అల్లవరం: డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఆపేది లేదని, కేసులకు వైఎస్సార్ సీపీ భయపడదని మాజీ ఎంపీ చింతా అనురాధ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ నియమకాల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై కేసులు పెట్టి, పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రశ్నించడం రాజ్యంగ హక్కు అని, ప్రజలకు ఉన్న హక్కులను కూటమి ప్రభుత్వం, పోలీసులు కాలరాస్తున్నారని ఆమె మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, లలలఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారిందన్నారు. డీఎస్సీ నియమకాల్లో జరిగిన అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలన్నారు. ఈ వివాదంపై సీబీఐ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతర్వేది దేవస్థానానికి రూ.21 లక్షల ఆదాయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.20,85,716 ఆదాయం వచ్చింది. ఎండోమెంట్స్ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో బుధవారం హుండీలను తెరచి ఆదాయాన్ని లెక్కించారు. జూలై 8 నుంచి ఆగస్టు 12 వరకు 36 రోజులకు గాను పై ఆదాయం లభించింది. వీటిలో ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ.20,34,992, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.12,698, అన్నదానం హుండీల ద్వారా రూ.38,026 ఆదాయం చేకూరినట్టు ఆలయ ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఎంపీటీసీ బైరా నాగరాజు, ఎండోమెంట్స్ ఈవో టి.నాగవిష్ణు, ఆలయ సిబ్బంది, అర్చకులు, స్వామివారి సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు.
ఆయుష్ వైద్య సేవలను బలోపేతం చేయాలి
అమలాపురం రూరల్: జిల్లాలో ఆయుష్ వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వైద్యశాలలు, డిస్పెన్సరీల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై బుధవారం కలెక్టరేట్లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయుష్ వైద్య విధానాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయుష్ వైద్యశాలకు ఎటువంటి సమస్యలపై రోగులు వస్తున్నారో, ఏ విధమైన వ్యాధులపై చికిత్స పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆయుష్ వైద్యశాలలు, డిస్పెన్సరీలలో అవసరమైన మందుల లభ్యత, సరఫరా, నిల్వలు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆయుష్ వైద్యశాఖ అధికారి శ్యాంసుందర్, ఏపీఎంఎస్ఐడీపీ ఏఈ ప్రవీణ్, ఎన్సీసీ కాంట్రాక్టర్ బ్రహ్మాజీ, హోమియోపతి వైద్యాధికారులు పాల్గొన్నారు.


