
ఇంటి ఆడబిడ్డ బోనం ఎత్తగానే మోగిన డప్పు వాయిద్యాలు.. పోతరాజు విన్యాసాలు.. అమ్మా, కాపాడమ్మా.. అంటూ సాగే అడుగులన్నీ అమ్మవారి ఆలయం వైపుగా కదులుతుంటే.. దారులన్నీ ఆధ్యాత్మిక శోభతో కళ కళలాడతాయి. ఆ కళ గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు అనిపించేంత సంబురంగా జరుగుతుంది తెలంగాణ బోనాల పండగ.
తెలంగాణ ప్రజల సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఆషాఢ మాసం మొదలవుతూనే ఆరంభం అవుతుంది. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, బాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ .. ఈ ఏడుగురు అమ్మ తల్లులు ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పూజలు అందుకుంటున్నారు. ఈ అమ్మతల్లుల ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబు అవుతాయి. నేటి నుంచి మొదలయ్యే ఈ వేడుకలో తెలంగాణ ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొంటారు.
బెల్లం కలిపి వండిన అన్నాన్ని పసుపు, కుంకుమ బొట్లు, వేపాకులతో అలంకరించిన మట్టి లేదా ఇత్తడి పాత్రలలో ఉంచుతారు. పైన పెట్టిన మూతలో దీపాన్ని ఉంచి, ఆ పాత్రను జాగ్రత్తగా తలపైన పెట్టుకుని, అమ్మవారి దేవాలయాలకు వెళతారు. ఈ పండుగలో భక్తి, కుటుంబ శ్రేయస్సు ప్రధానంగా కనిపిస్తాయి. బోనాలతోపాటు, పొట్టేళ్ళ, ఘటం ఊరేగింపు వంటి సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహిస్తారు.
(చదవండి: బోనాల పండుగకు వేళాయె)
హైదరాబాద్లో గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ పండగ మొదలవుతుంది. ఈ రోజు(గురువారం జూన్ 26) నుంచి బోనాలు ప్రారంభకానున్నాయి. వెయ్యేళ్లకు పైగా ఈ ఆచారం ఉన్నట్టు, కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు జరిపినట్లు చారిత్రక కథనాలు.
రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, తరువాతి వారంలో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంతోపాటు వివిధ ప్రాంతాలలో ఉన్న అమ్మవార్లకు వరసగా బోనం సమర్పించే ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. చివరి వారం రంగం, భవిష్యవాణిలతో ముగింపు కార్యక్రమం ఉంటుంది. జులై 21తో ముగిసే ఈ జాతర ఉత్సవాలు పిల్లలూ పెద్దలలో ఆనందోత్సహాలను నింపుతుంది.