
కోనసీమ జిల్లా: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గొదావరిలో గల్లంతైన ఎనిమిది మందిలో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. రాజేష్, మహేష్, క్రాంతి, పాల్ మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
నిన్న(సోమవారం) కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు.
కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. వారిలో ఏడు మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.
కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు. అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు.