
గౌహతి: మేఘాలయ హనీమూన్ కేసులో లెక్కలేనన్ని ట్విస్ట్లు బయటపడుతున్నాయి. భర్త రాజారఘువంశీ హత్యకు కుట్ర పన్నిన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు పోలీసుల ముందు మరో నిజాన్ని వెల్లడించారు. ఎప్పటి నుంచో తమ మధ్య సంబంధం ఉన్నదని వారు పోలీసుల సమక్షంలో అంగీకరించారని మేఘాలయ పోలీసులు తెలిపారు.
తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ మీడియాతో మాట్లాడుతూ తమ దర్యాప్తులో రాజ్, సోనమ్లు రిలేషన్షిప్లో ఉన్నట్లు అంగీకరించారని తెలిపారు. వారిద్దిరూ ఇప్పటికే నేరాన్ని అంగీకరించారని, తాము సీన్ రీకన్స్ట్రక్షన్ చేయగా, దానికి వారు సహకరిస్తూ, అన్ని ఆధారాలు చూపించారన్నారు. అందుకే సోనమ్కు ఇప్పుడు నార్కో టెస్టులు అవసరం లేదని భావిస్తున్నామని అన్నారు.
సాధారణంగా ఎటువంటి ఆధారాలు లభ్యం కానప్పుడే నార్కో పరీక్ష జరుగుతుందని, వాస్తవానికి సుప్రీంకోర్టు నార్కో విశ్లేషణను నిషేధించిందని వివేక్ సయీమ్ తెలిపారు. కేవలం వారి ఒప్పుకోలును మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, బలమైన సాక్ష్యాధారాలను సేకరించామన్నారు. చార్జిషీట్ను వీలైనంత త్వరగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రఘువంశీ హత్యకు డబ్బు ప్రధాన కారణం కాదని, వారి సంబంధానికి అతను అడ్డుకాకూడదని వారు భావించివుండవచ్చునన్నారు.
మేఘాలయ పోలీసులు తాజాగా ఇండోర్లోని ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్ను విచారణ కోసం రప్పిస్తున్నారు. సోనమ్ను అరెస్టు చేయడానికి ముందు ఆమె భర్తతో పాటు అతని ప్లాట్లో కొంతకాలం ఉన్నారు. కాగా సోనమ్ బ్యాగ్లో ఒక దేశీయ పిస్టల్, ఫోన్, రాజా రఘువంశీకి చెందిన నగలు, రూ ఐదు లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవి విచారణలో కీలకంగా మారనున్నాయని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ‘అది నాకు దక్కిన గౌరవం’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు