కాలకల్పుని కథ | story of somasekharudu | Sakshi
Sakshi News home page

కాలకల్పుని కథ

Jun 1 2025 8:18 AM | Updated on Jun 1 2025 8:33 AM

story of somasekharudu

పూర్వం మథురా పట్టణంలో సోమశేఖరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. విశాలాక్షి అనే యువతిని వివాహమాడి గృహస్థ జీవనం గడపసాగాడు. వేదవేదాంగ పారంగతుడైన సోమశేఖరుడు ధర్మబద్ధంగా జీవిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఉండేవాడు. నిత్య నైమిత్తిక కార్యక్రమాలను నియమం తప్పక ఆచరిస్తూ ఉండేవాడు. నిత్యాగ్నిహోత్రుడై దేవ ముని పితృదేవతారాధన క్రమం తప్పక సాగించేవాడు. కొన్నాళ్లకు సోమశేఖరుడు, విశాలాక్షి దంపతులు పుణ్య సముపార్జన కోసం తీర్థయాత్రలు చేయాలని తలచారు. 

ఒక సుముహూర్తాన తీర్థయాత్రలకు బయలుదేరి, గంగా తీరానికి చేరుకున్నారు. గంగానదిలో స్నానమాచరించారు. సోమశేఖరుడు గంగానది ఒడ్డున సంధ్యావందనం చేసుకునేలోగా, విశాలాక్షి కలశంతో గంగాజలాన్ని నింపుకొని వచ్చింది. అందులో తులసిదళాలను వేసింది. సోమశేఖరుడి సంధ్యాదికాలు పూర్తి కాగానే దంపతులిద్దరూ గంగాకలశంతో కాలినడకన బయలుదేరారు.వారు అలా నడక సాగిస్తుండగా, పశ్చిమదేశం నుంచి ఎడ్లబండిపై సరుకులు నింపుకొని పోతున్న వర్తకుడు ఒకరు ఎదురయ్యాడు. కాలకల్పుడు అనే చోదకుడు ఆ బండి తోలుతున్నాడు. బండికి కట్టిన ముసలి ఎద్దు సరుకుల భారాన్ని లాగలేక లాగలేక భారంగా ముందుకు కదులుతోంది. 

కొద్దిసేపటికి అది బండిని మరి లాగలేక మొండికేసి ఆగిపోయింది.కదల్లేని మొండిఎద్దు తీరుకు కాలకల్పుడికి కోపం ముంచుకొచ్చి, దానిని కర్రతో బాదాడు. ముసలి ఎద్దు ఆ బాధ భరించలేక నేలమీద పడిపోయింది. బండి పక్కకు ఒరిగిపోయింది. బండి బరువు మీద నుంచి తొలగిపోవడంతో ఆ ఎద్దు విదిలించుకుని పైకిలేచి, తనను మళ్లీ కొట్టడానికి వస్తున్న కాలకల్పుడిని కసితీరా కొమ్ములతో పొడిచింది. కాలకల్పుడు ఆ పోటు భరించలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తగని బాధతో విలవిలలాడుతూ విలపించసాగాడు. 

సోమశేఖరుడు, విశాలాక్షి ఈ దృశ్యాన్ని చూసి విచలితులయ్యారు. కాలకల్పుడి దుస్థితికి వారు జాలిపడ్డారు. శ్రీహరిని పూజించి కలశంలో తీసుకువస్తున్న గంగాజలాన్ని సోమశేఖరుడు అతడి నోట్లో పోశాడు. అతడి శరీరంపై గంగాజలాన్ని చల్లి, తులసిదళాన్ని వేశాడు. తర్వాత సోమశేఖరుడు, విశాలాక్షి తమ దారిన తాము ముందుకు నడవసాగారు. కొంతసేపటికి కాలకల్పుడు అక్కడే ప్రాణాలు విడిచాడు.కాలకల్పుడిని విడిచిపెట్టి, సోమశేఖరుడు, విశాలాక్షి ముందుకు సాగుతుండగా, దారిలో వారికి కొందరు క్షతగాత్రులు కనిపించారు. 

కాళ్లు చేతులు విరిగిపోయి, నడవలేక, నెత్తురు కక్కుకుంటూ మూలుగుతూ అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నారు వారు. వారిని చూసి కలవరపడిన సోమశేఖరుడు, ‘అయ్యా! మీరంతా ఎవరు? ఎందుకిలా బాధపడుతున్నారు? ఎవరైనా మీ మీద దాడి చేశారా?’ అని ఆందోళనగా ప్రశ్నించాడు.‘విప్రోత్తమా! మేము యమదూతలం. మాకు, విష్ణుదూతలకు పెద్ద వాదం వచ్చింది. వారిని మేము ఎదిరించలేకపోయాం. వారు మమ్మల్ని ఇలా శిక్షించారు’ అని చెప్పారు.‘విష్ణుదూతలు మిమ్మల్ని ఎందుకు దండించారు?’ ప్రశ్నించాడు సోమశేఖరుడు.

‘ఒక వర్తకుడి సేవకుడు అయిన కాలకల్పుడి ప్రాణాలను కొనితెమ్మని మా ప్రభువు యమధర్మరాజు మమ్మల్ని ఆదేశించారు. జీవితాంతం అతడు చేసినవన్నీ పాపకార్యాలే! చివరిదశలో కూడా బండి లాగలేని ముసలి ఎద్దును నిర్దాక్షిణ్యంగా హింసించాడు. ఇదే సంగతిని మేము విష్ణుదూతలకు చెప్పాము. అతడి ప్రాణాలను కొనిపోతున్న మమ్మల్ని అడ్డుతొలగమన్నాం. వారు ఒప్పుకోలేదు. అందుకే వారితో వాదం జరిగి, యుద్ధంగా మారింది’ అని వివరించారు యమకింకరులు.

‘విష్ణుదూతలు ఎందుకు ఒప్పుకోలేదు?’ అడిగాడు సోమశేఖరుడు.‘ఇతడు పాపాత్ముడు కాదు, మహాపుణ్యాత్ముడు. ఎద్దు కుమ్మడంతో గాయపడి, అంత్యదశలో ఉన్నప్పుడు పవిత్ర గంగాజలాన్ని తులసిదళాలతో సేవించాడు. అంతేకాదు, ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో నారాయణ నామస్మరణాన్ని ఆలకించాడు. అంతటితో ఇతడి పాపాలన్నీ నశించాయి. ఇంక ఇతడికి పాపాలు ఎక్కడ ఉన్నట్లు? అందువల్ల మీరు ఇతడిని యమపురికి తీసుకుపోవడానికి వీల్లేదు’ అని చెప్పారు.‘మా యమధర్మరాజు ఆదేశాన్ని మేము పాటించాల్సిందే! అడ్డుతప్పుకోండి అని హెచ్చరించాం. వారు వినలేదు. మాతో పోరుకు దిగారు.

 ఇదిగో ఫలితం! విష్ణుదూతల చేతిలో చావుదెబ్బలు తిని మేమిలా మిగిలాం’ అని గద్గదస్వరంతో చెప్పారు యమకింకరులు. పవిత్ర గంగాజల మహిమను, తులసి మహాత్మ్యాన్ని, అంత్యకాలంలో హరినామస్మరణ వల్ల దక్కే ఫలితాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలిగినందుకు సోమశేఖరుడు, విశాలాక్షి సంతోషించారు. వారు మనసులోనే శ్రీహరికి వందనాలు సమర్పించారు.గంగాతీరం వెంబడి సాగుతూ, శ్రీహరి క్షేత్రాలను సందర్శించుకుని, శాస్త్రోక్తంగా పూజాదికాలు చేస్తూ కొన్నాళ్లకు వాళ్లు తీర్థయాత్రలను ముగించుకుని, సంతోషంగా ఇంటికి చేరుకున్నారు.
∙సాంఖ్యాయన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement