మయూరధ్వజుడు | Story Of Mayuura Dhvaja | Sakshi
Sakshi News home page

మయూరధ్వజుడు

May 4 2025 7:28 AM | Updated on May 4 2025 7:28 AM

Story Of Mayuura Dhvaja

ధర్మరాజు అశ్వమేధయాగం చేపట్టి, యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే, వారు చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే! మయూరధ్వజుడు అనే రాజు యాగాశ్వాన్ని బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు మయూరధ్వజుడి రాజధానికి వెళ్లారు. యాగాశ్వాన్ని విడిచిపెట్టడమో, యుద్ధానికి సిద్ధం కావడమో తేల్చుకోమన్నారు. మయూరధ్వజుడు యుద్ధానికే సిద్ధపడ్డాడు.
యుద్ధం మొదలవడానికి ముందు శ్రీకృష్ణుడు ‘అర్జునా! మయూరధ్వజుడు నా భక్తాగ్రేసరుడు. అతడితో యుద్ధం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు’ అని చెప్పాడు. యుద్ధం మొదలైంది. 

మయూరధ్వజుడి ధాటికి అర్జునుడు నిలవలేకపోయాడు. కృష్ణుడి సాయం కోరాడు. కృష్ణుడు కూడా యుద్ధంలోకి దిగాడు. తన ఆరాధ్యదైవంతో యుద్ధం చేయడం మయూరధ్వజుడికి ఇష్టంలేదు. అలాగని రణరంగం నుంచి వెనుదిరగడం క్షాత్రధర్మం కాదు. మయూరధ్వజుడు మనసులో కృష్ణనామ జపం కొనసాగిస్తూనే, శరపరంపర కురిపించసాగాడు. అతడి బాణాల దెబ్బకు కృష్ణుడు కూడా చలించాడు. అది గమనించిన అర్జునుడు, ‘బావా! ఎందుకు సంకోచిస్తావు. నీ చక్రాయుధంతో వాడి తల నరుకు’ అన్నాడు.‘అర్జునా! నీ గాండీవమైనా, నా సుదర్శనమైనా ఆ మహాభక్తుడి మీద పనిచేయవు’ అని పలికాడు కృష్ణుడు.

‘అంతటి మహాభక్తుడా!’ ఆశ్చర్యంగా అడిగాడు అర్జునుడు. కృష్ణభక్తులలో తానే గొప్పవాడిననే గర్వం అర్జునుడిలో ఉంది. మయూరధ్వజుడి గురించి స్వయంగా కృష్ణుడే అంతలా చెబుతుండటంతో అతడు ఆశ్చర్యపోయాడు. పొద్దువాలడంతో ఆనాటికి యుద్ధం చాలించారు.మయూరధ్వజుడి భక్తి ఎంతటిదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు కృష్ణుడు. మరునాటి వేకువజామునే కృష్ణార్జునులు బ్రాహ్మణవేషాలు ధరించి, మయూరధ్వజుడి రాజప్రాసాదానికి చేరుకున్నారు.మయూరధ్వజుడు వారికి ఎదురేగి, ఆహ్వానం పలికాడు. ‘విప్రులారా! నా ఆతిథ్యం స్వీకరించి, నన్ను ఆశీర్వదించండి’ అని అభ్యర్థించాడు.‘రాజా! నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకు పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరేంత వరకు మేము మరొక విషయాన్ని గురించి ఆలోచించలేము’ అని చెప్పారు వారు.

‘స్వామీ! మీకు వచ్చిన విపత్తేమిటి? అవసరమైతే నా ప్రాణమైనా ధారపోసి మీ విపత్తను తొలగిస్తాను’ అన్నాడు మయూరధ్వజుడు.
‘రాజా! మేము అడవి దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పులి నా కుమారుణ్ణి పట్టుకుంది. అది వాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత, ‘మయూరధ్వజ మహారాజు శరీరంలోని సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే, నీ బిడ్డ బతుకుతాడు’ అని అశరీరవాణి పలికింది. అందువల్ల పుత్రభిక్ష కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను’ అన్నాడు విప్రవేషంలోని శ్రీకృష్ణుడు.‘ఆహా! నా జన్మ చరితార్థమైంది. ఒక పసిబాలుడి ప్రాణం కాపాడటానికి నా శరీరం ఉపయోగపడుతోంది. ఇంతకంటే నాకేం కావాలి! సంకోచించకుండా నా శరీరంలోని సగభాగాన్ని తీసుకువెళ్లి ఆ పులికి ఆహారంగా ఇవ్వండి’ అని పలికి, తన శరీరాన్ని రెండు సమభాగాలుగా కోయమని తన భార్యాబిడ్డలను ఆదేశించాడు.

వారు కంటతడి పెట్టుకుంటూనే మయూరధ్వజుడిని రంపంతో నిలువునా తరగడం మొదలుపెట్టారు. విప్రవేషాల్లో ఉన్న కృష్ణార్జునులు నిశ్చేష్టులై, ఆ దృశ్యాన్ని తిలకించసాగారు. అలా చూస్తుండగా, ఒక వింత కనిపించింది. మయూరధ్వజుడి ఎడమకంటి నుంచి కన్నీరు కారసాగింది.అప్పుడు కృష్ణుడు ‘రాజా! ఏదైనా మనస్పూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. నువ్వలా బాధపడుతూ, కన్నీరు చిందిస్తూ నీ శరీరాన్ని నాకు ఇవ్వనక్కర్లేదు. నీకు ఇష్టంలేని పని చేయవద్దులే!’ అని తెచ్చిపెట్టుకున్న కాఠిన్యంతో పలికాడు కృష్ణుడు. వెంటనే అక్కడి నుంచి వెనుదిరగబోయాడు.మయూరధ్వజుడు వెంటనే కృష్ణుడి చేతులు పట్టుకుని, ‘అయ్యా! నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నందుకు నాకు ఎలాంటి బాధలేదు. నాకు నిజంగా బాధ ఉంటే, నా రెండుకళ్లూ కన్నీరు కార్చాలి కదా! నా ఎడమ కంటి నుంచి మాత్రమే కన్నీరు వస్తోంది. 

నా శరీరంలోని కుడిభాగానికి దక్కిన అదృష్టం తనకు దక్కలేదని, ఒంటరిగా మిగిలిపోయిన తాను ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకుండానే ఖిలమైపోతానని ఎడమభాగం బాధపడుతుండటమే అందుకు కారణం. మీరు నిశ్చింతగా నా శరీరంలోని అర్ధభాగాన్ని తీసుకువెళ్లవచ్చు’ అని పలికాడు.కృష్ణుడు సాభిప్రాయంగా అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. తనకు గర్వభంగం కలిగించడానికే జగన్నాటక సూత్రధారి అయిన  కృష్ణ పరమాత్ముడు ఈ లీలావినోదాన్ని కల్పించాడని గ్రహించి, సిగ్గుపడ్డాడు.వెంటనే, కృష్ణార్జునులు నిజరూపాలతో మయూరధ్వజుడికి దర్శనమిచ్చారు.మయూరధ్వజుడి శరీరానికి తిరిగి పూర్వస్థితి కలిగించాడు కృష్ణుడు.ఆరాధ్యదైవం కళ్లెదుట కనిపించడంతో మయూరధ్వజుడు పారవశ్యంతో సాష్టాంగపడ్డాడు. యాగాశ్వాన్ని అర్జునుడికి అప్పగించాడు.
∙సాంఖ్యాయన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement