East Godavari
-
బహిరంగ ధూమపానం చేస్తే జరిమానా
కాకినాడ క్రైం: బహిరంగ ధూమపానం చేస్తే జరిమానా విధిస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. గురువారం సాయంత్రం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ధూమపానం వల్ల ఎదురయ్యే అనర్థాలను వాల్పోస్టర్ల ద్వారా ప్రదర్శించాలని అన్నారు. ప్రార్థనా ప్రదేశాలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత శాఖతో కలిసి పరిష్కరించాలని సూచించారు. సైబర్ నేరాల్లో బ్యాంకు ఖాతాల్లో చిక్కుకున్న సొత్తును తిరిగి ఖాతాదారుడికి అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై చేసిన విచారణను ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రీవెన్స్ బాక్సులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది కొరత సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై తగిన అవగాహన పెంపొందించాలని సూచించారు. పోక్సో, రేప్ కేసుల్లో బాధితులను విచారించేందుకు శక్తి టీం సేవలను వినియోగించుకోవాలని, ఇటువంటి కేసుల్లో 60 రోజుల్లోపు చార్జిషీటు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా పాత కేసులు, ఆస్తి తగాదాలు, పోక్సో, రేప్, ఎన్డీపీఎస్, సైబర్ క్రైం, మిస్సింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కర్రావు, కాకినాడ ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్, పెద్దాపురం ఎస్డీపీవో హరిబాబు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. యువతి అదృశ్యంపై కేసు రామచంద్రపురం రూరల్: మండలంలోని ఆదివారపుపేట గ్రామానికి చెందిన యువతి ఈ నెల 21 నుంచి కనిపించడం లేదని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ గురువారం విలేకరులకు తెలిపారు. ఆదివారపుపేట గ్రామానికి చెందిన పిచ్చిక సత్యవతి కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్వగ్రామం ఆదివారపుపేట వచ్చారు. ఈ నేపథ్యంలో 21 రాత్రి 2 గంటల సమయంలో తల్లి సత్యవతి ఇంటిలో తన కూతురు అపర్ణ లేకపోవడం గమనించింది. పరిసరాల్లోను, బంధువు ఇళ్లల్లోను విచారణ చేసినా ఉపయోగం లేకపోవడంతో ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పసుపు జెండా.. వెలిసిపోతోందా..!
●● ‘గ్లాస్’మేట్స్కే నామినేటెడ్ సీట్లా? ● ఈ పొత్తుతో చిత్తయిపోతామన్న జ్యోతుల ● నెహ్రూ వ్యాఖ్యలపై కూటమిలో దుమారం ● ఆధిపత్య ఆరాటమేనని విమర్శ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్టీఆర్ హయాంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ క్రమంగా నిర్వీర్యమైపోయినట్లే.. ఇప్పుడు జనసేన పొత్తుతో ‘పసుపు’ రంగు వెలిసిపోయే పరిస్థితి ఏర్పడుతోందా అంటే.. అవుననే అంటున్నాయి జిల్లాలోని టీడీపీ శ్రేణులు. కాకినాడలో గురువారం జరిగిన ఆ పార్టీ జిల్లా మహానాడులో సీనియర్ నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇదంతా ఆధిపత్యం కోసమేనని మిత్రపక్షమైన జనసేన నేతలు విమర్శిస్తున్నారు. మొత్తమ్మీద రెండు రోజులుగా జ్యోతుల అండ్ సన్ చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలో దుమారం రేపుతున్నాయి. పదవుల్లో ప్రాధాన్యం ఏదీ? టీడీపీ, జనసేనల మధ్య చాపకింద నీరులా కొనసాగుతున్న విభేదాలు ఎట్టకేలకు జ్యోతుల వ్యాఖ్యలతో రచ్చకెక్కాయి. పదవుల పందేరం మొదలుకొని జిల్లాలో జనసేనకే పెద్ద పీట వేయడాన్ని టీడీపీ నేతలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. పదవుల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే ఆక్రోశం మినీ మహానాడు వేదికలుగా ఆ పార్టీ నేతల మాటల్లో ప్రస్ఫుటమైంది. జనసేన కంటే బలం, బలగం అధికంగా ఉన్నప్పటికీ పదవుల్లో అన్యాయం జరుగుతోందని టీడీపీ శ్రేణులు కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ‘గతంలో ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీలకు తాత్కాలికంగా ఒకటో రెండో పదవులు వచ్చి ఉండవచ్చు. అప్పుడు మనం తెలివిగా రాజకీయం చేశాం. కేవలం మనతో పొత్తు కారణంగానే తరువాతి కాలంలో రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యమైపోయాయి. ఆ పరిస్థితి మన పార్టీకి రాకుండా రాష్ట్ర నాయకత్వం చూడాలి’ అని జ్యోతుల అన్నారు. పదవుల్లో టీడీపీ అధిష్టానం జనసేనకే పెద్దపీట వేస్తూండటంతో టీడీపీ క్రమంగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడుతోందని నేరుగా కాకపోయినా పరోక్షంగా అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడైన తుమ్మల బాబుకు కొన్నాళ్ల కిందట కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయనకే తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అయితే, ఎక్కడా జనసేన, ఆ పార్టీ నేతల పేర్లు ప్రస్తావించకుండా.. ఒకే వ్యక్తికి రెండు పదవులు ఇవ్వడం న్యాయమా అని జ్యోతుల నిలదీశారు. ఇలాగైతే మెజార్టీలో ఉన్న టీడీపీ ఏమైపోతుందని నేరుగా అధిష్టానాన్ని ప్రశ్నించారు. జ్యోతులే కాదు.. ఆయన తనయుడు నవీన్ కుమార్ కూడా రెండు రోజుల క్రితం పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల మినీ మహానాడుల్లో సైతం దాదాపు ఇదే అభిప్రాయం పరోక్షంగా వ్యక్తం చేశారు. పార్టీ పరంగా పిఠాపురంలో ఒకప్పుడు దూకుడుగా ఉండే మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు దాదాపు స్తబ్దుగా మారిపోవడం చూస్తూంటే జిల్లాలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోందని నవీన్ అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిని నియమించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఇలాగైతే జిల్లాలో పార్టీ ఎటువైపు పోతుందని ఆయన ప్రశ్నించడం గమనార్హం. తండ్రీకొడుకులు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అదేం ప్రశ్న! అయితే, ఈ వ్యవహారంపై జనసేన నేతలు వేరేలా కౌంటర్ ఇస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టగానే కౌడా చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు తుమ్మల బాబు ప్రకటించారని, అటువంటప్పుడు ఒకరికే రెండు పదవులని నెహ్రూ ఎలా అంటారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్గిరీని నవీన్ ఆశించి భంగపడ్డారని, అందువల్లనే నెహ్రూ నోట జోడు పదవుల ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. పదవుల పందేరంలో టీడీపీ నేతలకు అన్యాయమనేది సాకు మాత్రమేననని చెబుతున్నారు. పదవులన్నీ వాళ్లకే ఇచ్చేస్తే.. మనకో మరి!ప్రాధాన్యం దక్కనందుకేనా! పార్టీ పరంగా, రాజకీయంగా ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చక్రం తిప్పిన జ్యోతుల నెహ్రూ, యనమల రామకృష్ణుడు వంటి నేతలకు జనసేనకు పెద్దపీట వేయడం నచ్చడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో దాదాపు జిల్లా ఉన్నతాధికారులు ఏ అంశంలోనైనా ఆయన మాటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సీనియర్లమైనప్పటికీ తమను పరిగణనలోకి తీసుకోకవడమే నెహ్రూ ఆగ్రహానికి కారణమై ఉంటుందనే అభిప్రాయం టీడీపీలో కూడా వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాలున్నప్పుడు ఎమ్మెల్యేలందరూ సమష్టి నిర్ణయాలతో అభివృద్ధికి బాటలు వేశామని నెహ్రూ చెప్పుకొన్నారు. ఇప్పుడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలకే పరిమితమైనా సమన్వయం కొరవడి, ఏమీ చేయలేకపోతున్నామన్న నెహ్రూ మాటల్లో ప్రాధాన్యం దక్కడం లేదనే ఆక్రోశమే కనిపిస్తోందని అంటున్నారు. ఈ మొత్తం ఎసిపోడ్లో టీడీపీ నిర్వీర్యమైపోతుందన్న నెహ్రూ వ్యాఖ్యలపై అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఆగివున్న లారీని ఢీకొట్టిన టాటా వ్యాన్
ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి గాయాలు రాజానగరం: జాతీయ రహదారిపై వైఎస్సార్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన నాగుల వెంకటేశ్వరరావు, ఎన్.రాజ్యలక్ష్మి, బి.రఘుబాబు, లక్ష్మీదుర్గ, తాళం రాధ, బి.దేవిక, బి.లోకేశ్వర్రావు, బి.దేవేంద్ర, ఎన్.పావని అన్నవరానికి టాటా మేజిక్ వ్యాన్లో బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ వైఎస్సార్ జంక్షన్ సమీపంలో రోడ్డు పక్క ఆగివున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ చింతలచెరువు మధుతోపాటు అందులో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ఆశ్రమం ఆస్పత్రికి తరలించారు. కాగా క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, దైవ దర్శనం కోసం అన్నవరానికి బయలుదేరారని పోలీసులు తెలిపారు. అతివేగంతోపాటు డ్రైవర్ కునుకు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
ప్రారంభించిన సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ సామర్లకోట: పట్టణంలో గురువారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నాలుగేళ్లుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర ర్యాలీకి భారీ ఎత్తున ప్రచారం జరగడంతో వేలాది మంది భక్తులు స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్దకు తరలివచ్చారు. గురువారం సాయంత్రం శృంగవృక్షం దత్త పీఠాధిపతి సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ అంటే ఒక శక్తి అని, వారి జోలికి వస్తే మట్టి కరిపిస్తారని తెలిపారు. తిరుమల తిరుపతిలోని అలిపిరి ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా స్వామీజీ వివరించారు. హిందువులు ప్రశాంత జీవన విధానాన్ని కోరుకుంటారని అన్నారు. రామనామం భూమి ఉన్నంత కాలం ఉంటుందని చెప్పారు. జై శ్రీరామ్ అని చెప్పడం ద్వారా శక్తి ఏర్పడుతుందన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా వేలాది మంది శోభాయాత్రకు తరలి వచ్చారు. సీఐ ఏ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్, పిఠాపురం రోడ్డు నుంచి పెద్దాపురం రోడ్డు మీదుగా శోభాయాత్ర ర్యాలీ పెద్దాపురం పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరి తిరిగి సామర్లకోట వచ్చింది. ప్రారంభం నుంచి చివరి వరకు స్వామిజీ మోటారు సైకిల్పై కూర్చుని శోభాయాత్రలో పాల్గొన్నారు. -
పట్టు వదలకుండా పోరాడుదాం
చేబ్రోలులో పట్టు రైతుల సమావేశం పిఠాపురం: స్వదేశీ సిల్క్ ఉత్పత్తిలో రాష్ట్రంలోనే పేరెన్నికగన్న పట్టు సాగును వదిలి పెట్టేది లేదని పట్టు వదలకుండా అందరం కలిసి పోరాటం చేసి సాధించుకుందామంటూ పట్టు రైతులు నిర్ణయించుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గురువారం స్థానిక పట్టు పరిశ్రమ కేంద్రంలో నిర్వహించిన పట్టు రైతుల సమావేశంలో పట్టు వదిలేసి పామాయిల్ సాగు చేయండి అన్న ఉన్నతాధికారుల సలహాలపై చర్చించుకున్నారు. రైతులు మాట్లాడుతూ వేలాది మంది రైతులకు జీవనోపాధి, రాష్ట్రంలో పట్టు సాగులో కీలక పాత్ర వహించే చేబ్రోలులో పట్టు సాగు నిలిపివేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇది కేవలం ఒక పంట కాదని ఎందరికో ఉపాధినిచ్చే ఒక పరిశ్రమ అని ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. కొంతకాలంగా ఈ పరిశ్రమ ఇలా దిగజారిపోవడానికి జిల్లా పట్టు పరిశ్రమ శాఖాధికారి గీతారాణి అని, ఆమె పట్టు పరిశ్రమ శాఖ ద్వారా నకిలీ విత్తనాలు నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే ఆమె పోలీసులతో తమపై దౌర్జన్యం చేయించి రైతులను దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించారన్నారు. పంటలు నాశనం అవ్వడానికి ఆమె ప్రధాన కారణమని, ఆమెను తక్షణం బదిలీ చేసి పట్టు పరిశ్రమ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టు సాగు వదిలేసి పామాయిల్ సాగు చేయడం జరగని పని అని అన్నారు. పట్టు సాగులో నష్టాలు రాకుండా ప్రభుత్వం శాస్త్రవేత్తల ద్వారా పరిశోధనలు చేయించి, చర్యలు తీసుకుని పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు రావాలని రైతులు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను, జిల్లా ఉన్నతాధికారులను కలిసి మళ్లీ విజ్ఞప్తులు చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. పట్టు రైతులు ఉలవకాయల రాంబాబు, ఓరుగంటి సందీప్, ఓరుగంటి శ్రీను, చల్లా రామకృష్ణ, ఎలుగుబంటి బాబు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో జైలు
దేవరపల్లి: భార్య కాపురానికి రాకపోవడానికి బావమరిది కారణమనే కోపంతో కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి కొవ్వూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.వి.ఎల్ సరస్వతి గురువారం నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధించారు. దేవరపల్లి ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవరపల్లి మండలం బందపురం శివారు రంగరాయకాలనీకి చెందిన షేక్ సయ్యద్ బాజీ తన భార్య కాపురానికి రావట్లేదని, దీనికి కారణం తన బావమరిది షేక్ కరీముల్లా అనే కోపంతో 2017లో కత్తితో దాడి చేశాడు. అప్పటి ఎస్సై కె.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్చు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కాకులపాటి వెంకరమణ వాదించినట్టు ఆయన తెలిపారు. బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో బావి నుంచి గుర్తుతెలియని పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రామాలయం వద్ద ఉన్న చెరువు మధ్యలో ఉన్న బావిలో గురువారం స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడకు వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు వయసు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని, లుంగీ ధరించి ఉన్నాడని, మృతదేహం ఉన్న తీరుని బట్టి చనిపోయి సుమారు 15 రోజులు అయ్యి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించామని, వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కె.గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత కులం పేరుతో దూషించారంటూ నిరసన కె.గంగవరం: స్థానిక పోలీస్స్టేషన్ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోట గ్రామంలో దళిత కాలనీకి చెందిన మహిళలు, పురుషులు భారీగా స్టేషన్ వద్దకు తరలివచ్చి కులం పేరుతో దూషించి మహిళలపై దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. కె.గంగవరం ఎస్సై జానీ బాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కోట గ్రామానికి చెందిన కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్య ఈశ్వరరావు మోటారు సైకిల్పై ఏటిగట్టు వైపు వెళుతున్న సమయంలో అటుగా రోడ్డపై వస్తున్న ఉపాధి కూలీలకు మోటారు సైకిల్ హ్యాండిల్ తగిలింది. వెంటనే కూలీలు అతనిని ఆపి ప్రశ్నిస్తున్న సమయంలో ఈశ్వరరావు మహిళా కూలీలను కులం పేరుతో దూషించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో వారు ఈశ్వరరావును స్టేషన్కు తరలించి ఫిర్యాదు చేశారు. ఈశ్వరరావు కూడా రోడ్డుపై వెళ్తున్న తనను అడ్డుకుని దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. స్టేషన్ వద్ద నిరసన.. కోట గ్రామానికి చెందిన పలువురు వాహనాలలో భారీగా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కులం పేరుతో దూషించి మహిళలను దాడి చేసిన ఈశ్వరరావును వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలంటూ కొంత సేపు నిరసన చేశారు. ఈశ్వరరావు గతంలో కూడా దళితులను చిన్నచూపు చూశాడని, తమ కాలనీలో గల చెరువును తవ్వనీయకుండా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పారు. చెరువు లేకపోతే మాకు నీరు ఉండదని లంక భూములు సాగు చేసుకునే విషయంలో కూడా అడ్డుకుంటున్నాడని వారు నిరసన చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
ప్రజా సమస్యలపై ఆందోళనలు
● ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరాటాలు ● వైఎస్సార్ సీపీ నేతలు తిప్పల గురుమూర్తిరెడ్డి, వేణు రాజమహేంద్రవరం రూరల్: ఏడాది కాక మునుపే కూటమి సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు సమరోత్సాహంతో తిప్పి కొట్టాలని, ప్రజల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం సమైక్యంగా ఆందోళన బాట పట్టాలని, వారిలో విశ్వసనీయతను పెంచాలని పిలుపునిచ్చారు. తద్వారా వైఎస్సార్ సీపీ మరింత బలపడి, భవిష్యత్తులో అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ బలోపేతం, అనుబంధ విభాగాల పటిష్టత, తదితర అంశాలపై గురుమూర్తిరెడ్డి, మాజీ మంత్రులు వేణు, తానేటి వనిత, యువజన రాష్ట్ర విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నియోజకవర్గాల ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస నాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్లు సమీక్షించారు. వేణు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో గురుమూర్తిరెడ్డి, వేణు మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నాయకులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్యాయం చేసిన వారి తరఫున పోరాడటంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వానికీ ఏడాదిలోపే ఇంత వ్యతిరేకత కనిపించ లేదని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా, ఇతర సంక్షేమ పథకాలను సైతం అందించకపోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై ఎప్పటికప్పుడు పోరుబాట పట్టేలా నేతలు సిద్ధం కావాలన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు చేపడుతూనే ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించారు. పార్లమెంటరీ పరిశీలకుడిగా నియమితులై తొలిసారిగా నగరానికి వచ్చిన గురుమూర్తిరెడ్డిని ఈ సందర్భంగా నేతలు సత్కరించారు. -
యోగాపై అవగాహన కార్యక్రమాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నెల రోజులపాటు యోగా సాధన, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంపై సమన్వయ శాఖల అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు. రోజుకో ప్రభుత్వ శాఖ చొప్పున నెల రోజుల పాటు అన్ని శాఖలూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 27న యోగా సంఘాలతో, 28న అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలతో, 29న సెంట్రల్ జైలులో రాష్ట్ర స్థాయి కార్యక్రమం, 30న వైద్యాధికారులు, వైద్యులతో, 31న మాజీ సైనికోద్యోగులతో, జూన్ 1న ఫ్యామిలీ యోగా, 2న ఆటో, లారీ సంఘాలు, 3న మత్స్యకారులు, 4న గిరిజనులు, 5న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, 6న ఉపాధ్యాయులు, 7న రెసిడెన్షియల్ అసోసియేషన్లు, 8న సీనియర్ సిటిజన్లు, 9న ఇంజినీరింగ్ విద్యార్థులతో యోగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈవిధంగా వచ్చే నెల 21 వరకూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరితో యోగా వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలని, వారంతా సాధన చేసేలా చూడాలని సూచించారు. అనంతరం, కలెక్టర్మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందితో రికార్డు స్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంలో భాగంగా నగరంలోని వై.జంక్షన్ నుంచి లాలాచెరువు వరకూ ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య యోగా సాధన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే క్రమంలో కడియం, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, వివిధ ఘాట్లలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. -
పట్టణవాసికి.. పన్నుపోటు!
సాక్షి, రాజమహేంద్రవరం: సంపద సృష్టించి, సంక్షేమం అమలు చేస్తామని ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టినప్పటి నుంచీ బాదుడుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజలకు పెను భారం మోపిన సర్కారు.. తాజాగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి, ఇంటి, ఖాళీ స్థల, కుళాయి పన్నులు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం 15 శాతం చెల్లిస్తున్న ఆస్తి పన్నును 20 శాతానికి పెంచేందుకు మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తోంది. పురపాలక సంస్థల్లో చాలా ఆస్తులకు అసెస్మెంట్ చేయలేదని, దీనికోసం సర్వే చేపడుతున్నామని నమ్మబలుకుతోంది. కానీ, ప్రజలకు ‘అదనపు వడ్డింపు’లు చేయడమే దీని వెనుక అసలు లక్ష్యమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత డిమాండ్ కంటే కనీసం 20 శాతం అధికంగా పన్నులు వసూలు చేయాలని ఇటీవల విడుదల చేసిన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అధికారులు సర్వే పనుల్లో తలమునకలవుతున్నారు. ఇదేనా సంపద సృష్టి? కూటమి అధికారంలోకి వస్తే ఏటా పెంచే 15 శాతం పన్నును తగ్గిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీలు గుప్పించారు. గత ప్రభుత్వం పట్టణ ప్రజలపై పన్నుల భారం పెంచిందని, తాము అధికారంలోకి రాగానే మదింపు చర్యలు చేపడతామని తప్పుడు ప్రచారం చేస్తూ అధికార పగ్గాలు చేజిక్కించుకున్నారు. గద్దెనెక్కిన కొన్ని నెలల వ్యవధిలోనే కూటమి పెద్దలు ప్రజల నడ్డి విరిచే చర్యలు చేపడుతున్నారు. ఏదైనా భవనానికి నిర్మాణ సమయంలోనే కొలతలు, నిర్మాణానికి అనుమతులు తీసుకుంటారు. నిర్మాణం పూర్తయ్యాక మున్సిపల్ సిబ్బంది సర్వే చేసి, పన్ను విధిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇందులో లోపాలున్నాయంటూ తప్పుడు ప్రచారానికి దిగిన ప్రభుత్వం.. తాజాగా కొలతలు తీసుకోవాలని పేర్కొంటూ, కొత్తగా పన్ను భారాలు మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వచ్చే నెల 15వ తేదీ నాటికి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ఆస్తుల కొలతలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తి పన్నుకు మరో 20 శాతం అదనంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసేందుకు నాంది పలుకుతోంది. ఈ మేరకు పురపాలక సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏ పట్టణ స్థానిక సంస్థలో ఎంత మేర అదనంగా వసూలు చేయాలో ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కూటమి అధికార పగ్గాలు చేపట్టాక మోపుతున్న భారాలను చూస్తూంటే.. సంపద సృష్టి అంటే ఇదేనా బాబు గారూ.. అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు. ఇంటింటి సర్వే చేస్తారిలా.. ● సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వేనిర్వహించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. సచివాలయ కార్యదర్శులు, రెవెన్యూ, సర్వేయర్ల సహాయంతో ఈ సర్వే చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. ● ఇళ్లు, భవనాలున్నవారు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా, లేదా తనిఖీ చేస్తారు. ఆస్తి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులపై ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ● నిర్మాణ విస్తీర్ణం మేరకు పన్ను విధించారా, లేదా.. అదనపు అంతస్తులకు పన్ను విధించారా.. నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా.. అనే అంశాలపై క్షేత్ర స్థాయిలో ఆరా తీస్తారు. బాదుడు ఇలా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలు, 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఉన్నాయి. ఏటా సుమారు రూ.307.89 కోట్ల పన్ను డిమాండ్ ఇక్కడ ఉంది. తాజా ‘పన్ను పోటు’లో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల ప్రజలపై అత్యధిక భారం పడనుంంది. రాజమహేంద్రవరంలో అత్యధికంగా రూ.137.32 కోట్ల డిమాండ్ ఉంటోంది. సర్వే పూర్తయితే ఇక్కడి ప్రజలపై మరో రూ.15 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్లో పన్నుల డిమాండ్ రూ.110.99 కోట్లు కాగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వ బాదుడుతో ఈ నగర ప్రజలపై మరో రూ.12 కోట్లు వడ్డిస్తారు. అదనపు వసూళ్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ వచ్చే నెల 15లోగా ఇంటింటికీ వెళ్లి కొలతలు తీయాలని ఆదేశాలు కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో అమలు రాజమహేంద్రవరంలో రూ.15 కోట్లు.. కాకినాడలో రూ.12 కోట్ల భారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల వడ్డింపు ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్ల డిమాండ్ (రూ.కోట్లలో) నగరం/పట్టణం పన్ను డిమాండ్ కాకినాడ 110.99 పిఠాపురం 10.17 సామర్లకోట 8.78 రాజమహేంద్రవరం 137.32 నిడదవోలు 8.47 ఏలేశ్వరం 2.61 అమలాపురం 14.72 రామచంద్రపురం 7.65 పెద్దాపురం 7.18 కొవ్వూరు 4.56 -
సేవ చేద్దామని వస్తే దూషణలు
● తెలంగాణ మహిళా సేవకుల బృందానికి అవమానం ● రత్నగిరిపై అధికారి దురుసు ప్రవర్తన ● ఏఈఓ తీరుపై కమిషనర్ ఆగ్రహం ● విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఈఓకు ఆదేశం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన మహిళా సేవకుల పట్ల దేవస్థానం ఏఈఓ కె.కొండలరావు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. వివరాలివీ.. అన్నవరం దేవస్థానంలో సేవలందించేందుకు రెండేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిగా మహిళా సేవకులు వస్తున్నారు. వీరు పది రోజుల నుంచి రెండు వారాల వరకూ స్వామివారి ఆలయం, యంత్రాలయం, ఉపాలయాలు, అన్నదానం, ప్రసాదం, క్యూ లైన్లు తదితర చోట్ల సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళలు గతంలో అన్నవరం దేవస్థానంలో సేవ చేసిన హైదరాబాద్కు చెందిన మరో సేవా బృందం మహిళను సంప్రదించారు. ఆమె స్వయంగా రానూపోనూ రైలు టికెట్లు రిజర్వ్ చేయించి, ఒక్కొక్కరి నుంచి రూ.500 అధికంగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం అన్నవరం వచ్చిన మంచిర్యాల మహిళా సేవకుల బృందానికి డ్యూటీలు వేసేందుకు ఆలయ ఏఈఓ కె.కొండలరావు నిరాకరించారు. తునికి చెందిన శ్రీవారి సేవా మహిళా బృందం వారే దేవస్థానం వద్దకు సేవకులను పంపిస్తారని, ఆమెతో మాట్లాడాలని చెప్పారు. దీంతో, మంచిర్యాల సేవకుల బృందం తునికి చెందిన శ్రీవారి సేవా మహిళా బృందం ప్రతినిధితో మాట్లాడగా, తన అనుమతి లేకుండా ఎందుకు వచ్చారని ఆమె విరుచుకు పడింది. వెంటనే వెళ్లిపోవాలని, తాను కబురు చేసినప్పుడే రావాలని చెప్పింది. వారు మళ్లీ ఏఈఓ కొండలరావు వద్దకు రాగా.. ఆయన కూడా వెంటనే వెళ్లిపోవాలని గట్టిగా కసిరినట్టు చెప్పారు. దేవుని సేవ చేద్దామని అంత దూరం నుంచి వస్తే తమను ఇలా అవమానించడమేమిటని మంచిర్యాల బృంద సభ్యులు వాపోయారు. ఈ విషయాన్ని వెంటనే దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై మండిపడిన ఆయన.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, వెంటనే నివేదిక ఇవ్వాలని ఈఓ వీర్ల సుబ్బారావును ఆదేశించారు. -
యూటీఎఫ్ హెల్ప్ డెస్క్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఉపాధ్యాయుల సందేహాలు నివృత్తి చేయడానికి నగరంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, ఎ.షరీఫ్ మాట్లాడుతూ బదిలీల విషయంలో ఉపాధ్యాయులకు అవసరమైన సహకారం అందించడానికి, మార్గనిర్దేశం, దరఖాస్తు ప్రక్రియలో సాయం చేయడానికి రాజమహేంద్రవరంతో పాటు కోరుకొండ, ఉండ్రాజవరం, గోకవరం, నిడదవోలుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వివరాలకు 99899 82503, 99899 82503 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు ప్రభాకరవర్మ, ప్రసాదరావు, జిల్లా కార్యదర్శులు కె.రమేష్బాబు, ఎన్.రవిబాబు, దయానిధి, మనోహర్, ప్రకాశరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల సందడి అన్నవరం: రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు అధిక సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత, విశ్రాంత మండపాలు నవదంపతులు, భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు నిజరూపంలో దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. పదవులన్నీ జనసేనకేనా! కాకినాడ సిటీ: జిల్లాలో పలు పదవులు తమకు కాకుండా జనసేనకే కట్టబెట్టడమేమిటని పలువురు టీడీపీ నాయకులు ప్రశ్నించారు. కాకినాడలో గురువారం జరిగిన టీడీపీ జిల్లా మహానాడులో నాయకులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు విలువ లేకుండా పోతోందని, అన్నిచోట్లా జనసేన నాయకులకే పనులు జరుగుతున్నాయని, దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని నేతలు తమ ప్రసంగాల్లో చెప్పారు. జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను, అవమానాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకునేలా రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కార్యకర్తలు ప్రజల నుంచి దోచుకోకుండా ఆర్థిక స్థితి కల్పించి, ఆదుకోవాలని అన్నారు. మిత్రధర్మం పాటిస్తూనే టీడీపీ కార్యకర్తలకు పొత్తు నిష్పత్తిలో న్యాయం చేయాలని సూచించారు. కాకినాడ సెజ్ 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారని, ఎటువంటి పరిశ్రమలూ రాకపోవడంతో యువత, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఆయా నియోజకవర్గా ల్లోని సమస్యలు లేవనెత్తారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి, మున్సిపల్ మంత్రి పి.నారాయణ, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈఏపీ సెట్కు 96.32 శాతం హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏసీ సెట్ ఆన్లైన్ పరీక్ష జిల్లాలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన పరీక్షకు 1,736 మంది హాజరు కా గా, 63 మంది గైర్హాజరయ్యారు. ఉదయ పరీక్షకు 871 మంది హాజరవ్వగా 30 మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 865 మంది హాజరు కాగా, 33 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు. -
అర్ధరాత్రి కారు బీభత్సం
పిఠాపురం: స్థానిక పాదగయ క్షేత్రం సెంటర్లో బుధవారం అర్ధరాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి మోటారు సైకిల్పై వెళుతున్న ముగ్గురిని ఢీకొట్టి పాదగయ ఆలయం వద్ద పార్కింగ్లో ఉన్న వాహనాలపైకి దూసుకుపోయింది. దీంతో మోటారు సైకిల్పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా పలు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. కారులో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. పిఠాపురం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. కత్తిపూడి నుంచి కాకినాడ వైపు వస్తున్న కారు బుధవారం అర్ధరాత్రి పిఠాపురం పాదగయ సెంటర్లో ఒకే మోటార్ సైకిల్పై చంద్రపాలెం పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న స్థానిక ఇందిరానగర్కు చెందిన పల్లా కృష్ణ, ఏడిద వెంకటేష్, బి పత్తిపాడుకు చెందిన కే మహేంద్రను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా వేగంగా దూసుకెళ్లి పాదగయ క్షేత్రం వద్ద పార్కింగ్లో ఉన్న పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడగా పాదగయ సెంటర్లో ఉన్న పలు మోటారు సైకిళ్లు ధ్వంసం అయ్యాయి. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని అంబులెన్సులో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బి పత్తిపాడుకు చెందిన కే మహేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్సై మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా వచ్చి మోటార్ సైకిలిస్టులను ఢీ కొట్టిన వైనం ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం కారులోని వారిని కాపాడిన ఎయిర్ బెలూన్లు -
పెట్టుబడి ఘనం.. గిట్టుబాటు గగనం
సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం కాగా తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. అందులోనూ మోరి జీడిపప్పు కేరళ పప్పు కంటే మంచి రుచిగా ఉండడం వల్ల డిమాండ్ ఉంది. కేవలం ఇక్కడ తయారీ విధానం ద్వారా మాత్రమే ప్రసిద్ధి. రెండు శాతం మినహా గింజలు మాత్రం పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే. గతంలో మోరికి పరిమితమైన ఈ పరిశ్రమ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. అయితే సీజన్ ప్రారంభమయ్యే మార్చి నెలాఖరులో ఉగాదికి అందుబాటులో ఉన్న గింజల ధర కాస్తా అమాంతంగా పెరగడం, పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగడం చిరు వ్యాపారస్తులను డీలా పర్చాయి. రాజోలు దీవిలో.. రాజోలు దీవిలో ప్రప్రథమంగా మోరిలో తయారైన జీడిపప్పు తదనంతర కాలంలో దీవిలో సుమారు 25 గ్రామాలకు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఏడాదికి మోరి తదితర ప్రాంతాల్లో తయారయ్యే జీడి పప్పు సుమారుగా 8 నుంచి 9 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. ఈ పరిశ్రమపై ఆధార పడిన కుటుంబాలు 25 వేలు వరకూ ఉంటాయి. పరిశ్రమ ద్వారా ఏడాది టర్నోవర్ సుమారు రూ.480 కోట్ల నుంచి రూ.500 కోట్లు వరకూ ఉంటుంది. కొత్త గింజలతో వ్యాపారం ఏటా మార్చి నెలాఖరు నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చే దేశవాళీ గింజలతో సీజన్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రాలుగా జీడిపప్పు ఎగుమతితో పాటు, సమీపంలోని పాలకొల్లు, భీమవరం, నర్సాపురం పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. కాగా జీడిగింజలు హెచ్చు రేటుకు కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసే చిరు వ్యాపారులు మాత్రం అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. స్వదేశీ గింజలతో వ్యాపారం సీజన్ స్వదేశీ గింజలతో వ్యాపారం ప్రారంభమవుతుంది. ఇక్కడి వ్యాపారులు జీడిగింజలను రాజానగరం, మధురపూడి, ఎల్లవరం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాలపురం, దూబచర్ల, కొయ్యలగూడెం నుంచి దిగుమతి చేసుకుంటారు. సీజన్ ప్రారంభంలో మార్కెట్లో 80 కిలోల దేశవాళీ బస్తా గింజలు రవాణా చార్జీలతో కలిపి రూ.10 వేలు పలికింది. ఆ రేటు కాస్తా ప్రస్తుతం రూ.12 వేలుకు చేరింది. కాగా 80 కిలోల గింజలను పప్పుగా తయారు చేయడానికి వ్యాపారస్తులకు రూ.1,500 వెచ్చించాల్సి వస్తుంది. స్వదేశీ గింజల్లో లభించే ముడిపప్పు 20 కిలోలను మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. 10 కిలోల గుండు మొదటి రకం, 8 కిలోల ముక్కబద్ద రెండో రకం, 2 కిలోల నలిముక్క మూడో రకం. ప్రస్తుతం మార్కెట్లో కేజీ గుండు ధర రూ.820, కేజీ బద్దముక్క రూ.770, నలిముక్క రూ.400 పలుకుతోంది. ఈ ప్రకారంగా గుండుకు రూ.8,200, ముక్కబద్దకు రూ.6,160, నలి ముక్కకు రూ.800 లభిస్తోంది. ఇలా చూసుకుంటే ఈ గింజల ద్వారా ఆదాయం రూ.15,160 వస్తోంది. గిట్టుబాటు స్వల్పమే మార్కెట్లో 80 కిలోల గింజలను తయారీలో పప్పుగా మార్చడానికి అయ్యే ఖర్చులతో కలిపి గింజలపై రూ.13,500 పెట్టుబడిగా ఉంది. మార్కెట్లో తెల్లపప్పు అమ్మకాల ద్వారా వస్తున్నది రూ.15,160. ఈ రకంగా చూసుకుంటే వ్యాపారస్తుడికి చేతికి మిగిలేది కేవలం రూ.1,660. ఇందులో ఇతర ఖర్చులు పోను రాబడి లెక్కిస్తే ఆటుపోట్లు మధ్య వ్యాపారం కష్టంగా మారింది. జీడిపప్పు చిరు వ్యాపారుల డీలా కలసిరాని పెళ్లిళ్ల సీజన్ అమాంతంగా పెరిగిన గింజల ధర పెరిగిన గింజల ధర కుటీర పరిశ్రమగా విరాజిల్లిన జీడిపప్పు వ్యాపారం ఇప్పుడు ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతోంది. సీజన్ ప్రారంభంలో రూ.10 వేలు ఉన్న బస్తా గింజల ధర ఇప్పుడు రూ.12 వేలుకు చేరింది. దీంతో పెట్టుబడి భారం ఎక్కువ అయింది. – ముప్పర్తి ఆదినారాయణమూర్తి, చిరువ్యాపారి, మోరి మందకొడిగా వ్యాపారం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వ్యాపారం మందకొడిగా ఉంది. గింజల ధర కూడా ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. సీజన్ ప్రారంభంలో అందుబాటులో రేటుకు గింజలు లభిస్తే పెట్టుబడి భారం తగ్గేది. – జె.మాణిక్యాలరావు, చిరువ్యాపారి, మోరి -
నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకం
మలికిపురం: నేరాల దర్యాప్తు, పరిశోధనలలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని, అందుకే ప్రతి కూడళ్లలో వాటిని ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం మలికిపురం పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల జరిగిన అనేక నేరాలు, చోరీ కేసులలో నేరస్తుల గుర్తింపునకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. అన్ని ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, వర్తక సంఘాలు కూడా సహకరించాయన్నారు. జిల్లాలో గంజాయి నేరాలు తగ్గాయని, ఈ కేసులలో పాత నేరస్తులపై నిఘా ఉంచి కట్టడి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో నాయకుల విగ్రహాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాసంఘాలకు సూచించామన్నారు. గల్ఫ్ ఉద్యోగాల పేరుతో కోనసీమలో మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. లైసెన్స్ కలిగిన ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ సుంకర మురళీ మోహన్, సీఐ నగేష్ కుమార్, ఎస్సైలు పీవీఎస్ఎస్ఎన్ సురేష్, రాజేష్ కుమార్, కె.దుర్గా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం 24 రోజులుగా రాజమహేంద్రవరం కలెక్టర్ వద్ద ఆందోళన చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు బుధవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్పష్టం చేయడంతో పార్టీ తరఫున అండగా ఉంటామని భరత్ హామీ ఇచ్చారు. ఆందోళన కారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ గైడ్ లైనన్స్ ప్రకారం ఆరేళ్లు వర్క్ చేస్తే, పర్మినెంట్ చేయాలని, అందుకే మీ డిమాండ్కి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం ఎంపీల మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన తెలుగుదేశం ఎందుకు లొంగిపోయిందో అర్థం కావడం లేదన్నారు. కరోనా నేపథ్యంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలని గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భరత్ చెప్పారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ మొదటి ఫేజ్లోనే తీసుకొచ్చామని, రెండవ ఏడాదిలోకి కాలేజీ అడుగుపెట్టిందని అన్నారు. తమ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్లను కూడా తీసుకొచ్చిందన్నారు. అప్పట్లో కేంద్రానికి మన ఎంపీల మద్దతుతో పనిలేకున్నా సరే, పోరాడి సాధించామని చెప్పారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పారని, మరి ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. అప్పులు చేసుకుంటూ పోతూ కూడా సంక్షేమ పథకాలు అమలుచేయడం లేదని భరత్ విమర్శించారు. మాజీ ఎంపీ భరత్ -
సముద్రంలో ముమ్మరంగా గాలింపు
కొత్తపల్లి: సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడడంతో గల్లంతైన మేరుగు శ్యామ్ కోసం బుధవారం కుడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించారు. మత్స్యకారులు, అధికారులు నాలుగు బోట్లపై అతడి కోసం వెతుకుతున్నారు. అయితే తుపాను కారణంగా సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సారా నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రత్తిపాడు: పెద్దిపాలెం గ్రామంలో సారా నిందితుడిపై పీడీ యాక్టు అమలు చేసినట్టు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ బుధవారం తెలిపారు. పలుమార్లు సారా కేసులో నిందితుడిగా ఉన్న నడిగట్ల నూకరాజును అరెస్టు చేసి, పీడీ యాక్ట్ అమలు చేశామన్నారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించినట్టు చెప్పారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్టు కపిలేశ్వరపురం: నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం అంగర పోలీస్ స్టేషన్లో మండపేట రూరల్ సీఐ దొరరాజు వెల్లడించారు. ఆ ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం అంగర ఆర్అండ్బీ రహదారిలోని రైస్మిల్లు సమీపంలోని కిళ్లీకొట్టు వద్దకు మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన మన్యం వీర వెంకట సత్య సీతారామారావు వచ్చాడు. తన దగ్గర ఉన్న రూ.500 నోటు ఇచ్చి సిగరెట్ పెట్టె కొన్నాడు. ఆ నోటు నకిలీదని కిళ్లీకొట్టు యజమాని సత్యనారాయణ గుర్తించాడు. స్థానికుల సహాయంతో సీతారామారావును పట్టుకుని అంగర పోలీసులకు అప్పగించాడు. ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాలపై నిందితుడిని సీఐ దొరరాజు, ఎస్సై డి.రవికుమార్ విచారించారు. అతడి సమాచారం మేరకు పోలీసులు విజయవాడకు చెందిన వారా నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్ నుంచి 44 నకిలీ రూ.500 నోట్లు, లాప్టాప్, పెన్ డ్రైవ్, ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సీఐ దొరరాజు తెలిపారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య యానాం: పట్టణ పరిధిలోని న్యూరాజీవ్ నగర్కు చెందిన దంగుడుబియ్యం సత్యవతి (75) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుమారై ఫంక్షన్కు వెళ్లిన సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం యానాం జీజీహెచ్కు తరలించామని, ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై పంపన మూర్తి తెలిపారు. ఏడాదిగా సత్యవతి మానసికస్థితి బాగోలేదని, మందులు వాడుతోందని స్థానికులు తెలిపారు. -
కారు ఢీకొని మహిళ మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రి వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కలవచర్లకు చెందిన యర్రా మాణిక్యం (54) కంటి చూపు సరిగా కనిపించక ఇబ్బంది పడుతోంది. కంటి పరీక్ష చేయించుకుందామని జీఎస్ఎల్ ఆస్పత్రికి వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైంది. టు వే గా ఉన్న రహదారిపై డివైడర్ దాటి అవతలి వైపుకు వెళ్తుండగా రాజమహేంద్రవరం నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై నాగార్జున తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముగ్గురు పిల్లలకు వివాహాలు చేశారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మోటార్ బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి గండేపల్లి: వర్షం కారణంగా మోటారు బైక్ అదుపు తప్పడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎసై యూవీ శివనాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గండేపల్లికి చెందిన షేక్ నాగూర్ సాహెబ్ (57) రాజానగరంలోని గైట్ కళాశాలలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం మోటార్ సైకిల్పై డ్యూటీకి బయలుదేరారు. వర్షం పడుతున్న సమయంలో మురారి శివారు మాతారాణి దాబా ఎదురుగా మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజానగరం జీఎస్ఎల్కు, అక్కడి వైద్యుల సూచనల మేరకు కాకినాడ జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. నాగూర్ సాహెబ్కు భార్య నూర్జహాన్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కొత్తపేట: అవిడి పెదపేట గ్రామానికి చెందిన నామాడి సుధాకర్ అలియాస్ బుజ్జి (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అవిడి రేవు సమీపంలో పంట కాలువ కల్వర్టు గోడపై అతడు మృతి చెంది ఉండటాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సుధాకర్కు భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉండగా, పెద్ద కుమార్తె ఎంసెట్ పరీక్ష రాసింది. చిన్న కుమార్తె పదో తరగతి పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న సుధాకర్ మంగళవారం ఉదయం నుంచి మద్యం తాగుతూనే ఉన్నాడు. రాత్రి 9 గంటల సమయంలో పంట కాలువ కల్వర్టు వద్ద అతడు మద్యం మత్తులో ఉండగా స్థానికులు చూశారు. ఉదయానికి రక్తపు వాంతులు చేసుకుని చనిపోయి ఉండగా గుర్తించి, అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్నయ్య నామాడి రవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
పొగాకు రైతుల పక్షాన పోరాటం
దేవరపల్లి: పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం గోపాలపురంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు కూసం రామ్మోహన్రెడ్డి ఇంటి వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. పొగాకు రైతుల కష్టాలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. ప్రభుత్వానికి మరికొన్ని రోజులు గడువు ఇద్దామనే ఉద్దేశంతో గురువారం పొగాకు వేలం కేంద్రం వద్ద జరగవలసిన ఆందోళనను వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 2021 పంట సీజన్లో కరోనా సమయంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో ఉండగా, అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.200 కోట్లు విడుదల చేసి మార్క్ఫెడ్ ద్వారా పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. పంటల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతు పండించిన పంటలకు మద్ధతు ధర ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. 2024–25 పంట కాలంలో రైతులు సుమారు 75 మిలియన్ల కిలోల పొగాకు పండించగా, ఇప్పటి వరకు కేవలం 12 మిలియన్ల కిలోలు కొనుగోలు జరిగిందన్నారు. గత ఏడాది కిలోకు రూ. 410 లభించగా, ఈ ఏడాది రూ. 250 పలుకుతోందని, దీని వల్ల పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని ఆయన తెలిపారు. ఆరుగాలం కష్టపడే రైతులు ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అయినా కూటమి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడంలేదన్నారు. రైతులు పండించిన పొగాకును రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో అప్పులు రూ.1.40 లక్షల కోట్లు కాగా, కూటమి ప్రభుత్వం 11 నెలల పాలనలో 1.59 కోట్లు అప్పు చేసిందన్నారు. ఇంటింటికీ రేషన్ వాహనాల రద్దు దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది వలంటీర్లను, 16 వేల మంది మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న నిరుద్యోగులను, మరొక 16 వేల మంది రేషన్ వాహనదారులను తొలగించిందని మండిపడ్డారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి,రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు, రైతు విభాగం అధ్యక్షుడు వి.సత్యనారాయణ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ -
ఐసెట్లో 96.90 శాతం ఉత్తీర్ణత
రాయవరం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చి, 96.90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల ఏడో తేదీన ఆంధ్రా యూనివర్సిటీ ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 743 మంది విద్యార్థులు హాజరు కాగా, 720 మంది పాసయ్యారు. వారిలో 240 మంది బాలురు, 480 మంది బాలికలు ఉన్నారు. ప్రశాంతంగా టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ, ఓపెన్ పరీక్షలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ సప్లిమెంటరీ పరీక్షకు 486 మంది విద్యార్థులు హాజరయ్యారు. 18 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 904 మంది హాజరుకావాల్సి వుంది. ఓపెన్ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ తెలుగు పరీక్షకు 235 మందికి 110 మంది హాజరయ్యారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రసాయన శాస్త్రం పరీక్షకు 384 మందికి 253 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 21 వరకు యోగా మాసోత్సవాలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మన ధరిత్రి మన ఆరోగ్యం అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి కోరారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద బుధవారం నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, సంయుక్త కలెక్టర్ చిన్న రాముడు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. జూన్ 21వ తేదీ వరకు యోగా మాసంగా పాటిస్తామన్నారు. సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.55 కోట్లుఅన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 26 రోజులకు గాను రూ.1,55,04,639 ఆదాయం వచ్చింది. హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. ఈ కానుకల్లో నగదు రూ.1,46,96,779, చిల్లర నాణేలు రూ.8,07,860 వచ్చాయని చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. బంగారం 48 గ్రాములు, వెండి 730 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. రోజుకి సరాసరి రూ. 5,96,332 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. అమెరికా డాలర్లు 184, కెనడా డాలర్లు 15, సింగపూర్ డాలర్లు రెండు, ఇంగ్లాండ్ పౌండ్లు ఐదు, స్కాట్లాండ్ పౌండ్లు పది, కువైట్ దీనార్లు 20, యూఏఈ దీరామ్స్ 25, ఖతార్ రియాల్స్ పది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహరెన్ దీనార్ ఒకటి లభించాయి. వేసవి సెలవులు, వివాహాలు, ఈ నెల ఏడో తేదీ నుంచి 13 వ తేదీ వరకు సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు కారణంగా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వీరంతా కానుకలు వేయడంతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్రావు లెక్కింపులో పాల్గొన్నారు. పార్టీ తప్పిదం వల్లనే కార్యకర్తల్లో అసహనం – టీడీపీ కాకినాడ రూరల్ మినీ మహానాడులో జ్యోతుల నవీన్ కాకినాడ రూరల్: తెలుగుదేశం పార్టీ తప్పిదం వల్ల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల ముందు నుంచి ఇన్చార్జిని ప్రకటించాలని కార్యకర్తలు మొర పెట్టుకుంటున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద స్పందన ఫంక్షన్ హాలులో బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడును నిర్వహించారు. పరిశీలకుడిగా శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్తిబాబు హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ కాకినాడ రూరల్లో జనసేన ఎమ్మెల్యేను నెగ్గించుకున్నామని, ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
బదిలీలకు గ్రీన్ సిగ్నల్
రాయవరం: ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రెండేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న బదిలీలను పాఠశాలల పునఃప్రారంభంలోపు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు బదిలీల జీవో 22ను ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి విడుదల చేసింది. దీంతో బుధవారం నుంచి బదిలీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన.. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్ఎంలకు బదిలీలు జరగనున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన వీటిని నిర్వహిస్తారు. 2017 ఆగస్టు 31కి ముందు ఆ పాఠశాలలో విధుల్లో చేరిన స్కూల్ అసిస్టెంట్/ఎస్జీటీ తత్సమాన క్యాడర్, 2020 ఆగస్టు 31 ముందు విధుల్లో చేరిన గ్రేడ్–2 హెచ్ఎంలు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. అలాగే 2027 మే నెలాఖరు లోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని క్యాడర్లకు చెందిన సుమారు 18 వేల మంది వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన తేదీలు ● బదిలీల ప్రక్రియకు సంబంధించి బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు ఈ నెల 21, 22 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి. 28న ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంది. ● స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 21 నుంచి 24 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్న్1, 2 తేదీల్లో ఆప్షన్లు పెట్టుకోవాలి. ● ఎస్జీటీలు ఈ నెల 21 నుంచి 27 వరకూ దరఖాస్తులు చేసుకోవాలి. వీరికి జూన్ ఏడు నుంచి 10వ తేదీ వరకూ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. హామీలకు కట్టుబడాలి ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి. బదిలీ జీవోలో ప్రధానంగా మూడు అంశాల్లో స్పష్టత కొరవడింది. ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్, ఖాళీలు బ్లాక్ చేయకుండా ఉండడం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల స్టడీ లీవ్ ఖాళీల విషయంలో హామీలను అమలు చేయాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ స్పష్టత లేదు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో జరిపిన చర్చల ప్రకారం మరికొన్ని విషయాల్లో అధికారులు స్పష్టంగా జీవోలు విడుదల చేయాలి. ఇంగ్లిషు మీడియంతో సమానంగా తెలుగు మీడియం నిర్వహించాలన్న అంశం, మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలన్న అంశాలపై స్పష్టత లేదు. – నరాల కృష్ణకుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ నిబంధనల ప్రకారమే.. బదిలీ షెడ్యూల్ విడుదలైంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపడుతున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బదిలీలు నిర్వహిస్తాం. విద్యాశాఖ నుంచి వచ్చిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కిందస్థాయికి చేరవేసి, ఎటువంటి గందరగోళానికి తావులేకుండా నిర్వహిస్తాం. – పి.రమేష్, డీఈవో, కాకినాడ జిల్లా విడుదలైన జీవో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కొన్ని అంశాలపై స్పష్టత లేదంటున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు -
మళ్లీ నిరీక్షణాలు!
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం అనుకున్నంత పని చేసింది. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానానికి మంగళం పాడింది. ఇంటింటికీ వెళ్లి రేషన్ అందజేస్తున్న ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాలను తొలగిస్తున్నట్లు గతంలో స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కేబినేట్లో నిర్ణయం తీసుకోవడంతో వాహనాల తొలగింపునకు మార్గం సుగమమైంది. వృద్ధులు, వికలాంగులకు రేషన్ సరకులను డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. దేశం మెచ్చిన వ్యవస్థను ఎత్తివేసి వాళ్లకు మాత్రం ఎలా అందిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఎండీయూ ఆపరేటర్లు అగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 2027 వరకు తమకు అవకాశం ఉన్నా.. వచ్చే నెల 1వ తేదీ నుంచే తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమపై కూటమి ప్రభుత్వానికి ‘ఎందుకంత కక్ష’ అని నిట్టూరుస్తున్నారు. తాము కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ఆవేదన చెందుతున్నారు. వందల మందికి ఉపాధి దూరం చేయడం దారుణమంటున్నారు. వ్యవస్థ రద్దయితే తిరిగి పాత పద్ధతి తెరపైకి రానుంది. రేషన్ షాపుల వద్ద గంటల తరబడి నిరీక్షించే రోజులు మళ్లీ ప్రారంభం కానున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ప్రతి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అందరూ కలిసి తమకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ చిన్నరాముడుకి విన్నవించారు. 2021లో శ్రీకారం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చౌకదుకాణాల వద్ద రేషన్ పొందాలంటే గగనంగా మారేది. షాపుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. అలాంటి దయనీయ పరిస్థితికి స్వస్తి పలికేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పథకానికి శ్రీకారం చుట్టింది. 2021 జనవరి 21న వాహనాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా ఈ వ్యవస్థ కొనసాగుతోంది. వృద్ధులు, అభాగ్యులు, రేషన్ డిపో వద్దకు వెళ్లి సరకులు తీసుకోలేని వారికి ఎంతో సాంత్వన చేకూరేది. ‘తూర్పు’లో ఇలా.. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 364 రేషన్ పంపిణీ వాహనాలు ఉండగా.. 5,64,994 రేషన్ కార్డులున్నాయి. 871 రేషన్ దుకాణాలుండగా.. ప్రతి నెలా 15,77,393 మందికి గాను 8,400 టన్నుల బియ్యం అందజేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 17 వరకూ ఈ–పోస్ యంత్రం ద్వారా జీపీఎస్ ట్రాకింగ్ పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. మొత్తం పంపిణీ కార్యక్రమాన్ని సెంట్రల్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయడంతో పకడ్బందీగా పథకం నడుస్తోంది. కొత్త పథకం వచ్చిందని రేషన్ డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఎండీయూలకు సరకులను సరఫరా చేసే బాధ్యతలను ఆయా డీలర్లకు అప్పగించారు. ఒప్పందం సంగతేంటి? ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీకి సంబంధించి ఎండీయూ నిర్వాహకులు 2027 వరకూ కొనసాగేలా గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వాహనాల వాయిదాలు సైతం అప్పటి వరకూ చెల్లించేలా సమయం కేటాయించింది. ఎండీయూ వాహనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాన్ని కల్పించింది. వాహన వ్యయంలో 10 శాతం లబ్ధిదారుడు నెలకు రూ.3 వేలు చెల్లిస్తుండగా.. మిగిలిన రూ.8 వేలు ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తోంది. పథకాన్ని రద్దు చేస్తే ఈ ఒప్పందాన్ని ఏం చేస్తారన్న మీమాంస నెలకొంది. తాము నెలవారీ వాయిదాలు ఎలా చెల్లించాలన్న ఆవేదన ఎండీయూ ఆపరేటర్లలో నెలకొంది. నిత్యావసరాలకు పంగనామాలు రేషన్ కార్డున్న లబ్ధిదారుడికి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై కిలో గోధుమ పిండి, కేజీ కందిపప్పు, అర కేజీ పంచదార ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అరకొరగా సరఫరా చేస్తున్నారు. తూకంలో తేడా వస్తోందన్న వాదనతో మంత్రి నాదెండ్ల మనోహర్ పంచదార పంపిణీ ఆపేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడో జరిగిన తప్పునకు తమను బాధ్యులను చేస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఆది నుంచీ అంతే... ప్రజా పంపిణీ విధానాన్ని నిర్వీర్యం చేసేందుకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తొలుత మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ మూర్ఖపు ఆలోచన అని చెప్పడంతో ఆయనకు ప్రజలపై ఏ మేరకు బాధ్యత ఉందో అర్థం అవుతోంది. ఇది చాలదన్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు సైతం ఎండీయూ ఆపరేటర్లను తీసేయాలన్న వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంపై ప్రజలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తోంది.జిల్లాలో రేషన్ దుకాణాలు : 871 రేషన్ పంపిణీ వాహనాలు : 364 రేషన్ కార్డులు : 5,64,994 పంపిణీ చేసే బియ్యం : 8,400 టన్నులు బియ్యం లబ్ధిదారులు : 15,77,393 364 మంది ఉపాధికి గండిఇంటింటికీ బియ్యం సరఫరా వాహనాలను నిలిపివేస్తే జిల్లా వ్యాప్తంగా 364 మంది ఎండీయూ ఆపరేటర్ల ఉపాధికి గండి పడుతుంది. ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ యూనిట్ కాస్ట్ రూ.6 లక్షలు కాగా అందులో లబ్ధిదారుని వాటా 10 శాతం (రూ.60వేలు) మిగిలిన రూ.5.40 లక్షలు బ్యాంకు రుణంగా ఇచ్చి ప్రోత్సహించింది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. డీలర్ వద్ద సరకులు సేకరించి ప్రతి ఇంటికీ అందజేసేందుకు నెలకు రూ.21వేలు ఇస్తుండగా రూ.3 వేలు బ్యాంకుకు, రూ.3 వేలు పెట్రోల్ ఖర్చులు, హెల్పర్కు రూ.5వేలు పోగా మిలిగిన రూ.10 వేల లబ్ధిదారుడి ఉపాధి కోసం కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వం వాహనాల తొలగింపు ప్రకటన చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు, వాహనదారుల ఉపాధికి గండి కొట్టిన పరిస్థితి తలెత్తింది. ఇంటింటికీ రేషన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం మంగళం వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆగనున్న సేవలు ఎండీయూ వాహనాలు తొలగిస్తున్నట్టు కేబినెట్లో వెల్లడి మొదలు కానున్న రేషన్ కష్టాలు షాపుల వద్ద ప్రజలకు తప్పని యాతనలు ఒక్కో సంక్షేమ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు డోర్ డెలివరీపై సందిగ్ధం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎండీయూ ఆపరేటర్ల ఉద్యమ బాట తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్కు వినతి పత్రం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
140 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ
కాజులూరు: అయితపూడిలోని మాజీ సర్పంచ్, పారిశ్రామిక వేత్త కొల్లు వెంకటేశ్వరరావు ఇంట్లో దొంగలు పడి, సుమారు 140 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. గొల్లపాలెం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు గత బుధవారం తిరుపతి, ఇతర తీర్థయాత్రలకు వెళ్లి మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి తిరిగి వచ్చారు. లోపలకు వెళ్లి చూడగా ఇంటిలోని ఇనుప బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దానిలో 140 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు బుధవారం గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్ కుమార్ కేసు నమోదు చేసి, డాగ్ స్క్యాడ్, క్లూస్క్యాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. -
చోరీ సొత్తుతో సహా నిందితుడి అరెస్ట్
● రూ.10 లక్షల నగదు రికవరీ ● 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు అన్నవరం: స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుడి బ్యాగ్ కోసి రూ.10 లక్షలు అపహరించిన నిందితుడిని 24 గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ డీ శ్రీహరి రాజు మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన బోడపాటి నాగేశ్వరరావుకు తునిలో ఇంటి స్థలం ఉంది. దానిని ఆయన తన స్నేహితుడు భానుప్రకాష్ ద్వారా రూ.20 లక్షలకు ఇటీవల విక్రయించారు. ఆ మేరకు రూ.10 లక్షల నగదు, మరో రూ.10 లక్షల చెక్కును బ్యాగులో పెట్టుకుని సోమవారం ఉదయం తునిలో ఆర్టీసీ బస్సు ఎక్కి అన్నవరం బస్కాంప్లెక్స్లో దిగారు. బస్కాంప్లెక్స్లో గుంటూరు బస్సు కోసం వేచి చూస్తుండగా మరో వ్యక్తి ప్రయాణికుడిలా నటిస్తూ ఆయనతో మాటలు కలిపారు. అనంతరం ఆయనను మభ్యపెట్టి పదునైన చాకుతో బ్యాగ్ కోసి రూ.పది లక్షల నగదు అపహరించి పారిపోయాడు. మధ్యాహ్నం ఆయన గుంటూరు బస్సు ఎక్కే సమయంలో బ్యాగ్ చూడగా కోసి ఉంది. దీంతో ఆయన కంగారుగా బస్సు దిగి చూడగా బ్యాగ్లో రూ.10 లక్షలు లేవు. దీంతో ఆయన సోమవారం మధ్యాహ్నం అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్ కాంప్లెక్స్లో తనను మాటల్లో పెట్టిన వ్యక్తే చోరీ చేసుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ శ్రీహరి రాజు, పెద్దాపురం సీసీఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, ప్రత్తిపాడు సీఐ బీ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్ఐ శ్రీ హరి బాబు, ఏఎస్సై బలరామ్, హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణ బాధితునితో మాట్లాడారు. నేరస్తుడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపాం సెంటర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి బ్యాగ్ పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతుండగా పొలీసులు అతడిని ప్రశ్నించడంతో ఆ నేరం తానే చేసినట్టు అంగీకరించాడు. అతడిని విశాఖకు చెందిన కంబాల శ్రీనుగా గుర్తించారు. అతని వద్ద గల బ్యాగ్లో చోరీ సొత్తు రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రత్తిపాడు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులను ఎస్పీ జీ బిందుమాధవ్ అభినందించారు. -
బోటు బోల్తా పడి మత్స్యకారుడి గల్లంతు
కొత్తపల్లి: సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఒక మత్స్యకారుడు గల్లంతు కాగా మరో ఇద్దరు మత్స్యకారులు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పాడ నాయకర్ కాలనీకి చెందిన మేరుగు శ్యామ్ అదే గ్రామానికి చెందిన రామిశెట్టి వీరబాబు, వంకా ఇస్సాక్ బోటుపై మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు చేపల వేటకు వెళ్లారు. తుపాను ప్రభావంతో సముద్రం ఉధృతంగా ఉండడంతో హోప్ హైలాండ్ సమీపంలో బోటు బోల్తా పడింది. బోటులో ఉన్న మేరుగు శ్యామ్ గల్లంతుకాగా వీరబాబు, ఇస్సాక్ హోప్ హైలాండ్ తీరానికి చేరుకున్నారు. మత్స్యకారులు, అధికారులు గల్లంతైన శ్యామ్ కోసం బోట్లపై గాలింపు చర్యలు చేపట్టారు. శ్యామ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికొత్తపేట: ఇద్దరు మోటారు సైక్లిస్టులు ఎదురెదురుగా ఢీకొనగా ఒక మోటార్ సైక్లిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తపేట ఎస్సై జీ సురేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన వాడ చైతన్యజనార్దన (36) సోమవారం రాత్రి ఒక పని నిమిత్తం మోటార్ సైకిల్పై రావులపాలెం వెళ్లి తిరిగి అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా మందపల్లి వంతెన సమపంలో కొత్తపేట వైపు నుంచి మోటార్ సైక్లిస్టు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. చైతన్యజనార్దనను ఢీకొన్న మోటార్ సైక్లిస్టుకు కూడా గాయాలైనట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు. మృతుని భార్య వాడ చిన్నారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు. -
కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకం
● ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ఐజీ, ఎస్పీ ● ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ ● అనుమతి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ● మాజీ ఎంపీ హర్షకుమార్ రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈ నెల 24న జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు అనుమతి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హెచ్చరించారు. మంగళవారం రాజమహేంద్రవరం రాజీవ్గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐజీ, ఎస్పీలు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి గతంలో ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతీ చర్చిలో మీటింగులు పెట్టి ఈ నెల 24వ తేదీన జరిగే ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు వెళ్లవద్దని, వెళ్లిన వారిపై అరెస్టులు చేసి, కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై మాట్లాడినా, పోస్టర్లు ముద్రించినా, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా కేసులు పెడతామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు సంబంధించిన పోస్టర్ వేశామన్నారు. ఆ పోస్టర్లో కొంతమంది పెద్దల పేర్లు వేశామని తెలిపారు. వారిని ఎమ్మార్వో ఆఫీస్కు పిలిపించి రూ.50 వేల సొంత పూచీకత్తు కట్టించుకుని, బైండోవర్ కేసులు పెట్టారని తెలిపారు. క్రైస్తవులకు మీటింగులు పెట్టుకునే హక్కు లేదని ప్రకటిస్తే మేము మీటింగులు పెట్టబోమన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి హత్యగానే నమ్ముతున్నామన్నారు. ప్రవీణ్ పగడాల హత్యపై రీ పోస్టుమార్టం చేయిస్తామన్నారు. ప్రవీణ్ ప్రగడాల సంస్కరణ సభ జరగనివ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రవీణ్ ప్రగడాల హత్య వెనుక చాలా పెద్ద హస్తమే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ప్రగడాల సంస్కరణ సభకు ఒకరోజు ముందుగానే 50 మంది బిషప్లు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రైస్తవ సంఘాలు, యువజన సంఘాలు ఈ సభకు తరలి వస్తున్నాయని ఎక్కడైనా ఆపితే అక్కడకక్కడే ధర్నా చేసి సభ నిర్వహిస్తారని, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని దానికి బాధ్యులు పోలీసులే అవుతారని పేర్కొన్నారు. శాంతియుతంగా సభ నిర్వహిస్తామని, దానిని పరిక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు. -
నా బిడ్డల్ని రక్షించండి
కాకినాడ క్రైం: ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు స్పందించకపోయినా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్, మత్స్యకారుడు రాజు మానవత్వాన్ని చాటుకోవడంతో ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.విజయ తన బృందంతో అక్కడకు చేరుకున్నారు. రోదిస్తున్న తల్లికి ధైర్యం చెప్పి, ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. వాన నీటిలో తడిసి, నానిపోయి చిగురుటాకుల్లా వణికిపోతున్న పిల్లల్ని కాపాడి, సపర్యలు చేశారు. తల్లి నుంచి వివరాలు సేకరించారు. భర్త వదిలేయడంతో తాను ముగ్గురు పిల్లలతో రోడ్డున పడ్డానని ఆ మహిళ తన కష్టాన్ని విజయ బృందం వద్ద చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. తనకు ఇద్దరు నాలుగు, రెండేళ్ల మగపిల్లలతో పాటు నాలుగు నెలల వయసు బిడ్డ కూడా ఉందని చెబుతూ గుండెలకు హత్తుకున్న శిశువును చూపింది. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావని వారు ప్రశ్నించగా.. తన నాలుగేళ్ల కుమారుడికి పోలియో వల్ల కాళ్లు చచ్చుబడి నడవలేకపోతున్నాడని, పాకడం వల్ల రెండు కాళ్లు పుండ్లు పడ్డాయని, చూసి తట్టుకోలేక ఏడ్చానని విలపించింది. తన బిడ్డల్ని కాపాడాలని వేడుకుంది. కన్నబిడ్డల దుస్థితి చూసి తాళలేక ఆ తల్లి మానసిక వేదనకు గురైందని గుర్తించిన విజయ, ఆమె బృందం వారిని కాకినాడ జీజీహెచ్లోని దిశ వన్స్టాప్ సెంటర్కు పరమేశ్వర్, రాజుల సాయంతో తరలించింది. కాళ్లు చచ్చుబడిన నాలుగేళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతకు ముందు పిల్లల్ని రాజమహేంద్రవరంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వర్చువల్గా హాజరుపరిచారు. కమిటీ ఆదేశాల మేరకు ముగ్గురు పిల్లలతో పాటు తల్లిని వన్స్టాప్ సెంటర్ పర్యవేక్షణలో ఉంచి సంరక్షిస్తున్నారు. తల్లీబిడ్డలను రక్షించిన వారిలో విజయతో పాటు కౌన్సిలర్ దుర్గారాణి, సోషల్ వర్కర్ ఎస్.చినబాబు కూడా ఉన్నారు. ఫ నడిరోడ్డుపై.. హోరువానలో ఓ అమ్మ ఆక్రందన ఫ పిల్లలకు ఆహారం, వైద్యం అందించలేక వేదన ఫ తక్షణమే స్పందించిన డీసీపీయూ బృందం ఫ తల్లి, ముగ్గురు పిల్లలకు రక్షణ ముగ్గురు పసికందులు.. నాలుగేళ్లు, రెండేళ్లు, నాలుగు నెలల వయసు.. తండ్రి వదిలి పోయాడు. కానీ, అమ్మ అలా చేయలేదు. రక్తం పంచి ఇచ్చింది కదా.. వివాహేతర సంబంధాల అడ్డదారిలో వెళ్లిపోయిన భర్తలా.. పేగు బంధాన్ని తెంచేసుకోలేకపోయింది. నాలుగేళ్ల కొడుక్కి కాళ్లు లేవు.. నాలుగు నెలల పాపకు పాలిద్దామన్నా దేహం సహకరించడం లేదు. అవిటితనం అంటిన బిడ్డ చచ్చుబడిన కాళ్లతో పాకుతూంటే పుండ్లు పడ్డాయి. వర్షం నీటిలో తడిసి పచ్చిబడ్డాయి. నొప్పితో అరిచేందుకై నా గొంతు దాటి బాధ బయటకు రానంత నిస్సత్తువ.. ఆ స్థితిని కన్నతల్లి చూడలేకపోయింది. తినడానికి తిండి లేదు. హోరు వానలో నడిరోడ్డులో నరక యాతన అనుభవిస్తున్న పేగుబంధాలను రోడ్డు మీదే పడుకోబెట్టి గుండెలు బాదుకుంటోంది. వర్షంలో కన్నీళ్లు కలిసి పోవడం వల్లనేమో.. పిచ్చిదనుకున్నారు. కానీ, బిడ్డల కోసం ఏడుస్తోందని తెలుసుకునేందుకు అక్కడి వారికి గంట పైగా సమయం పట్టింది.. ఈ హృదయ విదారక సంఘటన కాకినాడ బస్టాండ్ ఆవరణలో మంగళవారం చోటు చేసుకుంది. ఐసీడీఎస్ అధికారుల కథనం ప్రకారం... -
జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టి–హబ్
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోనిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో టి–హబ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కేంద్ర ప్రాంగణాన్ని మంగళవారం ఆమె పరిశీలించి, భవనం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా యువతకు మరింత ఉపాధి, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంగణంలో ప్రాథమిక శిక్షణ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర నిధులతో చేపట్టనున్న ఈ భవన నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఏఈ శంకర్ను ఆదేశించారు. ప్రస్తుత భవనంలో నైపుణ్య శిక్షణలు త్వరితగతిన ప్రారంభించాలని జిల్లా నైపుణ్యాధికారి వీడీజీ మురళిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ల్యాండ్ సర్వేయర్ ఏడీ బి.లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. వెబ్సైట్లో అర్హుల జాబితా రాజమహేంద్రవరం రూరల్: మిషన్ వాత్సల్య, వన్స్టాప్ సెంటర్, చిల్డ్రన్ హోమ్లలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులు, అనర్హుల జాబితాను తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్సైట్లో ఉంచారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి విజయకుమారి మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తమ కార్యాలయం ఆధ్వర్యాన గత ఏడాది అక్టోబర్ 14న, ఈ ఏడాది జనవరి 31న, ఏప్రిల్ 7న మిషన్ వాత్సల్య, వన్స్టాప్ సెంటర్, చిల్డ్రన్ హోమ్లలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని వివరించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులు, అనర్హుల వివరాలను eastgodavari.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. అలాగే, కలెక్టరేట్లోను, బొమ్మూరులోని తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులోను ఈ జాబితాను ఉంచామన్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూకు పిలుస్తామని తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే సంబంధిత ఆధారాలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో బుధవారం సాయంత్రం 5 గంటల లోపు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని విజయకుమారి సూచించారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమ్మె రాజమహేంద్రవరం రూరల్: సమస్యలు పరిష్కరించాలని, జీతాలు పెంచాలనే డిమాండ్లతో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ 102 సర్వీస్ డ్రైవర్లు కలెక్టరేట్ వద్ద మంగళవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు. వారి సమ్మెకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, కార్యదర్శి బీవీఎన్ పూర్ణిమరాజు సంఘీభావం తెలిపారు. 102 సేవలను 2015లో ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకూ వీరికి రూ.8,800 మాత్రమే జీతం ఇస్తున్నారని వారు తెలిపారు. పదేళ్లలో ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వాలు మారాయి, కంపెనీలు మారాయి కానీ, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు మాదిరిగా వీరికి కూడా రూ.18,500 వేతనం ఇప్పించాలని కోరారు. హైకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతభత్యాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విఘ్నేశ్వరస్వామివారి హుండీ ఆదాయం రూ.27,68,281 అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారి హుండీ ఆదాయాన్ని అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం లెక్కించారు. 61 రోజులకు గాను స్వామివారికి హుండీల ద్వారా రూ.27,68,281 లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 4.4 గ్రాముల బంగారం, 436 గ్రాముల వెండి లభించాయన్నారు. 30 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు చెప్పారు. -
పంపా.. ఆహ్లాదకరంగా..
నెల రోజుల కిందటి వరకూ నీరుంటుందా.. ఆవిరైపోయి.. నీటిమట్టం 79 అడుగులకు పడిపోయి.. డెడ్ స్టోరేజ్కు చేరుకుని.. రిజర్వాయర్ ఎండిపోతుందా అనే పరిస్థితి. అన్నవరం గ్రామానికి, దేవస్థానానికి నీటి ఎద్దడి తప్పదేమోననే ఆందోళన.. అటువంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణ ధారలు కురిపిస్తూండటంతో పావన పంపా రిజర్వాయర్ జలకళతో తొణికిసలాడుతోంది. ఓవైపు ఎండలు మండిపోతున్నా.. పరీవాహక ప్రాంతాలైన శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని కొండల్లో నెల రోజుల నుంచి తరచుగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో, రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం నాటికి 84.60 అడుగులకు పెరిగింది. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీలు. ప్రస్తుతం 0.028 టీఎంసీలకు నీటి నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం 105 క్యూసెక్కుల చొప్పున నీరు వస్తుండడంతో జలాశయం నీటిమట్టం 85 అడుగుల వరకూ పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వస్తున్న భక్తులు జలకళతో తొణికిసలాడుతున్న పంపా రిజర్వాయర్ను చూసి ఆనందిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తురాయి చెట్లు కూడా ఎర్రని పూలు పూస్తూండటంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. పలువురు భక్తులు రత్నగిరి నుంచి పంపా రిజర్వాయర్ కవరయ్యేలా సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారు. పంపా ఘాట్ల వద్ద స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు. – అన్నవరం పంపా ఘాట్ల వద్ద పెరిగిన నీటిమట్టం -
వానలో తడుస్తూ.. సమస్యలపై ఎలుగెత్తుతూ..
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) జాతీయ రహదారిపై వర్షంలో తడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఇలాగైన ప్రభుత్వ పెద్దల మనస్సు కరిగి, సానుకూలంగా స్పందించాలని కోరారు. ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్హెచ్పి)/సీహెచ్ఓల అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యాన సీహెచ్ఓలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.మమత మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. -
విక్రయ వస్తువుపై ధర, బరువు ఉండాలి
అమలాపురం టౌన్: విక్రయ వస్తువుల ప్యాకెట్లపై దాని ధర, బరువు లేదా కొలత విధిగా ఉండాలని అమలాపురం తూనికలు, కొలతలశాఖ (లీగల్ మెట్రాలజీ) అసిస్టెంట్ కమిషనర్ కె.రాజేష్ సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువులకు సంబంధించి దుకాణాదారుని నుంచి బిల్లును అడిగే చైతన్యం వినియోగదారుల్లో రావాలని అన్నారు. అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎర్రవంతెన వద్ద గల ఆ శాఖ కార్యాలయంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కొన్న వస్తువులకు బిల్లులు అడగడం ఓ హక్కుగా వినియోగదారులు భావించాలన్నారు. ముఖ్యంగా బంగారం విక్రయాలకు సంబంధించి వినియోగదారులకు ఇచ్చే బిల్లులపై విధిగా ఆ బంగారం ఎన్ని క్యారెట్లు వంటి వివరాలు ఉండాలని సూచించారు. వ్యాపార సంఘాల ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర బంగారం, వెండి వర్తకుల సంఘం కోశాధికారి అనిల్కుమార్ జైన్, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్యవరప్రసాద్ మాట్లాడుతూ తూనికలు, కొలతల నిబంధనలపై వ్యాపారస్తులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వినియోగదారుల సంఘాల ప్రతినిధులు అమరేశ్వరరావు, అభిరామ్, అమలాపురం బంగారు, వెండి వర్తకుల సంఘం అధ్యక్షుడు మేడిచర్ల త్రిమూర్తులు, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధిగా మోకా వెంకట సుబ్బారావు, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రతినిధిగా దొమ్మేటి సాయిబాబు, వ్యాపారులు కొవ్వూరి వెంకటరెడ్డి, రేకపల్లి సత్యనారాయణమూర్తి, రాయుడు నాని, అనుపోజు శ్రీను, చవాకుల కృష్ణ, చింతలపూడి సత్తిబాబు ప్రసంగించారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గోకరకొండ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. లీగల్ మెట్రాలజీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజేష్ -
సీహెచ్ఓల వినూత్న నిరసన
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ 21 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) సోమవారం వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో సూర్య నమస్కారాలు వేస్తూ, ఒంటికాలిపై నిలుచుని నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి, తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్హెచ్పీ)/సీహెచ్ఓ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.మమత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్యలు సానుకూలంగా పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, కోత లేకుండా క్రమం తప్పకుండా పని ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. – రాజమహేంద్రవరం రూరల్ -
గుల్జార్ హౌస్లు!
మనకీ ఉన్నాయి..ఈ జాగ్రత్తలు అవసరం ఇళ్లు, అపార్టుమెంట్లు, గ్రూప్ హౌస్ల వంటి నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడం అక్షరాలా ప్రాణ రక్షణతో సమానం. అగ్నిమాపక విభాగం, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బీసీ) సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ప్రమాణాలు ఈ అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతగానో దోహదపడతాయి. ఫ ప్రతి భవంతిలో రెండు ఫైర్ ఎగ్జిట్లు తప్పనిసరి. అవి ఎక్కడున్నాయో అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలియాలి. వినియోగించడంపై అవగాహన ఉండాలి. ఫ ఫైర్ అలారం వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలి. పొగ, మంటలు చెలరేగినప్పుడు స్పీకర్లు, హెచ్చరిక లైట్లతో అప్రమత్తం చేసే ఏర్పాట్లు అవసరం. ఫ ప్రతి ఫ్లోర్లో ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు తగినన్ని ఉండాలి. వాటి పని తీరును ప్రతి నాలుగు నెలలకోకసారి పరిశీలించుకోవాలి. ఫ భారీ భవంతుల్లో ఫైర్ హైడ్రెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అనూహ్యంగా ప్రమాదాలేవైనా జరిగితే వీటి ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చర్యలను మరింత సులువుగా చేపట్టగలుగుతారు. ఫ 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రతి భవనంలోనూ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. ఫ కనీసం ప్రతి ఆరు నెలలకోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహిస్తే నివాసితుల్లో అవగాహన పెరుగుతుంది. ఫ విద్యుత్ వైరింగ్, ఉపకరణాల్లో లోపాలే చాలా అగ్నిప్రమాదాలకు మూలం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ సేఫ్టీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భవన యజమానులకు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. విద్యుత్ తీగలు, సాకెట్లు క్రమం తప్పకుండా నాణ్యంగా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటూ ఉండాలి. షార్ట్ సర్క్యూట్ సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ ప్రతి భవనం నిర్మాణ సమయంలో అగ్నిమాపక విభాగం నుంచి ఫైర్ సేఫ్టీ అప్రూవల్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ హైదరాబాద్ పాతబస్తీ అగ్ని ప్రమాదంతో ఉలికిపాటు ఫ మన భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు ఫ కాకినాడ, రాజమహేంద్రవరం సహా పలుచోట్ల ప్రమాదకరంగా భవనాలు ఫ ముందే మేల్కొంటే మేలు కాకినాడ క్రైం: హైదరాబాద్లో చార్మినార్ దగ్గరలోని గుల్జార్ హౌస్లో ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం 17 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న సంఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. విద్యుత్ షార్ట్సర్క్యూట్తో జరిగిన ఈ ప్రమాదంలో అందరూ సజీవ దహనమైపోయారు. చనిపోయిన వారిలో ఐదేళ్ల లోపు పిల్లలు ఎనిమిది మంది, 60 ఏళ్ల పైబడ్డ వారు ఐదుగురు ఉన్నారు. ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని ఘోర అగ్ని ప్రమాదమిది. ఈ ప్రమాదంలో తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారిలో అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో బయటపడడం ఏ ఒక్కరికీ సాధ్యం కాలేదు. ఈ ఘోర కలి మన నగరాల్లోని భవనాలల్లో భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇటువంటి ఇరుకై న వ్యాపార సముదాయాలు, నివాస భవనాలు కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మనమూ ముందస్తుగా మేల్కోవలసిన ఆవశ్యకతను గుల్జార్ హౌస్ ప్రమాదం గుర్తు చేస్తోంది. ఇరుకు ప్రాంతాలు.. భద్రత లేని భవనాలు కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో చాలా ప్రాంతాలు ఎంతో ఇరుకుగా ఉన్నాయి. మెయిన్ రోడ్లు సహా మార్కెట్ వీధులు, ఇతర ప్రాంతాల్లో ఇటువంటి భవనాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కాకినాడ మెయిన్ రోడ్డులో మసీద్ సెంటర్ మొదలు జగన్నాథపురం వంతెన వరకూ కుడి, ఎడమ వైపున అనేక దుకాణాలను గ్రౌండ్ ఫ్లోర్లలోనే నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్తో స్టాక్ పెట్టి, రెండో అంతస్తులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న అనేక వ్యాపార సముదాయాలు, నివాస భవనాలు ఇదే రీతిలో ఉన్నాయి. దాదాపు వీటన్నింటిలోనూ పై అంతస్తుల నుంచి కిందకి దిగడానికి ఒకటే మార్గం ఉంటోంది. ఊహించని విధంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేని పరిస్థితి. ఫ కొద్ది రోజుల క్రితం కాకినాడ సంతచెరువు జంక్షన్లోని ఓ భవంతి ఒకటో అంతస్తులో ఏసీ షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఫ కాకినాడ భానుగుడి కూడలిలో వ్యాపార సముదాయాలు కలిగిన సుభద్ర ఆర్కేడ్లో కొన్నాళ్ల క్రితం అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ ప్యానళ్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. ఉదయం వేళ కావడంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి, ప్రమాదాన్ని నిలువరించారు. నిలిచిన తనిఖీలు ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్లు నిలిపి వేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అగ్నిమాపక శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలున్నాయి. జిల్లా స్థాయిలో ప్రస్తుతం తనిఖీలేవీ జరగడం లేదు. గతంలో భవనాల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేసి, ఒకే మార్గాలున్న భవనాలన్నింటికీ అదనపు మెట్ల మార్గాలు ఏర్పాటు చేయించారు. అయితే, కొన్ని నెలల క్రితం నుంచి ఆ తనిఖీలకు తిలోదకాలిచ్చారు. పొగే ప్రమాదకారి మంటలు వ్యాప్తి చెందే తొలి దశలో మంటల కంటే పొగే ప్రమాదకారి. హైదరాబాద్ ఘటనలో 17 మరణాలు సంభవించడానికి కారణం కూడా పొగ వ్యాపించి, ఊపిరి ఆడకపోవడమే. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని సైతం ఈ పొగ అడ్డుకుంటుంది. ఊపిరాడకుండా చేసి, ప్రాణాలు తీస్తుంది. ఇరుకై న నివాస, వర్తక సముదాయాలు అగ్నిప్రమాదాలకు నిలయాలు. ఆయా ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత మార్గదర్శకాలు పాటిస్తూ మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్ ఆధ్వర్యంలో తరచుగా చేపడుతున్న మాక్ డ్రిల్, అవగాహన సదస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. – ఉద్దండురావు సుబ్బారావు, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి, కాకినాడ -
కొత్తిమీర.. అధర గొట్టేలా..
పెరవలి: దాదాపు ప్రతి ఒక్కరూ నిత్యం వంటల్లో ఉపయోగించే కొత్తిమీరకు ప్రస్తుతం మంచి ధర పలుకుతోంది. సాగు చివరి దశకు చేరడంతో మార్కెట్లోకి కొత్తిమీర రావడం కాస్త తగ్గుతోంది. దీంతో, మార్కెట్లో దీని ధర పెరుగుతోంది. దీనికి అనుగుణంగా రైతు వద్ద కూడా ధరలో పెరుగుదల కనిపిస్తోంది. పెరవలి మండలం అన్నవరప్పాడు, ఖండవల్లి, ముత్యాలవారిపాలెం, లంకమాలపల్లి, ఓదూరివారిపాలెం, కాకరపర్రు, తీపర్రు, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు గ్రామాల్లో సుమారు 150 ఎకరాలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు కొత్తిమీర సాగు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కిలో కొత్తిమీర ధర ఏకంగా రూ.150కి పెరిగింది. అంతలోనే దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్ను ముంచెత్తడంతో క్రమంగా ధర తగ్గుతూ వచ్చి కిలోకు ఏకంగా రూ.20కి పడిపోయింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు నిర్వేదానికి గురై, ప్రజలను కొత్తిమీర ఉచితంగా పట్టుకెళ్లిపొమ్మని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దశలో కూలి రేట్లు కూడా పెరిగిపోవడంతో కొత్తిమీర మొక్కలు తీసి, కట్టలు కట్టే కన్నా పొలంలో వదిలేస్తేనే నయమని రైతులు భావించారు. అటువంటిది.. ప్రస్తుతం సాగు చివరి దశకు రావడంతో దిగుబడి తగ్గి, కొత్తిమీర ధర క్రమేపీ పెరగడం మొదలైంది. ప్రస్తుతం రైతుకు కిలో రూ.60 వరకూ దక్కుతోంది. మార్కెట్లో వినియోగదారులకు ఒక్కో కొత్తిమీర కట్ట రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నారు. కిలోకు ఐదారు కట్టలు వస్తాయి. దీని ప్రకారం మార్కెట్లో కిలో కొత్తిమీర ధర రూ.100 నుంచి రూ.150 వరకూ పలుకుతోంది. కానీ, రైతుకు రూ.60 మాత్రమే దక్కుతోంది. ధర మరి కాస్త పెరిగితే తమకు మరింత మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో కొత్తిమీర సాగుకు రూ.25 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. దిగుబడి రెండు మూడు టన్నులు వస్తోంది. టన్నుకు రూ.60 వేలు వస్తోందని, పెట్టుబడి, ఇతర ఖర్చులు పోనూ ఎకరానికి నికరంగా రూ.30 వేలు మిగులుతుందని రైతులు చెబుతున్నారు. అయితే, దిగుబడులు తగ్గిన తరువాత ధర పెరగడంతో నష్టపోతున్నామని వాపోతున్నారు. ధర స్థిరంగా ఉంటే.. పదెకరాల్లో కొత్తిమీర సాగు వేశా ను. ఎకరానికి రూ.20 వేల వర కూ పెట్టుబడి అయ్యింది. ఎనిమిదెకరాల్లో పంట ముందుగా రావడంతో కిలో రూ.20 నుంచి రూ.25 మధ్య అమ్మాల్సి వచ్చింది. పెట్టుబడి కూడా రాలేదు. ప్రస్తుతం కిలోకు రూ.60 పలుకుతోంది. దిగుబడిని బట్టి ఎకరానికి రూ.40 వేల నుంచి రూ. 50 వేల వరకూ వస్తుంది. ఈ ధరలు స్థిరంగా ఉంటే మొదటి పంట నష్టం కొంతవరకూ పూడ్చుకోగలం. – ఆకుల సూర్యనారాయణ, రైతు, ముత్యాలవారిపాలెం ఫ గతంలో కిలో రూ.20కి పడిపోయిన రైతు ధర ఫ నేడు ఏకంగా రూ.60కి పెరుగుదల ఫ రిటైల్ మార్కెట్లో రూ.100కు పైనే -
రాజోలు టీడీపీలో ఇన్చార్జి రగడ
ఫ గుబ్బలకు చెక్ పెడుతూ ఎస్సీల సమావేశం ఫ పదవి కోసం పావులు కదుపుతున్న జగడం, గెడ్డం మలికిపురం: రాజోలు నియోజకవర్గంలోని టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కూటమి నుంచి జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అతీగతీ లేకుండా ఉన్నామని టీడీపీ క్యాడర్ అసంతృప్తితో ఉండగా.. గత కొంత కాలంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పదవిపైనా ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సోమవారం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో నియోజకవర్గ టీడీపీ ఎస్సీ విభాగం సమావేశాన్ని గోనిపాటి రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికల తరువాత ఒక నాయకత్వం లేకుండా ఉన్న టీడీపీకి ఇన్చార్జిని వెంటనే నియమించాలని కోరుతూ తీర్మానం చేశారు. పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడిగా ఉన్న గెడ్డం సింహాను ఇన్చార్జిగా నియమించాలని తీర్మానించారు. అయితే ఈ పదవి కోసం ఆ పార్టీలోని అదే సామాజికవర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు రాజోలుకు చెందిన జగడం సత్యనారాయణ కూడా కర్చీఫ్ వేశారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇటీవల వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును టీడీపీలోకి తీసుకుని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించుకుని జనసేన ఎమ్మెల్యేకు ధీటుగా పెట్టుకుందామని టీడీపీలో ఒక వర్గం పావులు కదపగా, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా నియోజకవర్గ టీడీపీ ఎస్సీ విభాగం అత్యవసరంగా సమావేశం కావడం వెనుక ఆ పార్టీలో ఉన్న తీవ్ర అసంతృప్తే కారణమని తెలుస్తోంది. రాజోలు నియోజకవర్గం నుంచి ధవళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఉన్న గుబ్బల శ్రీనివాస్ను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ఖరారు చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ధీటుగా ఎస్సీ నియోజకవర్గమైన రాజోలుకు బీసీ ఇన్చార్జి ఏంటనే విధంగా తాజాగా ఎస్సీ విభాగం సమావేశం తీర్మానం చేసింది. ఇందులో భాగంగా గెడ్డం సింహాను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించాలని చేసిన తీర్మానం కాపీలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు సోమవారం సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. -
పొగాకు గిట్టుబాటు ధర కోసం 22న ధర్నా
ఫ దేవరపల్లి వేలం కేంద్రం వద్ద ఆందోళన ఫ వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా దేవరపల్లి: పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన ఈ నెల 22న ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద గురువారం ఉదయం 9 గంటలకు రైతులతో కలసి ఈ ఆందోళన చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు విలవిలలాడుతున్నారని, పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన భారీ ధర్నా చేపడుతున్నామన్నారు. ఈ ఆందోళనలో జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని రాజా కోరారు. అర్జీదారులకు ఎండార్స్మెంట్లు తప్పనిసరి రాజమహేంద్రవరం సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో అందజేసిన అర్జీలకు సంబంధించి ఫిర్యాదీలకు ఎండార్స్మెంట్లు తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఆడిట్ నివేదిక ప్రకారం 50 శాతం మంది అర్జీదారులకు ఎండార్స్మెంట్ చేరడం లేదనే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ సీతారామమూర్తి, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖకు సంబంధించి 127, పంచాయతీరాజ్ 40, పోలీసు 30, వ్యవసాయం 16, ఇతర శాఖలకు సంబంధించి 73 చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. ఫిర్యాదుల్లో రెవెన్యూ, సర్వే శాఖలవే అధికంగా ఉంటున్నాయని, తర్వాతి స్థానాల్లో పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖలున్నాయని తెలిపారు. పరిష్కారం చూపలేని అంశాలకు కారణాలు తెలపాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సమకూర్చిన రూ.25 వేల విలువైన కృత్రిమ అవయవాలను ముగ్గురు మహిళలు, ఒక పురుషునికి కలెక్టర్ ప్రశాంతి అందజేశారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 40 అర్జీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 40 అర్జీలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా క్రైం బ్రాంచి (డీసీఆర్బీ) ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో ఏపీ ఈఏపీ సెట్ సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. నగరంలోని లూథర్గిరి అయాన్ డిజిటల్ జోన్లో జరిగిన ఈ పరీక్షలకు 92.26 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 649 మందికి 594 మంది పరీక్షలు రాశారు. అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో 657 మందికి గాను 610 మంది హాజరయ్యారు. మొత్తం 1,300 మందికి గాను 1,204 మంది పరీక్షలు రాశారు. -
రత్నగిరి.. భక్తజనఝరి
అన్నవరం: సత్యదేవుని సన్నిధి సోమవారం భక్తజనఝరిని తలపించింది. రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులతో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాలతో అలంకరించి (ముత్తంగి సేవ) పూజించారు. -
గోదావరిలో స్నానానికి దిగి యువకుడి మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): గోదావరిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... చాగల్లు మండలం ధారవరం గ్రామానికి చెందిన గాడి రాకేష్ (17) స్నేహితులతో కలసి కొవ్వూరు మండలం సీతంపేట వద్ద గోదావరిలో స్నానానికి దిగాడు. ఈ నేపథ్యంలో గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికుల సాయంతో అతన్ని బయటకు తీసి నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాకేష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి తండ్రి శ్రీను, తల్లి, ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. శ్రీను కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నట్లు చెబుతున్నారు. మృతి ఘటనపై కొవ్వూరు పోలీసులకు సమాచారం అందాల్సి ఉంది. ఇదిలాఉంటే పలు ప్రాంతాల నుంచి సీతంపేట వద్దకు నిత్యం అధిక సంఖ్యలో స్నానాలకు వస్తున్నారు. ఇక్కడ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణంకొత్తపేట: స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై జి.సురేంద్ర కథనం ప్రకారం.. మండల పరిధిలోని వాడపాలెం గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు (40) ఆదివారం రాత్రి స్థానిక దేవాలయంలో బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి కొత్తపేట వచ్చాడు. నాగేశ్వరరావు పాత బస్టాండ్ వద్ద నిలబడి ఉండగా అమలాపురం వైపు నుంచి రావులపాలెం వైపుకు వెళుతున్న ఆర్టీసీ బస్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతని బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై మృతుని భార్య దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర వివరించారు. -
అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అమలాపురం రూరల్: తన పేరుపై ఉన్న భూమిని వేరే వ్యక్తి పేరున ఆన్లైన్లో మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి చెందిన రైతులు అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. సదరు భూమిని తిరిగి తన పేరున మార్చాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పలుసార్లు తిరిగినప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రలోభాలకు గురై వేరొకరి పేరున ఆన్లైన్ చేసిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతు ఆకుల నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూమికి ఏవిధమైన దస్తావేజులు లేకుండా కుంపట్ల ఆదినారాయణ పేరున ఆన్లైన్లో అక్రమంగా నమోదు చేశారన్నారు. దీనిపై తనకు తగిన న్యాయం చేయాలని నాగేశ్వరరావు కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
శ్యాంబాబు మృతి మాదిగలకు తీరని లోటు
కాకినాడ సిటీ: ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన కొండేపూడి శ్యాంబాబు మాదిగ మృతి జాతికి తీరని లోటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. కాకినాడ మధురానగర్లో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పూర్వ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత శ్యాంబాబు కుటుంబ సభ్యులను మందకృష్ణ పరామర్శించి ధైర్యాన్ని నింపారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుకున్నది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే అన్నారు. అనేక సవాలను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో శ్యాంబాబు కీలకపాత్ర పోషించారన్నారు. అనంతరం శ్యాంబాబు చేసిన ఉద్యమాలకు సంబంధించిన ఫొటోలను, శ్యాంబాబు నిలువెత్తు ఫొటోలను కుటుంబ సభ్యులతో కలసి కృష్ణమాదిగ తిలకించి ఆవిష్కరించారు. జాంబవ నిధికి కొండేపూడి శ్యాంబాబు కుటుంబ సభ్యులు రూ.లక్ష చెక్కును కృష్ణమాదిగకు అందజేశారు. కార్యక్రమానికి కొండేపూడి శ్యాంబాబుమాదిగ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. -
ఐఎఫ్ఎస్కు ములగపూడి విద్యార్థి ఎంపిక
రౌతులపూడి: మండలంలోని ములగపూడికి చెందిన చింతకాయల లవకుమార్ ఇండియన్ ఫారెస్టు సర్వీసు(ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యారు. సోమవారం విడుదలైన 2024 ఐఎఫ్ఎస్ పరీక్షా ఫలితాల్లో ఆయన 49వ ర్యాంకు సాధించారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరసర్వ చక్రవర్తి, వీర వరహాలు దంపతులకు లవకుమార్ జన్మించారు. ఆయనకు సోదరి స్వాతి ఉన్నారు. లవకుమార్ ఒకటి నుంచి మూడో తరగతి వరకూ ములగపూడిలో చదువుకున్నారు. 4 నుంచి 8వ తరగతి వరకూ కత్తిపూడి రిఫరల్ పాఠశాలలోను, 9, 10 తరగతులు తుని శ్రీప్రకాష్ విద్యాసంస్థలోను, ఇంటర్మీడియెట్ విజయవాడ చైతన్య జూనియర్ కళాశాలలో, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో బీవీఎస్సీ డిగ్రీ చదివారు. కొంతకాలం వెటర్నరీ అంబులెన్స్లో సేవలందిస్తూ యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. ఎటువంటి కోచింగ్ లేకుండా, సెల్ఫోన్లు వాడకుండా పట్టుదలతో చదివారు. నిరంతర కృషితో ఎట్టకేలకు ఐఎఫ్ఎస్ సాధించాడని తల్లిదండ్రులు తెలిపారు. ఐఎఫ్ఎస్ సాధించిన మొదటి వ్యక్తి తమ కుమారుడు కావడం ఆనందంగా ఉందన్నారు. లవకుమార్ విజయంపై కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
కోకో కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు
అంబాజీపేట: ఆరుగాలం శ్రమించి పండించిన కోకో గింజలను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర కోకో సాగురైతు సంఘ సహాయ కార్యదర్శి కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ అన్నారు. అంబాజీపేట కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కార్యాలయంలో జిల్లా కోకో రైతుల సమావేశం జిల్లా బీకేఎస్ అధ్యక్షుడు చేకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద వెంకటప్రసాద్ మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నచ్చిన ధరలకు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కోకో గింజలు నాణ్యత ఉన్నప్పటికీ సరైన ధర లేకపోవడం, విక్రయాలు జరగకపోవడంతో కోకో రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. కోకో గింజలకు ప్రస్తుతం అంతర్జాతీయ ధర కిలో రూ.940లు ఉండగా ప్రైవేట్ వ్యక్తులు కిలో రూ.500లోపు కొంటున్నారన్నారు. అంతర్జాతీయ ధరకే కోకో గింజలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విదేశీ గింజల దిగుమతులు నిలుపుదల చెయ్యాలని, ధరలు నిర్ణయించే వరకూ రైతులు, కంపెనీలు కొనుగోలు, అమ్మకాలు ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే కోకో రైతులను ఆదుకునేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోకో గింజల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కోకో రైతుల సంఘ అధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, రైతులు దంగేటి గిరిధర్, అడబాల రాజమోహన్, రెడ్డి రామకృష్ణ, అయ్యగారి శ్రీనివాస్, సరెళ్ల అప్పారావు, ప్రకాష్, సమయవంతుల పండు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా ముత్యాల నాయుడు
అంబాజీపేట: స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా డాక్టర్ ఎం.ముత్యాల నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లా, నంధ్యాలలోని మహానంది ఉద్యాన పరిశోధన కేంద్ర నుంచి ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు. ముత్యాల నాయుడు కొవ్వూరు, దర్శి, మహానంది తదితర పరిశోధన స్థానాల్లో సుగంధ ద్రవ్య పంటలు, అరటి, నిమ్మ, దుంప పంటలు, పండ్లు, కూరగాయల పంటలపై పరిశోధనలు చేసి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేసి మంచి గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానన్నారు. కొబ్బరిలో తెగుళ్లు, పురుగుల నివారణ, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి చేరువలో ఉంటానన్నారు. కొబ్బరిని ఆశించిన తెల్లదోమ నివారణకు ఎప్పటికప్పుడు రైతులతో మమేకమై నివారణకు కృషి చేస్తానన్నారు. ముత్యాల నాయుడిని స్థానిక శాస్త్రవేత్తలు, సిబ్బంది అభినందించారు. ఇక్కడ విధులు నిర్వహించిన డాక్టర్ ఎన్బీవీ చలపతిరావు తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యాన సమాచార కేంద్రంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ హోదాతో పాటు ముఖ్య ప్రజా సంబంధ అధికారిగా బదిలీపై వెళ్లారు. -
చరిత్ర చాటేలా.. చక్కదిద్దేలా..
అన్నవరం: అన్నవరం.. ఈ పేరు వింటేనే ప్రతి భక్తుని మది మురిసిపోతుంది.. ఆధ్యాత్మిక భావం వెల్లివిరుస్తుంది.. అలాంటి రత్నగిరిపై లోటుపాట్లు విమర్శలకు తావిచ్చాయి.. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ స్పందించారు. చక్కదిద్దే చర్యలకు ముందుకు వచ్చారు.. ఇక నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిత్యం జరిగే పూజాదికాలు, స్వామివారి కల్యాణోత్సవాలు, వేడుకల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై త్వరలో శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామివారి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు రోహిత్ వెల్లడించారు. ఈ ఏడాది మే ఏడో తేదీ నుంచి 13వ తేదీ వరకూ జరిగిన సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాల్లో గతంలో జరిగిన ఉత్సవాలకు భిన్నంగా వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు నిలిపివేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు వచ్చిన విషయం విదితమే. అదే విధంగా 13న జరిగిన స్వామివారి శ్రీపుష్పయాగంలో అమ్మవారిని స్వామివారికి ఎడుమవైపు కాకుండా కుడివైపునకు వచ్చేలా ఏర్పాటు చేయడంపై కూడా భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. కల్యాణోత్సవాల్లో చోటు చేసుకున్న అపశ్రుతులపై కూడా ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ‘ప్చ్..కళ కట్టలేదు’ శీర్షికన కథనం వచ్చింది. దేవస్థానంలో వైదిక కార్యక్రమాల విధి విధానాలు రూపొందించాల్సిన వైదిక కమిటీ సరైన శ్రద్ధ చూపకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శృంగేరి పీఠాధిపతితో చర్చించి వారి సూచనల మేరకు దేవస్థానంలో వైదిక కార్యక్రమాల రూపకల్పన, ఉత్సవాల్లో చేయాల్సిన క్రతువులు, హోమాలు నిలుపుదల చేయాలా వద్దా తదితర విషయాలపై కూడా స్పష్టత వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. దాని ప్రకారం భవిష్యత్తులో దేవస్థానంలో వైదిక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. వైదిక సలహాదారుడు లేక ఇబ్బంది దేవస్థానంలో గతంలో వైదిక కార్యక్రమాలపై సలహాలకు ప్రముఖ పండితుడిని వైదిక సలహాదారుగా నియమించి పూజలు నిర్వహించేవారు. తొలుత ప్రముఖ పండితుడు తంగిరాల బాలగంగాధరశాస్త్రి దేవస్థానం వైదిక సలహాదారుగా ఉండేవారు. ఆయన తరువాత రాజమహేంద్రవరానికి చెందిన పండితుడు మధుర కృష్ణమూర్తిశాస్త్రి 2010 వరకూ కొనసాగారు. 2014లో రాజమహేంద్రవరానికి చెందిన జాంపండు మాస్టారుగా పేరు పొందిన ప్రముఖ పండితుడు శ్రీసత్యనారాయణ మూర్తిని నియమించారు. ఆ తరువాత మరో సలహాదారుడిని నియమించలేదు. దీంతో దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకే వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయాలు తీవ్ర విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో వైదిక సలహాదారు లేని లోటు కనిపిస్తోంది. దేవస్థానంతో 50 ఏళ్ల అనుబంధం కలిగిన ప్రముఖ వేద, జ్యోతిష పండితుడు, మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు, కంచి కామకోటి పీథం, శృంగేరీ పీఠాధిపతులతో సాన్నిహిత్యం కలిగిన రాజమహేంద్రవరానికి చెందిన శ్రీవిశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రిని వైదిక సలహాదారునిగా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సత్యదేవుని సన్నిధిలో వైదిక కార్యక్రమాలు ‘సాక్షి’లో వరుస కథనాలతో చర్యలు శృంగేరి పీఠాధిపతి సూచనలతో ముందుకు.. అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ వెల్లడి విధి విధానాలు రూపొందిస్తాం.. ఈ ఏడాది కల్యాణోత్సవాల్లో వనదుర్గ అమ్మవారి హోమాల నిలిపివేత, శ్రీపుష్పయాగం రోజున స్వామి, అమ్మవారి అలంకరణపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్లో ఇటువంటి వివాదాలు రాకుండా చర్యలు తీసుకుంటాం. దేవస్థానంలో జరిగే వైదిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, అలంకరణలపై శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామివారిని మార్గదర్శనం చేయాలని కోరతాం. వారి సూచనలు, సలహాలు ప్రకారం నడుచుకుంటాం. వీటిని అతిక్రమించకుండా చూస్తాం. –ఐవీ రోహిత్, చైర్మన్, అన్నవరం దేవస్థానం -
అనాథరక్షకా.. ఆపద్బాంధవా..
ఫ గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి ఫ ఒక్కరోజే రూ.48.50 లక్షల ఆదాయం కొత్తపేట: అనాథరక్షకా.. ఆపద్బాంధవా.. గోవిందా.. అంటూ వేలాది భక్తులు ఆ స్వామిని కొలిచారు. గోవింద నామస్మరణతో ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మార్మోగింది. శనివారం వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. భారీ క్యూలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు. ఏడు శనివారాల నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. స్వామి దర్శనం, తీర్థప్రసాదాలు స్వీకరణ అనంతరం అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఒక్కరోజు సాయంత్రం 4.30 గంటల వరకూ దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.48,50,199 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆలయం వద్ద రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము బందోబస్తు పర్యవేక్షించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా వాడపల్లికి ప్రత్యేక బస్సులు నడిచాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మరొకరికి గాయాలు పిఠాపురం: దైవ దర్శనానికి కాలి నడకన వెళ్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన పిఠాపురం శివారు రాపర్తి జంక్షన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పిఠాపురం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. గొల్లప్రోలుకు చెందిన తొగర సూర్యలక్ష్మి, అడపా చంద్రకళ (35)లు శనివారం తెల్లవారుజామున గొల్లప్రో లు నుంచి పెద్దాపురం మండలం చిన తిరుపతి బయలుదేరారు. నడుచుకుంటూ వెళుతుండగా పిఠాపురం శివారు రాపర్తి జంక్షన్ వద్దకు వచ్చేసరికి అతి వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం వారిద్దరినీ బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన అడపా చంద్రకళ అక్కడికక్కడే మృతి చెందగా, సూర్యలక్ష్మికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన సూర్యలక్ష్మిని హైవే అంబులెన్సులో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త త్రిమూర్తులు అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటుండగా, కుమారుడు రాజేష్ ఇటీవలే పదో తరగతి పాసై ఇంటర్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధపడుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం. అంతా తానై కుటుంబాన్ని చూసుకునే చంద్రకళ మృత్యువాత పడడంతో ఆ కుటుంబం వీధిన పడిందని స్థానికులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. నీకు నాలాగ పేదరికం ఉండకూడదని, తనను తల్లి చదివిస్తుందంటూ కుమారుడు రాజేష్ గుండెలవిసేలా విలపించాడు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
అంబాజీపేట: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబాజీపేట మండలం ముక్కామల, వక్కలంక వంతెనకు మధ్య ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. స్థానికులు, సమీప బంధువుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా నిజామ్పేటకు చెందిన దొమ్మేటి శ్రావణ్కుమార్, అతని భార్య రేఖాలక్ష్మి (38), వీరి కుమార్తెలు లాస్య, మోహనగన ప్రియతో పాటు రేఖాలక్ష్మి అమ్మమ్మ కె.ధనలక్ష్మితో కలసి కారులో శనివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. అనంతరం అమలాపురం వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముక్కామల వచ్చేసరికి అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్ను వీరి కారు బలంగా ఢీకొంది. దాంతో కారులో ఉన్న రేఖాలక్ష్మికి తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. శ్రావణ్కుమార్, లాస్య, మోహనగన ప్రియ, ధనలక్ష్మిలకు తీవ్ర గాయాలు కాగా అమలాపురంలో ఓ ఆస్పత్రికి తరలించారు. రేఖాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై కె.చిరంజీవి పరిశీలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావణ్కుమార్ నిజామ్పేటలో స్థిరపడి అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతనిది యానం కాగా, మృతురాలి తల్లిదండ్రులది అమలాపురం.పళ్లాలమ్మ జాతరకు వచ్చి...వారం రోజుల కిందట నిజామ్పేట నుంచి వానపల్లి పళ్లాలమ్మ అమ్మవారి జాతర చూసేందుకు వచ్చి అమలాపురంలో మృతురాలి తల్లి ఇంటి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులంతా కలసి వెళ్లారు. అనంతరం యానం వెళ్దామనుకుని అమలాపురం వస్తుండగా ప్రమాదం జరిగిందని బంధువులు చెప్పారు. వారం రోజుల పాటు బంధువులతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబానికి ఇంతలో ప్రమాదం జరగడంతో అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. వేసవి సెలవులకు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంటుందని అనుకోలేదని బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.వివాహిత మృతి, నలుగురికి తీవ్ర గాయాలు -
ఆ ఇంట్లో ‘పెద్ద’ కష్టం
ఫ సైకిల్పై నుంచి పడిపోవడంతో ప్రమాదం ఫ మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద ఫ ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు కొత్తపేట: ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది.. రెక్కాడితే గాని డొక్కాడని ఆ ఇంటి పెద్ద ప్రమాదానికి గురై మంచాన పడటంతో అతని 15 ఏళ్ల కుమారుడిపైనే భారం పడింది. ఒకపక్క తండ్రికి వైద్యం, మరోపక్క కుటుంబాన్ని నెట్టుకురావడం ఈ బాలుడికి ఇబ్బందిగా మారింది. ఇలా నలుగురు సభ్యుల ఆ కుటుంబం తీవ్ర దయనీయ స్థితిలో ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట కొప్పిశెట్టివారి వీధికి చెందిన షేక్ అహ్మద్ యాకూబ్ ఆలీషా (48)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాపీమేస్త్రి వద్ద కూలీగా పనిచేస్తూ ఆలీషా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. గతేడాది నవంబరులో ఒకరోజు రాత్రి కూలిపని ముగించుకుని సైకిల్పై ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ హెడ్లైట్లు కాంతి కంట్లోకి కొట్టి కళ్లు కనిపించక సైకిల్ అదుపుతప్పి రోడ్డు మార్జిన్లో రాళ్లపై పడిపోయాడు. మెడ కింద వెన్నెపూస నరాలు నలిగిపోయి కాళ్లు చచ్చుబడిపోయాయి. మొదట్లో రావులపాలెంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా కొన్ని రోజులు వైద్యం చేశారు. రోగం ముదిరిందే తప్ప తగ్గలేదు. తర్వాత అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు, కొన్ని రోజులు వైద్యం చేసి ఆపరేషన్ పడుతుందని, రూ.6 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఆపరేషన్కు రూ.30 వేలు మాత్రమే వస్తుందని, మిగిలింది బాధితులే భరించాలన్నారు. అప్పటికే అప్పులు చేసి, బంధువులు, తెలిసిన వారు చేసిన సాయంతో సుమారు రూ.3 లక్షల వరకూ ఖర్చు చేశారు. కానీ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. సరికదా అనారోగ్యం ముదిరి పక్షవాతం వచ్చింది. ఇక ఆర్థిక స్తోమత లేక కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షలు చేసి ఆపరేషన్ చేస్తాం కానీ పూర్తిగా కోలుకుంటాడని చెప్పలేమని అక్కడి వైద్యులు చెప్పారని బంధువులు అంటున్నారు. దాంతో వద్దని చెప్పడంతో కొన్ని రోజులు వైద్యం చేసి డిచ్చార్జ్ చేశారు. నడవలేక మంచానికే పరిమితమైన ఆలీషాను నెలా, రెండు నెలలకోసారి ఫిజియోథెరపీకి కాకినాడ తీసుకు వెళుతున్నారు. వెళ్లిన ప్రతిసారి అంబులెన్స్కు రూ.10 వేలు, అక్కడ సిబ్బందికి రెండు, మూడొందలు ఇవ్వాల్సి వస్తుందని అతని భార్య బీబీజా వాపోయారు. భర్త మంచాన పడి, ఆదాయం లేకపోవడంతో పదో తరగతి పాసైన కుమారుడిపైనే వైద్యం ఖర్చులు, కుటుంబ పోషణ పడిందన్నారు. చదువుకు స్వస్తి చెప్పి కూలి పనికి వెళ్తున్నాడని, అయ్యే ఖర్చులకు తన కొడుకు సంపాదన సరిపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని బీబీజా ఆవేదనతో చెప్పారు. మంచాన పడిన వారికి ఇచ్చే పింఛను కోసం సదరం క్యాంపునకు వెళితే, 83 శాతం అంగవైకల్యం అని సర్టిఫికెట్లో పేర్కొన్నారు. కానీ టెంపరరీ అని రాశారని, దీనివల్ల పింఛను రాదన్నారని బీబీజా వాపోయారు. దీనావస్థలో ఉన్న ఈ కుటుంబానికి దాతలు ఆపన్నహస్తం అందించాలని స్థానిక పీఎంపీ షేక్ హైదర్, మెడికల్ రిప్రజంటేటివ్ షేక్ మక్బుల్ కోరారు. -
అనుమానాస్పద స్థితిలో జంట ఆత్మహత్య?
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో ఒక జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం కలకలం రేపింది. సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఓ రైలుకు అడ్డుగా ఆ జంట నిలబడి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాల వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో రైల్వే పోలీసులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే కాకినాడలోని ఓ ఆఫీస్లో అకౌంటెంట్గా సదరు వ్యక్తి పని చేస్తున్నట్లు, ఆ మహిళ నర్సుగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని రైల్వే మేనేజర్ రమేష్ వివరించారు. ఆ జంటకు వేర్వేరుగా వివాహాలు కాగా, ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు రాత్రి వరకూ ఎటువంటి వివరాలు చెప్పకపోవడం గమనార్హం. -
పిఠాపురం రూరల్లో మరోసారి ఉద్రిక్తత
కాకినాడ జిల్లా: పిఠాపురం రూరల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫక్రుద్దీన్ పాలెం( ఎఫ్.కే.పాలెం) పాపిడి దొడ్డి చెరువులో మట్టి తవ్వేందుకు యత్నించగా.. జేసీబీని రైతులు అడ్డుకున్నారు. చెరువును పరిశీలించిన సీపీఎం నేతలు.. చెరువులో మట్టి తవ్వుకునేందుకు ఎమ్మార్వో అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.3.5 ఎకరాల కోసం 360 ఎకరాలను బీడుగా మారుస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం మెరక పేరుతో చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తారని ఆరోపించారు. పంచాయితీ తీర్మానం, రైతులు అభిప్రాయం తీసుకోకుండా ఎమ్మార్వో మట్టి తవ్వకాలకు ఏలా అనుమతి ఇస్తారంటూ సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన ఉంటారో లేక వ్యాపారుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలంటూ సీపీఎం నేతలు హెచ్చరించారు. -
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కాకినాడ జిల్లా: తుని రూరల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. మరో ఘటనలో కడియం-రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలునుంచి జారి పడి సుమారు 50 ఏళ్ల వయసుగల వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని జీఆర్ఫీ ఎస్సై మావుళ్లు తెలిపారు. గాయపడి ఉండగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తించి 108 అంబులెన్సు ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.మృతుడు నలుపు రంగుపై పసుపు రంగు గడులు గల హాఫ్ హాండ్స్ షర్ట్, నీలం రంగు లుంగీ ధరించాడు. మృతుడి కుడి చేయి మీద సన్ ఫ్లవర్ గుర్తుతో పచ్చబొట్టు ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27551, 94910 03239 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
సమస్యలపై ప్రజాపోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సమస్యలపై ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని మేలుకొల్పేలా పోరుబాటకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతోంది. ఇందుకు పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రానున్న రెండు నెలల్లో మండల, గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్ లోగా ఇంకా మిగిలిన మండలాలు, జూలైకల్లా గ్రామ స్థాయి కమిటీల నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. కాకినాడ డి–కన్వెన్షన్లో శుక్రవారం జరిగిన పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలనేది ప్రధాన అజెండాగా నిర్ణయించారు. ఇందుకోసం ప్రజల సమస్యలపై పార్టీ స్థానిక నాయకత్వాలు శాంతియుత పంథాలో నిరసన కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వాన నిర్వహించిన ఆందోళనలపై ఈ సమీక్షలో చర్చించారు. ఇదే తరహాలో సమస్యలపై పోరుబాటకు సన్నద్ధం కావాలని నేతలకు బొత్స సూచించారు. జిల్లా స్థాయిలో సైతం పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని తీర్మానించారు. దీని కోసం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 50 రోజుల కార్యక్రమాన్ని ఖరారు చేశారు. వచ్చే జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో పార్టీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలను ఐదు జిల్లాల్లో 50 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతులకు అండగా.. ఫ ప్రధానంగా వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారని బొత్స తెలిపారు. కళ్లాల్లో ధాన్యం ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయంపై ఈ సందర్భంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న మాటలకు.. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి అసలు పొంతనే లేదని నేతలు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయంలో రైతుల ఇబ్బందులు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించి, వారితో మాట్లాడి, అండగా నిలవాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫ ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని నిర్ధారించారు. రొయ్యల ధరలు పడిపోవడం, మేత ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి రైతులు నష్టపోతున్నా సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదని, ఆక్వా రైతులకు వెన్నంటి నిలవాలని తీర్మానించారు. ఫ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాదిరిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు రైతులకు అండగా నిలిచి, పోరాడటానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. ఫ ప్రధానమైన ప్రజా సమస్యలపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు సైతం సిద్ధంగా ఉన్నారని బొత్స వివరించారు. ఫ సూపర్ సిక్స్ సహా కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రభుత్వంపై ప్రజాపోరులో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా బాధ్యత తీసుకోవడానికి నాయకులు ముందుకు వచ్చారు. ఫ క్షేత్ర స్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలకు అండగా నిలిచి, మనోధైర్యం కల్పించాలని తీర్మానించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, అనంత బాబు, బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, తానేటి వనిత, తోట నరసింహం, గొల్లపల్లి సూర్యారావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్రామ్, గిరజాల స్వామినాయుడు, పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పొన్నాడ సతీష్ కుమార్, జ్యోతుల చంటిబాబు, రౌతు సూర్యప్రకాశరావు, తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, పాముల రాజేశ్వరిదేవి, అంగూరి లక్ష్మీశివకుమారి, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు ముద్రగడ గిరిబాబు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మహిళా నేతలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మేడపాటి షర్మిలారెడ్డి, సుంకర శివప్రసన్న, జమ్మలమడక నాగమణి, పతివాడ నూక దుర్గారాణి, గాధంశెట్టి శ్రీదేవి, నేతలు సుంకర విద్యాసాగర్, అల్లి రాజబాబు, రాగిరెడ్డి బన్నీ, గండేపల్లి బాబీ, వాసిరెడ్డి జమీలు, చెల్లుబోయిన శ్రీనివాస్, గొల్లపల్లి డేవిడ్, మార్గాని గంగాధరరావు, పేరి శ్రీనివాసరావు, గుత్తుల మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రజలతో నేతలు మమేకమవ్వాలి ఫ ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అండ ఫ ఆక్వా రైతులకు వెన్నుదన్ను ఫ క్షేత్ర స్థాయి పర్యటనలకు అధినేత జగన్ ఫ ప్రతి 10 రోజులకు వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశం ఫ జూన్ లోగా మండల కమిటీలు ఫ జూలైనాటికి గ్రామ కమిటీలు ఫ కాకినాడ సమీక్షలో పార్టీ నేత బొత్స దిశానిర్దేశం -
క్లోజర్ పనులకు మంగళం?
ఫ పూడుకుపోయిన తూములు, కాలువలు ఫ పిఠాపురంలో సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తం ఫ సార్వా సీజన్ దగ్గర పడుతున్నా చేపట్టని వైనం పిఠాపురం: రబీ సీజన్ ముగిసింది.. పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేసి నెల రోజులు కావస్తోంది. ఇంకో 20 రోజుల్లో మళ్లీ కాలువలకు నీటి విడుదలకు రంగం సిద్ధమవుతోంది. కాని ఈ మధ్యలో చేపట్టాల్సిన పంట కాలువల అభివృద్ధి (క్లోజర్) పనులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు, పీబీసీ కాలువ ద్వారా పంటలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. పుణ్యకాలం పూర్తవుతున్నా ఎక్కడా కాలువల్లో పూడికతీత తీస్తున్న దాఖలాలు లేక ఇంకెప్పుడు చేస్తారో పనులు అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది సార్వాలో ఏలేరు వరదలు నియోజకవర్గంలో పంటలను నట్టేట ముంచేయగా రబీలో అకాల వర్షాలు పంటలను నాశనం చేశాయి. ఒకపక్క కాలువలు, తూములు, స్లూయిజ్లన్నీ మరమ్మతులకు గురై శిథిలావస్థలో ఉన్నాయి. ఎక్కడా సాగునీరు సక్రమంగా పారే పరిస్థితి లేదు. పంట విరామ సమయంలో అన్నీ పూర్తి చేస్తారని ఆశగా ఎదురు చూశామని, కానీ ఎక్కడా పనులు చేయకపోవడంతో ఈ ఏడాది నష్టాలు తప్పవని రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: కడియం – రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలునుంచి జారి పడి సుమారు 50 ఏళ్ల వయసుగల వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై మావుళ్లు తెలిపారు. గాయపడి ఉండగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తించి 108 అంబులెన్సు ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుడు నలుపు రంగుపై పసుపు రంగు గడులు గల హాఫ్ హాండ్స్ షర్ట్, నీలం రంగు లుంగీ ధరించాడు. మృతుడి కుడిచేయి మీద సన్ ఫ్లవర్ గుర్తుతో పచ్చబొట్టు ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27551, 94910 03239 నంబర్లలో సంప్రదించాలన్నారు. నిడదవోలులో.. నిడదవోలు : చాగల్లు –నిడదవోలు రైల్వేస్టేషన్ మధ్యలో శుక్రవారం విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న రైలు నుంచి జారిపడి 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడు నలుపు, సిమెంటు రంగు నెక్ బనియన్, నీలం రంగు ప్యాంట్ ధరించాడు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసినవారు 94906 17090, 99480 10061 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై అప్పారావు తెలిపారు. -
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
60 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు స్వాధీనం అన్నవరం: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులను మాటలతో మభ్యపెట్టి వారి బ్యాగుల్లో గల విలువైన ఆభరణాలు, నగదు అపహరిస్తున్న ఇద్దరు మహిళా దొంగలను శుక్రవారం స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద అరెస్ట్ చేసినట్టు ప్రత్తిపాడు సీఐ బీ సూర్య అప్పారావు తెలిపారు. అన్నవరం, ప్రత్తిపాడు బస్స్టేషన్ల వద్ద తమ బంగారు వస్తువులు దొంగలు అపహరించారని మహిళలు ఆయా పోలీస్స్టేషన్లలో కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బస్టాండ్ల వద్ద నిఘా పెట్టారు. శుక్రవారం అన్నవరం బస్ కాంప్లెక్స్ వద్ద దొంగతనం చేస్తున్న ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వీరిని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన నక్కా వెంకటలక్ష్మి, రామవరప్పాడుకు చెందిన నక్కా మంగగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 60 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి ప్రత్తిపాడు కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సమావేశంలో అన్నవరం ఎస్ఐ శ్రీహరి బాబు, అడిషనల్ ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. -
సివిల్స్ చదవడమే లక్ష్యం
జిల్లా 8వ ర్యాంకర్ స్పందన మామిడికుదురు: బీటెక్ పూర్తి చేసి సివిల్స్ చదవాలన్నదే తన లక్ష్యమని ఏపీ ఈసెట్లో కోనసీమ జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించిన మొగలికుదురు గ్రామానికి చెందిన గోగి మోహిని స్పందన శుక్రవారం తెలిపింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన స్పందన బీఎస్సీ మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రతిభ చూపింది. తండ్రి సత్యనారాయణ రైతు, తల్లి వెంకటలక్ష్మి గృహిణి. పేరెంట్స్ ప్రోత్సాహంతో తాను చదువుకున్నానని తెలిపింది. ఏపీ ఈసెట్లో ప్రతిభ చూపిన మోహిని స్పందనను స్థానికులు అభినందించారు. వ్యవసాయ శాస్త్రవేత్తనవుతా.. మామిడికుదురు: ఏపీ ఈసెట్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్లో ఆదుర్రు గ్రామానికి చెందిన గుబ్బల సాయిమణిరత్నం రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. తాను వ్యవసాయ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని అన్నాడు. శాస్త్రవేత్తగా రైతులకు మేలైన యంత్ర పరికరాలను తయారు చేసి, మంచి దిగుబడులు సాధించేలా కృషి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. సాయిమణిరత్నం తండ్రి లక్ష్మణరావు, తల్లి శ్యామలాదేవి దంపతులు రైతు కుటుంబానికి చెందినవారు. సాయిమణిరత్నంను స్థానికులు శుక్రవారం అభినందించారు. -
అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: సంకట హర చతుర్థి సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయం శుక్రవారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు జరిపారు. స్వామిని మాడ వీధుల్లో ఊరేగించారు. కోలాటం నిర్వహించారు. స్వామివారి పంచామృతాభిషేకాల్లో ముగ్గురు, లఘున్యాస అభిషేకాల్లో 109 మంది, గరికపూజలో ఒక జంట, ఉండ్రాళ్ల పూజలో తొమ్మిది మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 51 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. ఎనిమిది మందికి అక్షరభ్యాసాలు నిర్వహించారు. 2,500 మంది భక్తులు స్వామి అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి మొత్తం రూ.2,58,178 ఆదాయం లభించిందని ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
మంచి ఆర్కిటెక్ట్గా స్థిరపడతా.. 28వ ర్యాంకర్ యజ్ఞేశ్వరి అమలాపురం టౌన్: ఏపీ ఈ సెట్ ఫలితాల్లో అమలాపురానికి చెందిన పితాని యజ్ఞేశ్వరి రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంక్ సాధించింది. ఆమె సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఈ ర్యాంక్ను కై వసం చేసుకుంది. ఆమె అమలాపురం ఆరు నెలలుగా పీఆర్ ప్రాజెక్ట్స్ విభాగంలో ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈమె తండ్రి వెంకటరమణ వడ్రంగి మేస్త్రిగా పనిచేస్తున్నారు. భవిష్యత్లో మంచి ఆర్కిటెక్ట్గా స్థిరపడాలన్నది తన లక్ష్యమని ఆమె పేర్కొంది. అమలాపురం పంచాయతీరాజ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అభినందన సభలో యజ్ఞేశ్వరిని ఈఈ పులి రామకృష్ణారెడ్డి, డీఈఈ అన్యం రాంబాబు ప్రశంసించారు. కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కేధార్నాథ్ యాత్రలో రోటరీ క్లబ్ సభ్యుడి మృతి
రాజమహేంద్రవరం సిటీ: ఉత్తరాంచల్లోని కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన రాజమహేంద్రవరానికి చెందిన రోటరీ క్లబ్ ఐకాన్ సభ్యుడు బిలిసెట్టి శ్రీరంగ కృష్ణ బదరి(33) బుధవారం కేదార్నాథ్లో మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా శుక్రవారం మృతదేహాన్ని నగరంలోని కంబాలసత్రం సమీపంలోని కృష్ణ బదరి నివాసానికి తీసుకువచ్చారు. కృష్ణ బదరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా, క్లబ్ అధ్యక్షుడు యిమ్మన్ని వెంకట్, క్లబ్ సభ్యులు మృతదేహానికి నివాళులు అర్పించారు. తీగల రాజా మాట్లాడుతూ చిన్న వయసులోనే సమాజ శ్రేయస్సుకు శ్రద్ధగా పనిచేసే క్లబ్ సభ్యుడు అకాల మరణం సమాజానికి తీరని లోటు అన్నారు. కృష్ణ బదరి అంత్యక్రియలను ఇన్నీసుపేట రోటరీ కై లాస భూమిలో నిర్వహించారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
రూ.6,50,000 విలువైన వస్తువులు రికవరీ కోరుకొండ: మండలంలోని దోసకాయలపల్లిలో ఈ నెల 11వ తేదీన చోరీకి గురయిన రోవర్ మెషీన్, ల్యాబ్, లైటర్లను శుక్రవారం రికవరీ చేసినట్టు కోరుకొండ సీఐ సత్యకిషోర్ తెలిపారు. సర్వేయరు నాగేంద్ర రూ.6,50,000 విలువైన రోవర్ మెషీన్, ట్యాబ్, లైటర్లను దోసకాయలపల్లి సెంటర్లోని కిరాణాషాపులో చార్జింగ్ కోసం ఉంచాడు. తెల్లవారు దుకాణం తెరిచేటప్పటికే చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా, సీఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. రాజమహేంద్రవరం బాలాజీపేటకు చెందిన రవివర్మ, అతని తమ్ముడు, క్వారి మార్కె ట్ సెంటర్కు చెందిన యేసును పట్టుకున్నారు. వారి నుంచి వస్తువులను స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేశారు. -
నేడు వైఎస్సార్ సీపీ సమావేశం
రీజనల్ కోఆర్డినేటర్ బొత్స రాకసాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం కాకినాడలో జరగనుంది. పార్టీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాకినాడ డి కన్వెన్షన్లో జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, డీసీసీబీ, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు, సిటీ అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి దాడిశెట్టి రాజా గురువారం మీడియాకు తెలియజేశారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బొత్స మీడియాకు వివరించనున్నారు. ఆర్టీసీ ఇన్చార్జ్ డీపీటీవోగా రాఘవకుమార్ రాజమహేంద్రవరం సిటీ: తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా ఎస్టీపీ రాఘవకుమార్ గురువారం రాజమహేంద్రవరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీపీటీవోగా బాధ్యతలు నిర్వహించిన షర్మిల అశోక విజయవాడ బదిలీ కావడంతో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీపీటీఓగా ఉన్న రాఘవకుమార్కు తూర్పుగోదావరి జిల్లా డీపీటీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రయాణికులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఈసెట్ 25 ఫలితాల్లో 92.92 శాతం ఉత్తీర్ణత కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈసెట్ 2025 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 92.92 ఉత్తీర్ణత శాతం సాధించింది. అనంతపురంలోని జేఎన్టీయూలో ఈనెల 6వ తేదీన జరిగిన ఈ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో ఈ పరీక్ష మొత్తం 1,116 మంది పరీక్షలు రాశశారు. వీరిలో 1,037 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 790 మంది పరీక్షలు రాయగా 722 మంది, బాలికల విభాగంలో 326 మంది పరీక్షలు రాయగా 315 మంది ఉత్తీర్ణత సాధించారు. -
క్వారీ లారీ బోల్తా
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు – లంపకలోవ రహదారిలో గురువారం ఓ క్వారీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లాటరైట్ ఖనిజాన్ని తరలించేందుకు వెళుతున్న ఆ లారీ రైతు గౌతు గంగ పొలంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై ఫిర్యాదు అందలేదని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ రహదారిలో లాటరైట్ ఖనిజాన్ని రవాణా చేసే లారీలే రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే మితిమీరిన వేగంతో వెళుతుండడంతో స్థానికులు భయపడుతున్నారు. ఇటీవలే క్వారీ లారీ ఢీకొని గేదే మృతి చెందింది. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడ్డారు. రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఆటోను వెనుక వైపు నుంచి వస్తున్న వ్యాన్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదేళ్ల చిన్నారిని, ఇద్దరు మహిళలకు రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. కాగా.. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన కుటుంబ సభ్యులు ఏలూరులో శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. -
ఇటీవలే శుభకార్యం.. అంతలోనే విషాదం..
రాయవరం: ఆ కుటుంబంలోని పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్ను రెండు రోజుల క్రితమే ఎంతో ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులతో కలిసి కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపారు. అక్క ఫంక్షన్లో చిన్న కుమార్తె ఎంతో సందడి చేసింది. రెండు రోజులు అవకుండానే ఆ బాలికను ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. శుభకార్యం జరిగిన ఇంటిలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన పాలపర్తి వీర వెంకట సత్యనారాయణ, ఉమా మహేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్ను రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నిర్వహించారు. వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ ఇంట శుభకార్యం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. కాగా.. సత్యనారాయణ వరసకు మేనల్లుడైన నెల్లూరుకు చెందిన పవన్ సత్యస్వరూప్ గురువారం సత్యనారాయణ రెండో కుమార్తె నాగవర్షిణి (11)ని మోటార్ సైకిల్పై ఎక్కించుకుని రాయవరం వచ్చాడు. లొల్ల వైపునకు వెళ్లిన వీరు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు. నాగవర్షిణిపై నుంచి ట్రాక్టర్ తొట్టె వెనుక చక్రాల వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడింది. పవన్ సత్య స్వరూప్ స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. విలవిల్లాడిన బాలిక ట్రాక్టర్ చక్రాలు ఎక్కేయడంతో తీవ్రంగా గాయపడిన నాగవర్షిణి విలవిల్లాడింది. ఆమె వద్దకు వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేదు. సుమారు పావుగంట తర్వాత సమీపంలోని ఫొటో స్టూడియో నిర్వాహకుడు కారంపూడి సత్తిబాబు అక్కడకు వచ్చి బాలిక శరీరంపై క్లాత్ను కప్పాడు. ఆ తర్వాత స్థానికులు వచ్చి సాయమందించారు. ఘటనా స్థలానికి పోలీసులు ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను 108లో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మండపేటకు తీసుకువెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. సంఘటనా స్థలాన్ని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్బాబు తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి రాయవరంలో ఘటన -
ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు గామన్ బ్రిడ్జి అండర్ పాస్ సర్వీస్ రోడ్డు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరుకు చెందిన దాసరపూడి సుధ (45) తన కుమారుడు చరణ్తో కలిసి దొమ్మేరు నుంచి కొవ్వూరుకు మోటార్ బైక్పై వస్తున్నారు. కొవ్వూరు అండర్ పాస్ సర్వీస్ రోడ్డుకు వచ్చేసరికీ వారిని వెనక నుంచి ఇసుక లారీ ఢీకొంది. రోడ్డుపై పడిన సుధ మీద నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కొవ్వూరు పట్టణ సీఐ విశ్వం చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. సుధ భర్త సాయికృష్ణ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. శశి విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు ఉండ్రాజవరం: పాలిసెట్ ఫలితాలల్లో శశి – వేలివెన్ను క్యాంపస్ విద్యార్థులు మరోసారి స్టేట్ ర్యాంకులతో ప్రభంజనాన్ని సృష్టించారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ గురువారం తెలిపారు. బి.శశి వెంకట్ 120కి 120 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఎం.చంద్రహర్ష 3, యు.సిరి దీపిక 13, వై.చంద్రకుమార్ 17, ఎం.దుర్గా శ్రీనిధి 19వ ర్యాంకులు సాధించారని తెలిపారు. 120కి 120 మార్కులు ఐదుగురు సాధించారని, 10 లోపు 2, 50 లోపు 11, 100లోపు 19 ర్యాంకులు వచ్చాయన్నారు. పాలిసెట్లో తమ విద్యార్థులు 14 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించారని వివరించారు. ఏపీఆర్జేసీలోనూ సత్తా.. ఏపీఆర్జేసీ ఫలితాల్లోనూ శశి–వేలివెన్ను విద్యార్థులు సత్తా చాటారని చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ అన్నారు. ఎంఈసీలో ఎం.వేదార్షిత, సీజీడీటీలో ఎస్.చరణ్, ఈఈటీలో డి.సాయి చరణ్ స్టేట్ ఫస్ట్లు సాధించారన్నారు. 10 లోపు 25, 50 లోపు 55, 100లోపు 65 ర్యాంకులు సాధించారని, ఏపీఆర్జేసీలో తమ విద్యార్థులు 17 సార్లు స్టేట్ ఫస్ట్ సాధించారని తెలిపారు. ర్యాంకర్లును శశి విద్యాసంస్ధల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ, డైరెక్టర్ ఎం.భాస్కర్, ప్రిన్సిపాల్ షేక్ షానూర్ అభినందించారు. యువకుడి దారుణ హత్య కాకినాడ క్రైం: నగరానికి చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందిన వాడ్రేవు కిరణ్ (20) అవివాహితుడు. చేపల వేటతో జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా నివాసం పెమ్మాడి హరీష్ అలియాస్ చిన్న భార్యతో కిరణ్కు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం కిరణ్ తన స్నేహితుడు శ్యామ్తో కలిసి పెంపుడు కుక్కను టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడకు హరీష్ తన స్నేహితుడు మహేష్తో కలిసి ఆటోలో వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ కిరణ్ను ఆటోలో ఎక్కించాడు. అనంతరం వివాహేతర సంబంధంపై వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో హరీష్ తనతో తెచ్చుకున్న బీరు సీసాతో కిరణ్ గుండెల్లో పొడిచాడు. పలుమార్లు గొంతుకోసి ఆటోలోనే చంపేశాడు. మృతదేహాన్ని స్నేహితుడి సాయంతో తిమ్మాపురం సమీపంలోని నేమం వద్ద రోడ్ కం బిడ్జి వద్ద సముద్రంలోకి విసిరేశాడు. కాగా..తన కుమారుడు కనిపించడం లేదంటూ కిరణ్ తల్లి దుర్గ బుధవారం రాత్రి పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పొరుగు వారు సముద్ర తీరంలో ఉన్న కిరణ్ మృతదేహాన్ని చూసి దుర్గకు సమాచారం అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోర్టు పీఎస్ సీఐ సునీల్ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితులు పరారీలో ఉన్నారు. -
క్రీడాకారులకు వేసవి శిక్షణ శిబిరాలు
సీటీఆర్ఐ (రాజమహేందవరం): క్రీడాకారులకు అందించే క్రీడా పరికరాల కిట్ల వల్ల వారి అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందని జేసీ చిన్నరాముడు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో క్రీడా శిక్షకులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మాట్లాడుతూ, వేసవి కాలంలో విజ్ఞానంతో పాటు, క్రీడలపై ఆసక్తి కలిగించే కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా ఈ నెలాఖరు వరకూ వివిధ క్రీడాంశాల్లో 50 శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. శిక్షకులకు రూ.5 వేల విలువ చేసే క్రీడా సామగ్రి, గౌరవ వేతనం రూ.1,500, ఇతర ఖర్చులకు రూ.500 అందజేస్తున్నట్టు చెప్పారు. క్రీడల్లో మెళకువలు నేర్పుతూ, వారికి భద్రత, ఇతర సదుపాయాలు కల్పించేలా శిబిరాలు నిర్వహించాలని నిర్దేశించారు. జిల్లాలో 15 క్రీడాంశాల్లో మొత్తం 50 క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా సాధికారత అధికారి డీఎంఎం శేషగిరి తెలిపారు. క్రీడల నిర్వహణ కోసం అథ్లెటిక్స్ 2, బాల్ బ్యాడ్మింటన్ 2, బాస్కెట్ బాల్ 8, బాక్సింగ్ 4, చెస్ ఒకటి, క్రికెట్ 3, ఫుట్బాల్ 5, హ్యాండ్బాల్ 2, జూడో 3, కరాటే 3, కబడ్డీ 3, తైక్వాండో 3, వాలీబాల్ 6, వెయిట్ లిఫ్టింగ్ 1, యోగా 4 కిట్లు అందజేశామని తెలిపారు. -
కుట్టిందో మరణమే..
జాగ్రత్తలు అవసరం ● డెంగీ వ్యాధి బాధితులు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి ● ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు (ప్లేట్లెట్స్) సాధారణంగా 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకూ ఉండాలి. ● తెల్ల రక్త కణాలు నాలుగు వేల నుంచి 11 వేల వరకూ ఉండాలి. ● డెంగీ జ్వరం ద్వారా రక్త కణాలు లక్ష దిగువకు పడిపోతే సత్వరమే వైద్యుడిని సంప్రదించాలి. ● ధీర్ఘకాలం తక్కువ రక్తకణాలు ఉంటే ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. ● డెంగీ జ్వరం బారిన పడిన వ్యక్తి సరైన విశ్రాంతి, పౌష్టికాహారం తీసుకుంటే రక్తకణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ● తరచూ పండ్లు, ఆకుకూరలతో పాటు ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆలమూరు: రాత్రయితే చాలు పిలవని అతిథుల్లా మన ఇంటికి వచ్చి, తెల్లవార్లూ రక్తాన్ని పీల్చేసే దోమలతో పడే బాధలు అందరికీ అనుభవమే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ వీటి బాధితులే. అందుకనే దోమల భారిన పడకుండా నిత్యం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయితే దోమలు కట్టడం వల్ల అనేక రోగాలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగీ జ్వరం అత్యంత ప్రాణాంతకమైంది. నేడు జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ఆ వ్యాధి లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. దోమ కాటుతో.. దోమ కాటు ద్వారా డెంగీ జ్వరం వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తిని కుట్టిన దోమ మరొకరిని కుడితే అతడి రక్తంలో వైరస్ వెంటనే ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు సరైన సమయంలో చికిత్స చేయించుకోకుంటే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. డెంగీ జ్వరం సోకిన వెంటనే శరీరంలోని ఎముకల్లో ఉన్న గుజ్జు తగ్గిపోయి క్రమేపీ రక్త కణాల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపి అంతిమంగా మరణానికి దారి తీస్తుంది. ఏడిస్ దోమల నుంచి సోకే డెంగీ వైరస్ నాలుగు రకాలుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తొలి రెండు దశల్లో జ్వర తీవ్రత రోగిపై ఒక మోస్తారు ప్రభావం చూపగా, మూడో దశలో హెమరేజిక్ జ్వరం తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది. తుది దశ అయిన డెంగీ షాక్ సిండ్రోమ్ సోకితే మృతి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు పగటి సమయంలో మనుషులను కుడతాయి. మంచినీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గుడ్లు పెట్టి దోమల వృద్ధికి కారణమవుతాయి. వ్యాధి నిర్ధారణ డెంగీ వ్యాధిని ఏలీసా (ఎన్ఐవీ) పరీక్ష ద్వారా నిర్దారణ చేస్తారు. వ్యాధి సోకిన వ్యక్తికి వివిధ రక్త పరీక్షలు నిర్వహించి, వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు. డెంగీ జ్వరం తరచూ వస్తుంటే వైరస్ సంబంధిత వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స తీసుకోవాలి. సాధారణంగా ఉష్ణ మండల ప్రాంతంలో ఉండే దోమలు కాటు వేయడం వల్ల్ల ఈ వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడిస్ దోమల తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2010 మే 16వ తేదీ నుంచి జాతీయ డెంగీ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఏటా ఆ రోజున దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దోమలతో అనేక వ్యాధులు డెంగీ అత్యంత ప్రమాదకరం జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం నేడు జాతీయ డెంగీ దినోత్సవం డెంగీ లక్షణాలు ఆకస్మికంగా అధిక జ్వరం సంభవించడం (104 డిగ్రీలు) తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి తీవ్రమైన కండరాల నొప్పి అలసట, వికారం, వాంతులు చర్మంపై దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం చిగుళ్ల లేదా ముక్కు నుంచి రక్తస్రావం మూత్రం, మలం, వాంతిలో రక్తం శ్వాస ఆడకపోవడం అలసిపోవడం, చిరాకు అప్రమత్తంగా ఉండాలి దోమకాటు వల్ల సంభవించే డెంగీ జ్వరంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో సైతం వర్షాలు కురుస్తుండటం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలి. జ్వర లక్షణాలు ఉంటే సత్వరమే సమీప వైద్యులను సంప్రదించి, సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. – కె.స్వర్ణలత, వైద్యాధికారి, సామాజిక ప్రభుత్వ ఆస్పత్రి, ఆలమూరు. -
ఆత్మవిశ్వాసంతో విజయం సాధ్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆత్మవిశ్వాసం, సహనం, క్రమశిక్షణతో విజయం సాధ్యమని సివిల్స్లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించిన ఇ.సాయి శివాని తెలిపారు. సివిల్స్ చదవాలనుకునే విద్యార్థులకు రాజమహేంద్రవరం డ్యాఫ్నీ సివిల్స్ అకాడమీ అధ్వర్యంలో స్థానిక ఆనం కళాకేంద్రంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి శివాని మాట్లాడుతూ మొదటి ప్రయత్నంలోనే అందరూ విజయం సాధించలేరన్నారు. నిరాశకు గురి కాకుండా ప్రయత్నిస్తే విజయం తప్పక దక్కుతుందన్నారు. మరో ముఖ్య అతిథి వాజీరామ్, రవి అకాడమీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ సమర్జిత్ మిశ్రా మాట్లాడుతూ జ్ఞాపక శక్తి, మనస్తత్వం, పరిసరాలు, సిద్ధం అయ్యే విధానం మొదలైన అంశాలు విజయంపై ప్రభావం చూపిస్తాయన్నారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ తప్పనిసరిగా సాధించగలను అనే నమ్మకం ఉంటేనే సివిల్స్ చదవాలన్నారు. శ్రీషిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ సివిల్స్పై ఉన్న అభిరుచితో డ్యాఫ్నీ సివిల్స్ అకాడమీ ప్రారంభించామని, తమ సంస్థ నుంచి సివిల్స్ ర్యాంకర్లుగా ఎక్కువమంది ఆవిర్భవించగలరన్న ఆశాభావం వ్యక్త్యం చేశారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం సాయి శివానిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో విద్యాసంస్థ డైరెక్టర్లు టి.శ్రీవిద్య, టి.శ్రీలేఖ తడితరులు పాల్గొన్నారు. సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు బోట్క్లబ్ (కాకినాడసిటీ): సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాకినాడ డిపో నుంచి ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సరస్వతీ దాయం – పుష్కరయాత్ర పేరిట స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ నెల 22న సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు. -
కాటన్ సేవలు చిరస్మరణీయం
ధవళేశ్వరం: ఆనకట్ట నిర్మాణం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారంగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా గురువారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న కాటన్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఆనకట్ట నిర్మాణం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన కాటన్.. డెల్టా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, నాయకులు శ్రీరంగం బాలరాజు, మోర్త పావనమూర్తి, గరగ శ్రీనివాస్, గునిపే అశోక్, పందెళ్ల భానుప్రసాద్, ముద్దాల అను, కోట అబ్బులు, నెల్లి కృపాకిరణ్, చింతపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో.. కాటన్ జయంతిని ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో బ్యారేజ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. గోదావరి డెల్టా సిస్టం సీఈ ఆర్ శ్రీరామకృష్ణ, ఎస్ఈ కె.గోపీనాథ్ తదితరులు కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాటన్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఈ ఆనంద్, రమణి, ఏఈ అద్దంకి సాయిరామ్, డి.రాధాకృష్ణ, సునీల్, హెచ్డీ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నవరం.. భక్తజన సంద్రం
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి గురువారం వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. నవ దంపతులు, వారి బంధువులతో కలిసి, రత్నగిరిపై స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. దీంతో ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావి చెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 35 వేల మంది భక్తులు దర్శించగా, వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు. సత్యదేవుని కల్యాణోత్సవాలు ముగియడంతో మరలా సత్యదేవుడు, అమ్మవార్లకు స్వామివారి నిత్య కల్యాణం,ఆయుష్య హోమం, వనదుర్గ అమ్మవారికి హోమాలు, సహస్ర దీపాలంకారణ, పంచహారతుల సేవలు యథావిధిగా నిర్వహిస్తున్నారు. దాత మట్టే సత్యప్రసాద్ దంపతులు స్వామి, అమ్మవార్లకు చేయించిన వజ్ర కిరీటాలను సోమ, గురువారాలు మినహ మిగిలిన ఐదు రోజులు అలంకరిస్తున్నారు. గురువారం పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, లింగాకారంలోని శివుడు నిజరూప దర్శనం ఇచ్చారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం -
కూటమి పాలన అవినీతిమయం
మలికిపురం: కూటమి ప్రభుత్వ పాలనంతా అవినీతిమయమేనని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మలికిపురంలో పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రూ.3 వేలకు పెంచిన పింఛన్ను కాస్త పెంచి ఇస్తున్న పథకం తప్ప, ఇంకా ఏమైనా రాష్ట్రంలో ఉందా చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశావా అని నిలదీశారు. ప్రశ్నిస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రస్తుత వేసవిలో అనేక ఉపాధి హామీ పనులు చేయాల్సి ఉండగా ఆ పథకాన్ని అవినీతిమయం చేశారన్నారు. చింతలపల్లి రోడ్డుకు రూ.7 కోట్లను మాజీ సీఎం జగన్ మంజూరు చేయిస్తే పనులు ప్రారంభించినట్లే నటించిన కూటమి ప్రభుత్వం.. బెర్మ్ తవ్విన మట్టిని అధికారులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వనరులు దోచేస్తున్నా వ్యవస్థలు ఏం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్టు మెషీన్ల పేరుతో రాష్ట్రంలో భారీ దోపిడీ జరిగిందన్నారు. సమావేశంలో అడబాల వీర బ్రహ్మజీ, కుసుమ చంద్రశేఖర్, అడబాల జానకీ రామ్, తాడి సహదేవ్, నామన మణికంఠ, జిల్లెళ్ల ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి అక్రమ తవ్వకాలపై దాడి
పి.గన్నవరం: మానేపల్లిలంక ర్యాంపులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు తహసీల్దార్ పి.శ్రీపల్లవి, మైన్స్ ఆర్ఐ సుజాత మానేపల్లి లంకకు చేరుకున్నారు. అనుమతులు ఉన్న ప్రాంతంలో కాకుండా మరోచోట మట్టిని తవ్వుతున్నట్టు నిర్ధారించారు. అక్కడ ఉన్న ఒక లోడు లారీని, ఐదు క్వారీ లారీలను, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. లోడు లారీని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెన్నపు డాంగే, మైన్స్ టీఏ అలీ తదితరులు పాల్గొన్నారు. కాగా.. మానేపల్లి లంకలో సుమారు రెండు ఎకరాల లంక భూమి నుంచి ప్రభుత్వ పనుల నిమిత్తం మట్టిని తవ్వేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దీంతో నిర్వాహకులు నదీపాయలో బాటను నిర్మించి మట్టిని తీస్తున్నారు. అయితే అనుమతి ఉన్న చోట కాకుండా మరొక ప్రాంతంలో మట్టిని తీస్తుండటంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. -
టీఐఐకేఎంతో ‘నన్నయ’కు ఒప్పందం
రాజానగరం: శ్రీలంకకు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ (టీఐఐకేఎం)తో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి ఒప్పందం కుదురింది. ఇందుకు సంబంధించిన పత్రాలను వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, టీఐఐకేఎం ప్రతినిధి ఇసాంక పి.గమగే పరస్పరం సంతకాలు చేసి మార్చుకున్నారు. అంతర్జాతీయ సంస్థతో ఎంఓయూ కుదరడం వల్ల రాబోయే కాలంలో అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, జాయింట్ రీసెర్చ్, వెబ్ నార్స్ వర్క్షాపులు, ట్రైనింగ్ ప్రోగ్రాములు, పబ్లిక్ సర్వీసెస్ వంటి కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ఉంటుందన్నారు. -
ప్రాథమిక విద్యకు సర్దుపోటు!
గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025ఉపాధ్యాయుల నియామకం ఇలా.. ● ఫౌండేషన్ స్కూల్ (పీపీ1, పీపీ2 1–2వ తరగతి) 1–30 మంది విద్యార్థులకు 1 ఎస్జీటీ, 31–60 విద్యార్థులకు 2 ఎస్జీటీలను నియమించారు. ● బేసీక్ ప్రైమరీ స్కూల్ (పీపీ–1, పీపీ2, 1–5వ తరగతి)లో 20 మందికి ఒక ఎస్జీటీ, 60 మందికి ఇద్దరు ఎస్జీటీలను నియమించారు. ● మోడల్ ప్రైమరీ స్కూల్స్ (పీపీ1, 2, 1–5వ తరగతి వరకు) 59 మంది విద్యార్థులకు ముగ్గురు (హెచ్ఎం లేదా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ) ఉపాధ్యాయులను కేటాయించారు. అంతేగాక 150 మంది విద్యార్థులకు నలుగురిని నియమిస్తారు. ● అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 1–10 వరకు ఒక స్కూల్ అసిస్టెంట్, 11 నుంచి 30 వరకు ఇద్దరు, 31 నుంచి 140 విద్యార్థులుంటే నలుగురు, 141 నుంచి 175 మందికి ఐదుగురు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నిందా..? ఇందులో భాగంగానే పాఠశాలల పునర్మిర్మాణ ప్రక్రియ పేరుతో గందరగోళానికి తెర తీసిందా..? ఈ పరిణామం ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం చూపనుందా..? మిగులు ఉపాధ్యాయులు పెరిగి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భంగం కలగనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నుంచి. ఇదీ సంగతి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం అసంబద్ధ విధానాల అమలుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన క్లస్టర్ విధానాన్ని తొలగించి మోడల్ స్కూల్స్ విధానానికి శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత ప్రభుత్వం జీవో 117 పేరిట పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టింది. కూటమి అధికారంలోకి వచ్చాక జీఓను రద్దు చేసింది. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలోనూ ఉపాధ్యాయుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కొత్త విధానానికి తెర తీసింది. ఇందులో భాగంగా తొమ్మిది రకాల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని రోజులుగా చేసిన కసరత్తు మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలతో మిగులు పోస్టులు పెరిగి, ప్రాథమిక విద్యకు నష్టం తప్పదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. యూపీ స్కూళ్ల కొనసాగింపు పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలలను ఎత్తివేయాలని భావించింది. తల్లిదండ్రులు, ఆయా ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న యూపీ స్కూళ్లను యథావిధిగా కొనసాగించేందుకు అంగీకరించింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 72 అప్పర్ ప్రైమరీ పాఠశాలలున్నాయి. ఇవి యథావిధిగా కొనసాగనున్నాయి. 767 పోస్టుల సర్దుబాటు ఉపాధ్యాయుల సర్దుబాటుపై గురువులు గుర్రుగా ఉన్నారు. అసంబద్ధ విధానాలతో ప్రక్రియ చేపట్టిందని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా సర్దుబాటు ప్రక్రియ కాస్తా గందరగోళంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల వారీగా మంగళవారం జాబితా విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 767 మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భవిష్యత్తులో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్) పోస్టుల భర్తీ కలగానే మారనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 371 మంది ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం పోస్టులకు, మోడల్ ప్రైమరీ పాఠశాల్లో సర్దుబాటు చేశారు. 31 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా సర్దుబాటు చేశారు. హెచ్ఓడీ పూల్లో ఉన్న 355 మంది ఉపాధ్యాయులను సైతం వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. డీఎస్సీని మరిపించేందుకు ఎత్తులు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక డీఎస్సీ నిర్వహించాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఎలాగోలా మెగా డీఎస్సీని కాలయాపన చేసేందుకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సర్దుబాటుకు ఉన్న అర్థాన్నే మార్చేశారని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వర్క్ అడ్జెస్ట్మెంట్ (సర్దుబాటు) అంటే ఒకటి లేదా రెండు నెలల పాటు మిగులు టీచర్లను అవసరమైన చోట తాత్కాలికంగా వినియోగించుకోవడం. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కుట్ర అంతా అస్తవ్యస్తం..! పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో ఉపాధ్యాయ పోస్టుల కుదింపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 767 పోస్టుల సర్దుబాటు క్లస్టర్ వ్యవస్థకు మంగళం.. మోడల్ స్కూల్ విధానానికి నాంది కూటమి ప్రభుత్వ చర్యలతో మిగులు పోస్టులు పెరిగే అవకాశం -
ప్చ్... ఎండు మిర్చి!
దేవరపల్లి: ఎండు మిర్చి ధర పతనమైంది. అయినా మిర్చిని అడిగే నాథుడు కనిపించడంలేదు. అధిక పెట్టుబడులతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కళ్లాలో రైతులు దిగాలుగా ఉన్నారు. ఈ ఏడాది మిరప తోటలకు పూతదశలో పేను, ఎర్రనల్లి వంటి చీడపీడలు సోకాయి. దీంతో పూతలు దెబ్బతిన్నాయి. రూ.వేలకు వేలు ఖర్చు పెట్టి పూతను కాపాడటానికి రైతులు మందులు పిచికారీ చేశారు. ప్రయోజనం శూన్యం. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. వాతావరణ పరిస్థితులు, ప్రకృతి అనుకూలిస్తే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. సాధారణంగా ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మిర్చి పంటకు ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో కాపులు లేక దిగుబడులు పడిపోయాయి. ముదర కాపులు ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు దిగుబడులు వచ్చాయి. ఏటా సంక్రాంతికి మిరపతోటలు పూత, పిందెలతో ఉంటాయి. ఈ ఏడాది పూతలు దెబ్బతినడంతో రైతులు ఆశించిన స్థాయిలో పిందె ఏర్పడలేదు. ఫిబ్రవరి రెండవ వారం నుంచి ఎండు మిర్చి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో కిలో రూ.600 పలికింది. ఈ ధర ఏప్రిల్ వరకు ఉంది. మే నెల నుంచి ధర పడిపోవడంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. 1,250 ఎకరాల్లో మిర్చి సాగు గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో రైతులు వేసవి పంటగా ఎండు మిర్చి సాగు చేస్తున్నారు. మూడు మండలాల్లో సుమారు 1200 ఎకరాల్లో మిర్చి సాగు జరుగుతోంది. దేవరపల్లి మండలంలో పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం, కొత్తగూడెం, దేవరపల్లి గ్రామాల్లో మిరప పంట సాగు చేస్తున్నారు. పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో ప్రధాన పంటగా రైతులు మిర్చిని పండిస్తుంటారు. రెండు గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో పంట సాగు చేసినట్టు అధికారుల అంచనా. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మిరప పంట సాగు చేస్తున్నట్టు రైతులు తెలిపారు. తుపానులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తోటలు దెబ్బతిని రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. దిగుబడులు ఉంటే పంట లాభదాయకమేనని రైతులు అంటున్నారు. మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా కౌలు రైతులు నష్టపోతున్న పరిస్థితి. పల్లంట్ల, కురుకూరు ఎండు మిర్చికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉండేది. ఇప్పటికి పల్లంట్ల ఎండు మిర్చికి మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే తోటలకు చీడపీడలు ఎక్కువగా ఆశించడంతో పురుగు మందుల వాడకం ఎక్కువ కావడం, పంట మార్పిడి జరగకపోవడం వల్ల భూముల్లో సారం తగ్గడం వంటి కారణాల వల్ల ఇక్కడ కూడా మిర్చి నాణ్యత, కారం ఘాటు తగ్గినట్టు రైతులు తెలిపారు. లేత కాపులు అందుకున్నా ధర లేదు ముదర కాపులు దిగుబడులు లేక నష్టపోయిన రైతులకు లేత కాపులు కొంత వరకు ఊరట నిచ్చాయి. ఏప్రిల్ నుంచి తోటలు చీడపీడల నుంచి కోలుకోవడంతో లేత కాపులు దిగినట్టు రైతులు తెలిపారు. ఎండు మిర్చి సీజన్ ముగియడంతో లేత కాపులకు ధర లేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎకరాకు సుమారు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టి పంట పండించారు. ఎకరం కౌలు రూ.50 వేల నుంచి 70 వేలు పలికింది. పండిన పంటను అమ్మితే రూ. లక్ష రావడం కష్టంగా ఉందని రైలులు లబోబోదిబోమంటున్నారు. లేతగా వచ్చిన పంటకు ధర లేదని రైతులు వాపోతున్నారు. సీజన్ ముగిసినా కళ్లాలో ఎక్కడ మిర్చి అక్కడే ఉంది. ధర లేక రైతుల దిగాలు కంట కన్నీరు తెప్పిస్తున్న సాగు కిలో రూ.600 నుంచి రూ.150కు పతనం అందుకున్న లేత కాపులు కౌలు రైతులకు కోలుకోని నష్టం ఎకరాకు రూ. లక్ష నష్టం కళ్లాల్లోనే నిల్వలు తక్కువ ధరకు కర్ణాటక మిర్చి జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి సీజన్లో వ్యాపారులు ఎండు మిర్చిని దిగుమతి చేసుకుని తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కర్ణాటక, భద్రాచలం, గుంటూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల నుంచి ఈ ఏడాది వ్యాపారులు ఈ ప్రాంతానికి ఎండు మిర్చిని తీసుకు వచ్చి తక్కువ ధరకు విక్రయాలు జరిపారు. పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో కిలో ధర రూ.600 పలకగా, సైకిల్ వ్యాపారుల వద్ద రూ.200 నుంచి రూ.250కి లభించింది. ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో ప్రజలు తక్కువ ధరకు దొరుకుతున్న మిర్చిని కొనుగోలు చేశారు. కోలుకోవడం కష్టం మిర్చి రైతులు కోలుకోవడం కష్టం. కౌలుదారుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. ముదర కాపులు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గాయి. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి అయింది. పురుగు మందుల ఖర్చు ఎక్కువైంది. ఎన్ని మందులు కొట్టినా పూతలు నిలబడలేదు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశాను. ఎకరా కౌలు రూ.50 వేలు, పెట్టుబడి రూ. లక్ష అయింది. ఆరు ఎకరాల సాగుకు సుమారు రూ.10 లక్షలు ఖర్చుకాగా, వచ్చిన ఆదాయం రూ.5 లక్షలు మాత్రమే. లేత కాపులు ప్రస్తుతం కిలో రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నాయి. – నూతలపాటి రమేష్, రైతు, పల్లంట్ల, దేవరపల్లి మండలం గిట్టుబాటు కావడంలేదు మిర్చి పంట సాగు గిట్టుబాటు కావడంలేదు. తోటలకు చీడపీడలు, తెగుళ్లు ఎక్కువగా ఆశించి పూతలు దెబ్బతింటున్నాయి. రెండేళ్లుగా ఎండు మిర్చికి ధర ఉన్నప్పటికి దిగుబడి లేక నష్టం వస్తోంది. నేను 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేశాను. కౌలు, పెట్టుబడి ఎకరాకు రూ.1.50 లక్షలు అయింది. కౌలు డబ్బు కూడా రాని పరిస్థితి. ఇతర ప్రాంతాల నుంచి ఎండు మిర్చిని తీసుకు వచ్చి సైకిల్ వ్యాపారస్తులు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మా గోడును పట్టించుకున్న నాథుడు లేడు. – కాసాని సత్యనారాయణ, కౌలు రైతు, పల్లంట్ల, దేవరపల్లి మండలం -
ధూప, దీప నైవేద్యాలకు దరఖాస్తుల ఆహ్వానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామాల్లో ఆదాయం లేని ఆలయాలకు ధూప, దీప నైవేద్యాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దేవదాయశాఖాధికారి సుబ్బారావు తెలిపారు. కాకినాడ దేవదాయశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న చిన్న ఆలయాల్లో ఆదాయం లేకపోవడంతో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయా ఆలయాలకు ప్రతీ నెలా రూ.10 వేలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే ద్వారా అందివ్వాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న ఆలయాలకు చెందిన కమిటీ సభ్యులు, అర్చకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నవరం దేవస్థానం వైదిక కమిటీ పునర్ వ్యవస్థీకరణ అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వైదిక కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. కమిటీలో ఆరుగురు సభ్యులకు అదనంగా మరో ఇద్దరు పండితులను నియమించారు. గొల్లపల్లి గణపతి ఘనపాఠీ, వేదుల సూర్యనారాయణ ఘనపాఠీ, గంగాధరబట్ల గంగబాబు ఘనపాఠీ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, వ్రత పురోహిత స్పెషల్గ్రేడ్ సూపర్వైజర్ ఛామర్తి కన్నబాబు వైదిక కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో బాటు చిట్టి శివ ఘనపాఠీని, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభిరామ్మూర్తిని సభ్యులుగా చేర్చారు. ఈ ఎనిమిది మంది దేవస్థానంలో జరిగే వైదిక కార్యక్రమాల గురించి చైర్మన్, ఈఓలకు సలహాలిస్తారు. -
సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే కేటాయించాలి
మలికిపురం: రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో చేసే అభివృద్ధి పనులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమయ్యే సరకుల సరఫరా టెండర్లు దళితులకే కేటాయించాలని విస్తృత దళిత సంఘాల (విదసం), ఐక్య వేదిక రాష్ట్ర సమితి సమావేశం డిమాండ్ చేసింది. బుధవారం విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి, రాజోలు పరిరక్షణ సమితి సంయుక్త సమావేశం మలికిపురం మండలం శంకరగుప్తంలో సభ్యులు చింతా సత్య ఇంటి వద్ద జరిగింది. విదసం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ సక్రమ అమలు కోసం ప్రభుత్వం ఎస్టీఎస్ (సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే) అనే కొత్త స్కీమ్ ప్రవేశ పెట్టాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 750 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న లక్షా నాలుగు వేల మంది విద్యార్థులకు పప్పులు, నూనెలు, కూరగాయలు, గుడ్లు, మాంసం సరఫరా కోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు చెల్లిస్తోందని, ఈ సరఫరా దారుల్లో ఒక్క టెండర్లో కూడా దళితుడు దక్కించుకోలేకపోవడం గమనార్హం అన్నారు. రాష్ట్రంలో మొత్తం 55,600 అంగన్వాడీలు ఉంటే దళిత వాడల్లో 12 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వాటికి గుడ్లు, చెక్కీలు, పప్పులు, నూనెల సరఫరాకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి రూ.372 కోట్లు కేటాయిస్తే ఆ కాంట్రాక్టులు అన్ని అగ్రకులాల చేతుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. హాస్టళ్లు, దళితవాడల్లో అంగన్వాడీలకు సరకులు సరఫరా టెండర్లు దళితులకు ఇస్తే 1,000 నుంచి 1500 కుటుంబాలకు జీవనోపాధి కల్పించవచ్చని అన్నారు. విదసం, రాజోలు ప్రదర్శన చైతన్య సమితి డిమాండ్ -
పాలిసెట్లో జిల్లాకు 1, 3, 5, 7, 10 ర్యాంకులు
96.85 శాతం ఉత్తీర్ణత రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫరీక్షా ఫలితాలలో జిల్లాలోని విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 1, 3, 5, 7, 10 ర్యాంకులు సాధించారు. జిల్లాలో పాలిసెట్ ఫలితాలలో 96.85శాతం విద్యార్దులు అర్హత సాధించారు. జిల్లాలో 5,172 మంది పాలిసెట్కు హాజరుకాగా 5,009 మంది అర్హత సాధించారు. జిల్లాకు చెందిన బడ్డి శశివెంకట్ రాష్ట్రస్థాయిలో ఫస్ట్ర్యాంకు, మెర్ల జే ఎస్ఎన్వి చంద్రహర్ష రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు, వున్నా వరణ్తేజ్ రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు, ఆకుల నిరంజన్ శ్రీరామ్ రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు, బళ్ల రిషిత శ్రీస్వప్న రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించారని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాళాల, జిల్లా కోఆర్డినేటర్ వి.నాగేశ్వరరావు తెలిపారు. జగనన్న కాలనీలో ట్రాన్స్ఫార్మర్ల తొలగింపు స్థానికుల ఆందోళన జగ్గంపేట: స్థానిక జగనన్న కాలనీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఐదు అధికారులు తొలగించడంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. దీనితో జగనన్నకాలనీ వాసులు ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి తోట నరసింహానికి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు తెలియజేశారు. దీంతోవారు జగ్గంపేట విద్యుత్ డీఈ వీరభధ్రరావుతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్లు జగనన్నకాలనీలో వున్నవి తీయడం సరికాదని తెలిపారు. అయితే వేసవి కారణంగా గ్రామంలో పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు పనిచేయకపోవడంతో జగనన్న కాలనీలో ప్రస్తుతం ఉపయోగించని ట్రాన్స్ఫార్మర్లు మారుస్తున్నామని విద్యుత్ డీఈ వారికి వివరించారు. జగ్గంపేటలో రెండు రోజులుగా పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, పాడైపోవడంతో పలు కాలనీలలో విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో జగనన్న కాలనీలో ట్రాన్స్ఫార్మర్లు వాడుతున్నట్లు, కొత్తవి వచ్చిన వెంటనే జగనన్న కాలనీలో యథావిధిగా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. -
బాలుడి మృతదేహం లభ్యం
ప్రత్తిపాడు: పెద శంకర్లపూడి గ్రామ సమీపంలోని ఏలేరు ఎడమ కాలువలో గల్లంతైన పంది వీర వెంకట సత్యనారాయణ (విఘ్నేష్) (15) మృతదేహం బుధవారం లభ్యమైంది. కాలువలో స్నానానికి దిగి మంగళవారం సాయంత్రం విఘ్నేష్ గల్లంతైన విషయం విధితమే. రాత్రి వరకు గజ ఈతగాళ్లతో గాలించినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం తిరిగి ఏలేరు కాలువలో గాలింపు చేపట్టారు. అయితే విఘ్నేష్ కాలువలో దిగిన ప్రాంతంలోనే నీటి అడుగున బురదలో చిక్కుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని గజఈతగాళ్ల వెలికి తీశారు. అనంతరం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. మృతుడి తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ప్రత్తిపాడు సీఐ బి.సూర్యఅప్పారావు తెలిపారు. కాగా.. విఘ్నేష్ లంపకలోవ జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. తన సోదరుడు, స్నేహితులతో కలిసి కాలువలో ఈతకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. కాకినాడ సిరిని స్థానికులు కాపాడగలిగారు. కానీ విఘ్నేష్ నీటి అడుగున బురదలో చిక్కుకుని మృతి చెందాడు. -
బ్యాటరీ వెహికల్ ఢీకొని ఇద్దరికి గాయాలు
రాజమహేహేంద్రవరం సిటీ: ప్రధాన రైల్వే స్టేషన్లో ప్రయాణికులను తరలించే బ్యాటరీ వెహికల్ ఢీకొని బుధవారం ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామానికి చెందిన ఎం.సాయి వల్లికాదేవి, విధులు నిర్వహించి ఇంటికి వెళుతున్న రైల్వే లోకో పైలట్ ఎంవీ రామారావును స్థానిక 2, 3 ప్లాట్ఫాంపై బ్యాటరీ వెహికల్ ఢీకొంది. ఈ ఘటనలో సాయివల్లికాదేవికి రెండు కాళ్లూ, రామా రావుకు ఒక కాలు విరిగిపోయాయి. ఈ ప్రమాదానికి కారకుడైన బ్యాటరీ వెహికల్ డ్రైవర్ పరారయ్యా డు. ఈ ప్రమాదంపై రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్సై లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదకరమే ... రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో బ్యాటరీ వాహనం ఏర్పాటు చేయడం ప్రమాదకరంగా తయారైంది. ఇక్కడి ప్లాట్ఫాంలు ఆ వెహికల్ రాకపోకలు సాగించేందుకు అనువుగా లేకపోవడమే దీనికి కారణం. బ్యాటరీ వాహనం నడిచేంత ఖాళీ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలిసినా రైల్వే అధికారులు మాత్రం బ్యాటరీ వాహనం నడిపేందుకు కాంట్రాక్టర్కు టెండర్ ద్వారా అప్పగించారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో ఘటన పరారైన డ్రైవర్ -
ఏపీఆర్జేసీలో ‘తిరుమల’కు ప్రథమ ర్యాంకులు
రాజమహేంద్రవరం రూరల్: ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరం తిరుమల విద్యార్థులు బాలినేని కళ్యాణ్రామ్ ఎంపీసీ విభాగంలో, బొడ్డుపల్లి మనోజ్ కుమార్ బైపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించాడని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. కె.ఫణిశ్రీ వసంత్ 3, ఆర్. చహ్న 6, పూన్న వరుణ్ తేజ్ 8, కె.సాకేత్ గుప్తా 9వ ర్యాంకులు సాధించారన్నారు. టాప్ 50లో 28, టాప్ 100లో 55, టాప్ 500లో 203 ర్యాంకులు సాధించి అత్యుత్తమ ఫలితాలు పొందారన్నారు. ఆ విద్యార్థులను తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో ట్రిప్స్ విజయభేరి రాజమహేంద్రవరం రూరల్: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో రాజమహేంద్రవరం ట్రిప్స్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. పరీక్షకు హాజరైన 50 మందీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చవి వజావత్ 500 మార్కులకు 490 (98 శాతం) మార్కులు సాధించి ప్రథమ స్థానంలో, హన్విత యశస్విని, లోహిత్ శ్రీనివాస్ 96.6 శాతంతో ద్వితీయస్థానంలో నిలిచారు. 90 శాతం పైగా మార్కులు 14 మంది, 80 శాతం నుంచి 90 శాతం మార్కులు 26 మంది, 70 శాతం నుంచి 80 శాతం మార్కులు ఏడుగురు, 60 శాతం నుంచి 70 శాతం మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారని స్కూలు చైర్మన్ బాలా త్రిపుర సుందరి తెలిపారు. ఆ విద్యార్థులను విద్యార్థులను డెరెక్టర్లు వంశీకృష్ణ, రూపాదేవి అభినందించారు. -
ఎకై ్సజ్ అధికారుల విస్తృత దాడులు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామ సమీప లంకలో వంద లీటర్ల సారాను ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.కాత్యాయని బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా కొత్తపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా వాడపల్లి లంకలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 3,400 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అదే ప్రాంతంలో పలుచోట్ల వంద లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఆ సారాకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. జిల్లా ఈఎస్ ఎస్కేడీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఏఈఎస్ జి.అమర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో ఆలమూరు, రాజమహేంద్రవరం సీఐలు నాగేశ్వరరావు, పి.సుబ్బిరెడ్డి, అమలాపురం స్క్వాడ్ సీఐ చిరంజీవి, కొత్తపేట, రామచంద్రపురం, రాజమహేంద్రవరం స్టేషన్ల ఎస్సైలు కె.అన్నవరం, కె.సుబ్బారావు, బి.అప్పారావు, ఏ.రామానుజ, పి.సూర్యకుమారి, ఆయా స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. వంద లీటర్ల సారా స్వాధీనం 3,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం -
పాలిసెట్లో ‘తిరుమల’ విద్యార్థుల సత్తా
రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యార్థులు సత్తా చాటారు. వరుణ్ తేజ్, ఆకుల నిరంజన్ శ్రీరామ్, బల్లా రిషిత శ్రీస్వప్న, రూపిటి చహ్నా అనే నలుగురు విద్యార్థులు 120 మార్కులకు 120 మార్కులు సాధించారు. ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ 9 మంది విద్యార్థులు 119 మార్కులతో ప్రతిభ చూపారన్నారు. స్టేట్ 5, 7, 10, 11వ ర్యాంకులకు కై వసం చేసుకున్నామన్నారు. అలాగే 50 లోపు 9 మంది, 100 లోపు 16 మంది, 500 లోపు 57 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారన్నారు. ఆ విద్యార్థులను తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి తుని: తుని–హంసవరం మధ్యలోని బాలయోగి మెట్ట సమీపంలో పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తి.. రైలు ఢీకొని మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించామన్నారు. మృతుడి వయసు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. అతడి వద్ద ఎరుపు, తెలుపు రంగు టవల్ ఉందని, కుడి చేతిపై శ్రీరాములు అనే పచ్చబొట్టు ఉందన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. -
సీతాకోక చిలుక రెక్కల ఆకృతిలో నాణేలు
అమలాపురం టౌన్: ప్రపంచంలో ఏ దేశ నాణేలైనా గుండ్రంగా లేదా నలుపలకలుగా ఉంటాయి. అయితే సమోవా దేశం విడుదల చేసిన నాణేలు మాత్రం సీతాకోక చిలుక రెక్కల ఆకృతిలో కనువిందు చేస్తున్నాయి. వీటిని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా సీతాకోక చిలుక రెక్కల ఆకృతిలో ముద్రించిన నాణేలు ఇవేనని కామేశ్వర్ తెలిపారు. 20 సెంట్లు ముఖ విలువ గల ఈ నాణేలు వెండి పూతతో రాగితో తయారయ్యాయి. ఒక్కొక్క నాణెంపై చైనా దేశపు ఒక్కొక్క రాశి చక్రాన్ని ముద్రించారు. చైనా దేశపు రాశి చక్రాల అధిపతులైన కుక్క, డ్రాగన్, మేక, గుర్రం, కోతి, ఎద్దు, పంది, కుందేలు, ఎలుక, కోడిపుంజు, పాము, పులి చిత్రాలు నాణేలపై ముద్రించారు. చింత చిగురు కేజీ రూ.900ఐ.పోలవరం: చింత చిగురుకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. కోనసీమ జిల్లాలోనే కేజీ రూ.850 నుంచి రూ.900 వరకూ పలుకుతోంది. అమలాపురం, రామచంద్రపురం, అంబాజీపేట, మురమళ్ల, కొత్తపేటల్లోని వారపు సంతాల్లో సైతం చింతాకు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. స్థానికంగా చింత చెట్టు ఎక్కి కొమ్మ చివరన ఉండే చింత చిగురు సేకరించేవారు తగ్గిపోయారు. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవ్వడం వల్ల కూడా స్థానికంగా ధర పెరగడానికి కారణమని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అనేక శాకాహార, మాంసాహార వంటలకు మరింత రుచి కావడానికి చింత చిగురు వాడతారు. ప్రేమ పేరుతో యువకుడి మోసం ముమ్మిడివరం: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బీఎస్ఎన్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై డి.జ్వాలా సాగర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముమ్మిడివరం మండలం గాడిలంకకు చెందిన ఒక యువతిని ఐ.పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన చింతా సురేష్ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. తీరా పెళ్లి చేసుకోమంటే తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని ముఖం చాటేశారు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్సీ టీఎస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సై డి.జ్వాలా సాగర్ దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఒలింపిక్ మెడల్ సాధించడమే ధ్యేయం
నేను ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా తండ్రి బ్యాంక్ ఉద్యోగి. నాకు చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇష్టం. నా సరదాను చూసి నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నేను మా కోచ్ లక్ష్మణరావు దగ్గర చేరి బాక్సింగ్ నేర్చుకున్నాను. ఏడాదిన్నర కాలంలోనే అన్ని మెళుకువలు నేర్చుకుని కాకినాడ డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీలో జరిగిన అండర్ 19 స్కూల్ గేమ్స్ బాక్సింగ్కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యాను. పిఠాపురంలో జరిగిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలలో స్వర్ణ పతకం సాధించాను. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 19 బాక్సింగ్ పోటీలలో కాంస్య పతకం సాధించాను. విశాఖపట్నంలో జరిగిన యూత్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో రజత పతకం సాధించాను. ఒలింపిక్ మెడల్ సాధించడమే నా ధ్యేయం. – జే ఐశ్వర్య సూరి దీపిక, బాక్సింగ్ క్రీడాకారిణి, పిఠాపురం ● -
పట్టుదలతో నేర్చుకున్నా
క్రీడల్లో మంచి ప్రతిభ చూపి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఆలోచన ఉండేది. ఏ ఆటలో నాకు మంచి జరుగుతుందనేది అర్థమయ్యేది కాదు. కాని పిఠాపురంలో బాక్సింగ్ క్రీడలో శిక్షణ ఇస్తున్న కోచ్ లక్ష్మణరావు వద్దకు వెళ్లి మాట్లాడగా నీవు బాక్సింగ్ బాగా ఆడగలుగుతావు అంటు ప్రోత్సాహించారు. ముందు కొంత భయమేసింది ఇంట్లో వాళ్లు బాక్సింగ్ అంటే చాలా ధైర్యం ఉండాలి.. జాగ్రత్త అన్నారు. కాని మా కోచ్ చాలా ధైర్యం చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో బాక్సింగ్ నేర్చుకున్నా. పిఠాపురంలో జరిగిన యూత్ వుమెన్ బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించాను. విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి యూత్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాను. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాను. జాతీయ స్థాయిలో మంచి పతకాలు సాధించడమే ధ్యేయం. – అడబాల వైష్ణవి, బాక్సింగ్ క్రీడాకారిణి, మల్లాం, పిఠాపురం మండలం -
గడువు ముగిసిన బీరు బాటిళ్లు ధ్వంసం
తాళ్లపూడి: మండలంలోని తుపాకులగూడెం పరిధిలోగల బీరు ఫ్యాక్టరీలో కాలం చెల్లిపోయి నిల్వ ఉన్న సుమారు ఆరువేల కేసుల బీర్ను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలోయస్ బ్రావరిజస్కు చెందిన ఫ్యాక్టరీలో బీరు తయారు అవుతుంది. కొంతకాలంగా బీరు తయారీ నిలిచిపోయింది. దీంతో గోడౌన్ ఖాళీ చేయడంలో భాగంగా ఎకై ్సజ్ అధికారుల సమక్షంలో కాలం చెల్లిన బీరు సీసాల స్టాక్ను ధ్వంసం చేస్తున్నారు. సుమారు ఆరువేల కేసులను ధ్వంసం చేయాల్సి ఉండగా సోమవారం సుమారు 1,000 కేసుల బీర్ సీసాలను ధ్వంసం చేశారు. బుధవారం కూడా ఈ ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు. -
ఇసుక లారీ ఢీకొని కౌలు రైతు మృతి
తుని రూరల్: తుని మండలం వి.కొత్తూరు గ్రామానికి చెందిన సూరెడ్డి రమణ (48)ను ఇసుక లారీ ఢీకొనడంతో మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. మంగళవారం కౌలు రైతు అయిన సూరెడ్డి రమణ తుని రైతుబజారులో కూరగాయలు విక్రయించుకుని మోపెడ్పై స్వగ్రామానికి వస్తుండగా వెలంపేట వై.జంక్షన్లో రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రమణను తుని ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైలు నుంచి జారిపడి యువకుడి మృతి తుని: రైలు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ ఎస్సై జీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..తుని–హంసవరం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి 20 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెందాడు. మృతుడు నలుపురంగు ట్రాక్ ధరించి ఉన్నాడు. చేతిపై శ్రావణి అనే పచ్చబొట్టు ఉంది. మృతుడి దగ్గర ఇతర ఏ ఆధారాలూ లభించలేదు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94906 19020 నంబరులో సంప్రదించవచ్చన్నారు. ఏలూరులో కలవచర్ల మహిళ... రాజానగరం: భర్తతో కోపంతో పుట్టింటికి వెళ్లిన మహిళ ఊహించని ప్రమాదానికి గురై అందరికీ దూరమైంది. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్న మండలంలోని కలవచర్లకు చెందిన బొమ్మోతు కుమారి (40) ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోవడంతో మృతిచెందింది. ఏలూరు రైల్వే స్టేషను సమీపంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలావున్నాయి. మండలంలోని ముక్కినాడకు చెందిన కుమారికి కలవచర్లకు చెందిన ఏసుతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా, కుమార్తెకు వివాహం చేశారు. ఈ క్రమంలో కుటుంబ పరంగా భార్యాభర్తల నడుమ ఏర్పడిన గొడవలతో కుమారి కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తల్లిదండ్రులు మండెల సత్యనారాయణ, పాపలు పనుల కోసం హైదరాబాద్కి పయనమవడంతో వారితోపాటు తాను కూడా గౌతమీ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరింది. డోరులో నిలబడివున్న ఆమె ఏలూరు సమీపంలోకి వచ్చే సరికి ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను రైల్వే పోలీసులు ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఏసు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి, మృతురాలిని తన భార్యగా నిర్ధారించాడు. కేసును ఏలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శతాధిక వృద్ధురాలి మృతిగోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో శతాధిక వృద్ధురాలు అల్లిమిల్లి చంటమ్మ(109) మంగళవారం మృతి చెందారు. ఆమెకు నలుగురు కుమారులు ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడుతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరితో పాటు 90 మంది మనుమలు, మునిమనుమలు ఉన్నారు. ఉదయం వరకు ఆర్యోంగా ఉన్న ఆమె టిఫిన్ చేసిన అనంతరం మరణించారు. -
స్పోర్ట్స్ కోటాలో ఉన్నత స్థానం సాధిస్తా
ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పూర్తి చేశాను. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాను. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం మా తల్లిదండ్రులు నా ఇష్టాన్ని గమనించి కోచ్ లక్ష్మణరావు దగ్గర జాయిన్ చేశారు. ఆయన నాకు ముందుగా ధైర్యం చెప్పి బాక్సింగ్లో మెళుకువలు నేర్పించారు. ఇప్పుడు నేను రాష్ట్ర బాక్సర్గా పేరు పొందాను. స్పోర్ట్స్ కోటాలో డాక్టర్ అయి పేదలకు ఉచిత వైద్యం చేయడమే నా లక్ష్యం. – కాకాడ హరిణి, బాక్సింగ్ క్రీడాకారిణి, పిఠాపురం ● -
సీబీఎస్ఈ ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి విజయకేతనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సీబీఎస్ఈ 10, 12 వ తరగతి ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య మంగళవారం తెలిపారు. 12 తరగతి ఫలితాలలో ఎస్.స్నేహితశ్రీ 500 మార్కులకు 484 సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కె.పావన్తనయ 477 మార్కులతో ద్వితీయ స్థానం, ఎన్.విద్యాజ్యోతి శ్రీ 476 మార్కులతో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారన్నారు. మొత్తం 16 మంది విద్యార్థులు 95 శాతం పైగా మార్కులు సాధించగా, 54 మంది 90 శాతం, 216 మంది 75 శాతం పైగా మార్కులు సాధించారన్నారు. హాజరైన మొత్తం విద్యార్థుల్లో 339 మంది 60 శాతం పైగా మార్కులతో నూరు శాతం ఉతీర్ణత సాధించారన్నారు. 10వ తరగతి ఫలితాలలో పి.హర్షిత్ సాయి 500 మార్కులకుగాను 483 సాధించి ప్రథమస్థానాన్ని సాధించాడన్నారు. పి.రేవంత్ సత్య అనిరుధ్ 481 లతో ద్వితీయస్థానం, ప్రితీష్ పాలై 480తో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారన్నారు. 20 మంది విద్యార్థులు 95 శాతం సాధించగా 72 మంది 90 శాతం, 180 మంది 75 శాతం పైగా మార్కులు సాధించారన్నారు. హాజరైన మొత్తం 206 మంది విద్యార్థులు 60 శాతం పైగా మార్కులతో నూరు శాతం ఉతీర్ణత సాధించారన్నారు. తమ విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించడం పట్ల విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలైన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. -
ఫలిస్తున్న పంచ్తంత్రం!
మహిళా బాక్సర్లు సత్తా చాటుతున్నారు నేను 8 సంవత్సరాల నుంచి పిఠాపురంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నాను. నా దగ్గర 150 మంది 10 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న పురుషులు, మహిళలు ఉన్నారు. వారిలో మహిళా బాక్సర్లు 70 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకు 30 మంది మహిళా బాక్సర్లు రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 40 మంది జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. నలుగురు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకాలు సాధించారు. బాక్సింగ్ యుద్ధ కళ. బాక్సింగ్లో సబ్ జూనియర్, జూనియర్, యూత్, సీనియర్స్ మెన్ అండ్ వుమెన్ విభాగాలు ఉంటాయి. వయసును బట్టి బరువును బట్టి పోటీ ఉంటుంది. బాక్సింగ్ నేర్చుకుని పతకాలు సాధిస్తే విద్య, ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలికలు ఎక్కువగా ఈ క్రీడ పట్ల మక్కువ చూపుతున్నారు. – పి.లక్ష్మణరావు, బాక్సింగ్ కోచ్, పిఠాపురం పిఠాపురం: నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచన వారిని క్రీడల వైపు అడుగులు వేసేలా చేసింది. ఈ ఆటకు ఆడవారెందుకు అనే క్రీడలోనే పట్టుదల వారిని బాక్సింగ్ వైపు నడిపించింది. రింగ్లోకి దిగితే పతకం ఖాయం అనే రీతిలో తమ ప్రతిభా పాటవాలను చూపిస్తున్నారు పిఠాపురానికి చెందిన మహిళా బాక్సర్లు. ఒలింపిక్ పతకాన్ని అందించడమే తమ లక్ష్యం అంటున్నారు వీరు. ఇటీవల భారత్ బాక్సింగ్లో దూసుకెళ్తోంది. ప్రపంచ చాంపియన్న్షిప్లతో పాటు ఆసియా, కామన్వెల్త్, అంతర్జాతీయ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. బాక్సింగ్లో టాప్ 5 దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా భారత మహిళలు ఆడిన 12 చాంపియన్ షిప్లలో 10 గోల్డ్ మెడళ్లతో సహా 39 పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ మెడల్స్ సాధించిన వారి జాబితాలో తదుపరి తమ పేరు నమోదు చేసుకుంటామంటున్నారు ఇక్కడి మహిళా బాక్సింగ్ క్రీడాకారులు. రింగ్లోకి దిగితే పతకం రావాల్సిందే సత్తా చాటుతున్న పిఠాపురం మహిళా బాక్సర్లు -
పెనకనమెట్ట సావరంలో చోరీ
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలంలోని పెనకనమెట్ట సావరంలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కొవ్వూరు రూరల్ సీఐ బి.విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి సత్తిబాబు, వారి కుటుంబ సభ్యుల తో పాటు ఈ నెల 11వ తేదీన పందలపర్రులో బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. 12వ తేదీ ఉదయం తిరిగి వచ్చి చూసుకుని సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దుండగులు ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి సుమారు 8 కాసుల బంగారు వస్తువులను, రూ.8 లక్షల నగదు, 250 గ్రాముల బరువు గల వెండి వస్తువులను దొంగిలించినట్టుగా తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఇన్చార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ స్వరూప్, సీఐ శ్రీధర్ తదితరులు పరిశీలించి, వివరాలు సేకరించారు. పక్కింటికి భోజనానికి వెళ్లి వచ్చేలోగా దోచేశారు రాజానగరం: ఇంటి తలుపులకు గడియపెట్టి, పక్కింటికి వెళ్లి భోజనం చేసి వచ్చేలోగానే ఇంట్లో దాచుకున్న బంగారు నగలను దుండగులు అపహరించుకుపోయారు. మండలంలోని వెలుగుబందలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. జాలెం గోపీరత్నం పక్కింటి వారి ఆహ్వానంపై భోజనం చేసి వచ్చేందుకు ఇంటి తలుపులకు గడియపెట్టి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఆ తలుపులు తెరచివుండటంతో కంగారుగా లోనికి వెళ్లి చూస్తే ఇంట్లో దాచుకున్న నాలుగు కాసుల బంగారు నగలు కనిపించలేదు. వెంటనే రాజానగరం వచ్చి, జరిగిన చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. ఘరానా దొంగ అరెస్టు బనశంకరి: బెంగళూరులో చోరీలకు పాల్పడుతున్న ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల నగరంలో కొడిగేహళ్లిలో ఇంటి తాళం బద్దలు కొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులు గాలించి జేబీ నగరలో నివసించే గోదావరి వాసి కామేపల్లి శ్రీనివాస్ అలియాస్ కార్తీక్ (39)ను అరెస్ట్చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.9.20 లక్షల విలువచేసే 148 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 16వ తేదీన చోరీ చేసిన తరువాత ఓ ప్రైవేటు హాస్టల్లో మకాం వేశాడు. పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఇతర ఆధారాల ప్రకారం పట్టుకున్నారు. కార్తీక్కు దొంగతనాలే వృత్తి అని, బీదర్, హైదరాబాద్, సైబరాబాద్తో పాటు 10 పోలీస్ స్టేషన్లలో పాత నేరస్తుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కార్తీక్, మోహన్రుద్ర అనే పేర్లతో తిరుగుతూ చోరీలకు పాల్పడేవాడు. ఇతడిపై ల్యాప్టాప్, ఇళ్లలో చోరీలతో పాటు 88 కి పైగా కేసులు ఉన్నట్లు చెప్పారు. -
ఆగని టీడీపీ నాయకుల దుశ్చర్యలు
గోకవరం: జగ్గంపేట, గోకవరం మండలాల సరిహద్దున ఉన్న సింగారమ్మ చింత ఆలయ అర్చకురాలు వట్టికూటి సీతామహాలక్ష్మి ఇంటిని మల్లిసా లకు చెందిన టీడీపీ నాయకులు గత నెలలో కూల గొట్టారు. అక్కడితో ఆగని వారు.. ఆ ఇంటి అవశేషాలకు సైతం నిప్పు పెట్టి బూడిద చేశారు. తాము మంగళవారం ఆలయం వద్దకు వచ్చేసరికి ఇంటికి సంబంధించిన కర్రలతో పాటు సామగ్రి మొత్తం బూడిదైందని బాధితులు వాపోయారు. తమను శాశ్వతంగా వెళ్లగొట్టేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. ఈ దుర్మార్గాన్ని నిరసిస్తూ బాధితులతో కలిసి సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు గోకవరం తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. తహ సీల్దార్ సాయిప్రసాద్, ఎస్సై పవన్కుమార్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్రావు మాట్లాడుతూ, సింగారమ్మ చింత అమ్మవారి ఆలయం వద్ద వంశపారంపర్యంగా అర్చకత్వాన్ని కొనసాగిస్తూ, అక్కడే చిన్నపాటి దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్న సీతామహాలక్ష్మిపై మల్లిసాలకు చెందిన టీడీపీ నాయకులు, కమిటీ సభ్యు లు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాత్రికి రాత్రే దుకాణాన్ని దౌర్జన్యంగా ధ్వంసం చేయడంతో పాటు సింగారమ్మ అమ్మవారి నగలు, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారన్నారు. కూల్చివేసిన పాకతో పాటు ఇతర సామగ్రికి నిప్పంటించారని అన్నారు. బాధితులకు న్యాయం చేయకుంటే ఈ నెల 22 నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. -
రైతుల పాలిట పగాకు
కోలుకోవడం కష్టం కూటమి పాలనలో రైతులకు అన్నీ కష్టాలే. పంటకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడులు రాని పరిస్థితి. పొగాకు ధరలు మరీ దారుణంగా ఉన్నాయి. పెట్టుబడులు పెరిగాయి. కూలీల సమస్య ఎక్కువగా ఉంది. ఎకరాకు రూ.2.50 లక్షల పెట్టుబడి, కౌలు అవుతోంది. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ప్రస్తుత ధర ప్రకారం ఎకరాకు రూ.2.30 లక్షలు మాత్రమే ఆదాయం వస్తోంది. అంటే ఎకరాకు సుమారు రూ.20 నుంచి రూ.40 వేల వరకూ నష్టం వస్తోంది. నేను 50 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నా. గిట్టుబాటు ధర రాకపోతే రైతులు, కౌలు రైతులు కోలుకోవడం చాలా కష్టం. పొగాకు మార్కెట్ సంక్షోభంలో ఉన్నప్పుడు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, రైతులను ఆదుకొంది. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. – వల్లభనేని సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం దేవరపల్లి: పొగాకు సాగు రైతుల పాలిట పగాకుగా మారింది. ధర దారుణంగా పడిపోయింది. గత ఏడాది కిలో పొగాకు ధర గరిష్టంగా రూ.410 పలకడంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. దీంతో, ఈ ఏడాది భూముల కౌలు, బ్యారన్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. అయినప్పటికీ నిబంధనలు పక్కన పెట్టి మరీ రైతులు అధిక విస్తీర్ణంలో పంట సాగు చేశారు. ప్రస్తుత పంట కాలంలో పొగాకు కొనుగోళ్లు మార్చి 24న ప్రారంభించారు. ప్రారంభ ధర కిలోకు గరిష్టంగా రూ.290 పలికింది. కొనుగోళ్లు ప్రారంభించి మంగళవారానికి 51 రోజులైంది. మొత్తం 38 రోజుల పాటు వేలం జరిగింది. నిరాశలో రైతులు రోజులు గడుస్తున్నా ధరలో పెరుగుదల, కొనుగోళ్లు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. నాణ్యమైన పొగాకుకు కూడా కిలోకు గరిష్టంగా రూ.260 నుంచి రూ.290 వరకూ మాత్రమే ప్రస్తుతం లభిస్తోంది. ధరలు పెరగకపోవడంతో రైతులు వేలం కేంద్రాలకు బేళ్లు తక్కువగా తెస్తున్నారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు కంపెనీలు నిరాకరిస్తున్నాయి. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రతికూల వాతావరణం, సాగుకు అధిక పెట్టుబడులు, వీటన్నింటికీ మించి కూలీల సమస్య.. వెరసి పొగాకు రైతులు దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నా సరైన ధర రాక నష్టాలు చవి చూడాల్సి వస్తోందని అంటున్నారు. కనీసం కౌలు డబ్బులు, పెట్టుబడి వస్తే చాలని దీనంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పొగాకు ప్రధాన ఎగుమతి సంస్థలైన ఐటీసీ, జీపీఐ, పీఎస్ఎస్, డక్కన్, అలయన్స్ వంటి కంపెనీలకు ఇంత వరకూ ఎగుమతి ఆర్డర్లు ఖరారు కాలేదు. దీంతో ఆయా కంపెనీలు ఇంకా వేలం కేంద్రాలకు రాకపోవడంతో కొనుగోళ్లు కూడా మందకొడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఐటీసీ ఎక్కువ శాతం పొగాకు కొనుగోలు చేస్తోంది. ఈ నెల 20 తర్వాత ఆర్డర్లు ఖరారవుతాయని, అనంతరం ప్రధాన కంపెనీలు వేలం కేంద్రాలకు వస్తాయని తెలుస్తోంది. పెరిగిన సాగు ఖర్చులు గత ఏడాదితో పోల్చుకుంటే పొగాకు సాగు ఖర్చులు 20 నుంచి 25 శాతం వరకూ పెరిగాయి. ఎకరం భూమికి కౌలు రూ.70 వేలు, బ్యారన్ అద్దె రూ.1.60 లక్షలకు తీసుకుని మరీ పంట వేశారు. అన్నీ కలిపి ఎకరాకు సుమారు రూ.2.50 లక్షల పెట్టుబడి పెట్టారు. తీరా మార్కెట్ పరిస్థితి చూస్తే కనీసం పెట్టుబడి కూడా వచ్చేలా లేదని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. పొగాకు సాగు చేస్తున్న రైతుల్లో 80 శాతం కౌలుదారులే ఉన్నారు. రూ.253.64 కోట్ల పొగాకు విక్రయం పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఇప్పటి వరకూ రూ.253.64 కోట్ల విలువైన 9.19 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. రైతులు 71,096 బేళ్లు విక్రయించారు. వేలంలో 10 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకూ కిలో గరిష్ట ధర రూ.290, కనిష్ట ధర రూ.220, సగటు ధర రూ.276.18 చొప్పున లభించాయి. ఉత్పత్తి అంచనా 80 మిలియన్ల కిలోలు ప్రస్తుత పంట కాలంలో ఐదు వేలం కేంద్రాల పరిధిలో 59 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పతికి బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే, క్యూరింగ్ల ప్రారంభంలో 70 మిలియన్ల కిలోలు ఉత్పత్తి అవుతుందని బోర్డు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం క్యూరింగ్లు ముగింపు దశకు చేరడంతో 80 మిలియన్ల కిలోల వరకూ ఉత్పత్తి వస్తుందని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. మొత్తం 14,754 మంది రైతులు 12,723 బ్యారన్లు రిజిస్ట్రేషన్ చేయించుకోగా సుమారు 29,450 హెక్టార్లలో పొగాకు సాగు చేసినట్టు అధికారికంగా లెక్కలు వేశారు. అయితే రిజిస్ట్రేషన్లు లేకుండా మరో 10 వేల హెక్టార్లలో రైతులు సాగు చేసినట్లు అంచనా. ఈ ఏడాది బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశమున్నందున పరిమితికి మంచి పొగాకు సాగు వద్దని, ఉత్పత్తి పెరిగితే నష్టపోతారని ముందు నుంచీ అధికారులు రైతులకు చెబుతూనే వచ్చారు. వేలం కేంద్రాల వారీగా సమావేశాలు పెట్టి పంట నియంత్రణపై సూచనలు చేశారు. కానీ, రైతులు ఈ సూచనలను బేఖాతరు చేసి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచారు. బాడవ భూముల్లో సైతం సాగు చేశారు. ఈ పొగాకు కొనుగోలుకు కంపెనీలు నిరాకరిస్తూండటంతో లబోదిబోమంటున్నారు. కొనుగోళ్లు ప్రారంభమై 51 రోజులు ఖరారు కాని ఎగుమతి ఆర్డర్లు వేలం కేంద్రాలకు రాని ప్రధాన కంపెనీలు పెరగని పొగాకు ధర పెట్టుబడి కూడా దక్కదేమోనని రైతుల ఆందోళన గిట్టుబాటు ధర ఇప్పించాలి మార్కెట్ పరిస్థితి అర్థం కావడం లేదు. సాగు ఖర్చులు కూడా వస్తాయో లేదో తెలియని పరిస్థితి. కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. గిట్టుబాటు ధర లేక వేలానికి బేళ్లు తీసుకురావడం లేదు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు. ఐదో రెలుపు నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నారు. పీఎస్ఎస్, డక్కన్, జీపీఐ కంపెనీలు మార్కెట్కు వస్తే ధర పెరుగుతుందనే ఆశతో రైతులున్నారు. ఇప్పటికై నా ట్రేడర్లతో అధికారులు చర్చించి, గిట్టుబాటు ధర ఇప్పించి, రైతులను ఆదుకోవాలి. – కరుటూరి శ్రీనివాస్, అధ్యక్షుడు, పొగాకు రైతు సంఘం, సంగాయగూడెం, దేవరపల్లి మండలం రైతుల పరిస్థితి దయనీయం గిట్టుబాటు ధర రాక పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కంపెనీలు పూర్తి స్థాయిలో వేలంలో పాల్గొనకపోవడంతో మార్కెట్లో కొనుగోలుదారుల మధ్య పోటీ లేదు. ముందు ముందు మంచి ధర వస్తుందనే ఆశతో ఉన్నాం. సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరగడం వల్ల మార్కెట్ సంక్షోభంలో ఉంది. ఇందులో రైతుల తప్పిదం కూడా ఉంది. – పిన్నమనేని మధుమోహన్, పొగాకు రైతు సంఘం ప్రతినిధి, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం -
కనుల విందుగా.. విరుల పండుగ..
జైలు నుంచి విడుదలైన నేరస్తులపై ప్రత్యేక నిఘా కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వివిధ నేరాలపై జైలుకు వచ్చి, శిక్ష అనంతరం విడుదలైన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ సూచించారు. ఆస్తి నేరాలపై ఆయన మంగళవారం జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రైమ్ ప్రోన్, ఐసోలేటెడ్ ఏరియాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, రాత్రి సమయాలలో ప్రత్యేక గస్తీ నిర్వహించాలన్నారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను ఫింగర్ ప్రింట్ డివైసెస్, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా చెక్ చేయాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్టీ నేరాలపై ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రాత్రి వేళల్లో ఆస్తి నేరాలను అరికట్టేందుకు స్పెషల్ పార్టీలు, క్రైమ్ టీమ్లు అప్రమత్తంగా తిరగాలన్నారు. విజిబుల్ పోలీసింగ్, రాత్రి గస్తీ మరింత పటిష్టం చేయాలన్నారు. పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు రాజమహేంద్రవరం సిటీ: ఈ నెల 19 నుంచి 28 వరకూ జరిగే పదో తరగతి, ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.సీతారామ్మూర్తి తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై తన చాంబర్లో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 28 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకూ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వీటికి రెగ్యులర్ 3,167, ప్రైవేటు 686 మంది కలిపి మొత్తం 3,853 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి విద్యార్థులు 589 మందికి 6, ఇంటర్ విద్యార్థులు 771 మందికి 4 చొప్పున పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలూ సంబంధిత శాఖల అధికారులు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీఈఓ కె.వాసుదేవరావు, విద్యా శాఖ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీకుమారి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి డెల్టా సిస్టం సీఈగా శ్రీరామకృష్ణ ధవళేశ్వరం: గోదావరి డెల్టా సిస్టం సీఈగా ఆర్.శ్రీరామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఎస్ఈగా ఉన్న ఆయన ఇప్పటికే గోదావరి డెల్టా సిస్టం సీఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇప్పుడు పూర్తి స్థాయి సీఈగా నియమితులయ్యారు. అన్నవరం: వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం రాత్రి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి శ్రీపుష్పయాగ మహోత్సవం స్వామివారి నిత్య కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒకవైపు నిండుగా అలంకరించిన సుగందభరిత పుష్పమాలికలు.. మరోవైపు రంగురంగుల విద్యుద్దీప తోరణాలతో మెరిసిపోతున్న కల్యాణ మండపంలో.. నూతన పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలు ధరించి వేదికపై కల్యాణ శోభతో ప్రకాశిస్తున్న స్వామి, అమ్మవార్ల శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు దర్శించి, తన్మయత్వం చెందారు. పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా, నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను కల్యాణ మండపానికి ఊరేగింపుగా రాత్రి ఏడు గంటలకు తీసుకువచ్చారు. వెండి సింహాసనంపై స్వామి అమ్మవార్లను, పక్కనే మరో ఆసనంపై సీతారాముల మూర్తులను ఉంచి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం గావించి, గర్భాదాన కార్యక్రమానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి, వేదాశీస్సులు అందజేసిన అనంతరం సర్వాంగసుందరంగా అలంకరించిన ఊయల మీద విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో పూజించారు. తొమ్మిది రకాల పిండివంటలు నివేదించారు. పండితుల మంత్రోచ్చారణల నడుమ ఊయలను మూడు పర్యాయాలు ఊపారు. ఊయల ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించి భక్తులు పులకించారు. తరువాత దంపత తాంబూలాలు, ప్రసాదాలు అందించారు. వైదిక కార్యక్రమాలను వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, కంచిభట్ల రామ్కుమార్, సుధీర్, దత్తాత్రేయశర్మ, వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కమిటీ సభ్యుడు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు నిర్వహించారు. కార్యక్రమానికి వేలాదిగా వచ్చిన మహిళలకు జాకెట్టు ముక్కలు పంపిణీ చేశారు. శ్రీపుష్పయాగంతో సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఘనంగా సత్యదేవుని శ్రీపుష్పయాగం భారీగా తరలి వచ్చిన భక్తులు -
ధాన్యం కొనాలంటూ రైతుల ఆందోళన
తాళ్లపూడి (కొవ్వూరు): ‘ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనడంలేదు. మిల్లర్ల వద్దకు తీసుకువెళితే టార్గెట్ పూర్తయిందని చెప్పి తీసుకోవడం లేదు. మరి మేం పండించిన ధాన్యాన్ని ఏం చేయాలి..’ అంటూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ రైతులు ప్రశి్నస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ కొవ్వూరు సమీపంలోని గామన్ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ధాన్యం లోడు ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేశారు. కొవ్వూరు, తాళ్లపూడి మండలాల రైతులు మండుటెండలో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని, తమ వద్ద ఉన్న రబీ ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ వద్ద ధాన్యం కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందా.. అని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇంకా 5వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళనకు దిగామని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సు«దీర్, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.రాధిక వచ్చి 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొన్న కారు
సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో కొదండరామపురం వద్ద సోమవారం కారు అదుపు తప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొంది. విద్యుత్తు స్తంభం విరిగి కారుపై పడింది. దాంతో ఆ రోడ్డులో రాకపోకలు చేస్తున్నవారు పరుగులు తీశారు. పిఠాపురం వైపు నుంచి సామర్లకోట వైపు వస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ముందు భాగం నుజ్జునజ్జు అయింది. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వెంటనే కారు నుంచి దిగి పోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపి వేశారు. కారు నడుపుతున్న వ్యక్తి సూరంపాలెంలోని ఒక యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా పని చేస్తున్నట్లు తెలిసింది.పంట చేలోకి వెళ్లిన కారుపెరవలి: అదుపు తప్పిన కారు పంట చేలోకి వెళ్లటంతో పాటు కొబ్బరి చెట్టును ఢీకొట్టి ఆగింది. పెరవలి మండలం వడలి– ముక్కామల ఆర్అండ్బీ రహదారిలో సోమవారం తెల్లవారు జాము జరిగిన ఈ ప్రమాదంలో చిన్ని చిన్న గాయాలతో బయటపడ్డారు. ఏ ఊరు వారో తెలియదు కానీ మద్యం మత్తులో కారు వేగంగా వచ్చిందని, అదుపు తప్పిన కారు ముందుగా ఎలక్ట్రికల్ స్తంభాన్ని రాసుకుంటూ వెళ్లి చేలో ఉన్న కొబ్బరి చెట్టును ఢీకొట్టి ఆగిందని స్థానికులు చెప్పారు. ఆ సమయంలో పెద్ద శబ్దం రావటంతో పరుగున వచ్చినా కారులో ఉన్నవారు వెళ్లిపోయారని తెలిపారు. అదే పగలు జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేదని రాత్రి అవ్వటం వలన జన సంచారం లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. -
ఉరి వేసుకుని టీచర్ మృతి
నిడదవోలు రూరల్: కుటుంబ కలహాలు, భర్త వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ప్రైవేటు స్కూల్ టీచర్ మృతిచెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు సోమవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం నిడదవోలు మండలం తాడిమళ్లకు చెందిన పంతగాని విమలకుమారి (40) తిమ్మరాజుపాలెంలో ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త వెంకట శ్రీను విజయవాడలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. 2015లో వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా భార్యాభర్తలు పలు విషయాల్లో గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బంధువులు ఇంటికి వివాహానికి వెళ్లే సమయంలో వివాదం తలెత్తింది. దీంతో విమలకుమారి ఇంటి పైపోర్షన్లో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు పేర్కొన్నారు. -
పిడుగు పాటుకు నాలుగు గేదె దూడల మృతి
భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్కు అంతరాయం గోపాలపురం: మండల కేంద్రమైన గోపాలపురంలో సోమవారం పిడుగు పడడంతో నాలుగు గేదె దూడలు మృతిచెందాయి. గోపాలపురం గ్రామానికి చెందిన అక్కాబత్తుల వెంకటేశుకు చెందిన పొలంలో నాలుగు గేదె దూడలకు సమీపంలో పిడుగు పడటంతో ఆ ధ్వనికి అవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. గోపాలపురం నుంచి జగన్నాథపురం వెళ్లే రోడ్డులో భారీ వృక్షాలు నేలకొరగడంతో సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఈదురుగాలులు వీచాయి. గోపాలపురం నుంచి కొయ్యలగూడెం వెళ్లే జాతీయ రహదారి మాతంగమ్మ మెట్ట వద్ద భారీ వృక్షం నేలకొరగడంతో అటు మూడు కిలోమీటర్లు, ఇటు మూడు కిలో మీటర్ల మేర ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు నాలుగు గంటలపాటు ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. విద్యుత్ వైర్లపై చెట్టు పడటంతో వాటిని తొలగించడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు. సుమారు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. -
జిల్లా బ్యాడ్మింటన్ సంఘ కార్యవర్గం ఎన్నిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా నూతన బ్యాడ్మింటన్ సంఘ కార్యవర్గం ఎన్నిక సోమవారం కాకినాడలో ఓ హోటల్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్వర్మ, కార్యదర్శిగా ఫణిగోపాల్, కోశాధికారిగా భాస్కరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా చుండ్రుగోవిందరాజు, కర్రి భామిరెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డిని సంఘం ఎన్నుకుంది. ఉపాధ్యక్షులుగా ఎమ్.మురళీధర్, పీఎస్ గణేష్కుమార్, సహాయ కార్యదర్శులుగా కృష్ణమూర్తి, అడ్డాల సత్యనారాయణ, జగన్నాఽథ్, సభ్యులుగా కేవీబీ కృష్ణంరాజు, యు.రామకృష్ణ, కె.నరసింహరావు, వి.శారదాదేవి, కె.శ్రీనివాస్, లక్ష్మణ్కుమార్, రామ్మోహన్రావు ఎన్నికయ్యారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
తృటిలో తప్పిన పెను ప్రమాదం
● ఆర్టీసీ బస్ నుంచి ఊడిన డీజిల్ ట్యాంక్ ● డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్ నిలిపివేత సీతానగరం: మండలంలోని వంగలపూడి ఏటిగట్టుపై పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్ డీజిల్ ట్యాంక్ ఊడి పోవడంతో గమనించిన డ్రైవర్ బస్ను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే ఫైర్ అయితే తమ పరిస్థితి ఏంటని ప్రమాణికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే సోమవారం ఉదయం 9 గంటలకు పురుషోత్తపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్లుతున్న ఆర్టీసీ బస్ డీజిల్ ట్యాంక్ వంగలపూడి – సింగవరం మధ్యలో ఊడి అందులోని డీజిల్ బయటకు లీకై ంది. డ్రైవర్కు బస్ నుంచి శబ్ధం రావడంతో ఏటిగట్టుపై బస్ని నిలిపివేశాడు. బస్ను గమనించగా డీజిల్ ట్యాంక్ ఒక వైపు ఊడి రోడ్డుపై రాసుకుంటూ వచ్చింది. బస్ను అలాగే నడిపి ఉంటే రోడ్డుపై ట్యాంక్ రాచుకుని నిప్పు రవ్వలు వచ్చి డీజిల్కు అంటుకుంటే ప్రయాణికుల పరిస్తితి ఏంటని, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు, స్థానికులు డ్రైవర్ను అభినందించారు. ప్రయాణికులను వేరే ఆర్టీసీ బస్లో పంపించారు. పది కిలోమీటర్ల సీతానగరం – పురుషోత్తపట్నం రోడ్డు శిథిలం అవ్వడంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. గత నెలలో కూటమి నాయకులు రోడ్డుకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు రోడ్డు పనులు చేపట్టలేదు. రోడ్డు శిథిలమవ్వడంతో ఆర్టీసీ బస్లు తరచు పాడవుతున్నాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
బడి బస్సుల భద్రత ఎంత?!
ఆన్లైన్లో తేదీల ఖరారు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య పరీక్షలు చేపట్టడానికి మండపేట, రామచంద్రపురం, అమలాపురం రవాణాశాఖ కార్యాలయాలు సన్నద్ధమయ్యాయి. వాహన ఫిట్నెస్ ధ్రువీకరణ కోసం ముందుగా ఆన్లైన్లో నమోదు చేశాక ఓ తేదీని కేటాయిస్తారు. ఆ ప్రకారం వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయానికి తీసుకొస్తే, అందరి సమక్షంలో వాహన ఫిట్నెస్ తనిఖీ చేస్తారు. వాహన కండిషన్పై సమగ్ర పరిశీలన అనంతరం ఽఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. బస్సులు ఏ విధంగా ఉండాలన్న దానిపై విస్తృతమైన ప్రచారం చేయాల్సిన బాధ్యత రవాణాశాఖ అధికారులపై ఉంది. ● ఈ నెల 15తో ముగుస్తున్న పాత ఎఫ్సీ గడువు ● కొత్తగా ఎఫ్సీలు జారీచేస్తున్న అధికారులు ● స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు తప్పనిసరి ● జిల్లాలో 835 పాఠశాల, కళాశాల బస్సులు రాయవరం: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో బస్సుల వినియోగం పెరిగింది. జిల్లాలో వివిధ రకాల ప్రైవేట్ విద్యా సంస్థలు 580 వరకు ఉన్నాయి. వచ్చే నెల 12వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అధిక శాతం మంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. బస్సు సామర్థ్యం సరిగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఫలితంగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అందుకే ఏటా మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు బస్సు కండిషన్ చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తుంటారు. గతేడాది జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ఈ నెల 14తో ముగియడంతో, ఈ నెల 15 నుంచి కొత్తగా ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. విద్యార్థులను సురక్షితంగా ఇంటి నుంచి పాఠశాలలకు, పాఠశాల నుంచి ఇంటికి చేరవేసే వాహనాల సామర్థ్యం (ఫిట్నెస్) ఎలా ఉంది? అన్న విషయాన్ని తేల్చే పనిని రవాణా శాఖ అధికారులు చేపట్టనున్నారు. 835 పాఠశాల బస్సులు జిల్లాలో 580 వరకు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల పరిధిలో 835 ప్రైవేట్ బస్సులు, వ్యాన్లు ఉన్నాయి. జూన్ 15వ తేదీలోగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల యాజమాన్యాలు పొందాల్సి ఉంది. 2017 నుంచి స్కూల్ బస్సులకు స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి చేశారు. స్కూల్ బస్సుల వేగం గంటకు 60 కిటోమీటర్లు మించి ఉండకూడదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ నిబంధనలివీ.. బస్సు డ్రైవర్కు బీపీ, సుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ సర్టిఫికెట్ బస్సులో ఒకటి, యజమాని వద్ద ఒకటి ఉంచాలి. బస్సు అన్ని లైట్లు పనిచేయాలి. రిఫ్లెక్టివ్ టేపును బస్సుకు నాలుగు వైపులా అతికించాలి. బస్సుకు ఉన్న గ్లాసులు అన్నీ పటిష్టంగా ఉండేలా చూడాలి. బస్సు నుంచి పొగ రాకుండా చూడాలి. బ్రేక్ కండిషన్లో ఉండాలి. స్పీడో మీటర్ పనిచేయాలి. స్టీరింగ్, టైర్లు కండిషన్లో ఉండాలి. డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం ఉండాలి. 60 ఏళ్ల లోపు వయసు ఉండాలి. బస్సులో అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం ఉండాలి. బస్సులో మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలి. వారానికి ఒకసారి ప్రిన్సిపాల్ లేదా సంబంధిత అధికారి దీన్ని తనిఖీ చేయాలి. నెలకొకసారి పేరెంట్స్ కమిటీ ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను తనిఖీ చేయాలి. దీనికోసం ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలి. బస్సులో సీట్ల కింద బ్యాగులు ఉంచుకునేందుకు అరల ఏర్పాటు ఉండాలి. సైడ్ విండోలకు మధ్యలో 31 అంగుళాలకు మించని దూరంలో అడ్డంగా మూడు లోహపు కడ్డీలు అమర్చి ఉండాలి. ప్రతి విద్యా సంస్థ యాజమాన్యం, ట్రాన్స్పోర్ట్, పోలీస్, విద్యాశాఖల సౌజన్యంతో విద్యార్థులకు ఏడాదికి ఒక రోజు రోడ్ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి. బస్సు ఫుట్ బోర్డుపై మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తుకు మించరాదు. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చబడి ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా బస్సు ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్లు ఏర్పాటు చేయాలి. బస్సు అటెండెంట్ బస్సు బయట దగ్గరగా నిలబడి విద్యార్థులు బస్సు నుంచి సురక్షితంగా దిగేలా, ఎక్కేలా చూడాలి. పాఠశాల వద్ద బస్సుల పార్కింగ్కు ప్రత్యేక స్థలం ఉండాలి. బస్సులో అటెండర్ ఉండాలి. సీటింగ్ కెపాసిటికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. శ్రీబస్సు ఎడమవైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు పొందుపర్చాలి. రూట్ ప్లాన్ బస్సులో ఉంచాలి. విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు బస్సులో ఏర్పాటు చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకాన్ని ప్రతి నెలా యాజమాన్యం తనిఖీ చేయాలి. బస్సులో అటెండర్ తప్పకుండా యూనిఫామ్ ధరించాలి. నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తాం మోటార్ వాహనాల నిబంధనలు పాటించని పాఠశాల, కళాశాలల బస్సులను సీజ్ చేస్తాం. పాఠశాలలు తెరిచిన నాటి నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. గడువు ముగిసిన తర్వాత ఎఫ్సీ, పర్మిట్, కండిషన్ లేని బస్సులను సీజ్ చేస్తాం. – డి.శ్రీనివాసరావు, జిల్లా రవాణాశాఖ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
అడ్డుగా ఉందని పసిగుడ్డును చంపేశారు
● కేసును ఛేదించిన పోలీసులు ● కన్నబిడ్డను కడతేర్చింది తల్లి, అమ్మమ్మే! ● కేసును తప్పుదారి పట్టించడానికే క్షుద్రపూజల నాటకం ● వివరాలు వెల్లడించిన పిఠాపురం సీఐ శ్రీనివాస్ పిఠాపురం: పాపం పుణ్యం తెలియని పసికందును తమకు అడ్డు వస్తుందనే కారణంగో కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఇటీవల పసికందును హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు వివరాలను పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో చనిపోయిన యశ్విత తల్లి అయిన పసుపులేటి శైలజ నరసింగపురానికి చెందిన పెదపాటి సతీష్ను ప్రేమించి ఇరు కుటుంబాలకు ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్నారు. 2024లో వారికి పాప యశ్విత జన్మించింది. వివాహం అయినప్పటి నుంచి భర్త తనను అత్తగారింటికి తీసుకెళ్లలేదని, పాప పుట్టిన తర్వాత భర్త కుటుంబ సభ్యులు చూడ్డానికి రాలేదని, తన భర్త కూడా తనతో మునుపటిలా సఖ్యతగా ఉండడం లేదని శైలజ ద్వేషం పెంచుకుంది. తన తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని, వేరే కులానికి చెందిన సతీష్ను వివాహం చేసుకోవడం ఆమె తల్లి పసుపులేటి అన్నవరానికి మొదటి నుంచి ఇష్టం లేకపోవడంతో సతీష్కు పుట్టిన యశ్వితను అడ్డు తొలగిస్తే శైలజకు రెండో పెళ్లి చేయవచ్చనే ఉద్దేశంతో ఆ తల్లి ఉంది. దీంతో ఇద్దరూ కలిసి పసికందును అడ్డు తొలగించుకోడానికి పథకం వేశారు. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 5 నెలల వయసు గల యశ్వితను వారి ఇంటిలోనే వారిద్దరూ పీక నొక్కి చంపేశారు. అనంతరం పాప మృతదేహాన్ని ఇంటి వెనక గల నీటి బావిలో పడవేశారు. అనంతరం హత్యను కప్పిపుచ్చడానికి పాపకు ఎవరో మాంత్రికుడు చేతబడి చేసి చంపి ఉంటాడని నమ్మించి కేసును తప్పుదోవ పట్టించడానికి వారి గుమ్మం ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా కొంతసేపు నిద్ర పోయినట్లు నటించారు. అనంతరం లేచి తమ పాపను ఎవరో ఎత్తుకు పోయారంటు పెద్దగా కేకలు వేస్తూ హడావుడి చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఏమీ తెలియనట్లు నటిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాప ఆచూకీ కోసం గాలించగా వారి ఇంటి పక్కనే ఉన్న బావిలో పాప మృతదేహం లభించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్టీం, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించారు. పాప తల్లి శైలజ, అమ్మమ్మ పసికందును చంపి నూతిలో పడవేసి క్షుద్ర పూజల నాటకం ఆడినట్లు సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించామన్నారు. పాప తండ్రి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ కేసులో నిందితులు ఇద్దరిని సోమవారం అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్టు ఆయన తెలిపారు. -
పీజీఆర్ఎస్కు 159 అర్జీలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 159 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కారంలో కచ్చితంగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి సీనియర్ అఖిల భారత సర్వీసెస్ అధికారులు మూడు రోజుల పర్యటించనున్నారని తెలిపారు. వారు ప్రజలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు. వచ్చిన అర్జీల్లో 24 గంటల్లో పరిష్కరించాల్సినవి 5, 48 గంటల్లో పరిష్కరించాల్సినవి 35, 72 గంటల్లో పరిష్కరించాల్సినవి 16 ఉన్నాయన్నారు. రీ ఓపెన్ అయినవి 137 ఉన్నాయని, వీటిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కారం సాధ్యం కాకుంటే ఆ విషయంపై అర్జీదారుకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 34 అర్జీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం (పీజీఆర్ఎస్)కు 34 ఫిర్యాదులు అందాయి. జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్బీఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఏవీ సుబ్బరాజు పాల్గొన్ని అర్జీలు స్వీకరించారు. సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అర్జీలను చట్ట పరిధి ప్రకారం పరిష్కరించాలన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ): పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, బదిలీలు, ప్రమోషన్ల నేపథ్యంలో తలెత్తుతున్న విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో ఉపాధ్యాయులు సోమవారం ధర్నా నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, ఎ.షరీఫ్ నేతృత్వంలో డీఈఓ కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమం చేపట్టారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణ కుమారి మాట్లాడుతూ, ప్రతి వారం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమస్యలపై చర్చిస్తున్నప్పటికీ అధికారులు వాటిని ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయకర్ మాట్లాడుతూ, జీఓ నంబర్ 117 రద్దు చేస్తామని, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ హామీ అమలు చేయడం లేదని అన్నారు. షరీఫ్ మాట్లాడుతూ, హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను తగ్గించడం వల్ల విద్యా ప్రమాణాలు తీవ్రంగా పడిపోయే ప్రమాదం ఉందన్నారు. రానున్న రోజుల్లో జరగనున్న పదోన్నతులు, బదిలీ సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలన్నారు. లేకుంటే ఈ నెల 15న రాష్ట్ర కేంద్రంలో విద్యా భవన్ని వేలాది మంది ఉపాధ్యాయులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. యూటీఎఫ్ ఉపాధ్యక్షురాలు కె.విజయగౌరి మాట్లాడుతూ, మోడల్ ప్రైమరీ స్కూళ్లతో పాటు బేసిక్ ప్రైమరీ స్కూళ్లు, బేసిక్ స్కూళ్లకు కూడా తగినంత ప్రాధాన్యం కల్పించాలన్నారు. అనంతరం జిల్లా విద్యా శాఖ అధికారి కె.వాసుదేవరావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఈవీఎస్ఆర్ ప్రసాద్, కార్యదర్శులు ఇ.శ్రీమణి, సీహెచ్ దయానిధి, కె.రమేష్బాబు, చిలుకూరి శ్రీనివాసరావు, సీహెచ్వీ రమణ, మనోహర్, శ్రీనివాస్ మూర్తి, నర్సారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.రూపస్రావు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు కరవు
● ఎవరి దగ్గర మార్కుల కోసం పోలీసుల తాపత్రయం? ● ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండరన్న విషయం గమనించాలి ● దుర్మార్గాలకు మూల్యం తప్పదు ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం సిటీ: అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, జానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కక్షసాధింపు చర్యలు మితిమీరిపోయాయని, ఈ ప్రభుత్వంలో శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత విడుదల రజని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు. ఫిర్యాదు నమోదు కూడా చేయకుండానే అనుకున్నదే తడవుగా ఎక్కడుంటే అక్కడకు వెళ్లి వాళ్లను లాక్కుని పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మెప్పు కోసం, ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై పోలీసు వ్యవస్థ కూడా ప్రశ్నించుకోవాలని, ఎల్లకాలం ఒక్కరే అధికారంలో ఉండరని, ప్రతిసారీ ఇదే ప్రభుత్వం రాదని, ప్రతిసారీ ఇదే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చోరని, ప్రతి రోజూ ఇదే రకంగా ఉండదనే విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి పోలీసు అధికారీ గ్రహించాలని అన్నారు. మాజీ మంత్రి విడదల రజని, ఆమె పీఏ పరామర్శకు వెళ్లారని, పీఏను పోలీసులు తీసుకునిపోవడం, దీనిపై అడిగితే రజనీపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులను ఈవిధంగా వాడుకోవడం కూటమి ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చి ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామని చెప్పి పంగనామాలు పెట్టారని ఆయన విమర్శించారు. హామీలు అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్లు విపక్ష నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతూ, సమస్యను పక్కదారి పట్టించడానికి కూటమి ప్రభుత్వం కుయుక్తితో వ్యవహరిస్తోందని రాజా మండిపడ్డారు. శ్రీకాకుళం మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ సీపీ శ్రేణులను అణచివేస్తూ, వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి అని గానీ, ఒక మహిళ అని గానీ చూడకుండా రజనీ పట్ల సీఐ దౌర్జన్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పోలీసు డ్రెస్ వేసుకుంటే సుప్రీం అయిపోయినట్లు ప్రవరించడం సిగ్గుచేటన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వ పెద్దలు, పోలీసులు చట్ట పరిధిలోనే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని గ్రహించాలన్నారు. ఇప్పుడు వ్యవహరిస్తున్న దుర్మార్గ చర్యలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని కూటమి పెద్దలు, పోలీసులు గ్రహించాలని స్పష్టం చేశారు. ఈ అకృత్యాలకు కచ్చితంగా జవాబు చెప్పాల్సి వస్తుందనే విషయం మరచిపోవద్దని హెచ్చరించారు. ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి తిరిగి పట్టడం కట్టడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు కేసులు వెనక్కి తీసుకోవాలని, దాడులు, కక్ష సాధింపులు పక్కన పెట్టి, ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాజా హితవు పలికారు. -
పవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కల్యాణ్పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మల్లాం భాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.‘‘కంప్యూటర్ యుగంలో దళితుల సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు. పిఠాపురంలో మనువాదం అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణం. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం’’ అంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు.దళితుడన్న కారణంగా కరెంటు షాక్తో చనిపోయిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ కుటుంబాన్ని కూడా పరామర్శిచలేదు. పవన్కు మనసు నిండా కుల వివక్ష ఉంది. కులం, మతం రంగు పూసుకుని బతుకుతున్నాడు. మల్లాం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీం కోర్టును ఆశ్రయించాం. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కాకినాడ కలెక్టర్, ఆర్డీవో, పోలీసు అధికారులపై కేసు పెట్టాం...మల్లాం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందిక పోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశాం’’ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశోక్ బాబు తెలిపారు. -
‘కూటమికి వత్తాసు.. పోలీసుల లెక్కలు తేల్చే టైమ్ వస్తుంది’
సాక్షి, తూర్పుగోదావరి: దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ నేతలను ఎలా అణగదొక్కాలని ఆలోచిస్తున్నారని అంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నాను. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూడకుండా సీఐ ప్రవర్తించిన తీరు దారుణం. ఖాకీ చొక్కా వేసుకోగానే రాష్ట్రానికి సుప్రీం అనుకుంటున్నారేమో అర్థం కావడం లేదు. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదు. దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే వైఎస్సార్సీపీ వారిని ఎలా అణగదొక్కలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు ఏ పోలీసు అధికారి ఏ రకంగా ప్రవర్తించారన్నది తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం. అధికార పార్టీకి కొమ్ము కాసిన ప్రతీ పోలీస్ అధికారి రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా లెక్కలు అప్పజెప్పాల్సిన రోజు వస్తుంది. ఇది గుర్తు పెట్టుకుని పోలీసులు వ్యవహరిస్తే మంచిది’ అంటూ హెచ్చరించారు. -
కేంద్రం చేతిలోకి.. ఉపాధి స్టీరింగ్!
● కొత్తగా ‘యుక్తధార’ యాప్ ● దీని ద్వారా ఏ ప్రాంతంలో ఎప్పుడు పని చేయాలో నిర్దేశించనున్న కేంద్రం ● పథకాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ఎత్తుగడ ● రాష్ట్రాల హక్కులకు మంగళం పాడే దిశగా సంస్కరణలు సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తోందా.. ఇప్పటి వరకూ రాష్ట్రాల అజమాయిషీలో ఉన్న ఈ పథకం నిర్వహణ పూర్తిగా కేంద్రం చేతికి వెళ్లనుందా.. ఇకపై పనుల కల్పన, అంచనాల ప్రక్రియను కేంద్రమే పర్యవేక్షించనుందా.. ఇందులో భాగంగానే నూతన మొబైల్ యాప్ తీసుకొచ్చిందా.. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రంగా మారనుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇదీ సంగతి గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు 100 రోజుల ఉపాధికి గ్యారెంటీ కల్పించాలని, ఉన్న ఊళ్లోనే పనులు కల్పించాలనే డిమాండుతో దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. అనంతరం, అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నాంది పలికింది. దీనిపై 2005లో చట్టం రూపొందించింది. ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా పనులు కల్పించేలా చేసింది. ఏపీఓ, ఎంపీడీఓలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. పనుల కల్పన నుంచి, బిల్లుల చెల్లింపుల వరకూ అన్నీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే నడిచేలా చర్యలు తీసుకుంది. ఏదైనా గ్రామంలో కూలీలకు పనులు కల్పించాలంటే ఆయా గ్రామ పంచాయతీలు సామూహికంగా ఒక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులను గుర్తించే వెసులుబాటు కల్పించారు. దీనినే సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ అంటారు. దీనిని గ్రామ కార్యదర్శి నిర్వహించాలి. ఉపాధి హామీ చట్టం–2005 ప్రకారం గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ తీర్మానాల అనంతరం మంజూరు చేయాలి. ఇప్పటి వరకూ ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్తో ఇవన్నీ కనుమరుగుకానున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యాప్తో ఏం చేస్తారంటే.. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘యుక్తధార’ పేరిట సరికొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులను తన అజమాయిషీలో నిర్వహించేందుకు కేంద్రం సర్వం సిద్ధం చేసింది. ఏ రాష్ట్రంలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి.. ఏ ప్రాంతంలో ఏ పని ఎప్పుడు పెట్టాలి.. అంచనాలు ఎలా వేయాలి.. బిల్లులు చెల్లింపులు ఎలా జరగాలనే అంశాలన్నింటినీ ఈ యాప్ ద్వారా ఢిల్లీలో కూర్చునే కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించే అవకాశం కలుగుతుంది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి అవసరమైన లేబర్ బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. కూలీలు చేయాల్సిన పనులన్నీ కేంద్రమే గుర్తిస్తుంది. పనులు చేపట్టిన కూలీలకు కేంద్రమే నేరుగా బిల్లులు చెల్లిస్తుంది. యుక్తధార మొబైల్ యాప్ వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది. తొలి దశలో జిల్లా వ్యాప్తంగా మండలానికో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేస్తున్నారు. అనంతరం, రెండో దశలో జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ దీనిని అమల్లోకి తెస్తారు. నిడదవోలు మండలం శెట్టిపేటలో ప్రస్తుతం ఇదే పద్ధతిలో పనులు కల్పిస్తున్నారు. రాష్ట్రాల హక్కులకు భంగం యుక్తధార యాప్ వలన రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పథకం నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మురుగు కాలువలు, ఇతర భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ యాప్ ద్వారా కేంద్ర పర్యవేక్షణ మొదలైతే భవిష్యత్తులో ఈ పనులన్నీ చేసే వీలుంటుందా.. ఈ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు ఎవరి పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాలి.. రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, అవినీతి నిర్మూలనకే ఈ యాప్ తెచ్చామని కేంద్రం చెబుతోంది. అవినీతి నిర్మూలించాలంటే కఠిన నిబంధనలు తీసుకురావాలే తప్ప.. కేంద్రం ఆ ధీనంలోకి తీసుకోవడమేంటనే వాదన కూడా వినిపిస్తోంది. దీని వలన పనుల కల్పన తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ యాప్ వలన ఉపాధి హామీ పథకంపై రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోతాయని, ఇది పూర్తిగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిడదవోలు మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్) జిల్లాలో ఉపాధి పథకం బ్లాకులు 18 పంచాయతీలు 300 మంజూరైన జాబ్కార్డులు 1.69 లక్షలు కూలీలు 2.61 లక్షలు యాక్టివ్ జాబ్కార్డులు 1.23 లక్షలు పనులు వినియోగించుకుంటున్న కూలీలు 1.76 లక్షలు ఒక్కో కూలీ సగటు వేతనం రూ.254 ఏటా కల్పిస్తున్న పని దినాలు 53 లక్షలు వెచ్చిస్తున్న నిధులు సుమారు రూ.152 కోట్లు -
విద్య.. అస్తవ్యస్తీకరణ!
పదోన్నతుల్లో.. ● ప్రమోషన్ సీనియారిటీ సమస్యలు పరిష్కరించిన తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి. ● బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వేర్వేరుగా చేపట్టాలి. 610 జీవోలో జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయుల సీనియారిటీకి రక్షణ కల్పించాలి. ● మున్సిపల్ పాఠశాలల్లో అప్గ్రెడేషన్ ప్రక్రియ సత్వరమే చేపట్టి పదోన్నతులు ఇవ్వాలి.● సమస్యలపై యూటీఎఫ్ పోరుబాట ● డీఈవో కార్యాలయాల ఎదుట నేడు ధర్నా ● 117 జీవో రద్దు.. రీస్ట్రక్చరింగ్పై స్పష్టత కోరుతూ నిరసనకు సమాయత్తం రాయవరం: ఉపాధ్యాయ సమస్యలపై యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) పోరుబాట పట్టింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 117 జీవోను రద్దు చేయాలని, పాఠశాలల రీ స్ట్రక్చరింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దశల వారీ ఆందోళనకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. అలాగే బదిలీలు, పదోన్నతులకు అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో స్పష్టమైన జీవోలు లేకుండా రోజుకో విధమైన ఆలోచనతో పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు ఎదురుగా ధర్నాకు సన్నద్ధమవుతున్నారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు.. ● జీవో 117 రద్దు చేసి అందులోని లోపాలను సవరిస్తూ ప్రస్తుతం చేపడుతున్న రీ స్ట్రక్చరింగ్ విధానాలను పొందుపరుస్తూ కొత్త జీఓ విడుదల చేయాలి. ● అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించాలి. ● మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఐదు తరగతులు బోధించడానికి ఐదుగురు టీచర్లు నియమించాలి. విద్యార్థుల సంఖ్య 75 మించితే పీఎస్ హెచ్ఎం పోస్టు అదనంగా కేటాయించాలి. అలాగే విద్యార్థుల సంఖ్య 120కి మించితే 6వ ఎస్జీటీ, ఆపై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ వంతున కేటాయించాలి. ● ఉర్దూ, మైనర్ మీడియం బోధించే ఉపాధ్యాయులను తెలుగు మీడియం ఎస్జీటీ/ఎస్ఏలతో కలిపి లెక్కించి పోస్టులు కేటాయించడం సరికాదు. ఆ పోస్టులు అదనంగా ఇవ్వాలి. ● అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలి. ● స్కూల్ అసిస్టెంట్లు రెండు కేటాయిస్తే ఒకటి లాంగ్వేజ్, రెండోది నాన్ లాంగ్వేజ్, నాలుగు పోస్టులు కేటాయిస్తే రెండు లాంగ్వేజ్, రెండు నాన్ లాంగ్వేజ్ పోస్టులు కేటాయించాలి. ● స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేవలం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే నియమించాలి. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియంను కొనసాగించాలి. ● ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45కు మించితే రెండో సెక్షన్ ఏర్పాటు చేసి, తదనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలి. ● విద్యార్థుల సంఖ్య 300 దాటిన హైస్కూళ్లలో రెండో పీడీ పోస్టు కేటాయించాలి. బదిలీలకు సంబంధించి.. ● బదిలీల జీవో తక్షణం విడుదల చేసి, వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. ● బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్ 2 పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ బోధనకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. ● ఎస్జీటీల బదిలీల్లో మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. ● స్కూల్ అసిస్టెంట్ టీచర్లు (స్పెషల్ ఎడ్యుకేషన్)కు బదిలీల్లో కొత్తగా మంజూరు చేసిన పోస్టులను ఖాళీలుగా చూపాలి. ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏ జీవో ప్రకారం పాఠశాలలను రీస్ట్రక్చర్ చేస్తున్నారో ప్రభుత్వం స్పష్టమైన జీవో విడుదల చే యాలి. అలా కాకుండా రీస్ట్రక్చ ర్ చేస్తే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయలేం. ఉపాధ్యాయుల్లో నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించేలా చర్యలు చేపట్టాలి. పదో న్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాల్లో అభ్యంతరాలను సరిచేసి, సీనియారిటీ జాబితాను విడుదల చేయాలి. – అహ్మద్ షరీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, తూర్పు గోదావరి జిల్లా -
కోకో.. కోలుకోలేక..
● గింజల ధర నేల చూపులు ● గత ప్రభుత్వ హయాంలో కిలోకు రూ.1,050 ఆదాయం ● నేడు రూ.500కు పతనం ● కొనుగోలు సంస్థల సిండికేట్ ● గిట్టుబాటు కాక, కొనే నాథుడు లేక రైతుల గగ్గోలు పెరవలి: మార్కెట్లో ఒక సరకు సరఫరా తగ్గితే సహజంగానే దానికి డిమాండ్.. అందుకు అనుగుణంగా ధరలు పెరుగుతాయి. అర్ధశాస్త్రంలో ఇది ప్రాథమిక ఆర్థిక సూత్రం. ఇది ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ.. రైతుల విషయంలో మాత్రం ఎప్పుడూ తల్లకిందులవుతూనే ఉంది. పొగాకు, నిమ్మ, వరి రైతులు ఇప్పటికే సరైన గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. ఈ కోవలో కోకో రైతులు కూడా చేరారు. ఓవైపు గింజల దిగుబడి తగ్గింది. ఇటువంటి సమయంలో మార్కెట్లో వీటి ధర పెరగాలి. కానీ, గోరుచుట్టుపై రోకలి పోటులా కొనుగోలు సంస్థలు సిండికేట్ అయ్యి ముందుకు రాకపోవడంతో కోకో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 16 వేల హెక్టార్లలో.. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది రైతులు 16 వేల హెక్టార్లలో రైతులు కోకో సాగు చేస్తున్నారు. పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, దేవరపల్లి, కొవ్వూరు, కడియం, సీతానగరం, బిక్కవోలు తదితర మండలాల్లో కోకో సాగు జరుగుతోంది. ఒక్క నిడదవోలు నియోజకవర్గంలోనే 860 ఎకరాల్లో కోకో సాగు జరుగుతూండగా, దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సీజన్లో సుమారు 2.64 లక్షల క్వింటాళ్ల కోకో గింజల ఉత్పత్తి జరుగుతుంది. రైతుల ఆశలపై నీళ్లు సాధారణంగా ప్రతి పంట సీజన్లో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ, ఈ ఏడాది అది రెండు మూడు క్వింటాళ్లకు పడిపోయింది. ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ ఏర్పడి, మార్కెట్లో మంచి ధర లభిస్తుందని రైతులు భావించారు. కానీ, ప్రైవేటు కొనుగోలు సంస్థలు సిండికేట్ అయ్యి, రైతుల ఆశలపై నీళ్లు జల్లారు. గత ఏడాది ఇదే సమయంలో కిలో కోకో గింజలకు రూ.1,050 చొప్పున ధర పలికింది. ఈసారి కూడా ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఆశ పడ్డారు. గింజలు ఫ్యాక్టరీలకు తీసుకెళ్తే కనీసం గేట్లు కూడా తీయటం లేదని, మార్కెట్ ధరకే అమ్ముతామన్నా వద్దంటున్నారని చెబుతున్నారు. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల్లో మామూళ్లు ఇస్తే కిలో గింజలకు రూ.500 మాత్రమే చెల్లిస్తున్నారని వాపోతున్నారు. ఎకరానికి పెట్టుబడి రూ.60 వేలు అవుతూండగా, ఇటు దిగుబడి, అటు ధర తగ్గిపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. దిగుబడి రెండు క్వింటాళ్లు మాత్రమే రావడంతో వచ్చిన సొమ్ము ఖర్చులకు సరిపోతోందని ఒక రైతు చెప్పారు. ఈ పరిస్థితుల్లో నష్టాన్ని తగ్గించుకునేందుకు చాలాచోట్ల రైతులే కాయలు కోసి, గింజలు తీసుకుంటున్నారు. దీనివలన తమకు పనులు లేకుండా పోయాయని కూలీలు ఆవేదన చెందుతున్నారు. నష్టాలు చవిచూశా.. గత ఏడాది కంటే అధిక ధర పలుకుతుందని ఆశించాం. కానీ, తక్కువ ధర లభించింది. దిగుబడి కూడా తగ్గటంతో లాభాలు లేకపోగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. కిలో రూ.500 పలుకుతున్నా గత్యంతరం లేక అయినకాడికి అమ్ముకోవలసి వస్తోంది. – కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు చాలా దారుణం కొనుగోలు కంపెనీలు సిండ్కేట్గా మారి కోకో గింజల ధర తగ్గించాయి. నేడు రూ.500 ధరకు కూడా కొనే నాథుడు లేడు. కంపెనీకి తీసుకెళ్తే కనీసం గేట్లు కూడా తీయటం లేదు. ఇంత దారుణం ఎప్పుడూ లేదు. – వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు -
ఆపరేషన్ సిందూర్ విజయవంతం హర్షణీయం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ హర్షం వ్యక్తం చేశారు. భారతీయులందరూ సగర్వంగా కాలర్ ఎగరేసుకుని ఉండేలా నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, మన దేశ రక్షణ దళాలకు ఈ క్రెడిట్ దక్కుతుందని, వారికి సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం స్థానిక కొత్తపేట రౌతు తాతాలు కల్యాణ మండపంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో భరత్ పాల్గొని, స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తలసేమియా వ్యాధితో బాధ పడుతున్న పిల్లల కోసం జైన్ సేవా సమితి రాజమహేంద్రవరంతో పాటు దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండటానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. వివాహాల సమయంలో తలసేమియాకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. జాగృతి బ్లడ్ బ్యాంకు, మాగ్నా ఆసుపత్రి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించడంపై భరత్ అభిననందనలు తెలిపారు. కార్యక్రమంలో అశోక్ కుమార్ జైన్, విక్రమ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. -
రథోత్సవంపై సూర్య ప్రతాపం
● జనం రాక కళ తప్పిన ఉత్సవం ● నూతన రథంపై సత్యదేవుడు, అమ్మవారి ఊరేగింపుఅన్నవరం: సత్యదేవుని రథోత్సవంపై సూర్యుడు ప్రతాపం చూపించాడు. నిప్పుల వర్షం కురిసినట్టుగా ఎండ కాయడంతో ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో ఉత్సవం కళ తప్పింది. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం సాయంత్రం సత్యదేవుని రథోత్సవం నిర్వహించారు. ఎండ తీవ్రతకు తోడు సరైన ప్రణాళిక లేకపోవడంతో రథోత్సవం ప్రారంభ సమయానికి గ్రామస్తులు, భక్తులు పెద్దగా రాలేదు. గత ఏడాది సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమై రాత్రి 9.30 గంటల వరకూ కొనసాగగా, ఈసారి 4 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకే ముగిసింది. గత ఏడాది రథోత్సవం సాయంత్రం 5 గంటలకు మొదలైంది. అప్పటికి ఎండ తగ్గడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసారి ఉత్సవం మొదలయ్యే సమయానికి 35 డిగ్రీల సెల్సియస్కు పైబడి ఉష్ణోగ్రత ఉండటంతో గ్రామస్తులు, భక్తులు పెద్దగా రాలేదు. వారితో పోలిస్తే దేవస్థానం సిబ్బంది, పోలీసులు, కళాకారులే అధికంగా కనిపించారు. ప్రారంభ సమయానికి 250 మంది దేవస్థానం సిబ్బంది, 150 మంది పోలీసులు, 200 మంది కళాకారులు మాత్రమే ఉన్నారు. సాయంత్రం 5.30 గంటల సమయానికి కాస్త ఎండ తగ్గడంతో గ్రామస్తులు వచ్చారు. ఉత్సవం ముగిసే సమయానికి సుమారు 3 వేల మంది మాత్రమే ఉన్నారు. ఉత్సవం జరిగిందిలా.. సత్యరథాన్ని ఉదయం 8 గంటలకు పంపా సత్రం నుంచి రత్నగిరి తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ఊరేగింపుగా తొలి పావంచా వద్దకు తీసుకువచ్చి, రథంపై వేంచేయించి, పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు రథం ముందు కుంభం పోసి, గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు రథోత్సవాన్ని ప్రారంభించారు. తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ వరకూ, అక్కడి నుంచి తిరిగి తొలి పావంచా మీదుగా దేవస్థానం టోల్గేట్ వరకూ, అక్కడి నుంచి కొత్తగా నిర్మించిన రథం షెడ్డు మీదుగా తొలి పావంచా వరకూ రథోత్సవం సాగింది. అనంతరం, స్వామి, అమ్మవార్లను రథం నుంచి కిందకు దించి, ఊరేగింపుగా కొండపై ఆలయానికి చేర్చారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఫస్టియర్ విద్యార్థులకు 37 కేంద్రాల్లోను.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ సెకండియర్ విద్యార్థులకు 16 కేంద్రాల్లోను ఈ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 20, 466 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ తదితర సదుపాయాలు కల్పించారు. విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే చేరుకోవాలని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్ఎస్వీఎల్ నరసింహం సూచించారు. ఈ పరీక్షలకు 37 మంది చీఫ్ సూపర్వైజర్లు, 37 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఏడుగురు కస్టోడియన్లను నియమించామని తెలిపారు. డీఎస్సీపై రేపు అవగాహన సదస్సు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): డీఎస్సీ పరీక్షపై యూటీఎఫ్తో కలసి రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వి.రాంబాబు తెలిపారు. సదస్సు కరపత్రాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ సదస్సుకు పోటీ పరీక్షల నిపుణుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు హాజరై, విలువైన సమాచారం అందిస్తారన్నారు. డీఎస్సీ అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోరాట ఫలితంగా డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకోగా, నేడు ఓపెన్ కేటగిరీకి అర్హతలు లేవని చెప్పడం దారుణమని అన్నారు. టెక్నికల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని, మన రాష్ట్రంలో కూడా 47 సంవత్సరాల వరకూ వయోపరిమితి పెంచాలని, జిల్లా అంతటా ఒకే పేపర్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే డీఎస్సీ అభ్యర్థులతో కలిసి పోరాటాలు చేపడతామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్గా శేషారావు ఎస్సీ కమిషన్ చైర్మన్గా జవహర్ నిడదవోలు: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) చైర్మన్గా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బూరుగుపల్లి శేషారావు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎస్ జవహర్ నియమితులయ్యారు. ఆదివారం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో ఈ విషయం వెల్లడించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గా ఏర్పడిన తర్వాత నిడదవోలు, కొవ్వూరు ని యోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులు బూరుగుపల్లి శేషారావు, కేఎస్ జవహర్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్లు దక్కకపోవడంతో ఆందోళనలు చేశారు. పొత్తులో భాగంగా నిడదవోలు సీటును జనసేన నుంచి ప్రస్తుత రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్కు కేటాయించారు. అలా గే, కొవ్వూరు నియోజకవర్గంలో బలమైన సామా జిక వర్గానికి చెందిన జవహర్ను అణచివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2019, 2024 ఎన్నికల్లో ఆయనకు కొవ్వూరు సీటు ఇవ్వకుండా పక్కన పెట్టారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శేషారావుకు, జవహర్కు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం వారి వర్గాలకు కాస్త ఊరటనిచ్చింది. మండు వేసవిలోనూ లోవకు భక్తుల తాకిడి తుని రూరల్: మండు వేసవిలోనూ తలుపులమ్మ అమ్మవారి సన్నిధి వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,24,140, పూజా టికెట్లకు రూ.73 వేలు, కేశఖండన శాలకు రూ.16,130, వాహన పూజలకు రూ.9,860, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలుగా రూ.63,772, విరాళాలు రూ.77,577 కలిపి మొత్తం రూ.3,64,479 ఆదాయం సమకూరిందని వివరించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వేద పండితులు, ప్రధానార్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. -
సీహెచ్ఓల డిమాండ్లు నెరవేర్చాలి
రాజమహేంద్రవరం రూరల్: సీహెచ్ఓల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (ఏపీఎంసీఏ) అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యాన సీహెచ్ఓలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 14వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని విద్యాసాగర్ సందర్శించి సీహెచ్ఓలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరేళ్లు నిండిన సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాలనే నిబంధన ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇంక్రిమెంట్లు, ఇన్సెంటివ్లు లేక సీహెచ్ఓలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.మమత మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
జాతీయ చదరంగం పోటీలకు సాన్వీ
అమలాపురం రూరల్: గుంటూరులో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం అండర్ – 7 పోటీల్లో అమలాపురంలోని కామనగరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న బి.సాన్వీ అత్యుత్తమ ప్రతిభ చూపి, 5 బై 6 పాయింట్లు సాధించింది. రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచి జాతీయ చదరంగ పోటీలకు అర్హత సాధించింది. ఆమెకు కోనేరు హంపి తల్లిదండ్రులైన అశోక్, లత చేతుల మీదుగా ట్రోఫీ అందించారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో జూన్లో జరిగే జాతీయ పోటీల్లో సాన్వీ పాల్గొంటుందని కోచ్ వి.శ్రీనుబాబు తెలిపారు. స్వాన్వీని స్కూల్ డైరెక్టర్ నంద్యాల మనువిహార్, ప్రిన్సిపాల్ దేవీదీక్షిత్ శనివారం అభినందించారు. కాలువలో పడి మహిళ మృతి కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట పరకాలువలో పడి పితాని రమణమ్మ (57) మృతి చెందింది. తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలువకు చెందిన రమణమ్మ ఉపాధి హామీ కూలీగా పనిచేస్తుంది. ఆమె భర్త గతంలోనే చనిపోయాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రమణమ్మ ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరకాల్వ తూటి కాడపై ఆమె మృతదేహం శనివారం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిమ్మాపురం ఇన్చార్జి ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో.. ముమ్మిడివరం: ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొని బైక్ వెళుతున్న యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలం కోడూరుపాడు శివారు నక్కల పుంతకు చెందిన సవరపు నాగబాబు (28) శనివారం సాయంత్రం యానాం వవెళ్లి తిరిగి వస్తున్నాడు. నగర పంచాయతీలోని కొండాలమ్మ గుడి వద్ద 216 జాతీయ రహదారిపై అమలాపురం నుంచి వస్తున్న వ్యాన్ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగబాబుకు భార్య రేణుక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతి మహిళా శక్తిగా మారాలి
రాజానగరం: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు అమలు చేస్తోందని, వాటిపై అవగాహన పెంచుకుని ప్రతి మహిళా స్వీయరక్షణతో ఒక శక్తిలా ఉండాలని శక్తి టీమ్ జిల్లా ఇన్చార్జి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ అన్నారు. దివాన్ చెరువులోని షిరిడీసాయి జూనియర్ కళాశాలలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో శనివారం మహిళా చైతన్య కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ స్వీయ రక్షణ చర్యలు, సైబర్ నేరాల అదుపు, సోషల్ మీడియా యాప్స్తో వచ్చే నష్టాలు, పోక్సో చట్టం, శక్తి యాప్లపై అవగాహన కల్పించారు. మహిళలందరూ శక్తి యాప్ను తమ సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆ యాప్ ఉపయోగించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ కె.మంగాదేవి, ఎౖస్సై రామకృష్ణ, విద్యార్థినులు పాల్గొన్నారు. -
నేడు సత్యదేవుని రథోత్సవం
భారీ టేకు రథంపై ఊరేగనున్న స్వామి, అమ్మవార్లు తొలి పావంచా నుంచి ప్రారంభం కానున్న వైనం అన్ని ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్వామివారి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. 36 అడుగుల ఎత్తయిన నూతన టేకు రథంపై స్వామి, అమ్మవార్లను కొండ దిగువన గల మెయిన్ రోడ్డులో ఊరేగిస్తారు. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ వైభవంగా ఈ కార్యక్రమం జరపనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమ వివరాలు ఇవే.. ● సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లను ఊరేగించేందుకు రూ.1,04 కోట్లతో 36 అడుగుల ఎత్తు, 14.6 అడుగుల వెడల్పు, 21 అడుగుల పొడవు గల భారీ రథాన్ని తయారు చేశారు. ఇది అంతర్వేది దేవస్థానం రథం కన్నా రెండు అడుగులు మాత్రమే చిన్నది. ● రథాన్ని ఎత్తే జాకీకి 2 హెచ్ పీ మోటార్ ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా రథాన్ని చుట్టూ తిప్పే వీలుంది. రథం బరువంతా ఈ జాకీ మీద పెట్టినా ఏమీ కాదు. ● రథోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్య ఈ రథాన్ని పంపా సత్రం నుంచి తొలిపావంచా వద్దకు తీసుకువస్తారు. మధ్యాహ్నం రెండు నుంచి 2.30 గంటల వరకు పుష్పాలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తారు. 2.30 నుంచి 3.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు అర్చకస్వాములు అలంకరణ చేస్తారు. ● నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, వీర్ల సుబ్బారావు కొబ్బరికాయలు కొట్టి రథం ముందు పోసిన కుంభం మీదుగా రథాన్ని లాగి ప్రారంభిస్తారు. ● రథోత్సవంలో భాగంగా సుమారు 200 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. ● రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి మెయిన్ రోడ్డులో విద్యుత్కు అంతరాయం కలుగుతుంది. 36 అడుగుల రథానికి విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రథోత్సవం పూర్తయ్యేవరకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ● అన్నవరం మెయిన్ రోడ్డులో ఉదయం నుంచి వాహనాలను అనుమతించరు. తుని వైపు నుంచి వచ్చే వాహనాలను మండపం వద్ద గల ఆర్చి నుంచి జాతీయ రహదారి వైపు మళ్లిస్తారు. కాకినాడ, రాజమండ్రి వైపు నుంచి వచ్చే వాహనాలను ఎంవీఆర్ సెంటర్ ఆర్చి నుంచి జాతీయ రహదారి వైపు మళ్లిస్తారు. ● సుమారు 500 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ బి.సూర్య అప్పారావు, మరో పది మంది ఎస్ఐలు ఈ బందోబస్తులో పాల్గొంటారు. ● రథోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. -
సర్వాంతర్యామి.. సదా స్మరామి..
● వాడపల్లికి పోటెత్తిన భక్తులు ● ఒక్కరోజే దేవస్థానానికి రూ.47.78 లక్షల ఆదాయం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రానికి శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూ ర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చ కుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున అర్చక స్వాములు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అభిషేకార్చన లు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అలంకార ప్రియుడై న స్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. సా ధారణ భక్తులతో పాటు ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం కిక్కిరిసింది. క్షేత్రపాలకుడికి పూజలు ఆలయ ఆవరణలో క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్న ప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల వరకూ స్వామి వారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా ఒక్కరోజు దేవస్థానానికి రూ.47,78,296 వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. షామియానాల ఏర్పాటు శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు, కురిసిన భారీ వర్షానికి వాడపల్లి క్షేత్రంలో అన్నప్రసాదం తాత్కాలిక షెడ్డు పడిపోయింది. దీంతో శనివారం తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదం స్వీకరించడానికి ఇబ్బందులు లేకుండా డీసీ అండ్ ఈఓ చక్రధరరావు పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన షామియానాలు ఏర్పాటు చేయించారు. -
‘చిన్నారి ఆరోగ్యం’ భేష్
● గెయిల్ సీఎస్ఆర్ నిధులతో నూతన కార్యక్రమం ● ప్రారంభించిన మంత్రి దుర్గేష్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా ‘చిన్నారి ఆరోగ్యం’ కార్యక్రమం ప్రారంభించడం మంచి పరిణామమని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గెయిల్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయస్సు కలిగిన దాదాపు 74,238 మంది చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేయడం సంతోషకరమన్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 1,448 మంది పిల్లలు అతి తీవ్ర పోషకాహారం లోపంతో, 95 మంది తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని తెలిపారు. వీరిని ప్రతి బుధవారం బాలమిత్రలు సందర్శించి వారి ఎత్తు, బరువు, ఆరోగ్య స్థితిని పరీక్షించి, చిన్నారి ఆరోగ్య యాప్లో అప్లోడ్ చేస్తారన్నారు. ఈ పిల్లలకు నెలకోసారి పోషకాహారం కిట్లు పంపిణీ చేస్తారన్నారు. గెయిల్ జనరల్ మేనేజర్ వైఏ కుమార్ మాట్లాడుతూ, చిన్నారులకు సంపూర్ణ పోషణ కూడిన ఆహారం అందజేసేందుకు తమ సంస్థ ద్వారా రూ.38 లక్షల ఆర్థిక చేయూత అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, గెయిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్లు దీవి ప్రభాకర్ (హెచ్ఆర్), కె.రాజన్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్న జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి కె.విజయ కుమారిని సన్మానించారు. చివరిలో బాలింతలకు సీమంతం, చిన్నారులకు గ్రాడ్యుయేషన్ నిర్వహించారు. పిల్లల తల్లులకు పోషకాహార కిట్లు అందజేశారు. వీరమరణం పొందిన సైనికులకు నివాళి తొలుత పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, పాక్ కాల్పుల్లో రాష్ట్ర జవాన్ మురళీ నాయక్ వీరమరణం కలచివేసిందని నివాళులర్పించారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ‘భారత్ మాతాకీ జై, జై జవాన్ అని నినదించారు. -
అక్కడ అంతా క్షేమమేనా..
● ఇక్కడ స్థిరపడిన రాజస్థానీయుల ఆవేదన ● తమ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్న వైనం పిఠాపురం: పాకిస్థాన్తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సరిహద్దులోని మన రాష్ట్రాల్లో హై అలర్టు ప్రకటించారు. బ్లాక్ అవుట్లు, సైరన్ల మోతతో ఆ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రాంతంలో స్థిరపడిన రాజస్థానీయులు అక్కడి తమ వారి కోసం ఆందోళన చెందుతున్నారు. వీరందరూ వివిధ వ్యాపారాల కోసం రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చి అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో తమ స్వగ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రసార మాద్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు. అక్కడి వారి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్లోని బార్మీర్, జైసల్మేర్, పోక్రాన్ వంటి ప్రాంతాలకు చెందిన తమ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. మూడు రోజులుగా ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. భారత ఆర్మీ తమకు అండగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తున్నారని అక్కడి వారు తమ బంధువులకు సమాచారం ఇస్తున్నారు. -
ప్రతిధ్వనించిన వేదఘోష
● సత్యదేవుని సన్నిధిలో ఘనంగా పండిత సదస్యం ● 150 మంది పండితులకు సత్కారం అన్నవరం: రత్నగిరి వేద ఘోషతో ప్రతిధ్వనించింది. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో శనివారం వేద పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలు మూలల నుంచీ విచ్చేసిన సుమారు 150 మంది వేద, స్మార్త పండితులు స్వామివారి ముందు తమ విద్వత్తును ప్రదర్శించారు. మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా స్వామి, అమ్మవార్లను అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి, అక్కడి వేదికపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకూ పండితుల వేద మంత్రఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా వేద పండితులను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఘనంగా సత్కరించారు. సత్కారం పొందిన వారిలో మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, గొల్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి (రాజమహేంద్రవరం), ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజులు ఘనపాఠి (తిరుపతి), ఉపాధ్యాయుల లక్ష్మీనృసింహ ఘనపాఠి (విజయవాడ దుర్గమ్మ దేవస్థానం), దువ్వూరి ఫణియజ్ఞ ఘనపాఠి, విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి (తిరుపతి వేద విశ్వవిద్యాలయం), అన్నవరం దేవస్థానం వేద పండితులు ఉన్నారు. ఘనంగా పొన్నచెట్టు వాహన సేవ సత్యదేవుడు, అమ్మవారిని రాత్రి పొన్నచెట్టు వాహనం మీద ఘనంగా ఊరేగించారు. రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కొండ దిగువన తొలి పావంచా వద్దకు తీసుకువచి, పొన్నచెట్టు వాహనంపై వేంచేయించి, పూజలు చేశారు. అక్కడి నుంచి ఆంధ్రా బ్యాంక్ సెంటర్కు వెళ్లి, తిరిగి తొలి పావంచా వరకూ ఊరేగింపు సాగింది. -
కంచికి చేరుతున్న కోతలు
● జిల్లాలో 58,586 హెక్టార్లలో రబీ వరి సాగు ● 57,946 హెక్టార్లలో కోతలు పూర్తి ● 5.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ● మందకొడిగా కొనుగోళ్లు ● ఎక్కడి ధాన్యం అక్కడే.. ● అన్నదాతలను హడలెత్తిస్తున్న అకాల వర్షాలు దేవరపల్లి: జిల్లాలో రబీ వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. సీజన్ ప్రారంభంలో అధిక వర్షాలు కురవడంతో ఎక్కువ మంది రైతులు వరి నాట్లు ఆలస్యంగా వేశారు. బోర్ల కింద ముందుగా సాగు చేసిన పంట కోతలు సకాలంలో జరిగినప్పటికీ.. ఆలస్యంగా నాట్లు వేసిన చోట్ల కోతలు ఇంకా జరుగుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో రైతులు 58,586 హెక్టార్లలో రబీ వరి సాగు చేశారు. 4,520 హెక్టార్లలో ఫైన్ వైరెటీ, 46,204 హెక్టార్లలో కామన్ వైరెటీ, 5,154 హెక్టార్లలో పీఆర్–126 రకం వంగడాలను రైతులు పండించారు. ఇప్పటి వరకూ 57,946 హెక్టర్లలో (98 శాతం) వరి కోతలు పూర్తయ్యాయి. దీని ద్వారా 5,26,435 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. మరో రెండు వారాల్లో కోతలు దాదాపు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. దిగుబడులు ఆశాజనకం రబీ వరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకూ దిగుబడులు సాధించారు. సగటున ఎకరాకు 50 బస్తాలు తగ్గకుండా దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. అయితే, మద్దతు ధర లభించడం లేదని వాపోతున్నారు. అరకొరగా సంచుల సరఫరా, తేమ శాతం నిబంధనలతో మిల్లర్లు ఇబ్బందులు పెట్టడం, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరవకపోవడంతో దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంటను అమ్ముకోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుకు వెళ్లినా లోడు సకాలంలో దింపుకోక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం 75 కిలోల బస్తాకు రూ.1,750 మద్దతు ధర ప్రకటించింది. కానీ, దళారులు రూ.1,250 నుంచి రూ.1,350కి కొనుగోలు చేయడంతో దారుణంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. యంత్రాలతో కోతలు కోసి రోడ్లపై ఆరబెట్టి ఎప్పటి ధాన్యం అప్పుడే అమ్ముకుంటున్నారు. వాతావరణం అనుకూలించక పోవడంతో ఎక్కువ మంది రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంటను అమ్ముకోవలసి వస్తోంది. పీఆర్–126 (బొండాలు) రకం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రావడం లేదని రైతులు చెబుతున్నారు. అకాల వర్షాలతో టెన్షన్ రబీ వరి కోతల ప్రారంభం నుంచి ఈదురు గాలులతో అకాల వర్షాలు కురుస్తూండటంతో అన్నదాతలు టెన్షన్ పడుతున్నాడు. రాత్రి సమయంలో అకాల వర్షాలు కురుస్తూండటంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ వేల బస్తాల ధాన్యం ఎక్కడికక్కడే రోడ్లపై ఉంది. దీంతో, కంటి మీద కునుకు లేకుండా ధాన్యం రాశుల వద్దే రైతులు పడిగాపులు పడుతూ, పంటను కాపాడుకుంటున్నారు. పగలంతా రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని సాయంత్రం రాశులుగా వేసి బరకాలు కప్పి, ఒబ్బిడి చేసుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ ధాన్యం రాశులతో నిండి ఉన్నాయి.చివరి దశకు కోతలు రబీ కోతలు చివరి దశకు చేరాయి. ఎప్పటి ధాన్యాన్ని అప్పుడే రైతులు తమకు నచ్చిన మిల్లుకు పంపిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. రైతులు 2 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే దళారులకు అమ్ముకున్నారు. మొత్తం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి, రాజమహేంద్రవరం -
రద్దీగా శృంగార వల్లభుని సన్నిధి
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి వారిని శనివారం వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. మొత్తం 15 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. వివిధ సేవల టికెట్ల ద్వారా రూ.2,05,750, అన్నదాన విరాళాలుగా రూ.76,031, కేశఖండన ద్వారా రూ.8,840, తులాభారం ద్వారా రూ.700, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.24,690 కలిపి స్వామివారికి రూ.3,16,011 ఆదాయం సమకూరిందని వివరించారు. భక్తులతో కిక్కిరిసిన బాల తిరుపతిమామిడికుదురు: బాల తిరుపతిగా భక్తుల పూజలందుకుంటున్న అప్పనపల్లి బాల బాలాజీ స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి సన్నిధిలో జరిగిన శ్రీలక్ష్మీ నారాయణ హోమంలో భక్తులు పాల్గొన్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.4,06,417 ఆదాయం వచ్చింది. 5,500 మంది భక్తులు దర్శించుకున్నారు. 3,200 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.1,01,381 విరాళాలుగా అందించారన్నారు. నిత్యాన్నదాన పథకానికి విరాళం అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి ముంబైకి చెందిన దోనేపూడి జగదీష్ రూ.లక్ష, ఠానేలంకకు చెందిన జగత వెంకట గంగాధర్ రూ.10,116 విరాళం అందజేశారు. ఈ సొమ్మును దాతలు ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావుకు అందించారు. భీమేశ్వరస్వామి ఆలయంలో.. రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్కు విశాఖపట్నానికి చెందిన ఇమంది శ్రీనివాసరావు, పద్మలత దంపతులు శనివారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని చేతికి వారు నగదు అందించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను దాతలకు అందజేశారు. -
మద్దతు ధరకు కొనాలి
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా పని చేస్తున్నాయి. కొనే నాథుడు లేక 40 శాతం ధాన్యం ఎక్కడిదక్కడే ఉంది. ఎక్కువ శాతం దళారులే కొనుగోలు చేస్తున్నారు. దిగుబడి బాగున్నప్పటికి ధర లేక గిట్టుబాటు కావడం లేదు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పండిన ప్రతి గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, రైతులను ఆదుకున్నారు. ఇప్పుడు మిర్చి, పెండలం, కోకో.. ఇలా రైతు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. కూటమి ప్రభుత్వంలో రైతులు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. రైతులకు సకాలంలో గోనె సంచులు అందించి, కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకే ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి. – వల్లభనేని సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం -
అప్రోచ్ రోడ్లు, దీపాలు వేయించరా?
● ఎంతో పోరాడి మోరంపూడి ఫ్లై ఓవర్ నిర్మించాం ● నాకు పేరు వస్తుందనే ఇక్కడ పనులు ఆపేశారా? ● అవినీతి, అక్రమాల పైనే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టరేం? ● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ సూటి ప్రశ్న ● ఫ్లై ఓవర్ వద్ద గోతులు పూడ్చి, నిరసనరాజమహేంద్రవరం రూరల్: తాను ఎంతో పోరాడి, త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయిస్తే, కనీసం అప్రోచ్ రోడ్లు, లైట్లు వేయించాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ విమర్శించారు. మోరంపూడి ఫ్లై ఓవర్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఆయన శనివారం నిరసన తెలిపారు. అక్కడి గోతులను మట్టితో పూడ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ రహదారిపై కీలక జంక్షన్గా ఉన్న మోరంపూడి సెంటర్లో వేలాది ప్రమాదాలు జరిగి, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దీనిని నివారించేందుకే పట్టుబట్టి ఇక్కడ ఫ్లై ఓవర్ సాధించామని చెప్పారు. తాము కట్టించిన ఫ్లై ఓవర్కు రిబ్బన్ కత్తిరించడం మినహా కూటమి ప్రభుత్వం అప్రోచ్ రోడ్డు, లైట్లు, సర్వీస్ రోడ్ల వంటి ఎలాంటి సౌకర్యాలూ కల్పించలేదని అన్నారు. గోదావరిలో ఇసుక, రాజమహేంద్రవరంలో భూములు దోచుకోవడం, లిక్కర్ మాఫియాతో అడ్డగోలు సంపాదన పైనే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆత్రుత పడుతున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరం నగరంలో పేకాట క్లబ్బులు, గాంబ్లింగ్, స్పా సెంటర్ల వంటివి ఎమ్మెల్యే మనుషులే పెట్టుకుని ఇక్కడి సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారని భరత్ విమర్శించారు. వీటన్నింటిపై ఉన్న శ్రద్ధ నిర్మాణం పూర్తయి, ప్రారంభించి ఏడాది అయిన ఫ్లై ఓవర్కు అప్రోచ్ రోడ్లు వేయించడంపై ఎందుకు లేదని నిలదీశారు. ఒకవైపు ప్యాచ్ వర్కులు చేస్తున్నారని, వాళ్లనే ఇక్కడకు తీసుకుని వచ్చి, కనీసం ఆ పనులైనా చేయించవచ్చు కదా అని అన్నారు. ప్యాచ్ వర్కులు కూడా చేయకపోవడంతో వాహనదారుల నడుములు విరిగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోరంపూడి ఫ్లై ఓవర్ వలన తనకు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో అప్రోచ్ రోడ్లు, లైట్లు వేయించకుండా తాత్సారం చేస్తున్నారా అని భరత్రామ్ అనుమానం వ్యక్తం చేశారు. చిన్న ప్యాచ్ వర్కులు కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే చేతకానివాడేనని, అందుకే ప్రభుత్వం మేల్కొని అప్రోచ్ రోడ్లు, లైట్లు వేయించాలని డిమాండ్ చేశారు. బంగ్లా నుంచి నిత్యం ఇదే రోడ్డులో కలెక్టరేట్కు వెళ్తున్న కలెక్టరైనా స్పందించాలి కదా అని ప్రశ్నించారు. ఫ్లై ఓవర్ మీది నుంచి వెళ్లిపోవడంలో అప్రోచ్ రోడ్ల బాధ తెలియడం లేదేమోనని అన్నారు. తగిన శ్రద్ధ తీసుకుని, ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ను డిమాండ్ చేశారు. నేషనల్ హైవే సంస్థ వలన కాకపోతే మున్సిపల్ కార్పొరేషన్ అయినా ఈ పనులు చేపట్టాలని సూచించారు. కనీసం ఎంపీ పురందేశ్వరి అయినా దీనిపై దృష్టి పెట్టకపోతే ఎలాగని, కాంట్రాక్టర్తో చేయించాలని అన్నారు. ప్రజల బాధలు చూసి, డస్ట్, చిప్స్ రప్పించి ఇక్కడి గుంతల్లో ప్యాచ్ వర్కులు చేయిస్తున్నామని భరత్ అన్నారు. -
చండీ హోమం నిలిపివేత
● సత్యదేవుని కల్యాణోత్సవాల వేళ భక్తులకు నిరాశ ● నిర్వహణకు రుత్విక్కులు లేరన్న వైదిక కమిటీ ● వెలవెలబోయిన వనదుర్గ ఆలయం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఏడాదికో రూలు పాటిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సత్యదేవుని కల్యాణోత్సవాల సందర్భంగా 2023, 2024 సంవత్సరాల్లో రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలను దేవస్థానం పండితులు యథావిధిగా నిర్వహించారు. ఈ ఏడాది కల్యాణోత్సవాల్లో మాత్రం ఇతర వైదిక కార్యక్రమాలతో పాటు అమ్మవారి హోమాలు కూడా నిలుపు చేశారు. దీంతో, శుక్రవారం జరగాల్సిన చండీ హోమం జరగలేదు. ఈ విషయం తెలియక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చండీ హోమం నిర్వహించడం లేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు. ఈ నెల 12న పౌర్ణమి నాడు జరగాల్సిన ప్రత్యంగిర హోమం కూడా నిలుపు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇలా ఎందుకు నిలుపు చేశారని వైదిక కమిటీలోని పండితులను అడిగితే హోమాల నిర్వహణకు రుత్విక్కులు చాలరని ఒకరు.. స్వామివారి కల్యాణ మహోత్సవాల సమయంలో మరే ఇతర కార్యక్రమాలూ జరగకూడదని మరొకరు చెబుతున్నారు. గతంలో జరిగాయని అడిగితే అప్పుడు చేశారు కానీ, ఇప్పుడు నిలిపివేశామని అంటున్నారు. అన్నీ తెలిసిన వారుంటే.. వాస్తవానికి సత్యదేవుని కల్యాణోత్సవాలు నిర్వహించినప్పుడు ఇప్పటిలా గతంలో ఎప్పుడూ హోమాలు నిలిపివేయలేదు. గతంలో కరోనా సమయంలో సైతం హోమాలు నిర్వహించారు. భక్తుల్ని మాత్రం అనుమతించలేదు. 2023లో దేవదాయ శాఖ సీనియర్ రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) చంద్రశేఖర్ ఆజాద్ కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా ఉన్నారు. ఆయన ఊరుకోరనే ఉద్దేశంతో అప్పట్లో హోమాలు నిలుపు చేయలేదు. అలాగే, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గత ఏడాది ఈఓగా ఉన్నారు. ఆయనకు అన్నీ తెలుసు. అందువలన అప్పుడు కూడా హోమాలు నిలుపు చేయలేదు. ఈసారి మాత్రం వనదుర్గ అమ్మవారి హోమాలు నిలుపు చేయాలని పండితులు చెప్పగానే ప్రస్తుత ఈఓ వీర్ల సుబ్బారావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పూర్వపు దేవస్థానం చైర్మన్ ఐవీ రామ్కుమార్కు వనదుర్గ అమ్మవారంటే ఎంతో భక్తి. 1995లో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ సమయంలో వనదుర్గ అమ్మవారి మూలవిరాట్టును కదిపి బాలాలయంలో పెట్టారు. ఆ సమయంలో కొన్ని అపచారాలు జరిగాయి. అప్పట్లో రామ్కుమార్ పదవికి కోర్టు ద్వారా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఆయన అమ్మవారి కార్యక్రమాల్లో ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఒప్పుకునేవారు కాదు. ఒకవేళ ఆయన ఇప్పుడు ఉండి ఉంటే వనదుర్గ అమ్మవారి హోమాలు నిలిపివేయడానికి అంగీకరించి ఉండేవారు కాదని పలువురు అంటున్నారు. ప్రస్తుత చైర్మన్ ఐవీ రోహిత్కు అంత అనుభవం లేకపోవడంతో చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో అన్నీ తెలిసిన వారుంటే ఒకలా.. ఏమీ తెలియని వారుంటే మరోలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శ వస్తోంది. గతంలోనూ.. చంద్రశేఖర్ ఆజాద్ 2023లో ఈఓగా ఉన్నప్పుడు క్యూ లైన్ కోసం పాత నివేదన శాలను తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పట్లో నివేదన శాలకు భూస్పర్శ లేకపోయినా ఫర్వాలేదని చెప్పి సర్క్యులర్ మండపం పై అంతస్తు మీద దాత చేత నివేదన శాల నిర్మింపజేశారు. అలాగే, జ్యోతిర్మయి సత్యదేవుని వ్రతం నిర్వహణపై ఆజాద్కు లిఖిత పూర్వకంగా సలహా ఇచ్చారు. ఈ వ్రతం నిర్వహణకు రూ.30 లక్షలతో అకౌంట్స్ సెక్షన్ కార్యాలయాన్ని మండపంగా మార్చి, ఏసీలు కూడా ఏర్పాటు చేయించారు. ఆజాద్ తరువాత రామచంద్ర మోహన్ ఈఓగా వచ్చాక సర్క్యులర్ మండపం పైనున్న నివేదన శాలలో నివేదనలు చేయడం తప్పని, నివేదన శాలకు భూస్పర్శ ఉండాలని, అలాగే, జ్యోతిర్మయి వ్రతం చేయకూడదని పండితులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికై నా 12వ తేదీన ప్రత్యంగిర హోమం నిలుపుదలను పునఃపరిశీలించాలని భక్తులు కోరుతున్నారు. -
ఘనంగా అరుంధతీ నక్షత్ర దర్శనం
● శాస్త్రోక్తంగా స్థాలీపాక హోమాలు ● రావణబ్రహ్మ వాహన సేవలకు తరలివచ్చిన భక్తులుఅన్నవరం: వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శుక్రవారం సాయంత్రం నవ దంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు దర్బారు మండపంలో స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లను తూర్పు రాజగోపురం ముందుకు మంగళవాయిద్య ఘోష నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు పండితులు అరుంధతీ నక్షత్రం చూపించి, పూజలు చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కమిటీ సభ్యుడు చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, కొంపెల్ల మూర్తి, అర్చకులు దత్తాత్రేయశర్మ, సుధీర్, పరిచారకులు పవన్ పాల్గొన్నారు. రావణబ్రహ్మ వాహనంపై సత్యదేవుని ఊరేగింపుసత్యదేవుడు, అమ్మవారిని రాత్రి రావణబ్రహ్మ, వాహనంపై ఘనంగా ఊరేగించారు. రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పండితులు కొండ దిగువన ఉన్న తొలి పావంచా వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రావణబ్రహ్మ వాహనంపై వేంచేయించి, పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దర్శించి పూజలు చేశారు. అనంతరం రావణబ్రహ్మ వాహనం ముందు కుంభపు రాశి వేసి, కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకూ, తిరిగి తొలి పావంచా వరకూ ఈ ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా పలువురు కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. ఈ ఊరేగింపు నేపథ్యంలో గ్రామంలోకి భారీ వాహనాలను అనుమతించలేదు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపును చూసేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఊరేగింపు సాగినంతసేపూ బాణసంచా కాల్చారు. అన్నవరంలో నేడు తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ మధ్యాహ్నం 2.30 : అనివేటి మండపంలో సత్యదేవుడు, అమ్మవారి సమక్షంలో సరస్వతీ పూజ, వేద పండిత సదస్సు రాత్రి 9.00 : కొండ దిగువన పొన్నచెట్టు వాహనంపై సత్యదేవుడు, అమ్మవారి ఊరేగింపు ఉదయం 7.00 – 10.00, సాయంత్రం 5.00 – రాత్రి 11.00 : రత్నగిరి కళావేదికపై, కొండ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు -
ఇదేం ప్రజాస్వామ్యం!
● పత్రికా స్వేచ్ఛపై దాడులు ● ప్రశ్నించే గొంతును నొక్కాలని చూడటం దారుణం ● ప్రజాసంఘాలు, మేధావుల మండిపాటు సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతోందని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తుతున్నారు. పత్రికల్లో వస్తున్న వ్యతిరేక కథనాలు వచ్చాయని భావిస్తే ఖండన ఇవ్వాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులూ లేకుండా విజయవాడలోని సాక్షి సంపాదకులు ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా సోదాలు చేయడాన్ని ఖండించారు. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వాలూ ఇటువంటి దాడులు చేయించిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విలేకరులపై, కార్యాలయాలపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఇవన్నీ చూస్తూంటే బ్రిటిష్ పాలన గుర్తుకొస్తోందని అన్నారు. తీరు మార్చుకుంటే కూటమి ప్రభుత్వానికి జర్నలిస్టులు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? భారత రాజ్యాంగంలో పత్రికల పాత్ర కీలకం. రాజ్యాంగానికిది నాలుగో స్తంభం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పత్రికలపై దాడి చేయడం హేయమైన చర్య. రాష్ట్రంలో ప్రశ్నించే వాడే ఉండకూడదకుంటే ఎలా? భయపెట్టి ఎంతకాలం రాజకీయం, పరిపాలన చేయగలరు? ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేయడం కొన్ని రోజులుగా పరిపాటిగా మారుతోంది. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి మంచిది కాదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లోకి ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా చొరబడి, దురుసుగా ప్రవర్తించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. – తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవ్వరికీ లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపడం మీడియా బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తిస్తున్న మీడియా మీద, జర్నలిస్టులపై కేసులు బనాయించడం సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏ ఒక్కరికీ లేదనే విషయం గుర్తించాలి. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి విధానాలు మానుకోవాలి. ఏదైనా ఉంటే ఉంటే చట్టబద్ధంగా చూసుకోవాలి. ఎలాంటి నోటీసులూ లేకుండా బెదిరింపు చర్యలకు దిగడం సరైన విధానం కాదు. – మండెల శ్రీరామ్మూర్తి, రాష్ట్ర కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయులపై కక్ష సాధింపు బాధాకరం పాలకుల వేధింపులతో జర్నలిజాన్ని ఖూనీ చేస్తున్నారు. పాలకుల వైఖరి చూస్తూంటే సామాన్య ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం నిబంధనలకు వ్యతిరేకంగా జర్నలిస్టుల ఇళ్లలో కూడా పాలకులు సోదాలు చేయడం చట్ట వ్యతిరేక చర్య కాదా? ఇలాంటి చర్యలు భవిష్యత్తులో వ్యవస్థకు పెను ప్రమాదంగా మారుతాయి. ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు మకిలి పట్టించే విధంగా ఉన్నాయి. కక్షలు, కార్పణ్యాలకు రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలనను భ్రష్టు పట్టిస్తే ప్రజల్లో తిరుగుబాటు రావటం ఖాయం. – మేడా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం అందరూ ఖండించాలి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సమాచారం అందించేందుకు పత్రికలు కృషి చేస్తాయి. ప్రజల సమస్యలను, ప్రభుత్వ విధానాలను స్వేచ్ఛగా ప్రచురించే హక్కు పత్రికలకు ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. పత్రికా విలేకరులపై ఎడిటర్లపై పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరిపై ఉంది. – డాక్టర్ గుబ్బల రాంబాబు, చైర్మన్, అంబేద్కర్ సేవా కేంద్రం(ఆస్క్), రాజమహేంద్రవరం -
కొనసాగుతున్న సీహెచ్ఓల నిరవధిక సమ్మె
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యాన సీహెచ్ఓలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆందోళన శిబిరంలో సీహెచ్ఓలు పాక్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ నిర్వహించి, సుమారు 100 మంది ఉగ్రవాదుల్ని అంతం చేసిన సైనికులకు వందనం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మమత మాట్లాడుతూ ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని, విలేజ్ క్లినిక్ అద్దె బకాయిలు, విద్యుత్ బిల్లులు వెంటనే చెల్లించాలని, పీఎఫ్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
వేగంగా ధాన్యం సేకరణ
పెరవలి: జిల్లాలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.రాధిక తెలిపారు. మండలంలో ధాన్యం రాశులు, వరి చేలను శుక్రవారం ఆమె పరిశీలించారు. రైతు సేవా కేంద్రాల్లో (ఆర్ఎస్కు) రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, తాజా లక్ష్యం ప్రకారం జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 2.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇప్పటి వరకూ రూ.5.50 కోట్లు చెల్లించామని, మరో రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఉండ్రాజవరం, పెరవలి, చాగల్లు మండలాల్లో వరి కోతలు ఇంకా పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ మండలాల్లో ధాన్యం సేకరణ జరుగుతోందని, పెరవలిలో మరో వెయ్యి టన్నులు సేకరించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. కొనుగోలు లక్ష్యం 3.50 లక్షల టన్నులు పోనూ, మిగిలిన 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు ఇప్పటికే దళారులకు అమ్ముకున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కానూరు ఆర్ఎస్కేలో ధాన్యం కొనుగోలు ఆన్లైన్కు టెక్నికల్ అసిస్టెంట్ల చేతులు తడపాల్సి వస్తోందని రైతులు చెప్పడంతో, దీనిపై వెంటనే పరిశీలించాలని ఏఎస్ఓను ఆదేశించారు. ఆర్ఎస్కేల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని రాధిక హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మేరీ కిరణ్, ఆర్ఐ పావని తదితరులు పాల్గొన్నారు. టెన్త్ టాపర్కు కలెక్టర్ అభినందన రాజమహేంద్రవరం సిటీ: క్రమశిక్షణతో చదువుకుంటే విజయం సాధ్యమని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. పదో తరగతి ఫలితాల్లో 600కు 599 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం పొందిన బొమ్మూరు భాష్యం స్కూల్ విద్యార్థిని కె.హర్షిత్ను శుక్రవారం తన కార్యాలయంలో ఆమె అభినందించారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఇదే పట్టుదలతో ఉన్నత చదువులు చదివి, ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, జోనల్ ఇన్చార్జి ఆంజనేయులు, హెచ్ఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
భవిష్యత్లో చైనా టెక్నాలజీతో విగ్రహాలు
● సెమినార్లో పాల్గొన్న శిల్పి రాజ్కుమార్ ● తయారీలో కొత్త పోకడలపై అధ్యయనం కొత్తపేట: చైనా టెక్నాలజీని భవిష్యత్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆ తరహా విగ్రహాలు రూపకల్పనపై దృష్టి సారించనున్నట్టు అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డీ రాజ్కుమార్వుడయార్ తెలిపారు. చైనాలో నూతన టెక్నాలజీతో విగ్రహాల తయారీపై జరిగిన సెమినార్లో రాష్ట్రం నుంచి ఆయన పాల్గొన్నారు. శుక్రవారం ఆ సెమినార్ విశేషాలను వివరించారు. వారం రోజుల పాటు సాగిన సెమినార్లో 250 దేశాల నుంచి వివిధ రకాల విగ్రహాల శిల్పులు పాల్గొన్నారన్నారు. ఇక్కడ సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కాంస్యంతో విగ్రహాలు తయారు చేస్తున్నామని, అక్కడ వీటితో పాటు ఇంకా అనేక రకాల లోహాలతో విగ్రహాలు తయారు చేస్తున్నారని తెలిపారు. భారీ కాంస్య విగ్రహాలను నిర్మించడంలో చైనా కంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుందన్నారు. సంప్రదాయ క్యాస్టింగ్ పద్ధతులకు ఆధునిక టెక్నాలజీని కలిపి భారీ స్థాయి విగ్రహాలను చైనా కంపెనీలు తయారు చేస్తున్నాయని, అత్యంత ఎల్తైన విగ్రహాలు కూడా ఆ దేశం టెక్నాలజీ ద్వారానే తయారవుతున్నాయన్నారు. ముందు చిన్న నమూనా విగ్రహం తయారుచేసి, దానిని 3 డీ స్కానింగ్ చేసి, కంప్యూటర్ డిజైనింగ్ ద్వారా కోరుకున్న సైజుకు ఇమేజ్ను పెంచుతారని తెలిపారు. ఎత్తైన విగ్రహాల విడి భాగాలను సులభంగా పోత పోసేందుకు ఫౌండ్రీలు ఉన్నాయని తెలిపారు. పెద్ద పెద్ద ఫౌండ్రీల వల్ల తక్కువ సమయంలో విడి భాగాలను తయారుచేసే వీలు ఉంటుందన్నారు. భారీ విగ్రహాలు నెలకొల్పే విషయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలు చైనా కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. విగ్రహాలే కాక పార్కులు, సాంస్కృతిక చిహ్నాలు, వివిధ కళాకృతులు నిర్మిస్తారని తెలిపారు. -
కిక్ బాక్సర్కు ఎస్పీ అభినందన
కాకినాడ క్రైం: కిక్ బాక్సింగ్లో రాణిస్తున్న కాకినాడ నగరానికి చెందిన యువతి లేఖా నిహారికను ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం ఆయన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేఖా నిహారిక కేరళలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ శిక్షణలో రాణించి హంగేరియన్ వాకో వరల్డ్ కప్ పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని అన్నారు. ఈ పోటీలలో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
మన్నికై నవే ఎన్నుకోండి
● ఆటలు ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త ● రక్షణ కవచాలు లేకుంటే గాయాల పాలే.. ● నాసికరం కొన్నారంటే...మూన్నాళ్లే! నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆటలు అంటే అందరికీ ఇష్టమే. ఆరేళ్ల వయస్సు నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు వివిధ రకాలైన ఆటలు ఆడడానికి ఉత్సాహం చూపుతారు. ఆసక్తి, అభిరుచి ఉన్న ఆటల్లో రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని కలలు కంటారు. వేసవి సెలవులు ఇవ్వడంతో జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ రకాల వేసవి శిక్షణ శిబిరాల్లో చేరేందుకు బాల బాలికలు ఆసక్తి కనపరుస్తున్నారు. క్రీడలకు సంబంధించి ఆడేటప్పుడు లేదా శిక్షణ పొందే సమయంలో క్రీడాపరికరాలు, దుస్తులు, బూట్లు వినియోగించకపోతే గాయాలపాలై ఒక్కోసారి క్రీడలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ రకాల క్రీడల్లో వినియోగించే వస్తువులు, క్రీడాపరికరాలు, వాటి ధరలపై కథనం బాస్కెట్బాల్ టీ షర్ట్, షాట్, షూ వినియోగిస్తారు. బాస్కెట్బాల్స్ రూ.750 నుంచి రూ.2,500 వరకు, డ్రస్ రూ.900 నుంచి రూ.3,000, షూ రూ.1,500 నుంచి రూ.8,000, నెట్ రూ.400 నుంచి రూ.5,000 వరకు ఉన్నాయి. హాకీ రూ.650 నుంచి రూ.5,000 వరకు, నెట్ రూ. 25,000, గోల్కీపర్ కిట్ రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఉన్నాయి. ఇందులో హెల్మెట్, చెస్ట్ప్యాడ్, బాడీ ప్రొటెక్షన్, గ్లౌజ్, ప్యాడ్, నీగార్డ్స్, ఎల్బోగార్డ్స్ను వినియోగిస్తారు. బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్లో రిస్ట్బ్యాన్ ్డ్స, నీక్యాప్స్, షూ, టీ షర్ట్, షార్ట్స్ వినియోగిస్తారు. ఫెదర్ కాక్స్ కొరత కారణంగా ఎక్కువ కాలం మన్నిక కోసం నైలాన్ కాక్స్ ఉపయోగిస్తున్నారు. బ్యాట్స్ రూ.650 నుంచి రూ.15,000 వరకు, నెట్స్ రూ.350 నుంచి రూ.3,000 వరకు, కాక్స్ బ్యారర్ రూ.300 నుంచి రూ.4,000 వరకు అమ్ముతున్నారు. హ్యాండ్బాల్ హ్యాండ్బాల్లో టీషర్ట్, షార్ట్, షూ వినియోగిస్తారు. బాల్స్ రూ.700 నుంచి రూ.5,000 వరకు, నెట్స్ రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. త్రోబాల్ బాల్స్ రూ.700 నుంచి రూ.1,500 వరకు, నెట్ రూ.600 నుంచి రూ.2,500 వరకు ఉన్నాయి. ఈ ఆటలో షార్ట్, టీ షర్ట్, షూ వినియోగిస్తారు. స్కేటింగ్ స్కేట్స్, హెడ్గార్డ్, ఎల్బో గార్డ్, నీగార్ట్స్, షూ, స్కేటింగ్ డ్రస్ వినియోగిస్తారు. స్కేటింగ్ షూ రూ.400 నుంచి రూ.10,000, డ్రస్ రూ.500 నుంచి రూ.5,000 వరకు, ప్రొటెక్షన్ కిట్ రూ.400 నుంచి రూ.4,000 వరకు ఉన్నాయి. టెన్నిస్ ర్యాకెట్లు రూ.1,500 నుంచి రూ.15,000 వరకు, బాల్స్ రూ.500 నుంచి రూ.1,200 వరకు ఉన్నాయి. తైక్వాండో.. తైక్వాండో డ్రస్ రూ.500 నుంచి రూ.1,200 వరకు ఉన్నాయి. బాల్ బ్యాడ్మింటన్ బ్యాట్స్ రూ.500 నుంచి రూ.5,000 వరకు, బాల్స్ రూ.60 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. షాట్పుట్ 8ఎల్బీ, 16ఎల్బీ, 12ఎల్బీబీ రూ.1000 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. స్విమ్మింగ్ క్యాప్స్, గాగుల్స్, ఇయర్ ప్లగ్స్ డ్రస్ వినియోగిస్తారు. స్విమ్ సూట్స్ రూ.100 నుంచి రూ.2,000 వరకు, గాగుల్స్ రూ.150 నుంచి రూ.5,000 వరకు, షాట్స్ రూ.250 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. స్పోర్ట్స్ షూ స్పోర్ట్స్ షూ రూ.600 నుంచి రూ.10,000 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. క్రీడా పరికరాల కొనుగోలులో తీసుకోవల్సిన జాగ్రత్తలు క్రీడాపరికరాలు ఆథరైజ్డ్ డీలర్ల వద్ద కొనుగోలు చేయాలి. నాసిరకం కంపెనీలు, డూప్లికేట్ కంపెనీ వస్తువుల పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి. క్రీడాపరికరాలు తయారు చేసి ఎక్కువ సంవత్సరాలు కానివి కొనుగోలు చేయాలి. క్రికెట్, షటిల్, టెన్నిస్ బ్యాట్స్ కొనుగోలులో హ్యాండిల్స్, పగుళ్లు, ఫ్రేమ్ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. నెట్ నాణ్యత కలిగినది కొనుగోలు చేయాలి. తక్కువకు వస్తున్నాయని డూప్లికేట్ కంపెనీలు కొనుగోలు చేస్తే మూన్నాళ్లకే మూలకు చేరడం ఖాయం. చెస్ చెస్ బోర్డ్స్ రూ.200 నుంచి రూ.2,000 వరకు, పాన్స్ రూ.100 నుంచి రూ.1,000 వరకు, టైమర్ రూ.2,000 నుంచి రూ.10,000, చెస్ మ్యాట్ రూ.100 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. చెస్ బోర్డు, పాన్స్ క్యారమ్స్ క్యారమ్ బోర్డులు చిన్నవి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు, పెద్దవి రూ.1,200 నుంచి రూ.15వేల వరకు, క్వాయిన్స్ రూ.100 నుంచి రూ.500 వరకు, స్టైగర్స్ రూ.50 నుంచి రూ.500 వరకు, స్టాండ్ రూ.2,000, పౌడర్ రూ.40 నుంచి అందుబాటులో ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ టీటీ బ్యాట్స్ రూ.400 నుంచి రూ.5,000 వరకు, బాల్స్ రూ.30 నుంచి రూ.250 వరకు ఉన్నాయి. టీటీ బోర్డ్స్ రూ.25,000 నుంచి రూ.80,000 వేలు వరకు దొరుకుతున్నాయి. క్రికెట్ క్రికెట్లో హెల్మెట్, గ్లౌజ్, ప్యాడ్స్, ఆర్మ్గార్డ్, థైగార్డ్, క్రికెట్ బ్యాట్స్ వినియోగిస్తారు. క్యాస్ట్ బ్యాట్ రూ.1,800 నుంచి రూ.3,500, ఇంగ్లిష్ బ్యాట్ రూ.3,500 నుంచి రూ.60 వేల వరకు, బాల్స్ రూ.200 నుంచి రూ.250 వరకు, మ్యాచ్ బాల్స్ రూ.450 నుంచి రూ.900 వరకు, డ్రస్ రూ.650 నుంచి రూ.3 వేల వరకు, వికెట్స్, ప్యాడ్స్ రూ.1,200 నుంచి రూ.1,500 వరకు, కిట్ బ్యాగ్ రూ.800 నుంచి రూ.15 వేల వరకు, హెల్మెట్ రూ.1,100 నుంచి రూ.9 వేల వరకు ఉన్నాయి. ఫుట్బాల్ ఫుట్బాల్లో చిన్గార్డ్స్ వినియోగిస్తారు. బాల్స్ రూ.800 నుంచి రూ.2,500 వరకు, నెట్స్ రూ.500 నుంచి రూ.15,000 వరకు ఉన్నాయి. డ్రస్ రూ.800 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉంది. వాలీబాల్ బాల్స్ రూ.600 నుంచి రూ.1,800 వరకు, నెట్ రూ.400 నుంచి రూ.5,000 వరకు, డ్రస్ రూ.800 నుంచి రూ.8,000 వరకు ఉన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తాళ్లరేవు: యానాం–ద్రాక్షారామ రహదారిలో సుంకరపాలెంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మడికి సత్యనారాయణ(69) మృతిచెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు స్థానిక అంబేడ్కర్నగర్కు చెందిన మడికి సత్యపారాయణ రహదారి చెంతన ఉన్న కుళాయి వద్దకు నీరు పట్టుకునేందుకు రాగా ఆ సమయంలో ద్రాక్షారామ నుంచి యానాం వేగంగా వెళుతున్న వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళా హాస్టల్ వార్డెన్ మృతి
● పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన పెద్దాపురం: మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంంంంజినీరింగ్ కళాశాలలో మహిళా హాస్టల్ వార్డెన్ నిండుకుండల నాగమల్లి (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రౌతులపూడి మండలం మెరక సోమవారనికి చెందిన ఈమె ఏడాదిగా హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల సిబ్బంది పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లితండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉదయం మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి యాజమాన్యం తప్పిందం వల్లే ఈ ఘటన జరిగిందని ఆత్మహత్య కాదు హత్యేనంటూ నినాదాలు చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయలంటూ డిమాండ్ చేస్తూ మెరక సోమవరం గ్రామస్తులు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అక్కడకు చేరుకుని పూర్తిన్యాయం చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మనస్థాపంతోనే యువతి ఆత్మహత్య గండేపల్లి: మనస్థాపంతోనే ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు గండేపల్లి ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. ఆమె తన గ్రామానికి చెందిన శెట్టిబత్తుల శివ దుర్గను ప్రేమించిందన్నారు. శివ దుర్గ ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో మనస్థాపాం చెంది ఆమె ఉంటున్న గదిలో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్టు తెలిపారు. మృతురాలి తల్లి దేవుడమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
కలెక్టర్ ప్రశాంతికి రెడ్క్రాస్ పురస్కారం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రెడ్క్రాస్ పురస్కారం అందుకున్నారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమెకు గవర్నర్ ఈ పురస్కారం, ప్రశంసా పత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పని చేసిన సమయంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యకలాపాలకు విస్తృత ప్రచారం కల్పించడం, ప్రజాప్రయోజనాల నేపథ్యంలో పలు కార్యక్రమాలు చేపట్టినందుకు గాను ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా రెడ్క్రాస్ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా యూత్ రెడ్క్రాస్ సభ్యులుగా విద్యార్థులను చేర్పించాలని సూచించారు. 12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ రాజమహేంద్రవరం రూరల్: ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.సీతారామమూర్తి అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి ఎన్ఎస్వీఎల్ నరసింహం మాట్లాడుతూ, సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 20,446 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులకు 37, సెకండియర్ విద్యార్థులకు 16 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరుగుతాయని వివరించారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ రాజమహేంద్రవరం రూరల్: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలుంటే శుక్రవారంలోగా ఉమ్మడి జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి సమర్పించవచ్చని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడలోని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల (ఆర్జేడీ) పరిధిలో ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్ అసిస్టెంట్ల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించారని వివరించారు. దీనిపై అభ్యంతరాలకు గత నెల 4 వరకూ గడువు ఇచ్చారని, వ చ్చిన అభ్యంతరాల ప్రకారం జాబితాలు తయా రు చేసి కాకినాడ ఆర్జేడీ వెబ్సైట్ www. rjdsekkd లోను, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యా శాఖల వెబ్సైట్లలోను, నోటీసు బోర్డుల్లోను అందుబాటులో ఉంచారని తెలిపారు. దీనిపై అభ్యంతరం తెలిపే వారు ఆ ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలని, అందుకు సంబంధించిన ఆధారాలు లేదా సంబంధిత సాక్ష్యాలు ఉంటే జత చేయాలని సూచించారు. గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు. -
పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి
● సాక్షి ఎడిటర్ ఇంట్లో నిర్భంధ సోదాలు అన్యాయం ● పాత్రికేయుల నిరసనలుసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధానాలకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాత్రికేయులు గురువారం నిరసనలు తెలిపారు. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు.. విజయవాడలో సాక్షి సంపాదకులు ధనంజయరెడ్డి ఇంట్లోకి చొరబడి, అక్రమంగా సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను ప్రజాసంఘాలు, పౌర సమాజం ముక్తకంఠంతో ఖండించాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసుల అక్రమ సోదాలను నిరసిస్తూ రాజమహేంద్రవరంలో సాక్షి పాత్రికేయులు గురువారం సాయంత్రం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వార్తలు రాస్తున్నందుకు సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని అన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులూ లేకుండా అక్రమంగా సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వ విధానాలపై వార్తలు రాస్తే వాటిరి వివరణలు ఇవ్వవచ్చని, అంతే తప్ప ఎడిటర్ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసేలా ప్రవర్తించడం మంచిది కాదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ ఫయాజ్ బాషా, సాక్షి టీవీ ప్రతినిధి హరీష్, కెమెరామన్ మురళి, ఆర్సీ ఇన్చార్జులు కె.శ్యామ్శేఖర్రెడ్డి, వై.విశ్వనాథం, విలేకర్లు సత్యంబాబు, అంగర రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్టుల ధర్నా నిడదవోలు: సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసుల అక్రమ సోదాలను నిరసిస్తూ నిడదవోలు జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యాన పాత్రికేయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా పోలీసులు తనిఖీలు చేయడాన్ని నిరసిస్తూ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినదించారు. అనంతరం సీఐ పీవీజీ తిలక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని, పత్రికా రంగాన్ని అవమానించడమేనని అన్నారు. ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు. వాస్తవాలను ప్రచురిస్తున్న పత్రికలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో సాక్షి నిడదవోలు ఆర్సీ ఇన్చార్జి గాడి శేఖర్బాబు, సాక్షి విలేకర్లు ఎం.సత్యనారాయణ, ఎం.రవితేజ, సయ్యద్ ఇబ్రహీం, జర్నలిస్టులు కాట్రు వసంతరాజు, గూడూరి రమణ, మహమ్మద్ జావీద్, గురునాథరెడ్డి, టి.రాము, కె.మణికంఠ, షేక్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
విమానాశ్రయంలో మాక్డ్రిల్
కోరుకొండ: యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఏవిధంగా స్పందించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఏఎస్పీ చెంచిరెడ్డి ఆధ్వర్యాన గురువారం సాయంత్రం మాక్డ్రిల్ నిర్వహించారు. బాంబు పేలుళ్లు జరిగినప్పుడు విమాన ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. బాంబింగ్ సమయంలో ప్రయాణికులు పరుగులు తీయకుండా నేలకు వాలి ఉండటం సురక్షితమని చెప్పారు. కార్యక్రమంలో విమానాశ్రయం ఇన్చార్జి డైరెక్టర్ శ్రీకాంత్, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రసాదరావు, అగ్నిమాపక అధికారి గుప్తా, కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్సై కూన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మాక్డ్రిల్తో ప్రజలకు అవగాహన ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఏవిధంగా స్పందించాలనే అంశంపై మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్ కం రైల్వే వంతెన వద్ద మాక్ డ్రిల్ ద్వారా గురువారం అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ మాట్లాడుతూ, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. యుద్ధ పరిస్థితులు వస్తే సైరన్ అలార్మింగ్ మోగుతుందని, దానిని అనుసరించి ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, ఇతరులను రక్షించడం, గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందజేయడం, తరలింపు ప్రక్రియల్లో భాగస్వాములు కావాలని కోరారు. యుద్ధ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, స్వీయ రక్షణ చర్యలపై డీఆర్వో టి.సీతారామమూర్తి, ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్, డీఎస్పీ భవ్యకిషోర్, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూధర్ కింగ్ తదితరులు వివరించారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
పదవి కోసం ఫైట్..!
‘ఉనికి’పాట్లు రాజానగరం టీడీపీలో ఉనికిపాట్లు మొదలయ్యాయి. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కేవలం జనసేన నేతలకే ప్రాధాన్యం ఇస్తూ, టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్చార్జి పదవికి ప్రాధాన్యం పెరిగింది. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గతంలో రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా పని చేశారు. అప్పట్లో సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ఇన్చార్జి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో బొడ్డు వెంకట రమణ చౌదరికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచీ ఆయనే కొనసాగుతున్నారు. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్టును చౌదరి ఆశించగా.. పొత్తులో భాగంగా అది కాస్తా జనసేన ఖాతాలోకి పోయింది. దీంతో భంగపడిన చౌదరి.. చివరకు పార్టీ ఆదేశాలకు కట్టుబడి జనసేన విజయానికి కృషి చేశారు. సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చారి పదవి కోసం ఫైట్ మొదలైందా.. దీనిపై ఇరు వర్గాల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయా.. నియోజకవర్గ పగ్గాల కోసం ఇరు వర్గాలూ నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నాయా.. ఇప్పటికే ఉన్న ఇన్చార్జిని తప్పించి, ఆ పదవిని దక్కించుకునేందుకు మరో నేత సీఎం స్థాయిలో పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. రాజానగరం నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్య పోరు సాగుతోంది. పార్టీ ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి, సీఎం పర్యటన వ్యవహారాల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గాల మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ తనయుడు అభిరామ్ కొద్ది రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో మంతనాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికే ఇన్చార్జిగా ఉన్న బొడ్డు వెంకట రమణ చౌదరికి రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీంతో, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పదవిని పెందుర్తి వెంకటేష్కు ఇచ్చే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. తనయుడి రంగ ప్రవేశంతో.. ఈ పరిస్థితుల్లో పెందుర్తి వెంకటేష్ను సీఎం పర్యటన వ్యవహారాల ఇన్చార్జిగా నియమించడంతో ఆయన తనయుడు అభిరామ్ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తున్నారు. తండ్రితో పరిచయం ఉన్న నేతలతో మంతనాలు చేస్తున్నారని సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. తనకు మంత్రి లోకేష్ అండదండలున్నాయని, ఈ పదవి తనకే దక్కుతుందనే ధీమాలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. లోకేష్ నుంచి సైతం ఇప్పటికే సుముఖత వ్యక్తమైనట్లు సమాచారం. మరోవైపు పెందుర్తి వెంకటేష్ సైతం నియోజకవర్గ ఇన్చార్జి పదవి కోసం సీఎం చంద్రబాబు స్థాయిలో పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ పరిణామం చౌదరి వర్గంలో ఆగ్రహావేశాలు నింపుతోంది. కష్ట కాలంలో పార్టీకి సేవ చేసిన చౌదరిని నియోజకవర్గ పదవికి దూరం చేయడమేమిటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను సైతం త్యాగం చేసిన నేతను విస్మరించాలని చూడటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో, టీడీపీ శ్రేణులు ఇరు వర్గాలుగా విడిపోయి, తరచూ వివాదాలకు దిగుతున్నారు. ● ఇటీవల సీతానగరం మండలం రఘుదేవపురంలోని పేకాట స్థావరంపై ఓ వర్గం దాడులు చేయించి, కేసు నమోదు చేయడానికి ప్రయత్ని ంచారని మరో వర్గం ఆరోపించింది. ● కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలపై దాడి చేసి, పలువురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్లు సమాచారం. టీడీపీలోని ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఇది జరిగిందని ఆ పార్టీ శ్రేణులే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య తలెత్తుతున్న విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారు. రాజానగరం టీడీపీలో ముసలం! నియోజకవర్గ ఇన్చార్జి పదవి కోసం పట్టు ఇరు వర్గాలుగా విడిపోయిన చౌదరి, పెందుర్తి వర్గాలు చంద్రబాబు వద్ద చక్రం తిప్పుతున్న వెంకటేష్ తనయుడు -
కార్పొరేట్ లాభాల కోసమే లేబర్ కోడ్లు
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు కాకినాడ సిటీ: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం యూటీఎఫ్ హోంలో జరిగిన జిల్లా కార్మిక సంఘాల జిల్లా సదస్సులో వారు మాట్లాడారు. మోదీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. స్వతంత్రానికి ముందుగానీ, తర్వాత గానీ వచ్చిన కార్మిక చట్టాలు ఒకరి దయతో వచ్చినవి కాదని, వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్నవని గుర్తు చేశారు. మూడు నల్ల చట్టాలతో రైతులను, నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కరోనా సంక్షాభాన్ని, ఉగ్రవాద సంక్షోభ పరిస్థితులను మోదీ మతోన్మాద ఎజెండాను అమలు పరిచేందుకు, కార్పొరేట్ శక్తులను సంతృప్తి పరిచేందుకు వాడుకుంటోందని విమర్శించారు. సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ పాల్గొంటున్నాయని, ప్రభుత్వ పథకాలలో పని చేసే ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు కూడా సమ్మెను బలపరచాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రాజు, ఏఐసీసీటీయూ రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాల నాయకులు చెక్కల రాజ్కుమార్, కాళ్ల నాగేశ్వరరావు, షేక్ పద్మ, మలకా రమణ, నక్కెళ్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ల పద్మ, వేణి, వెంకటలక్ష్మి, గుబ్బల ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ప్రతిష్టాత్మకంగా సాహితీ సంబరాల ఈవెంట్
సఖినేటిపల్లి: శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీలలో ఏలూరులో రెండు వేల మంది కవులు, కళాకారులతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు ఏర్పాటు చేసినట్టు వేదిక సీఈఓ కత్తిమండ ప్రతాప్ అన్నారు. గురువారం సఖినేటిపల్లిలో ఈ మేరకు ఆయన ఈవెంట్లో ప్రదర్శించే వివిధ కళల ప్రదర్శనల బ్రోచర్ విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సాహితీ సంబరాలలో ఏ విధమైన ఫీజులు లేకుండా పాల్గొనే కవులు, కళాకారులు అందరినీ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో సత్కరించనున్నట్టు వెల్లడించారు. కాగా సాహితీ చరిత్రలో అతి పెద్ద కార్యక్రమంగా రూపొందించిన ఈ ఈవెంట్ను కన్వీనర్లు కొల్లి రమావతి, డాక్టర్ పార్థసారధి, జి.ఈశ్వరీ భూషణం పర్యవేక్షిస్తారన్నారు. ఈవెంట్లో తెలుగు కవితోత్సవం, తెలుగు సాహిత్య సదస్సు, పుస్తకావిష్కరణలు, రంగస్థల ప్రదర్శనలు, జానపద కళలు, కూచిపూడి, భరతనాట్యం వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు ప్రతాప్ పేర్కొన్నారు. -
ట్రాక్టర్ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
రాయవరం: చెడు వ్యసనాలకు బానిసై..ఈజీ మనీ కోసం ఒక వ్యక్తి రహదారి పక్కన పుల్లల లోడుతో ఆపి ఉన్న ట్రాక్టర్ విత్ ట్రైలర్ను అపహరించుకు పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రాయవరం పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు. మండలంలోని పసలపూడిలోని గోదావరి రైసు మిల్లు సమీపంలో అదే గ్రామానికి చెందిన పిల్లి జానకిరామయ్య గత నెల 10న పుల్లల లోడుతో ఉన్న ట్రైలర్తో కూడిన ట్రాక్టర్ను నిలిపి ఉంచాడు. ఉదయం చూసుకునే సరికి ట్రైలర్తో కూడిన ట్రాక్టర్ అక్కడ లేకపోవడంతో దొంగతనానికి గురైనట్లుగా భావించిన జానకిరామయ్య రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై సురేష్బాబు దర్యాప్తు చేపట్టారు. వెదురుపాక గీతామందిరం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, కొంకుదురు వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. చెడు వ్యసనాలకు బానిసై, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లుగా నిందితుడు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్బాబు, హెచ్సీ సత్యకుమార్, పీసీలు వీరేంద్రను ఎస్పీ కృష్ణారావు అభినందించారు. -
కావాలనే కడ తేర్చారా?
పిఠాపురం: పాపం పుణ్యం తెలియని పసికందును తమకు అడ్డు వస్తుందనే, కావాలనే కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పసికందు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఒక పథకం ప్రకారం కొందరు వ్యక్తులు పసికందును హత్య చేసి దానిని తప్పుదోవ పట్టించడానికి క్షుద్ర పూజల నాటకం ఆడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ దిశలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హత్య కేసు చిక్కుముడి విడదీసిన పోలీసులు హత్య ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ఎలా చేశారు? అనే విషయాలపై దృష్టి సారించి వాటికి సంబంధించిన క్లూ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారనే బలమైన ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకరితో బంధాన్ని తెంచుకోడానికి మరొకరితో బంధాన్ని కలుపుకోడానికి పేగు బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంచేసినట్లు పోలీసుల దర్యాప్తు తేటతెల్లమైనట్టు తెలుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు చెబుతున్నారు. గుట్టువిప్పిన పసుపు కుంకుమ పసికందును హత్య చేసిన ఇంట్లో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ప్రస్తుత సమాజంలో ఎక్కడా లేని క్షుద్రపూజలు పిఠాపురం పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉండే జగ్గయ్య చెరువులో కలకలం సృష్టించాయి. దీనిపై దృష్టి సారించిన పోలీసులు అసలు క్షుద్ర పూజలు జరిగాయా అన్న విషయంపై ఆరా తీయగా తీగ లాగితే డొంక కదిలినట్లు తెలిసింది. క్షుద్ర పూజలు చేసినట్లుగా ఏర్పాటు చేసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలను పరిశీలించిన పోలీసులు వాటి శాంపిల్ సేకరించి సంఘటన జరిగిన ఇంట్లో ఉన్న పసుపు, కుంకుమతో పోల్చి చూడగా రెండు ఒకటేనని తేలినట్లు సమాచారం. క్షుద్రపూజలు జరిగినట్టు జనాన్ని, పోలీసులను నమ్మించాలని నిందితులు ఏర్పాటు చేసిన పసుపు, కుంకుమ హత్య కేసు చిక్కుముడిని విప్పినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులే ఇవి ఏర్పాటు చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వినికిడి. సాంకేతికత ఆధారంగా వాటిని ల్యాబ్కు పంపి నిర్ధారించే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. అవి క్షుద్ర పూజలు కాదు పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో బాలిక హత్య జరిగిన ఇంట్లో క్షుద్ర పూజలు, చేతబడులు జరగలేదని అది కేవలం ఒక నాటకమని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బుధవారం పోలీసు స్టేషన్కు వచ్చి తన మనుమరాలు అయిన ఐదు నెలల పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పట్టణ ఎస్సై మణికుమార్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారన్నారు. గాలింపులో ఒక నూతిలో ఐదు నెలల పాప పడి చనిపోయి ఉండడాన్ని గమనించి బయటకు తీశారన్నారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో వెంటనే కేసు నమోదు చేసి, నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసును తప్పుదోవ పట్టించడానికి క్షుద్రపూజల నాటక మాడినట్లు సాంకేతికత ఆధారంగా గుర్తించామన్నారు. త్వరలోనే పసికందును హతమార్చిన వారిని పట్టుకుంటామని ఆయన తెలిపారు. పిఠాపురం ప్రాంతంలో ఎప్పుడూ క్షుద్ర పూజలు, చేతబడులు వంటివి లేవని, ఇవి కేవలం కల్పితమే కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. హత్య కేసును తప్పుదారి పట్టించడానికే క్షుద్రపూజల నాటకం పసికందు హత్య కేసులో ముమ్మర దర్యాప్తు -
ప్రథమ చికిత్సతో ప్రాణ రక్షణ
అగ్ని ప్రమాదాల బారిన పడితే.. గ్రామాల్లో ముఖ్యంగా పశువులు పాకలు అగ్ని ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఆ సమయంలో పశువుల పాకల్లో ఉన్న గేదెలు, ఆవులు ప్రమాదంలో చిక్కుకుని కాలిపోతాయి. పశువుల కొట్టాం అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ముందుగా పలుపుతాళ్లు కోసి పశువులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కాలిన గాయాలపై తరచు చన్నీళ్లు పోయాలి. వీలైతే పశువును చెరువులోనికి దింపి శరీరం పూర్తిగా తడిసేలా చేయాలి. పశువులను అరటి ఆకులపై పడుకొనేలా చూడాలి. పశువులకు అయిన గాయాలపై వరిపిండిలో ఏక్రిఫ్లేవిన్ పౌడర్ను వరిపిండి, కొబ్బరినూనె కలిపి పూయాలి. నడవలేని స్థితిలో ఉంటే పశువెద్యుడిని ఘటనా స్థలికి తీసుకుని వచ్చి వైద్యం చేయించాలి. రాయవరం: గ్రామీణ ప్రాంతాల్లోని పశువులు తోటలు, పొలాల్లోకి మేతకు వెళ్తుంటాయి. చెట్టుచేమల్లో గడ్డిని మేసే సమయంలో ఒక్కొక్కసారి విష పురుగులు, విద్యుత్ ప్రమాదాల బారిన పడుతుంటాయి. పశువులు ప్రమాదాల్లో చిక్కుకున్న సమయంలో పాడిరైతులు ఆందోళన చెందకుండా వెంటనే ప్రథమ చికిత్స అందిస్తే పశువులను ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చునంటున్నారు రాయవరం మండల పశువైద్యాధికారి ఎ.నాగశ్రావణి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. పాముకాటుకు గురైతే.. పశువులు పాముకాటుకు గురైతే విషం రక్తనాళాల ద్వారా శరీరమంతా వ్యాపించి రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి పశువులు వెంటనే మరణించే అవకాశం ఉంది. పాముకాటు వేసినచోట ఎర్రగా మారి వాపు వస్తుంది. రెండు గాట్లు వెంబడి రక్తం వస్తుంది. పశువులు కింద పడిపోవడం, నోటి నుంచి చొంగ రావడం, కళ్లు తేలేయడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. చికిత్స ఇలా.. అటువంటి సమయంలో పాముకాటు గుర్తించిన చోట రక్తం బయటకు వచ్చేలా గట్టిగా నొక్కాలి. అందుబాటులో టించర్ అయోడిన్ ఉంటే పాముకాటు వేసిన చోట పూయాలి. విషం పశువు శరీరంలోనికి ప్రవేశించకుండా పై భాగంలో తాడు/గుడ్డతో గట్టిగా కట్టాలి. ఆ తర్వాత పశువైద్యుడిని సంప్రదించి యాంటివీనమ్ టీకా వేయించాలి. పశువులను బాగా గాలి సోకే ప్రదేశంలో ఉంచాలి. శ్వాస బాగా ఆడేలా చూసుకోవాలి. విద్యుదాఘాతానికి గురైతే.. పశువులు విద్యుదాఘాతానికి గురైతే కొన్నిసార్లు వెంటనే మరణిస్తాయి. ఓల్టేజీ తక్కువగా ఉండి షాక్కు గురైతే శరీరంపై కాలిన మచ్చలు వస్తాయి. విద్యుదాఘాతానికి గురైన సమయంలో గిలగిలా కొట్టుకుని స్పృహ కోల్పోతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా గురవుతాయి. ముట్టుకుంటే అతిగా స్పందిస్తాయి. ఇలాంటి సమయంలో పశువులను నేరుగా తాకరాదు. విద్యుత్ నిలిపివేసిన తర్వాతనే పశువును ముట్టుకోవాలి. ప్రాణం ఉందని గుర్తించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. విషాహారం తింటే.. పంటను ఆశించే చీడపీడల నివారణకు రైతులు విషపూరితమైన రసాయనిక ఎరువులను పిచికారీ చేస్తారు. అనుకోకుండా పశువులు వాటిని తినడం వలన శరీరంలోనికి విషం ప్రవేశిస్తుంది. దీనివల్ల కళ్లు తేలేయడం, నోటి వెంట చొంగ కారడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇలాంటి సమయంలో పశువుకు కలప బొగ్గుపొడి కలిపిన నీటిని తాగించాలి. అది విష పదార్థాలను కొంత వరకు పీల్చుకుని పశువుకు హాని కలగకుండా చేస్తుంది. అలాగే వంట నూనె అరలీటరు, పది కోడిగుడ్ల తెల్లసొనను పశువులకు తాగించాలి. అనంతరం మెరుగైన వైద్యం కోసం పశువైద్యుడిని సంప్రదించాలి. పశువులు ప్రమాదంలో చిక్కుకుంటే ఆందోళన చెందవద్దు ప్రథమ చికిత్స అందించి వైద్యులను సంప్రదించాలి -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
అల్లవరం: అమలాపురం మండలం కామనగరువు గ్రామానికి చెందిన కామన భార్గవ్ (24) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి వైనతేయ నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామనగరువు గ్రామానికి చెందిన భార్గవ్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మోటార్ సైకిల్ని బోడసకుర్రు బ్రిడ్జిపై పార్కు చేసి నదిలోకి దూకేశాడని తెలిపారు. భార్గవ్ నదిలోకి దూకడంతో తన తమ్ముడిని రక్షించేందుకు అన్న రాజేష్ కుడా నదిలోకి దూకాడు. అయితే రాజేష్కు భార్గవ్ దక్కకపోవడంతో తన ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి, చాలా లోతుగా ఉండడంతో రాజేష్ ప్రాణాపాయ స్థితిలోకి చేరాడు. ఇంతలో బ్రిడ్జిపై నుంచి లారీ డ్రైవర్ పగ్గాన్ని రాజేష్కు అందించడంతో తాడుని పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇంతలో స్థానికంగా ఉన్న మత్స్యకారులు పడవలో వెళ్లి రాజేష్ని కాపాడి ఒడ్డుకి చేర్చారని పోలీసులు తెలిపారు. అయితే నదిలోకి దూకిన భార్గవ్ నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. అయితే సాయంత్రానికి భార్గవ్ మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకి చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చూసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుమలరావు తెలిపారు. భార్గవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తమ్ముడిని కాపాడేందుకు నదిలోకి దూకిన అన్నయ్య నీటి ప్రవాహంలో చిక్కుకున్న మృతుడి అన్నను కాపాడిన స్థానికులు