవయవాల పనితీరు మెరుగు.. జీవన నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను అందిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది.
నొప్పులను నియంత్రించడంలో యోగా ప్రభావవంతంగా పనిచేస్తోందని, తలనొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, మెడనొప్పి, నడుమునొప్పి వంటి ఇబ్బందులను యోగా తొలగిస్తుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఎనిమిది వారాల యోగా సాధనతో మోచేయి, మోకాలి కండరాల బలాన్ని 10%–30% మెరుగుపరుస్తుందని పరిశోధకులు తేల్చారు.
చీలమండ, భుజం, తుంటి, కీళ్ల ఫ్లెక్సిబిలిటీ 13%–188% పెరిగిందని గుర్తించారు. ఎనిమిది నుంచి 12 వారాల సాధారణ అభ్యాసన ఆందోళన, నిరాశ నిస్పృహలను తగ్గిస్తుందని, ఒత్తిడి నిర్వహణలో సహాయపడుతుందని పరిశోధనలు తేల్చాయి.
(చదవండి: