
వేగంగా ధాన్యం సేకరణ
పెరవలి: జిల్లాలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.రాధిక తెలిపారు. మండలంలో ధాన్యం రాశులు, వరి చేలను శుక్రవారం ఆమె పరిశీలించారు. రైతు సేవా కేంద్రాల్లో (ఆర్ఎస్కు) రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, తాజా లక్ష్యం ప్రకారం జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 2.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇప్పటి వరకూ రూ.5.50 కోట్లు చెల్లించామని, మరో రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఉండ్రాజవరం, పెరవలి, చాగల్లు మండలాల్లో వరి కోతలు ఇంకా పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ మండలాల్లో ధాన్యం సేకరణ జరుగుతోందని, పెరవలిలో మరో వెయ్యి టన్నులు సేకరించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. కొనుగోలు లక్ష్యం 3.50 లక్షల టన్నులు పోనూ, మిగిలిన 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు ఇప్పటికే దళారులకు అమ్ముకున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కానూరు ఆర్ఎస్కేలో ధాన్యం కొనుగోలు ఆన్లైన్కు టెక్నికల్ అసిస్టెంట్ల చేతులు తడపాల్సి వస్తోందని రైతులు చెప్పడంతో, దీనిపై వెంటనే పరిశీలించాలని ఏఎస్ఓను ఆదేశించారు. ఆర్ఎస్కేల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని రాధిక హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మేరీ కిరణ్, ఆర్ఐ పావని తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ టాపర్కు
కలెక్టర్ అభినందన
రాజమహేంద్రవరం సిటీ: క్రమశిక్షణతో చదువుకుంటే విజయం సాధ్యమని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. పదో తరగతి ఫలితాల్లో 600కు 599 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం పొందిన బొమ్మూరు భాష్యం స్కూల్ విద్యార్థిని కె.హర్షిత్ను శుక్రవారం తన కార్యాలయంలో ఆమె అభినందించారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఇదే పట్టుదలతో ఉన్నత చదువులు చదివి, ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, జోనల్ ఇన్చార్జి ఆంజనేయులు, హెచ్ఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

వేగంగా ధాన్యం సేకరణ