Funday Crime Story: కాఫీ+చాయ్‌= కొచ్చిన్‌! | Funday Crime Story | Sakshi
Sakshi News home page

Funday Crime Story: కాఫీ+చాయ్‌= కొచ్చిన్‌!

May 4 2025 7:25 AM | Updated on May 4 2025 7:25 AM

Funday Crime Story

నల్లగొండకు చెందిన సయ్యద్‌ సలావుద్దీన్‌ సలార్‌ ‘స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా’ (సిమి)లో చేరి, ఆ సంస్థ అధినేత స్థాయికి ఎదిగాడు. పదేళ్లకు పైగా పరారీలో ఉన్న సలార్, 2011 జూన్‌లో పోలీసులకు చిక్కాడు. దుబాయ్‌లో తలదాచుకున్న అతడు, కేరళ మీదుగా హైదరాబాద్‌ వచ్చే ప్రయత్నంలో ఉండగా, మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌కు దొరికిపోయాడు. ‘కాఫీ.. చాయ్‌.. కొచ్చిన్‌’ అనే కోడ్‌ వర్డ్‌ సలార్‌ను పట్టించింది.సలావుద్దీన్‌ సలార్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. బతుకుతెరువు కోసం ముంబై వెళ్లి, అక్కడి ‘సిమి’ క్యాడర్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 1998 వరకు నార్తర్న్‌ రీజన్‌ కమాండర్‌గా పని చేస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ‘సిమి’ కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. ఆపై ‘సిమి’కి ఆలిండియా చీఫ్‌గా మారి దాదాపు రెండేళ్ల పాటు దాని వ్యవహారాలను పర్యవేక్షించాడు. 

సలార్‌ నార్తర్న్‌ రీజన్‌ కమాండర్‌గా ఉండగా మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలోని మహాకాల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశాడనే ఆరోపణలతో అతడిపై ఆ కేసు నమోదైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం 2001లో ‘సిమి’ని నిషేధించింది. దీంతో సలార్‌ తన మకాంను దుబాయ్‌కు మార్చాడు. పదేళ్లకు పైగా దుబాయ్‌లో ఉంటూ సివిల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న సలార్‌ను 2009లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ దేశ నిబంధనలను ఉల్లంఘించిన  కేసులో విచారణ పూర్తి చేసి, రెండేళ్ల శిక్ష విధించారు. ఈ శిక్షాకాలం 2011లో పూర్తికావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. 

అక్కడి నిబంధనల ప్రకారం యూఏఈ ప్రభుత్వం సలావుద్దీన్‌కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ (ఈసీ) ఇచ్చింది. ఈ సర్టిఫికెట్‌ పొందిన వ్యక్తి నిర్ణీత సమయంలోపు ఆ దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అప్రమత్తమైంది. సలార్‌ భారత్‌లో అడుగు పెట్టగానే, అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం అనేక మార్గాలు అన్వేషించిన అధికారులు చివరకు ఇండోర్‌కు చెందిన ఓ ఫోన్‌పై నిఘా ఉంచారు. ఆ వ్యక్తి గతంలో సలార్‌కు అనుచరుడిగా ఉండటంతో కచ్చితంగా అతడిని సంప్రదిస్తాడనే ఉద్దేశంతో మానిటరింగ్‌లో పెట్టింది. దేశంలోని ఏ విమానాశ్రయంతో అతడు ల్యాండ్‌ అవుతున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పని మొదలు పెట్టారు. సుదీర్ఘకాలం క్రమం తప్పకుండా గంటల తరబడి చేసిన ఈ మానిటరింగ్‌లో ఓ చిన్న పదం నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించింది. 

ఐబీ అనుమానించినట్లే 2011 జూన్‌లో ఇండోర్‌కు చెందిన వ్యక్తిని సలార్‌ సంప్రదించాడు. తన మాజీ అనుచరుడైన ఆ వ్యక్తితో అనేక విషయాలు చర్చించాడు. చివరగా పదే పదే అతడు చెప్పిన మాట ‘కాఫీ, చాయ్‌ సే తయ్యార్‌ రహో’ (కాఫీ, టీతో సిద్ధంగా ఉండు) అధికారులను అలెర్ట్‌ చేసింది. సలావుద్దీన్‌ లాంటి వ్యక్తి టీ, కాఫీల కోసం కాల్‌ చేయడని, అందులో ఏదో మర్మం ఉందని భావించి, నిపుణులతో విశ్లేషించారు. కాఫీ, చాయ్‌లను ఆంగ్ల అక్షరాల్లో రాసుకుని దేశంలోని కొన్ని నగరాలు, పట్టణాల పేర్లతో సహా అనేక పదాలు సృష్టించారు. సలావుద్దీన్‌ వస్తున్నది దుబాయ్‌ నుంచి కావడంతో ఆ నగరాలు, పట్టణాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న వాటిని వేరు చేయాలని నిర్ణయించడంతో ఐబీ ప్రయత్నం ఫలించింది. 

కేరళలోని కొచ్చిన్‌ పేరు కూడా వాటిలో ఉండటంతో అదే ల్యాండింగ్‌ స్పాట్‌గా గుర్తించింది. కాఫీ, చాయ్‌ పదాల ఉచ్చారణతో ఏర్పడే, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగరం అదేనని తేల్చి, మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ను అప్రమత్తం చేసింది. కొన్ని రోజుల పాటు దుబాయ్‌ నుంచి వచ్చే ప్రయాణికుల వివరాలపై అధికారులు కన్నేసి ఉంచారు. చివరకు 2011 జూన్‌ 26న సలావుద్దీన్‌ సలార్‌ దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ ఫ్లైట్‌ ఈకే 530లో తన దూరపు బంధువులు ఇద్దరితో కలిసి విమానం దిగి, కేరళ–మధ్యప్రదేశ్‌ పోలీసుల సంయుక్త బృందానికి చిక్కాడు. 

సలావుద్దీన్‌ సలార్‌ హైదరాబాద్‌లోనూ వ్యవహారాలు సాగించాడని విచారణలో తేలింది. అప్పట్లో హైదరాబాద్‌ నుంచి ఉజ్జయిన్‌ వెళ్లిన ప్రత్యేక బృందం సలార్‌ను విచారించి వచ్చింది. ఈ నేపథ్యంలోనే లష్కరేతొయిబా (ఎల్‌ఈటీ ) మాడ్యుల్‌తో ఇతడికి సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. 2002 నవంబర్‌ 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం సమీపంలో పేలిన స్కూటర్‌ బాంబు ఇద్దరిని బలిగొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆజం, అజీజ్‌ అప్పట్లో ఎన్‌కౌంటర్‌ కాగా, మరో 8 మందిపై పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. 

అబ్దుల్‌ బారి అలియాస్‌ అబు హమ్జా సహా మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ ఘాతుకంలో సలార్‌ ప్రమేయం ఉందని తేలడంతో రాష్ట్ర పోలీసులు న్యాయస్థానం నుంచి అతడిపై ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారంట్‌ పొందారు. దీని సహాయంతో ఉజ్జయిన్‌ వెళ్లి, 2011 జూలై 18న సిటీకి తీసుకువచ్చి ఈ కేసులో జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్‌ పొందిన సలార్‌ నగరంలోని బాబానగర్‌లో స్థిరపడ్డాడు. 2014 అక్టోబర్‌ 18న నల్లగొండకు కారులో వెళ్తున్న అతడు చిట్యాల సమీపంలోని పెదకాపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement