
‘‘సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు, మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావొచ్చు.’’ అంటూ కొద్దిసెకన్లపాటే వచ్చి వాయిస్ వాడేవాళ్లను ఎంత ఇరిటేట్ చేసిందో తెలియంది కాదు. అయితే ఇకపై ఆ గొంతు వినపించదు. అవును..
న్యూఢిల్లీ: సైబర్ క్రైమ్ అవగాహన కాలర్ ట్యూన్ను నేటి నుంచి (జూన్ 26, 2025) అధికారికంగా ఆపేశారు. అటు హిందీ భాషలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్తో వినిపించిన సందేశాన్ని రావడం లేదు. ప్రజలను సైబర్ మోసాల గురించి హెచ్చరించేందుకు ప్రతి ఫోన్ కాల్కు ముందు ఈ సందేశం వినిపించేది. ఈ కాలర్ ట్యూన్ కేంద్ర ప్రభుత్వ అవగాహన కార్యక్రమంలో భాగంగా రూపొందించబడింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేవలం మూడు నెలల కాలపరిమితితో ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్లో టెలికామ్ కంపెనీలు భాగం అయ్యాయి. ఆయా భాషల్లో పలువురితో డబ్బింగ్ చెప్పించి.. వాయిస్ మెసేజ్లను వదిలాయి. అలా.. అన్ని భాషల్లో రోజులో 8 నుంచి 10 సార్లు వాయిస్ వినిపించాయి. తెలుగులో మిర్చి అమృత వాయిస్ ఇచ్చినట్లు ఆ మధ్య ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటుడి వాయిస్ను ఈ క్యాంపెయిన్లో భాగం చేశారు.
అయితే.. అత్యవసర పరిస్థితుల్లో కాల్ ఆలస్యం అవుతోంది అనే కారణంతో చాలా మంది వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి కూడా. మరోవైపు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు కూడా అమితాబ్ బచ్చన్ గురయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రభుత్వం చెప్పిందే చేశానని, ఏమైనా చెప్పదల్చుకుంటే సర్కార్కే చెప్పాలంటూ బచ్చన్ సాబ్ అసహనం వ్యక్తం చేశారు. ఈలోపే ప్రభుత్వం ఆ క్యాంపెయిన్ను ముగించడం గమనార్హం. అంతకు ముందు.. కరోనా కాలర్ ట్యూన్ విషయంలోనూ బిగ్బీపై ఇలాంటి విమర్శలే వచ్చాయి.