ఐసెట్‌లో 96.90 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

ఐసెట్‌లో 96.90 శాతం ఉత్తీర్ణత

May 22 2025 12:18 AM | Updated on May 22 2025 12:18 AM

ఐసెట్‌లో  96.90 శాతం ఉత్తీర్ణత

ఐసెట్‌లో 96.90 శాతం ఉత్తీర్ణత

రాయవరం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చి, 96.90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల ఏడో తేదీన ఆంధ్రా యూనివర్సిటీ ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 743 మంది విద్యార్థులు హాజరు కాగా, 720 మంది పాసయ్యారు. వారిలో 240 మంది బాలురు, 480 మంది బాలికలు ఉన్నారు.

ప్రశాంతంగా టెన్త్‌, ఇంటర్‌

సప్లిమెంటరీ, ఓపెన్‌ పరీక్షలు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ సప్లిమెంటరీ పరీక్షకు 486 మంది విద్యార్థులు హాజరయ్యారు. 18 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 904 మంది హాజరుకావాల్సి వుంది. ఓపెన్‌ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ తెలుగు పరీక్షకు 235 మందికి 110 మంది హాజరయ్యారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రసాయన శాస్త్రం పరీక్షకు 384 మందికి 253 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

21 వరకు

యోగా మాసోత్సవాలు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మన ధరిత్రి మన ఆరోగ్యం అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, కలెక్టర్‌ పి.ప్రశాంతి కోరారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్‌ వద్ద బుధవారం నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌, సంయుక్త కలెక్టర్‌ చిన్న రాముడు, నగరపాలక సంస్థ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. జూన్‌ 21వ తేదీ వరకు యోగా మాసంగా పాటిస్తామన్నారు.

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.55 కోట్లు

అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 26 రోజులకు గాను రూ.1,55,04,639 ఆదాయం వచ్చింది. హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. ఈ కానుకల్లో నగదు రూ.1,46,96,779, చిల్లర నాణేలు రూ.8,07,860 వచ్చాయని చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. బంగారం 48 గ్రాములు, వెండి 730 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. రోజుకి సరాసరి రూ. 5,96,332 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. అమెరికా డాలర్లు 184, కెనడా డాలర్లు 15, సింగపూర్‌ డాలర్లు రెండు, ఇంగ్లాండ్‌ పౌండ్లు ఐదు, స్కాట్‌లాండ్‌ పౌండ్లు పది, కువైట్‌ దీనార్లు 20, యూఏఈ దీరామ్స్‌ 25, ఖతార్‌ రియాల్స్‌ పది, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహరెన్‌ దీనార్‌ ఒకటి లభించాయి. వేసవి సెలవులు, వివాహాలు, ఈ నెల ఏడో తేదీ నుంచి 13 వ తేదీ వరకు సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు కారణంగా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వీరంతా కానుకలు వేయడంతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. దేవస్థానం డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రామ్మోహన్‌రావు లెక్కింపులో పాల్గొన్నారు.

పార్టీ తప్పిదం వల్లనే

కార్యకర్తల్లో అసహనం

– టీడీపీ కాకినాడ రూరల్‌

మినీ మహానాడులో జ్యోతుల నవీన్‌

కాకినాడ రూరల్‌: తెలుగుదేశం పార్టీ తప్పిదం వల్ల కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల ముందు నుంచి ఇన్‌చార్జిని ప్రకటించాలని కార్యకర్తలు మొర పెట్టుకుంటున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్‌ వద్ద స్పందన ఫంక్షన్‌ హాలులో బుధవారం కాకినాడ రూరల్‌ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడును నిర్వహించారు. పరిశీలకుడిగా శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడుపూరి సత్తిబాబు హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ కాకినాడ రూరల్‌లో జనసేన ఎమ్మెల్యేను నెగ్గించుకున్నామని, ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement