సాక్షి,న్యూఢిల్లీ: ప్రజల్లో దేశభక్తిని మరింత బలపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గేయం జనగణమనతో సమానంగా జాతీయ గీతం వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లును ప్రవేశపెట్టనుంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే వందే మాతరాన్ని అవమానించడం, జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం వంటి చర్యలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదే శిక్ష జాతీయ గానం, జాతీయ పతాకం, భారత రాజ్యాంగాన్ని అవమానించిన వారికి వర్తిస్తోంది. తాజా సవరణతో జాతీయ గీతం కూడా ఈ చట్ట పరిధిలోకి రానుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన మార్గదర్శకాలలో అధికారిక కార్యక్రమాల్లో జనగణమన ఆలపించే సందర్భాల్లో వందే మాతరం తప్పనిసరిగా పాడాలని సూచించింది.
తాజాగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపిన మరో లేఖలో, అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరం, జనగణమన రెండూ ఆలపించే పరిస్థితిలో ముందుగా వందే మాతరమే పాడాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది. అలాగే, వందే మాతరం మొత్తం ఆరు చరణాలు (సుమారు 3 నిమిషాల 10 సెకన్లు) ఆలపించాలని కూడా సూచించింది.


