అమరజీవి ఆత్మశోకం | Indian freedom fighter Potti Sreeramulu | Sakshi
Sakshi News home page

అమరజీవి ఆత్మశోకం

Jun 22 2025 8:31 AM | Updated on Jun 22 2025 8:31 AM

అవి 20వ శతాబ్దం తొలి దశకాల రోజులు. జాతీయోద్యమం ఊపందుకుంటోంది. గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో నిత్యం జాతీయవాదులు చర్చలు, ప్రణాళిక రచనల్లో మునిగిపోయేవారు. వారిలో అంకితభావంతో పని చేస్తున్న కొందరిని ఎంపిక చేసి ‘మీమీ ప్రదేశాలకు వెళ్లి జాతీయోద్యమం పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయండి’ అని సూచించారు గాంధీజీ. వారిలో ఒకరు పొట్టి శ్రీరాములు. మద్రాసులోని మెరీనా బీచ్‌లో గాంధీజీ ఉపన్యసిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని ఉన్నారు. అప్పుడు శ్రీరాములుగారిని వేదిక మీదకు ఆహ్వానించి గాంధీజీ ప్రశంసా పూర్వకంగా ‘శ్రీరాములు వంటి మరో పదకొండుమంది ఉంటే ఏడాదిలో స్వాతంత్య్రం వస్తుంది’ అన్నారు. ఆ తర్వాత కూడా శ్రీరాములుగారు గాంధీజీకి ఉత్తరాల ద్వారా స్వాతంత్య్ర ఉద్యమం గురించి వివరిస్తూ ఉత్తరాలు రాసేవారు. 

శ్రీరాములు సంస్కరణలు
పొట్టి శ్రీరాములు స్వాతంత్య్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం(1930), క్విట్‌ ఇండియా ఉద్యమంతోపాటు అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మూడు దఫాలు జైలు పాలయ్యారు. దళితుల అభ్యున్నతి కోసం ప్లకార్డులు పట్టుకుని నెల్లూరు పట్టణంలో ఎర్రటి ఎండలో పాదరక్షలు లేకుండా నడిచారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం కోసం దీక్ష చేశారు. నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలోకి అనుమతించిన తరవాత దీక్ష విరమించారు. శ్రీరాములు తలపెట్టిన మరొక మహోన్నత ఘట్టమే తెలుగు వాళ్ల కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు వారికి ఎదురవుతున్న వివక్ష ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంతే! శ్రీరాములు గారు మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష చేపట్టారు. 

అమరుడి అంతియ యాత్ర
‘ఆంధ్ర రాష్ట్ర సాధనకై అక్టోబర్‌ 19న ప్రాయోపవేశ దీక్ష పూనిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు 15 తేదీ రాత్రి 11.23 గంటలకు పరమపదించారు’ అని 1952, డిసెంబర్‌ 16వ తేదీన ప్రముఖ దినపత్రిక ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. పొట్టి శ్రీరాములుగారు అమరుడు కావడంతో తెలుగు ప్రజల్లో భావోద్వేగాలు పెల్లుబికాయి. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న వేలాదిమంది అభిమానులు ‘ప్రతి అరవ వాడు మరణించాలి, మాకు ఆంధ్రరాజ్యం కావాలి’ అని నినదించారు. ఆయన త్యాగానికి గౌరవం 1953, అక్టోబర్‌ 1న దక్కింది. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలను వేరు చేసి కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956, నవంబర్‌ 1న ఆంధ్రరాష్ట్రానికి తెలంగాణను కలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. శ్రీరాములు జ్ఞాపకార్థం ఆయన పేరును ఆయన సొంత జిల్లాకు పెట్టాలని అనేక ఉద్యమాలు జరిగాయి. ఎట్టకేలకు 2008 జూన్‌ 4న నెల్లూరు జిల్లాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేసింది. ఇవన్నీ గుండెను బరువెక్కించే వాస్తవాలు. 

నేటి చేదు నిజాలు
పొట్టి శ్రీరాములు సొంతూరు జువ్వలదిన్నె గ్రామంలో ఆయన ఇంటిని స్మారక భవనంగా మార్చారు. దానికి నిత్యం తాళం వేసి ఉంటుంది. అది కాకుండా జువ్వలదిన్నెలో సముద్ర తీరానికి వెళ్లే దారిలో ఆయన పేరు మీద పర్యాటక శాఖ మరొక స్మారక భవనాన్ని నిర్మించింది. ఆ భవనం తలుపులకు తాళాలు లేవు. నిర్వహణ లేదు. ఆ స్మారక భవనంలో జరుగుతున్న అకృత్యాలకు ఆయన ఆత్మ రోజుకొకసారి మరణిస్తోంది. స్మారక భవనానికి ఎదురుగా రోడ్డుకు అవతల మద్యం దుకాణం. మద్యం ప్రియులు ఆ దుకాణంలో మద్యం కొని స్మారక భవనంలోకి తెచ్చుకుని సేవిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. మద్యసేవనంతో పాటు పేకాట ఆడుతున్న ఆనవాళ్లు కూడా కనిస్తుంటాయి. పర్యాటక శాఖ నిర్మించిన స్మారక భవనం ప్రాంగణంలో శ్రీరాములు విగ్రహం ఉంది. తన కళ్ల ముందే జరుగుతున్న అకృత్యాలకు అమరజీవి ఆత్మ రోదిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
∙వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement