
దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తామంటే ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)కి తమిళ నటుడు సత్యరాజ్(Sathyaraj) వార్నింగ్ ఇచ్చాడు. తమిళనాడులో మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనంలో పవన్ .. నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే… అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని విమర్శించాడు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్… తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుతలై చిరుతైగల్ కచ్చి (వీకేసీ) పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, పవన్ వ్యాఖ్యలను ఇప్పటికే డీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు తమిళనాడుతో మీకేం సంబంధం’ అని డీఎంకే కీలక నేత, మంత్రి శేఖర్ బాబు పవన్ని ప్రశ్నించారు. ‘మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించు’ అని పవన్కి సవాల్ విసిరాడు.