ముమ్మాటికీ యజమాని బాధ్యతే  | Railways Not Liable For Short Delivery Of Owners Risk | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ యజమాని బాధ్యతే 

Jul 18 2026 1:01 AM | Updated on Jul 18 2026 1:01 AM

Railways Not Liable For Short Delivery Of Owners Risk

‘ఓనర్‌ రిస్క్ ’ పేరుతో బుక్‌ చేసే సరుకుపై రైల్వేలకు బాధ్యత లేదు 

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ:ఓనర్‌ రిస్క్ ‘(యజమాని బాధ్యత) విధానంలో బుక్‌ చేసిన సరుకులో కొరత ఏర్పడినా, రైల్వే అధికారులు ముందుగా ఆ సరుకును లెక్కించకపోయినా, తూకం వేయకపోయినా అందుకు ఆ శాఖను బాధ్యునిగా చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరుకు పరిమాణాన్ని రైల్వే సిబ్బంది ధ్రువీకరించినప్పుడు మాత్రమే ఆ బాధ్యత వారిపై ఉంటుందని తేల్చిచెప్పింది. 

జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ విపుల్‌ ఎం. పంచోలీల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. గుజరాత్‌ నుంచి అసోంకు రవాణా చేసిన ఉప్పు బస్తాల్లో కొరత ఏర్పడిందంటూ పరిహారం కోరిన ఎం/ఎస్‌ బజాజ్‌ ట్రేడింగ్‌ కంపెనీ వేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో రైల్వే క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్, గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పులను సమర్థించింది. 

ఏమిటీ కేసు? 
2009 నవంబర్‌లో గుజరాత్‌లోని చిరాయ్‌ జంక్షన్‌ నుంచి అసోంలోని ధర్మనగర్‌కు 40,444 ఉప్పు బస్తాలను రైల్వే ద్వారా రవాణా చేశారు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత 38,702 బస్తాలు మాత్రమే తమకు అందాయని, 1,742 బస్తాలు తక్కువగా ఉన్నాయని కంపెనీ ఆరోపించింది. రైల్వేలు కొరత ధ్రువీకరణ పత్రం (షార్టేజ్‌ సర్టీఫికెట్‌) జారీ చేసినప్పటికీ, ఈ సరుకు ‘ఓనర్‌ రిస్క్‌‘కింద బుక్‌ కావడంతో పాటు, రైల్వే రసీదుపై ‘సెడ్‌ టూ కంటైన్‌’అనే ఎండార్స్‌మెంట్‌ ఉండటంతో తమకు ఎలాంటి బాధ్యత ఉండదని రైల్వే శాఖ వాదించింది. అంటే సరుకు లోడ్‌ చేసే సమయంలో బస్తాల సంఖ్యను రైల్వే సిబ్బంది స్వయంగా తనిఖీ చేయలేదని స్పష్టం చేసింది. 

ప్రత్యేక నిబంధనలు వర్తింపు 
రైల్వే చట్టం–1989లోని సెక్షన్‌ 93 ప్రకారం రైల్వేలకు సాధారణ బాధ్యత ఉన్నప్పటికీ, సెక్షన్‌ 97 ప్రకారం ‘ఓనర్‌ రిస్క్ ‘పై బుక్‌ చేసిన సరుకుల విషయంలో ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయని ధర్మాసనం పేర్కొంది. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం, దుర్వినియోగం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే రైల్వేలను బాధ్యులుగా భావించవచ్చని తెలిపింది. సరుకు లోడ్‌ చేసే సమయంలో రైల్వే అధికారులు స్వయంగా లెక్కించి లేదా తూకం వేసి ఉంటే, ఆ పరిమాణాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత వారిపై ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అయితే, ఈ కేసులో అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేసింది.  

ఆధారాలు చూపలేదు.. 
రైల్వే చట్టంలోని సెక్షన్‌ 65(2) ప్రకారం, రైల్వే సిబ్బంది సరుకును లెక్కించకుండా రసీదుపై సంబంధిత ఎండార్స్‌మెంట్‌ చేసినట్లయితే, వాస్తవంగా ఎంత సరుకు పంపారో నిరూపించే బాధ్యత సరుకు పంపిన వ్యక్తి లేదా స్వీకరించే వ్యక్తిపైనే ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో 40,444 ఉప్పు బస్తాలను నిజంగా కొనుగోలు చేసి, ప్రాసెస్‌ చేసి, రవాణాకు సిద్ధం చేసినట్లు చూపించే ఎలాంటి పత్రాలను కంపెనీ సమర్పించలేదని ధర్మాసనం గుర్తించింది. అందువల్ల అవసరమైన ఆధారాలు సమర్పించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో, ‘ఓనర్‌ రిస్క్ ‘విధానంలో బుక్‌ చేసిన సరుకుల విషయంలో రైల్వేల బాధ్యతకు సంబంధించి కీలక మార్గదర్శకాలను సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement