ధాన్యం కొనాలంటూ రైతుల ఆందోళన | Farmers Dharna in East Godavari district | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనాలంటూ రైతుల ఆందోళన

May 13 2025 6:08 AM | Updated on May 13 2025 6:08 AM

Farmers Dharna in East Godavari district

కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి వద్ద ధాన్యం లోడు ట్రాక్టర్లు నిలిపి ఆందోళన చేస్తున్న రైతులు

కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి వద్ద హైవేపై ధాన్యం ట్రాక్టర్లు నిలిపివేసిన రైతులు

తాళ్లపూడి (కొవ్వూరు): ‘ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనడంలేదు. మిల్లర్ల వద్దకు తీసుకువెళితే టార్గెట్‌ పూర్తయిందని చెప్పి తీసుకోవడం లేదు. మరి మేం పండించిన ధాన్యాన్ని ఏం చేయాలి..’ అంటూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ రైతులు ప్రశి్నస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ కొవ్వూరు సమీపంలోని గామన్‌ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ధాన్యం లోడు ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేశారు. కొవ్వూరు, తాళ్లపూడి మండ­లాల రైతులు మండుటెండలో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని, తమ వద్ద ఉన్న రబీ ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నినాదా­లు చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ వద్ద ధాన్యం కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందా.. అని మండిపడ్డారు. నియో­­జకవర్గంలో ఇంకా 5వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళనకు దిగా­మని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ తోట సు«దీర్, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్నరాముడు, కొవ్వూరు ఆర్‌డీవో రాణి సుస్మిత, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ టి.రాధిక వచ్చి 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వ­డంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

Advertisement
 
Advertisement
Advertisement