
భువనేశ్వర్: అశేష భక్త జనం అభీష్టం నెరవేరే మధుర క్షణం చేరువైంది. నవనవలాడే యవ్వన రూపుతో ఆరాధ్య దైవం జగన్నాథుడు భక్తుల మధ్య ప్రత్యక్షం కానున్నాడు. మర్నాడు శ్రీ గుండిచా యాత్రకు బయల్దేరుతాడు. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి. గత 14 రోజులుగా తెరచాటున స్వామి భక్తులకు కానరాకుండా రహస్య ఉపచారాలతో సరికొత్త ఉత్సాహం పునరుద్ధరించుకోవడంతో శ్రీ క్షేత్రం హడావిడిగా ఉంది.
చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత
జ్యేష్ట పూర్ణిమ నాడు అష్టోత్తర కలశ జలాభిõÙకాన్ని స్నాన యాత్రగా జరుపుకున్న స్వామి తడిసి ముద్దయ్యాడు. దీంతో మూల విరాటుల సహజ రూపు చెదిరి పోయింది. జ్వర పీడతో వైద్య నియమాల ప్రకారం అనవసర మండపానికి తరలిపోయాడు. అది మొదలుకొని భక్తులకు నిత్య దర్శనం కొరవడింది. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాజవైద్య వర్గం తైలాది వైద్య ఉపచారాలతో దేవుళ్ల ఆరోగ్యం కోలుకుంది. యథాతథంగా భక్తులకు నిత్య దర్శనం ప్రసాదించేందుకు భగవంతునికి మార్గం సుగమం అయింది. హింగుళ (ఎరుపు), హరితల (పసుపు), కస్తూరి, కేశర (కుంకుమ), కొయిత (మారేడు గుజ్జు) వంటి సహజ మూలికా వర్ణ ద్రవ్యాల మేళవింపుతో మూల విరాటుల ముఖాలకు క్రమ పద్ధతిలో రంగులు హద్ది యవ్వన రూపం తీర్చి దిద్దుతారు. జగన్నాథుని సంస్కృతిలో ఇదో గోప్య సేవ. కాగా, గురువారం భక్తులు ప్రవేశించేందుకు శ్రీ మందిరం తలుపులు తెరుచుకుంటాయి. గుడిలో బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, జగన్నాథుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.

రథాలపై నీలచక్రాల అమరిక
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని శ్రీమందిరంలో నీలచక్రాలకు పండాలు శాస్త్రోక్తంగా బుధవారం పూజలు నిర్వహించారు. అనంతరం వాయిద్యాలతో వీటిని శ్రీజగన్నాథ రథం నందిఘోష, బలభద్రస్వామి రథం తాలధ్వజ, సుభద్ర రథం దర్పదళన రథాలపై అమర్చారు. దీంతో నేటి నుంచి జగన్నాథ రథంపై హనుమాన్ జెండాను ఎగురవేస్తారు. అనేక దేవతామూర్తులు రథాయాత్రకు ఆటంకం కలుగకుండా ఈ పది రోజులు కాపాడతారనేది భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో రథాయాత్ర కమిటీ చైర్మన్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దార్ బెహారా, రథాయాత్ర కమిటీ సభ్యులు కుమార్, బసంత పండా, భరత్ భూషన్ మహంతి, రాజేంద్ర కుమార్ బెహరా, అశోక్ మహారాణా పాల్గొన్నారు.
