స్పీచ్ అనగానే యాంగ్జైటీతో నా కడుపు చెడిపోయింది
గత కొన్నిరోజులుగా 'ఇదేటమ్మా మాయ మాయ' అనే పాత పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఇప్పుడు అదే పాటని స్టేజీ మీద స్వయంగా రాజశేఖర్(Rajasekhar) హమ్ చేశారు. అలానే తను ఎప్పటినుంచో ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇంతకీ ఈ వ్యాధి ఏంటి? రాజశేఖర్ ఎక్కడ ఈ విషయాన్ని చెప్పారు.
అంకుశం, అల్లరి ప్రియుడు, సింహరాశి లాంటి సినిమాలతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రాజశేఖర్.. తర్వాత కాలంలో హిట్స్ లేక పూర్తిగా డీలా పడిపోయారు. 2017లో 'పీఎస్ గరుడ వేగ'తో సక్సెస్ అందుకున్న ఈయన తర్వాత ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా కనిపించలేదు. లాక్ డౌన్ టైంలో కరోనా కారణంగా అనారోగ్యానికి గురైన ఈయన.. కొన్నాళ్లకు ఇంటికే పరిమితమయ్యారు కూడా.
(ఇదీ చదవండి: శర్వానంద్ 'బైకర్' గ్లింప్స్ రిలీజ్)
2023లో నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రాజశేఖర్.. తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు శర్వానంద్ హీరోగా చేస్తున్న 'బైకర్'లో ఈయన కూడా ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు తెలిసింది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా రాజశేఖర్.. ఈవెంట్లో కనిపించారు. తను కూడా మంచి పాత్రలో కనిపించబోతున్నానని చెప్పారు.
మాటల మధ్యలో తాను చాన్నాళ్ల నుంచి 'ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్'(Irritable Bowel Syndrome) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని రాజశేఖర్ చెప్పారు. ఈవెంట్కి రావాలని, నిన్న తనకు సమాచారం అందించారని.. దీంతో స్పీచ్ ఏం ఇవ్వాలనే యాంగ్జైటీతో నా కడుపు అంతా చెడిపోయిందని అన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాధి గురించి రాజశేఖర్ మాట్లాడారు.
ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది దీర్ఘకాలిక జీర్ణశయాంతర సమస్య. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు,మలబద్ధకం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ సమస్య వల్లనే చాలా ఇబ్బందులు పడుతుంటానని, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టదని గతంలో రాజశేఖర్ ఓసారి చెప్పారు. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని, దీనివల్ల చాలా కోపం వస్తుండేదని, నా గురించి తెలిసిన వాళ్లు నేను ఏమన్నా పట్టించుకునేవారు కాదని అప్పట్లో చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఈ వ్యాధి గురించి మాట్లాడటంతో మరోసారి ఇది చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)


