అమలాపురం రూరల్: తమ హక్కుల సాధన కోసం జిల్లాలోని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) బుధవారం కలెక్టర్ వద్ద ధర్నా చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగింది. తొలుత అమలాపురం నల్ల వంతెన నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దారాపురెడ్డి వీరభద్రం మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా తమకు కనీస వేతనం పెరగలేదని, ప్రస్తుతం ఉన్న ఖర్చులకు, ఇస్తున్న జీతానికి అసలు ఏమాత్రం సంబంధం లేదన్నారు. తమకు పేస్కేల్ అమలు చేయాలని, నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో అమలాపురం మండలం వీఆర్ఏల సంఘ అధ్యక్షుడు మొగలికుదురు లక్ష్మణరావు, నాయకులు మోటూరి ప్రశాంత్ కుమార్, లుటుకుర్తి విజయ్ పాల్గొన్నారు.


