22 వేల కోట్ల బ్యాంక్‌ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్‌.. ఐనా ఆ అందాల రాణి..! | Shivranjani Rajy The Princess Of The Royal Family Of Jodhpur State, Know Interesting Facts About Her In Telugu | Sakshi
Sakshi News home page

22వేల కోట్ల బ్యాంక్‌ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్‌.. ఐనా ఆమె స్టిల్‌ బ్యాచిలర్‌..!

Jun 26 2025 9:41 AM | Updated on Jun 26 2025 1:08 PM

Shivranjani Rajy The Princess of the royal family of Jodhpur State

రాజులు, రాజ్యాలు అంతరించినా వారి వారసులు , వారి కధలు మాత్రం ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన ది రాయల్స్‌ వంటి వెబ్‌ సిరీస్‌ల పుణ్యమా అని రాజవంశీకుల జీవితాలు మరింతగా వెలుగులోకి వస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా తాజాగా ఓ అందాల రాణి గురించిన కొన్ని విశేషాలు కూడా వెలుగు చూశాయి. కుప్పలు తెప్పలుగా ఆస్తి పాస్తులున్నా ఇంకా పెళ్లికాని రాజవంశీకురాలు గురించి వచ్చిన పలు కధనాలు వైరల్‌గా మారాయి.  ఆమె పేరు శివరంజని  రాజ్యే(Shivranjani Rajy).   రాజస్థాన్‌కు చెందిన శివరంజని రాజ్యే  జోధ్‌పూర్‌ రాజవంశీకురాలు.  ఆమె కుటుంబానికి బ్రిటిష్‌ కాలంలోనే దేశ వ్యాప్తంగా అత్యంత గౌరవం లభించింది.

ఖాతా నిండా డబ్బే డబ్బు...
ఈరోజుల్లో సామాన్యులకు లక్ష రూపాయలే గగనంలా అనిపిస్తే, శివరంజని రాజ్యే ఖాతాలో మాత్రం ఓ అంచనా ప్రకారం రూ. 22,000 కోట్లు ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి. ఆమె  తండ్రి గజ్‌సింగ్‌ జీ రాజ్‌మాతా కుమార్తె అయిన శివరంజని, ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌ అనే మహా విలాసవంతమైన కోట కు సహ–యజమానిగా కొనసాగుతున్నారు. 

ఈ ప్యాలెస్‌ నుంచి శివరంజని రాజ్యేకు భారీగా ఆదాయం వస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యక్తిగత నివాసాల్లో ఇది ఒకటి. ఈ ప్యాలెస్‌ అద్భుతమైన ఆర్కిటెక్చర్, అంతఃపురాలు, ఉద్యానవనాలు, కళాఖండాలతో ప్రసిద్ధి చెందింది. ఈ రాజభవనంలో మొత్తం 347 గదులు ఉన్నాయి. దేశంలోని అతి ఖరీదైన హోటల్స్‌ లో ఒకటిగా నిలిచే ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో ఓ భాగాన్ని తాజ్‌ గ్రూప్‌ నిర్వహిస్తోంటే మిగిలిన భాగంలో  రాజవంశీకులు నివసిస్తున్నారు.

ఇంకా బ్రహ్మచారిణిగానే...
ఆమె ఆధీనంలోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌  ఖరీదైన పెళ్లిళ్లకు అత్యంత నప్పే వేదికగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. విచిత్రంగా  ఆమె మాత్రం 50ఏళ్లు వస్తున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు.  ఆస్తి పాస్తులు, అందచందాలు ఉన్న అందాల రాణి  పట్ల మనసు పడ్డవారు చాలామందే ఉన్నప్పటికీ  కారణం తెలీదు గానీ ఎందుకో ఆమె వివాహం చేసుకోలేదు. అంతేకాదు దేశంలోని కొందరు రాజవంశీకుల్లా శివరంజని రాజకీయాల్లో గాని సినీ రంగంలో గాని ప్రవేశించకుండా, తన కుటుంబ పరంపరను, వారసత్వాన్ని కాపాడడం పైనే దృష్టి పెట్టారు. 

తన జీవితాన్ని సామాజిక సేవ, వంశ పారంపర్య సంపద పరిరక్షణలో నిమగ్నం చేశారు. జోధ్‌పూర్‌ లో అనేక కళా, సాంస్కృతిక  కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ, యువతలో చైతన్యం తీసుకొస్తున్నారు. ఆమె జీవిత ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. సంపద ఉన్నా  సంస్కృతీ సంప్రదాయాలకు, నైతిక విలువలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యత నేటి యువతకు స్ఫూర్తిగా చెప్పొచ్చు.

(చదవండి: Anti-Drug Day 2025: మత్తుపై 'దండెత్తారు'..!)

Advertisement
 
Advertisement
Advertisement