మత్తుని చిత్తు చేసిన మహిళా యోధులు..! | Women Commandos Of Chhattisgarh Village Bring Transformative Change | Sakshi
Sakshi News home page

Anti-Drug Day 2025: మత్తుపై 'దండెత్తారు'..!

Jun 26 2025 8:17 AM | Updated on Jun 26 2025 10:21 AM

Women Commandos Of Chhattisgarh Village Bring Transformative Change

మత్తును చిత్తు చేసిన మహిళా యోధులు ‘భూమాత అంత ఓపిక మహిళల సొంతం’ అంటారు. సహనానికి పర్యాయ పదంలా చెప్పే ‘మహిళ’ అవసరమైతే అపర కాళీ అవుతుంది.కేరళ నుంచి పంజాబ్‌ వరకు ఎన్నో ప్రాంతాలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడడానికి మహిళలు నడుం బిగించారు. సంఘాలుగా ఏర్పడిఎన్నో గ్రామాలను డ్రగ్స్‌ భూతం నుంచి విముక్తి చేశారు...

ఛత్తీస్‌గఢ్‌లోని జూహ్లీ గ్రామంలో ఒకప్పుడు పరిస్థితి భయానకంగా ఉండేది. ఈ గ్రామంలో ఎంతోమంది మాదకద్రవ్యాలకు బానిస అయ్యారు. ఫలితంగా గ్రామంలో శాంతిభద్రతలు లోపించాయి. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో తెలియదు. మత్తులో పడి పని కూడా మానేసేవారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి గ్రామ మహిళలు నడుం బిగించారు.

‘ఉమెన్‌ కమాండోస్‌’ పేరుతో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. గ్రామాన్ని మాదక ద్రవ్యాల బారి నుంచి విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాత్రీ, పగలు తేడా లేకుండా ఈ గ్రూప్‌ సభ్యులు వీధి వీధిలో పెట్రోలింగ్‌ చేసేవారు. ‘మా అలవాటు మా ఇష్టం. మీకెందుకు?’ అని అడ్డంగా వాదించే మొండిఘటాలను కూడా దారిలోకి తెచ్చారు. 

ఇప్పుడు గ్రామంలో పూర్తిగా మార్పు వచ్చింది. మద్యం, మాదకద్రవ్యాల విష కోరల నుంచి బయటపడి ఆదర్శ గ్రామంగా మారింది జూహ్లీ. ఈ మార్పుకు కారణం...ఉమెన్‌ కమాండోస్‌. ‘ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్లలో కొందరు డ్రగ్స్‌ తీసుకునేవారు. ఆ దురలవాటు చివరికి యువత, పిల్లల్లోకి కూడా వచ్చింది. 

ఇలా చూస్తూ పోతే గ్రామం సర్వనాశనం అయి΄ోతుందని భయపడ్డాం. ఉమెన్‌ కమాండోస్‌ గ్రూప్‌గా ఏర్పడ్డాం. మార్పు సాధ్యం కాదు అనుకున్నచోట మార్పు తెచ్చాం’ అంటుంది ‘ఉమెన్‌ కమాండోస్‌’ గ్రూప్‌ సభ్యురాలు విష్ణుదేవి.‘మాదకద్రవ్యాల వాడకం వల్ల గృహహింస ఎక్కువ అయింది. కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా మారింది. మేము ఉమెన్‌ కమాండోస్‌ పేరుతో ఒక గ్రూప్‌గా ఏర్పడినప్పుడు మార్పు తేవడం మీ వల్ల కాదు అన్నారు కొందరు. కచ్చితంగా అవుతుంది అని నిరూపించాలనుకున్నాం. 

నిరూపించాం’ అంటుంది రాజేశ్వరి మారవీ. శైలి(పేరు మార్చాం)కి సరదాగా డ్రగ్స్‌ అలవాటు మొదలైంది. చివరికి ఈ దురలవాటు తనను మృత్యువు అంచుల వరకు తీసుకువెళ్లింది. పంజాబ్‌లో శైలిలాంటి ఎంతోమంది మహిళలను డ్రగ్స్‌ మృత్యునీడ నుంచి బయటకు తీసుకువచ్చి కొత్త జీవితాన్ని ఇచ్చింది హెర్మిటేజ్‌ రిహాబ్‌ సెంటర్‌.

మాదక ద్రవ్యాల బారిన పడిన మహిళలను కుటుంబ సభ్యులు ఈసడించడం, దూరం పెట్టడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యేది. పురుషుల కోసం మాత్రమే అన్నట్లుగా ఉండే రిహాబిలిటేషన్‌ సెంటర్‌లు మహిళలను చేర్చుకోవడానికి నిరాకరించేవి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హెర్మిటేజ్‌ రిహాబ్‌ కేంద్రం మొదలైంది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఈ ఆల్‌–ఉమెన్‌ డ్రగ్‌ రిహాబ్‌ సెంటర్‌లో చేరుతుంటారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.

మహిళలే కీలకం
మరోవైపు చూస్తే...మాదకద్రవ్యాల వ్యతిరేకపోరాటంలో, మాదకద్రవ్యాల బారిన పడిన వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో మహిళలను కీలక భాగస్వాములను చేస్తోంది పంజాబ్‌ ప్రభుత్వం. 

డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో భాగంగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘మాదకద్రవ్యాల బారిన పడిన వాళ్లను అందులో నుంచి బయటికి తీసుకువచ్చే శక్తి మహిళలకు ఉంది’ అంటున్నారు పంజాబ్‌ ఆరోగ్య శాఖ మంత్రి డా.బల్బీర్‌సింగ్‌.

బెదిరింపులు వచ్చినా...
డ్రగ్స్‌పై పోరాడుతున్న మహిళలకు డ్రగ్‌ మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. దాడులు జరిగాయి. అయినా వారు వెనక్కి తగ్గలేదు. మహిళా యోధుల పట్టుదల ముందు డ్రగ్‌ మాఫియా తోకముడిచింది.

బాధ పడకూడదు... పోరాడాలి
పంజాబ్‌లోని బఠిండా జిల్లాలోని దులేవాలా గ్రామంలో పదకొండు మంది మహిళలతో ఏర్పాటైన ‘ఆల్‌–ఉమెన్‌ యాంటీ–డ్రగ్‌ అవేర్‌నెస్‌ కమిటీ’ గ్రామంలోని డ్రగ్స్‌ భూతాన్ని తరిమేసింది. సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్‌ షిందర్‌ పాల్‌ కౌర్‌ ఈ కమిటీకి నాయకత్వం వహించింది. 

‘డ్రగ్స్‌ వల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతోమంది దారి తప్పి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి మేము చేసిన ప్రయత్నం ఫలించింది’ అంటుంది షిందర్‌ పాల్‌ కౌర్‌. 

(చదవండి: అమ్మానాన్నల హక్కు కాదు..! అది కేవలం పిల్లల హక్కు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement