‘ఆపరేషన్‌ సిందూర్‌’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్‌ | Operation Sindoor: India Strikes Jaish-e-Mohammed's Stronghold in Pakistan | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌ సిందూర్‌’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్‌

Sep 16 2025 4:51 PM | Updated on Sep 16 2025 5:48 PM

masood azhar family torn apart over operation sindoor

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబం తునాతునకలైనట్లు పాకిస్తాన్‌ జైషే మహమ్మద్ కమాండర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.

తాజాగా, పాకిస్తాన్‌లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జైషే  కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు.  

ఉర్దూలో కాశ్మీరీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్‌పూర్‌లో భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు.  

జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో ఏప్రిల్‌ 22 మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో జరిపిన మెరుపుదాడులతో ఈ ఉగ్రసంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసింది. 

ఆపరేషన్‌ సిందూర్‌తో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. వారితో పాటు జైషే నెంబర్‌-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌, మౌలానా అమర్‌ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు బహవల్‌పూర్‌లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటిని పునర్‌నిర్మించుకునేందుకు పాక్‌ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించింది.

ఈ క్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌లో భారత బలగాలు పీవోకే, పాకిస్తాన్‌లో ఎంతటి బీభత్సం సృష్టించాయో జైషే  కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వివరించడం చర్చాంశనీయంగా మారింది. 

 

 

  

 

 

Advertisement
 
Advertisement
Advertisement