
నేను గర్భవతిని అని మూత్రపరీక్ష ద్వారా తెలిసింది. డాక్టర్ను ఎప్పుడు కలవాలి?
– రమ్య, గుంటూరు
గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్ను కలవాలి. ఎందుకంటే శరీరంలో థైరాయిడ్, సుగర్, రక్తపోటులాంటి సమస్యలు ఉంటే, శిశువుపై వాటి ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ను కలిసిన వెంటనే వారు రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేస్తారు. అలాగే, శరీర పరిస్థితిని బట్టి ఫోలిక్ యాసిడ్, విటమిన్ –డి వంటి మాత్రలు సూచిస్తారు. ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. మొదటి వారాల్లోనే శుభ్రమైన, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు తగిన ఆహార నియమాలు కూడా డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు.
కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులు, జన్యుపరమైన లోపాలు భర్తవైపు లేదా భార్యవైపు ఉన్నా, అవి శిశువుకు వచ్చే అవకాశముంటుంది. అందుకే ప్రారంభ దశలోనే ఆయా సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే, దానికి తగిన వైద్యం తీసుకోవాలి. సాధారణంగా గర్భం ఎనిమిదో వారం వచ్చేసరికి మొదటి స్కాన్ చేస్తారు. దానితో బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
తర్వాతి స్కా మూడో నెలలో చేస్తారు. ఈ స్కానింగ్, మొదటి దశ రక్తపరీక్షల ద్వారా చాలా ముఖ్యమైన విషయాలను గుర్తించవచ్చు. అవసరమైన మందులు, తీసుకోవాల్సిన చికిత్సలు కూడా సూచిస్తారు. శరీర బరువు, రక్తపోటు స్థాయిని బట్టి ప్రారంభ దశలో చేయవలసిన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన అలవాట్లను సూచిస్తారు. ఆహార నిపుణుల సలహాలు, జన్యుపరమైన కౌన్సెలింగ్ కూడా ఇప్పటి నుంచే తీసుకోవాలి. అందుకే ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ప్రసూతి నిపుణులను తప్పనిసరిగా కలవాలి.
పీసీఓఎస్తో మానసిక సమస్యలు
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మహిళలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం, శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, ముఖంపై మొటిమలు ఎక్కువగా రావడం, తల మీద జుట్టు పల్చబడిపోవడం వంటి శారీరక సమస్యలే కాకుండా పలు మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నడివయసుకు చేరుకునే సరికి మతిమరపు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఒక్కోసారి మానసిక కుంగుబాటుకు లోనవడం వంటి లక్షణాలతో బాధపడతారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీదర్ హడల్స్టన్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలో తేలింది.
అలాగే, పీసీఓఎస్తో బాధపడే మహిళలకు టైప్–2 డయాబెటిస్ ముప్పు సాధారణ మహిళల కంటే రెట్టింపుగా ఉంటుందని కూడా ఈ పరిశోధనలో బయటపడింది. ఈ సమస్యల కారణంగానే పీసీఓఎస్తో బాధపడే మహిళలు నడివయసులో కెరీర్లోను, ఆర్థిక వ్యవహారాల్లోను వెనుకబడిపోతారని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన సారాంశం ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురితమైంది.
ఆత్మహత్యా ధోరణులు కూడా..
పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో రకరకాల శారీరక, మానసిక సమస్యలతో పాటు ఆత్మహత్యా ధోరణులు కూడా పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది.
సాధారణ మహిళలతో పోల్చుకుంటే, పీసీఓఎస్తో బాధపడే మహిళలు ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడే అవకాశాలు మూడు శాతం ఎక్కువగా ఉన్నట్లు తైవాన్లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ము హాంగ్ చెన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.