హేమ కమిటీ రిపోర్టుపై సిట్‌ సంచలన నిర్ణయం | SIT Say Hema Committee report cases closed | Sakshi
Sakshi News home page

హేమ కమిటీ రిపోర్టుపై సిట్‌ సంచలన నిర్ణయం

Jun 26 2025 12:29 PM | Updated on Jun 26 2025 12:39 PM

SIT Say Hema Committee report cases closed

తిరువనంతపురం: కేరళలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయమై సిట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ ఆధారంగా నమోదైన 35 కేసులను మూసి వేస్తున్నట్లు సిట్‌ తాజాగా కేరళ హైకోర్టుకు తెలిపింది. అయితే, ఆ కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు బాధితులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిని క్లోజ్‌ చేస్తున్నట్టు సిట్‌ స్పష్టం చేసింది.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జస్టిస్‌ హేమా కమిటీ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  రిపోర్ట్‌  దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఏర్పాటైంది. అనంతరం, సిట్‌.. ఆయా కేసులఫై దర్యాప్తు చేపట్టినప్పటికీ బాధితులు ఎవరూ వాంగ్మూలం ఇచ్చేందుకు మాత్రం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసులన్నింటినీ మూసివేస్తున్నామని న్యాయస్థానానికి తెలియజేసింది. దీంతో, సిట్‌ నివేదికపై దర్యాప్తు జరిపిన న్యాయస్థానం.. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. ఆయా కేసులను మూసివేయమని ఆదేశించింది.

కమిటీ సంచలన నివేదిక..
ఇదిలా ఉండగా.. మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. ‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు... చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్‌ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది. రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్‌ హేమ.

ఇదీ నేపథ్యం..
దాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్‌ దిలీప్‌ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్‌ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్‌ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు.

విచారణ ముగించిన కమిషన్‌ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌’ యాక్ట్‌ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు.

ఎదురు ప్రశ్నించకూడదు..
‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్‌ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్‌ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్‌ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్‌ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది.

అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్‌ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్‌ చేస్తే ‘ఫేవర్‌’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.

ఆ 15 మంది..
కొంతమంది హీరోలు.. మరికొంతమంది దర్శకులు.. ఇంకొందరు నిర్మాతలు.. ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement