చిన్న కాగితంతో పెద్ద కుట్ర భగ్నం | Crime Sroty On Funday | Sakshi
Sakshi News home page

చిన్న కాగితంతో పెద్ద కుట్ర భగ్నం

Jun 15 2025 8:22 AM | Updated on Jun 15 2025 8:22 AM

Crime Sroty On Funday

ఎలాంటి నిఘా హెచ్చరికలు లేవు, ఎలాంటి అనుమానాస్పద ఉదంతాలు జరగలేదు; పోలీసు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రయత్నించలేదు. అయినా 2004 ఆగస్టులో భారీ కుట్రను సిటీ టాస్క్‌ఫోర్స్‌ భగ్నం చేయగలిగింది. సికింద్రాబాద్‌లోని గణేశ్‌ దేవాలయం పేల్చివేతతో పాటు నగరాన్ని సందర్శిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌ టూరిస్టుల హత్యకు ఉగ్రవాదులు పన్నిన పథకం వెలుగులోకి వచ్చింది. ఓ వాహనచోరుడి వద్ద యాదృచ్ఛికంగా లభించిన చిన్న కాగితం ఈ పెద్ద కుట్రను బట్టబయలు చేసింది.

నగర టాస్క్‌ఫోర్స్‌ విభాగం నిత్యం అసాంఘికశక్తులపై నిఘా ఉంచి, నేరగాళ్లను పట్టుకోవడానికి పని చేస్తుంటుంది. భారీ నేరాల కోసమే కాదు, కొన్ని సందర్భాల్లో చిన్నా చితకా కేసుల కోసమూ ఈ టీమ్స్‌ పరుగులు పెడుతుంటాయి. 2004 ఆగస్టులో సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు– అది నెలలో ఆఖరి వారం కావటంతో ఏదో ఒక ముఠా లేదా నేరగాడిని పట్టుకుని ఉన్నతాధికారులకు చూపించడానికి కసరత్తులు చేస్తున్నారు. అప్పుడే ఓ వేగు ద్వారా అందిన చిన్న సమాచారం అధికారుల్లో కోటి ఆశలు రేపింది. ఓ వాహనచోరుడి సంబంధించిన ఆ సమాచారం ఆధారంగా టీమ్‌ వర్కౌట్‌ చేయడం మొదలెట్టింది. 

నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి వచ్చి పహాడీషరీఫ్‌లోని హఫీజ్‌బాబానగర్‌లో మెకానిక్‌గా స్థిరపడిన సయ్యద్‌ అబ్దుల్‌ ఖదీర్‌కు పలు వాహన చోరీలతో ప్రమేయం ఉందన్నది ఆ వేగు అందించిన సమాచారం. దీంతో టాస్క్‌ఫోర్స్‌ అతడి కోసం ముమ్మరంగా గాలించి అదుపులోకి తీసుకుంది. అప్పటి వరకు తాను చేసిన వాహనచోరీలను అతడు అంగీకరించాడు. వాటిలో కొన్నింటిని రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేయాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ తతంగంలో భాగంగా చోరీ వాహనాలతో పాటు నిందితుడి వద్ద లభించిన వస్తువులను సీజ్‌ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఖదీర్‌ను తనిఖీ చేసిన అధికారులు అతడి జేబుల్లో ఉన్న కాగితాలను సైతం తీసి పరిశీలించారు. అన్నీ మామూలుగానే ఉన్నా, ఓ చిన్న స్లిప్‌లోని వివరాలు మాత్రం అనుమానాస్పదంగా కనిపించాయి. 

అతడి వద్ద లభించిన స్లిప్‌లో కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన నంబర్లు ఉండటమే పోలీసుల అనుమానానికి కారణం. దీంతో లోతుగా విచారించగా, అతడి స్నేహితుడైన ఒమర్‌ ఫారూఖ్‌ షరీఫ్‌ (స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల), లంగర్‌హౌస్‌లకు చెందిన అబ్దుల్‌ అజీజ్‌ అలియాస్‌ గిడ్డా అజీజ్‌ పేర్లు వెలుగులోకి రావడంతో పాటు వారిద్దరూ బండ్లగూడలోని గౌస్‌నగర్‌లో ఓ ఇంట్లో డెన్‌ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపెట్టాడు. తాను చోరీ చేసిన వాహనాల్లో కొన్ని వారికి ఇచ్చానని, ఆ నంబర్లు వారికి సంబంధించినవే అని అంగీకరించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో విషయం ‘పెద్దదని’ అనుమానించిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు హుటాహుటిన గౌస్‌నగర్‌లోని డెన్‌పై దాడి చేశాయి. 

అక్కడ ఫారూఖ్‌ చిక్కగా, అజీజ్‌ తప్పించుకున్నాడు. అప్పటికే అజీజ్‌ ఆయుధ చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ఉండటం, ఇప్పుడు పారిపోవడంతో పోలీసులు ఇది కచ్చితంగా ‘పెద్ద విషయం’ అని నిర్ధారించుకున్నారు. ఖదీర్, ఫారూఖ్‌లను కలిపి విచారించడంతో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. సిటీలో ఘర్షణలు రెచ్చగొట్టాలని పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ పథకం వేసినట్లు బయటపడింది. గణేశ్‌ నిమజ్జనం రోజు సికింద్రాబాద్‌లోని గణేశ్‌ దేవాలయం పేల్చివేతకు కుట్ర పన్నినట్లు బయటపడింది. 

దీనికోసం ‘లష్కరే తోయిబా’ నగరానికి చెందిన తెహరీక్‌ తెహఫూజ్‌ షరియా ఓ ఇస్లామీ (టీటీఎస్‌ఐ) నేత మౌలానా నసీరుద్దీన్‌ (2020లో చనిపోయాడు), గులాం యజ్దానీలతో (2006లో ఢిల్లీ ఎన్‌కౌంటర్‌లో హతుడయ్యాడు) పాటు మరో 12 మందిని రంగంలోకి దింపి పేలుడు పదార్థాలు అందించింది. వినాయక నిమజ్జనం రోజు ఈ గ్యాంగ్‌కు చెందిన కొందరు ఇతర మతస్థులుగా వేషం వేసుకుని గణేశ్‌ దేవాలయంలోకి ప్రవేశించి బాంబు పెట్టాలని పథకం సిద్ధం చేసుకున్నారు. గులాం యజ్దానీ ఆదేశాల మేరకు ఈ పేలుడు హడావుడి సద్దుమణగక ముందే సిటీలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్‌ టూరిస్టులనూ చంపాలని భావించారు. 

అందుకు అవసరమైన పేలుడు పదార్ధాలు, వాహనాలు సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో వరుస దాడులు చేసిన పోలీసులు 2004 ఆగస్టు 28న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కొందరు నిందితులు పరారీలోనే ఉన్నారు. ఈ కేసు తొలుత నగర నేర పరిశోధన విభాగంలో నమోదైంది. దీనికి సంబంధించి అప్పట్లో టాస్క్‌ఫోర్స్‌ విభాగం అత్యంత వివాదాస్పదమైంది. అమాయకులను కేసుల్లో ఇరికించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అన్ని కోణాల్లోనూ లోతుగా ఆరా తీసిన సీఐడీ పోలీసులు అరెస్టుల్లో ఎలాంటి కుట్ర లేదని తేల్చారు. ఆపై కేసు సీఐడీకే బదిలీ అయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో తుది విచారణలో ఉంది. భవానీనగర్‌కు చెందిన గిడ్డా అజీజ్‌ తండ్రి మెహతబ్‌ అలీ హెడ్‌–కానిస్టేబుల్‌గా పని చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి గిడ్డా అజీజ్‌ తృటిలో తప్పించుకున్నాడు. 

అప్పటికే తన వద్ద ఉన్న బోస్నియా పాస్‌పోర్ట్‌ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్‌ది నకిలీ పాస్‌పోర్ట్‌ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్‌ పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజీజ్‌పై 2008లో ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్‌పోర్ట్‌ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్‌కు బలవంతంగా తిప్పి పంపించారు. 2001 నాటి విధ్వంసాల కుట్ర కేసులో అజీజ్‌కు 2022లో పదహారేళ్ల శిక్ష పడటంతో జైలులో ఉన్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement