విజయ్ దివస్ 2025: పాక్‌ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి.. | History Of Indias 1971 War Victory Over Pakistan | Sakshi
Sakshi News home page

విజయ్ దివస్ 2025: పాక్‌ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి..

Dec 16 2025 11:00 AM | Updated on Dec 16 2025 11:27 AM

History Of Indias 1971 War Victory Over Pakistan

1971 డిసెంబర్ 16.. భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. సరిగ్గా 54 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత సైన్యం అద్భుతమైన వీరత్వాన్ని ప్రదర్శించి, 13 రోజుల ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాక్‌పై చారిత్రక విజయాన్ని సాధించింది. ఈ మహత్తర విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి  ఏటా డిసెంబర్ 16న యావత్ భారతదేశం  విజయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారత సైన్యం సాధించిన విజయం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సాయుధ దళాల ధైర్యసాహసాలను దేశంలోని ప్రజలు ఈ రోజున గుర్తుచేసుకుంటారు.

సైనిక అణచివేతపై పోరాటం..
1971 యుద్ధానికి మూలం తూర్పు పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభం. పశ్చిమ పాకిస్తానీ సైన్యం అక్కడ తీవ్రమైన సైనిక అణచివేతకు పాల్పడింది. తూర్పు పాకిస్తానీ పౌరులు హింసను ఎదుర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు భయంతో తమ ఇళ్లను విడిచిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, శరణార్థుల సంక్షోభం తీవ్రమవడంతో, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న తూర్పు పాకిస్థాన్ ప్రజలకు మద్దతుగా భారతదేశం రంగంలోకి దిగింది. ఈ  జోక్యం 1971 డిసెంబర్ 3 నాటికి సైనిక సంఘర్షణగా మారింది.

జనరల్ అమీర్ అబ్దుల్లా లొంగుబాటు
భారత సాయుధ దళాలు.. తూర్పు పాకిస్తాన్‌లోని ముక్తి బాహిని (విముక్తి దళాలు) సహకారంతో, సమిష్టిగా పనిచేస్తూ, పాకిస్తానీ సైన్యాన్ని నిర్ణయాత్మకంగా ఓడించాయి. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. 1971, డిసెంబర్ 16న పాకిస్తానీ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో భారత సైన్యం, ముక్తి బాహిని సంయుక్త దళాల ముందు లొంగిపోయారు. అలాగే సుమారు 93 వేల మంది పాకిస్తానీ సైనికులు తమ ఆయుధాలను వీడారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చూసిన అతిపెద్ద సైనిక లొంగుబాట్లలో ఒకటి. ఈ యుద్ధం తూర్పు పాకిస్థాన్‌కు విముక్తి కల్పించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది.

దేశం కోసం ప్రాణాలర్పించి..
ఈ అద్భుతమైన విజయం ప్రపంచంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసింది. అయితే ఈ గెలుపునకు భారత్‌ భారీ మూల్యం చెల్లించింది. దాదాపు 3,900 మంది భారతీయ సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. మరెందరో గాయపడ్డారు. విజయ్ దివస్ అనేది కేవలం విజయాన్ని జరుపుకోవడానికి మాత్రమే కాదు.. నాటి యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు నివాళులు అర్పించే రోజు ఇది. భారత సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం, సరిహద్దుల వద్ద మనలను రక్షించే సైనికులను గౌరవించాల్సిన అవసరాన్ని విజయ్‌ దివస్‌ గుర్తుచేస్తుంది. ఈ రోజును భారతదేశం అంతటా  దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో గల అమర్ జవాన్ జ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు.

నిరంతర స్ఫూర్తిదాయకం
భారత్-బంగ్లాదేశ్ చారిత్రక సంబంధాలను ప్రతిబింబించేలా 20 మంది సభ్యుల బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం భారతదేశంలో జరిగే విజయ్ దివస్ వేడుకలకు హాజరుకానుంది. ఈ బృందంలో 1971 యుద్ధ సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఎనిమిది మంది ముక్తిజోధాలు (విముక్తి యోధులు),  బంగ్లాదేశ్ సైనిక అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం యువ తరానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందించడం.  స్వాతంత్ర్యం అనేది ఒక బహుమతి అని, దానిని నిరంతరం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని ఈ రోజు పునరుద్ఘాటిస్తుంది. 

ఇది కూడా చదవండి: విజయ్ దివస్: యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement