
వాషింగ్టన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిందని, ఇది తనకెంతో సంతృప్తినిచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ముందు, ఇరాన్లోని అన్ని అణు కేంద్రాలను ధ్వంసం చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా ట్రంప్ అభివర్ణించారు. ఆయన తన ట్రూత్ సోషల్లో ఇజ్రాయెల్ - ఇరాన్ రెండు దేశాలు వివాదం ముగియాలని ఒకేవిధంగా కోరుకున్నాయని పేర్కొన్నారు.
జూన్ 13న ఇజ్రాయెల్తో జతకట్టిన అమెరికా ఇరానియన్ అణుకేంద్రాలు, సైనిక స్థావరాలపై సమన్వయంతో కూడిన దాడులు చేసింది. అనంతరం ఇరాన్.. ఇజ్రాయెల్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. అంతకుముందు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్.. ఖతార్తో పాటు ఇరాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు తెగబడింది. అనంతర పరిణామాల మధ్య ఇరు దేశాలు తమ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి.
ఈ ప్రకటన దరిమిలా ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఏఎఫ్) టెహ్రాన్కు ఉత్తరాన ఉన్న ఇరానియన్ రాడార్ వ్యవస్థపై పరిమిత దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ నేపధ్యంలో అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య సంభాషణ జరిగిందని పేర్కొంది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో దాని పాత్రను కొనసాగిస్తే ఇజ్రాయెల్ యుద్ధ విరమణను గౌరవిస్తుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Jammu: దొంగకు చెప్పుల దండ.. పోలీసుల చర్యపై దర్యాప్తు