దేవుడు ముడివేసిన బంధం | Father's Day 2025 | Sakshi
Sakshi News home page

దేవుడు ముడివేసిన బంధం

Jun 15 2025 7:51 AM | Updated on Jun 15 2025 10:46 AM

Father's Day 2025

లోకం తెలియని పసితనం బుడిబుడి అడుగులతో నాన్నను అనుసరించే దృశ్యం, ఎప్పుడూ మురిపెంగానే ఉంటుంది. చూసేందుకే అంత ముచ్చటగా ఉండే ఆ బంధం, స్వయంగా తన చేతినే తాకినప్పుడు.. ఆ తండ్రి పొందే ఆనందం.. అమితం, అమరం, అనిర్వచనీయం! అలాంటి అనుభూతిని కోరే నాన్న ఎప్పుడూ ఉన్నతమైన ఆదర్శాలనే తలకెత్తుకుంటాడు. గొప్ప తండ్రిగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంటాడు. తనతో పాటు తన పిల్లల్ని కూడా ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేస్తాడు. దైవత్వాన్ని నింపుకుని, వారి తలరాతలను తనే రచిస్తాడు. అందుకే ‘డాడ్‌ ఈజ్‌ గాడ్‌’

పితా ధర్మః పితా స్వర్గః పితా హి పరమం తపః
పితరి ప్రీతిమాపన్నే ప్రీయతే సర్వదేవతాః
‘తండ్రి దైవ సమానుడు, ధర్మ స్వరూపుడు. 
తపస్సుకు అత్యుత్తమ మార్గం ఏదైనా ఉందంటే అది తండ్రికి సేవ చేయడమే. 
తండ్రిని సంతోషపెడితే సమస్త దేవతలు సంతోషిస్తారు’ ఇది కుటుంబవ్యవస్థ మెచ్చే ధర్మం! 
అయితే ఎందరో తండ్రులు, తమ పిల్లల నుంచి అవేమీ ఆశించకుండా 
కేవలం వారి క్షేమం కోసమే అహర్నిశలు తపిస్తుంటారు. 
జీవితాన్ని, కాలాన్ని అంకితమిస్తూ స్వచ్ఛమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమవుతున్నారు. 

ఒకసారి బరాక్‌ ఒబామా, తండ్రి గురించి స్పష్టమైన కొటేషన్‌ చెప్పారు. ‘మగతనం ఉంటే చాలు, ఎవరైనా బిడ్డను కనగలరు! కాని, అది వారిని తండ్రిని చేయలేదు. బిడ్డను పెంచడానికి ధైర్యంగా అడుగులు వేసేవారే నిజమైన తండ్రి’ అంటారాయన. దానిలో ఎంత అర్థముంది! నాన్న కనబడితే– గౌరవంతో తలుపు చాటున దాక్కునే అలనాటి రోజుల నుంచి నాన్న కనబడితే– గారాబంతో సరదాగా పోట్లాడుకునే ఈనాటి రోజుల వరకూ, ప్రతి జీవితంలోనూ ఆయనే హీరో! కాలం విసిరిన సవాళ్లకు జీవితాన్ని పణంగా పెట్టే ప్రతి నాన్న చేతుల్లోనూ ఓ చిట్టి చేయి దాగుంటుంది. ఆ చేయి ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి, తన ఆదర్శవంతమైన కథను సగర్వంగా పరిచయం చేస్తుంది. తన కోసం, తన తండ్రి కన్న కలలన్నింటినీ గొంతెత్తి చాటుతుంది. నిజానికి ఈలోకంలో నాన్న అనే పిలుపు కోసం తపించే నాన్నలు కొందరైతే, నాన్నగా గెలిచిన నాన్నలు ఇంకొందరు. ఏదేమైనా నాన్న అనే పిలుపే ఓ ఎమోషన్‌. ఆ ఎమోషన్స్‌ కి త్యాగం తోడైతే? తెలియకుండానే గుండె తడవుతుంది. ఫాదర్స్‌డే సందర్భంగా అలా గెలిచి, నిలిచిన కొన్ని నిజజీవిత విజయగాథలు మీకోసం. 

లోకం మెచ్చిన తండ్రులు

ఈ అద్భుతమైన సృష్టిలో హద్దులు లేని ఆప్యాయతే అసలైన అమ్మతనం. నిస్వార్థమైన ప్రేమకు అదో మారు గుణం. అలాంటి అమ్మతనాన్ని అందించే నాన్న దొరకడం మహా వరం. ప్రేమను పంచడంలో, పిల్లల్ని పెంచడంలో తండ్రి పాత్రకు వీరంతా సజీవ నిదర్శనం!

దేవుడు ముడివేసిన బంధం

మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని ‘మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ’ అనాథాశ్రమం సాక్షిగా మొదలైన ఈ తండ్రీ కొడుకుల కథ చాలా ప్రత్యేకం. 2014 సెప్టెంబర్‌ 13 ఉదయాన్నే 27 ఏళ్ల ఆదిత్య తివారీ.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చెయ్యాలనే ఉద్దేశంతో, ఆఫీస్‌కి సెలవు పెట్టి మరీ ఆ చారిటీకి వెళ్లాడు. అక్కడ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న ఆరు నెలల అవనీశ్‌ను తొలిసారి చూసి, ఏమైందని ఆరా తీశాడు. ఆ బాబుకున్న ఆరోగ్య సమస్యల గురించి విని అల్లాడిపోయాడు. డౌన్  సిండ్రోమ్‌తో బాధపడుతున్న అవనీశ్‌ను ఎవ్వరూ దత్తత తీసుకోవడం లేదని తెలిసి, ఆ బాబుకి తానే తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడు. 

వెంటనే అధికారులతో చర్చించాడు. అయితే అధికారులు అందుకు అభ్యంతరం చెప్పారు. దత్తత తీసుకునే ఒంటరి పురుషుడికి 30 ఏళ్లు నిండాలనే రూల్స్‌ని ముందుంచారు. దాంతో ఆ రూల్స్‌ మార్చాలని న్యాయపోరాటం మొదలుపెట్టాడు ఆదిత్య. అవనీశ్‌ లాంటి స్పెషల్‌ చిల్డ్రన్‌ని దత్తత తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తూనే, అవనీశ్‌ దత్తత కోసం సుమారు రెండేళ్లు ఫైట్‌ చేశాడు. అయితే ఒక ఒంటరి పురుషుడు, ఇలాంటి వికలాంగుడైన బిడ్డను చూసుకోవడం కష్టమనే వారు ఎక్కువయ్యారు. 

ఆ మాటలకు ‘బిడ్డ తండ్రివైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయీ ముందుకు రాదు’ అనే హెచ్చరికలు తోడయ్యాయి. అయినా వెనక్కు తగ్గని ఆదిత్య ఈ ప్రయత్నంలో తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చివరికి దత్తత తీసుకోవడంలో సింగిల్‌ ఫాదర్‌కి ఉండాల్సిన వయసును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు మార్పించగలిగాడు. అలాగే 2016 జనవరి 1న అవనీశ్‌కి అధికారికంగా తండ్రి అయ్యి, దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఒంటరి తండ్రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్థిక, సామాజిక సవాళ్లు ఎదుర్కొంటూ బాబుకి మంచి ఆహారం, మంచి వైద్యం ఇప్పించగలిగాడు.

అయితే రెండేళ్ల పోరాటక్రమంలో అర్పిత అనే అమ్మాయితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారేముందు అవనీశ్‌ తల్లిగా అర్పిత పాసైంది. వీరి పెళ్లికి పదివేల మంది నిరాశ్రయులు అతిథులుగా వచ్చారు. ప్రస్తుతం అవనీశ్‌ ఆరోగ్యవంతుడిగా మారుతూ, పాఠశాలకు వెళ్తూ, చదువులో చురుకుగా ఉంటున్నాడట. ఆదిత్య తివారీ అంకితభావానికి గుర్తింపుగా, 2020లో ఆయనకు ‘వరల్డ్స్‌ బెస్ట్‌ మామీ’ అవార్డు లభించింది. తల్లి ప్రేమ ఒక లింగానికే పరిమితం కాదని, తండ్రి కూడా ఆ ప్రేమను చూపగలడని నిరూపించినందుకు అతడికి ఈ గౌరవం దక్కింది.

అవనీశ్‌లాంటి పిల్లలున్న 10 వేల మంది తల్లిదండ్రులకు ఆదిత్య కౌన్సెలింగ్‌ ఇచ్చాడు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇప్పటివరకు దేశంలో 22 రాష్ట్రాల్లో పర్యటించారు. సెమినార్లు, వర్క్‌షాపులు అంటూ ఇలా ఎక్కడికి వెళ్ళినా అవనీశ్‌ను ఆదిత్య వెంటబెట్టుకునే వెళ్తాడు. ఐక్యరాజ్య సమితిలో సైతం, వైకల్యమున్న పిల్లల పెంపకం గురించి ఆదిత్య ప్రసంగించారు. జెనీవాలో జరిగిన ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం’లో కూడా ఈ తండ్రీ కొడుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అవనీశ్‌కి ఇంకా కొన్ని సర్జరీలు జరగాల్సి ఉందని, అవి చేయించడానికి తగిన వయసు కోసం ఎదురు చూస్తున్నామని ఆదిత్య తెలిపారు. ఇది దేశానికే ఆదర్శవంతమైన కథ. 

అన్నిటినీ చిన్నబుచ్చిన ప్రేమ!
ముంబైలోని ఓ చిన్న ఇంట్లో, నాలుగేళ్ల సుశాంత్‌ దివిగికర్‌ కార్లు, బ్యాట్లతో ఆడుకోకుండా, తల్లి చీర కొంగులతో, ఆమె మేకప్‌ సామాగ్రితో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. స్టేజ్‌ డ్రామాలు, నృత్యాలు ఇష్టమంటూ ఆ దిశగానే అడుగులు వేశాడు. ఇక యవ్వనంలోకి వచ్చేసరికి అమ్మాయిలపైన కాకుండా అబ్బాయిలపై ఆకర్షితుడయ్యాడు. అప్పుడే తను ఒక గే అని, తనలో స్త్రీ లక్షణాలు కూడా ఉన్నాయని గ్రహించాడు. రహస్యంగా గే పార్టీలకు అటెండ్‌ అయ్యేవాడు. 2008లో ఒకరోజు సుశాంత్‌ కజిన్‌ కరణ్‌.. సుశాంత్‌ని ‘గే’లతో తిరగడం చూసి షాకయ్యాడు. వెంటనే సుశాంత్‌ తండ్రి ప్రదీప్‌ దివిగికర్‌కి చెప్పేశాడు. విషయం తెలిసిన ప్రదీప్‌.. సుశాంత్‌ని ఆరా తియ్యగా భయపడుతూనే తండ్రికి నిజం చెప్పాడు. 

వెంటనే ప్రదీప్‌ కొడుకుని హత్తుకుని.. ‘నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే.. ఈ ప్రపంచం నిన్ను ఏమైనా అననీ.. నేను మాత్రం నీకు అండగానే ఉంటాను’ అని మాటిచ్చాడు. అప్పుడు సుశాంత్‌కి 18 ఏళ్లు. వెంటనే ప్రదీప్‌.. తన కొడుకు గే అనే విషయాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పారు. తండ్రి ప్రోత్సాహంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ‘మిస్టర్‌ గే ఇండియా’ 2014 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ‘మిస్టర్‌ గే వరల్డ్‌’ చరిత్రలో అత్యధిక సబ్‌–టైటిల్స్‌ గెలుచుకున్న ఏకైక ఇండియన్‌ తనే. అదే ఏడాది సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా ఉన్న మహారాష్ట్ర ‘బిగ్‌ బాస్‌ 8’ కంటెస్టెంట్‌గా వెళ్లి, ఏడో వారంలో ఎలిమినేట్‌ అయ్యాడు. 

ఇక ఆ తర్వాత బిగ్‌ బాస్‌ ఓటీటీకి ఆఫర్‌ వచ్చినా.. ‘అదో డర్టీ గేమ్‌’ అని అభివర్ణించి ఆఫర్‌ని తిరస్కరించాడు. తర్వాత కాలంలో తండ్రి ప్రోత్సాహంతోనే ఆపరేషన్‌ చేయించుకుని అమ్మాయిగా మారాడు. ‘రాణీ కోహినూర్‌’ అనే పేరుతో ప్రస్తుతం సుశాంత్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 3.6 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.‘బిడ్డ బిడ్డే అయినప్పుడు లింగంతో సంబంధం ఏంటీ? ఒకే బిడ్డలో కొడుకు, కూతురు ఇద్దరూ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని’ అంటుంటారు ప్రదీప్‌. 

కలలను వదులుకునేంత బాధ్యత
ముంబైకి చెందిన లహర్‌ జోషీ చిన్నప్పటి నుంచి కెరీర్‌ గురించి ఎన్నో కలలు కన్నాడు. 2015 నాటికి కోరుకున్నట్లే సొంతంగా బ్రాండింగ్‌ ఏజెన్సీని స్థాపించి, విజయవంతంగా నడపసాగాడు. అయితే ఆ సమయంలోనే అతడి భార్య రుతుమ గర్భవతి అయ్యింది. స్కానింగ్‌లో కవలలు అని తెలిసినప్పటి నుంచి పట్టలేని ఆనందంతో పాటు రెట్టింపు కానున్న బాధ్యతలు అతణ్ణి కుదురుగా ఉండనివ్వలేదు. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి భార్యభర్తలిద్దరికీ పిల్లలకోసం సమయాన్ని కేటాయించడం కూడా సమస్యగానే మారింది.

 పిల్లల కోసం ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉండటంతో పాటు ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు లహర్‌ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య రుతుమతో పోలిస్తే తన నెల సంపాదన తక్కువ ఉండటంతో, విజయవంతంగా సాగుతున్న తన బ్రాండింగ్‌ ఏజెన్సీని మూసివేసి, పూర్తిస్థాయిలో పిల్లల సంరక్షణకు అంకితం కావాలని ఫిక్స్‌ అయ్యాడు. అలా, లహర్‌ జోషీ ఒక ‘స్టే–ఎట్‌–హోమ్‌ డాడ్‌’గా మారారు.ఈ నిర్ణయం సమాజంలో మిశ్రమ స్పందనలను తెచ్చింది. కొందరు ఆయన్ని అభినందిస్తే, మరికొందరు ఆశ్చర్యంగా చూశారు. కానీ లహర్‌కు తన తండ్రి నుంచి పూర్తి మద్దతు లభించింది. అది ఆయనకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.

పిల్లల్ని ఇంటి వద్దే ఉండి పెంచిన అనుభవం తనను మరింత మంచి వ్యక్తిగా మార్చిందని లహర్‌ బలంగా నమ్ముతాడు. తొలినాళ్లలో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కాస్త కష్టంగా అనిపించినా, వారి ఎదుగుదలను దగ్గరగా చూసే అనుభూతి అద్భుతమని ఆయన గర్వంగా చెబుతుంటాడు. లహర్‌ తన ఈ ప్రయత్నంతో దేశంలో పాతుకుపోయిన లింగ వివక్షను సవాలు చేస్తున్నారు. ఒక తండ్రి పాత్ర కేవలం డబ్బు సంపాదించడమే కాదు, పిల్లలకు ఓ మార్గదర్శిగా, కోచ్‌గా ఉండటం కూడా అంటారు ఆయన. ఈరోజు, లహర్‌ జోషీ తన కవలలను ఎంతో ఆనందంగా పెంచుకుంటూ, సమాజానికి ఓ కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. తండ్రి ప్రేమ, సంరక్షణ పిల్లల ఎదుగుదలకు ఎంత అవసరమో వివరిస్తూ, లహర్‌ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. 

అమ్మలా పెంచిన నాన్న
గుజరాత్, అహ్మదాబాద్‌కి చెందిన ప్రముఖ గాయని ‘శైలీ షా’ను కదిలిస్తే ఆదర్శవంతమైన తన తండ్రి ‘రాజేష్‌ షా’ కథను ప్రత్యేకంగా చెబుతుంది. శైలీకి పదేళ్లు కూడా నిండకుండానే ఆమె తల్లి ఆశ మరణించింది. ఆరోజు నుంచి తన అన్న నిసర్గను, తనని కంటికి రెప్పలా పెంచి పోషించారు రాజేష్‌. మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినలేదు. ప్రేమించి పెళ్లాడిన భార్య మరణంతోనే జీవితం శూన్యం అనుకున్న రాజేష్‌.. కేవలం పిల్లల కోసమే బతికారు. అయితే అతడి భార్య ఆశా తన కూతురు శైలీని సింగర్‌ చేయాలని ఆశపడింది. 

అందుకే అహర్నిశలు శ్రమించి కూతుర్ని సింగర్‌ని చేశారు రాజేష్‌. శైలీ షా కేవలం గాయని మాత్రమే కాదు. ఆమె ‘మోర్‌తంత్ర’ అనే బొటిక్‌ జ్యూలరీ బ్రాండ్‌తో విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్రాండ్‌ గుజరాత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జ్యూలరీ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇక నిసర్గ, ప్రింటింగ్‌ కేంద్రాన్ని నడపుతూ తండ్రికి అండగా ఉంటున్నాడు.‘నాన్నే మాకు జీవిత పాఠాలు నేర్పించారు, అమ్మలా పెంచారు. ఆయనే మాకు స్ఫూర్తి’ అని శైలీ గర్వంగా చెబుతుంది.

నాన్న అనే పిలుపు కోసం ఏళ్ల పోరాటం
యూసఫ్‌ ఖాన్‌తో కబీర్, డా.కేదార్‌ పడ్తే
అది 2007. యూసఫ్‌ ఖాన్‌ అనే 26 ఏళ్ల మ్యూజిక్‌ టీచర్‌.. పుణే చారిటీల చుట్టూ తిరగడం అప్పుడప్పుడే మొదలుపెట్టాడు. దుబాయ్‌లో ‘ద మ్యూజిక్‌ బాక్స్‌’ అనే మ్యూజిక్‌ స్కూల్‌ను నడుపుతున్న యూసఫ్‌.. వైవాహిక జీవితంపై ఆసక్తి లేకపోవడంతో, పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే పిల్లల మీద ఉన్న ఇష్టంతో అనాథను దత్తత తీసుకోవాలని ఆశపడ్డాడు. అందుకే భారత్‌ వచ్చి చారిటీలకు తన విన్నపాన్ని తెలిపి, దత్తత కోరినప్పుడు.. అందుకు రూల్స్‌ అంగీకరించలేదు. 

తాను తండ్రి కావాలనే బలమైన కోరికతో సుమారు పదేళ్ల పాటు దత్తత కోసం దుబాయ్‌కి, ఇండియాకి తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఫలితం లేకపోవడంతో 2017 నుంచి సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాడు. సుమారు పదకొండు సార్లు సరోగసీ విధానం ఫెయిల్‌ అయ్యింది. అయినా తన కలను చంపుకోవడానికి యూసఫ్‌ అంగీకరించలేదు. విసుగు చెందలేదు. 

పదే పదే ఎదురైన వైఫల్యాలు, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి ఏవీ తనని నిరాశపరచలేదు. చివరికి సరోగసీలో 12వ ప్రయత్నం ఫలించి, 2019 డిసెంబర్‌ 3న పనాజీలో కబీర్‌ అనే పండంటి మగబిడ్డను పొందాడు. గోవాకు చెందిన డా. కేదార్‌ పడ్తే పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. ప్రస్తుతం కొడుకుతో సహా దుబాయ్‌లోనే ఉంటున్నాడు యూసఫ్‌. వీరికి సంబంధించిన ఎలాంటి లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ అందుబాటులో లేవు. అయితే ఎన్నో కష్టాలకు ఓర్చి, ఏళ్లపోరాటం చేసి పొందిన బిడ్డను యూసఫ్‌ ఎలా పెంచుతాడనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. 

అంతులేని అన్వేషణ
చైనా తూర్పు తీరంలోని షాన్స్‌ డాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన ‘గువో గ్యాంగ్‌టాంగ్‌’ అనే తండ్రి కథ యావత్‌ ప్రపంచానికీ భావోద్వేగాలను నింపింది. ఈ కథ 1997, సెప్టెంబర్‌ 21న మొదలైంది. ఆ రోజు ఆదివారం. స్కూల్స్‌ లేక పిల్లలంతా ఇంటి బయటే ఆడుకుంటున్నారు. గువో రెండో కొడుకు రెండున్నరేళ్ల జిన్స్‌ జెన్స్‌ ను ఎవరో లాక్కెళ్లారని పెద్ద కొడుకు పరుగున లోపలికి వచ్చి చెప్పాడు. అప్పటికే కిడ్నాపర్ల వీరంగం గురించి చాలాసార్లు విన్న గువో.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

 దాంతో కడు నిరుపేదైన గువో.. కష్టపడి ఓ పాత మోటర్‌ సైకిల్‌ కొనుక్కుని, దాని వెనుక మిస్‌ అయిన కొడుకు ఫొటోను బ్యానర్‌గా కట్టుకుని, తనే స్వయంగా వెతకడం మొదలుపెట్టాడు. అదే బండి మీద చాలా దూరం వెళ్లాడు. సుమారు 24 ఏళ్ల పాటు కిడ్నాప్‌ అయిన కొడుకును అలా వెతుకుతూనే ఉన్నాడు. వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. తన ఆర్థిక స్తోమతను బట్టి పాత మోటర్‌ సైకిళ్లనే కొంటూ, మార్చుకుంటూ.. తిరగని చోటు లేదన్నంతగా తిరిగాడు. అన్నేళ్ల ప్రయాణంలో కొన్నిసార్లు తినడానికి తిండి దొరికేది కాదు. కొన్ని రాత్రులు వంతెనల కింద, రోడ్ల మీద పడుకోవాల్సి వచ్చేది. అయినా విసుగు చెందలేదు. పిచ్చివాడని కొందరు, దొంగ అయి ఉంటాడని ఇంకొందరు అనుమానించినా, అవమానించినా తగ్గలేదు. 

అతడి పట్టుదలను చూసిన ఎందరో చైనీయులు అతడ్ని ‘సింబల్‌ ఆఫ్‌ ది సెర్చింగ్‌ ఫర్‌ మిస్సింగ్‌ చిల్డ్రన్‌’ అనే పేరుతో కీర్తించడం మొదలుపెట్టారు. అతడి ప్రయత్నం నాయకులను, అధికారులను కూడా కదిలించింది. చివరికి 2021 జూలై 11న, గువోకు చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. అప్పటికి అతడి వయసు 61 ఏళ్లు. ‘న్యూ డీఎన్‌ఏ టెక్నాలజీతో జిన్‌  జిన్‌ ను కనుగొన్నామని, అతడు హేనాన్‌ ప్రాన్స్‌లో ఒక దత్తత కుటుంబంతో నివసిస్తున్నాడు’ అని గువోతో అధికారులు చెప్పారు. 

అతడి 24 ఏళ్ల ఆవేదన ఒక్కసారిగా ఆనందంగా మారింది. 2021 జూలై 13న జిన్స్‌ జెన్‌ 26ఏళ్ల యువకుడి రూపంలో గువో కళ్లముందుకు వచ్చినప్పుడు అతడి కన్నీళ్లు చూసి ప్రపంచమే కంటతడి పెట్టింది. వారి కౌగిలిలో ఏళ్లనాటి నిరీక్షణ, ప్రేమ, ఆనందం అన్నీ కళ్లకు కట్టాయి. గువో కథ ‘లస్ట్‌ అండ్‌ లవ్‌’ అనే సినిమాగా మారి, ఎందరో మనసులను కదిలించింది.

నిజానికి ఈ కథలన్నీ చూస్తుంటే ‘లియో బుస్కాగ్లియా’ అనే అమెరికా రచయిత మాటలు గుర్తు రాక మానవు. ‘అమరత్వం అనేది మనం వదిలి వెళ్లే ప్రేమలో మాత్రమే ఉంటుంది. అంతటి ప్రేమను పంచే తండ్రులకు ఎప్పటికీ చావు ఉండదు’ అన్నారు ఆయన. అలాంటి తండ్రులందరికీ పాదాభివందనం!
హ్యాపీ పాదర్స్‌ డే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement