
ఇదేం ప్రజాస్వామ్యం!
● పత్రికా స్వేచ్ఛపై దాడులు
● ప్రశ్నించే గొంతును నొక్కాలని
చూడటం దారుణం
● ప్రజాసంఘాలు, మేధావుల మండిపాటు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతోందని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తుతున్నారు. పత్రికల్లో వస్తున్న వ్యతిరేక కథనాలు వచ్చాయని భావిస్తే ఖండన ఇవ్వాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులూ లేకుండా విజయవాడలోని సాక్షి సంపాదకులు ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా సోదాలు చేయడాన్ని ఖండించారు. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వాలూ ఇటువంటి దాడులు చేయించిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విలేకరులపై, కార్యాలయాలపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఇవన్నీ చూస్తూంటే బ్రిటిష్ పాలన గుర్తుకొస్తోందని అన్నారు. తీరు మార్చుకుంటే కూటమి ప్రభుత్వానికి జర్నలిస్టులు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
భారత రాజ్యాంగంలో పత్రికల పాత్ర కీలకం. రాజ్యాంగానికిది నాలుగో స్తంభం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పత్రికలపై దాడి చేయడం హేయమైన చర్య. రాష్ట్రంలో ప్రశ్నించే వాడే ఉండకూడదకుంటే ఎలా? భయపెట్టి ఎంతకాలం రాజకీయం, పరిపాలన చేయగలరు? ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేయడం కొన్ని రోజులుగా పరిపాటిగా మారుతోంది. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి మంచిది కాదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లోకి ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా చొరబడి, దురుసుగా ప్రవర్తించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు.
– తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి
పత్రికా స్వేచ్ఛను హరించే
హక్కు ఎవ్వరికీ లేదు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపడం మీడియా బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తిస్తున్న మీడియా మీద, జర్నలిస్టులపై కేసులు బనాయించడం సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏ ఒక్కరికీ లేదనే విషయం గుర్తించాలి. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి విధానాలు మానుకోవాలి. ఏదైనా ఉంటే ఉంటే చట్టబద్ధంగా చూసుకోవాలి. ఎలాంటి నోటీసులూ లేకుండా బెదిరింపు చర్యలకు దిగడం సరైన విధానం కాదు.
– మండెల శ్రీరామ్మూర్తి,
రాష్ట్ర కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే
పాత్రికేయులపై కక్ష సాధింపు బాధాకరం
పాలకుల వేధింపులతో జర్నలిజాన్ని ఖూనీ చేస్తున్నారు. పాలకుల వైఖరి చూస్తూంటే సామాన్య ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం నిబంధనలకు వ్యతిరేకంగా జర్నలిస్టుల ఇళ్లలో కూడా పాలకులు సోదాలు చేయడం చట్ట వ్యతిరేక చర్య కాదా? ఇలాంటి చర్యలు భవిష్యత్తులో వ్యవస్థకు పెను ప్రమాదంగా మారుతాయి. ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు మకిలి పట్టించే విధంగా ఉన్నాయి. కక్షలు, కార్పణ్యాలకు రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలనను భ్రష్టు పట్టిస్తే ప్రజల్లో తిరుగుబాటు రావటం ఖాయం.
– మేడా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి,
జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం
అందరూ ఖండించాలి
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సమాచారం అందించేందుకు పత్రికలు కృషి చేస్తాయి. ప్రజల సమస్యలను, ప్రభుత్వ విధానాలను స్వేచ్ఛగా ప్రచురించే హక్కు పత్రికలకు ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. పత్రికా విలేకరులపై ఎడిటర్లపై పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరిపై ఉంది.
– డాక్టర్ గుబ్బల రాంబాబు, చైర్మన్, అంబేద్కర్ సేవా కేంద్రం(ఆస్క్), రాజమహేంద్రవరం

ఇదేం ప్రజాస్వామ్యం!

ఇదేం ప్రజాస్వామ్యం!

ఇదేం ప్రజాస్వామ్యం!

ఇదేం ప్రజాస్వామ్యం!