పాక్‌తో క్రికెట్‌ ఆడితే బీజేపీకి నొప్పి లేదా?: కేటీఆర్‌ | KTR Criticse BJP Over India Pak Asia Cup Match | Sakshi
Sakshi News home page

పాక్‌తో క్రికెట్‌ ఆడితే బీజేపీకి నొప్పి లేదా?: కేటీఆర్‌

Sep 16 2025 12:00 PM | Updated on Sep 16 2025 1:01 PM

KTR Criticse BJP Over India Pak Asia Cup Match

భారత రాజ్యాంగమన్నా.. సుప్రీంకోర్టు అన్నా.. బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనం అంటూ మంగళవారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారాయన. 

వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్‌ఎస్‌ స్వాగతించడాన్ని బీజేపీ విమర్శిస్తోంది. మరి ఆ పార్టీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదు’’ అని ఆయన అన్నారు. బీజేపీది నకిలీ జాతీయవాదమన్న కేటీఆర్.. తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. 

కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే అసలైన దేశభక్తి. పహల్గాం దారుణ మారణకాండకు కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ ఆడించిన బీజేపీకి బీఆర్ఎస్ దేశభక్తి గురించి ప్రశ్నించే నైతిక అర్హత లేదు అని కేటీఆర్‌ మండిపడ్డారు. 

పాక్‌ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యం అన్నారు. పహల్గాం బాధిత కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లాది భారతీయులను మోదీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కేటీఆర్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement