
డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్ శివారులోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. డ్వెయిల్ ప్రాంతంలోని మార్ ఎలియాస్ చర్చిలో పెద్ద సంఖ్యలో జనం ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడని మీడియా తెలిపింది. కనీసం 30 మంది చనిపోగా మరో 53 మంది గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపింది. బాధితుల్లో పలువురు చిన్నారులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది.
చర్చిలో జనం మధ్యకు చేరుకున్న ఓ వ్యక్తి ముందుగా తుపాకీతో కాల్పులు జరిపి, అనంతరం పేల్చేసుకున్నట్లు ఓ వీడియో వైరలవుతోంది. కాగా, మృతులు, క్షతగాత్రుల కచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. చర్చిల్లో దాడులు జరగడం సిరియాలో ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సిరియాలో బషర్ అస్సద్ పాలన అంతమయ్యాక పగ్గాలు చేపట్టిన అహ్మద్ అల్ షరా యంత్రాంగంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో ఘటన చోటుచేసుకుంది.
ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఓ ఉగ్రవాది తొలుత చర్చిలో ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపాడని, అనంతరం తనను తాను పేల్చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ సిరియా అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ దాడిని సిరియా సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి హమ్జా మొస్తాఫా ఖండించారు. దీనిని పిరికిపంద దాడిగా అభివర్ణించారు. దుండగుడు తొలుత చర్చిలో గ్రెనేడ్ విసిరేసినట్లు చర్చి బిషప్ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని తాను చూశానని, అతనివెంట మరో ఇద్దరు సైతం వచ్చారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దుండగుడు తొలుత కాల్పులు ప్రారంభించి, అనంతరం చర్చిలోకి దూసుకెళ్లి తనను తాను పేల్చివేసుకున్నట్లు పేర్కొన్నాడు.