ఫ కుడుపూరు ప్రాథమిక పాఠశాల పనుల్లో విచిత్రం
ఫ ముందుగానే కూటమి నాయకుడి ఖాతాల్లో రూ.3 లక్షల జమ
ఫ గ్రామస్తులు ప్రశ్నించడంతో పనులకు శ్రీకారం
సాక్షి టాస్క్ఫోర్స్: సాధారణంగా కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను మొదలు పెట్టిన తర్వాత, వాటి నాణ్యతను పరిశీలించి ప్రభుత్వం ఆ కాంట్రాక్టు డబ్బులు అందజేస్తుంది. కానీ కూటమి ప్రభుత్వంలో పనులు మొదలు పెట్టకుండానే డబ్బులు జమ అయ్యియి. చివరకు గ్రామస్తులు ప్రశ్నించడంతో ఎట్టకేలకు పనులకు శ్రీకారం చుట్టారు. కె.గంగవరం మండల పరిధి కుడుపూరు ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనుల్లో వింత పోకడ చోటుచేసుకుంది. పనులు ప్రారంభించకుండానే అధికారులు గ్రామానికి చెందిన కూటమి నాయకుడు (కాంట్రాక్టర్) ఖాతాలోకి రూ.3 లక్షలు జమ చేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పనులు ముగించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. కానీ విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలల తర్వాత, గ్రామస్తులు ప్రశ్నించడంతో పనులు మొదలు పెట్టడం గమనార్హం.
నిబంధనలకు నీళ్లు
బ్రిక్స్ ప్రోగ్రామ్లో భాగంగా గత ఏడాది ఫేజ్–1 పనులు ప్రారంభమయ్యాయి. అప్పుడు కూడా సదరు కాంట్రాక్టర్ మంజూరైన నిధులకు తగ్గట్టుగా పనులు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయినా కానీ ఈ ఏడాది ఫేజ్–2 పనులు కూడా గ్రామానికి చెందిన కూటమి నాయకుడు(కాంట్రాక్టర్ ) దక్కించుకున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మే నెలలోనే నిధులు ఖాతానికి మళ్లింపు జరిగింది. అయితే అప్పుడు పనులు మాత్రం ప్రారంభించలేదు.
గ్రామస్తులు ప్రశ్నించడంతో..
నిధుల మళ్లింపు విషయంలో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో అధికారులను ప్రశ్నించారు. దీంతో గత వారం రోజుల క్రితం సదరు కాంట్రాక్టర్, అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకుని పనులు ప్రారంభించాలని కోరడంతో పనులు ప్రారంభమైయ్యాయి.


