మనవరాలిని చూద్దామనుకొని మరలిరాని లోకాలకు.. | East Godavari Road Incident | Sakshi
Sakshi News home page

మనవరాలిని చూద్దామనుకొని మరలిరాని లోకాలకు..

May 27 2025 10:04 AM | Updated on May 27 2025 10:42 AM

East Godavari Road Incident

రోడ్డు ప్రమాదంలో రెండు వేర్వేరు  కుటుంబాలకు చెందిన నలుగురి మృతి 

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతితో మార్కొండపాడులో విషాదం 

కొవ్వూరులో బయలుదేరిన 30 నిమిషాల్లోనే ఘోర దుర్ఘటన

మనవరాలిని చూడడానికి బయలుదేరిన వారు... ఆమెను కలవకుండానే అనంత లోకాల కు చేరుకున్నారు. వీరిని తమ కారులో తీసుకువెళుతున్న వారు కూడా ప్రమాదంలో చిక్కుకోవడంతో మరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. 

రాజానగరం/చాగల్లు/తాళ్లపూడి(కొవ్వూరు)/కంబాలచెరువు(రాజమహేంద్రవరం):  రాజానగరం మండలం, దివాన్‌చెరువు శివారు గామన్‌ బ్రిడ్జి హైవేపై కొంతమూరు కేశవస్వామి ఆస్పత్రి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో కొవ్వూరు, చాగల్లు మండలాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. దారవరం గ్రామానికి చెందిన లకంసాని సురేష్‌ భార్య బిందు (34), కొవ్వూరుకు చెందిన ఉప్పులూరి ప్రసాద్‌ (60), భార్య శివ లీలావతి (56)తో పాటు లీలావతి తల్లి చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన ఇమ్మణి వీరవెంకట సత్యవతి(75) కలిసి సోమవారం ఉదయం కారులో కొవ్వూరు నుంచి కాకినాడ వెళుతుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లకంసాని సురేష్‌ తో పాటు భార్య బిందు కొవ్వూరులో నివాసం ఉంటున్నారు. పక్కపక్కనే నివాసం ఉంటున్న సురేష్‌ ప్రసాద్‌ కుటుంబ సభ్యులు బంధువులు కూడా. వీరంతా సురేష్‌ కారులో ఇంటి నుంచి బయలుదేరిన 30 నిమిషాల్లోనే మృత్యువాత పడటంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

మనవరాలు కన్నీరు మున్నీరు..
మార్కొండపాడుకు చెందిన ఇమ్మణి సత్యవతి 20 రోజులు క్రితం కుమార్తె శివ లీలావతి అస్వస్థతకు గురి కావడంతో చూడ్డానికి వెళ్లారు. ఉప్పులూరి ప్రసాద్‌ కొవ్వూరులోని యువరాజ్‌ కేబుల్‌ ఆఫీసు వీధిలో ఇంట్లో నివాసం ఉంటున్నారు. ట్రక్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రసాద్‌ హార్ట్‌ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. దీనికితోడు అతని భార్య శివ లీలావతి అనారోగ్యంతో బాధపడుతోంది. వీరి ఒక్కగానొక్క అమ్మాయి వివాహితైన భవాని సుమారు 15 ఏళ్ల కిందట విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. భవాని కుమార్తె పూజ (సిరి) కాకినాడలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మనవరాలి పూజను చూసేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ముది అమ్మమ్మ, తాత, అమ్మమ్మలు ఒక్కసారిగా మృతిచెందడంతో పూజ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 

ఏ నిమిషానికి ఏమీ జరుగునో.. 
మృత్యువు ఎప్పుడు, ఏ విధంగా కబళించుకుపోతుందో ఎవరికీ తెలీదు .. అంటే ఇదేనేమో? మండలంలోని దివాన్‌చెరువు గామన్‌ బ్రిడ్జి జాతీయ రహదారిపై కేశవస్వామి ఆస్పత్రికి సమీపంలో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో లారీ, కారు ఢీ కొన్న ప్రమాదాన్ని చూస్తే నిజమనిపిస్తుంది. నాలుగు లేన్లతో టు వే గా ఉన్న ఈ రహదారిపై ఒక వైపు కారు, రెండో వైపు లారీ ప్రయాణిస్తూ పై ప్రాంతంలో ఒకదానిని ఒకటి ఢీ కొనడం చూస్తుంటే .. భగవంతుని రాతను ఎవ్వరూ తప్పించలేరని ఈ ప్రమాదాన్ని చూసిన వారంతా అంటున్నారు. కేశవస్వామి ఆస్పత్రికి సమీపంలో ఉన్న జంక్షన్‌ వద్ద లారీని మలుపు తిప్పే క్రమంలో అటుగా వచ్చిన కారును ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. 

దీనితో అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం గురించి లారీ డ్రైవర్‌ రాజానగరం పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో నార్త్‌ జోన్‌ డీఎస్పీ వై. శ్రీకాంత్, సీఐ వీరయ్యగౌడ్, ఎస్సైలు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ని క్రమబదీ్ధకరించి, ప్రమాదానికి గురైన రెండు వాహనాలను క్రేన్ల సాయంతో పక్కకు తొలగించారు. ప్రమాదానికి గురైన వారి వివరాలను తెలుసుకోవడంతోపాటు ప్రమాదానికి గల కారణాల పై ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ వీరయ్యగౌడ్‌ తెలిపారు.  

ఈ ప్రమాదంలో గాయపడ్డ లకంసాని ప్రసాద్‌కు కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో వెటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే మృతుల కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. మృతిచెందిన లకంసాని బిందు, ఉప్పులూరి ప్రసాద్, అతని భార్య లీలావతి, ఇమ్మని వీరవెంకటసత్యవతి మృతదేహాలకు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.  

టైర్‌ పంక్చర్‌ కాలేదు 
లారీ టైర్‌ పంక్చర్‌ కావడంతోనే కారుని ఢీకొట్టిందని చెబుతున్న మాటలు పూర్తి అవాస్తమని జిల్లా రవాణాశాఖాధికారి ఆర్‌.సురేష్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడా లారీ టైరు పేలిన దాఖలాలు లేవన్నారు. ప్రమాద స్థలికి సమీపంలో రవాణాశాఖాధికారులు వాహన తనిఖీలు చేస్తున్నారన్నారు. దాన్ని చూసి సడన్‌గా డ్రైవర్‌ లారీని తిప్పాడా...లేక క్లీనర్‌ లారీ డ్రైవ్‌ చేస్తున్నాడా అనేది తెలియాల్సి వుందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 71 మీటర్ల మేర లారీ టైరు జారిపోయినట్లు గుర్తులు ఉన్నాయన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు.  

తెల్లారేసరికే మా కూతురు బతుకు తెల్లారిపోయింది 
దారవరానికి చెందిన లకంసాని సురేష్‌ కొవ్వూరులో అవంతి ఫీడ్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో భార్య బిందుతో కలిసి కొవ్వూరులో అద్దెకు నివాసం ఉంటున్నాడు. ఈ ప్రమాదంలో సురేష్‌ కు తీవ్ర గాయాలు కాగా రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రిలో అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. భార్య బిందు ఘటనా స్థలంలోనే మృతిచెందింది. చాగల్లుకు చెందిన బిందుకు, సురే‹Ùకు సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. మూడురోజుల క్రితం చాగల్లులో ఒక శుభాకార్యానికి హాజరై పుట్టింటికి వచ్చిందని, ఆదివారం రాత్రి ఫోన్‌ చేసి మాట్లాడిందని, సోమవారం అల్లుడు సురే‹Ùకు సెలవు కావడంతో బయటకు వెళ్లామని తనకు చెప్పిందని,  తెల్లారిసరికి అనంతలోకాలకు తన కూతురు వెళ్లిపోయిందని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి కొఠారు శ్రీను హృదయ విదారకంగా రోదిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement