
ఇప్పటికీ సందర్శకులను అనుమతించని పరిస్థితి
మ్యూజియం ఏర్పాటుకు చర్యలు శూన్యం
పెండింగ్ పనులను ప్రభుత్వం పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: అది ప్రత్యేక రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారక జ్యోతి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చారిత్రక కట్టడాన్ని ఆవిష్కరించి రెండేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు సందర్శకులకు అనుమతి లేకుండాపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా దీనిని ప్రారంభించింది. అమరుల మ్యూజియంతో పాటు మరికొన్ని పనులు వాయిదా పడ్డాయి. అలా పెండింగ్ జాబితాలో పడిపోయిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఫలితంగా సందర్శకులు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు. కానీ.. తెలంగాణ అమరుల స్మారకానికి మాత్రం ఇంకా తుది మెరుగులే దిద్దలేదు. సందర్శకులను అనుమతించడం లేదు.
ఆ దిశగా అడుగు పడలేదు..
ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు నెక్లెస్ రోడ్డుకు వస్తుంటారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో వేలాది మంది ట్యాంక్బండ్, లుంబిని పార్కు, ఎనీ్టఆర్ పార్కు, అంబేద్కర్ విగ్రహం వంటి ప్రాంతాలను సందర్శిస్తాను. వీటితో పాటు అమరుల స్మారకాన్ని బయటి నుంచి వీక్షించాల్సిందే. కానీ.. ప్రాంగణంలోకి వెళ్లేందుకు అవకాశం లేదు. తొలి, మలి దశ ఉద్యమాల్లో అమరులైన వందలాది మంది జీవితాలను సమున్నతంగా ఎత్తిపట్టేలా మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. తెలంగాణ ఉద్యమాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను కూడా ఈ మ్యూజియంలో ప్రదర్శించేందుకు ప్రత్యేకమైన హాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలపై ప్రత్యేకంగా ఒక గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటి వరకు ఈ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు.
అలంకారప్రాయంగా జ్యోతి..
హుస్సేన్సాగర్ తీరాన లుంబిని పార్కును ఆనుకొని సుమారు 3.2 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే అపురూపమైన కళాఖండంగా నిలిచింది. ఎలాంటి అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో దీని నిర్మాణం చేపట్టారు. దుబాయ్లో ఎంతో పేరొందిన ఫ్యూచర్ మ్యూజియానికి వినియోగించిన స్టీల్కు అతుకులు ఉన్నాయి. కానీ ఈ స్మారకానికి మాత్రం ఎలాంటి అతుకులు లేకపోవడం విశేషం. 85000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.131 కోట్లతో గత ప్రభుత్వం దీన్ని నిర్మించింది. సందర్శకులు భవనంపై ఉన్న స్మారకజ్యోతి వరకు వెళ్లేందుకు అవకాశం ఉంది. అక్కడే ఒక రెస్టరెంట్ను ఏర్పాటు చేయాలని భావించారు.
ఇక భవనం రెండంతస్తుల్లో.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, వీరోచిత పోరాట గాథలను స్మరించుకునేలా గ్రౌండ్ఫ్లోర్లో చిత్రపటాలు, చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేయాలని భావించారు. ప్రేక్షకులు వీక్షించేందుకు లేదా విని తెలుసుకొనేందుకు వీలుగా ఆడియో, వీడియో హాళ్లు, గ్యాలరీలను కూడా గ్రౌండ్ఫ్లోర్లోనే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. మ్యూజియంలో అక్కడక్కడా కియోస్్కలు, టచ్్రస్కీన్లను ఏర్పాటు చేసి వాటిద్వారా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రను, విశేషాలను భవిష్యత్తరాలకు తెలియజేయాలని ప్రతిపాదించారు. పై అంతస్తులో కనీసం 600 మంది కూర్చొనేందుకు వీలైన కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. సాహిత్య సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనువైన హాల్ ఇది. ఆర్ట్ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయవచ్చు. కాగా.. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీంతో స్మారక జ్యోతి అలంకారప్రాయంగానే ఉండిపోయింది.
అంబేడ్కర్ మ్యూజియం తరహాలో ఏర్పాటు చేస్తే మేలు..
ప్రస్తుతం అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద పార్లమెంట్ ఆకృతిలో ఉన్న వేదిక భవనంలో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇదే తరహాలో తెలంగాణ అమరుల స్మారకం వద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తే తక్కువ వ్యవధిలోనే సందర్శకులను అనుమతించేందుకు అవకాశం లభిస్తుంది. మరోవైపు ప్రభుత్వ సంస్థలకు ఆ బాధ్యతలను అప్పగించకుండా తెలంగాణ అమరుల స్మారకజ్యోతి, మ్యూజియం నిర్వహణకు స్వతంత్రంగా పని చేసే ఒక సొసైటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ప్రతిపాదిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమరుల త్యాగాలను, జ్ఞాపకాలను భావితరాలకు అందజేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.