
పోలీసు ఇంటరాగేషన్ ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలిసిందే! థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, నిందితులను కొట్టడం, వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం వంటివి కూడా తెలిసిందే! హైదరాబాద్ గోకుల్చాట్, లుంబినీపార్క్ పేలుళ్లు జరిగాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిక్) అధికారులు ఒక పేలుడు పదార్థాల తయారీ కంపెనీ యజమానికి రొటీన్కు భిన్నంగా ఇంటరాగేట్ చేశారు. పోలీసు రికార్డులకెక్కని ఈ ఉదంతంతో సంబంధం ఉన్నవారి పేర్లు గోప్యంగా ఉంచడం అనివార్యం.
హైదరాబాద్ మక్కామసీదులో 2007 మే 18 మధ్యాహ్నం బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనలను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి పేలింది. మరోదాన్ని పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనలో 11 మంది మరణించారు, 19మంది గాయపడ్డారు. దీనిపై హుస్సేనీ ఆలం పోలీస్స్టేషన్లో నమోదైన ఈ కేసు హైదరాబాద్ సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి, తర్వాత సీబీఐకి బదిలీ అయింది. ఈ పేలుడు కోసం గ్రెనేడ్స్ డిజైన్లో పోతపోసి ప్రత్యేకంగా తయారు చేసిన షెల్స్ను వినియోగించారు. ఇందులో నింపిన పేలుడు పదార్థం ఆర్డీఎక్స్గా తేలింది.
అదే ఏడాది ఆగస్టు 25 సాయంత్రం కోఠీలోని గోకుల్చాట్, లుంబినీపార్కు లేజేరియంలో రెండు బాంబులు పేలాయి. దిల్సుఖ్నగర్లోని వెంకటాద్రి థియేటర్ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి సమీపం నుంచి పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పేలుళ్లలో 42 మంది మరణించగా, 68 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు చెక్కపెట్టెలో అమోనియం నైట్రేట్ స్లర్రీని నింపి పేల్చినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ఈ పేలుళ్లకు, పేలని బాంబులకు సంబంధించి సుల్తాన్బజార్, సైఫాబాద్, మలక్పేట పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు కొన్నాళ్లకు జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) బదిలీ అయ్యాయి. ఈలోగా ఈ కేసుల దర్యాప్తుకు హైదరాబాద్ పోలీసులు ‘సిక్’ ఏర్పాటు చేశారు.
‘సిక్’ అధికారులు వివిధ కోణాలను విశ్లేషిస్తూ ముందుకు వెళ్లారు. మక్కా మసీదులో పేలిన బాంబులో ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ వినియోగించారు. అది కేవలం పాకిస్తాన్ నుంచి సరఫరా కావడానికి, రక్షణ శాఖ నుంచి అక్రమంగా బయటకు రావడానికి మాత్రమే అవకాశం ఉండటంతో ఆర్డీఎక్స్ సరఫరాలో స్థానిక సహకారం ఉంటుందని పోలీసులు అనుమానించలేదు. అయితే, జంట పేలుళ్లకు వినియోగించిన బాంబులు అమోనియం నైట్రేట్తో తయారు చేసినవి కావడంతో ‘సిక్’ అప్రమత్తమైంది. క్వారీల్లోను, నిర్మాణరంగంలోను వినియోగించడానికి అమోనియం నైట్రేట్ తయారు చేసే కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. గతంలో మావోయిస్టులు సైతం విధ్వంసాల కోసం దీనినే వాడారు. అందువల్ల అమోనియం నైట్రేట్ సరఫరాలో ‘సిక్’ అధికారులు స్థానికుల పాత్రను అనుమానించారు.
ఈ కేసుల దర్యాప్తులో వందల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. కొందరిని ప్రశ్నించి విడిచిపెట్టగా, మరికొందరిని లోతుగా ఇంటరాగేట్ చేశారు. ఇందులో అనేకం అక్రమ నిర్బంధాలు కావడంతో, ఇలా కస్టడీలోకి తీసుకున్న వారిని రహస్య ప్రదేశాల్లో ఉంచి విచారించారు. రహస్య విచారణ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్హౌస్లు, గెస్ట్ హౌస్లు, ఖాయిలా పరిశ్రమలు, మూతపడిన కంపెనీలను వినియోగించారు. అప్పట్లో అలా వినియోగించిన ఓ కంపెనీ హైదరాబాద్కు దక్షిణ దిక్కులో ఉంది. నగర శివార్లలో ఉంటూ, శివారు జిల్లాలో అమోనియం నైట్రేట్ స్లర్రీ తయారీ కంపెనీ నిర్వహిస్తున్న ఒక బడా వ్యాపారి అప్పట్లో ‘సిక్’ విచారణ ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. ఆయన వయసు, ప్రొఫైల్ తదితరాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు రొటీన్ కు భిన్నంగా, ఏమాత్రం హింసకు తావు లేకుండా అతడి నోరు విప్పించాలని భావించారు.
ఓ రోజు ఉదయం ఆ వ్యాపారి ఇంటికి వెళ్లిన సిక్ బృందం, అతణ్ణి అదుపులోకి తీసుకుని, దక్షిణాన ఉన్న కంపెనీకి తీసుకువచ్చింది. అక్కడ ఒక గదిలో నిర్బంధించింది. దాదాపు 15 రోజుల పాటు ఇలా ఉంచినా, కనీసం ఒక్కరోజు కూడా ఏ పోలీసూ అతనితో మాట్లాడలేదు. ఈ పక్షంరోజుల్లో రెండుసార్లు మాత్రమే బ్రష్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కోటీశ్వరుడైన ఆ వ్యాపారిని అన్ని రోజులు స్నానం చేయనీయలేదు. ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం నుంచి ఒక గార్డును ఏర్పాటు చేశారు. అతడితో మాట్లాడకూడదని సిక్ అధికారులు నిర్ణయించుకున్నారు. గార్డులకూ ఇదే ఆదేశాలు జారీ చేశారు. ఒకటి రెండు రోజుల తర్వాత గార్డుకు అతనితో పరిచయం ఏర్పడి, మాట్లాడే అవకాశం ఉంటుందని అధికారులు అనుమానించారు.
దీంతో ప్రతి రోజూ అక్కడ పనిచేసే గార్డును మార్చేవారు. కేవలం ఆహారం అందించడం, కాలకృత్యాలకు తీసుకువెళ్లడమే అతడి డ్యూటీ. ఇలా ఈ ‘ఇంటరాగేషన్ ’ నాలుగు రోజులు సాగిన తర్వాత ఆ వ్యాపారి పోలీసులను బతిమాలుకోవడం మొదలెట్టాడు. ఎవరైనా వచ్చి తనతో మాట్లాడాలని, ఏవైనా ప్రశ్నలు అడగాలని, అవసరమైతే కొట్టాలని వేడుకున్నాడు. ఈ మౌనం కంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించినా తట్టుకోగలనంటూ నెత్తినోరు బాదుకున్నాడు. అతడు ఉన్న గది నుంచి ఆ కంపెనీ వెనుక వైపు కొండపై ఉన్న ఓ చిన్న దేవాలయం కనిపిస్తుండేది. శారీరక, మానసిక వైకల్యం లేకుండా అక్కడ నుంచి బయటకు వస్తే ఆ దేవాలయాన్ని పెద్దగా కడతానంటూ దాన్ని చూస్తూ మొక్కుకునే వాడు.
ఒక దశలో తనంతట తానే పెద్దగా అరుస్తూ, గతంలో మావోయిస్టుల నుంచి బెదిరింపులు రావడంతో తప్పనిసరై వారికి అమోనియం నైట్రేట్ అక్రమంగా సరఫరా చేశానని, ఈ పేలుడుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మొత్తుకున్నాడు. ఇలా పక్షం రోజుల తర్వాత సదరు వ్యాపారి ఆ కంపెనీ నుంచి, సిక్ కస్టడీ నుంచి బయటకు రాగలిగాడు. నెల రోజులకే తాను మొక్కుకున్నట్లు ఆ దేవాలయం అభివృద్ధి పనులు ప్రారంభించాడు.
ఈ జంట పేలుళ్ల కేసుల్ని దర్యాప్తు చేసిన ఎన్ ఐఏ అధికారులు పేలుడు పదార్థమైన స్లర్రీ కర్ణాటకలో ఉగ్రవాదులకు అందినట్లు తేల్చారు. అక్కడే బాంబుల్ని తయారు చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది రియాజ్ భత్కల్ బస్సులో ఇక్కడకు పంపినట్లు నిర్ధారించారు. ఈ విధ్వంసానికి సూత్రధారులైన రియాజ్ భత్కల్, అమీర్ రజా ఖాన్ ఇప్పటికీ పరారీలోనే ఉండగా, మిగిలిన నిందితులకు 2018లో న్యాయస్థానం శిక్ష విధించింది.