వైద్యానికి డబ్బు లేక ప్రభుత్వాసుపత్రికి ట్రైసైకిల్పై వెళ్లిన వృద్ధుడు
భువనేశ్వర్: కాలు విరిగింది.. సమీపంలో ప్రభుత్వాసుపత్రులు లేవు. ప్రైవేట్లో వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేవు. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి ఇతర వాహనాల్లో వెళ్లడానికి సరిపడా డబ్బుల్లేవు.. అండగా నిలిచే మనుషులు లేరు. దిక్కుతోచని స్థితిలో తనకు తానే ధైర్యం అయ్యాడు. ఒకటికాదు, రెండు కాదు. 150 కిలోమీటర్లు.. ట్రైసైకిల్పై వెళ్లాడు. చివరికి ప్రభుత్వాసుపత్రికి చేరి చికిత్స పొందుతున్నాడు.
ఒరిస్సాలోని నయాగఢ్కు చెందిన 73 ఏళ్ల సుఖ్దేవ్ నహక్ విషాదం, చికిత్స కోసం ఆయన చేసిన సాహసం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నయాగఢ్ జిల్లా, సరన్కుల్ పరిధిలోని బరసాహి గ్రామానికి చెందిన సుఖ్దేవ్.. గతంలో గ్రామ కావలిదారుగా పనిచేశాడు. అయితే, ఒక ప్రమాదంలో అతని ఎడమ కాలు విరిగింది. ఆ తర్వాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన కొడుకు మానసికంగా స్థిరంగా లేడు, పని చేసుకోలేడు. భార్య 2011లో చనిపోయింది.
ఆర్థిక ఇబ్బందులు, శారీరక సమస్యలతో వైద్యం చేయించుకోవడం అతనికి కష్టమైంది. అయినా, అతను నిరాశ చెందలేదు. ఒక ట్రైసైకిల్ తీసుకుని చికిత్స కోసం ఒంటరిగా బెర్హంపూర్కు బయలుదేరాడు. మార్గమధ్యంలో భోజనానికి డబ్బులు లేకపోవు. దారిలో ప్రజలు పెట్టింది తిన్నాడు. సుమారు 150 కిలోమీటర్లు.. మూడు రోజుల్లో ఎంకేసీజీ వైద్య కళాశాల, ఆసుపత్రికి చేరుకున్నాడు. సుఖ్దేవ్ విషాద గాథ తెలుసుకున్న యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టింది. అవసరమైన పరీక్షలు చేసి, పూర్తి వైద్య సేవలు అందిస్తామని ఆసుపత్రి యంత్రాంగం హామీ ఇచ్చింది.


