
‘పాపా సుధా! పాపా సుధా!’ అంటూ నిద్రకళ్లతోనే పెన్నూ పుస్తకం పట్టుకుని, వంటగదిలోకొచ్చాడు చింటూ. తన తండ్రి పిలిచే పిలుపే తనకీ అలవాటు. చపాతీలు కాలుస్తున్న సుధ.. కొడుకు చింటూని చూసి.. ‘అప్పుడే లేచావా? పో బ్రష్ చేసిరా టిఫిన్స్ పెడతా’ అంది నవ్వుతూ. ‘పాపా! మరేమో మాకు రేపు శ్లోకాలు, పద్యాల పోటీ ఉంది, ఏదైనా ఒకటి రాసిస్తావా? ప్రాక్టీస్ చేస్తా!’ అన్నాడు చింటూ.చటుక్కున స్టవ్ ఆఫ్ చేసి.. ‘అవునా? ఇటురా, నాకు బాగా ఇష్టమైన ఓ శ్లోకముంది, రాసిస్తా’ అంటూ పక్కనే ఉన్న చిన్న పీట లాక్కుని కూర్చుంది సు«ధ. దగ్గరకొచ్చి తల్లిముందు మోకాళ్లపై కూర్చుని పెన్నూ పుస్తకం ఆమె చేతిలో పెట్టాడు చింటూ.
దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ‘‘అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‘అంటూ పైకి చదువుతూనే, చింటూ పుస్తకంలో రాస్తోంది సుధ. ‘దీని అర్థం ఏంటమ్మా?’ అన్నాడు చింటూ క్యూట్గా. ‘ఓ అర్జునా! డాంబికం, గర్వం, మితిమీరిన అహం, కోపం, మొరటుతనం, అజ్ఞానంతో వాస్తవాన్ని గ్రహించకపోవడం.. ఇవన్నీ అసుర (రాక్షస) స్వభావంతో పుట్టినవారి లక్షణాలు’ అంది సుధ రాస్తూనే. ఈలోపు చింటూ నాయనమ్మ దుర్గమ్మ బయట నుంచి వంటగదివైపు చూస్తూ ‘రేయ్ చింటూ, మీ పెదనాన్న లేచాడా? చూడు’ అని అరిచింది. వెంటనే చింటూ, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి రుద్రాక్ష గదిలోకి మెల్లగా తొంగి చూశాడు. గుర్గుర్మనే శబ్దాన్ని విని ‘ఇంకా లేవలే’ అన్నట్లుగా చేత్తోనే సైగ చేశాడు.
చింటూకి ఇద్దరు అక్కలు. చింటూ తండ్రి అంజి.. రుద్రాక్ష కంటే చాలా చిన్నవాడు. పదేళ్ల క్రితం, హైదరాబాద్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకుని, డిప్రెషన్తో ఇంటికే పరిమితమైపోయాడు. అప్పటికే ఉద్యోగం చేస్తున్న సుధ ఇంటి బాధ్యతంతా తనే తీసుకుంది. అయితే విషయం తెలుసుకున్న రుద్రాక్ష ‘నా తమ్ముడ్ని నువ్వేం ఉద్ధరించక్కర్లేదు. నీకు నీ మొగుడు కావాలంటే ఊరికొచ్చి బుద్ధిగా కాపురం చేసుకో.. నేను మాత్రం మా తమ్ముడ్ని, పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతా’ అని సుధపై రంకెలేశాడు. ఆ రోజు నుంచి చింటూ ఫ్యామిలీ ఊరిలో రుద్రాక్ష ఇంట్లోనే ఉంటోంది. సుధ అప్పట్లోనే జాబ్ చేస్తూ తెలుగు మీద ఇష్టంతో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసింది. కనీసం ఊళ్లోని కాన్వెంట్కి వెళ్లి తెలుగు టీచర్గా చేసుకుంటానన్నా, ఆమె మాట చెల్లలేదు.
పదయ్యేసరికి చింటూ చక్కగా తినేసి, శ్లోకం బట్టీపట్టే పనిలో పడ్డాడు. ఇంతలో దుర్గమ్మ మెల్లగా.. రుద్రాక్ష గదికి వెళ్లి ‘రేయ్ రుద్రా లే, పది దాటింది. చెరువుల కాడికి పోవాలేమోగా?’ అంది చిన్నగా. ‘ఊ..’ అన్నాడు రుద్రా గంభీరంగా. ఆదివారం కదా, రుద్రాక్ష బయటికి వెళ్లిపోతే, అతడికి తెలియకుండా, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్లాలనేది ఆమె తాపత్రయం. రుద్రాక్ష శివభక్తుడు. అతడికి చెప్పకుండా కొన్నేళ్ల క్రితమే బాప్టిజం తీసుకుని మేరీగా మారింది దుర్గమ్మ. ఇంటికి సమీపంలో ఆమె పేరునున్న కొంత స్థలాన్ని చర్చి కట్టడానికి దానం చేసిన విషయం బయటపడిన రోజే.. తల్లి మతం మారిన విషయం తెలుసుకున్నాడు. ఆ గొడవ తర్వాత తల్లితో మాట్లాడటం మానేశాడు.
రుద్రాక్ష లేచి స్నానం చేసి వచ్చేలోపు.. అతడి భార్య శ్రీలేఖ పూజకు చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. పూజ చేసి వచ్చేలోపు సుధ టిఫిన్స్ అందించింది. ఇక ఎప్పటిలానే ఆ ఆదివారం ఇంటి బయట రుద్రాక్ష బుల్లెట్ స్టార్ట్ చేయగానే, ఇంటి వెనుక నుంచి మేరీ 11 గంటల ఆరాధన కోసం అడ్డదారిలో చర్చికి పరుగుతీసింది. రుద్రాక్ష తన స్నేహితుడు రవీంద్ర ఇంటి ముందు బండి స్లోచేసి, హార¯Œ కొట్టాడు. అక్కడ మరో బుల్లెట్ స్టార్ట్ అయ్యింది. అది సేమ్ కలర్, సేమ్ మోడల్. రుద్రాక్ష ప్రతి పనిలోనూ రవీంద్రనే ఫాలో అవుతాడు. ప్రతిపనిలోనూ రవీంద్ర వెంటే నడుస్తాడు. ఇద్దరికీ కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నాయి. చేపల చెరువులు వేసి ఇంకా ఇంకా గడిస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లైనా, ఇంటి బయట పని వాళ్లైనా వాళ్లు చెప్పిన మాట వినాలి. ఇక వాళ్లు కన్నవాళ్లు, వాళ్లను కన్నవాళ్లు అంతా తమ గీత మీదే నడవాలి. వాళ్లు బయటకి వెళ్తున్నప్పుడు ఇంటి ఆడవాళ్లెవరూ బయట కనిపించకూడదు. వాళ్లు ఇంటికి వచ్చేసరికి పెద్దపెద్దగా మాటలేవీ వినిపించకూడదు. ఈ శాసనాలన్నీ రవీంద్ర చేసినవే. చాలావరకు రుద్రాక్ష ఇంట్లోనూ అమలవుతుంటాయి.
కాలం మారుతుందని గుర్తించలేని ఆ పల్లెటూరిలో ఈ హిట్లర్ పాలన మొదలై పాతికేళ్లు దాటింది.పాతికేళ్ల క్రితం రుద్రాక్ష, రవీంద్రలతో పాటు వంశీధర్ అనే మరో స్నేహితుడు వీళ్లతో కలిసి తిరిగేవాడు. వంశీధర్కి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో నాయనమ్మ పెంచింది. అతడి పెళ్లి తర్వాత ఆమె కూడా చనిపోయింది. రుద్రాక్ష, వంశీధర్లకు పెళ్లి అయిన మూడేళ్లకు రవీంద్ర పెళ్లి చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి ఆడవాళ్లపై చిన్నచూపున్న రవీంద్ర పెళ్లి తర్వాత భార్యను కట్టుబానిసలా చూసేవాడు. గొడవైన ప్రతిసారీ రుద్రాక్ష, వంశీధర్ల కాపురాలను చూసి నేర్చుకోమని తిట్టేది రవీంద్ర భార్య. దాంతో వీలు చిక్కిన ప్రతిసారీ స్నేహితులకు మందు, విందు ఏర్పాటు చేసి, ‘ఆడదానికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. వాళ్లని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. లేదంటే, అదే చేతకాని తనమవుతుంది.
ఎవరిముందైనా మనదే పైచేయి కావాలి’ అంటూ ఇంట్లో తాను చలాయించే నియంతృత్వ ప్రతాపాన్ని స్నేహితుల ముందు గర్వంగా చెప్పుకునేవాడు. కుటుంబానికి కట్టుబడి బతికే ప్రతి వాడ్ని బకరాగా ఉదహరించేవాడు. మెల్లగా స్నేహితులిద్దరూ రవీంద్ర బాటలో నడవడం మొదలుపెట్టారు. కొన్ని నెలలకు వంశీధర్ ఉన్నట్టుండి కనిపించడం మానేశాడు. ఆరాతీస్తే పిల్లలకు బాలేదని, అత్తింటికి వెళ్లాడని అస్పష్టమైన సమాచారమందింది. కొంతకాలానికి ఊరు తిరిగొచ్చిన వంశీధర్– స్నేహితుల్ని మాత్రం కలవలేదు. ఆస్తులమ్మేసుకుని టౌన్ వెళ్లిపోతున్నాడనే వార్త విన్న రుద్రాక్ష, దారికాచి వంశీధర్ని నిలదీశాడు. ‘కొన్నిసార్లు ఎదుటివారి మూర్ఖత్వం కూడా మనలోని మంచితనాన్ని చంపేస్తుంది, అలా చచ్చి బతుకుతున్నవాణ్ణి. కారణాలడగొద్దురా. వాదించి శత్రువుని కావాలనుకోవడంలేదు’ అనేసి వెళ్లిపోయాడు వంశీధర్. ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదు.
ఇంకొన్నాళ్లకు రవీంద్ర భార్య గొడవ పడటం మానేసి, అణిగిమణిగి బతకడం నేర్చుకుంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగబిడ్డ కావాల్సిందేనని, డాక్టర్ ప్రమాదమని చెప్పినా మరో కాన్పుకి ఉంచాడు రవీంద్ర. మళ్లీ ఆడపిల్లే పుట్టింది. కానీ భార్య పురిటిలోనే చనిపోవడంతో, ఏడాదిలోపు ఆమె చెల్లెల్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మరో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కొడుకు మాత్రం పుట్టలేదు. రుద్రాక్షది ప్రేమ వివాహం. ఒక కొడుకు, ఒక కూతురు. రవీంద్ర ప్రభావంలో రుద్రాక్ష భార్యను తక్కువ చేసి చూడటం మొదలుపెట్టాక.. ఆత్మాభిమానంతో శ్రీలేఖ చాలా ఏళ్లు పోరాడింది.
చివరికి రుద్రాక్షలో మార్పు లేకపోవడంతో పనులన్నీ చేసిపెడుతూనే, మాట్లాడటం మానేసింది. రవీంద్ర మొదటి భార్య చనిపోయినప్పుడు.. రుద్రాక్ష చెల్లెలు ప్రియను అతడికిచ్చి చెయ్యాలని తెగ ఉబలాటపడ్డాడు రుద్రాక్ష. అప్పటికి ప్రియ చదువుకుంటోంది. సడ¯Œ గా పెళ్లి అనేసరికి, ‘నేను మా సీనియర్ని ప్రేమిస్తున్నా, అతడ్నే చేసుకుంటా’ అని తెగేసి చెప్పింది. అయినా రుద్రాక్ష వినకపోవడంతో ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకుంది. దాంతో ప్రియను ఇంటి గుమ్మం తొక్కనివ్వలేదు. రుద్రాక్షకు తెలియని విషయమేంటంటే, రవీంద్రతో పెళ్లి చేస్తే ప్రియ జీవితం నాశనమయిపోతుందని భావించిన శ్రీలేఖే రహస్యంగా ఆ పెళ్లి చేసింది.
‘ఆడపిల్లలకు పదోతరగతే ఎక్కువ’ అనే రవీంద్ర నలుగురు కూతుళ్ల్లకు పెళ్లి చేసి పంపేశాడు. ఆ ఇంట్లో జరిగే ప్రతి పెళ్లికి, రుద్రాక్ష ఇంట్లో రచ్చ జరిగేది. కూతురు స్వప్నను చదువు మానిపించి, పెళ్లి చెయ్యాలని రుద్రాక్ష తీవ్రంగా ప్రయత్నించేవాడు. అతడ్ని ఆపలేక, శ్రీలేఖ విదేశాల్లో ఉండే స్నేహితుల సాయంతో దొంగపెళ్లికొడుకుల్ని ఏర్పాటు చేసి, చివరిక్షణంలో సంబంధాలను చెడగొట్టే పనిలో ఉండేది. ఇక కొడుకు కౌటిల్య కెనడాలో ఉద్యోగం చేసుకుంటూ, అక్కడి పిల్లనే ప్రేమించాడు. ఆ విషయం తెలుసుకున్న రుద్రాక్ష ‘నేను చూసిన అమ్మాయిని చేసుకుంటేనే ఆస్తి ఇస్తా. ఇంటికి రానిస్తా’ అని బెదిరిస్తూ వచ్చాడు. దాంతో అక్కడే సహజీవనంతో కాలం గడిపేస్తున్నాడు కౌటిల్య.
పాతికేళ్లుగా ఈ స్నేహితులు అహంకారంతో విర్రవీగుతుంటే, విధి మరో రాత రాసింది. ఆ ఆదివారం కాంతమ్మ కల్లుదుకాణంలో మందుకొట్టి ఇంటికి వెళ్లిన రవీంద్ర మరుసటిరోజు నుంచి బాగా నీరసించాడు. ఎప్పుడూ వచ్చే పొడి దగ్గు కాస్త ఎక్కువైంది. దాంతో రుద్రాక్ష దగ్గర్లో సిటీకి తీసుకుని వెళ్లి టెస్ట్లు చేయిస్తే, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, మూడు నెలలు కంటే ఎక్కువ బతకడని, హైదరాబాద్ తీసుకెళ్తే ఫలితం ఉండొచ్చని చెప్పారు. దాంతో హైదరాబాద్లో కాపురం ఉంటున్న పెద్దకూతురు ఇంటికి తీసుకెళ్లారు.
వారానికి ఒకసారి రుద్రాక్ష బుల్లెట్ మీదే హైదరాబాద్ వెళ్లి, రవీంద్రని చూసి, ఆ రాత్రికి ఉండొచ్చేవాడు. చావుభయంతో రవీంద్ర బలం, పొగరు అన్నీ తగ్గుతూ వచ్చాయి. మధ్యమధ్యలో వెళ్లొస్తున్న రుద్రాక్షకి రవీంద్ర కూతురు, అల్లుళ్లల్లో కొత్త యాంగిల్ కనిపించసాగింది. ‘లక్షలకు లక్షలు ఆయనకే పెడితే, తర్వాతేం పంచుకోవాలి?’ అనే మాటలు కూడా రుద్రాక్ష చెవిన పడ్డాయి. రవీంద్రకు నెలలు గడవకముందే జబ్బు ముదిరింది.
రోజులు దగ్గరపడ్డాయని అతడికీ అర్థమైంది. అందుకే కాబోలు రుద్రాక్ష ఇంటికి బయలుదేరుతుంటే, ‘రేయ్ రుద్రా! మళ్లీ నువ్వు వచ్చేటప్పటికి ఉంటానో లేదో ఓ రెండురోజులుండి పోరా’ అన్నాడు దీనంగా. అన్నట్లుగానే రెండు రోజులు గడవకముందే ప్రాణం పోయింది. వెంటనే రవీంద్ర నలుగురు అల్లుళ్లు ఫోన్లలో మాట్లాడుకుని, అన్ని కార్యక్రమాలు హైదరాబాద్లోనే జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రికి బెంగళూరూ, నోయిడా, చెన్నైల్లో ఉంటున్న మిగిలిన అల్లుళ్లు, కూతుర్లు, వాళ్ల పిల్లలు హైదరాబాద్ వచ్చేశారు. బాడీని ఊరికి తీసుకెళ్దామని రుద్రాక్ష అడిగితే ఒప్పుకోలేదు. హైదరాబాద్ అయితే తమ ప్రయాణం ఈజీగా ఉంటుందని, ఊళ్లో అయితే వర్క్, నెట్వర్క్ కష్టమని కారణాలు చెప్పుకొచ్చారు.
మరునాడు మధ్యాహ్నానికి రవీంద్ర అంతిమయాత్ర వాహనం ముందు వెళ్తుంటే, రుద్రాక్ష దాన్ని ఫాలో అవుతూ శ్మశానవాటికకు బుల్లెట్పై బయలుదేరాడు. అంతపెద్ద శ్మశానవాటికను చూడటం రుద్రాక్షకు అదే మొదటిసారి. కొన్ని నిమిషాల తేడాలోనే అంతా అక్కడికి చేరారు. తలకొరివి కార్యక్రమం పూర్తికాగానే, కాటికాపరి ‘మీరు వెళ్లొచ్చు. రేపు వస్తే, అస్థికలిస్తా’ అన్నాడు. దాంతో ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు.
చివరికి రుద్రాక్ష మాత్రమే మిగిలాడు. కాసేపటికి అతడూ లేచి తన బండి దగ్గరకు వెళ్లబోతూ, కాలుతున్న చితివైపు తిరిగి చూశాడు. ఆ క్షణంలో రుద్రాక్షలో ఏదో తెలియని వైరాగ్యం తొణికిసలాడింది. ‘ఏరోజుకైనా నేనూ చితిలో కాలిపోతానని తెలుసు. అయినా ఎందుకో ఏడుపొస్తోంది’ అనుకుంటూనే, ‘రేయ్ రుద్రా! మగాడు ఏడవడం ఏంట్రా?’ అన్న రవీంద్ర మాటలు గుర్తొచ్చి కన్నీళ్లను కళ్లల్లోనే ఆపేసుకున్నాడు. ఇంతలో రుద్రాక్షను దూరం నుంచి చూసిన ఓ వ్యక్తి పరుగున వచ్చి, ‘పాడె కట్టాలా సార్?’ అన్నాడు. ‘నేనింకా బతికే ఉన్నానయ్యా’ అన్నాడు రుద్రాక్ష అప్రయత్నంగా.
‘అయ్యో అదేంటి సార్! మీరు తిరిగి చూసేసరికి మాకోసం వెతుకుతున్నారనుకున్నా సార్’ అన్నాడా వ్యక్తి. ఓ వెర్రినవ్వు నవ్విన రుద్రాక్ష, ‘ఇక్కడ నువ్వేం చేస్తావ్?’ అన్నాడు. ‘నాది కర్రల దుకాణం సార్. అందుకే మీరు కస్టమరేమో అనుకున్నా’ అంటూ అవతలవైపు గుట్టలుగా పేర్చిన కర్రలను చూపించించాడు. ‘నిజమే కదా! శవం కూడా ఓ కస్టమరే’ అనిపించింది రుద్రాక్షకు. ఆ కర్రలన్నీ చూడగానే మనసులో ఎన్నో ఆలోచనలు స్ఫురించాయి. ‘ఇన్ని కర్రలున్నాయేంటీ? రోజుకి ఎన్ని శవాలొస్తాయి ఇక్కడికి?’ అన్నాడు రుద్రాక్ష. ‘ఓ నాలుగైదొస్తాయి సార్’ అన్నాడు ఆ వ్యక్తి. ‘ఈ కర్రలు ఎంతమందికి వస్తాయి?’ అన్నాడు వెంటనే రుద్రాక్ష. ‘ఓ 40 శవాలకు వస్తాయి సార్. ఇది ఇంచుమించు ఓ పదిరోజుల స్టాక్, అంతే!’ అన్నాడు ఆ వ్యక్తి, మరో కస్టమర్ రాగానే అటుగా పరుగుతీస్తూ.
‘చావుకంటే ముందే కట్టె ఎదురుచూస్తుందా? రాబోయే పదిరోజుల్లో చనిపోయేవారి కట్టెలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయా? ఈ క్షణం ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఆ జీవులు?’ అని పలికింది రుద్రాక్ష మనసు. ‘అంటే! ఈ పదిరోజుల తర్వాత చనిపోబోయే నలభై మంది కట్టెలు లారీలో ఇక్కడికి వస్తుంటాయి. ఆ తర్వాత పదిరోజుల కట్టెలు ఈపాటికే ఎండలో ఎండుతుంటాయి. ఆ తర్వాత కట్టెలు చెట్ల రూపంలో ఉండి ఉంటాయి. ఇదే కదా విధిరాతంటే! శవంపై పెట్టి కాల్చే ఈ కర్ర, ఏదో ఒకరోజు నీ కోసం కూడా సిద్ధమవుతోంది రుద్రాక్షా! విత్తురూపంలో ఉందో, చెట్టు రూపంలో ఉందో, ఎండుతూ ఉందో, లేదంటే లారీలో వస్తుందో? ఇలాంటి శ్మశానవాటికలు ఎన్నో కదా!’ అనే మాటలు రుద్రాక్ష చెవుల్లో ఎవరో అంటున్నట్లే మార్మోగాయి. అప్రయత్నంగా అడుగులో అడుగు వేసుకుంటూ, బుల్లెట్వైపు నడిచాడు.
చీకటిపడేసరికి డైరెక్ట్గా వంశీధర్ ఇంటి ముందు ఆగింది రుద్రాక్ష బుల్లెట్. ఆ దారి వెంట రవీంద్రతో పాటు ఎన్నోసార్లు వెళ్లినా, ఏ రోజూ అక్కడ ఆగలేదు. ‘మనల్ని వదిలేసిన వాడితో మనకు మాటలేంట్రా?’ అనేవాడు రవీంద్ర. ఆ మాట గుర్తురాగానే మళ్లీ బుల్లెట్ స్టార్ట్ చేశాడు రుద్రాక్ష. అప్పటికే ‘ఎవరొచ్చారా?’ అని గుమ్మంలోకొచ్చి పరకాయించిన వంశీధర్, ‘రేయ్ రుద్రా’ అని పెద్దగా అరిచి, ఆపి, లోపలికి తీసుకెళ్లాడు.
ఏళ్లనాటి దూరాన్ని మౌనం ఆక్రమిస్తుంటే, రవీంద్ర మరణవార్తను వంశీధర్ చెవిన వేశాడు రుద్రాక్ష. ‘వాడు ఎంత బతుకు బతికాడు! అంతా కలిసి ఆ చావుకు విలువ లేనట్లే చేశారు. ఒకరి కళ్లల్లో కూడా నిజమైన కన్నీళ్లు చూడలేకపోయాను’ అంటూ మనసులోదంతా వెళ్లగక్కాడు రుద్రాక్ష దుఃఖంతో. అప్పుడే అనుకోకుండా రుద్రాక్ష కళ్లు గోడమీదున్న ఓ ఫొటో మీద పడ్డాయి. ఫొటోకి దండ వేలాడుతుంటే, అయోమయంగా పైకి లేచి ‘వ..వాసవీ, పిల్లలూ?’ అని ఆగి వంశీధర్ వైపు చూశాడు. ‘ఎప్పుడో చనిపోయార్రా’ అన్నాడు వంశీధర్ దిగులుగా పైకి లేచి ఫొటోని చూస్తూ. ‘ఎలా?’ అడిగాడు రుద్రాక్ష బొంగురు గొంతుతో. ‘తను పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుందిరా’ అన్నాడు వంశీధర్. ‘ఏమంటున్నావ్రా?’ నిర్ఘాంతపోయినట్లు చూశాడు రుద్రాక్ష.
‘అవునురా! నా ప్రవర్తనే కారణం. అప్పట్లో రవీంద్ర చెప్పినట్లే ఇంట్లో ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టాక మా మధ్య గొడవలు పెరిగాయి. ఒకరోజు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే వాళ్ల అమ్మానాన్న తిరిగి నా దగ్గరకు వెళ్లమని బలవంతం చేసేసరికి పిల్లలతో సహా మేడ మీద నుంచి దూకేసిందటరా. పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. వాసవి ఐదేళ్లపాటు మంచం మీదే ఉంది. ఊరిలో అంతా అమ్ముకుని ఇక్కడికి వచ్చింది తనని బతికించుకోవడానికే. తాను కోలుకుంటుందని ఆశపడ్డా. కానీ పిల్లల్ని చేతులారా చంపుకున్నానన్న పశ్చాత్తాపం తనని బతకనివ్వలేదు. నా కుటుంబాన్ని కోల్పోవడానికి కారణం నువ్వే అంటూ రవీంద్ర కాలర్ పట్టుకోవాలన్నంత కోపం వచ్చింది.
కానీ ఒక్కటే ఆలోచనొచ్చింది. ఆరోజు నా వాసవి నేను చూపించే పైత్యాన్ని భరించి ఉండి ఉంటే ఈ రోజు వరకూ నేను అదే అహంతో అదే ఆధిపత్యంతో కాలర్ ఎగరేసుకుని, అదే ఊరిలో తిరిగేవాణ్ణి కదా మీలానే?’ అన్నాడు వంశీధర్. తలదించుకుని, మౌనంగా వింటూనే ఉన్నాడు రుద్రాక్ష. ‘ఈ ఒంటరితనం నాకు నేను విధించుకున్న శిక్ష. మనం చాలాసార్లు కొందరి సావాసంతో వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. నిజానికి మనిషి తన బలాన్ని నిరూపించుకోవడానికి ఎప్పుడూ బలహీనుణ్ణే ఎన్నుకుంటాడు. ఈ ఎంపికలో ఎక్కువగా బలయ్యేది కుటుంబసభ్యులే.
ఈ లోకంలో ప్రేమ, ఇష్టం, అభిమానం లోపించిన భయభక్తులన్నీ అబద్దాలే, నాటకాలే! ఎవ్వరైనా సరే, నువ్వు ఆంక్షలు పెట్టకుండా ఆపేక్షగా చూసుకుంటే, ఏపని చేసినా చెప్పి చేస్తారు. లేదంటే చెప్పకుండా, రహస్యంగా చేస్తారు. అంతేకాని ఆగిపోరు. ఆగారనుకునే భ్రమలో, ఆపాననుకున్న పొగరుతో మనం ఆగిపోతామంతే! నువ్వు అన్నావ్గా ఇందాక రవీంద్ర చనిపోతే ఎవరి కళ్లల్లోనూ నిజమైన బాధను చూడలేదని, ఎలా చూడగలవు? వాడు ఏ రోజైనా భార్యబిడ్డల అభీష్టానికి బతికాడా? అతడి చావు ఆ కుటుంబానికి ఓ విమోచనం. పంజరం వీడిన రామచిలుకల్లా వారి నవ్వులే నీకు చాలా సమాధానాలు చెబుతాయి చూస్తూ ఉండు’ అన్నాడు వంశీధర్.
ఆ ఊరంతా రుద్రాక్ష నోటి నుంచి గంభీరమైన స్వరం విని చాలా నెలలు గడిచాయి. రవీంద్ర మరణం తర్వాత అతడు పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఒకరోజు రవీంద్ర ఇంటి అరుగుపైన అతడి భార్య, పిల్లలు ఫక్కున నవ్వే సన్నివేశం రుద్రాక్ష కంటపడింది. ఎవరో బలంగా లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు.. కానీ నీలోని ఈ గాంభీర్యం సావాసంతో వచ్చిందని నాకు తెలుసు’ అన్న వంశీధర్ మాటలు గుర్తొచ్చాయి.
‘లేఖా! లేఖా’ ఆ పిలుపు రుద్రాక్ష నోట వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. పరుగున వచ్చింది శ్రీలేఖ. ‘మన కౌటిల్య పెళ్లి వాడిష్టపడిన అమ్మాయితోనే జరిపిద్దాం, రమ్మను, పెళ్లికి మా చెల్లి ప్రియ ఫ్యామిలీని పిలుద్దాం. అలాగే సుధని టౌన్లో ఏదో స్కూల్లో తెలుగు టీచర్గా ప్రయత్నించమను’ అన్నాడు. శ్రీలేఖ షాక్లో ఉండగానే, సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ లీనమైపోయిన చింటూని ప్రేమగా ఎత్తుకుని ముద్దాడి, బుల్లెట్ ముందు కూర్చోబెట్టుకుని టౌన్కి బయలుదేరాడు రుద్రాక్ష. అక్కడో జీసస్ ఫొటో దుర్గమ్మ కోసం ప్యాక్ చేయించి, చింటూ చేతికిచ్చి, బండి స్టార్ట్ చేశాడు.
అప్పటికే బిక్కుబిక్కుమంటూ కూర్చున్న చింటూ ధైర్యం చేసి చిన్న స్వరంతో, ‘పె..పెదనాన్నా మ..మరేమో, నువ్వంటే నాకు చాలా భయం. ఇప్పుడు నన్ను కొట్టవు కదా?’ అన్నాడు. నవ్వొచ్చింది రుద్రాక్షకి. ‘ఆ భయం పోవాలంటే నేనేం చెయ్యాలి?’ అన్నాడు రుద్రాక్ష. ‘హూ! భయంపోవాలంటేనా? హా, ఇందాక పెట్టావే ముద్దు.. అలాంటి ముద్దు రోజూ పెట్టాలి, పెడతావా? అప్పుడు బోలెడంత ప్రేమొస్తుంది’ అన్నాడు చింటూ ఎదురుగా వచ్చే గాలికి కళ్లను చిట్లిస్తూ. బండి నడుపుతూనే చింటూ తల మీద ముద్దాడాడు రుద్రాక్ష మురిసిపోతున్న చింటూని బుల్లెట్ బండి అద్దంలో చూస్తూ.