
నాన్న.. అమ్మతో పోల్చితే నాన్నెందుకో కాస్త వెనుకబడ్డారు అంటుంటారు. కానీ తన పిల్లలు ముందుండాలని తపనతో నాన్న కాస్త వెనుకబడి ఉంటారు, వారి వెనకే ఉంటారు. పిల్లల ప్రతి విజయం వెనక, వారి ప్రతి లక్ష్యం వెనుక కనిపించని నా అన్న కృషే నాన్నది. నాన్న ఒక బాధ్యత, ఒక ముందు చూపు. అలాంటి నాన్నకి ఏం చేస్తే రుణం తీరుతుంది అనుకున్నారో ఏమో.. తన తండ్రి ఒక్కసారి ప్రాణం పోసి జన్మనిస్తే, తాను మాత్రం అనేక సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలుస్తున్నారు డా.సంపత్ కుమార్.
ఎన్ని గొప్ప పనులైనా చేయ్యి.. రక్తదానానికి మించింది లేదు అని తన తండ్రి చెప్పిన మాట నుంచి స్ఫూర్తి పొంది.. అనేక సార్లు రక్తదానం చేసి తండ్రి పై తన ప్రేమను చాటుకుంటున్నారు. నేటి ఫాదర్స్ డే నేపథ్యంలో తండ్రికి తనంటే ప్రాణం.. ప్రాణం పోయడం అంటే తనకి ఇష్టం అంటున్నారు సంపత్ కుమార్.
తండ్రికి తగ్గ తనయుడు..
సుమారు 25 ఏళ్ల క్రితం రక్తదానం గురించి తన తండ్రి కోట మోహన్ రావు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందన్నారు నగరానికి చెందిన సంపత్ కుమార్. నాన్న నింపిన స్ఫూర్తితో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక మరణించిన వ్యక్తి చావుతో ఒక ఉద్యమంగా రక్తదానాన్ని చేస్తూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
10, 50, 100 కాదు.. ఏకంగా 322 సార్లు రక్తంతో పాటు ప్లేట్లెట్స్, ప్లాస్మా, డబ్ల్యూబీసి దానం చేసి ప్రాణదాతగా నిలుస్తున్నారు. నాన్న నాకు పోసిన ప్రాణం కొన్ని వందల మందికి ప్రాణాలు నిలిపే వారధిగా నిలవడమే తన లక్ష్యమని, ఇదే తన తండ్రికి తీర్చుకునే రుణమని చెబుతున్నారు. ప్రతి ఏడాది ఫాదర్స్ డే రోజు ఒక గొప్ప కొడుకుగా సంతృప్తిగా ఉండడానికి ఈ రక్తదానం కారణంగా నిలుస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నేను ప్రాణం నిలుపుతా, తాను ప్రాణం పోస్తుంది..
నాన్న కోరికకు అనుగుణంగా అనేక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. రక్తదానంతో ప్రాణదాతగా నిలిస్తే.. అసలు ప్రాణదాత డాక్టర్ అని నా నమ్మకం. అందుకే నేను డాక్టర్ కాలేకపోయినా నా కూతురిని డాక్టర్ని చేసి అటు ఒక తండ్రికి కొడుకు గానూ, ఇటు ఒక కూతురికి తండ్రిగానూ నా వంతు బాధ్యతను నిర్వహించాను. నా కోరికకు అనుగుణంగా నా కూతురు కోట శృతి మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్గా ఎంతో మంది ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
– సంపత్ కుమార్, హైదరాబాద్.
(చదవండి: