చీటింగ్‌ కేసులో శ్రవణ్‌రావు విచారణ | Phone tapping accused Shravan Kumar Rao Interrogation | Sakshi
Sakshi News home page

చీటింగ్‌ కేసులో శ్రవణ్‌రావు విచారణ

May 24 2025 12:34 AM | Updated on May 24 2025 12:34 AM

Phone tapping accused Shravan Kumar Rao Interrogation

రూ.6.5 కోట్ల మోసం కేసులో ఒక రోజు సీసీఎస్‌ కస్టడీ 

మూడు గంటలపాటు విచారించిన పోలీసులు 

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ఓ చీటింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మీడియా సంస్థ యజమాని ఎ.శ్రవణ్‌ కుమార్‌ రావును సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇనుప ఖనిజం వ్యాపారం డీల్‌ ఇప్పిస్తానంటూ శ్రవణ్‌రావు మోసం చేశాడని అఖండ ఇన్‌ఫ్రాటెక్‌ ఇండియా సంస్థ ఎండీ ఎ.ఆకర్‌‡్ష కృష్ణ ఫిర్యాదు చేయటంతో ఈ కేసు నమోదైంది. ఈ నెల 13న శ్రవణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక రోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించడంతో శుక్రవారం విచారించారు. ఏ ప్రశ్నకు అతడి నుంచి సరైన సమాధానం రాలేదని, ప్రతి ఆరోపణను ఖండించాడని అధికారులు తెలిపారు.  

రూ.6.5 కోట్ల మోసం: శ్రవణ్‌రావు రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇన్రిధమ్‌ ఎనర్జీ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న శ్రవణ్‌రావు 2022 జూన్‌లో ఆకర్‌్షను సంప్రదించాడు. కర్ణాటకలోని సాండూర్‌లో ఉన్న ఎకోర్‌ ఇండస్ట్రీస్‌ బాధ్యతల్ని తాను స్వీకరించినట్లు చెప్పాడు. ఇనుప ఖనిజం వ్యాపారంలో ఉన్న తమకు నిధులు సమకూరిస్తే ప్రతి టన్నుకు రూ.300 చొప్పున లాభం ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అఖండ సంస్థ 2022 నవంబర్‌ నుంచి 2023 డిసెంబర్‌ వరకు పలు దఫాలుగా ఎకోర్‌ సంస్థ ఖాతాల్లోకి రూ.6.5 కోట్లు బదిలీ చేసింది.

ఈ చెల్లింపులకు సంబంధించి ఎకోర్‌ సంస్థ నుంచి తమకు ఎలాంటి ఇన్వాయిస్‌లు అందలేదని ఆకర్‌‡్ష తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023 నాటికి సంబంధిత వ్యక్తులకు రూ.7 కోట్ల విలువైన ఇనుప ఖనిజం సరఫరా జరగాల్సి ఉండగా.. అది రాకపోవటంతో ఆకర్‌‡్షకు అనుమానం వచ్చి ఆరా తీశారు. తమ సంస్థ బదిలీ చేసిన నిధుల్ని శ్రవణ్‌రావు వేరే అవసరాలకు మళ్లించినట్లు గుర్తించారు. దీనిపై ఎన్నిసార్లు ప్రశ్నించినా శ్రవణ్‌రావు నుంచి సరైన సమాధానం రాలేకపోవటంతో సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. శ్రవణ్‌రావును దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించిన అనంతరం తిరిగి జైలుకు తరలించారు. ఈ కేసులో శ్రవణ్‌రావుతో పాటు ఆయన భార్య ఎ.స్వాతిరావు, వ్యాపార భాగస్వామి కేబీ వేదమూర్తి, ఎకోర్‌ ఇండస్ట్రీస్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ ఉమా మహేశ్వర్‌రెడ్డి నిందితులుగా ఉన్నారు.     

Advertisement
 
Advertisement
Advertisement