
పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలకు కష్టం తెలియనివ్వకుండా పరిపాలించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. యజ్ఞయాగాలు చేశాడు. తనువు చాలించిన తర్వాత పుణ్య ప్రభావం వల్ల స్వర్గానికి వెళ్లాడు. అక్కడ అనేక సంవత్సరాలు సుఖభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు. ఏళ్లు గడిచాక భూలోకంలో అతడి కీర్తి అంతరించింది. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడనే సంగతిని కూడా ప్రజలు మరచిపోయారు. భూలోకంలో అతడి కీర్తి అంతరించిపోవడంతో దేవతలు ఇంద్రద్యుమ్నుడిని తిరిగి భూలోకానికి తోసేశారు. స్వర్గం నుంచి తిరిగి భూమ్మీద పడ్డ ఇంద్రద్యుమ్నుడు జరిగిన దానికి బాధపడుతూ, అడవులలో సంచరిస్తూ ఒకనాడు మార్కండేయ మహర్షిని కలుసుకున్నాడు.
‘మహర్షీ! నేనెవరో మీకు తెలుసు కదా! నా పేరు ఇంద్రద్యుమ్నుడు’ అన్నాడు.మార్కండేయుడు అతడిని తేరిపార చూసి, ‘నాయనా! నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు ఎన్నడూ వినలేదు. అయినా నేను తాపసిని. రాజులతోను, వారి చరిత్రలతోను నాకు పనిలేదు’ అని బదులిచ్చాడు.‘మహర్షీ! మీకంటే ముందుగా పుట్టినవారు, సజీవులుగా ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? తెలిస్తే, వారెక్కడ ఉంటారో చెప్పండి. కనీసం వారికైనా నేను తెలుసేమో కనుక్కుంటాను’ అభ్యర్థించాడు ఇంద్రద్యుమ్నుడు.‘మంచుకొండ మీద ఒక గుడ్లగూబ ఉంది. అది నా కంటే ముందు పుట్టింది. దాని పేరు ప్రావారకర్ణుడు. దానిని అడిగి చూడు’ అన్నాడు మార్కండేయుడు.ఇంద్రద్యుమ్నుడు తనతో మార్కండేయ మహర్షిని వెంటబెట్టుకుని, మంచుకొండ వద్ద గుడ్లగూబ దగ్గరకు వెళ్లాడు. ‘ఓ ఉలూకమా! నేను ఇంద్రద్యుమ్నుడిని. నీకు నేను తెలుసునా?’ అని అడిగాడు.
తెలీదని బదులిచ్చింది గుడ్లగూబ.కాస్త నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు, ‘పోనీ! నీ కన్నా ముందుగా పుట్టి సజీవులుగా ఉన్నవారు ఎవరైనా నీకు తెలుసునా?’ అని అడిగాడు.గుడ్లగూబ కాసేపు ఆలోచించి, ‘ఇక్కడకు దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో నాడీజంఘుడు అనే కొంగ ఉంది. ఆ కొంగ నాకంటే ముందు పుట్టింది’ అని చెప్పింది. ఇంద్రద్యుమ్నుడు ఈసారి మార్కండేయుడిని, గుడ్లగూబను వెంటబెట్టుకుని సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ కొంగను కలుసుకుని, ‘నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.‘నాకు తెలీదు గాని, నా కంటే ముందుగా పుట్టిన తాబేలు ఇదే సరస్సులో ఉంటోంది. దానికి తెలుసేమో’ అంది కొంగ.‘దయచేసి, ఆ తాబేలుని పిలుస్తావా? కనుక్కుంటాను’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.
తాబేలుకు కబురు పంపింది కొంగ.ముసలి తాబేలు నెమ్మదిగా తడబడుతూ సరస్సు ఒడ్డుకు వచ్చింది. ‘కచ్ఛపరాజమా! నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.తాబేలు కాసేపు ఆలోచించి, ‘ఆ మహారాజు తెలియకపోవడమేంటి? చల్లని మహారాజు. వెయ్యి యజ్ఞాలు చేశాడు. గొప్ప దానాలు చేశాడు. ఆయన పాలన సాగినన్నాళ్లూ రాజ్యంలో నిత్య సంతర్పణలు జరిగేవి. ఆ మహారాజు భూసురులకు వేలాది గోవులను దానం చేయడం వల్ల, ఆ గోవులు తొక్కుతూ సంచరించడం వల్లనే ఇక్కడ ఈ సరోవరం ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరు ఏమిటనుకున్నావు? ఇది ఇంద్రద్యుమ్న సరోవరం’ అని బదులిచ్చింది.‘హమ్మయ్య! నా గురించి తెలిసిన జీవి ఒకటి ఇంకా ఈ భూమ్మీద జీవించి ఉంది’ అని మనసులో సంతోషించాడు ఇంద్రద్యుమ్నుడు.
తాబేలు మాటలకు ఆనందపరశుడయ్యాడు. ‘కచ్ఛపరాజమా! నేనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజును’ అని చెప్పి, ఆ తాబేలుకు నమస్కరించాడు.ఇంద్రద్యుమ్నుడి కీర్తి ఇంకా భూమ్మీద మిగిలే ఉండటంతో దేవతలు దివ్యవిమానంలో అక్కడకు చేరుకున్నారు.‘ఇంద్రద్యుమ్నా! నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా ఉంది. నువ్వు వెంటనే మాతో వచ్చి, స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ముక్తకంఠంతో పలికారు దేవతలు.ఇంద్రద్యుమ్నుడు వారితో పాటు దివ్యవిమానమెక్కి స్వర్గానికి తిరిగి బయలుదేరాడు.
∙సాంఖ్యాయన