విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్టు జరిగింది. హోం గార్డ్ వెంకటరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి హోం గార్డ్ వెంకటరాజును తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చుతారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో అతడు సీసీ ఫుటేజ్ మాయం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ సహా డీవీఆర్ను సైతం ధ్వంసం చేశాడు వెంకటరాజు.
ఆంధ్రప్రదేశ్లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ కేసులో అతడిని విజయవాడలోని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించి, అక్కడ సీఐ నాగరాజు నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఆ తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు. సాయికృష్ణ మరణించిన అనంతరం, విషయం బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు రహస్యంగా పలు పనులు చేశారని ఆరోపణలు ఉన్నాయి.


