
కశ్యపుడి పెద్ద భార్య దితి కొడుకులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను విష్ణువు సంహరించాడు. కొడుకుల మరణంతో దితి దుఃఖితురాలై, భర్త శరణు పొందింది. ఆమె అనుగ్రహంతో దితి మళ్లీ గర్భం దాల్చింది. దితికి పుట్టబోయే బిడ్డ వల్ల తనకు ముప్పు వాటిల్లగలదని తలచాడు ఇంద్రుడు. దితి వల్ల జరిగిన అనాచార దోషాన్ని కనిపెట్టిన ఇంద్రుడు, దితి గర్భంలోకి ప్రవేశించి, తన వజ్రాయుధంతో పిండాన్ని ఛేదించాడు. అయితే, దితి వ్రత మహిమ కారణంగా ఆ పిండం నశించలేదు. నలభైతొమ్మిది ముక్కలైన ఆ పిండం ద్వారా దితికి నలభైతొమ్మిది మంది కొడుకులు పుట్టారు. వారు మరుత్తులు అనే దేవతలై, ఇంద్రుడి స్నేహాన్ని పొందారు. దితి తన దోషాన్ని గుర్తెరిగి, మళ్లీ భర్తను సేవించి, గర్భం దాల్చింది.
ఈసారి ఆమెకు వజ్రాంగుడు అనే కొడుకు పుట్టాడు. పేరుకు తగినట్లే అతడు వజ్రసదృశ శరీరుడు. అమిత బలవంతుడు. వజ్రాంగుడు అమిత శివభక్తుడు. నిత్య శివారాధన నియమం తప్పక చేసేవాడు. పెరిగి పెద్దయ్యాక అతడు ఇంద్రుడి మీదకు దండెత్తాడు. ఇంద్రుడిని, అతడి దేవ సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు. ఇంద్రుడిని, కొందరు దేవతలను చెరపట్టి, తల్లికి సంతోషం కలిగించాడు. వజ్రాంగుడి వల్ల దేవతలు కర్మఫలాన్ని అనుభవించారు. ఇంద్రుడు సహా ఎందరో దేవతలు వజ్రాంగుడి చెరలో చిక్కుకోవడంతో స్వర్గం కళ తప్పింది. దేవతలను వజ్రాంగుడి చెర నుంచి విడిపించాలంటూ బృందారకులు బ్రహ్మదేవుడిని కోరారు. వారి కోరికతో బ్రహ్మదేవుడు వజ్రాంగుడి వద్దకు వెళ్లాడు.
సామగానంతో వజ్రాంగుడిని సంతోషపెట్టి, ఇంద్రాది దేవతలందరినీ అతడి చెర నుంచి విడిపించాడు.వజ్రాంగుడు బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ! ‘ఓ బ్రహ్మదేవా! నాకు ఎవరి మీదా రాగద్వేషాలు లేవు. నా తల్లి ఆజ్ఞ మేరకు దేవతలను చెరపట్టాను. నాకు రాజ్యకాంక్ష లేదు. అందువల్ల స్వర్గాన్ని ఆక్రమించుకోవాలన్న ఆలోచన నాకు అసలే లేదు. నాకు చరమమైన, నిత్యసుఖదాయకమైన ఆత్మజ్ఞానాన్ని బోధించు’ అన్నాడు.అతడి మాటలకు బ్రహ్మదేవుడు సంతోషభరితుడయ్యాడు. ‘వజ్రాంగా! ఒక్క మాటలో చెబుతున్నాను, విను. జ్ఞాన వైరాగ్యాది సాత్త్విక భావనలే తత్త్వసారం’ అని బోధించాడు. అప్పటికప్పుడు వరాంగి అనే కన్యను సృష్టించి, వజ్రాంగుడికిచ్చి వివాహం జరిపించాడు. తర్వాత తన సత్యలోకానికి వెళ్లిపోయాడు. జరిగిన దానికి కశ్యపుడు కూడా సంతోషించాడు.
వజ్రాంగుడు పరమ సాత్త్వికుడై వరాంగితో సంసార యాత్ర సాగించసాగాడు. వరాంగి మాత్రం మనసులో ఎలాంటి సాత్త్విక భావాలు లేనిదై, అలవిమాలిన కోరికలతో భర్తను సేవిస్తూ ఉండేది. ఆమె సేవలకు సంతుష్టుడైన వజ్రాంగుడు, ‘నీ మనోభీష్టాన్ని నెరవేరుస్తాను. ఏం కావాలో కోరుకో’ అని అడిగాడు.దానికామె, ‘ముల్లోకాలనూ జయించగలిగేవాడు, ఇంద్రుడిని సైతం క్షోభపెట్టగలిగేవాడు అయిన మహా పరాక్రమవంతుడైన కొడుకు కావాలి’ అని అడిగింది.వరాంగి కోరికకు వజ్రాంగుడు విచలితుడయ్యాడు. తన భార్య అసమంజసమైన కోరిక కోరిందే అని కలత చెందాడు. అయినా మాట ఇచ్చాను కదా, ఏం చేయాలనే ఆలోచనతో మీమాంసలో పడ్డాడు. ఆడిన మాట తప్పరాదనే ధర్మానికి కట్టుబడి, తనకు ఇష్టం లేకపోయినా, చివరకు భార్య కోరికను నెరవేర్చాలనే నిశ్చయించుకున్నాడు.
ముల్లోకాలను జయించగలవాడు బ్రహ్మ వాక్కుతో తప్ప జన్మించడం సాధ్యం కాదని తలచి, వజ్రాంగుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ద్వారా వరం పొంది ఇంటికి తిరిగి వచ్చాడు.కొన్నాళ్లకు వరాంగి గర్భం దాల్చింది. నెలలు నిండగానే, మహాకాయుడు అయిన బాలుడు పుట్టాడు. అతడు పుట్టగానే చేసిన రోదనకు ముల్లోకాలలో అనేక ఉత్పాతాలు సంభవించాయి. దుశ్శకునాలు ఎదురయ్యాయి. భూమిపై ఉల్కలు వర్షించాయి. చెవులు చిల్లులు పడేంత మోతతో పిడుగులు పడ్డాయి. అడవుల్లోని జంతువులు ఆందోళన చెంది, దిక్కుతోచక పరుగులు తీశాయి. నక్కలు ఊళలు పెట్టాయి. కుక్కలు నేలను తవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ, కర్ణకఠోరంగా రోదించాయి. భూమి కంపించింది.
సముద్రాలు ఉద్ధృతంగా ఉప్పొంగాయి. ప్రళయ ప్రభంజనంలా పెనుగాలులు వీచాయి. పెనుగాలుల తాకిడికి మహావృక్షాలు నేలకొరిగాయి. మేఘాలు చీము నెత్తురులను వర్షించాయి. పక్షులు గూళ్లు విడిచి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. వాటిలో చాలా పక్షులు చచ్చి నేల రాలాయి. స్వర్గంలో ఇంద్రుడి సింహాసనం తూలింది. అది చూసి దేవతలంతా భయకంపితులయ్యారు. ఈ ఉత్పాతాలు సమసిపోవడానికి కొన్ని నెలలు పట్టింది.
వజ్రాంగుడికి, వరాంగికి పుట్టిన బాలుడికి కశ్యప ప్రజాపతి తారకుడు అని నామకరణం చేశాడు. పెరిగి పెద్దవాడైన తారకుడు తాను బ్రహ్మ గురించి తపస్సు చేస్తానని, తపస్సుకు అనుమతించమని తల్లిని కోరాడు. ఆమె అనుమతించడంతో మధువనానికి చేరుకుని, బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కొన్ని వందల సంవత్సరాలు అతడు కఠోరమైన తపస్సు సాగించాడు. తపస్సు చేస్తుండగా, అతడి తల నుంచి వెలువడిన తేజస్సు ముల్లోకాలలో మహోపద్రవాన్ని కలిగించింది.
దేవతలు భయభ్రాంతులై, ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కించాలంటూ బ్రహ్మదేవుడి వద్ద మొరపెట్టుకున్నారు.చివరకు బ్రహ్మదేవుడు తారకుడికి ప్రత్యక్షమయ్యాడు. ‘నాయనా! నీ తపస్సుకు ముల్లోకాలూ కల్లోలంగా మారాయి. నీ మనోభీష్టమేదో కోరుకో, తప్పక వరమిస్తాను’ అన్నాడు బ్రహ్మదేవుడు.‘బ్రహ్మదేవా! ముల్లోకాలలోనూ నన్ను మించిన బలవంతుడు ఎవరూ ఉండకూడదు. శివునికి పుట్టిన కొడుకు ఏనాడు సేనాధిపత్యం వహించి, నాపై ఆయుధ ప్రయోగం చేస్తాడో ఆనాడు మాత్రమే నేను మరణించేలా అనుగ్రహించు’ అని కోరాడు.బ్రహ్మదేవుడు ‘తథాస్తు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.
∙సాంఖ్యాయన