2198 కిలోమీటర్ల వేట! | Crime Story Of Fnday | Sakshi
Sakshi News home page

2198 కిలోమీటర్ల వేట!

Jun 22 2025 8:22 AM | Updated on Jun 22 2025 8:22 AM

Crime Story Of Fnday

హైదరాబాద్‌ పాతబస్తీలోని శాలిబండలో నివసించే రియల్టర్‌ ఖాదర్‌ ఖాద్రీ కుమారుడు ఉస్మాన్‌ ఖాద్రీ (10) 2009లో కిడ్నాప్‌ అయ్యాడు. బాలుడి తండ్రికి ఫోన్‌ చేసిన కిడ్నాపర్లు రూ.3 లక్షలు పౌండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిందితులను పట్టుకోవడానికి టాస్క్‌ఫోర్స్‌కు చెందిన అన్ని బృందాలు రంగంలోకి దిగాయి. ప్రధాన నిందితుడి కదలికలపై చిన్న ఆధారం లభించడంతో ఢిల్లీ వెళ్లిన పోలీసులు– అక్కడ నుంచి మొదలు పెట్టి గుజరాత్‌లోని భరూచ్‌ చెక్‌పోస్టు వరకు ఏకబిగిన 2,198 కిలోమీటర్లు వేటాడి పట్టుకున్నారు. 

శాలిబండకు చెందిన ఖాదర్‌ ఖాద్రీ, కామాటిపుర ప్రాంతానికి చెందిన ఖాజీ అనీసుద్దీన్‌ అలియాస్‌ అనీస్‌ భాగస్వాములుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ఖాదర్‌ తనను మోసం చేసి నష్టాలు మిగులుస్తున్నాడని భావించిన అనీస్‌ అతనిపై కక్ష కట్టాడు. ఖాదర్‌ ఇంట్లో కూడా తిరిగే చనువు ఉన్న అనీస్‌ అతని కుమారుడు సయ్యద్‌ ఉస్మాన్‌ మహ్మద్‌ ఖాద్రీని కిడ్నాప్‌ చేసి, డబ్బు వసూలు చేయాలని భావించాడు. దీనికోసం తన సోదరులు ఖాజా షంషుద్దీన్‌ అలియాస్‌ అక్రం, ఖాజీ హఫీజుద్దీన్‌ అలియాస్‌ అస్లంలతో కలిసి రంగంలోకి దిగాడు. 2009 మే 20న ఖాదర్‌ ఇంటికి వెళ్లిన అనీస్‌.. ఆ సమయంలో ఖాదర్‌ కుటుంబం ఖాజీపురకు వెళుతోందని తెలుసుకున్నాడు. వారి కంటే ముందే ఖాజీపుర చేరుకున్న అనీస్‌ అక్కడ కాపు కాశాడు.

ఆ ఇంటి వద్దకు చేరుకున్న ఉస్మాన్‌ను బైక్‌ రైడింగ్‌ పేరుతో అనీస్‌ బయటకు తీసుకువచ్చాడు. తన పల్సర్‌ వాహనంపై ఎక్కించుకుని బహదూర్‌పుర చేరుకున్న తర్వాత మారుతీ వ్యాన్‌ తీసుకురమ్మని తన సోదరుడైన అక్రమ్‌కు సందేశం ఇచ్చాడు. అతడు వచ్చాక ఇద్దరూ బాలుడిని వ్యానులోకి మార్చి శంషాబాద్‌ వైపు తీసుకువెళ్లారు. బాలుడు కనిపించట్లేదని భావించిన ఖాదర్‌ అదే రోజు రాత్రి శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఖాదర్‌కు లండన్‌ ఫోన్‌ నంబర్‌ కనిపించేలా ఇంటర్‌నెట్‌ ద్వారా కాల్‌ చేసిన అనీస్‌... ఉస్మాన్‌ను తామే కిడ్నాప్‌ చేశామని, రూ.3 లక్షల మొత్తాన్ని పౌండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఆ నెల 22 నుంచి మొదలైన ఈ ఫోన్లు 25 వరకు కొనసాగడంతో మిస్సింగ్‌ నుంచి కిడ్నాప్‌గా ఆ కేసు మారింది. 

ఓపక్క ఇలా ఫోన్లు చేస్తూనే అనీస్‌... ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి రెండు మూడు రోజుల పాటు ఉస్మాన్‌ కుటుంబంతో కలిసి బాలుడి కోసం గాలిస్తున్నట్లు నటించాడు. ఆపై హఠాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. నగరం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌ వెళ్లిన అనీస్‌ అక్కడ బోగస్‌ వివరాలతో రెండు సిమ్‌కార్డులు తీసుకుని ఢిల్లీ చేరుకున్నాడు. బాలుడి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ బృందం అనీస్‌ ఇంటిపై దాడి చేసి సోదాలు చేసింది. ఆమె సోదరి రహస్యంగా దాచి ఉంచిన ఈ సెల్‌ఫోన్‌ బయటపడింది. దీన్ని వినియోగించి ఆమె అనీస్‌తో సంప్రదింపులు జరుపుతోందని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అతడికి చెప్తోందని గుర్తించారు. మరికొందరిని విచారించగా, ఉస్మాన్‌ను మారుతీ వ్యాన్‌లో కిడ్నాప్‌ చేసినట్లు బయటపడింది. దీంతో అనీస్‌ బాలుడిని తీసుకుని సంచరిస్తున్నాడని భావించిన పోలీసులు అతడు వాడుతున్న సెల్‌ఫోన్‌ నంబర్‌ లోకేషన్‌ చూసి ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. 

ముగ్గు్గరు అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ బృందం హైదరాబాద్‌ నుంచి విమానంలో ఢిల్లీ చేరుకుంది. ఇలా వెళ్లిన అధికారులు సాధారణంగా అక్కడి ఏపీ భవన్‌లో బస చేసే వాళ్లు. ఈ టీమ్‌ను రిసీవ్‌ చేసుకుని, ఏపీ భవన్‌లో దింపడానికి వీరిలో ఓ అధికారి స్నేహితుడైన ట్రావెల్స్‌ యజమాని బల్బీర్‌ సింగ్‌ స్వయంగా వచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కేవలం 14 కి.మీ. ఉన్న ఏపీ భవన్‌లో దింపేసి, తన దైనందిన విధుల్లో నిమగ్నం అవ్వాలని ఆయన భావించారు. ఈ టీమ్‌ ఏపీ భవన్‌కు చేరుకునే లోపే హైదరాబాద్‌ నుంచి మరో అప్‌డేట్‌ అందింది. అనీస్‌ లోకేషన్‌ రాజస్థాన్‌లోని జైపూర్‌ అన్నది దాని సారాంశం. దీంతో బల్బీర్‌ సింగ్‌ వాహనంలోనే టాస్క్‌ఫోర్స్‌ బృందం జైపూర్‌ వెళ్లింది. అనీస్‌ లోకేషన్‌ అజ్మీర్‌ మీదుగా అహ్మదాబాద్‌ చేరుకోవడంతో పోలీసులూ అనుసరించాల్సి వచ్చింది. అనీస్‌ లోకేషన్‌ సూరత్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్టాండ్‌ వద్ద చూపిస్తుండటంతో పోలీసులు అక్కడకు చేరుకుని కాపు కాశారు. హఠాత్తుగా బయలుదేరిన అనీస్‌... వడోదరా వైపు వెళ్తున్నట్లు హైదరాబాద్‌లో ఉన్న అధికారులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి అక్కడి టీమ్‌కు సమాచారం ఇచ్చారు.

కేవలం ఏపీ భవన్‌ వరకే అనుకుని వచ్చిన బల్బీర్‌సింగ్‌ సైతం బాలుడిని రక్షించాలనే ఉద్దేశంతో తన వాహనంతో సహా పోలీసులతో కలిసి ప్రయాణించాడు. అహ్మదాబాద్‌–వడోదరా మధ్య 81.1 కిమీ పొడవునా ఓ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఉంది. దీనికి పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్డు ద్వారా అనీస్‌ ప్రయాణిస్తున్నట్లు అతడి సెల్‌ఫోన్‌ లోకేషన్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. తాము ఎక్స్‌ప్రెస్‌ హైవే మీదుగా వెళ్తే ముందే వడోదరా చేరుకుని కాపు కాయవచ్చని, అక్కడకు మారుతీ వ్యాన్‌లో వచ్చే అనీస్‌ను పట్టుకుని బాలుడిని రెస్క్యూ చేయవచ్చని భావించారు. దాదాపు 30 కి.మీ. ప్రయాణించిన తర్వాత అనీస్‌ లోకేషన్‌ మళ్లీ అహ్మదాబాద్‌ వచ్చినట్లు టీమ్‌కు తెలిసింది. వాహనం ఈ హైవేలో ఓసారి ప్రవేశించిన తర్వాత చివరి వరకు వెళ్లి తిరిగి రావాల్సిందే తప్ప ఎక్కడా యూటర్న్స్‌ ఉండవు. అంత సమయం లేకపోవడంతో అధికారులు డివైడర్‌కు అటు–ఇటు రాళ్లు పెట్టి వాటి మీదుగా, అత్యంత ప్రమాదకర రీతిలో యూ–టర్న్‌ తీసుకుని వెనక్కు వచ్చారు. అనీస్‌ వద్ద ఉన్న ఫోన్‌ స్విచాఫ్‌ కావడంతో అక్కడే వేచి చూస్తూ ఉండాల్సి వచ్చింది.

కొన్ని గంటల తర్వాత అనీస్‌ లోకేషన్‌ మళ్లీ వడోదరా వైపు హైవే మీద కదలడం మొదలుపెట్టింది. దీంతో అతడి దాంతో పాటు ఈ టీమ్‌ లైవ్‌ లోకేషన్లు ఒకేసారి చూసేలా ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. వీరి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఒకరి లోకేషన్‌ను మరొకరు నాలుగుసార్లు క్రాస్‌ చేసినట్లు బయటపడింది. అయితే తమ మార్గంలో తమకు ఎక్కడా మారుతీ వ్యాన్‌ తారసపడకపోవడంతో అనీస్‌ వేరే వాహనంలో ప్రయాణిస్తున్నట్లు గ్రహించారు. దీంతో ఆ మార్గం చివరలో ఉన్న భరూచ్‌ టోల్‌ప్లాజా వద్దకు వెళ్లి కాపు కాశారు. కొద్దిసేపటికి అహ్మదాబాద్‌లోని నీతా ట్రావెల్స్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ బస్సు రావడాన్ని గమనించి టోల్‌ప్లాజా సిబ్బంది సహకారంతో దాన్ని ఆపారు. అప్పటి వరకు పోలీసుల వద్ద అనీస్‌ ఫొటో కూడా లేదు. 

కేవలం గుర్తులు, లొకేషన్, వాహనం ఆధారంగానే గాలిస్తున్నారు. ఆ బస్సు లోపలకు వెళ్లిన ఒక అధికారి గుజరాత్‌ పోలీసుగా పరిచయం చేసుకుని, రొటీన్‌ చెకింగ్‌ మాదిరిగా ఒక్కో ప్యాసింజర్‌ వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు చూపాల్సిందిగా అడిగారు. ఈ అధికారి అనీస్‌ వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు అడగ్గా ‘మేరే పాస్‌ నయ్యే సాబ్‌’ అంటూ హైదరాబాదీ హిందీలో సమాధానం ఇచ్చాడు. దీంతో అతడే అనీస్‌ అని నిర్ధారించిన ఆ అధికారి ‘బహుత్‌ హోగయా... చల్‌ రే అనీస్‌’ అనడంతో తాను చిక్కినట్లు తెలుసుకున్న అతగాడు ‘చలో సాబ్‌’ అంటూ బస్సు దిగాడు. అక్కడే ఉన్న మిగిలిన ఇద్దరు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అతడిని చుట్టుముట్టి మిగిలిన నిందితులు, బాలుడి విషయం ప్రశ్నించగా..

వాళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నారని, తాను మాత్రం పోలీసుల దృష్టి మళ్లించడానికి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ ఫోన్లు చేసి డబ్బు డిమాండ్‌ చేస్తున్నానని సమాధానం ఇచ్చాడు. అనీస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భరూచ్‌ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు. అప్పటికి మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఏకబిగిన 1197 కి.మీ. ప్రయాణించినా, బాలుడిని సురక్షితంగా రక్షించాలనే ఉద్దేశంతో విశ్రాంతి విషయం మర్చిపోయి హైదరాబాద్‌కు పయనయమయ్యారు. టాస్క్‌ఫోర్స్‌ బృందంలో కేవలం ఒక్కరికే డ్రైవింగ్‌ వచ్చి ఉండటంతో ఆ అధికారితో పాటు బల్బీర్‌ సింగ్‌ డ్రైవ్‌ చేసుకుంటూ మరో 1001 కిమీ ప్రయాణించి మర్నాడు హైదరాబాద్‌ చేరుకున్నారు. అనీస్‌తో పాటు పోలీసులకు ఇక్కడ వదిలి ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. 

బాలుడి కిడ్నాప్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌. నిందితుడు అనీస్‌ తన చిన్నప్పటి ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసులను వాడుకున్నాడు. అదెలాగో వచ్చేవారం తరువాయి భాగంలో చదవండి.

∙శ్రీరంగం కామేష్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement