breaking news
Vizianagaram District Latest News
-
కరాటే చాంపియన్షిప్లో పతకాలు
విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన 19వ కెన్యూరియో కరాటే చాంపియన్షిప్–2025లో పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/పీజీ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో పి.హర్షవర్ధన్(2), సీహెచ్.రిషిత, పి.గురుసిద్దిక్, ఎన్.వేవన్ష్, ఎస్.శ్రీవత్సవ్, ఎస్.నవ్య, కె.ప్రేమేష్ ఉన్నారు. కాంస్య పతకాలు సాధించిన వారిలో కె.తనుశ్రీ, సీహెచ్.రిషిత, ఎన్.దేవాన్ష్, కె.ప్రేమేష్, వి.ఇందిరా ప్రియదర్శిని, మహమ్మద్ సమీర్, ఎం.హర్హవర్ధన్, కె.శివగణేష్, పి.గగన్సాయి, బి.లేవాన్ ఉన్నారు. రజత పతకం సాధించిన వారిలో కె.తనుశ్రీ, ఎం.యోగిత, పి.గురుసిద్ధిక్, ఎస్.శ్రీవత్సవ్, ఎస్.నవ్య, ఎన్.జనని, వి.ఇందిరా ప్రియదర్శిని, జి.వివేక్ వర్మ రెండు, మహమ్మద్ సమీర్, ఎం.హర్షవర్ధన్, కె.శివగణేష్, పి.కుష్వంత్కుమార్ (2), పి.గగన్ సాయి, బి.లేవాన్ ఉన్నారు. విజేతలను, కోచ్ కె.సంతోష్కుమార్, అసిస్టెంట్ కోచ్ శ్రీభార్గవ్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీసాయిదేవమణి అభినందించారు. -
పరిష్కారం ఆలస్యమైతే సహించేది లేదు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ● పీజీఆర్ఎస్లో 257 వినతుల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు విశేష స్పందన లభించింది. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 257 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని త్వరితగతిన బాధ్యతాయుతంగా పరిష్కరించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలస్యం ప్రదర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండార్స్ మెంట్ ఇవ్వాలని అలాగే మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. విభాగాల వారీగా వినతుల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా డీఆర్డీఏకు 82 అర్జీలు, రెవెన్యూశాఖకు 70, జిల్లా పంచాయతీ శాఖకు 28, జిల్లా వైద్యారోగ్యశాఖకు 16, మున్సిపల్ శాఖకు 7, గ్రామ సచివాలయ శాఖకు 6, విద్యాశాఖకు 5, విద్యుత్ శాఖకు 4, హౌసింగ్ శాఖకు 4, ఇతర శాఖలకు చెందినవి 35 వరకు ఉన్నాయి. పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ నంబర్కు వచ్చే కాల్స్కు సంబంధిత అధికారులు సరైన విధంగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్ల రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, సర్వేశాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ అధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ మాణిక్యంనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ పీజీఆర్ఎస్కు 27 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించి 27 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూతగాాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 3, నగదు వ్యవహారాలకు సంబంధించి 2, మోసాలకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 10 ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేయాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సూచించారు. స్వీకరించిన ఫిర్యాదులపై ఏడు రోజుల్లో వాటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి పాల్గొన్నారు. -
పక్కా ప్రణాళికతో హత్య
● భీముడు మృతిపై సమగ్ర విచారణ జరపాలి ● ఎస్పీకి మృతుడి భార్య వినతిపార్వతీపురం రూరల్: రికార్డుల్లో గుండెపోటు..శరీరంపై మాత్రం గాయాల అనవాళ్లు..వెరసి గొర్రె భీముడు(52) మృతి మిస్టరీగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి భార్య భారతి, ఆదివాసీ ఎరుకల సంఘాల నాయకులతో కలిసి సోమవారం ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం తాలాడకు చెందిన భీముడు గత ఏప్రిల్ 22న వంశధార నది ఒడ్డున విగతజీవిగా లభ్యమయ్యాడు. మృతదేహంపై కంటి భాగం, పక్కటెముకల వద్ద గాయాలున్నా..పోస్టుమార్టం నివేదికలో గుండెపోటుగా పేర్కొనడంపై బాధితులు మండిపడ్డారు. గ్రామంలో చెత్త బండి నడిపే విషయంలో స్థానికంగా కొందరితో విభేదాలున్నాయని, వారే కులం పేరుతో దూషించి, దాడి చేసి చంపేశారని భారతి ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై సాక్షులున్నా పోలీసులు పట్టించుకోలేదని, పైగా హడావుడిగా అంత్యక్రియలు చేయించారని వాపోయింది. హైకోర్టు ఆదేశించినా న్యాయం జరగలేదని, తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యుడిపై, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.శంకరరావు, యూటీఎఫ్ అధ్యక్షుడు కె.సంజయ్బాబు, ఏపీఏవైఎస్ఎస్ నేతలు జి.శ్రీనివాసరావు, ఎస్.ముసలయ్య, ఎం.పోతురాజు, గొర్ల సత్యం,చల్ల చిన్నారావు, గొర్ల సన్యాసిరావు, గొర్ల రమణమూర్తి, గేదెల ఆదినారాయణ, గేదెల సురేంద్ర, గొర్ల బుల్లోడు తదితరులు పాల్గొన్నారు. -
మిస్టర్ ఇండియా పోటీలకు కోన రమణ
శృంగవరపుకోట: మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీలకు ఎస్.కోటకు చెందిన బాడీ బిల్డర్ కోన రమణ ఎంపికయ్యాడు. ఈ నెల 21న తగరపువలసలో జరిగిన మిస్టర్ ఆంధ్రా ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మాస్టర్స్ విభాగంలో పాల్గొన్న కోన రమణ 5వ స్థానం సాధించాడు. నిర్వాహకులు రమణకు రూ.1000లు నగదు ప్రోత్సాహకంతో పాటు మెడల్, ప్రశంసాపత్రం అందజేశారు. జనవరిలో ఛత్తీస్గఢ్లో జరగనున్న మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు రమణ చెప్పాడు. డీజీపీ కమోడేషన్కు ఎంపికై న విజయనగరం పీసీవిజయనగరం క్రైమ్: ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ ఇవ్వనున్న డీజీపీ కమోడేషన్ డిస్క్ అవార్డులను సోమవారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో సిల్వర్ డిస్క్ విజయనగరం పోలీస్ శాఖ పరిధి రామభధ్రపురం పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ వై.అప్పలనాయుడును వరించింది. డీజీపీ సిల్వర్ డిస్క్లు నలుగురు ఐపీఎస్లతో పాటు మొత్తం 343 మందికి లభించాయి. కానిస్టేబుల్స్లో ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి ఇద్దరికి ఈడిస్క్ అవార్డులు లభించాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శారద ఉన్నారు. -
రాష్ట్రానికి ఆదర్శంగా మన్యం జిల్లా
పార్వతీపురం: పరిపాలనలో, ప్రజాసమస్యల పరిష్కారంలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, సబ్కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు గజమాలతో కలెక్టర్ను సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమం అద్భుత ఫలితాన్ని ఇచ్చిందన్నారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, క్రమశిక్షణ, సంస్కారాన్ని పెంపొందించేందుకు ఇది ఒక గొప్ప సంకల్పమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం మన జిల్లాకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో పార్వతీపురం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. రెవెన్యూ క్లినిక్ విధానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూడాలని సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, హౌసింగ్ పీడీ ధర్మచంద్రారెడ్డి తదితరులున్నారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి వస్తువులు కొనుగోలు, సేవల వినియోగం విషయంలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వినియోగదారుల హక్కులు, ప్రమాణాలకు సంబంధించిన వాల్పోస్టర్ను జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, డీఆర్డీఏ పీడీ సుధారాణి, హౌసింగ్ పీడీ ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాయనమ్మను హత్య చేసిన మనుమడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: ఈ నెల 13 జరిగిన జరిగిన హత్య కేసు మిస్టరీని భోగాపురం పోలీసులు ఛేదించారు. డబ్బులు ఇవ్వలేదని సొంత నాయనమ్మనే మనుమడు హత్య చేశాడని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విలేకరుల సమావేశంలో ఎస్పీ దామోదర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని భోగాపురం మండలం ముడసలపేట గ్రామం ఎయిర్ పోర్టు కాలనీకి చెందిన ముడసల అప్పయ్యమ్మ (70) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు చెవి దిద్దులు, జుమ్మలు, ముక్కు కమ్ములు, వెండి పట్టీలను దొంగిలించుకుని పోయారని మృతురాలి కోడలు ముడసల లక్ష్మి డిసెంబర్ 13న ఫిర్యాదు చేసింది.ఈ మేరకు భోగాపురం పోలీసులు కేసు నమెదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా, నేర స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై పి.పాపారావు, సీసీఎస్ ఎస్సై కె.లక్ష్మణరావు బృందాలుగా ఏర్పడి. విచారణ చేపట్టారు. నేర స్థలం పరిశీలనలో డాగ్స్క్వాడ్. నిందితుడు ముడసల గౌరి చుట్టూ తిరగడంతో అనుమానంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. బంగారం, వెండి రికవరీ నేరం జరిగిన కొద్ది రోజుల తర్వాత, పోలీసులకు అనుమానం లేదని నిందితుడు ముడసల గౌరిపై భావించి, దొంగిలించిన వస్తువులను అమ్మేయాలన్న ఉద్దేశంతో వాటిని తీసుకుని వెళ్తుండగా భోగాపురం పోలీసులు అరెస్టు చేసి, 18.250 గ్రాముల బంగారు వస్తువులను, 106 గ్రాముల వెండి పట్టీలను రికవరీ చేశారని ఎస్పీ దామోదర్ తెలిపారు. విచారణలో మృతురాలు తన కుమార్తె, చిన్న కుమారుడికి తన వద్ద ఉన్న డబ్బులు ఇస్తున్నట్లు, పెద్ద కుమారుడి కుటుంబానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంగా ఆమైపె కక్ష పెంచుకున్నాడన్నారు. ముందు రోజు రాత్రి పెద్ద కొడుకు కొడుకై న గౌరి మద్యం మత్తులో తన నాయనమ్మను బైక్ ఫైనాన్స్ కట్టేందుకు డబ్బులు అడిగాడని, ఇవ్వకపోవడంతో ఆమె ముఖంపై తలగడతో అదిమి హత్య చేసి, ఒంటిపైగల చెవి కమ్ములు, జుమ్మాలు, చెవి మద్య రింగులు, రోల్డ్ గోల్డ్ చైన్, వెండి పట్టీలను దొంగిలించాడన్నారు. మృతురాలు బహిర్భూమికి బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, మృతురాలి ఒంటిపై బంగారు వస్తువులు తీసుకుని పోయినట్లు మభ్యపెట్టేందుకు మృతదేహాన్ని ఇంటినుంచి బయటకు తీసుకు వెళ్లి, నూతికి సమీపంలో పడేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, లాభాపేక్షతో హత్య కేసు మిస్టరీని చేధించామన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన డీఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సీఐ కె.దుర్గా ప్రసాద్, ఎస్సైలు పి.పాపారావు, కె.లక్ష్మణరావు, ఏఎస్సై గౌరీ శంకర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రదానం చేశారు. -
వైద్యసేవలు వేగవంతం.. పారదర్శకతే లక్ష్యం
● విశాఖ జోనల్ సమీక్షలో హెల్త్ సెక్రటరీ సౌరబ్గౌర్ పార్వతీపురం రూరల్: వైద్యారోగ్య శాఖలో పారదర్శకతను పెంచి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల వీసీ సమావేశ భవనంలో నిర్వహించిన ఉత్తర కోస్తా జిల్లాల ఆరోగ్య సమీక్షా సమావేశానికి పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు తన వైద్యబృందంతో హాజరయ్యారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరు, ప్రగతి నివేదికలను కార్యదర్శికి వివరించారు. ఈ సందర్భంగా సౌరబ్ గౌర్ మాట్లాడుతూ.. కార్యాలయం వ్యవహారాలన్నీ ఇకపై ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాలని, ప్రతి నివేదికను డిజిటలైజేషన్ చేయడం ద్వారా పర్యవేక్షణ సులభతరమవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మాతృ మరణాల విషయంలో కచ్చితమైన జవాబుదారీ తనం ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులు, పోర్టల్లను పరిశీలిస్తూ వైద్య సేవలను పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి. జగన్మోహనరావు, డాక్టర్ రఘు కుమార్, డాక్టర్ ఎం. వినోద్ కుమార్, డాక్టర్ కౌశిక్, డీపీఓ లీలారాణి, ఏఓ మణిరత్నం తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇచ్చి అర్జీదారుల సంతప్తిని స్థాయిని పెంచాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజలు 185 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు చెప్పారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీలు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మైనింగ్ అనుమతులు నిలిపివేయాలి పాచిపెంట మండలం శ్యామల గౌరీపురం గ్రామం సమీపంలో గల కొండకు ఉన్న మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని కోరుతూ గ్రామంలోని ఎస్టీ గదబ కులానికి చెందిన ఎస్. మహేశ్వరరావు, ఎస్.కుమార్, ఎస్.వెంకట పాపారావు, ఎస్. శ్రీధర్తోపాటు గ్రామస్తులు వచ్చి కలెక్టర్ ప్రభాకరరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. శ్యామల గౌరీపురం సమీపంలో ఉన్న కొండచుట్టూ పోడు వ్యవసాయం రాగులు, జొన్నలు, కందులు, కొర్రలు, జీడిమొక్కలు తదితర పంటలను సాగు చేసి జీవనం సాగిస్తున్నామని, కొండ ప్రాంతాన్ని పశువులు, మేకలు మేత కోసం వినియోగిస్తున్నామని, అలాగే కొండపై ఉమామహేశ్వర గోకర్ణ స్వామి ఆలయం కూడా ఉందన్నారు. ఈ కొండకు, గుడికి రాకపోకలు చేసేందుకు ప్రభుత్వం గతంలో రహదారిని కూడా నిర్మించిందని గుర్తు చేశారు. ఈ కొండకు మైనింగ్ అనుమతుల కోసం 18.5.2025న జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మైనింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అయితే ఈ కొండ సమీపంలో ఉన్న మంచాడవలస, పణుకువలస, శ్యామల గౌరీపురం గ్రామాలకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సమావేశం నిర్వహించారని, కొండకు మైనింగ్ అనుమతులు ఇవ్వడం వల్ల ఈ గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాపోయారు. అధికారులు పునరాలోచన చేసి నవదుర్గ మైనింగ్కు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని వారు కోరారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్లో వెలుగు సీఎఫ్పై ఫిర్యాదు సీతంపేట: తాము తీసుకున్న ఉన్నతి రుణాలను తిరిగి చెల్లిస్తుంటే వెలుగు సీఎఫ్ జమచేయడం లేదని కొత్తూరు మండలంల కురిగాం గ్రామానికి చెందిన ఆదివాసీ స్వయం శక్తిసంఘం మహిళా సభ్యులు ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబుకు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారవేదికకు 27 అర్జీలను గిరిజనులు సమర్పించారు. గూనభద్రకు చెందిన చల్లా ఉమాదేవి, సుబ్బారావు తదితరులు పెండింగ్ హౌసింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. కొంకాడపుట్టి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని సవర శివకుమార్ వినతి ఇచ్చారు. పిల్లలు ఉన్నందున డబారుసింగి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని దేవి తదితరులు కోరారు. సోదగ్రామం మండల పరిషత్ పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించాలని పి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశాడు. శ్మశాసస్థలాన్ని ఆక్రమిస్తున్నారని కొండపల్లికి చెందిన ఎం.రాజారావు ఫిర్యాదు చేశాడు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆయన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబకలహాలు, సైబర్ నేరాలు, ఆస్తి వివాదాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు వంటి అంశాలపై మొత్తం 11 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత స్టేషన్ల అధికారులతో ఫోనన్లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం చేసి, ఆ నివేదికలను కార్యాలయానికి పంపాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తండ్రిని హతమార్చిన కుమారుడిపై కేసు నమోదు
పాచిపెంట: మండలంలోని తుమరవల్లి పంచాయతీ నేరళ్లవలసలో పోయిరి సోమయ్య(50) ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందగా ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నేరళ్లవలస గ్రామానికి చెందిన పొయిరి సోమయ్య తన పెద్ద కుమారుడు పోయిరి సింహాచలం ఇంటి వద్ద ఉండేవాడు, సోమయ్య మతిస్థిమితం కోల్పోయి తరచూ తన పెద్ద కుమారుడిని విసిగిస్తూ అసహనానికి గురి చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన కూడా అలా ప్రవర్తించడంతో అసహనానికి గురైన సింహాచలం తన తండ్రి సోమయ్య ఎడమ చెవి వద్ద కర్రతో బలంగా కొట్టాడు. దీంతో సోమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో సింహాచలం అంగీకరించడంతో కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఇద్దరు గిరిజనులకు గాయాలుభామిని: మండలంలోని బొడ్డగూడకు చెందిన ఆరిక రామయ్య, తులసి గ్రామానికి చెందిన మోహనరావు సోమవారం వేకువజా మున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని పర్లాకిమిడికి వారిద్దరూ బైక్పై వెళ్తుండగా మంచు తాకిడికి రోడ్డు కనిపించక పోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిద్దరికీ ముందుగా పర్లాకిమిడి ఆస్పత్రిలో వైద్యసేవలు అందించిన అనంతరం ఆరిక రామయ్యను శ్రీకాకుళం రిమ్స్కు, మోహనరావును సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి గాయాలువీరఘట్టం: మండలంలోని సీఎస్పీ రహదారిలో కడకెల్ల వద్ద సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టానికి చెందిన బంగారం వ్యాపారి, వైఎస్సార్సీపీ నాయకుడు వూణ్ణ శ్రీనివాస్ (కోణార్క్ శ్రీను), ఆర్టీసీ డ్రైవర్ శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ బుల్లెట్పై గరుగుబిల్లి మండల ఖడ్గవలస వెళ్లి తిరిగి వస్తుండగా కడకెల్ల వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.ఇటీవల కొత్తగా వేస్తున్న విద్యుత్ లైన్స్ కోసం కొన్ని విద్యుత్ స్తంభాలను కడకెల్ల వద్ద రోడ్డు పక్కనే డంపింగ్ చేశారు. అయితే ఖడ్గవలస నుంచి వస్తున్న వీరు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే డంపింగ్ చేసిన విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సంఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. క్షతగాత్రులను వైద్య చికిత్సల కోసం పార్వతీపురం తరలించారు. కారును ఢీకొట్టిన కంటైనర్● త్రుటిలో తప్పిన పెనుప్రమాదంగజపతినగరం: మండల కేంద్రంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న లక్ష్మిషాపింగ్ కాంప్లెక్స్ వద్ద జాతీయ రహదారిలో అదుపు తప్పి ఆదివారం రాత్రి పార్కింగ్లో ఉన్న ఓకారును కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖ పట్నంనుంచి రామభద్రపురం వెళ్తున్న కంటైనర్ మార్గమధ్యంలో అదుపు తప్పి గజపతినగరంలో లక్ష్మిషాపింగ్ కాంప్లెక్స్ లోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది. ఆదివారం మార్కెట్ సెలవు కావడంతో అక్క జనసంచారం లేదు. లేదంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. 108 డ్రైవర్ ఆత్మహత్యపార్వతీపురం రూరల్: పదుల సంఖ్యలో ప్రాణాలను కాపాడే 108 వాహనానికి సారథిగా ఉండి, తన కుటుంబాన్ని మాత్రం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించుకోలేక ఓ డ్రైవర్ తనువు చాలించాడు. అప్పుల బాధ తాళలేక మనస్తాపంతో గడ్డిమందు తాగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం పట్టణానికి చెందిన కంది గిరిప్రసాద్ (46) గడిచిన 18 ఏళ్లుగా 108 అంబులెనన్స్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న విధుల్లో ఉండగానే, మల విసర్జన సాకుతో బయటకు వెళ్లి కేంద్రాస్పత్రి సమీపంలో గడ్డిమందు తాగేశాడు. ఈ విషయం గమనించి తోటి సిబ్బంది వెంటనే మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
క్రిస్మస్ శోభ
సిమ్స్ ఫ్లాటినం బాప్టిస్ట్ చర్చి విద్యుత్ వెలుగులో సెయింట్పాల్ లూథరిన్ చర్చి క్రిస్మస్ను పురస్కరించుకుని విజయనగరం జిల్లా కేంద్రంలోని చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రార్థనా మందిరాలను ముస్తాబు చేస్తున్నారు. వివిధ అలంకరణల్లో క్రిస్మస్ట్రీలు, స్టార్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలో క్రిస్మస్ శోభ కళ్లకుకడుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
రాజ్యాంగ హక్కులను హరించడమే.. నైపుణ్యం సాధించండి ● విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి ● చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్, విజయనగరం కంటోన్మెంట్ పోలీస్ బ్యారెక్స్లో పోలీస్ శిక్షణ ప్రారంభం కురుపాం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీన పరచడం అనేది రాజ్యాంగబద్ధంగా గ్రామీణ కార్మికులకు కల్పించిన హక్కులను హరించడమేనని, ఇది ఆదివాసీ, ఆర్థికంగా అనగారిన ప్రజల జీవన గౌరవంపై నేరుగా దాడి చేయడమేనని మాజీ కేంద్ర మంత్రి, జాతీయ ఉపాధి హామి పథకం రూపకల్పన కమిటీ సభ్యుడు వైరిచర్ల కిశోర్చంద్ర సూర్యనారాయణదేవ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణతో పాటు నిరుపేదలకు ఆహార భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ చట్టం తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. తను గిరిజన వ్యవహారాల, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో గిరిజన ప్రాంతాల్లో సమ స్యలు అక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 150 రోజుల పనిదినాలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న చర్యలు సరైనవి కాదన్నారు. విజయనగరం క్రైమ్/డెంకాడ: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనదని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు. నూతనంగా ఎంపికై న కానిస్టేబుళ్లకు చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్, విజయనగరం కంటోన్మెంట్ పోలీస్ బ్యారెక్స్లో సోమవారం శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన తొలి పోలీస్ అధికారి కానిస్టేబుల్ అని అన్నారు. శిక్షణ కాలం ఎంతో విలువైనదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా శిక్షణలోని క్రమశిక్షణ దోహదపడుతుందన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే భావన బలంగా ఉండాలన్నారు. చట్టం పట్ల గౌరవం, విధి నిర్వహణలో నిజాయితీ, సమయపాలన వంటి లక్షణాలు పోలీస్ జీవితంలో అత్యంత అవసరమని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు భవిష్యత్లో ప్రజల శాంతి భధ్రతల పరిరక్షణకు ఉపయోగపడాలన్నారు. 9 నెలల పాటు శిక్షణ కొనసాగుతుందని, రెండు చోట్లకు శిక్షణకు వచ్చిన 395 మంది పోలీస్ అభ్యర్థులు సమర్థవంతంగా శిక్షణ పూర్తి చేయాలని కోరారు. ఏపీఎస్పీ, సీవిల్ విభాగాలు వేర్వేరుకాదని, అందరమూ ఏపీ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన వారమేనన్న విషయాన్ని మరువరాదని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. శిక్షణలో అవుట్ డో ర్, ఇండోర్ శిక్షణతో పాటు టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్, యోగా, ఆయుధాల వినియో గం, స్విమ్మింగ్, మ్యాప్ రీడింగ్లో పట్టుసాధించాలన్నారు. సైబర్ నేరగాళ్లను అరికట్టే సైబర్ వారియర్స్గా మారాలన్నారు. శిక్షణకు వచ్చినవారిలో 12 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, 28 మంది బీటెక్, ముగ్గురు ఎల్ఎల్బీ, ఇద్దరు జర్నలిజం, మిగిలిన వారు డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివినవారు ఉన్నారని డీపీటీసీ ప్రిన్సిపాల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత తెలిపారు. శిక్షణ వచ్చే ఏడాది సెప్టెంబర్ 21 కి పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్ రెడ్డి, ఒకటవ బెటాలియన్ కమాండెంట్ సీహెచ్వీఎస్ పద్మనాభరాజు, 16వ బెటాలియన్ కమాండెంట్ అరుణ్బోస్, డీపీటీసీ డీఎస్పీ పి.నారాయణరావు, డీఎస్పీలు ఎం.వీరకుమార్, ఆర్.గోవిందరావు, ఇ.కోటిరెడ్డి, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధి హామీ రూపకల్పన కమిటీ సభ్యుడు కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ -
● భక్తిశ్రద్ధలతో ధనుర్మాస ఉత్సవాలు
● బొబ్బిలిలో అనసూయ సందడి జామి మండలంలోని అన్నంరాజుపేట పంచాయతీ పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం ధనుర్మాస మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఘణిహారం సీతారామాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి, గోదాదేవికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ● వేంకటేశ్వర ఆలయంలో.. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోనూ ధనుర్మాస వేడుకలు వైభవంగా జరిగాయి. – జామి బొబ్బిలి పట్టణంలో సినీనటి అనసూయ సోమవారం సందడి చేశారు. ముందుగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. అనంతరం షాపంతా కలియతిరిగారు. సరమైన ధరలకే వస్త్రాలను విక్రయించడం ఎస్ఆర్ షాపింగ్మాల్ ప్రత్యేకమని, వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంక్రాంతి ఆఫర్లను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ కొన్ని చిత్రాల పాటలకు స్టెప్పులు వేసి సందడి చేశారు. అభిమానులతో కేరింతలు కొట్టించారు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. టీవీ అయినా సినిమా అయినా ఒకేలా ప్రేమిస్తానన్నారు. జర్నలిస్టుగా పనిచేస్తూ ఈ రంగంలోకి వచ్చానన్నారు. సంప్రదాయబద్ధంగా ఉండడమంటే ఇష్టమని, అందుకే సోషల్ మీడియాలో నచ్చిన వారిని విమర్శించినా, కామెంట్ చేసినా వెంటనే స్పందిస్తానన్నారు. కార్యక్రమంలో షాపింగ్మాల్ యజమానులు ప్రసాదరెడ్డి, కేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. – బొబ్బిలి -
మెరికల్లా తయారుకావాలి
విజయనగరం క్రైమ్: పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో మెరికల్లా తయారుకావాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మహిళా పోలీస్ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 478 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణను సోమవారం గంట కొట్టి సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర కీలకమన్నారు. శిక్షణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరాజుకు సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్పీలు పి.శ్రీకాంత్, ఎమ్.మహేష్, టి.రమేష్, మెడికల్ ఆఫీసర్ ఉదయ కుమార్, ఏఓ టి.భవాని, సీఐ మంగవేణి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం రూపొందించిన 100 రోజుల ప్రత్యేక బోధన ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరలో పీజీఆర్ఎస్పై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 297 పాఠశాలల నుంచి 16,240 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. వీరందరూ ఉత్తీర్ణులయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రత్యేకాధికారులు, మండల అధికారులు తమ లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వారానికి కనీసం నాలుగు సార్లు సచివాలయాలను సందర్శించాలని మండల ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. తనిఖీ వివరాలను గూగుల్ షీట్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో మురళి పాల్గొన్నారు. పీఎంఏజీవైను విజయవంతం చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గ్రామీణ ఆదర్శ యోజన (పీఎంఏజీవై) పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలుచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పథకం అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 500 జనాభా కలిగి అందులో కనీసం 40 శాతం షెడ్యూల్డ్ కులాల వారు నివసిస్తున్న మెరకముడిదాం, వంగర, తెర్లాం, ఆర్.ఆమదాలవలన మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతిపాదించామని చెప్పారు. ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల చొప్పున నిధులు అందుతాయని తెలిపారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ ఎం.అన్నపూర్ణమ్మ, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్పాణి, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పాల్గొన్నారు. -
11 నెలల్లో 77 కేసుల నమోదు
● కొద్ది రోజుల కిందట జామి మండలం భీమషింగి వద్ద ఆటోలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. బియ్యం ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ● ఈ ఏడాది జూన్ నెలలో బొండపల్లి మండలం కొండకిండాం, కిండాం ఆగ్రహారంలోని కోళ్ల ఫారం, మామిడి తోటల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సుమారు 480 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేసే నార సంచులతోనే నేరుగా తరలించేశారు. అక్కడి నిల్వలను చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రేషన్ డిపోల నుంచి నేరుగా తరలించి వ్యాపారులు సొమ్ముచేసుకంటున్నారు. దీనివెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు అందాల్సిన వేలాది టన్నుల బియ్యం తరలింపు నిత్యకృత్యంగా మారడం ఇప్పుడు అధికార వర్గాలను సైతం విస్మయపరుస్తోంది. కొందరు అధికారులకు ఈ వ్యవహారం తెలిసినా చూసీచూడనట్టు వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ● ఓ టీడీపీ నేత అండతోనే... జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత అండతోనే బియ్యం వ్యాపారులు యథేచ్ఛగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు సమాచారం. పీడీఎస్ బియ్యం తరలిస్తున్న సమయంలో ఎక్కడైనా అధికారులు పట్టు కునే ప్రయత్నిం చేసినప్పుడు సదరు నేత అధికారులకు ఫోన్ చేసి... ‘వాళ్లు మా వాళ్లే.. బియ్యంతో పాటు వదిలేయండి’ అని ఫోన్ చేస్తున్నారని తెలిసింది. నేత అండదండలతో బియ్యం మాఫియా బరితెగిస్తోంది. కొంతమంది రేషన్ డీలర్ల సహకారంతో నేరుగా రేషన్ షాపుల నుంచే పీడీఎస్ బియ్యాన్ని తరలించేస్తున్నారు. అయినప్పటకీ వారిపై ఎటువంటి చర్యలు ఉండడం లేదు. గ్రామాల్లో చిరువ్యాపారులు నుంచి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లాలో 11 నెలల్లో పీడీఎస్ బియ్యం తరలింపుపై–6ఏ కేసులు 77 నమోదుచేశారు. వారి నుంచి 729.91 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇంతకు 30 రెట్లు పీడీఎస్ బియ్యం తరలిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలకు ఆదేశం పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతినెలా సీఎస్డీటీలు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలు మరింతగా చేసేలా ఆదేశాలు ఇచ్చాం. – జి.మురళీనాథ్, జిల్లా పౌరసరఫరాల అఽధికారి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో పేదల బియ్యం పక్కదారి.. నామమాత్రంగా అధికారుల తనిఖీలు! రేషన్ దుకాణాల నుంచి నేరుగా తరలిపోతున్న బియ్యం సరిహద్దులు దాటించేస్తున్న బియ్యం వ్యాపారులు 11నెలల్లో 77 కేసుల నమోదు 729.91 క్వింటాళ్లు స్వాధీనం -
క్రమ‘శిక్షణ’తో పూర్తిచేయండి
విజయనగరం క్రైమ్: కానిస్టేబుల్ ఉద్యోగం మిగిలిన శాఖల కన్నా భిన్నమైనది.. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.. మారుతున్న నేరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పోలీస్ అభ్యర్థులకు ఎస్పీ దామోదర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా నుంచి ఎంపికై న 116 మంది అభ్యర్థుల్లో 38 మంది మహిళలను ఒంగోలు పీటీసీకి, 78 మంది పురుషులను చిత్తూరు పీటీసీకి శిక్షణకు వేశారు. ఈ సందర్భంగా వారితో పోలీస్ బ్యారెక్స్లో శనివారం ఎస్పీ మమేకమయ్యారు. శిక్షణలో నేర్చుకోవాల్సిన అంశాలను వివరించారు. శిక్షణలో ప్రతిభ చూపి జిల్లాకు పేరుతీసుకురావాలని సూచించారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు, మోసాలు సవాల్గా మారుతాయని, వాటిని ఛేదించే నైపుణ్యాలు మన సొంతం కావాలన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగమేనన్న నిరాశ వద్దని, మంచి క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వహిస్తే ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయికి ఎదగవచ్చన్నారు. శిక్షణ సమయంలో వివిధ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. 9 నెలల శిక్షణ పూర్తయ్యేనాటికి ప్రతి ఒక్కరూ మెరికల్లా తయారుకావాలన్నారు. సమాజానికి పట్టిన జబ్బును వదిలించే డాక్టర్లా పోలీసులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనవు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, సీసీఎస్ సీఐ ఎస్.కాంతారావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, టి.శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐ నీలిమ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అభ్యర్థులకు ఎస్పీ దిశానిర్దేశం వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి జిల్లాకు పేరు తేవాలి ఒంగోలు, చిత్తూరు పీటీసీల్లో జిల్లా అభ్యర్థులకు శిక్షణ -
● ఆదుకున్న కుటీర పరిశ్రమ
నా పేరు చప్ప మౌనిక. వంగర మండలంలోని కొప్పర గ్రామం. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. భర్త శ్రీనివాసరావు ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆసరా, సీ్త్రనిధి, జగనన్నతోడు వంటి పథకాలతో రూ.2లక్షల సాయం అందింది. వీటితో పిడికర్రలు (మాప్ స్టిక్స్), కొండచీపుర్లు తయారీ యూనిట్ను ఇంటివద్ద ప్రారంభించాను. ఇప్పుడు నెలకు రూ.15వేలు సంపాదిస్తున్నాను. సాయం అందేలా చేసిన జగనన్న మేలు మరచిపోలేనిది. ● ఆదుకున్నారు నా పేరు బోదంకి సంతోష్కుమార్. మా నాన్న పేరు కృష్ణ. అమ్మ పేరు కనకం. మాది విజయనగరం మండలం రాకోడు గ్రామం. మూడేళ్ల కిందట బీపీ ఎక్కువై పడిపోవడంతో మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయాయి. రూ.3 లక్షలు అప్పుచేసి ఆపరేషన్ చేయించారు. విషయం తెలుసుకున్న అప్పటి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. రూ. 2.20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కావడంతో అప్పుతీర్చగలిగాం. ఆయన మేలు మరచిపోలేం. ఆయనకు ముందుస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు. -
● చదువుకు అండ
నా పేరు వరిరెడ్డి పూజ. కొమరాడ మండలంలోని మాదలింగి గ్రామం. నిరుపేద కుటుంబం. నాకు తమ్ముడు రాంమకుమార్, చెల్లి శ్రీజ ఉన్నారు. మా చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. అమ్మ దమయంతికి వచ్చిన టైలరింగ్ వృత్తితో మా జీవనం సాగేది. ఉన్నత చదువులు చదివించాలని అమ్మ కలలు కనేది. ఊర్లో ఉన్న పాఠశాల వరకు మాత్రమే చదివించగల ఆర్ధిక స్థోమత మాత్రమే ఉండేది. ఫీజురీయింబర్స్ ఆర్థిక సాయంతో పిల్లలను చదివించవచ్చని అమ్మ తెలుసుకొని నన్ను ఇంజిరింగ్ విద్యకు ప్రోత్సహించింది. దీనివల్లే నేను ఇంజినీరింగ్ ఈసీఈ కోర్సు పూర్తిచేసి ప్రస్తుతం హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడ్డాను. తమ్ముడు ఐటీఐ పూర్తిచేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు. చెల్లి కూడా అమ్మఒడి సాయంతో చదువుకుంది. ఫీజురీయింబర్స్మెంట్తో గత ప్రభుత్వం సాయం చేయకపోతే చదువు పాఠశాల విద్యతోనే నిలిచిపోయేది. -
రైతన్నకు అండగా అగ్రిల్యాబ్లు
● గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లాలో 8 అగ్రిల్యాబ్ల ఏర్పాటు బొబ్బిలి: గతంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటుచేసిన అగ్రిల్యాబ్లు రైతన్నకు అండగా నిలుస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను పరీక్షించేందుకు సహకరిస్తున్నాయి. మట్టి పరీక్షలు చేసి భూసార నివేదికలు అందిస్తున్నాయి. ఏ నేలలో ఏ పంట సాగుచేస్తే లాభదాయకమో తెలియజేస్తున్నాయి. గతంలో స్థానికంగా అగ్రిలాబ్లు లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో రైతులు నష్టపోయేవారు. దీనికి చెక్ చెబుతూ జిల్లాలోని నాలుగున్నర లక్షల మంది రైతులకు మేలుచేకూర్చేలా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 8 చోట్ల అగ్రిల్యాబ్లను గత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక్కోల్యాబ్కు రూ.55 లక్షలు వెచ్చించింది. జిల్లా కేంద్రంలో రూ.3.68 కోట్ల ఖర్చుతో జిల్లాస్థాయి ల్యాబ్ను నిర్మించింది. డాక్టర్ వైఎస్సార్ సమీకృత వ్యవసాయ ప్రయోగ శాలలుగా పిలిచే ఈ అగ్రిల్యాబ్లలో ముగ్గురు సిబ్బందిని నియమించింది. వీరి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి రీజనల్ కోడింగ్ సెంటర్తో పాటు చైన్నె, బెంగుళూరు, ఫరీదాబాద్ ప్రాంతాల్లో నిర్వహించే పరీక్షల ఫలితాలను కోడింగ్ ద్వారా ఎంపికచేసి నాణ్యమయినవి, కానివి వీరు గుర్తించి రైతులకు ఆర్బీకేల ద్వారా సమాచారం అందించేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ల్యాబ్ల సేవలను అందకుండా చేస్తోందంటూ రైతులు వాపోతున్నారు. -
దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి : కలెక్టర్
విజయనగరం అర్బన్: జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు, సాధ్యమైన పరిష్కార మార్గాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జిల్లాలో ఉన్న ప్రధాన రెవెన్యూ పరమైన సమస్యలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సమావేశంలో రీసర్వే ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో మురళి, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. సవరవిల్లి–తూడెం–భోగాపురం రోడ్డు పనులు వేగవంతం చేయాలి సవరవిల్లి, తూడెం, భోగాపురం రోడ్డు కనెక్టివిటీకి సంబంధించిన ఏడీఏసీఎల్ ప్రతిపాదించిన రహదారి పనులపై కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శనివారం తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదిత రహదారిలో మామూలు కల్వర్టు స్థానంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి నిర్మాణ పనులను ఆరు నెలలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో కలెక్టరేట్ నుంచి పీఆర్ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏడీఏసీఎల్ జీఎం ప్రవీణ్, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, సంబంధిత కాంట్రాక్టర్్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడిలో ఏఐ పాఠాలు
చీపురుపల్లి: చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని, విద్యార్థులు ప్రయోజకులైతే ఆ కుటుంబాలు బాగుపడతాయని నమ్ముతూ ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యను అందించేందుకు నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కృషిచేసింది. నాడు–నేడుతో ప్రభుత్వ బడులకు ఆధునిక హంగులు కల్పించడంతో పాటు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్తో పాఠ్యాంశాలను బోధించేలా విద్యాసంస్కరణలు చేపట్టింది. అక్కడితో ఆగకుండా ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచి ఏఐను పరిచయం చేయడంతోపాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భవిష్యత్ను తీర్చిదిద్దుకోలిగే సామర్థ్యాలు అందించాలని భావించారు. ఇంటెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 2024 మార్చి 2న చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. తరువాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబ్లు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదన మూలకు చేరిన విషయం తెలిసిందే. ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ ఫెస్టివల్లో చీపురుపల్లి విద్యార్థులు 2025 నవంబర్ నెలలో ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర విద్యాశాఖ, ఇంటెల్ సంస్థ సంయుక్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సీ ఇంపాక్ట్ ఫెస్టివల్ నిర్వహించాయి. ఈ ఫెస్టివల్లో చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఏఐ ల్యాబ్లో శిక్షణ తీసుకున్న ఆర్.హర్షిత (9వ తరగతి), పీవిఎల్.ప్రణవి, పి.తనిష్క్లు సిద్ధం చేసిన సిటిజన్ క్రెడిట్ కార్డు, ఏఐ ఆధారిత క్యూ మేనేజ్మెంట్ అనే రెండు ప్రాజెక్టులు ప్రదర్శించారు. వీటిని పరిశీలించిన ఇంటెల్ అంతర్జాతీయ వ్యవరాల ప్రతినిధి సారా కెంప్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. భారత ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చీపురుపల్లి పాఠశాలను పేరును ప్రస్తావిస్తూ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 50 ప్రాజెక్టులకు రూపకల్పన చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటైనప్పటి నుంచి అక్కడ ఫెసిలిటేటర్ బాధ్యతలను అదే పాఠశాలలోని హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఏవీఆర్డీ ప్రసాద్కు అప్పగించారు. ఆయన శిక్షణలో ఏడాదిన్నర కాలంలో విద్యార్థులు 50 ప్రాజెక్టులు వరకు రూపొందించారు. ఏఐ ఫర్ ఫ్యూచర్ అనే యూట్యూబ్ ఛానల్ను కూడా తయారుచేసి అందులో వీరు తయారు చేసిన ప్రాజెక్టులను అప్లోడ్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా బ్లైండ్ పీపుల్ అసిస్టెన్స్ డివైజ్ (బీఏడీ) యాప్ను తయారు చేశారు. ఇటీవల ఇదే పాఠశాలకు చెందిన ఆర్.హర్షిత, పీవీఎల్ ప్రణవి పారిశుద్ధ్యంపై ఎన్పవరింగ్ అవర్ శానిటేషన్ హీరోస్ పేరుతో సిటిజన్ క్రెడిట్ కార్డు అనే ప్రాజెక్టును రూపొందించారు. ఎంతో విలువైన సేవలందించే పారిశుద్ధ్యకార్మికులతో పాటు సమాజానికి ఉపయోగపడే ప్రతీ ఒక్కరికీ సిటిజన్ క్రెడిట్ కార్డు ద్వారా పాయింట్లు కేటాయించి వారికి విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను వంటి అంశాల్లో రాయితీలు ఇవ్వడం ఈ సిటిజన్ క్రెడిట్ కార్డు ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుచూపు చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు ఇంతవరకు 50 ఏఐ ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులు ఢిల్లీ స్థాయిలో ప్రదర్శనలు -
పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యం
పార్వతీపురం: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా పని చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంగన్వాడీలకు పంపిణీ చేసే బియ్యం, కందిపప్పు, వంటనూనె నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని ఎక్కడా నిల్వలు నిలిచిపోకుండా సకాలంలో సరఫరా చేయాలని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. చిన్నారులకు, గర్భిణులకు అందించే పాలు తాజాగా ఉండేలా చూడాలని ఏపీ డెయిరీ ద్వారా సరఫరా ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతను పర్యవేక్షించాలన్నారు. చిన్నారుల శారీరక పెరుగుదలకు అవసరమైన బాలామృతం, పోషకాహార కిట్ల పంపిణీని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమీక్షలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి -
అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం..
విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం పురస్కరించుకుని అంబేడ్కర్ రైట్స్ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన కరపత్రాలను జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీసీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధర్మపురిలో గల సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రాజ్యాంగంలో విద్య, వైద్యం ప్రభుత్వం అమలు చేయాలని ప్రాథమిక హక్కులలో భాగంగా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయటం లేదని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు జీవో నెంబర్ 590 ద్వారా మెడికల్ కాలేజ్లను అప్పగించి పేద వర్గాలకు వైద్య విద్యను, వైద్యాన్ని దూరం చేయడం దారుణమన్నారు. 2019 – 2024 మధ్య కాలంలో సంక్షేమ పథకాల ద్వారా రూ.రెండు లక్షల కోట్లు ఆర్థిక సాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి విజయవాడలో 127 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.404 కోట్లు ఖర్చు పెట్టి 19 ఎకరాల్లో చేపట్టిన సృతి వనాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో వేపాడ మండల పార్టీ అధ్యక్షులు జగ్గు బాబు, అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భానుమూర్తి, కార్పొరేటర్ బోనేల ధనలక్ష్మి, బుధరాయవలస మఽధు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
గ్రంథాలయాలకు చంద్ర గ్రహణం
మెరకముడిదాం: విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడే గ్రంథాలయాలు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలకు అవసరమయ్యే కొత్త పుస్తకాలు కొనుగోలు చేయకపోవడంతో పాత సమాచారంతో ఉన్న పుస్తకాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడడంలేదు. ఫలితంగా నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సిబ్బంది కొరత కూడా తోడు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తున్న గ్రంథాలయాలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఆధునిక దేవాలయాలుగా పేరుబడిన గ్రంథాలయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందకపోవడంతో అటు పాఠకులు, ఇటు నిరుద్యోగుల ఆదరణ కరువై నిర్వీర్యమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, కొత్త పుస్తకాలు కొనుగోలుకు అనుమతులు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చేసేది లేక ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. మరికొందరు విద్యార్థులు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 41 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్ – 1 గ్రంథాలయాలు – 1, గ్రేడ్ – 2 గ్రంథాలయాలు – 4, గ్రేడ్ – 3 గ్రంథాలయాలు–33, గ్రామీణ గ్రంథాలయాలు – 3 వున్నాయి. ఉమ్మడి విజయనగరంలో వున్న 41 గ్రంథాలయాల్లో 26 గ్రంథాలయాలకు సొంత భవనాలు వుండగా మిగిలిన వాటిలో 8 గ్రంథాలయాలు అద్దె భవనాల్లోనూ, 7 గ్రంథాలయాలను అద్దె లేని భవనాలలో అధికారులు నిర్వహిస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో క్రీడలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు గణనీయంగా మారాయి. అన్ని రంగాల్లో కరెంట్ అఫైర్స్ మారిపోయాయి. వీటన్నింటితో కూడిన పుస్తకాలు టెట్, డీఎస్సీతో పాటూ బ్యాంకింగ్ రంగానికి చెందని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రంథాలయాల్లో అందుబాటులో లేవు. గ్రూప్ పరీక్షలకు హాజరయ్యే వారికి అవసరమైన ఎకనామీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ పుస్తకాలు అవసరం. నిరుద్యోగ అభ్యర్థులకు అప్డేట్ కరెంటు అఫైర్స్ అందుబాటులో లేకపోవడంతో గ్రంథాలయాలకు వచ్చిన అభ్యర్థులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొత్త పుస్తకాలు కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం గ్రంథాలయాలను వేధిస్తున్న పుస్తకాలు, సిబ్బంది కొరత అందుబాటులో లేని కాంపిటేటివ్ పుస్తకాలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 41 గ్రంథాలయాలు 11 లైబ్రేరియన్ల పోస్టులు ఖాళీ సిబ్బంది కొరతతో మూతపడుతున్న కొన్ని గ్రంథాలయాలువేధిస్తున్న ఉద్యోగుల కొరత ఇదిలా వుంటే మరోవైపు ఈ గ్రంథాలయాలను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 11 లైబ్రేరియన్ పోస్టులు, 2 రికార్డు అసిస్టెంట్ పోస్టులు, 14 ఆఫీసు సబార్డినేట్ పోస్టులు ఖాళీగా వున్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రంథాలయాధికారులు 11, రికార్డు అసిస్టెంట్లు రెండు, ఆఫీస్ సబార్డినేట్లు 14 ఖాళీలున్నాయి. జిల్లాలో వున్న 41 గ్రంథాలయాల పరిధిలో 33,640 మంది సభ్యులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. లైబ్రేరియన్ల కొరత కారణంగా కొన్ని లైబ్రేరీలకు ఇన్చార్జ్లే దిక్కుగా మారింది. అదే విధంగా మరోవైపు ఇన్చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్న లైబ్రేరియన్లకు అదనపు పని భారంతో పాటూ ఆర్థిక భారం కూడా తోడవుతుందంటున్నారు. అదనంగా చేస్తున్న పనికి ప్రభుత్వం అదనంగా జీతం ఇవ్వడం లేదు సరికదా కనీసం టీఏ, డీఏలైనా ఇవ్వకపోతే తమ వేతనాల్లో నుంచి ఎన్నాళ్లు ఖర్చు చేయగలగమని వాపోతున్నారు. -
సీడీపీవోకు ఏసీడీపీవోగా బదిలీ
● ఆకస్మిక బదిలీపై అనుమానాలు విజయనగరం ఫోర్ట్: విజయనగరం అర్బన్ సీడీపీవో జి.ప్రసన్న కు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏసీడీపీవోగా డిప్యూటేషన్పై బదిలీ అయింది. ఈ మేరకు రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అర్బన్ ప్రాజెక్టులో ఏసీడీపీవోకు ఇన్చార్జ్ సీడీపీవోగా బాధ్యతలు అప్పగించారు. అయితే సీడీపీవోల బదిలీ పక్రియ కొన్ని నెలలు క్రితమే ముగిసింది. ఎటువంటి బదిలీలు లేని సమయంలో సీడీపీవోను అది కూడా ఏసీడీపీవోగా డిప్యూటేషన్పై బదిలీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ సీడీపీవో, ఇన్చార్జ్ పీడీగా కూడా పని చేసిన ఆమెను ఏసీడీపీవోగా బదిలీ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. గత కొంత కాలంగా ఐసీడీఎస్లో అంతర్గత విబేధాలు తలెత్తినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్(పి.డి)కి సీడీపీవోకు మధ్య అంతర్గత విబేధాలు నడుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో సీడీపీవో బదిలీ జరగడం సర్వత్రా చర్చినీయాంశమైంది. ఇదే విషయాన్ని ఐసీడీఎస్ పి.డి విమలారాణి వద్ద సాక్షి ప్రస్తావించగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో డిప్యూటేషన్పై ఏసీడీపీవోగా ప్రసన్నను బదిలీ చేశారని తెలిపారు. ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ శ్రీకాకుళం రూరల్: హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, బొల్లినేని మెడిస్కిల్ సంయుక్తంగా బ్యుటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్), ప్రొడక్షన్ మిషన్ ఆపరేటివ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. విజయనగరం అర్బన్: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు కొన్నేళ్లుగా పరిష్కారం కాని అపరిశుధ్య సమస్య ఎదురయింది. ఐటీఐలోని తరగతుల నిర్వాహణ భవనానికి ఆనుకొని ఉన్న గిరిజన సంక్షేమ వసతిగృహం నుంచి మరుగుదొడ్ల మురుగునీరు రావడాన్ని మంత్రి కొండపల్లికి అక్కడి ఐటీఐ విద్యార్థులు చెప్పుకున్నారు. కొన్నేళ్లుగా ఈ సమస్య కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి దృష్టిలో ఉంది. మరుగుదొడ్ల మురుగునీటి ప్రవాహం ఐటీఐ ప్రాంగణంలోకి రాకుండా కాలువను నిర్మించుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావుకు కొన్ని నెలల క్రితం ఆదేశాలిచ్చానని ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్రెడ్డి అన్నారు. సంబంధిత గిరిజన సంక్షేమ అధికారి పట్టించుకోకపోవడంపై మంత్రి ఎదుటే కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుదొడ్ల ప్రవాహ మరుగునీటి సమస్యను శాఖపరమైన ఉన్నదాధికారులకు తెలియజేసి ప్రత్యామ్నాయ మార్గం పనుల చేపట్టాలని మంత్రి ఆదేశాలిచ్చారు. అనంతరం ఐటీఐ ప్రాంగణంలో మొక్కలు నాటి, పరిసరాలను పరిశభ్రం చేశారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీగిరి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి బలిజిపేట: మండలంలోని బర్లి గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శశాంక్(20) మృతి చెందినట్టు ఎస్ఐ సింహాచలం తెలిపారు. వారి వివరాల ప్రకారం బర్లి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి లారీ, మోటార్ సైకిల్ ఢీ కొనడంతో ముగ్గురు గాయాలవగా వీరిని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో శశాంక్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి తిరిగి అక్కడ నుంచి మెరుగైన వైద్య నిమిత్తం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. -
ఏఐ ల్యాబ్తో గొప్ప లక్ష్యం
ఎంతో గొప్ప లక్ష్యంతో 2024 మార్చి2న గత ప్రభుత్వం ఏఐ ల్యాబ్ను చీపురుపల్లి బాలుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇదొక వరం. ల్యాబ్ ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు 50 ప్రాజెక్టులు వరకు విద్యార్థులు తయారుచేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆర్టిఫీషియల్ ఇంప్లాక్ట్ ఫెస్టివల్లో తమ పాఠశాల విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి ఎస్.కృష్ణన్, ఇంటెల్ సంస్థ అంతర్జాతీయ వ్యవరాల ప్రతినిధి సారా కెంప్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు సాంకేతిక రంగంలో ఎదిగేందుకు ఇదొక గొప్ప అరుదైన అవకాశం. పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి ప్రోత్సాహంతో విద్యార్థులకు ఏఐ పాఠాలు బోధిస్తున్నాం. – ఏవీఆర్డి.ప్రసాద్, ఏఐ ల్యాబ్ ఫెసిలిటేటర్, చీపురుపల్లి -
1180 బూతుల్లో పల్స్పోలియో కార్యక్రమం
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని 1185 బూతుల్లో ఈ నెల 21న ఆదివారం పల్స్పోలియో నివారణకు చుక్కలమందు వేస్తామని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అప్పుడేపుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటిచిందన్నారు. అయినప్పటకి కొన్ని దేశాల్లో పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పల్స్పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 1999లో చివరి సారిగా జిల్లాలో రెండు పోలియో కేసులు కర్లాం, ముంజేరులో నమోదయ్యాయన్నారు. జిల్లాలో 2,45,667 ఓపీవీ వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేశామన్నారు. చుక్కల మందు వేసేందుకు 2,360 బృందాలు, 129 మంది సూపర్ వైజర్లు, 66 మొబైల్ టీమ్లు, 21 ట్రాన్సిట్ టీములు, 56 కోల్డ్ చైన్ టీమ్లను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. సమావేశంలో డీఐఓ అచ్చుతకుమారి, డీఎల్ఓ కె.రాణి పాల్గొన్నారు. -
● చంద్రన్నా... ఎరువు ఏదన్నా..?
మెరకముడిదాం: గర్భాం రైతుసేవా కేంద్రం వద్ద బస్తా యూరియా కోసం బారులు తీరిన రైతులు నెల్లిమర్ల రూరల్: వల్లూరు రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల క్యూ రైతన్నను రబీలోనూ ఎరువు కష్టాలు వెంటాడుతున్నాయి. మొక్కజొన్న, కూరగాయల పంటలకు వేసేందుకు అవసరమైన యూరియా లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. బస్తా యూరియా కోసం ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నారు. భూమి పత్రాలు, ఆధార్ కార్డులు పట్టుకుని క్యూ కడుతున్నారు. యూరియా కోసం గత ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోలేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విత్తనం నుంచి పంట అమ్ముకునేవరకు కష్టాల నడుమ ‘సాగు’తున్నామంటూ రైతులు వాపోయారు. నెల్లిమర్ల మండలంలోని వల్లూరు, మెరకముడిదాం మండలంలోని గర్భాం ఆర్ఎస్కేల వద్ద బస్తా యూరియా కోసం శుక్రవారం గంటల తరబడి నిరీక్షించారు. చాలామంది రైతులకు ఎరువు అందక నిరాశతో వెనుదిరిగారు. – నెల్లిమర్ల రూరల్/మెరకముడిదాం -
వాజ్పేయి ఆదర్శనీయులు
విజయనగరం రూరల్: మాజీ ప్రధాని, భారతరత్న ఏబీ వాజ్పేయి ఆదర్శనీయులని, ఆయన చూపిన మార్గంలోనే నరేంద్ర మోదీ సర్కారు పయనిస్తోందని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వాజ్పేయి శతజయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్రవ్యాప్త సుపరిపాలన (బస్సు) యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధికి వాజ్పేయి అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఆయన సంస్కరణ వాది అని కొనియాడారు. ఆయన స్థిరమైన నిర్ణయాలతో దేశం ఆర్థికంగా ముందుకు సాగుతుందని, నేడు దేశం ఆర్థికవృద్ధి రేటులో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుందన్నారు. కొందరు దేశాధినేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనది డెడ్లీ ఎకానమీ అని ఎద్దేవా చేస్తూ, పొరుగు దేశానికి సాయం చేయాలని చూసినా మన దేశం సాధిస్తున్న ప్రగతిని ప్రపంచ ఆర్థిక సంస్థలు కొనియాడుతున్నాయన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. హింసా, వ్యసనాలకు లోనుకాకుండా మనం చేసే పనిమీద దృష్టి సారిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వాజ్పేయి ఆదర్శభావాలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమానికి ముందుగా విజయనగరం శివారు వై కూడలి వద్ద ఏర్పాటుచేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఆయన చూపిన మార్గంలోనే మోదీ సర్కారు పయనిస్తోంది 2047 నాటికి వికసిత్ భారత్ సుపరిపాలన యాత్రలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు -
మాకూ చలివేస్తోంది...
మనుషులనే కాదు మూగజీవాలను చలి వణికిస్తోంది. వెచ్చదనం కోసం అన్ని జీవులూ పాకులాడుతున్నాయి. దీనికి బొబ్బిలి పట్టణంలోని సీబీఎం బాలికల హైస్కూల్ వద్ద శుక్రవారం కనిపించిన ఈ చిత్రమే నిదర్శనం. ఇక్కడ రోడ్డుకిరువైపులా ఆకు కూరలు, కూరగాయలమ్మే విక్రయదారులు సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు అక్కడి చెత్తను తగులబెడతారు. వారు కొద్దిసేపు చలికాచుకున్నాక ఇళ్లకు వెళ్లిపోతారు. అంతవరకూ రోడ్డుపై సంచరించే ఆవులన్నీ మంట వద్దకు వెళ్లి ఇలా వెచ్చదనం పొందుతాయి. మాకూ చలి ఉందనే సంకేతాన్నిస్తున్నాయి. – బొబ్బిలి -
కొఠియా ఒడిశాదే..
● వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒడిశా మంత్రి సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఉన్న వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాలకు ఒడిశాయే తల్లి అని, ఆంధ్రా పిన్ని వంటిదంటూ ఒడిశా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొఠియా ఎప్పటికీ ఒడిశాదేనంటూ నమ్మబలికారు. కొఠియాలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 31 మంది మహిళా సంఘాల సభ్యులకు ఒడిశా ప్రభుత్వం మంజూరు చేసిన కోటి రూపాయల రుణం, రైతులకు బఠానీ విత్తనాలు అందజేశారు. రూ.2లక్షల16 వేలు విలువైన బ్రాయిలర్ ఫాం యూనిట్ను మంజూరు చేశారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్, పొట్టంగి, కొరాపుట్, కోట్పాడ్ ఎమ్మెల్యేలు రామచంద్ర కదమ్, రఘరామ్ మాచ్, రూపు భత్రా, భద్రతా అధికారి రోహిత్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టండి
చీపురుపల్లిరూరల్(గరివిడి): చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గరివిడిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొత్స అనూషతో పాటు నాలుగు మండలాలకు చెందిన నాయకులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21న చేపట్టే వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అమలుచేయలేదన్నారు. పింఛన్లు, ఫీజురీయింబర్స్మెంట్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇలా.. ఏ పథకమూ లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందలేదన్నారు. 18 నెలల పాలనలో అప్పులు మినహా సంక్షేమపాలన కనిపించడంలేదన్నారు. నాయకులతో మాట్లాడి గ్రామాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. కార్యక్రమంలో మీసాల విశ్వేశ్వరరావు, వలిరెడ్డి శ్రీనువాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, తోట తిరుపతిరావు, కోట్ల విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నేర పరిశోధనలో రాష్ట్రస్థాయి అవార్డు
పార్వతీపురం రూరల్: నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. దర్యాప్తులో చాకచక్యం ప్రదర్శించిన కేసులకు ఇచ్చే ‘ఏబీసీడీ’ అవార్డుల్లో జిల్లా పోలీసు శాఖ రాష్ట్రంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, గత ఏఎస్పీ అంకిత సురానా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సాలూరు మండలం చీపురువలస సమీపంలోని ఒక జీడితోటలో యువతి మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును, ఎస్పీ ఆదేశాల మేరకు సాంకేతిక ఆధారాలతో విశ్లేషించారు. కాల్డేటా, సీసీటీవీ ఫుటేజీ. సెల్ టవర్ లొకేషన్ సాయంతో అది ’హత్య’ అని తేల్చడమే కాకుండా, కేవలం 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఈ దర్యాప్తు అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ, ఎస్సైలు నరసింహమూర్తి, వెంకట సురేష్, రమణ, క్లూస్ టీం సభ్యులను డీజీపీ అభినందించారు. -
నిబంధనలకు పాతర..!
విజయనగరం ఫోర్ట్: జిల్లా పౌరసరఫరాల సంస్థలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో చేపట్టిన పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అర్హతలు కాదని డబ్బులు ఇచ్చిన వారికే పోస్టులు కట్టబెట్టారన్నది వారి ఆరోపణ. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో దర్యాప్తునకు విజిలెన్స్ అధికారులను నియమించారు. కొద్ది రోజులుగా అధికారుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలను గుర్తించినట్టు తెలిసింది. దర్యాప్తు నివేదికను ఒకటి రెండు రోజుల్లో ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు సమాచారం. ● ఇదీ పరిస్థితి... జిల్లా పౌరసరఫరాల సంస్థలో అకౌంటెంట్ గ్రేడ్–3 మూడు పోస్టులు (కాంట్రాక్టు పద్ధితిలో), డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు–01 (ఔట్ సోర్సింగ్), టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్–3 పోస్టులు–07 (కాంట్రాక్ట్ పద్ధతిలో) భర్తీకి 2023 నవంబర్ 25వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. అకౌంటెంట్ పోస్టుకు ఎం.కామ్ విద్యార్హత, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా డిగ్రీ, ఎం.ఎస్ ఆఫీస్ అప్లికేషన్స్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విద్యార్హతగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన కొద్ది నెలలకే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. 2024 ఆగస్టులో పోస్టులు భర్తీ చేశారు. నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల భర్తీలో రోస్టర్ పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోస్టర్ పాటించకపోవడం వల్ల అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగం రాలేదని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులను అసలు ఇంటర్వ్యూకే పిలవలేదని చెబుతున్నారు. అకౌంటెంట్ పోస్టుల విషయంలో ఎస్సీ మహిళ కేటగిరికీ అభ్యర్థినికి పోస్టు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ రెండు రోస్టర్లు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ దర్యాప్తులో కూడా ఈ విషయం నిర్ధారణ అయినట్టు సమాచారం. కొన్ని పోస్టుల విషయంలో విద్యార్హత లేక పోయినప్పటకీ పోస్టులు కట్టబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ అధికారుల దర్యాప్తుతో అర్హత లేకుండా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళా అభ్యర్థి పేరు ఉప్పలాపు భారతి. ఈమెది నెల్లిమర్ల ప్రాంతం. జిల్లా పౌరసరఫరాల సంస్థ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్కు దరఖాస్తు చేశారు. అకౌంటెంట్ పోస్టుకు సంబంధించి అన్ని విద్యార్హతలు ఉన్నా ఆమెను ఇంటర్వ్యూకు పిలవలేదు. ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దర్యాప్తు జరుగుతోంది పోస్టులు భర్తీచేసిన సమయంలో జిల్లా మేనేజర్గా విధుల్లో చేరలేదు. పోస్టుల భర్తీ ప్రక్రియ తెలియదు. విజిలెన్స్ అధికారుల దర్యాప్తు జరుగుతోంది. – బి.శాంతి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లయీస్ సివిల్ సప్లై ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు..! అకౌంటెంట్ పోస్టుల భర్తీలో రోస్టర్ అమలు చేయలేదని ఆరోపణ విచారణ చేపడుతున్న విజిలెన్స్ అధికారులు పోస్టుల భర్తీకోసం డబ్బులు చేతులు మారాయన్న విమర్శలు -
రైస్ మిల్లులకు నోటీసులు జారీ
విజయనగరం ఫోర్ట్: మిల్లర్లు అదనపు ధాన్యం డిమాండ్ చేస్తున్నారంటూ రైతుల ఆవేదనను ఈ నెల 13న ‘రైతు కష్టం మిల్లర్ల పాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనంపై పౌరసరఫరాల సంస్థ అధికారులు స్పందించారు. రైతుల నుంచి అదనపు ధాన్యం డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన మిల్లర్లకు శుక్రవారం నోటీసులు జారీచేశారు. గంట్యాడ మండలం రావివలస వద్ద ఉన్న కనకదుర్గ రైస్ మిల్లు, చీపురుపల్లిలోని శ్రీకేవీఆర్ ఇండస్ట్రీ, కింతలిపేటలోని కేవీఆర్ వెంకట కామేశ్వరి రైస్ మిల్లు, బొబ్బిలి మండలం కోమటిపల్లిలోని శ్రీ మహాలక్ష్మి రైస్ మిల్లు, కలవరాయిలోని శ్రీలక్ష్మి సంతోషిమాత రైస్ మిల్లు, గొల్లపల్లిలోని శ్రీవిజయలక్ష్మి రైస్ మిల్లు, బొబ్బిలిలోని శ్రీ సాయి వెంకట కామేశ్వరి రైస్ మిల్లు, తెర్లాంలోని శ్రీ ఉమామహేశ్వరి రైస్ మిల్లుకు నోటీసులు జారీ చేసినట్టు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ బి.శాంతి తెలిపారు. జిల్లాలో 29 స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు విజయనగరం ఫోర్ట్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు 29 నమోదైనట్టు డీఎంహెచ్ఓ ఎస్.జీవనకుమారి తెలిపారు. 194 మందిని పరీక్షించగా 29 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. పీహెచ్సీల్లో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ల్యాబ్లో ఎలిజా టెస్టు ద్వారా నిర్ధారిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వ్యాధి సోకినవారంతా ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. -
తపాలా బీమా పథకాలపై అవగాహన తప్పనిసరి
విజయనగరం టౌన్: తపాలా బీమా పథకాలపై ఉద్యోగులందరూ అవగాహన తప్పనిసరిగా పెంపొందించుకోవాలని విశాఖపట్నం రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ వీఎస్.జయశంకర్ సూచించారు. ఈ మేరకు స్థానిక జెడ్పీసమావేశమందిరంలో శుక్రవారం ఉద్యోగులకు బీమా సంకల్ప్ 2.0పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెలలో నిర్దేశించిన కోటి రూపాయల ప్రీమియానికి ఇప్పటివరకూ రూ.70లక్షలకు పైగా టార్గెట్ సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా తపాలా ఉద్యోగుస్తులందరూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తపాలా బీమా సేవలపై అవగాహన కల్పించాలని కోరారు. తద్వారా తమ సేవలను విస్తృతం చేయాలని సూచించారు కార్యక్రమంలో విజయనగరం డివిజన్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్, సహాయ సూపరింటెండెంట్లు జీవీ.రమణారావు, టి.సుందరనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సత్ప్రవర్తనతో శిక్ష పూర్తిచేయండి
● విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత పార్వతీపురం: సత్ప్రవర్తనతో ఖైదీలు శిక్షను పూర్తిచేయాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె సబ్ జైలును తనిఖీచేసి వసతులను, రికార్డులను, జైలు పరిస్థితులు, ఆహారం, వైద్య సౌకర్యాలు, ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యమైన ఆహారం అందుతోందా? లేదా? అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని, నైతిక విలువలను పెంపొందించుకుంటే మానసిక ప్రఽశాంతత లభిస్తుందని ఖైదీలకు తెలిపారు. ఖైదీల ఫిర్యాదులు, అభ్యర్ధనలు, ఏవైనా సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సబ్ జైలు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పార్వతీపురం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదరరావు, విజయనగరం సీనియర్ జడ్జి బీహెచ్వీ లక్ష్మీకుమారి, పార్వతీపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జాస్పిన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సాలూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పూదోట ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద నిర్వహించిన ధర్నాకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఏజెన్సీల చట్ట ప్రకారం కార్మికులకు పీఎఫ్, బీమా చెల్లింపులు చెల్లించకుండా ఒక్కో చోట ఒకలా చెల్లిస్తున్నారని ఆరోపించారు. పేదరోగులకు సేవచేసుకుంటూ జీవిస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బుగత అశోక్, బలగ రాధ తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ ఫెయిర్ విజయవంతం
విజయనగరం అర్బన్: జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్–2025ను పాఠశాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తొలుత పదర్శన కార్యక్రమాన్ని ఆర్డీఓ దాట్ల కీర్తి ప్రారంభించారు. ఈ సైన్స్ ఫెయిర్లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘సస్టైనబుల్ అగ్రికల్చర్, పర్యావరణ నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, క్రీడలు అండ్ వినోదం, ఆరోగ్యం అండ్ పరిశుభ్రత, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ’ వంటి అంశాలపై వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ఉత్తమ వైజ్ఞానిక ప్రాజెక్టులను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. విద్యార్థుల గ్రూప్ కేటగిరి విజేతలలో అంశాల వారిగా ఏడు ప్రదర్శనలు ఎంపిక చేశారు. జిల్లా స్థాయి విజేతలు వీరే సైన్స్ ఫెయిర్లో సస్టైన్బుల్ అగ్రికల్చర్ అంశంలో జెడ్పీహెచ్ఎస్ చీపురుపల్లి (బాలికలు), ‘పర్యవరణ నిర్వహణ–పర్యావరణ హిత ప్రత్నామ్నాయాలు’ అనే అంశంలో జెడ్పీహెచ్ఎస్ జామి, ‘గ్రీన్ ఎనర్జీ–ఈవీ చార్జింగ్ స్టేషన్’ అనే అంశంలో జెడ్పీహెచ్ఎస్ రామభద్రపురం, ‘అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు–మాగ్నటిక్ గేర్స్’ అనే అంశంలో వల్లాపురం జెడ్పీహెచ్ఎస్, ‘నీటి సంరక్షణ–డ్రైయిన్ ఓవర్ఫ్లో గుర్తింపు వ్యవస్థ’ అనే టాపిక్లో రామతీర్ధం జెడ్పీహెచ్ఎస్, ‘ఆరోగ్యం అండ్ పరిశుభ్రత–స్మోక్ అబ్జార్బర్స్’ అనే అంశంపై కెల్ల జెడ్పీహెచ్ఎస్, ‘వాటర్ లీకేజ్ అండ్ డ్రైయిన్ ఓవర్ఫ్లో డిటెక్షన్ సిస్టమ్’ అనే అంశంలో కొండవెలగాడ జెడ్పీహెచ్ఎస్ ప్రాజెక్టులు విజేతలుగా నిలిచాయి. ఉపాధ్యాయుల కేటగిరిలో రామతీర్థం జెడ్పీహెచ్ఎస్ టీచర్ బల్లా శ్రీనివాసరావు (నీటి పొదుపు, పరిశుభ్రతకు పర్యావరణ హిత స్థూపాకార యూరినల్ బ్లాక్ డిజైన్), కొట్టాం జెడ్పీహెచ్ఎస్ టీచర్ పి.స్వప్న (స్కూల్ గ్రీన్ ల్యాబ్) విజేతలుగా ఎంపికయ్యారు. విద్యార్థుల వ్యక్తిగత కేటగిరి విజేతలుగా వియ్యంపేట కొత్తవలస ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ (బాలికలు) విద్యార్థులు రూపొందించిన ‘ఎఫిషియంట్ ట్రైన్ ప్లాట్ ఫాం క్రాసింగ్ సిస్టం’ ప్రదర్శన, దేవుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రూపొందించిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు’ ఎంపికయ్యాయి. అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు చేతుల మీదుగా విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ యూ.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓలు విజేతలైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా విజేతలు జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ టి.రాజేష్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో విజేతలుగా ఎంపికై న గ్రూప్ కేటగిరిలో ఏడు ప్రాజెక్టులు, టీచర్ కేటగిరిలో రెండు ప్రాజెక్టులు, వ్యక్తిగత విద్యార్థి కేటగిరిలో రెండు ప్రాజెక్టులు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రస్థాయి విజేతలు ఆ తరువాత జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానం -
ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలి
● చట్టాన్ని పథకంగా మారిస్తే కూలీల హక్కులు కోల్పోతారు ● కలెక్టరేట్ దగ్గర గాంధీజీ విగ్రహం వద్ద సీపీఎం నిరసనవిజయనగరం గంటస్తంభం: గ్రామీణ పేదలకు ఉపాధిని హక్కుగా కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడం ద్వారా ఉపాధికి ఉన్న గ్యారంటీని తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టంలో ఉన్న హక్కులను బలహీనపరిచేందుకే గాంధీజీ పేరు తొలగించి చట్టాన్ని సాధారణ పథకంగా మార్చారని ఆరోపించారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు సాధించుకున్న ఈ చట్టంపై గాంధీజీపై ఉన్న వ్యతిరేకతతోనే కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంటులో ఉన్న మోజారిటీతో కూలీలకు హక్కుగా ఉన్న చట్టాన్ని మార్చే ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. చట్టం స్థానంలో పథకం అమలులోకి వస్తే ఉపాధికి గ్యారంటీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నేతలు స్పందించాలి ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్రాలపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా స్పందించడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా టీడీపీ, జనసేన పార్టీలు ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఈ చట్టాన్ని కాపాడుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన్, వెంకటేష్, విజయనగరం పట్టణ నాయకులు బుల్లి రమణతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు
● రూ.13వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు పార్వతీపురం రూరల్: తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్. రాత్రి వేళ ఇళ్లలో చొరబడి చేతివాటం ప్రదర్శించిన దొంగలకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పదేళ్ల క్రితం నాటి దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సాలూరు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ శుక్రవారం తీర్పు వెలువరిచారు. ఎస్పీ మాధవ్రెడ్డి తెలియజేసిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సాలూరు మండలంలోని యరగాడ వలస గ్రామానికి చెందిన కొత్తపల్లి సత్తిపండు 2015లో పని నిమిత్తం రాజమండ్రి వెళ్లాడు. ఈ క్రమంలో ఇల్లంతా ఖాళీగా ఉండడం గమనించిన అదే గ్రామానికి చెందిన కొండగొర్రి రమేష్, ఆలూరి గణపతిలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులపై సమర్పించిన సాక్ష్యాధారాలు, ఏపీపీ మాధవి వినిపించిన బలమైన వాదనలతో నేరం రుజువైంది. దీంతో ముద్దాయిలిద్దరికీ మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.13వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి వివరించారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతిభోగాపురం: మండలంలోని అమటాం గ్రామానికి చెందిన కోరాడ సూరి (70) అనే వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోరాడ సూరి కొబ్బరి చీపుళ్లు తయారు చేసి వాటిని విశాపట్నంలో విక్రయిస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న విశాఖపట్నంలో చీపుళ్లను విక్రయించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సూరిని తగరపువలస ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం విశాఖపట్నం కేజీహెచ్లో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై తిరుపతి తెలిపారు. జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు నెల్లిమర్ల క్రీడాకారులునెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీకి చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు నెల్లిమర్ల రిక్రియేషన్ ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు కె.సురేష్, ఎం.నాని తెలిపారు. ఈ నెల 22 నుంచి కేరళ రాష్ట్రంలో జరగనున్న ఆంధ్ర యూనివర్సిటీ జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు బి.రామకృష్ణ, బి. వరుణ్లు ఎంపికై నట్లు తెలిపారు. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ అనంతపురం జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీకి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు రామకృష్ణ, వరుణ్, సంతోష్ కుమార్ జాతీయస్థాయి పోటీల్లో రాణించి, విజేతలుగా నిలవాలని క్లబ్ ప్రతినిధులు, పూర్వ శిక్షకుడు కోల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
ఎస్పీ దామోదర్కు ఏబీసీడీ అవార్డు
● అభినందించిన డీజీపీ హరీష్కుమార్ గుప్తా విజయనగరం క్రైమ్ : డీజీపీ హరీష్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ దామోదర్ అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డును శుక్రవారం అందుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసులు ఛేదించిన ముఖ్య కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) అవార్డును ఎస్పీ దామోదర్ అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించినందుకు గాను అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన దామోదర్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించి, ఏబీసీడీ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ గతేడాది ఏప్రిల్ 22 వ తేదీన ప్రకాశం జిల్లా, ఒంగోలు మెయిన్ రోడ్డు వద్ద నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి ముప్పవరపు వీరయ్య చౌదరిని కత్తులతో విచక్షణా రహితంగా 49 పోట్లు పొడిచి అక్కడ నుంచి పారిపోయారన్నారు. అనంతరం ఒంగోలు తాలూకా పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును తొందరగా ఛేదించి నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలపాలని ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం పెంచిందన్నారు. అప్పటి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ డీఎస్పీ స్థాయి అధికారులతో వెంటనే 60 క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి, రాత్రింబవళ్లు శ్రమించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ వ్యవధిలోనే సంచలన హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చి, 9మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారన్నారు. సంచలన హత్య కేసును తక్కువ వ్యవధిలో ఛేదించిన ఎస్పీ దామోదర్ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించి, కేసు ఛేదనలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందికి నగదు బహుమతి ప్రదానం చేశారు. -
గోడకూలి విద్యార్థికి గాయాలు
శృంగవరపుకోట: పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో పై అంతస్తులో ఉన్న వాటర్ట్యాంక్ గోడకూలి ఓ విద్యార్థి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గాంధీనగర్ నాల్గవవీధిలో ఉన్న త్రినేత్ర డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్లో పందిరప్పన్న జంక్షన్కు చెందిన వేమలి భార్గవ్ 6వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో భార్గవ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పాఠశాల వెనుక వైపు ఉన్న రేకుల బాత్రూమ్కు మూత్రవిసర్జనకు వెళ్లాడు. మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పాఠశాల భవనం మూడవ అంతస్తుపైన ఉన్న వాటర్ట్యాంక్ గోడ కూలిపోయి బాత్రూమ్పైన పడిపోవడంతో భార్గవ్ రేకులు, గోడ శిథిలాల మధ్య చిక్కుకు పోయాడు. హఠాత్తుగా వచ్చిన శబ్దంతో వెనుక వీధిలో ఉన్న కార్పెంటర్ వాసు, చిల్డ్రన్ హాస్పిటల్లోని నర్స్లు వచ్చి శిథిలాలను తొలగించి విద్యార్థిని కాపాడారు. భార్గవ్ తలకు కుడివైపు లోతైన గాయం కాగా, ఎడమకాలు విరిగిపోయింది. స్కూల్కు పక్కనే ఉన్న అభినవ్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేయించారు. విషయం తెలిసి విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై నిలదీశారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఘటనలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యవైఖరి, నిర్మాణంలో లోపాలే ప్రమాదానికి కారణం ఆరోపించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి విచారణ చేశారు. గాయపడిన భార్గవ్కు వైద్యం చేసిన ఆస్పత్రి నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. -
గురుకులంలో భోజన సమస్య లేదు
● డీసీఓ మాణిక్యం భామిని: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థులకు భోజన సమస్య లేదని గుర్తించినట్లు విజయనగరం గురుకులాల సమన్వయ కర్త(డీసీఓ) మల్లా మాణిక్యం గురువారం స్పష్టం చేశారు. గురుకులం ప్రిన్సిపాల్ విజయ నిర్మలతో కలిసి గురుకుల విద్యార్థులతో మాట్లాడినట్లు వివరించారు. ఇటీవల ఆదివారం మధ్యాహ్న భోజనం ఆలస్యంపై విద్యార్థుల ఆకలికేకలపై విచారణ చేసినట్లు తెలిపారు. ఆ భోజన జాప్యానికి గ్యాస్ రెగ్యులేటర్ మరమ్మతు కారణమని గుర్తించామన్నారు.మిగతా రోజుల్లో యథావిధిగా సమయ పాలనతో భోజనాలు అందుతున్నట్లు విద్యార్థులు తెలిపారన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఫోన్లో సిబ్బందితో మాట్లాడానని డీసీఓ మాణిక్యం వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న తీరు పరిశీలించానని, వంట గది, భోజనశాల అన్నీ పరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. -
అనాలోచిత నిర్ణయం
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితం. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే కష్టమే. ప్రైవేటు పరమైతే సామాన్యులకి వైద్యం అందని ద్రాక్షలా మారుతుంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ముందుచూపుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటుచేశారు. వాటిని రద్దుచేయాలనే ఆలోచనరావడం దుర్మార్గమైన చర్య. – బెవర గణేష్, విద్యార్థి, రేగిడి మండలం ప్రభుత్వ కళాశాలలతోనే లబ్ధి ప్రభుత్వ మెడికల్ కళాశాలలతోనే పేద విద్యార్థులకు లబ్ధిచేకూరుతోంది. ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది పేదవిద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టే అవుతుంది. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాన్ని మార్చు కోవాలి. – బి.రాంబాబు, రేగిడి మండలం దారుణం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. అలా చేస్తే పేద ప్రజలకు ఉచిత వైద్యం ప్రభుత్వం తరఫున అందకుండా పోతుంది. డబ్బులు ఇచ్చి వైద్య సేవలు పొందలేనివారు ఇబ్బంది పడతారు. కాలేజీల ప్రైవేటీకరణతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోతుంది. – సూరిబాబు, విద్యార్థి, గురుదత్త కాలేజీ ప్రజలకు అన్యాయమే.. ఎన్నికలకు ముందు ప్రజలకు మేలు చేస్తామంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానాన్ని అమలు చేయడం సరికాదు. ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రైవేటుకు అప్పగిస్తే వారు వ్యాపార ధోరణిలో ఫీజులు వసూలు చేస్తారు. ప్రైవేటీకరణ ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలి. – కె.జగదీష్, విద్యార్థి, విజయనగరం మంచి విధానం కాదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వారికి నచ్చిన ఫీజులు వసూలు చేస్తారు. ఆధిపత్యం వారిదే అవుతుంది. మెడికల్ సీట్లు ధర రూ.కోట్లలో ఉంటుంది. పేదలకు విద్య, వైద్యం అందాలంటే రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలి. – దాసరి గుణశ్రీ, కూర్మవరం, ఎల్.కోట మండలం -
వైభవంగా గోదాదేవి పల్లకి సేవ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత గోదాదేవి పల్లకి సేవను అర్చకులు చేపట్టారు. అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం యాగశాలలో విశేష హోమాలు, స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి సన్నిధిలో తిరుప్పావై సేవా కాలములు జరిపించి స్వామికి ఆరాధన చేశారు. చెరకు తోట దగ్ధంరేగిడి: మండల కేంద్రం రేగిడిలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 20 ఎకరాల చెరకు తోట దగ్ధమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరకు చెత్తకు అగ్గిపెట్టడంతో ప్రమాదవశాత్తు చెరకు తోటలకు నిప్పంటుకుంది. దీంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లావేటి విష్ణుమూర్తి, ముంజేటి సన్యాసినాయుడు, జల్లు సాయిరాం జల్లు సింహాద్రి, కరణం గోవింద, ముంజేటి వెంకటప్పలనాయుడు తదితర రైతులకు చెందిన చెరకు పంట దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు పాలకొండ అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసింది. చక్కెర కర్మాగారం యాజమాన్యం స్పందించి కాలిన చెరకుకు కటింగ్ ఆర్డర్ ఇప్పించి తరలించాలని బాధితులు కోరుతున్నారు. పాపం పసివాళ్లకు సాయం● ముందుకు వచ్చిన దాతలు గజపతినగరం: జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన మైలపల్లి విజయ్, మైలపల్లి గౌతమ్లతో పాటు రామయ్యపాలెం కొత్తూరుకు చెందిన మరో పిల్లవాడు ముంతాగౌతమ్లకు గజపతినగరం మండల ఉపాధ్యాయ బృందం దాతృత్వంతో రూ.20వేల నగదు, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ పిల్లల తల్లిదండ్రులు మృతి చెందడంతో వారు అనాథలయ్యారు. ఆ పిల్లలకు గురువారం గజపతినగరం మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారిణి విమలమ్మ, ఎంఈఓ–2 సాయిచక్రధర్ల చేతులు మీదుగా నగదు, వస్త్రాలను, నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అంద జేశారు. పాపం పసివాళ్లు అనే శీర్షికన ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం చూసిన దాతలు స్పందించి ముందుకు వచ్చి అనాథ పిల్లలకు సహకారం అందజేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిదత్తిరాజేరు: మండలంలోని ఎం.లింగాలవలస గ్రామానికి చెందిన అలజింగి సన్యాసప్పడు(55)ను కొద్ది రోజుల క్రితం వెనుక నుంచి ట్రాక్ట ర్ ఢీకొనడంతో గాయపడగా వైజాగ్లోని కేజి హెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై ఆర్ జయంతి తెలిపారు. ఈనెల 12వ తేదీన అదే గ్రామాని కి చెందిన ఇనుముల సత్యనారాయణ ట్రాక్టర్ ను నిర్లక్ష్యంగా, వేగంగా, నడిపి సన్యాసప్పడును వెనుక నుంచి ఢీకొట్టడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మహిళ ఆత్మహత్యసీతంపేట: మండలంలోని అంబలగండి గ్రామానికి చెందిన గేదెల లక్ష్మి (35) అనే గిరిజన మహిళ కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆరునెలలుగా కడుపులో నొప్పితో ఆమె బాధపడుతోంది. ఈనెల 15న కడుపులో నొప్పి ఎక్కువవడంతో ఇంటిలో ఉన్న గడ్డిమందును తాగేసింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త శోభన్బాబు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేయగా రిమ్స్లో చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ట్టు దోనుబాయి ఎస్సై ఐ మస్తాన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి నట్లు చెప్పారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
దివ్యాంగులకు రీవెరిఫికేషన్ కష్టాలు
● కాటికి కాలు చాచే వయసులో ఇవేం కష్టాలంటూ వాపోతున్న బాధితులువిజయనగరం ఫోర్ట్: ఇలా వీరిద్దరే కాదు. నిత్యం అధిక సంఖ్యలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి సదరం రీవెరిఫికేషన్ కోసం దివ్యాంగులు వస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు అష్టకష్టాలు పడి వస్తూ ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటికి కాలుచాచే వయసులో ఇవేమి కష్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం సదరం రీవెరిఫికేషన్ కోసం పదేపదే తిప్పుతుండడం వల్ల దివ్యాంగులు అవస్థలు పడక తప్పడం లేదు. ముఖ్యంగా ఈఎన్టీ విభాగానికి చెందిన దివ్యాంగుల్లో చాలా మందికి రీవెరిఫికేషన్ పూర్తయినప్పటికీ మళ్లీ రీ వెరిఫికేషన్ చేయాలని పిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇచ్చే పింఛన్ మాట దేవుడెరుగు. వెరిఫికేషన్కు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జాతీయ పారా పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే పారా (దివ్యాంగుల) పవర్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు దివ్యాంగ క్రీడాకారులు అర్హత సాధించినట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న క్రీడాకారులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల విజయనగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పారా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వడ్డి సతీష్ కుమార్ సాహు, తాళ్లపూడి గౌతమిలు పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అర్హత సాధించడంతో జాతీయ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 18 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే పారా జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు వీరు బయలుదేరి వెళ్లనున్నారన్నారు. ఇదే స్ఫూర్తి తో జాతీయ స్థాయి పోటీలలోనూ ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. వారిద్దరి ఎంపిక పట్ల కలెక్టర్ రాం సుందరరెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావులు అభినందనలు తెలిపారు. -
ధ్యానదినోత్సవానికి తరలిరండి
● రాజయోగిని అన్నపూర్ణ విజయనగరం టౌన్: ప్రపంచ ధ్యానదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ధ్యాన దినోత్సవంలో ప్రజలంతా పాల్గొనాలని బ్రహ్మకుమారీస్ సేవాకేంద్రాల జిల్లా ఇన్చార్జి, రాజయోగిని బి.కె.అన్నపూర్ణ తెలిపారు. కంటోన్మెంట్ బ్రహ్మకుమారీస్ కేంద్రంలో ధ్యాన దినోత్సవ ఆహ్వాన పత్రికలను గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచ శాంతి, ఐక్యత, స్నేహం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరివర్తన లక్ష్యంగా కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. అవకాశం ఉన్నవారందరూ ధ్యానదినోత్సవంలో పాల్గొని మానసిక పరివర్తన పొందాలని కోరారు. ఆర్ధికాభివృద్ధిరేటులో జిల్లాకు 8వ స్థానం విజయనగరం అర్బన్: అభివృద్ధిరేటులో విజయనగరం జిల్లా 8వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రెండురోజుల పాటు రాష్ట్ర రాజధానిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతికి ప్రశంసలు లభించాయి. వివిధ కార్యక్రమాల అమలుపై తరచూ ప్రభుత్వం నిర్వహించే ఐవీఆర్ఎస్ సర్వేలో 69.14 శాతం సానుకూలత వ్యక్తం కావడంతో జిల్లాకు మెరుగైన స్థానం దక్కింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 80 శాతం ఆదాయాన్ని ఇచ్చే జిల్లాల్లో విజయనగరానికి చోటు దక్కింది. ఆ బిల్లు మాకొద్దు విజయనగరం గంటస్తంభం: కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ బిల్లు –2025ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము మాట్లాడుతూ గతంలో తీసుకొచ్చిన హెచ్ఈసీఐ బిల్లును కొత్త పేరుతో ఆమోదించడం వల్ల ఉన్నత విద్యను కేంద్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. యూజీసీ వంటి సంస్థలను రద్దుచేయడం వల్ల విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వ పట్టు పెరుగుతుందని, నిధులు గ్రాంట్ల స్థానంలో రుణాల రూపంలో మంజూరై విద్య సామాన్యులకు దూరమయ్యే ప్రమాదముందన్నారు. ఈ బిల్లు సమా ఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. వెనుబడిన వర్గాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. నిరసనలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వి.చిన్నబాబు, సహాయ కార్యదర్ములు ఎం.వెంకీ, ఆర్.శిరీష్, ఉపాధ్యక్షులు రమణ, రమేష్, జగదీష్, జిల్లా కమిటీ సభ్యులు సూరిబాబు, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ప్రజావైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలోకి నెట్టేసి, ప్రజావైద్యాన్ని అమ్మకానికి పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని సీపీఐ జిల్లా నాయకులు స్పష్టంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లడమేనని, ప్రభుత్వ బాధ్యతను కార్పొరేట్ చేతులకు అప్పగించే చర్యగా అభివర్ణించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం ఉద యం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు జీఓ 590 జారీచేయడం విచారకరమన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుగత పావని, పురం అప్పారావు, జిల్లా సమితి సభ్యులు పి.అప్పలరాజు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు ఎన్.నాగభూషణం, బి.వాసు, తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం
సీతంపేట: అటవీశాఖ అధికారులు, గిరిజనుల మధ్య గురువారం అడ్డాకులగూడ గ్రామంలో వాగ్వాదం జరిగింది. సీతంపేట మండలంలోని కర్రగూడ, పాలమానుగూడ, అడ్డాకులగూడ, కారిమానుగూడ పరిధిలో వీఎస్ఎస్ భూముల్లో నగరవనం నిర్మాణానికి అటవీశాఖ తవ్వకాలు జరుపుతుండగా పలు గ్రామాల గిరిజనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పాలకొండ అటవీశాఖ రేంజర్ రామారావుతో పాటు సిబ్బంది మాట్లాడుతూ పనులు జరుగుతాయని, అటవీశాఖకు సంబంధించిన భూములు కాబట్టి ఇక్కడ నగరవనం నిర్మిస్తామని పట్టుబట్టారు. ఈ క్రమంలో తీవ్రవాగ్వాదం నెలకొంది. 25 ఎకరాల్లో వనసంరక్షణ సమితులు, అటవీశాఖ జాయింట్ పట్టాలు ఉన్నాయని సర్పంచ్ ఎస్.సిమ్మయ్య, గిరిజన నాయకులు ఎ.భాస్కరరావు, ఎం.లక్ష్మణరావులు తెలిపారు. గతంలో నీలగిరి మొక్కలు వేసినప్పటికీ ఒక్కపైసా కూడా గిరిజనులకు ఇవ్వలేదన్నారు. ఇక్కడ నగరవనం నిర్మిస్తే గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు నష్టం వాటిల్లుతుందని వాపోయారు. ఈ భూములు గిరిజనులకే దక్కాలని, ఈ విషయమై ఐటీడీఏ పీఓకు కూడా వినతిపత్రం ఇచ్చామన్నారు. ఇప్పుడు అటవీశాఖ అధికారులు గిరిజనులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో రామారావు మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం నుంచే నగరవనం ప్రతిపాదన ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నగరవనాలు మంజూరు కావడంతో పాలకొండ నియోజకవర్గానికి ఇక్కడ మంజూరైందన్నారు. గిరిజనులకు ఎటవంటి నష్టం ఉండదన్నారు. -
వైద్య విద్య దూరం
ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్ధులకు వైద్య విద్య దూరం అవుతుంది. డబ్బున్న వాళ్లే వైద్య విద్యను అభ్యసించగలరు. వైద్య సేవలు కూడా డబ్బులు వెచ్చించి చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకాకుడదనే ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమంలో సంతకం చేశాను. – చప్ప వంశీ, విద్యార్థి, రేగుబిల్లి గ్రామం, గంట్యాడ మండలం అన్యాయం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయం. ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు. సామాన్యులకు వైద్యవిద్య తీరని కలగానే మిగిలిపోతుంది. – నాగులాపల్లి ఇందు, విద్యార్థిని, వియ్యంపేట -
● రబీలోనూ యూరియా కరువు
రబీ సీజన్లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పనులు మానుకుని రోజంతా లైన్లలో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. గరివిడి మండలంలోని మందిరవలస, గదబవలస, గెడ్డపువలస రైతు సేవా కేంద్రాల్లో గురువారం యూరియా పంపిణీ చేశారు. బస్తా యూరియా కోసం రోజంతా క్యూలో పడిగాపులు కాశారు. దీనికి గెడ్డపువలస ఆర్ఎస్కే వద్ద బారులు తీరిన రైతుల చిత్రమే నిలువెత్తు నిదర్శనం. – చీపురుపల్లిరూరల్ (గరివిడి) -
సైన్స్ సంబరానికి వేళాయె..
● నేడు జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ పోటీలు ● ముగిసిన మండల, నియోజకవర్గ పోటీలు ● జిల్లాకు ఎంపికై న 150 ప్రాజెక్టులుపార్వతీపురం రూరల్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, విద్యార్థుల శాసీ్త్రయ జ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దీనిలో విద్యార్థులు, తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. తద్వారా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, ఆలోచన శక్తి పెంచడం, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రయోగాత్మక నైపుణ్యాలు, సిద్ధాంతాలను ప్రయోగాత్మకంగా నిరూపించే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొత్త పాత్రలను స్వీకరించడానికి, లోతైన విజ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రేరణ కల్పించడమే పరమార్థం. భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే సైన్స్ ఇన్స్పైర్ విజ్ఞాన సంబరానికి వేళైంది. గడిచిన 15 రోజులుగా మండల, నియోజక వర్గ స్థాయిలో సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు శుక్రవారం జిల్లాస్థాయి ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సైన్స్ ఫెయిర్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి గత ఏడేళ్లుగా ఎక్కువైంది. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 1010 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులతో మండల స్థాయిలో పాల్గొన్నారు. అందులో ప్రతిభ చూపించిన 150 ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. గతేడాది పోటీల్లో జిల్లా నుంచి జెడ్పీహెచ్ఎస్ తలవరం విద్యార్థులు నిర్వహించిన ప్రాజెక్టు జాతీయస్థాయికి వెళ్లడమే కాకుండా జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతిని సాధించింది. ఈ ఏడాది మరిన్ని ప్రాజెక్టులు జాతీయస్థాయికి వెళ్లి బహుమతులు సాధిస్తాయని ఆశిస్తున్నారు నేడు జిల్లా స్థాయి పోటీలు మండల, నియోజకవర్గ స్థాయిలో పాల్గొన్న 1010మంది తయారు చేసిన ప్రాజెక్టుల్లో అత్యుత్తమమైన 150 ప్రాజెక్టులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. వాటిలో గ్రూప్స్థాయిలో 105 ప్రాజెక్టులు, వ్యక్తిగతంగా 30 ప్రాజెక్టులు, ఉపాధ్యాయుల సహకారంతో రూపొందించిన 15 ప్రాజెక్టులను జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలో గల డీవీఎం ఉన్నత పాఠశాలలో ఈ వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహించనున్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, ప్రజాప్రతినిధులు, సైన్స్ కమిటీ ఈ పోటీలలో ప్రదర్శించే 11 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హైదరాబాద్లో నిర్వహించనున్న జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరుస్తున్న మన్యం విద్యార్థులు గత ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన, బైజూస్ విధానంలో విద్యాభ్యాసం వంటి మార్పుల కారణంగా గిరిజన విద్యార్థులు విద్య, విజ్ఞాన ప్రదర్శనలపై మక్కువ చూపుతున్నారు. ఫలితంగా గత ఏడేళ్లుగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో మంచి ప్రతిభ కనబరిచి మన్యం జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మండల స్థాయిలో 1010 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులతో సైన్స్ఫెయిర్లో పాల్గొనడం గమనార్హం. ఈ ఏడాది జాతీయ స్థాయిలో మన్యం విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందించడానికే.. విద్యార్థుల్లో వైజ్ఞానాన్ని, సృజనాత్మకతను వెలికి తీసేందుకే ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది జిల్లా స్థాయికి 150 సైన్స్ ప్రాజెక్టులను ఎంపిక చేశాం. విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనను కనబరుస్తారన్న నమ్మకం ఉంది. కేవలం పారదర్శకంగా మాత్రమే ప్రాజెక్టులను ఎంపిక చేసేలా చర్యలు చేపట్టాం. జాతీయస్థాయిలో మన్యం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. – లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం ఉత్తమ ప్రదర్శనలు తేవాలి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు తమ ఆలోచనలతో ప్రాజెక్టులు చేసి ఉత్తమమైన వాటిని తీసుకురావాలి. జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ప్రాజెక్టులు గతంలో ఎంపికయ్యాయి. ఈ ఏడాది కూడా జాతీయ స్థాయికి ఎంపికవుతాయనే అశిస్తున్నాం. జిల్లా కేంద్రంలో డీవీఎంఎం పాఠశాలలో జిల్లాస్థాయి పోటీలకు సర్వం సిద్ధం చేశాం. పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం -
రూ.283 కోట్ల సీ్త్రనిధి రుణ లక్ష్యం
రామభద్రపురం: జిల్లాలో ఈ ఏడాది రూ.283 కోట్లు సీ్త్రనిధి రుణ లక్ష్యమని సీ్త్రనిధి ఏజీఎం వై.చిట్టిబాబు అన్నారు. ఈ మేరకు రామభద్రపురంలోని వెలుగు కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించి సిబ్బందితో సమీక్ష నిర్వహించి సీ్త్రనిధి రుణ వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.193 కోట్లు రుణాల వసూలు అయిందన్నారు. సీ్త్రనిధి రుణం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బ్యాంకులో రుణం తీసుకుంటే డాక్యుమెంట్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజులు వంటి అదనపు వసూళ్లు ఉంటాయని, సీ్త్రనిధి రుణం తీసుకుంటే అదనపు వసూళ్లు ఉండవన్నారు.అలాగే నూటికి నెలకు 92 పైసలు మాత్రమే వడ్డీ పడుతుందని చెప్పారు. రుణం తీసుకున్న సభ్యులు సకాలంలో సక్రమంగా వాయిదాలు చెల్లిస్తే అదనపు వడ్డీ ఉండదన్నారు. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో నగదు సభ్యుల ఖాతాలో పడుతుందని చెప్పారు. గ్రూప్లో ఒక్క సభ్యురాలికై నా రుణం ఇస్తామని, ఆ రుణంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో సీ్త్రనిధి మేనేజర్ వై ఎర్రినాయుడు, సీసీలు సింగరాజు తదితరులు పాల్గొన్నారు. సీ్త్రనిధి ఏజీఎం వై చిట్టిబాబు -
యూపీఎస్సీలో మెరిసిన చైతన్య
● పట్టువదలని విక్రమార్కుడు ● యూపీఎస్సీ మెరిట్ జాబితాలో 135 ర్యాంకు ● ప్రతిష్టాత్మకమైన ఐఈఎస్కు ఎంపిక ● ప్రస్తుతం కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సైంటిస్టుగా విధులు చీపురుపల్లి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అని చెప్పడానికి చీపురుపల్లి పట్టణానికి చెందిన పొదిలాపు చైతన్య చక్కని ఉదాహరణ. తాను అను కున్నది సాధించేందుకు ఎంత కష్టమైనా ఎదుర్కొ నేందుకు, ఎన్ని అవాంతరాలైనా దాటేందుకు, ఎలాగైనా అనుకున్నది సాధించేందుకు సిద్ధమయ్యారు. పట్టువదలని విక్రమార్కుడులా యూపీఎస్సీ పరీక్ష ల కోసం పుస్తకాలతో కుస్తీపట్టారు. ఓ వైపు కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సైంటిస్టుగా ఉద్యో గం చేస్తూనే యూపీఎస్సీ పరీక్షలు రాశారు. యూపీ ఎస్సీ బుధవారం 202 మందితో విడుదల చేసిన మెరిట్ జాబితాలో చైతన్య 135వ స్థానంలో నిలిచా రు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్)కు ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచారు. చైతన్య తండ్రి పొదిలాపు వెంకటరావు గరివిడి మండలంలోని కాపుశంభాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయునిగా పని చేస్తుండగా, తల్లి అలివేణి గృహిణి. యూపీఎస్సీలో ఉత్తమ ప్రతిభతో ఐఈఎస్కు ఎంపికవ్వడం పట్ల తల్లిదండ్రులతో పాటు భార్య లావణ్య సంతోషిస్తున్నారు. ఇదిలా ఉండగా సంతోష్ తమ్ముడు సునీల్ డీఆర్డీఓలో సైంటిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. చైతన్య ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు గరివిడిలోని గోదావరిదేవీ షరాఫ్ ఇంగ్లిష్ మీడి యం స్కూల్లోను, 9, 10 తరగతులు కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో చదువుకుని సివిల్ ఇంజనీరింగ్ బిట్స్లో పూర్తిచేశారు. -
● మర్యాదపూర్వక కలయిక
వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన నేతలు తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి తమ జిల్లాల్లో అనూహ్యస్పందన లభించిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, విశ్వాసరాయి కళావతి, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలే రాజేష్ తదితరులు ఉన్నారు. – విజయనగరం/పాలకొండరూరల్ -
రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి
● సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సాయిదేవమణి విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీనియర్స్ పురుషుల ఖోఖో పోటీల్లో జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సాయిదేవమణి పిలుపునిచ్చారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు గుడివాడలో జరగనున్న అంతర్ జిల్లాల పురుషుల ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు కోచింగ్ క్యాంప్ను ఆమె కళాశాల ప్రాంగణంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కబడ్డీ, ఖోఖో క్రీడల్లో విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయికి ప్రాతినిధ్యం వహించిన ఘనత ఉందని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని సూచించారు. కళాశాలలో శిక్షణ పొందుతున్న జట్టుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖోఖో పితామహుడు పి.చిన్నంనాయుడు పీడీ ప్రసాద్, జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కె.గోపాల్ పాల్గొన్నారు. -
దుర్మార్గం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాలాంటి పేదవిద్యార్థుల కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొస్తే... నేటి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంది. ఇది దుర్మార్గం. పేదలు, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సరికాదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. – మీసాల శ్రీను, ముచ్చర్ల గ్రామం, గజపతినగరం మండలం ప్రజల ఆరోగ్యంతో ఆటలా..? ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరిస్తే పేదలకు ఉచిత వైద్యం అందదు. విద్యార్థులకు వైద్యవిద్య దూరం అవుతుంది. ప్రజల ఆరోగ్యం, పేద కుటుంబాల విద్యార్థుల చదువులతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాటకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. – బోడసింగి రఘు, బొడసింగిపేట గ్రామం, బొండపల్లి మండలం -
పెద్దగెడ్డ పనులకు కేంద్రం మొగ్గు
● రూ.78.22 కోట్ల ఎంసీఏడీ నిధులు మంజూరు ● పరిపాలనా అనుమతులు వస్తే పనులకు శ్రీకారం పెద్దగెడ్డ ప్రాజెక్టు బొబ్బిలి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి జలయజ్ఞఫలం పెద్దగెడ్డ ప్రాజెక్టు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ప్రాజెక్టు నుంచి అదనపు ఆయకట్టుకు సాగునీరందించే పనులకు ఎంసీఏడీడబ్ల్యూఎం(మోడిఫికేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలెప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్)పథకం కింద నిధులు విడుదల చేసింది. పరిపాలనా అనుమతులు వస్తే పనులు ప్రారంభంకానున్నాయి. ఈ ప్రాజెక్టును వైఎస్సార్ నిర్మించి జాతికి అంకిత మిచ్చారు. కుడి ప్రధాన కాలువ నుంచి 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఆ తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జైకా నిధులు రూ.28.18 కోట్లు మంజూరు చేయించారు. పనులు ప్రారంభించారు. పది శాతం పనులు జరిగాక ప్రభుత్వం మారడంతో జైకా పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. పరిపాలనా అనుమతులు రావాల్సి ఉంది పెద్దగెడ్డకు కొత్త పథకంలో అభివృద్ధి చేసేందుకు కేంద్రప్ర భుత్వం గుర్తించింది. ఎంసీఏడీ పధకం ద్వారా రూ.78.22 కోట్లు మంజూరయ్యా యి. వీటికి పరిపాలనా అనుమతులు రావాల్సి ఉంది. జంఝావతి పంప్ హౌస్ సిస్టం మరమ్మతుల కోసం రూ.56.50కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. – ఆర్.అప్పారావు, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్, బొబ్బిలి కేంద్రం గుర్తింపు... జంఝావతి అభివృద్ధికి ప్రతిపాదనలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆసియాలోనే మొట్టమొదటిగా ఏర్పాటుచేసిన రబ్బర్ డ్యాంతో కూడిన జంఝావతి ప్రాజెక్టు అభివృద్ధికి కొత్తగా రూ.56.50కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. గత ఏడాది, ఈ ఏడాది మరమ్మతులకు గురైనా పనులు చేపట్టలేదు. మొత్తం 23 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాల్సిన ఈ ప్రాజెక్టులో భాగమైన కంట్రోల్ రూమ్ పంపింగ్ ప్యానెల్, లైనింగ్, వన్ ఆర్ కెనాల్, లోయల్ కెనాల్ పనుల కోసం వెచ్చించేందుకు ఈ ప్రతిపాదనలను ఇటీవలే పంపించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎంసీఏడీడబ్ల్యూఎం పథకం కింద పెద్దగెడ్డను గుర్తించింది. దీని ప్రకారం ఎడమ కాలువకు పంప్ హౌస్ను నిర్మించి వాల్వ్ల ద్వారా ఆటోమేటిక్గా (నాన్మెన్) ఆయకట్టు పొలాలకు సాగునీరందించే పనులు జరగనున్నవి. ప్రెషర్ పైపుల ద్వారా సాగునీటిని ఆయకట్టుకు మళ్లించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇది పూర్తిగా కొత్తవిధానం. వాల్వులు, ప్రెషర్ పైపులతో నీటిని మళ్లించడం వల్ల సాగునీటి లీకులు ఉండవు. సిబ్బంది అవసరం ఉండదు. పూర్తి ఆటోమేటిక్గా నడిచే వ్యవస్థ కనుక దీనికి కేంద్రం ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఎడమ కాలువ ప్రాంతంలో ఉన్న కర్రివలస ఆనకట్టను అభివృద్ధి చేసి అక్కడి నుంచి కూడా కుడి, ఎడమ కాలువలను నిర్మించి ప్రాజెక్టును పూర్తిగా అభివృద్ధి చేస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను భరించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇరిగేషన్ వ్యవస్థకు రాష్ట్రం పెద్దగా నిధులు విదల్చకపోవడంతో ఈ కొత్త పథకానికై నా 40 శాతం నిధులు భరిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాల్సి ఉంది. మరోవైపు జైకా నిధులతో జరుగుతున్న పనులు ప్రస్తుతం నిలిపివేసినప్పటికీ కాంట్రాక్టర్ మళ్లీ పనులు చేపడితే కుడి కాలువ పనులు కొనసాగే అవకాశముంది. -
ఇదెక్కడి తీరు ‘బాబూ’..!
చీపురుపల్లి: ఒకే ఒక్క యూరియా బస్తా కోసం వేలకు వేలు ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి అప్పులు తేవాలి?.. వ్యవసాయం ఎలా చేయాలి?.. పంటలు పండించొద్దు అంటే చెప్పండి.. మానేస్తాం... కానీ ఇలా బస్తా యూరియా కోసం వేలకువేలు ఖర్చు చేయలేం.. ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎరువుల కోసం ఇన్నిపాట్లా అంటూ నిట్టూర్చారు. చీపురుపల్లి పట్టణంలోని శివరాం రోడ్డులో ఉన్న మనగ్రోమోర్ కేంద్రం వద్ద బుధవారం యూరియా కోసం వచ్చిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. యూరియా కావాలంటే పొటాష్, డీఏపీ, గడ్డి మందు కొనుగోలుచేయాలని, లేదంటే యూరియా ఇవ్వమని అక్కడి సిబ్బంది చెప్పడంతో రైతులు ఖంగుతిన్నారు. కొద్ది రోజుల కిందట నాలుగైదు వేలు వెచ్చించి మనగ్రోమోర్ సిబ్బంది చెప్పినవన్నీ కొనుగోలు చేశామని, అయినప్పటికీ యూరియా ఇవ్వడం లేదంటూ బిల్లుల తీసుకుని వచ్చిన మరికొందరు రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఏపీ, పొటాష్, గడ్డి మందు కొనుగోలు చేసిన వారికి కూడా యూరియా ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతన్న కష్టాలపై ఏకరువుపెట్టారు. రైతంటే గౌరవం పోయిందంటూ వాపోయారు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ ఏడీ ఎన్.కోటేశ్వరరావు, ఏఓ సూర్యకుమారి దుకాణం వద్దకు చేరుకున్నారు. ఏఓ సూర్యకుమారి స్వయంగా మనగ్రోమోర్ కౌంటర్లో కూర్చుని రైతులకు ఎలాంటి అదనపు కొనుగోళ్లు లేకుండా యూరియా పంపిణీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టంచేశారు. బస్తా యూరియా కోసం పొటాష్, గడ్డి మందు కొనుగోలు చేయాలా? వాటికోసం వేల రూపాయలు ఖర్చుపెట్టాలా? చీపురుపల్లిలో రైతుల ఆందోళన ఎరువుల దుకాణదారు తీరుపై ఆగ్రహం -
గ్రోత్లేని నాణ్యత..!
బొబ్బిలి: ఉత్తరాంధ్రలోనే చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నది బొబ్బిలి గ్రోత్ సెంటర్ ప్రాంతం. ఇక్కడ దాదాపు 370 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో చిన్నాపెద్దా కలిపి 140 వరకు పరిశ్రమలు నడుస్తున్నాయి. దాదాపు 35 ఏళ్ల కిందట ఇక్కడ నిర్మించిన ప్రధాన, అంతర్గత రహదారులు ఇప్పుడు గోతులమయమయ్యాయి. వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలాచోట్ల ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. గ్రోత్ సెంటర్కు వచ్చే.. ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలు 10 నుంచి 40 టన్నుల బరువు కలిగినవి ఉంటాయి. బెర్రీ, ఆర్వీఆర్ పరిశ్రమలకు వెళ్లే రోడ్లతో పాటు నారాయణప్పవలస వెళ్లే ప్రధాన రహదారి, ఎం.బూర్జివలస, గున్నతోట వలస,మెట్టవలస ప్రాంతాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. దీనిపై ఏపీఐఐసీ అధికారులు స్పందించారు. రోడ్ల దుస్థితితో పాటు పరిశ్ర,మలకు నీటిని సరఫరా చేసే మోటార్లు, స్లంప్లను బాగుచేసేందుకు ఎంఎస్ఈ డీపీ (మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రోత్ సెంటర్ అభివృద్ధి పనుల పేరున చేసిన ప్రతిపాదనలతో సుమారు రూ.2.20 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించడం, కొన్ని కంపెనీల వరకే రోడ్లును బాగుచేయడం వంటివి విమర్శలకు తావిస్తున్నాయి. ● కొన్ని కంపెనీలకే వీధి దీపాల వెలుగులు గ్రోత్ సెంటర్లో ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల్లో ఉన్న విద్యుత్ లైట్లు (వీధిలైట్లు) పనిచేయడం లేదు. దీంతో వీటి మరమ్మతుల కోసం రూ.20 లక్షల ఐలా నిధులు మంజూరు చేశారు. కానీ నేటికీ ఆ పనులు సాగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే కొన్ని లైట్లు వెలుగుతున్నాయి. మిగిలిన చోట్ల లైట్లు లేవు. ఇదే అదునుగా గ్రోత్ సెంటర్లో ఇటీవల కొన్ని టన్నుల ఇసుకను దొంగిలించుకుపోయిన సంగతి తెలిసిందే.! చర్యలు తీసుకుంటాం రోడ్ల మరమ్మతుల్లో నాణ్యత లోపించడంపై చర్యలు తీసుకుంటాం. లైట్లు, బుష్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. మొత్తం పనులన్నీ జరుగుతాయి. రోడ్ల మరమ్మతులు కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. – ఎం.మురళీమోహన్, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ తూతూమంత్రంగా గ్రోత్ సెంటర్లో రోడ్ల నిర్మాణం నాణ్యతకు తిలోదకాలు వేసిన రెండు నెలలకే గోతులమయమైన రోడ్లు హెరిటేజ్ వరకే పరిమితమైన మరమ్మతులు గ్రోత్సెంటర్లో 1140 ఎకరాల స్థలంలో 370 ప్లాట్ల వెంబడి తుప్పలు, డొంకలు చెట్ల మాదిరి పెరిగిపోతే కేవలం ఒకరిద్దరికి చెందిన వారికి మాత్రమే బుష్ క్లియరెన్స్ పనులు అప్పగించారు. కేవలం బుష్ క్లియరెన్స్ కోసమే రూ.14 లక్షలకు పైగా నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు మాత్రం ఉమ్మితడిగానే జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని రోడ్లు కనిపించనంతగా డొంకలు పెరిగాయంటే బుష్ క్లియరెన్స్ జరిగిన తీరును అర్థం చేసుకోవచ్చు. -
ఇలాగైతే కష్టం.. వెళ్లిపోతాం..
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఏమయ్యా ఆఫీసర్లు.. నేను చెబితే వినరా..? ఏం.. నాకేం తక్కువ.. నాకు పవర్ లేదా..? నేను మీ అమ్మగారికే అయ్యగార్ని.. అంటే నేనే ఎక్కువ పవర్ ఫుల్.. కాబట్టి నేను చెప్పేది టకటకా నోట్ చేసుకుని ఫటఫటా చేసేయాలి. నేను వద్దన్న చోట ఉపాధి హామీ పనులు గట్రా శాంక్షన్ ఇవ్వకండి.. అంతా మనం చెప్పినట్లే అవ్వాలి.. మనం చెప్పినవాళ్లకే ఇవ్వాలి. ఇదీ ఆయనగారి దాదాగిరి. మళ్లీ గెలుస్తామో లేదో.. ఇప్పుడే ఎంతైనా పవర్ చూపేయాలి.. అనే ఆతృతతో అసంబద్ధంగా ఇష్టానుసారం అధికారులపై స్వారీ చేస్తున్నారు. ఈయన తొందర.. తుత్తర వ్యవహారంతో భరించలేని అధికారులు ‘ఆయనకు తెలియదు.. చెబితే వినడు.. ఇక్కడ ఉద్యోగం చేయడం కన్నా సెలవుపై పోవడం’ మేలు అంటూ ఒక్కొక్కరుగా విధుల నుంచి తప్పుకుంటున్నారట. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 105 పంచాయతీలు ఉండగా ఆయా పంచాయతోల్లో అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో మండలానికి రూ.20 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. పంచాయతీలు తీర్మానం చేసుకుని ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. చాన్నాళ్లకు నిధులు రావడంతో పల్లె ప్రజల అవసరాలు తీర్చేలా సర్పంచులు, ఎంపీటీసీలు సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు వంటివి చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకారం అధికారులు కూడా పనులకు ఆమోదం తెలిపారు. అంతే... ‘లోకం’మెచ్చిన పనులను అడ్డుకునేందుకు అమ్మగారి భర్త రంగంలోకి దిగారు. తాము ఎక్కడ చెబితే అక్కడే పనులు చేపట్టాలంటూ అధికారులను బెదిరిస్తున్నారు. అమ్మగారి పీఏ కూడా ‘రాజు’ అవతారంలో అధికారులకు ఆదేశాలు జారీచేసేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను కూడా ఆపాలని చెబుతుండడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. చేస్తే మేము చెప్పినట్లు చేయండి.. లేదా సెలవుపై వెళ్లిపోండి అని వాళ్లిద్దరూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఒక జేఈ స్థాయి అధికారి ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. పనులు నిలిపివేసి...నెల్లిమర్ల ఎంపీపీ అంబళ్ల సుధారాణి స్వగ్రామం ఒమ్మి పంచాయతీలో చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని ఉపాధిహామీ నిధులతో ఇటీవల శ్రీకారం చుట్టారు. జేసీబీలను ఏర్పాటు చేసి కాలువ పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న అయ్యగారు, సహాయకుడు ఫీల్డ్లోకి వెళ్లి రచ్చరచ్చ చేశారు. ఎవరికి చెప్పి పనులు చేస్తున్నారని అక్కడున్న కూలీలతో వాగ్వాదానికి దిగారు. వెంటనే జేఈ, డీఈలకు ఫోన్చేసి తక్షణమే పనులు ఆపాలంటూ హుకుంజారీచేశారు. అభివృద్ధి పనులు ఆపడంతో అక్కడున్న స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము లేనప్పుడు వచ్చి పనులు ఆపారని... ఈ సారి గ్రామంలోకి వస్తే తమ సత్తా చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారట. కొత్తపేట గ్రామంలో కూడా సీసీ రోడ్డు పనులను ఇదే తరహాలో నిలిపివేశారు. అసంబద్ధమైన ఆలోచనలతో తమను బెదిరిస్తున్న ప్రజాప్రతినిధి భర్తతో వేగలేక పోతున్నాం అంటూ ఉపాధిహామీ అధికారులు లోలోన బాధపడుతున్నారు. ఈయనకు పాలసీ తెలియదు.. చెబితే వినేరకం కాదు. ఇలా అడ్డదిడ్డంగా వాదిస్తూ విరుచుకుపడితే ఉద్యోగాలు ఎలా చేస్తాం అని మదనపడుతూ అధికారులు సెలవుపై వెళ్లిపోతున్నారని ఉద్యోగవర్గాల సమాచారం. ఇప్పటికే నెల్లిమర్ల, డెంకాడ జూనియర్ ఇంజినీర్లు, డీఈ సెలవుపై వెళ్లిపోయారు. కొన్నాళ్లు ఆగి వద్దాం.. అప్పటికి వేరే చోట పోస్టింగ్ వెతుక్కుందాం.. ఈ తలనొప్పులు లేకుండా ఉద్యోగం చేసుకునే చోట పోస్టింగ్ దొరికితే మేలు అనే భావనలో వారున్నారని తెలుస్తోంది. భోగాపురం, పూసపాటిరేగ జూనియర్ ఇంజినీర్లు కూడా అయ్యగారి మెహర్బానీతో భరించలేక సెలవుమీద వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. భార్య అధికారంతో అధికారులపై భర్త స్వారీ గ్రామాల్లో తాము చెప్పే పనులే చేపట్టాలని హుకుం ఉపాధి హామీ పనుల్లో జోక్యం అనుమతులు ఇవ్వద్దని అధికారులపై ఒత్తిడి సామూహికంగా సెలవుకు ఇంజినీరింగ్ అధికారుల నిర్ణయం -
విద్యార్థి మరణానికి పూచీకత్తు..!
గుమ్మలక్ష్మీపురం: ఇటీవల కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలతో పార్వతీపురం మన్యం జిల్లాలోని పలువురు విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరడం, కొందరు మరణించడం షరామామూలుగా మారింది. అయితే... ఓ పదో తరగతి విద్యార్థి మృతిని దాచిపెట్టడం, మృతికి తాము కారణం కాదంటూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులతో పాఠశాల హెచ్ఎం పేరున పూచీకత్తుపత్రం రాయించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల సిబ్బంది తీరుపై గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. మరణానికి కారణం ఏదైనా కావచ్చని, పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులతో పూచీకత్తు రాయించడం గతంలో ఎన్నడూ చూడలేదంటూ మండిపడుతున్నారు. గిరిజన సంక్షేమశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సంధ్యారాణి సొంత జిల్లాలోనే విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందంటూ విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తాడంగి అవిష్ (15) అనారోగ్యంతో ఈ నెల 14న మృతి చెందాడు. అవిష్ది గుమ్మలక్ష్మీపురం మండలం వాడజంగి గ్రామం. విద్యార్థి చిన్నాన్న కుమార్తె ఈ నెల 13న మృతి చెందింది. ఆమె అంత్యక్రియల కోసం పాఠశాలకు వచ్చి అవిష్ను ఇంటికి తీసుకెళ్లారు. మరుసటిరోజు అవిష్ అకస్మాత్తుగా మృతిచెందాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా పాఠశాల సిబ్బంది జాగ్రత్తపడ్డారు. ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అవిష్ మృతి చెందాడని, ఈ ఘటనకు పాఠశాల సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదంటూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు డెక్కన్న, డోరమ్మ రాతపూర్వకంగా తెలియజేసినట్టు వారితో వేలిముద్రలు వేయించారు. పాఠశాల సిబ్బంది అమానవీయంగా రాయించుకున్న పూచీకత్తు పత్రం ఇప్పుడు వెలుగు చూడడంతో గిరిజన సంఘాల నాయకులు, మేధావులు విస్తుపోతున్నారు. అందివచ్చిన కుమారుడి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చాల్సిన సిబ్బంది ఎవరి సూచనల మేరకు ఇలా పూచీ కత్తు పత్రం రాయించారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరణానికి కారణాలు ఏవైనా కావచ్చని, నిరక్షరాస్యులైన గిరిజనులతో వేలిముద్రలు వేయించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవంగా మృతిచెందిన అవిష్ ఏడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. విద్యార్థికి వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం చేసినట్టు సమాచారం. విద్యార్థి మృతిని గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం అర్థంకాని ప్రశ్నగా మారింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన భగ్గుమంటున్న గిరిజన సంఘాలు ఇలాంటిది ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన నిరక్షరాస్యులైన తల్లిదండ్రులతో వేలిముద్రలు -
క్లాట్లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ
బొబ్బిలి: పట్టణానికి చెందిన వేమిరెడ్డి నితిన్ చంద్ర మంగళవారం విడుదలైన క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్–26) ఫలితాల్లో జాతీయ స్థాయిలో 90వ ర్యాంకు సాధించాడు. ఓబీసీలో 5వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. క్లాట్లో కుమారుడు ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు శ్యామల, బాబూరావు సంతోషం వ్యక్తంచేశారు. పట్టణ వాసులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నితిన్చంద్రను అభినందించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన బెంగళూరు లా యూనివర్సిటీలో మాస్టర్స్ లా చేసి ప్రజలకు న్యాయ సేవలందించడమే ఆశయమని నితిన్ తెలిపాడు. పశుగ్రాస కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన విజయనగరం అర్బన్: ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయవచ్చని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రారంభమైన ముఖ్యమంత్రితో కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాస కేంద్రాల ఏర్పాటువల్ల పాలఉత్పత్తి పెరగడంతో రైతులు, పాడి రైతుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుందని తెలిపారు. జాతీయ స్థాయి క్విజ్ పోటీలకు వెటర్నరీ విద్యార్థులు చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలకు చెందిన విద్యార్థులు క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపారు. సొసైటీ ఆఫ్ యానిమల్ ఫిజియాలజిస్టు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన దక్షిణ భారత క్విజ్ పోటీల్లో కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి.జ్ఞాన సంధ్యారాణి, తృతీయ సంవత్సరం చదువుతున్న వి.సంజనశర్మ విజేతలుగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను కళాశాలలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. క్విజ్ పోటీలు విద్యార్థుల మేధోశక్తికి దోహదపడతాయన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించి కళాశాలకు పేరుతీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల అధికారి డా.వై.ఆర్.అంబేడ్కర్, అకడమిక్ అధికారి దీపిక, డిపార్ట్మెంట్ హెడ్ టి.ప్రసాదరావు, గంగునాయుడు, రాజీవ్, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి సహకరించండి విజయనగరం ఫోర్ట్: అంతర్జాతీయ స్థాయిలో మహిళల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని యూఎస్ (యునైటెడ్ స్టేట్స్) ఎంబసీ ప్రతినిఽధి ఆడమ్ హాల్కు స్థానిక వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది కోరారు. వన్స్టాప్ సెంటర్ను బుధవారం ఆడమ్ హాల్ సందర్శించా రు. వన్స్టాప్ సెంటర్లో మహిళలకు అందిస్తున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు చెందిన మహిళలకు యూఎస్ లో పాస్పోర్టు, వీసా, ఎంబసీ వంటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సిబ్బంది ఆయనను కోరారు. మహిళలకు వసతి, రక్షణ సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ చీఫ్ శ్రీదేవి, వన్స్టా ప్ అడ్మినిస్ట్రేటర్ పరవాడ సాయి విజయలక్ష్మి, ఏఎస్ఐ శోభారాణి, తదితరులు పాల్గొన్నారు. -
నేరాలు,దారుణాలు పట్టించుకోరా?
● పోలీసులకు సవాల్గా నిలుస్తున్న దోపిడీలు, చోరీలు, హత్యలు కొత్తవలస: మండలంలో వరుస దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, యథేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతున్నా కనీసం పట్టించుకునే పోలీసులే కరువయ్యారు. ఈ అంశాలపై కేసులు నమోదు చేయడమే తప్ప అరెస్టులు, రికవరీలు, దొంగలను పట్టుకునే పరిస్థితి ఏమీ లేకపోవడం గమనార్హం. కొత్తవలస మండలంలోని జరిగిన ఘటనల వివరాలు ఆగస్టు 26, 2024లో ఒక లారీలో 450 కేజీల గంజాయిని విశాఖపట్నం తరలిస్తుండగా అరకు–విశాఖ రోడ్డులో అప్పన్నపాలెం గ్రామం సమీపంలో పోలీస్లకు అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇవ్వండంతో లారీని పట్టుకున్నారు. కాగా పోలీసులను చూసి నిందితులు పరరయ్యారు. లారీని సీజ్ చేసి 450 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నేటికీ నిందితులను పట్టుకోలేదు. కేసును మూసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ● మండలంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంటో ఈ ఏడాది మే నెల 28వ తేదీన దొంగలు పడి సుమారు మూడు కేజీల బంగారం, రూ 5 లక్షలకు పైగా నగదు దోచుకు పోయారు.ఈ కేసును పోలీసులు ప్రతిస్టాత్మకంగా తీసుకుని అప్పటి జిల్లా ఎస్పీ స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయినా నేటికీ అనుమానితులను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. ఒక్క పైసా నగదు, గ్రాము బంగారం రికవరీ చేయలేదు. ఈ దొంగతనం జిల్లా చరిత్రలోనే అతి పెద్దది కావడం విశేషం. ● అలాగే ఈ ఏడాది నవంబర్ 14న చింతలపాలెం గ్రామం సమీపంలో గల మీసాల రవిప్రకాష్ ఇంటిలో రాత్రి 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు అందరూ నిద్రిస్తుండగా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను కొట్టి బంధించి రూ.24 వేల నగదు, కొంత బంగారాన్ని దోచుకుపోయారు. నేటికీ ఈ కేసులో అనుమానితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ● గత నెల 15న వియ్యంపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దూది రాము (మహిళ)ను ఇంటిలోనే దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో అనుమానితులను నేటికీ పట్టుకోలేకపోయారు. ● ఇలా చెప్పుకుంటూ పోతే మంగళపాలెం గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలోను, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల ఆటోమైబెల్ షాపులోను దొంగలు పడి దోచుకుపోయినా నేటికీ పోలీసులు గుర్తించలేదు. ● స్వయాన రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనంగాా నిలుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
వెబ్ల్యాండ్ ప్రాతిపదికన రీసర్వే చేయాలి
పార్వతీపురం: వెబ్ల్యాండ్ ప్రాతిపదికన భూముల రీసర్వేను పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశమందిరంలో రెండవ విడత రీసర్వేపై గ్రామ సర్వేయర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత రికార్డులు, కొత్త డిజిటల్ మ్యాపింగ్ వివరాలను సరి పోల్చి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా రీసర్వే చేపట్టాలని సూచించారు. రైతులనుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించి రీసర్వేపై నమ్మకం కలిగించాలని చెప్పారు. తహసీల్దార్లు, సర్వేయర్లు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రతి మండలంలో రోజువారీ పురోగతి నివేదికలను పంపించాలని కోరారు. ప్రతి గ్రామంలో అసైన్మెంట్ రిజిస్టర్ను మెయింటైన్ చేయాలని చెప్పారు. ఒరిజినల్ పట్టాదారు కానప్పుడు వారికి పీఓటీ యాక్ట్ ప్రకారం నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూమి జిరాయితీగా మార్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెటిల్ చేసిన ఈనామ్ భూములకు ఈనామ్ రైత్వారీ పట్టా అని క్లాసిఫికేషన్ పెట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి పి.లక్ష్మణరావు, పార్వతీపురం, పాలకొండ డీఐఓఎస్లు, రీసర్వే తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి -
జిల్లా ఆస్పత్రిలో ‘బర్త్ వెయిటింగ్ హోమ్’
● పరిశీలించిన జిల్లా జేసీ యశ్వంత్ కూమర్ రెడ్డి పార్వతీపురం రూరల్: మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులకు మెరుగైన ప్రసవ సేవలందించేందుకు జిల్లా ఆస్పత్రిలో ‘బర్త్ వెయిటింగ్ హోమ్’ ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ కేంద్రాస్పత్రిలో రూ. 11.50 లక్షల వ్యయంతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆస్పత్రికి వచ్చే రోగులకు, ముఖ్యంగా గర్భిణులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారిణి డాక్టర్ పద్మావతి, ఆర్ఎంవో డాక్టర్ శ్యామల పాల్గొన్నారు.రెండు గడ్డివాములు దగ్ధంబొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్వీ.రవిప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో గొర్లె బంగారునాయుడికి చెందిన రెండు గడ్డివాములపై గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చిపడేయడంతో మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతయ్యాయి. సూమారు రూ.15 వేలు ఆస్తినష్టం సంభవించగా, పక్కన ఉన్న గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. రెండు తులాల బంగారం చోరీజియ్యమ్మవలస రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దొంగలు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి బరి తెగిస్తున్నారు. బుధవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చినకుదమ గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న నల్ల నారాయణమ్మ ముఖానికి మత్తు మందు కొట్టి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారం తాడును ఎత్తికెళ్లినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. తాను పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఎదురుగా మోటార్ బైక్పై వచ్చిన వ్యక్తి కనీసం ముఖానికి మాస్క్, హెల్మెట్ కానీ లేకుండా వచ్చి మత్తు మందు చల్లడంతో ఆ క్షణంలో ఏం జరిగిందో తనకు తెలియలేదని తెలిపింది. పరజపాడు గ్రామంలోని శివాలయంలో హుండీ కానుకలను మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ఓ దొంగ చాకచక్యంగా దోచుకున్న ఘటనపై చినమేరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై అనీష్ తెలిపారు. వైఎస్సార్సీపీలో నూతన నియామకాలువిజయనగరం: రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన నియామకాలకు సంబంధించిన జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గజపతినగరానికి చెందిన ఇజ్జరోతు రామునాయుడు, కార్యదర్శిగా బొబ్బిలికి చెందిన బొమ్మి అప్పలనాయుడు నియామకమయ్యారు. అదేవిధంగా జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుడిగా రాజాంకు చెందిన మరిశర్ల గంగారావుకు బాధ్యతలు అప్పగించగా.. ఎస్కోట నియోజకవర్గ అధ్యక్షుడిగా గోపాల కృష్ణారావు, విజయనగరం నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎం.పరమేశ్వరరావు, చీపురుపల్లి నియోజకవర్గం అధ్యక్షుడిగా సింగవరపు రామకృష్ణ, నెల్లిమర్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా బోని చంద్రరావు నియామకమైనట్లు జాబితాలో పేర్కొన్నారు. -
పట్టాపగ్గాల్లేని ఆరాటం..!
అస్తమిస్తున్న సూర్యుడు రేపటి కొత్త ఆశలకు సంకేతం. మనిషి జీవిత కాలం కూడా ఉదయించే సూరీడులాగానే ప్రయాణించాలి. కానీ గమ్యంలేని రైలు పట్టాలు దాటి ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించేందుకు ఆరాటపడుతున్నారు కొందరు. ముందు వెనకా చూసుకోకుండా విజయనగరం జిల్లా కేంద్రంలోని వీటీ అగ్రహారం రూట్లో కోర్టుకు వచ్చే మార్గంలో బ్రిడ్జి ఉన్నా కొందరు మాత్రం పట్టాలపై నుంచి ప్రయాణాలు సాగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా వారు మారకపోవడంతో ఇక ఆ పైవాడిదే భారం అంటూ వదిలేయాల్సి వస్తోంది. – డి.సత్యనారాయణమూర్తి, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం ప్రమాదకరంగా ప్రయాణం -
టీచర్ల కామన్ సర్వీస్ రూల్స్కు తొలగిన అడ్డంకులు
● ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడువిజయనగరం అర్బన్: కొన్నేళ్లుగా కోర్టుల్లో వివాదాలతో నడుస్తున్న టీచర్ల కామన్ సర్వీసు రూల్స్ అంశానికి అడ్డంకులు తొలగాయని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 26 జిల్లాలను రాష్ట్రపతి అనుమతించి గెజిట్ ఇటీవల విడుదలైందని ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని జోన్, డివిజన్, జిల్లా ప్రామాణికాలు రద్దవుతాయన్నారు. నూతనంగా ఏర్పడిన 26 జిల్లాలు, జోన్లు ప్రామాణికంగా తీసుకుని జిల్లాపరిషత్, మున్సిపాలిటీ, ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలన్నింటి నిర్వహణ విద్యాశాఖలోకి తీసుకురావడానికి రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. గెజిట్ను అమలు చేయడానికి ముందుగా ఉన్నతాధికారులతో కమిటీ వేసి రాష్ట్రప్రభుత్వం అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. కామన్ సీనియారిటీ ఆధారంగా లోకల్ కేడర్, నిబంధనలు, పదోన్నతుల ప్రక్రియకు మార్గదర్శకాలను కమిటీ కనీసం 27 రోజుల మినిమమ్ కాలవ్యవధిలో రూపకల్పన చేయాల్సి ఉంటుందని వివరించారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవుల వయోపరితిని సర్వీసులో ఉన్నంత వరకు పెంచడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. 2004 సెప్టెంబర్ తరువాత ఉద్యోగాల్లో ప్రవేశించిన వారికి వర్తింప చేసిన సీపీఎస్ పెన్షన్ స్కీం అప్పడికే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు రాసి ఉద్యోగాలకు పెంపికై న వారికి సీపీఎస్ కాకుండా పాత పెన్షన్ స్కీం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.రవీంద్రనాయుడు, డి.శ్రీనివాస్, పీఆర్టీయూ ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జ్ బంకపల్లి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ తల్లిదండ్రుల దాతృత్వానికి సత్కారం
● రోడ్డు ప్రమాదంలో మరణించిన కుమారుడి అవయవ దానం ● తల్లిదండ్రుల గొప్పతనాన్ని గుర్తించి సత్కరించిన మానవీయత సంస్థచీపురుపల్లిరూరల్(గరివిడి): కన్నకొడుకు మరణించాడని తెలిసినా, ఇక ముందు తమ కుమారుడు తమముందు కనిపించడని తెలిసినా, తమ కొడుకు మరణం మరో పది మందికి జన్మనివ్వాలనే ఆశయంతో దుఃఖంలో కూడా కొడుకు అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు తమ దాతృత్వం చాటుకున్నారు. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన టొంపల సుమంత్ రాజాంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఏజెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈనెల 13న విధులు ముగించుకుని రాజాం నుంచి చీపురుపల్లి వైపు ఆటోలో వస్తుండగా ఓ వ్యాన్ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమంత్ను శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా బ్రెయిన్డెడ్గా వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ మేరకు సుమంత్ తల్లిదండ్రులు రమణ, ఆరుద్రలు కొడుకు మరణించిన బాధలో ఉండి కూడా కొడుకు అవయవాలను దానం చేశారు. ఆ తల్లిదండ్రుల దాతృత్వాన్ని గుర్తించిన చీపురుపల్లి పట్టణానికి చెందిన మానవీయత స్వచ్చంద సంస్థ వ్యవస్ధాపకుడు, రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ గోవిందరాజులు గ్రామంలోనికి బుధవారం వెళ్లి సుమంత్ తల్లిదండ్రులను సత్కరించారు. 12 మందికి పునర్జీవం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కొడుకు అకాల మరణంతో చెప్పలేని దుఖంలో ఉన్నప్పటికీ కొడుకు అవయవాలైన కిడ్నీలు, కాలేయం, హృదయం, నేత్రాలు దానం చేసి మరో 12 మందికి పునర్జీవం కల్పించారని ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లాలోని జెమ్స్ హాస్పిటల్లో జరిగిన ఈ అవయవాల దానం గ్రీన్ఫీల్డ్ ద్వారా పంపించి అవసరమైన వారికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ జనరల్ సెక్రటరీ రామ్మూర్తినాయుడు, స్థానిక ఎంపీటీసీ టి.సంజీవ్ ఉన్నారు. -
లగ్జరీ బస్సును ఢీకొట్టిన లారీ
గజపతినగరం: మండలంలోని మరుపల్లి గ్రామం జంక్షన్ వద్ద లగ్జరీ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుంచి గజపతినగరం మీదుగా ప్రయాణిస్తూ మరుపల్లి గ్రామం సమీపంలో ఒక ఆర్టీసి పల్లె వెలుగు బస్సు ఆగి ఉంది. దాని వెనుక వస్తున్న వస్తున్న లగ్జరీ ఆర్టీసీ ఎక్స్ప్రెస్బస్సు ఆగి కొంతసమయం తరువాత ఆగి ఉన్న పాసింజర్ బస్సును తప్పించి కుడివైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో వెనుక నుంచి లగ్జరీ ఆర్టీసీ బస్సును లారీ డ్రైవర్ బలంగా ఢీకొట్టాడు.ఆతరువాత బైక్ను కూడా లారీ డ్రైవర్ ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో గాయాలపాలయిన డి.అప్పలనాయుడు(రేగిడి),కె.సూర్యప్రకాష్ (మిర్తివలస),పి.శ్రీను(గజపతినగరం మండలం మరుపల్లిగ్రామం),కె.మురళీకృష్ణ(గజపతినగరం మండలం మరుపల్లి గ్రామం),ఎన్.అప్పారావు(గంట్యాడ మండలం నరవ గ్రామం)లను గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.బస్సు డ్రైవర్ సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురికి గాయాలు -
ఘనంగా పెన్షనర్స్ డే
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెన్షనర్స్ దినోత్సవాన్ని బుధవారం స్థానిక సంఘం భనవనంలో ఘనంగా నిర్వహించారు., జిల్లా శాఖ అధ్యక్షుడు రామచంద్రపాండా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు దాటిన పలువురు సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులను సంఘం ఘనంగా సత్కరించింది. అనంతరం పలువురు మాట్లాడుతూ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కలిపి బకాయిలు ఉన్న సుమారు రూ.35 వేల కోట్లను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పి.రామచంద్రరావు, ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్శి ఎల్వీ యుగంధర్, జిల్లా కార్యదర్శి బలివాడ బాల భాస్కర్రావు, కార్యనిర్వాహక కార్యదర్శి పక్కి భూషణ్రావు, పెన్షనర్స్ ఎస్టీఓ నూకరాజు, కోశాధికారి సొంటి కామేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.ఆదినారాయణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, డ్రైవర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రామారావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 100 మంది పెన్షనర్లకు సన్మానంఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలిండియా పెన్షనర్స్డే కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా 100 మంది వృద్ధ పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు వి.సూర్యనారాయణ, కార్యదర్శి త్రినాఽథ్ ప్రసాద్తో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు, జిల్లావ్యాప్తంగా పెన్షనర్లు హాజరయ్యారు. -
స్వచ్ఛగ్రామంగా అంటిపేట రూపుదిద్దుకోవాలి
సీతానగరం: మండలంలోని అంటిపేట పంచాయతీ స్వచ్ఛగ్రామంగా రూపుదిద్దు కోవాలని సబ్కలెక్టర్ ఆర్ వైశాలి అన్నారు. ప్రతిపాదిత స్వచ్ఛగ్రామం అంటిపేటను సబ్కలెక్టర్ ఆర్ వైశాలి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛగ్రామంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో ఎక్కడా చెత్తకనిపించరాదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు శుద్ధి చేసుకుని స్వచ్ఛమైనగ్రామంగా తీర్చి దిద్దుకోవాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, సర్పంచ్ బి.తిరుపతిరావు, ఎంఈఓ సూరిదేముడు,ఇంజినీరింగ్ అధికారులు, గ్రామపెద్దలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కోటసీతారాంపురంలో మౌలికవసతుల కల్పనమండలంలోని కోటసీతారాంపురం గ్రామంలో ప్రజావసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం నిమిత్తం సబ్కలెక్టర్ ఆర్. వైశాలి బుధవారం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు. గ్రామాన్ని వ్యవసాయ, ఆర్ధిక,వాణిజ్య, విద్యాపరంగా అభివృద్ది పధకంలో నడిపించడానికి అవసరమైన వసతులు కల్పించడానికి వనరులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం రైతు సేవాకేంద్రం ఆవరణలో గ్రామ పెద్దలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగుల నుంచి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అభిప్రాయాలను సేకరించారు. -
బైక్, మినీ వ్యాన్ ఢీకొని మహిళ మృతి
చీపురుపల్లి: పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు ఆదిలక్ష్మి(25) మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజాంకు చెందిన బల్ల జగదీష్, ఆర్.ఠాగూర్లతో కలిసి చీపురుపల్లి పట్టణంలోని కూరాకుల వీధికి చెందిన పొందూరు ఆదిలక్ష్మి ద్విచక్ర వాహనంపై చీపురుపల్లి నుంచి రాజాం వెళ్తున్నారు. జీవీఆర్ కళాశాల వద్ద ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న మినీ లగేజ్ వ్యాన్ను బైక్తో ఢీకొట్టారు. దీంతో ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. జగదీష్కు చేయి విరిగింది. ఠాగూర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహాన్ని చీపురుపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ జి.శంకరరావు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తోటపాలెంలో పశువైద్య సేవలు విజయనగరం అర్బన్: స్థానిక పట్టణంలోని తోటపాలెం సత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం పశువైద్య సేవలు అందించారు. పశు వైద్యులు మోహన్..పాడిరైతులు తీసుకువచ్చిన మూగజీవాలకు ఆరోగ్య తనిఖీలు నిర్వహించి, అవసరమైన వాటికి మందులు అందజేశారు. అలాగే వ్యాధులు రాకుండా నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి తదితరులు పాల్గొన్నారు. -
మనమిత్రతో పోలీసు సేవలు సులభతరం
● ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం క్రైమ్: ‘మనమిత్ర‘ అనే వాట్సాప్ గ్రూప్తో పోలీసు సేవలు మరింత సులభతరం చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం అన్నారు. డిజిటల్ పాలనలో భాగంగా పోలీస్ సేవలు మరింత సులభతరంగా, త్వరితంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో వాట్సాప్ గవర్నెన్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువ చ్చామన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే పోలీసు సేవలను పొందవచ్చునన్నారు. ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, ఈచలాన్ వివరాలు వంటివి సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే సులభంగా పొందవచ్చన్నారు. ఈ సేవలను పొందేందుకు ప్రజలు ముందుగా 9552300009 సెల్ నంబరును వారి మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకుని, ఆ నంబర్కు ఏజీ అని మెసేజ్ చేయగానే వివిధ రకాల ప్రభుత్వ సేవలు వివరాలు మొబైల్ కు వస్తాయన్నారు. అందులో పోలీసుశాఖ సేవలను ఎంచుకుని, ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ స్థితి, ఈచలాన్ వివారాలు సులభంగా ఇంటివద్ద నుంచే పొందవచ్చన్నారు. క్యుఆర్ కోడ్ ను స్కాన్ చేసి కూడా పైన తెలిపిన పోలీసు సేవలు తక్షణమే పొందవచ్చునన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, పోలీసు ఆఫీసులలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని ద్వారా ప్రజల సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. -
వెబ్సైట్లో మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఐదు పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను విజయనగరం.ఎన్ఐసి.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రభుత్వ వైద్యకళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ అసిస్టెంట్కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, పీఈటీ, లైబ్రరీ అసిస్టెంట్, స్పీచ్ థెరపిస్టు, సైకియాట్రీ సోషల్ వర్కర్ తదితర ఏడు కేటగిరీల పోస్టులకు సంబంధించిన షార్ట్లిస్ట్ను కూడా వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్–3, ఎలక్ట్రికల్ హెల్పర్, స్టోర్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల జాబితాను కూడా పొందుపరిచామని చెప్పారు. వీటిపై అభ్యంతరాలుంటే ఈ నెల 19వ తేదీలోగా ప్రభుత్వ వైద్య కళాశాలలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. 400 క్యూసెక్కుల నీరు విడుదల వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు కుడి ప్రధాన కాలువకు అధికారులు సాగునీటి సరఫరాను పెంచారు. రబీ పంటల సాగుకోసం ఇటీవల 200 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టగా... ప్రస్తుతం మరో 200 క్యూసెక్కుల నీటిని పెంచి 400 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద 64.60 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు ఆయన వెల్లడించారు. సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు మహారాణిపేట: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకారులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి. విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు(55) నగరంలోని జాలరిపేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 12న ఫిషింగ్ హార్బర్ నుంచి ఐఎన్డీ ఏపీవీ5, ఎంఎం 872 నంబర్ గల బోటులో రాములుతో సహా మొత్తం ఎనిమిది మంది మత్స్యకారులు వేటకు బయలుదేరారు. హార్బర్ నుంచి తూర్పు వైపు విశాఖకు 70 మైళ్ల దూరంలో వారు చేపల వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి 8.30 గంటల సమయంలో వేటలో ఉండగా.. రాములు ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి మత్స్యకారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న ఇతర బోట్ల మత్స్యకారులకు సమాచారం అందించి వారి సాయంతో వెతికినా.. రాములు ఆచూకీ లభించలేదు. దీంతో బోటు డ్రైవర్ వాసుపల్లి లక్ష్మణరావు విషయాన్ని హార్బర్ అసోసియేషన్ నాయకులకు చేరవేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బోటు హార్బర్కు చేరుకోగానే మత్స్యకారులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురుకులంలో ఆకలికేకలపై స్పందించిన అధికారులు భామిని: సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని ఎంపీడీవో ఎస్.వసంతకుమారి మంగళవారం సందర్శించారు. సాక్షిలో ఈ నెల 15న ‘గురుకులంలో ఆకలికేకలు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఎంపీడీవో వసంతకుమారి గురుకులాన్ని సందర్శించి ప్రిన్సిపాల్ విజయనిర్మలతో కలిసి వంట గదిని నిశితంగా పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడంపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యార్థులకు భోజనం పెట్టకపోవడంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్, సిబ్బంది వహించాలన్నారు. చేసిన వంటలను పరిశీలించి మెనూ ప్రకారం అమలు చేయాలని సూచించారు. గురుకుల సిబ్బంది ఉన్నారు. -
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఆరికతోట విద్యార్థులు
రామభద్రపురం: ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మండలంలోని ఆరికతోట ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బి.రత్నకిషోర్ తెలిపారు.అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించింది. బాలుర జట్టు ద్వితీయ స్థానం సాధించిందన్నారు. అందులో ఆంఽధ్రప్రదేశ్ తరఫున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే 16 మంది సభ్యులలో తమ పాఠశాలకు చెందిన రేజేటి శ్రావణి, బాలుర జట్టు తరఫున ఎం.రంజిత్ కుమార్లు ఎంపికై నట్లు తెలిపారు. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల హెచ్ఎం జి కృష్ణవేణి, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. -
తిరుగు ప్రయాణంలో భవానీ భక్తుడి మృతి
చికెన్● గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రమాదంపాలకొండ రూరల్: ఆధ్యాత్మిక చింతనతో భవానీ మాల ధరించిన పట్టణంలోని 16వ వార్డు కుమ్మరివీధికి చెందిన ద్రాక్షవరపు రాంబాబు(36) కూరగాయల మార్కెట్లో కలాసీగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీక్ష ముగింపులో భాగంగా ఈ నెల 12న సహ దీక్షాధారులు 19 మందితో కలసి ప్రత్యేక వాహనంలో విజయవాడ పయనమయ్యారు. అమ్మవారి దర్శనం అనంతరం మాల విసర్జన పూర్తి చేసి 13వ తేదీన తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో తమ వాహనం పుణ్యక్షేత్రం అన్నవరం సమీపంలో పత్తిపాడు ప్రాంతం వద్దకు చేరుకున్న క్రమంలో బహిర్భూమికి వెళ్లేందుకు వాహనం దిగివెళ్లిన రాంబాబు ఎంతసేపటికీ వాహనం దగ్గరకు చేరలేదు. తన వద్ద సెల్ఫోన్కుడా లేకపోవడంతో సహచరులు ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో మరునాటి ఉదయం వరకూ వాహనం నిలిపిన ప్రదేశంలో ఎదురు చూసి 14వ తేదీ ఉదయం అన్నవరం పోలీస్ స్టేషన్లో సహ భవానీలు ఫిర్యాదు చేశారు. పాలకొండ వచ్చిన వారికి మంగళవారం రాంబాబు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన నట్లు పోలీసుల నుంచి సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు, ఆ వార్డు కౌన్సిలర్ కడగల వెంకట రమణ అన్నవరం పయనమయ్యారు. దగ్గరుండి పోస్టుమార్టం పూర్తి చేయించి, రాంబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. మృతునికి భార్య రాజేశ్వరి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ బంధువులు కన్నీరుపెట్టారు. -
వచ్చేనెల 8 నుంచి పండగ సర్వీసులు
విజయనగరం అర్బన్: సంక్రాంతి పండగ కోసం జిల్లాలోని స్వగ్రామాలకు రాకపోకలు జరిపే ప్రయాణికుల కోసం వచ్చేనెల 8వ తేదీ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతామని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. జిల్లాలోని విజయనగరం, ఎస్.కోట డిపోల పరిధిలోని బస్సులను విజయవాడ, భీమవరం, రాజోలు, విశాఖపట్నంకి ప్రత్యేక సర్వీసులుగా నడుపుతామని పేర్కొన్నారు. ఈ సర్వీనులలో సాధారణ చార్జీలు మాత్రమే వసూలుచేస్తామన్నారు. తిరుగు ప్రయాణం చేసేవారికోసం వచ్చేనెల 16 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించామని వివరించారు. ప్రయాణికులు ‘ఏపీఎస్ఆర్టీసీఆన్లైన్.ఐఎన్’ వెబ్సైట్లో, లేదంటే దగ్గరలో ఉన్న బస్ స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్లు బుక్చేసుకోవాలని సూచించారు. 20 నుంచి డోర్ డెలివరీ మాసోత్సవాలు ఆర్టీసీ కార్గో సేవల్లో డోర్ డెలివరీ మాసోత్సవాలను ఈ నెల 20 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు నిర్వహిస్తామని జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. అతి తక్కువ చార్జీలతో పార్సిల్, కొరియర్ సర్వీసులను గమ్యస్థానాలకు చేర్చుతామన్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో 50 కేజీల వరకు డోర్ డెలివరీ చేస్తామన్నారు. -
గిరిజన యువకుడి ఆత్మహత్య
సీతంపేట: కొండపోడు పనికి నాతో రా, లేకపోతే అన్నయ్య కుమారుడికి జ్వరంగా ఉంది పాలకొండ ఆస్పత్రికి అయినా తీసుకువెళ్లు అని తాత చెబితే వినకుండా వాగ్వాదానికి దిగిన మనుమడు చివరకు క్షణికావేశంలో కత్తితో పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతంపేట మండలంలో మంగళవారం జరిగిన ఈ సంఘటనపై స్థాని కులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. చాకలిగూడ గ్రామానికి చెందిన సవర ప్రేమ్కుమార్(23) తండ్రి రాజేష్, వెంకటమ్మలు పదేళ్ల కిందట అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. తాతయ్య గోపాలు, నాన్నమ్మ సుక్కమ్మ వద్ద ప్రేమ్కుమార్ ఉంటున్నాడు. వారితో పాటు అన్నయ్య శాంతకుమార్, వదిన వారి కుమారుడు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎవరి పనుల్లో వారు ఉండగా తాత గోపాలు కొండపోడు పనులకు వెళ్దామని చెప్పి ఒక సంచిలో కత్తి, వాటర్ బాటిల్ సిద్ధం చేసి పడుకుని ఉన్న ప్రేమ్కుమార్ను లేపి పనికి వెళ్దాం రమ్మని పిలిచాడు. నేను రాను అని చెప్పగా అయితే అన్నయ్యను పనికి తీసుకువెళ్తాను. అన్నయ్యకుమారుడికి జ్వరంగా ఉండడంతో వదినతో పాటు పాలకొండ ఆస్పత్రికి వెళ్లమని చెప్పాడు. అక్కడికి కూడా వెళ్లనని ప్రేమ్కుమార్ చెప్పడంతో కొద్ది సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తాత వంటింటిలోకి అన్నం పెట్టిన బాక్సు తీసుకురావడానికి వెళ్లాడు. దీంతో సంచిలో ఉన్న కత్తిని ప్రేమ్కుమార్ తీసుకుని పీక కోసేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి ఆటోలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మర్గమధ్యంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్నయ్య శాంతకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
డీపీటీసీని తనిఖీచేసిన విశాఖ రేంజ్ డీఐజీ
విజయనగరం క్రైమ్: విజయనగర శివారు సారిపల్లి వద్ద ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని (డీపీటీసీ) విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం పరిశీలించారు. విజయనగరం 5వ బెటాలియన్లో ట్రైనీకానిస్టేబుళ్లకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందించేందుకు కావాల్సిన మౌలిక వసతుల పై ఆరా తీశారు. శిక్షణార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శిక్షణ కేంద్రంలోని తరగతి గదులు, కార్యాలయం, వంటగది, డైనింగ్హాల్, స్టోర్ రూమ్, వాష్రూమ్, స్నానపు గదులు, మినరల్ వాటర్ ప్లాంట్, పరేడ్ గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, ఫైరింగ్ రేంజ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, ఎస్బీ సీఐ లీలారావు, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు ఉన్నారు. -
చేతి వృత్తిదారులకు శఠగోపం
పార్వతీపురంటౌన్: చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడి జీవించేవారి అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మయోజన అమలులో నీరుగారిపోయింది. లక్ష్యాలు ఘనంగా ఉన్నా అమలు మాత్రం తూతూ మంత్రంగానే ఉంది. మొక్కుబడిగా లబ్ధిదారులను ఎంపిక చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పథకం చేరువ కాక పూర్తిస్థాయిలో నష్టపోతున్నామని లబ్ధిదారులు వా పోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో విశ్వకర్మ కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హత ఉన్నా సాంకేతికత, ఽధ్రువీకరణ పత్రాల అప్లోడేషన్ వంటి కారణాలతో లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బ్యాంకర్లు విశ్వకర్మ పథకం అమలుకు అసలు సహకారం అందించడం లేదని లబ్ధిదారుల నుంచి విమర్శలు చాలా ఉన్నాయి. బ్యాంకర్లను రుణాలు ఇచ్చేందుకు ఒప్పించడంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం విఫలమయ్యాయి. చేతివృత్తులను ప్రోత్సహించేందుకు పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. చేతివృత్తులు, కళాకారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఆర్థిక సహాయం, పనిముట్లు అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఆధునిక పనిముట్లు, వస్తువుల కొనుగోళ్లలో రాయితీ అందించడం, చేతివృత్తుల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడం ద్వారా సంప్రదాయ కళలు, చేతి వృత్తులను ప్రోత్సహించడం ఈ పథక ఉద్దేశం. ఈ మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రాథమిక, ఆధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. ప్రోత్సాహకం కింద రూ.15వేల కిట్లను అందజేశారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకు నుంచి తొలి విడతలో తక్కువ వడ్డీకి రూ.లక్ష, అనంతరం రూ.3లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. కుమ్మరి, వడ్రంగి, కమ్మరి, శిల్పి, స్వర్ణకారులు, దోబి, పూలమాలలు అల్లేవారు. చేపలు పట్టేవారు. ఇలా 18 రకాల వృత్తుల వారికి విశ్వకర్మ పథకం వర్తిస్తుంది. చేతి వృత్తుల వారు విశ్వకర్మ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా మొక్కుబడిగా మాత్రమే రుణాలు మంజూరు చేయడం గమనార్హం. విశ్వకర్మ పథకం అమలులో నిర్లక్ష్యం వేలల్లో దరఖాస్తులు.. వందల్లో లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో 25,816 మంది దరఖాస్తులు ఎంపిక చేసింది కేవలం982మందిని మాత్రమే -
రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికలు
లక్కవరపుకోట: మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్ మైదానంలో జిల్లా స్కూల్గేమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికలను మంగళవారం నిర్వహించారు. ఈ ఎంపికల్లో జిల్లాస్థాయి జట్టుకు అండర్ 14,17,19 విభాగాల్లో బాల,బాలికలను ఎంపిక చేశారు. జిల్లాలోని 17 పాఠశాలల నుంచి 173 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎంపికల్లో 30 మంది బాలికలను, 30 మంది బాలురును ఎంపిక చేసినట్లు చెప్పారు. వారు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగబోయే పోటీల్లో విజయనగరం జిల్లా జట్లుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.కార్యక్రమంలో ఎంఈఓ సీహెచ్.కూర్మారావు, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జి.లక్ష్మణరావు, చందులూరు పీడీ డాక్టర్ పి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు గరివిడి విద్యార్థుల ఎంపిక
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి ఎస్డీఎస్ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఎం.అజయ్, ఎస్.ప్రవల్లికలు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రాయూనివర్సిటీలో ఈ నెల 15న జరిగిన బేస్బాల్ టీమ్ సెలక్షన్లో ఈ విద్యార్ధులు అర్హత సాధించారు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 8 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఈ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారు. తమ కళాశాల విద్యార్థులు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల కరస్పాండెంట్ బి.రవి, ప్రిన్సిపాల్ డా.ఎ.రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్.సురేష్కుమార్, పీడీ ఎం.భానుమూర్తి విద్యార్థులను మంగళవారం అభినందించారు. -
చట్ట ప్రకారం పిల్లల దత్తత
● ఐసీడీఎస్ పీడీ విమలరాణి విజయనగరం ఫోర్ట్: పిల్లలను చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు ఐసీడీఎస్ పీడీ టి.విమలరాణి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని కేఎల్ పురంలో ఉన్న శిశు గృహాన్ని ఆకస్మికంగా ఆమె మంగళవారం తనిఖీ చేశారు. పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకోవడం చట్ట రీత్యానేరమని తెలిపారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. శిశుగృహలో ఉన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు, ప్రతిరోజూ మెనూ కచ్చితంగా అమలు చేయాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత మహారాణి పేటలో ఉన్న బాలసదన్ను తనిఖీ చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలకు బాలసదన్లో ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 6 నుంచి11 సంవత్సరాల వయసు గల బాలికలు బాలసదన్లో ఆశ్రయం పొందుతారన్నారు. కార్యక్రమంలో డీఎంసీ సుజాత, శిశు గృహ మేనేజర్ త్రివేణి తదితరులు పాల్గొన్నారు.రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేతబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి బొబ్బిలి పట్టణానికి తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఆర్ఐ కొల్లి రామకుమార్ మంగళవారం పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.ఇసుక అక్రమ రవాణాలో మొదటిసారి దొరికినందున ఒక్కో ట్రాక్టర్కు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్లు ఆర్ఐ తెలియజేశారు. వేగావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ విభాగం నిఘా ఉందని తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని, మరో మారు అక్రమ ఇసుకతో పట్టుబడితే కేసులు పెడతామని ట్రాక్టర్ యజమానులను ఆర్ఐ హెచ్చరించారు. గంజాయి కేసులో ముద్దాయికి ఎనిమిదేళ్లు జైలు శిక్షవిజయనగరం క్రైమ్: గంజాయితో పట్టుబడిన నిందితుడికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష, రూ.75 వేల జరిమానాను కోర్టు విధించిందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు మంగళవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..గతేడాది ఫిబ్రవరి 8 వ తేదీన దక్షిణ ఢిల్లీకి చెందిన నీరజ్ సింగ్(25)విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం 4,5లలో జీఆర్పీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రం నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని, 17.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై అప్పటి విజయనగరం రైల్వే ఎస్సై వి.రవి వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందిడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో ముద్దాయికి విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి జైలు శిక్ష విధించారని, జరిమానా చెల్లించని ఎడల మరో ఆరు నెలలు జైలు శిక్ష వర్తిస్తుందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. -
ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలి
● ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్, ప్రొఫెసర్ ఎన్.మోహన్కుమార్విజయనగరం అర్బన్: రానున్న మార్చి 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను (ఐపీఈ–2026) ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్, ప్రొఫెసర్ ఎన్.మోహన్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం తోటపాలెంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి శివ్వాల తవిటినాయుడు అధ్యక్షతన వివిధ కళాశాలల యాజమాన్యాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.మోహన్ కుమార్ మారిన సిలబస్, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల విధానాలపై పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరానికి సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో (భాషా సబ్జెక్టులు మినహా) 14 సబ్జెక్టులకు నూతన సిలబస్ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలు పూర్తిగా సీబీఎస్ఈ తరహాలో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. బోటనీ, జూవాలజీని బయాలజీగా కలిపి ఒకే సబ్జెక్టుగా చేయడం, గణితాన్ని 1ఏ, 1బీగా కాకుండా ఒకే ప్రశ్నపత్రంగా ప్రవేశపెట్టడం, సైన్స్ పేపర్ల సంఖ్యను 6 నుంచి 5కు తగ్గించడం వంటి కీలక సంస్కరణలను వివరించారు. సిలబస్ మారిన 14 సబ్జెక్టులకు 32 పేజీల సమాధానం బుక్లెట్లు, బయాలజీ (బోటనీ–జూవాలజీ)కి 24 పేజీల బుక్లెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి పబ్లిక్ పరీక్షలు 30 రోజుల పాటు నిర్వహించే నేపథ్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు (డీఓలు) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత, తరలింపు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తి డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో అధ్యాపకులు మారిన సిలబస్, పరీక్షల విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లాలోని 66 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఎం.సత్యనారాయణ, ఎన్ఎల్వీజగన్నాథరావు, కె.అప్పారావు, పీఎల్ఎస్ప్రకాష్ పట్నాయక్, వీకేవీకృష్ణారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదో చెప్పండి?
● మెడికల్ కాలేజీలపై మీ ప్రాధాన్యత ఏమిటి? ● ప్రైవేటుకు అప్పగిస్తే ఉచిత వైద్యం అందుతుందా? ● పేదవాడి వైద్యానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్తో పోలికా ● మంత్రి శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా ఎందుకు నిర్వహించలేరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పాలని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా అవలంభించే విధానాన్ని తెలియజేయాలని కోరారు. నగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలో సోమవారం తలపెట్టిన ప్రజాఉద్యమ ర్యాలీకి అపూర్వ స్పందన లభించిందన్నారు. జిల్లా ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పేదవాడి వైద్యానికి, శంషాదాబాద్ విమానాశ్రయానికి పోలికచేస్తూ మంత్రి చేసిన వాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నారు. మంత్రి కొండపల్లి తన నేపథ్యాన్ని, స్థానిక పరిస్థితులను పదవీ వ్యామోహంలో విస్మరించడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణపై ఆరోపణలు చేస్తున్న మంత్రి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజలు ఇష్టపూర్వకంగా ఎందుకు సంతకాలు చేశారో తెలుసుకోవాలని హితవుపలికారు. అవసరమైతే వారి వివరాలు తామే ఇస్తామని చెప్పారు. ● పీపీపీ విధానంలో ప్రభుత్వమే కళాశాలలను నిర్మించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించిన తరువాత ప్రభుత్వం ఏం చేయగలుగుతుందని జెడ్పీ చైర్మన్ ప్రశ్నించారు. అలా చేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఇంకెందుకని ధ్వజమెత్తారు. జిల్లాలో ఉన్న మిమ్స్ మెడికల్ కాలేజీతో పాటు, పక్కనే విశాఖ జిల్లాలోని గీతం మెడికల్ కాలేజీలో రోగులకు ఉచితంగా సేవలందించగలరా అని ప్రశ్నించారు. అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తే పేదలు డబ్బులిచ్చి వైద్యం చేయించుకోగలరా అని నిలదీశారు. దశాబ్దాల కిందట విశాఖలో నిర్మించిన కేజీహెచ్లో ఎంత మంది ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారో మంత్రి తెలుసుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వానికి సత్తా లేకే ఇటువంటి వాఖ్యలు చేస్తు న్నారని దుమ్మెత్తి పోశారు. ● రాష్ట్రప్రజలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్తో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని మజ్జి శ్రీని వాసరావు గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతో మంది నిరుపేదలు ఉన్నత చదువులు అభ్యసించి డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, వైద్యకళాశాలలో ఆరోగ్య భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు అందించే సేవల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని మంత్రికి హితవుపలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. జీతాల చెల్లింపులో తప్పుడు ప్రకటనలా...? అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ చెల్లించాల్సిన జీతాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న విషయం బాధ్యత గల మంత్రికి తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. నవంబర్ నెలలో పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ సహా 7 శాఖలకు చెందిన ఉద్యోగులకు 7 నుంచి 10వ తేదీల మధ్య జీతాలు చెల్లించారన్న విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలలు మాత్రమే జీతాలు సక్రమంగా వేశారని, అనంతరం కాలంలో ఎప్పుడు వేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఉన్న సమన్వయం తేటతెల్లమవుతుందన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సిన ధాన్యంలో పారదర్శకత పాటిస్తున్నమంటూ మంత్రి కొండపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్వింటా దగ్గర 10 కేజీలు ధాన్యం రైతుల వద్ద నుంచి మిల్లర్లు దోపిడీ చేయడమేనా మీ పారదర్శకత అంటూ ఎద్దేవాచేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెందిన అనుకూల పత్రికలో ప్రత్యేక కథనం ఇచ్చారని, ఆ కథనాన్ని ఖండించి మాట్లాడాలని సవాల్ విసిరారు. -
ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు
● జేసీ సేతుమాధవన్ విజయనగరం అర్బన్: పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ చాంబర్లో మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలటీల్లో ప్లాస్టిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కమిటీ కన్వీనర్, విజయనగరం మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య వివరించారు. దీనిపై జేసీ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మొదటిసారి దొరికితే జరిమానాతో పాటు అవగాహన కల్పించాలని, రెండోసారి దొరికితే భారీ జరిమానా విధించాలని, అవసరమైతే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని సూచించారు. దాడులు నిర్వహించే అధికార బృందాలకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలని, వాటి తయారు చేసే కంపెనీలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు పి.నల్లనయ్య, ఎ.రామచంద్రరావు, ఎల్.రామలక్ష్మి, జనార్దనరావు, పర్యావరణ ఇంజనీరు సరిత, పరిశ్రమల శాఖ మేనేజర్, ఇతర శాఖల అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కోటి గళాల గర్జన
విజయనగరం: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రభుత్వ వైద్యాన్ని, వైద్య విద్యను ప్రైవేటీకరణకు పూనుకున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై జనం నిరసన తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి సేకరించిన 4లక్షల 50వేల సంతకాల ప్రతులతో విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు 7 నియోజకవర్గాలకు చెందిన సమన్వయకర్తలు, మహిళలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరంలోని సీఎంఆర్ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎస్బిఐ మెయిన్ బ్రాంచి, డాబాగార్డెన్స్, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం కూడలి మీదుగా కార్పొరేషన్కార్యాలయం వద్ద ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వరకు సాగింది. అక్కడ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చే కోటి సంతకాల ప్రతుల వాహనానికి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ నాయకులతో కలిసి జెండా ఊపారు. ముందుంగా మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, డాక్టర్ తలే రాజేష్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, గొర్లె రవికుమార్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ శెట్టివీర వెంకటరాజేష్, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్, వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకకర్తలు, వైఎస్సార్సీపీ అభిమానులు పాల్గొన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలి ప్రజలకు ప్రధాన అవసరాలైన విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలన్నది ప్రజలందరి డిమాండ్. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్యాయం. అది తెలియజెప్పేందుకే బాధ్యతగల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రజాఉద్యమ ర్యాలీలు నిర్వహించాం. ప్రజలను మోసం చేయాలనుకుంటే తగిన శాస్తి తప్పదు. – కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు, విజయనగరం ప్రైవేటీకరణను అడ్డుకుంటాం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున ప్రజ్యావతిరేకతను మూటగట్టుకుంది. అన్ని చేస్తామంటూ చంద్రబాబు చెప్పిన మాయమాటలు విని ఓట్లేసిన ప్రజలు మోసపోయారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఏరికోరి ఓట్లేసినవారే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో సేకరించిన 4లక్షల 50వేల సంతకాల ప్రతులను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించాం. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత. జిల్లా కేంద్రం నుంచి కోటి సంతకాల ప్రతుల తరలింపు విజయనగరంలో భారీ ర్యాలీ తరలివచ్చిన ఏడు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు -
ధాన్యం రైతు గగ్గోలు
● కొనుగోలు చేయని సంపత్స్వర్ణ రకం ● పొలాల్లోనే ధాన్యం బాడంగి: ఖరీఫ్లో సంపత్ స్వర్ణరకం పండించిన రైతులకు గడ్డుపరిస్థితి ఎదురైంది. ధాన్యం మరపట్టిస్తే బియ్యం ముక్కలవుతున్నాయంటూ కొనుగోలుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. మిల్లులకు తరలించినా వెనుకకు పంపిస్తున్నారు. దీంతో నూర్పిడి చేసిన ధాన్యం పొలాలు, కళ్లాల్లోనే ఉండిపోతున్నాయి. వాటిని కాపాలా కాసేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలనే సాగుచేశామని, ఇప్పుడు కొనుగోలు చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు మిల్లర్లు క్వింటాకు అదనంగా 10 కేజీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. -
విశాఖలో కార్మిక గర్జనకు సన్నాహాలు
విజయనగరం గంటస్తంభం: డిసెంబర్ 31నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ జాతీయ మహాసభలను కార్మికులంతా విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు రెడ్డి శంకరరావు, ఎ.జగన్మోహనరావులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాసభల ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక కోట జంక్షన్ ఆటోస్టాండ్ వద్ద సీఐటీయూ జెండాను రెడ్డి శంకరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం సీఐటీయూ సాగించిన పోరాటాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్ల పేరుతో కార్మికులు సాధించుకున్న హక్కులను కుదిస్తోందని విమర్శించారు. అలాగే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే జాతీయ మహాసభల్లో కార్మిక చట్టాల పరిరక్షణ, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకత, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలనే అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 4న విశాఖపట్నం బీచ్లో జరిగే బహిరంగ సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బి.రమణ, పాపారావులతో పాటు ఆటో, కలాసీ కార్మికులు పాల్గొన్నారు. -
చోరీకి గురైన బంగారు ఆభరణాల రికవరీ
వేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో పట్టపగలు చోరీలకు పాల్పడిన వ్యక్తిని వల్లంపూడి పోలీసులు సోమవారం పట్టుకుని దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో వావిలపాడు, వల్లంపూడి, రామస్వామిపేట గ్రామాల్లో పట్టపగలు ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరిగిన విషయం విదితమే. దీనిపై వల్లంపూడి ఎస్సై సుదర్శన్, సిబ్బందితో నిర్వహించిన తనిఖీల్లో సోమవారం కుమ్మపల్లి జంక్షన్ వద్ద అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లా నూకరాజును నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తివద్ద రామస్వామిపేటలో దొంగిలించిన ఐదున్నర తులాలు, వావిలపాడులో దొంగిలించిన తులంన్నర బంగారం రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. వల్లంపూడిలో చోరీ చేసిన బంగారం చోడవరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు సీఐ చెప్పారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని కోర్టుకు తరలిస్తామన్నారు. -
వినతుల పరిష్కారంలో ఆలస్యం తగదు
● పీజీఆర్ఎస్లో కలెక్టర్ రాంసుదర్రెడ్డివిజయనగరం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి అందే వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలస్యం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్తో పాటును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలాగాంధీ, బి.శాంతి, కళావతి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి సమర్పించిన ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మొత్తం 186 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని, మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్వేశాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ యూ.మాణిక్యం నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ టీమ్కు శిక్షణ ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ ఆధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ కేసులు, ఫ్రీ ఆడిట్, ఆడిట్, ప్రజల సంతృప్తి తదితర అంశాలు కచ్చితంగా ఉండేలా మరోసారి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న ధరఖాస్తులు, గడువు దాటినవి, రీ ఓపెన్ అయినవాటిపై వివరంగా సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆన్లైన్ ద్వారా మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 25 ఫిర్యాదులు ● ఏఎస్పీ చాంబర్లో కార్యక్రమం నిర్వహణ విజయనగరం క్రైమ్: ప్రతి వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఈ వారం 25 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ సౌమ్యలత సోమవారం డీపీఓలోని తన చాబర్లో ఫిర్యాదులు స్వీకరించారు.ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించిన ఏఎస్పీ సౌమ్యలత వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత సిబ్బందితో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను వివరించారు. ఏఎస్పీ స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 4, మోసాలకు పాల్పడినట్లు 3, ఇతర అంశాలకు సంబంధించి 10 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో పరిష్కరించాలని ఏఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ కె. కుమారస్వామి, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికం.. ధనుర్మాసం
బలిజిపేట: పల్లెలు, పట్టణాల్లో దేవాలయాల ద్వారా ధనుర్మాసంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతాయి. ఆలయాల్లో నిత్య కై ంకర్య సేవలు, విశేష రోజులు, సేవలు, శ్రీ గోదా రంగనాఽథ స్వామివార్ల కల్యాణం, ప్రత్యేక పాశురాలు, పులకింపజేసే తిరుప్పావై ప్రవచనాలు, పూజా కార్యక్రమాలు, భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలతో ధనుర్మాసం శ్రీమహా విష్ణువుకు అత్యంత్ర ప్రీతికరమైనదిగా ప్రాచుర్యం పొందింది. వేదాల్లో సామవేదం, మాసాల్లో మార్గశిరం అత్యంత పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఈ మాసంలో రంగనాథుడిని పరమభక్తితో సేవించడం ద్వారా గోదాదేవి ఆయనను వరించి, తన భక్తిని చాటుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ఈనెలలోనే ప్రవేశిస్తాడు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించడం విశేషం. ధనుర్మాసంలో పండగ నెల ప్రారంభం కావడంతో పట్టణ, పల్లె ప్రాంతాలు పరవశిస్తాయి. నెల మొదలైన నాటినుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. హరిదాసు కీర్తనలతో పల్లెలు పులకిస్తాయి. గొబ్బెమ్మల కొలువు పండగ నెల ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఇంటిముందు కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గోదాదేవి, లక్ష్మీదేవి, గౌరీమాతగా భావిస్తారు. గోవుపేడతో పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచుతారు. భోగిభాగ్యాలు గ్రామాలు, పట్టణాల్లో భోగి మంటలు వేస్తారు. దీంతో సకల దోషాలకు పరిహారం లభిస్తుందని భావిస్తారు. కనుమతో ధనుర్మాసం పూర్తి కనుమ పండుగతో ధనుర్మాసం ముగుస్తుంది. దీన్నే పశువుల పండుగ అని అంటారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో సాయం చేసిన పశువులకు రైతులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ధనుర్మాసం ప్రారంభం కాగానే పండగ వాతావరణంతో పల్లెలు కళకళలాడుతాయి. శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రం ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. వేకువనే స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు చేస్తారు. తిరుప్పావై నిర్వహిస్తారు. సంక్రాంతి..పితృదేవతలకు శాంతి మకర సంక్రాంతిని పెద్దల పండగ అంటారు. ఈ రోజున పితృదేవతలకు కొత్త బట్టలు పెట్టుకుని తర్పణాలు వదులుతారు. పంచభక్ష్య పరమాణ్నాలతో నైవేద్యం సమర్పించి పెద్దల ఆశీర్వచనం పొందుతారు. ధనుర్మాసంలో విశిష్టమైన రోజులు 2025, డిసెంబరు 24వ తేదీన వేశేష ధూప్ సేవ(తూమని మాడత్తు) డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి (ఉత్తరద్వార దర్శనం) 2026, జనవరి 3వ తేదీన విశేష దీపాలంకరణ సేవ(కుత్తు విళక్కెరియ) జనవరి 8వ తేదీన పొన్నాకుల హారతి (అన్జు ఇవ్వులగం) జనవరి 11వ తేదీన విశేష ప్రసాద సేవ (కూడారై వెల్లుం) జనవరి 14వ తేదీన భోగి రోజున పూలంగి సేవ, శ్రీగోదారంగనాథుల కల్యాణం నేటి నుంచి వచ్చేనెల 14వరకు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం భోగి, సంక్రాంతి, కనుమల సమాహారం సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలంఎంతో పవిత్రమైనది ధనుర్మాసం ఎంతో పవిత్రమైనది. శ్రీగోదారంగనాథులను కొలుచుకుని వారి ఆశీస్సులను పొందినవారికి ఎంతోమేలు జరుగుతుంది. అధ్యాత్మికంగా ఈమాసం అందరినీ మేలుకొలుపుతుంది. – సురేష్, అర్చకుడు, బలిజిపేట వైష్ణవాలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు శ్రీవైష్ణవులకు తిరుప్పావై వ్రతం ముఖ్యమైనది. ఈ వ్రతంలో నెలరోజులపాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. ఒకటి నుంచి 5రోజులు నియమ, నిబంధనలకు సంబంధించిన పాశురాలు. 6వ రోజునుంచి 15 పాశురాలతో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16,17,18పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ పాశురంలో మంగళాశాసనం, 25, 26పాశురాలలో స్వామికి అలంకారాలైన ఆయుధాలలో పరా అనే వాయిద్యాన్ని తమ శరణాగతి అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తారు. ఆఖరి రోజున గోదారంగనాథుల కల్యాణం అట్టహాసంగా నిర్వహిస్తారని అర్చకులు చెబుతున్నారు. గోదాదేవితో కూడుకుని ఉండే నారాయణ అర్చన సేవయే ఈమాసపు ప్రాధాన్యంగా పేరొందిందని, భగవంతుని ఏవిధంగా చేరుకోవాలో తెలిపే మాసం ఇది అని అర్చకులు తెలియజేస్తున్నారు. భక్తులు ఈమాసంలో స్వామివారి సేవలో పాల్గొని చూసి, విని తరించాలని అర్చకులు కోరుతున్నారు. -
నిధులు లేకుండా ముస్తాబులేమిటి?
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘ఉత్తి మాటలతో ఊరు శుభ్రమవుతుందా.. పారిశుద్ధ్య కార్మికుల జీతాలకే దిక్కులేదు.. నిధుల ఊసెత్తితే దాటవేస్తున్నారు.. ఖర్చు లేకుండా గ్రామాల్లో ‘ముస్తాబు’ అమలు చేయాలంటే ఎలా సాధ్యం?’ ఇదీ.. పలువురి సర్పంచ్ల ఆవేదన. పార్వతీపురంలోని ప్రైవేట్ కల్యాణ మండపంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సర్పంచ్ల సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సర్పంచ్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలోనూ కుటుంబం ముస్తాబు కావాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలు, పల్లెలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సర్పంచులే గ్రామాల కు బాస్లని.. ఆ దిశగా తమ గ్రామాలను అభివృద్ధిపరచాలని ఆకాంక్షించారు. ముస్తాబుపేరిట గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ, బహిరంగ మలమూత్ర విసర్జనకు కృషి చేయాలని కోరారు. కాలు వల శుభ్రత, చెత్తకుప్పలు లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎలాంటి ఖర్చూ లేకుండా ఇలాంటి పనులు నిర్వహించవచ్చ ని చెప్పారు. దీనిపై సర్పంచ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలిచ్చేందుకే పంచాయతీల్లో నిధులు లేవని చెప్పా రు. ఎన్నోసార్లు విన్నవించుకున్నా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదన్నారు. పలు సమస్యలపై సర్పంచ్లు చెప్పేందుకు ప్రయత్నించగా.. అధికారులు మధ్యలోనే బ్రేక్ వేశారు. దీంతో కలెక్టర్కు తమ పంచాయతీల్లో సమస్యలపై నామమాత్రంగానే సర్పంచ్లు వినతిపత్రాలిచ్చి సరిపెట్టుకున్నారు. నిధులు నిల్.. నీతులు ఫుల్: సర్పంచుల ఆవేదన జిల్లా యంత్రాంగం తీరుపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు నిల్.. నీతులు ఫుల్ మాదిరి అధికారుల తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముస్తాబు పేరిట హడావిడి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తి మాటలతో ఊరు శుభ్రపడదని పేర్కొన్నారు. నిధులు ఊసెత్తితే దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులెవరికీ బాధ్యత లేదని విమర్శించారు. గ్రామాల్లో మిల్లర్ల దోపిడీ, రైతుల ఇబ్బందులపైనా పలువురు నిలదీశారు. మంచినీరు, మౌలిక సదుపాయాల సమస్యలనూ ప్రస్తావించారు. -
అర్జీలను సొంత సమస్యగా భావించాలి
చికెన్ ● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ప్రజలు 117 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, డిఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లోని రెవెన్యూ క్లినిక్లో కూడా కలెక్టర్ వినతులను స్వీకరించారు. వినతులలో కొన్ని.. ● పార్వతీపురం మండలం చందలింగి గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 28–5లో గల ఆర్ఓఎఫ్ఆర్ భూములను అక్రమంగా సాగు చేస్తున్నారని, ఆక్రమణ దారుల తొలగించి ఫారెస్టు భూములను కాపాడాలని ఆర్.ప్రభాకర్ అర్జీ అందజేశారు. ● తన ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కొంతమంది ఆక్రమించి ప్రహరీ నిర్మించారని, ఆక్రమణలను తొలగించాలని కోరుతూ భామిని మండలం బాలేరు గ్రామానికి చెందిన నిమ్మక వసంతకుమార్ వినతిపత్రం అందజేశాడు. . ● సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన జి. సత్యం తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరాడు. ● పార్వతీపురం పట్టణానికి చెందిన సీహెచ్. పైడిరాజు గ్యాస్ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదని నగదు జమ అయ్యేలా చూడాలని వినతిని అందజేశారు. ● పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామానికి చెందిన డి. శ్రీరాములు గృహ నిర్మాణం పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశాడు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 19 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ఐటీడీఏ ఏపీఓ ఎస్.వి.గణేష్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 19 వినతులు వచ్చాయి. కొండచీపుళ్ల తయారీ యూనిట్ పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని అడ్డంగి గ్రామస్తుడు గోవిందరావు, మేకల యూనిట్ నిర్వహణకు లోన్ ఇప్పించాలని ఎం.సింగుపురం గ్రామస్తుడు సింహాచలం అర్జీలు అందజేశారు. జన్నోడుగూడ గ్రామస్తులు అంతర్గత సీసీరోడ్డు గ్రామానికి నిర్మించాలని విన్నవించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పారదర్శకంగా పరిష్కరించాలి: ఎస్పీ పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన 9 అర్జీలను నేరుగా స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులకు ఫోన్లో ఎస్పీ ఆదేశాలను జారీ చేస్తూ ఫిర్యాదుల పూర్వా పరాలను విచారణ చేసి వాస్తవాలైనట్లైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమర జీవికి ఘనంగా నివాళి ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమర జీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని ఆయన ఆశయాలు, సేవలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం కావాలని ఎస్పీ మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
విద్యుత్ పొదుపు ప్రగతికి మార్గం
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డివిజయనగరం ఫోర్ట్: విద్యుత్ పొదుపు చేయడం ద్వారా ప్రగతికి మార్గం వేయవచ్చునని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా విద్యుత్ పొదుపు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీఈపీడీసీఎల్ సోమవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్అండ్బీ జంక్షన్, మయూరి జంక్షన్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని ఎంత పొదుపు చేస్తే, అంత అదనంగా ఉత్పత్తి చేసినట్లునన్నారు. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదాపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. దీనికోసం విద్యుత్ను ఆదా చేసే 5స్టార్ పరికరాలను వినియోగించాలని సూచించారు. అవసరమైనప్పడు విద్యుత్ ఉపకరణాలను వినియోగించాలని కోరారు. తమ ఇళ్లలోని విద్యుత్ వినియోగాన్ని ఆడిట్ చేసుకుని విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. విద్యుత్ను వృథా చేయవద్దన్నారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, ఈఈలు పి.త్రినాథరావు, జి.సురేష్బాబు, బి.రఘు, ఏడీఈ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇందన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత పార్వతీపురం: ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యుత్ ఆదా చేసే విధానంపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ ఇంధనపొదుపు వారోత్సవాల ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో మాట్లాడుతూ ఇంధన పొదుపు కచ్చితంగా అమలు కావాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతిగృహాలు, సచివాలయాలు, మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఇంధనాన్ని పొదుపు చేసేలా అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ప్రతి ప్రభుత్వ భవనంలో విద్యుత్ను ఆదా చేయాలని సూచించారు. గత నెలలో విద్యుత్ బిల్లు ఆదారంగా వీలైనంతవరకు విద్యుత్ పొదుపు చేసి ఆదా చేయాలని కోరారు. విద్యుత్ను ఆదా చేయడమంటే విద్యుత్ను ఉత్పత్తి చేయడమేనని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించి నాణ్యమైన విద్యుత్ పరికరాల వినియోగం, పొదుపు చేయడం తదితర అంశాలపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, విద్యుత్శాఖ ఎస్ఈ పాల్గొన్నారు. -
సబ్జైలు సందర్శన
శృంగవరపుకోట: ఎస్.కోట సబ్జైలును జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత సోమవారం సందర్శించారు. న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి ఖైదీలకు అందుతున్న చట్టపరమైన సౌక ర్యాలు, సేవలపై ఆరా తీశారు. నేర ప్రవృత్తిని వీడి కొత్త జీవితం ప్రారంభించాలని ఖైదీలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, జైలు సూపరింటెండెంట్ పాల్గొన్నారు. 21న పల్స్పోలియో కార్యక్రమం విజయనగరం ఫోర్ట్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కోరారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో నివారణకు చుక్కల మందును వేయించాలన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన వైద్య, ఐసీడీఎస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,99, 386 మంది పిల్లలకు 1171 పోలియో బూతుల్లో పల్స్పోలియో నివారణకు చుక్కలమందు వేయాలన్నారు. ఈ నెల 21న పోలియో నివారణ మందు వేయించుకోలేని పిల్లలకు ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహించి శతశాతం పోలియో చుక్కలు వేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో మురళి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, ఐసీడీఎస్ పీడీ విమలరాణి, తదితరులు పాల్గొన్నారు. వీరఘట్టం/ పాలకొండ: ఎలాంటి పనినైనా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రచార ఆర్భాటం చేయడం, అబద్ధాలను నిజమని నమ్మించడం.. హామీలిచ్చి మోసం చేయడంలో సీఎం చంద్రబాబునాయుడుని మించిన వారు ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు చంద్రబాబు చేస్తున్న హడావుడి దీనికి అద్దం పడుతోంది. విమర్శలకు తావిస్తోంది. కానిస్టేబుల్ పోస్టులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30–11– 2022న నోటిఫికేషన్ ఇచ్చింది. 22–01–2023న రాతపరీక్ష కూడా నిర్వహించింది. అనంతరం కోర్టు కేసులతో పోస్టుల భర్తీ వాయిదా పడింది. 2024లో ప్రభుత్వం మారింది. కోర్టు కేసుల పరిష్కారంతో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వాస్తవంగా నియామక పత్రాలు ఎస్పీ చేతుల మీదుగా అందజేయాలి. మంగళగిరిలో అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. -
జాతీయస్థాయి పోటీలకు కంచరాం విద్యార్థి
రాజాం సిటీ: మండల పరిధిలోని కంచరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అలజంగి సంతోషిణి జాతీయస్థాయి పెంటాథ్లాన్ పోటీలకు ఎంపికై ందని పీడీ టి.దుర్గారావు, పీఈటీ బి.నారాయణనాయుడులు సోమవారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ఎంపికై ందన్నారు. విద్యార్థిని ఎంపికపట్ల హెచ్ఎం వీవీ వసంతకుమార్తోపాటు పాఠశాల స్టాఫ్ కార్యదర్శి మజ్జి మదన్మోహన్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థిని ఆత్మహత్యా యత్నంపై ఎటీడబ్ల్యూఓ విచారణసాలూరు: మండలంలోని కురుకుట్టి ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆదివారం ఫినాయిల్తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటనపై ఏటీడబ్ల్యూఓ కృష్ణవేణి విచారణ చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఆమె పాఠశాలకు వెళ్లి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినితో మాట్లాడారు.ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగితెలుసుకున్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని ఆమె తెలిపారు. రెండు బైక్లు ఢీకొని ఒకరికి గాయాలుపాచిపెంట: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పాచిపెంట మండలంలోని పణుకువలస సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. దీనిపై పోలీసులు సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన మాదిరెడ్డి సత్యనారాయణ(35) రామభఽధ్రపురం మండల కేంద్రంలో కారు మెకానిక్గా పనిచేస్తున్నాడు. మెకానిక్ పని నిమిత్తం ప్రతిరోజూ రామభధ్రపురం వెళ్లి వస్తూ ఉంటాడు. రోజులాగానే ఆదివారం పని ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ కృష్ణారావు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిరాజాం సిటీ: మండల పరిధి ఇప్పిలిపేట సమీపంలో ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టొంపల సుమంత్ (26) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాజాంలో విధులు ముగించుకుని స్వగ్రామమైన గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఇప్పిలిపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుమంత్ను స్థానికులు రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం కిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వివరించారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి..గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. విజయనగరంలోని కణపాకకు చెందిన కోరాడ పైడిరాజు ఈనెల 12వతేదీన ఉదయం మార్నింగ్ వాక్కు వచ్చి తిరిగి వెళ్తుండగా రామవరం పప్పుల మిల్లు వద్ద నరవ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్తో వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు తొలుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడినుంచి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. సాయికృష్ణ తెలిపారు. మర్మాంగాన్ని కోసుకున్న మతిస్థిమితం లేని యువకుడుబొబ్బిలి: విశాఖకు చెందిన మతిస్థిమితం లేని ఓ యువకుడు తన మర్మాంగాన్ని సోమవారం రాత్రి కోసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికుల కథనం ప్రకారం స్థానిక ఫ్లైఓవర్ వద్ద ఓ యువకుడు కాళ్ల వెంబడి రక్తమోడుతూ తిరుగుతుండడంతో స్థానికులు అంబులెన్స్కు సమాచారమందించారు. అంబులెన్స్లో ఎక్కేటప్పుడు ముప్పుతిప్పలు పెట్టిన యువకుడు గడియకోమాట చెబుతూ అర్థంలేని విధంగా ప్రవర్తించాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్సకూ ఇబ్బందులు పెట్టాడు. ఆస్పత్రి ప్రధానవైద్యాధికారి జి.శశిభూషణ రావు పరీక్షించి విశాఖ రిఫర్ చేశారు. ఈ లోగా యువకుడు చెప్పిన మేరకు సమాచారం అందడంతో వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులు కూడా బొబ్బిలి చేరుకున్నారు. యువకుడిని చికిత్స నిమిత్తం వెంట తీసుకెళ్లారు. -
సీఎస్పీపై మహిళా సంఘాల ఫిర్యాదు
రేగిడి: మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన స్వయం సహాయ సంఘాల మహిళలు సోమవారం రేగిడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సంఘాలకు సంబంధించిన పొదుపు నగదును గ్రామానికి చెందిన సీఎస్పీ అల్లు శ్రీధర్ స్వాహా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకులకు ప్రతి నెలా చెల్లించాల్సిన సొమ్మును అల్లు శ్రీధర్కు అందజేశామని, ఆ నగదు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదని ఆవేదన చెందారు. పొదుపు, రుణ చెల్లింపులకు సంబంధించి రూ.43 లక్షలు స్వాహా చేశాడని, బాధ్యుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. -
జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గురుకుల కళాశాల విద్యార్థిని
గుమ్మలక్ష్మీపురం: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల(పీటీజీ)లో సెకెండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న తోయక ప్రవల్లిక ఎంపికై నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డి.భారతి, ఫెన్సింగ్ కోచ్ పి.బాలరాజు సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వెనిగండ్లలోని శ్రీవేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఈనెల 13, 14వ తేదీల్లో జరిగిన 69వ స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్ ఫెన్సింగ్ పోటీల్లో ఫోయిల్ వ్యక్తిగత విభాగంలో ప్రవల్లిక పాల్గొ ని ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించిందన్నారు. ఈ విద్యార్థిని త్వరలో ఇంఫాల్లో జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలియజేస్తూ..జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు. -
పేదలకు వైద్యం.. విద్యార్థులకు వైద్యవిద్య ఉచితంగా అందాల్సిందేనని జనం నినదించారు. వైద్యకళాశాలలు ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వ మెడలు వంచేందుకు
ప్రజా కోర్టులో దోషిగా నిలబెడదాం మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో దోషిగా నిలబెడదాం. ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు. కూటమి నిర్ణయం ముమ్మాటీకి ప్రజావ్యతిరేక చర్య. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లాలో చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి చక్కని స్పందన లభించింది. జిల్లా కేంద్రంలో చేపట్టిన ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతాలను ఈనెల 18న రాష్ట్ర గవర్నరకు అందజేస్తాం. – మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం -
సంతకంతో నిరసన
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే చంద్రబాబు ప్రభుత్వ పన్నాగాన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల రూపంలో వారి నిరసన, ఆవేదనను తెలియజేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం, వైద్య విద్యను దూరంచేస్తే వారి ఉసురు తగలక మానదు. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి ఇదొక ప్రజా విన్నపం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనేది వైఎస్సార్ సీపీకి సంబంధించిన కార్య క్రమం కాదు. కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్న విన్నపం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయవద్దని సంతకంతో అందజేసిన వినతి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిస్తే మంచిదే. లేకుంటే వినాశనం తప్పదు. – డాక్టర్ తలే రాజేష్, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి ఇదొక చారిత్రక ఉద్యమం కోటిసంతకాల సేకరణ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక చారిత్రక ఉద్యమం. ఇది బడుగు, బలహీన వర్గాలకు చెందిన భావితరాల వారికోసం ప్రతిపక్ష నేత బాధ్యత తీసుకున్న ఉద్యమం. భవిష్యత్లో నాడు జగన్ చేసిన ఉద్యమం ఫలితంగా వైద్యవిద్య అభ్యసించామని చెప్పుకునే రోజు వస్తుంది. పేద వర్గాలకు అందాల్సిన ఉచిత విద్య, వైద్యం కోసం కోట్లాది మంది అభిప్రాయాలను తెలియజేసే ఉద్యమం ఇది. ప్రభుత్వం కళ్లు తెరిపించి, బాధ్యతను గుర్తుచేసిన ప్రజా ఉద్యమం. – కడుబండి శ్రీనివాసరావు, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ఓ ఉద్యమంగా సాగింది. కోటి సంతకాల కార్యక్రమానికి పార్టీలకతీతంగా ప్రజలు మద్దతుగా నిలిచి, సంతకాలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత తెలిపారు. వైద్యాన్ని ప్రైవేటుపరం చేయొద్దని స్పష్టంచేశారు. – బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే చంద్రబాబుకు పేదలంటే చులకన సీఎం చంద్రబాబుకు పేదలంటే చులకన. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి, పేదలకు వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య అందకుండా చేయాలని చూస్తే ప్రజల ఊరుకోరని ఈ రోజు స్పష్టమైంది. – బొత్స అప్పల నరసయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
● మద్యం మత్తులో టిప్పర్ను ఢీకొన్న ద్విచక్ర వాహదారు భోగాపురం: మద్యం మత్తులో ఓ యువకుడు ద్విచక్ర వాహనానంపై వస్తూ ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారు స్వల్ప గాయాలతో బయట పడగా పెనుప్రమాదం తప్పడంతో ముంజేరు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామంలో ఆర్అండ్బీ రహదారిపై ఆదివారం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని దేవరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు గండ్రేటి పాలవెల్లి రెడ్డికంచేరు సమీపంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయంలో జేసీబీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పూటుగా మద్యం తాగి బైక్పై భోగాపురం బయలు దేరాడు. భోగాపురం నుంచి ముక్కాం వైపు వస్తున్న టిప్పర్ ముంజేరు వద్దకు చేరుకునేసరికి మద్యం మత్తులో ఉండి ఎదురుగా బైక్పై వస్తున్న వాహదారును గమనించిన టిప్పర్ డ్రైవర్ రోడ్డుపై ఆపివేశాడు. అయినప్పటికీ మద్యం మత్తులో ఉన్న ద్విచక్ర వాహనదారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు స్వల్ప గాయాలపాలైన పాలవెల్లిని లేపి సపర్యలు చేసి, టిప్పర్కు అడ్డంగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని పక్కకు తీసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చేశారు. -
24/7 అందుబాటులో మద్యం
● మద్యం కేరాఫ్ మన్యం జిల్లా ● జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా బెల్ట్ షావుల నిర్వహణగఅనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా అనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎప్పటికప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో బెల్ట్ షావులపు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. సారా రవాణా తయారీ అమ్మకాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నాం. అనధికార మద్యం, సారా వంటివి విక్రయిస్తూ ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లావ్యాప్తంగా పీడీయాక్ట్లను నమోదు చేస్తాం. బి.శ్రీనాథుడు, ఎకై ్సజ్ ఈఎస్, ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్: ఓ వైపు ప్రభుత్వ వైఫల్యం, మరోవైపు ఎకై ్సజ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజారోగ్యానికి తూట్లు పడుతున్నాయి. గడిచిన ఏడాదిన్నరగా జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు, పారిశుద్ధ్య లోపం, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న మన్యం వాసులకు మద్యం కష్టాలు తెచ్చి పెడుతోంది. జిల్లాలో గ్రామ గ్రామాన మద్యం, సారా ఏరులై పారుతోంది. జిల్లా కేంద్రంలో వేకువ జాము నుంచే మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దానికి తోడు మన్యం జిల్లా వ్యాప్తంగా, ఏఓబీ గ్రామాల్లో, గిరిజన సీమల్లో, గిరిశిఖర గ్రామాల్లో మద్యం, సారా ఏరులై పారుతోంది. దాదాపు అన్ని గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాలు, గ్రామాల్లో, పట్టణాల్లో బహిరంగంగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఏఓబీ గ్రామాల్లో సారా తయారీ చేస్తున్న కేంద్రాలు కుటీర పరిశ్రమలుగా ఏర్పడ్డాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, గెడ్డలు, వాగులు, నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాలను వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుని బెల్లపు ఊటలను తయారు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో అక్రమంగా సారాను తయారు చేస్తూ జిల్లా కేంద్రంగా అనేక జిల్లాలకు దాటిస్తున్నారు. నెలలో ఏదో ఒకరోజు ఎకై ్సజ్ అధికారులు తామున్నామంటూ తూతూ మంత్రంగానే దాడులు నిర్వహిస్తూ మమ అనిపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పూర్తిస్థాయిలో నిఘా లేకపోవడంతో మన్యం జిల్లా మద్యం, సారా క్రయ విక్రయాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ప్రతి నెలా మంత్లీలు బెల్ట్ షావు నిర్వహణకు ఎకై ్సజ్ దిగువ స్థాయి సిబ్బంది నుంచి పై అధికారుల వరకు ఒక్కొకరికి భారీ మొత్తంలో ముడుపులు అందిస్తున్నారన్న బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణా అంతా రాత్రివేళలోనే.. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన సారాను కొంతమంది వ్యాపారులు రాత్రివేళల్లో ఆటోలు, బైక్ల ద్వారా మైదానం, పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మన్యంలో సరిహద్దు గ్రామాలైన జయకోట, బొత్తరాపల్లి, మూలకర్ని, విక్రాంపురం, అలమండ, సోరుపల్లి, సందుబడి. రేగులపాడు, సంబలబాయి, ఎగువ పిల్లిడ్డి, జీడివలస, అత్తిగడ, జగ్గూడ, టికరపాడు, కప్పలాడ, మానిక్యంవలస, ఎడుగుమ్మలవలస, పొల్ల, చిన్నబగ్గ, కడగండి, ఓండ్రుజోల, వలగజ్జి, వలగజ్జి గ్రామాల మీదుగా జనసంచారం లేని మార్గాలగుండా సారాను తరలిస్తున్నారు. పార్వతీపురం, కురపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు ఇక్కడనుంచి ప్లాస్టిక్ కేన్లలో రవాణా చేస్తున్నారు. దీనిపై ఎకై ్సజ్ శాఖ నిఘా కొరవడింది. దీంతో రోజుకు కొన్ని వేల లీటర్ల సారా రవాణా అవుతోంది. జిల్లాలో అనధికారికంగా 600 పైగా మద్యం బెల్టు దుకాణాలు ఉన్నాయి. ఏడాదిన్నరగా ఇప్పటి వరకు 700 కేసులు నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. ఏఓబీ గ్రామాల్లో 18 అంతరాష్ట్ర దాడులు నిర్వహించి 4లక్షల లీటర్ల పులిసిన బెల్లపు ఉటలు ధ్వంసం చేశారు. 21 వేల లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో బతుకులు ఛిద్రం శుభకార్యాలు, పండుగల సమయాల్లో ఎక్కువగా మద్యాన్ని తాగుతారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యం మద్యం లభిస్తుండంతో వేకువజాము నుంచే మందుబాబులు బెల్ట్ షావుల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. గతం కంటే అధిక ధరకే లభిస్తున్నా వెనుకంజ వేయడం లేదు. దీనికి బానిసలై బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. కాయకష్టం చేసి సంపాదించిన మొత్తం మద్యానికి తగలేసి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కిడ్నీ, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో ఆస్పత్రి పాలవుతున్నారు. మద్యం, సారా తాగడం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో పెద్దగా అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు. దీంతో గిరిజనుల్లో చైతన్యం కొరవడింది. -
యూత్ ఏషియన్ పారా గేమ్స్లో గోల్డ్ మెడల్
విజయనగరం: దుబాయ్ వేదికగా జరుగుతున్న యూత్ ఏషియన్ పారా గేమ్స్ 2025 పారా బాడ్మింటన్లో విజయనగరం జిల్లా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్ చంద్ గోల్డ్ మెడల్ సాధించడం జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు విజయాలు సాధించడం వెనుక ప్రేమ్ చంద్ సంకల్పం, నిరంతర సాధనతో పాటు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి అందించిన ప్రోత్సాహం ఉన్నాయన్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు దుబాయ్లో జరుగుతున్న యూత్ ఏషియన్ పారా గేమ్స్లో గతం కంటే పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ బాడ్మింటన్ ఎస్.హెచ్ 6 కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించి జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో మారు మోగేలా చేశాడని ప్రశంసించారు. పొట్నూరు ప్రేమ్ చంద్ విజయం పట్ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాం సుందర రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వర రావులు అభినందనలు తెలియజేశారు. -
పతకాలు పట్టిన పైలెట్
శృంగవరపుకోట: వెటరన్ అథ్లెట్గా పతకాలు పట్టేస్తున్న ఆ పైలెట్ మరోమారు సత్తాచాటి పతకాలు పట్టేశాడు. 108వాహనంలో పైలెట్గా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ మూర్తి బాపట్లలోని ఆర్ట్స్ ఎండ్ సైన్స్ కళాశాల మైదానంలో డిసెంబర్ 13,14 తేదీల్లో నిర్వహించిన 7వ ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025 పోటీలకు జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 45+ విభాగంలో పోటీపడిన ఎంఎస్ఎన్.మూర్తి జావెలిన్ త్రోలో స్వర్ణం, డిస్క్త్రోలో స్వర్ణం, హేమర్ త్రోలో రజత పతకాలను సాధించాడు. వరుసగా పతకాల పంట పండిస్తున్న వెటరన్ పైలెట్ను స్థానిక క్రీడాకారులు అభినందించారు. -
స్కూటీని ఢీకొట్టిన భారీ లారీ
● సంఘటన స్థలంలో వ్యక్తి మృతి ● కొన ఊపిరితో మృతుడి సోదరుడు ● తీవ్రంగా గాయపడిన మృతుడి ఇద్దరు పిల్లలుకొత్తవలస: అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో కొత్తవలస అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువులు, సీఐ సీహెచ్.షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామానికి చెందిన గొల్ల శంకరరావు(52)తన సోదరుడు దారప్పకు చెందిన స్కూటీపై తన ఇద్దరు పిల్లలైన భవానీశంకర్ (6),హరినాథ్(4)లను విశాఖపట్నంలోని ఆర్కేబీచ్ను చూపిద్దామని బయల్దేరారు. కొత్తవలస అగ్నిమాపక కేంద్రం సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన భారీ లారీ స్కూటీని పక్కనుంచి బలంగా ఢీకొట్టింది.దీంతో స్కూటీ వెనక కూర్ఛున్న శంకరరావు(52)తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. స్కూటీపై కూర్ఛున్న ఇద్దరు పిల్లలు తుళ్లిపడి రోడ్డుపై పడ్డారు. స్కూటీని డ్రైవ్ చేస్తున్న దారప్ప తల రోడ్డుకు బలంగా కొట్టుకోవడంతో తల భాగంలో బలమైన గాయాలై ముక్కు, చెవుల నుంచి అధిక రక్తస్రావం జరిగింది. స్థానికులు,108 వాహనానికి సమాచారం అందించిన ఎంతకీ రాకపోవడంతో రోడ్డు సేఫ్టీ వాహనం పోలీస్ సిబ్బంది అప్రమత్తమై క్షతగాత్రులను రోడ్డు సేప్టీ వాహననం వెనుక ట్రక్కులో వేసుకుని స్థానిక పీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించి దారప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. కాగా చిన్నారులు భవానిశంకర్, హరినాథ్లకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక పీహెచ్సీలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుడి మరో సోదరుడు ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. -
పంచాయతీ స్థలం ఆక్రమణ
● ఇంటి నిర్మాణానికి టీడీపీ నాయకుల యత్నం ● అడ్డుకున్న గ్రామస్తులు, మహిళలుబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి ఇంటినిర్మాణానికి పూనుకున్న టీడీపీ నాయకుల ఆగడాలను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమరు 150 గజాల స్థలంపై టీడీపీ నాయకుల కన్నుపడింది. కొత్తగా ప్రభుత్వం ఇంటినిర్మాణాలకు రుణసహాయం చేస్తామని ప్రకటించడంతో ఇంటి నిర్మాణానికి అనుమతి తెస్తానని గ్రామ పంచాయతీకి చెందిన కాలువ, రోడ్డును ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని గ్రామ టీడీపీ నాయకుడి సూచనతో శనివారం రాత్రి జేసీబీతో అక్కడి మట్టిని తొలగించేందుకు ఆక్రమణ దారు ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు, మహిళలు తిరగబడ్డారు. గ్రామంలో ఉన్న ప్రధాన మురుగునీరు పోయే కాలువను, రోడ్డును ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ ఆక్రమణపై పంచాయతీ సెక్రటరీ ఇప్పటికే నోటీసులిచ్చినా తోసిరాజని నిర్మాణానికి ప్రయత్నించడంపై పంచాయతీ శాఖ డీఈఈ వెంకటప్పారావుకు విషయాన్ని చేరవేశారు. జేఈతో సమగ్ర దర్యాప్తుకు డీఈఈ ఆదేశించగా ఇంతలోనే నిర్మాణానికి యత్నించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మురుగునీరు పారే కాలువ, వేగావతికి వెళ్లే రహదారి పూర్తిగా మూసుకుపోతుందని వెంటనే చర్యలు చేపట్టాలని ఇటీవల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కలెక్టర్ నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో సైతం ఫిర్యాదు చేసినా ఆక్రమణను అధికారులు అడ్డుకోకపోవడం, అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇంటి నిర్మాణానికి పూనుకుం టుండంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా అక్కడి పనులను అడ్డుకున్నారు. పంచాయతీ అధికారులనుంచి స్పందన రాకపోవడంతో స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆక్రమణ దారు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో దౌర్జన్యంగా జేసీబీతో పనులు చేపడుతున్నాడని, పంచాయతీ అధికారులు ఇచ్చిన నోటీసులను సైతం పట్టించుకోకుండా ఇంటినిర్మాణానికి పూనుకుంటున్నట్లు, అడ్డగించిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ తీర్మానాలు, అనుమతులు లేకుండా చేస్తున్న నిర్మాణానికి అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడి అండదండలున్నాయని ఈ దురాక్రమణను అడ్డుకోవాలని కోరారు. దీంతో ప్రస్తుతం నిర్మాణం ఆగిపోయినా మళ్లీ చేపడితే తీసుకోవాల్సిన చర్యలపై ఇరు వర్గాలను పిలిచి చర్చిస్తామని పోలీసులు తెలిపారు. -
ఉత్సాహంగా వెటరన్స్ బ్యాడ్మింటన్ పోటీలు
విజయనగరం: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాట్మింటన్ పోటీలు ఉల్లాసంగా సాగాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో గల ఇండోర్ స్టేడియంలో వెటరన్స్ విభాగంలో సీ్త్ర, పురుషులకు నిర్వహించిన బాడ్మింటన్ పోటీలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రారంబించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 100మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ బాడ్మింటన్కు జిల్లాలో పెరుగుతున్న ఆదరణ చూసి ఆనందంగా ఉందన్నారు. మానసిక ఆరోగ్యంతో పాటు, శారీరక ఆరోగ్యం ఎంతగానో మెరుగు పడతాయన్నారు. వెటరన్స్ ఇంతమంది ఆడడం వల్ల యువతకు కూడా స్ఫూర్తిగా నిలిచినవారవుతున్నారనారు. జిల్లాస్థాయి పోటీల్లో క్రీడా స్ఫూర్తితో ఆడి రాష్ట్ర పోటీల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీశ్, అసోసియేషన్ నాయకులు డా.వీఎస్ ప్రసాద్, కుసుంబచ్చన్, కార్యదర్శి నున్నా సురేష్, అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో వెటరన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ధాన్యం కుప్పలు దగ్ధంబాడంగి: మండలంలోని రావివలస గ్రామానికి చెందిన గొర్లిలక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన మూడు ధాన్యం కుప్పలు ఆదివారం కాలిపోయినట్లు బాధితురాలు తెలిపింది. పాల్తేరు రెవెన్యూ పరిధిలోగల పెద్దచెరువు పొలంలో రెండెకరాల వరిచేనును ఒకేచోట మూడుకుప్పలుగా వేయగా కాలిపోయినట్టు కన్నీటి పర్యంతమైంది. మూడుకుప్పలను నూర్చితే సుమారు లక్షరూపాయలకు ధాన్యం వచ్చేవని విలపించింది. ఎవరో కావాలనే తనపై కక్షతో ఈపనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కల్పించుకుని తమకు న్యాయంచేయాలని మొరపెట్టుకుంటోంది. ఐదు దేవాలయాల్లో చోరీవేపాడ: ఒకే రాత్రి..ఒకే ఊరు..ఒకే రహాదారిని ఆనుకుని ఉన్న ఐదు దేవాలయాల్లో హుండీలను దుండగులు పగులగొట్టి సొమ్ము దొంగిలించారు. ఈ సంఘటనతో గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై సుదర్శన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలంలోని బానాది గ్రామంలో ఎం.సింగవరం బల్లంకి వెళ్లే రహాదారిని ఆనుకుని ఉన్న ఐదు దేవాలయాల్లో ఏడు హుండీలు పగులగొట్టి శనివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.41 వేల నగదు ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్లు ఎస్సై తెలిపారు. ఆదివారం ఉదయం ప్రజలు, ఆలయ అర్చకులు వచ్చేసరికి హుండీలు పగలగొట్లి ఆలయం బయట ఉండడంతో ఆవాకై ్క వెంటనే గ్రామపెద్దలు, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఆలయ ఆర్చకుడు మేడపాటి కిశోర్శర్మ ఇచ్చిన ఫిర్యాదుమేరకు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేశారు. ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు ఐదు ఆలయాల్లో చోరీ సంఘటనపై పరిశీలించి గ్రామస్తులను ఆరాతీశారు. క్లూస్ టీమ్ హుండీలు, ప్రధానగేట్పై వేలిముద్రలు సేకరించారు. బైక్పై నుంచి జారిపడి మహిళ మృతిసీతానగరం: మండలంలోని జాతీయరహదారిపై అంటిపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఈ మేరకు స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. రామవరం పంచాయతీ, రెడ్డివాని వలస గ్రామానికి చెందిన రెడ్డి విజయలక్ష్మి గ్రామంలో నుంచి ఓ వ్యక్తి మోటార్ సైకిల్పై ఎక్కి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్పై నుంచి జారి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. గాయాల పాలైన విజయలక్ష్మిని అదే మోటార్ సైకిల్పై చికిత్స నిమిత్తం బొబ్బిలి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. -
రాజాంలో శ్రీలీల సందడి
రాజాం: పట్టణంలోని పాలకొండ రోడ్డులో సీఎంఆర్ షాపింగ్ మాల్ 44వ స్టోర్ను సినీనటి, డ్యాన్స్ క్వీన్ శ్రీలీల ఆదివారం ప్రారంభించారు. తొలుత షాపులో జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్లోని పలు రకాల వస్త్రాలను సందర్శించారు. షాపింగ్మాల్ను ప్రారంభించిన అనంతరం పక్కన ఏర్పాటుచేసిన ఓపెన్ స్టేజ్పైనుంచి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. డ్యాన్స్తో అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్తో తనకెంతో అనుబంధం ఉందని వెల్లడించారు. సీఎంఆర్ అంటే నమ్మకమని వెల్లడించారు. నాణ్యమైన వస్త్రాలు, జ్యూవెలరీ అందరికీ అందుబాటులో సీఎంఆర్ అందిస్తుందన్నారు. రాజాం పట్టణంలో ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడంతో పాటు ఈ ప్రాంత ప్రజలు అందరికీ సరసమైన ధరలకు వస్త్రాలు లభిస్తాయని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ రాజాంలో కొన్ని నెలల క్రితం సీఎంఆర్ జ్యూయలరీ ప్రారంభించామని, ప్రజలు ఎంతో ఆదరించారని తెలిపా రు. ఇప్పుడు వస్త్రదుకాణాన్ని ప్రారంభించామని, 20 మండలాల ప్రజలకు ఈ షాపింగ్ మాల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన వస్త్రాలును అందుబాటు ధరలో ఉంచుతున్నామని, అన్ని రకాల వస్త్రాలపై క్రిస్మస్, సంక్రాంతి ఆఫర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, సీఎంఆర్ డైరెక్టర్ బాలాజీ, లింగమూర్తి, సీవీ జగన్నాథస్వామి, కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, దొరబాబు, రైజింగ్ రాజు తదితరులు ప్రేక్షకులును అలరించారు. -
రామతీర్థసాగర్పై నిర్లక్ష్యం
● ఏడాదిన్నరగా ముందుకు సాగని పనులు ● ప్రాజెక్టు పూర్తయితే 24,710 ఎకరాలకు సాగునీరు ● విజయనగరం పట్టణానికి తాగునీరు ● కూటమిసర్కారు తీరుతో ఆందోళనలో రైతులుపూసపాటిరేగ: కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర సమయం పూర్తవుతున్నా ఒక్క పైసా కూడా విదల్చకపోవడంతో రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. రిజర్వాయర్ ట్యాంకులో అడవిని తలపించినట్లు తుప్పలు పెరిగాయి. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లోని 24,710 ఎకరాలకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు అందుతుంది. గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతినదిలో బ్యారేజీ నిర్మించి కాలువ ద్వారా రోజుకు 1200 క్యూసెక్కుల నీరు మళ్లించి 2.728 టీఎంసీల నీరు రిజర్వాయర్లో నిల్వ ఉండే విధంగా డిజైన్ చేశారు. రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలు 25.22 కిలోమీటర్లు కాగా, సుమారు 12 కిలో మీటర్ల మేర పనులు మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయి. మిగిలిన 13.22 కిలో మీటర్ల పనులు జరగాల్సి ఉంది. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 0.48 టీఎంసీల నీటితో విజయనగరం పట్టణానికి తాగునీరు అందించడానికి ప్రణాళిక సిద్ధమైంది. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత 18 నెలల కాలంగా రిజర్వాయర్ పనులు ముందుకు సాగలేదు. 2006లో రామతీర్థసాగర్ రిజర్వాయర్ను రూ.220 కోట్ల ఖర్చు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. దఫదఫాలు అంచనా వ్యయం పెంచిన ప్రభుత్వాలు 2025 ఫిబ్రవరి నాటికి రూ.808 కోట్లు అంచనా వ్యయంగా ఖరారు చేసింది. ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు సుమారు రూ.100 కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. రామతీర్ధసాగర్ ప్రాజెక్టు ద్వారా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన నీటితో పాటు జిల్లాలో నూతనంగా నిర్మాణం అవుతున్న పరిశ్రమలకు కావాల్సిన నీరు ప్రాజెక్టు ద్వారానే అందించడానికి సన్నాహాలు చేశారు. ప్రాజెక్టు ప్రారంభమై 19 సంవత్సరాలు అవుతున్నా నేటికీ పనులు పూర్తికాని పరిస్థితి. ఇప్పటివరకు సుమారు 55 శాతం వరకు పనులు మాత్రమే జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026 నాటికి పనులు పూర్తి చేయడానికి ఒప్పందం జరిగినప్పటికీ పనుల్లో మాత్రం కదలిక లేదు. నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజలు సాగునీరు, విజయనగరం పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాలి రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తి చేయాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే 55 శాతం పనులు పూర్తి అయ్యాయి. నేటి పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నిలిచిపోయాయి. నియోజకవర్గంలో ప్రజలకు సాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. తాళ్లపూడి అప్పలనాయుడు, రైతు, పూసపాటిరేగ ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలికోరాడపేట, ఏటీ అగ్రహారం గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలి. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి సుమారు 19 సంవత్సరాలు అవుతున్నా పనులు పూర్తి కాలేదు. సకాలంలో పునరావాసం కల్పించాలి. నిర్వాసితుల కాలనీలకు నిధులు మంజూరు చేసి గృహాలు తక్షణమే నిర్మాణం జరిగే విధంగా చూడాలి. కె.కృష్ణ, కోరాడపేట నిర్వాసితుడు -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికలు, సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపికలు ఆదివారం పూర్తయ్యాయి. జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కార్పొరేషన్ కస్పా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 170 మంది క్రీడాకారులు హాజరయ్యారు. హాజరైన క్రీడాకారులకు జూనియర్స్, సీనియర్స్ విబాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా పోటీలు సాగాయి. ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను జూనియర్స్ విభాగంలో ఎంపిక చేయగా.. సీనియర్స్ విభాగంలో మరో 30 మంది అర్హత సాధించారు. జూనియర్స్ విభాగంలో ఎంపికై న బాల, బాలికల క్రీడాకారులు ఈనెల 19,20,21 తేదీల్లో ప్రకాశం జిల్లా పంగులూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి పాల్గొననున్నారు. అదేవిధంగా సీనియర్స్ విభాగంలో అర్హత సాధించిన క్రీడాకారులు ఈనెల 24,26 తేదీల్లో గుడివాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపిక పోటీలను జిల్లా ఖోఖో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వీవీ రమణమూర్తి, అధ్యక్షుడు ఏఎంఎన్ కమలనాభరావు, ప్రధాన కార్యదర్శి కె.గోపాల్, కోశాధికారి ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లి కార్జునారావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎస్.విజయలక్ష్మి, పీడీ వరలక్ష్మి, రామకృష్ణ, రాంబాబు, హరీష్, సత్యనారాయణ, శ్రీను తదితరులు పర్యవేక్షించారు. -
ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి
రాజాం సిటీ: విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డవలప్ చేసుకోవడంతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని పార్లమెంట్ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్పర్సన్, మూర్తి ట్రస్టు చైర్పర్సన్ సుధా మూర్తి అన్నారు. స్థానిక జీఎంఆర్ ఐటీలో ఆదివా రం నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఆంగ్లంలో పట్టు సాధించడంతో పాటు మాతృభాషను చిన్నచూపు చూడకూడదన్నారు. మాతృభా ష, ఆంగ్లభాష శ్రీకృష్ణుడికి ఇద్దరు తల్లులైన దేవకి, యశోదలు వంటివన్నారు. ఆ రెండు భాషలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో మనసులను ఇతర ప్రభావాల నుంచి దూరం చేయడానికి నిరంతర కృషి, సాధన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్బోధించారు. విద్య, వైద్య రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధి రంగాల్లో జీఎంఆర్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వారిని ఉత్తేజపరిచారు. అనంతరం జీఎంఆర్ కేర్, నైరెడ్ లను సందర్శించారు. 19 మంది గిఫ్టెడ్ చిల్డ్రన్స్కు స్కూల్ బ్యాగులను అందించారు. వివిధ విభాగా ల్లో ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులను సత్కరించారు. అంతకుముందు జీఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడు తూ సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా రచయితగా పేరుగాంచిన సుధామూర్తి ఎంతో మందికి ఆదర్శ మని కొనియాడారు. కార్యక్రమంలో జీఎంఆర్ గ్రూపు చైర్మన్లు బీవీ నాగేశ్వరరావు, జీబీఎస్ రాజు, బొమ్మిడాల రమాదేవి, గ్రంథి పెదబాబు, పీడీకే రా వు, ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రహసనంగా... పరిష్కార వేదిక
●పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన అర్జీదారుడు ఒకరు పురపాలక పరిపాలన శాఖకు సంబంధించిన సమస్యను ఈ నెల 10న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీ పెట్టుకున్నారు. రెండు రోజుల్లో అంటే ఈ నెల 12న విచారణ నివేదికను అర్జీదారులకు పంపారు. అయితే విచారణ జరిగిన తేదీలు పరిహాసం కలిగించాయి. విచారణకు రమ్మని నోటీసు ఇచ్చిన తేదీలు గత నెల 28వ తేదీ అంటూ నివేదికలో ఇచ్చారు. పరిశీలనా ప్రశ్నలన్నింటినీ అర్జీదారుని కలిసినట్టు, విచారణ సమయంలో ఫొటో కూడా తీసినట్టు నివేదికలో ఇచ్చారు. నివేదిక చూసిన అర్జీదారుడు ఒకింత ఆశ్చర్యపోయారు. ●రేగిడి ఆమదాలవలస మండలం బూరాడ గ్రామంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణపై గడిచిన మూడు వారాలు జరిగిన పీజేఆర్ఎస్కి ఆ గ్రామ సర్పంచు వావిలపల్లి శశిభూషణరావు, ఎంపీటీసీ సభ్యులు వావిలపల్లి జగన్మోహనరావు, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులతో పాటు 11 మంది ఫిర్యాదులు ఇస్తునే ఉన్నారు. కలెక్టర్ని కలిసి వినతిపత్రం ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఆ గ్రామ పంచాయతీ సర్వే నెం.64–2 విస్తీర్ణం యూ.3.12 సెంట్లుతో వ్యవసాయ పట్టాలు రద్దు చేయమని కోరారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వారు చెప్పుకున్నారు. ఆ అర్జీలు కాగితాలకే పరిమితమై రెవెన్యూ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇలాంటి అర్జీదారుల వినతులను రీ ఓపెన్ చేస్తునే ఉన్నారు. కానీ పరిష్కార నివేదికలో మాత్రం కాకి లెక్కలతో సక్సస్ చూపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయనగరం అర్బన్: ప్రజల సమస్యలను పరిష్కరిస్తామనే లక్ష్యంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహణ ప్రజలను పరిహాసం చేస్తుంది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కేవలం కాగితాలపై పరిష్కార నివేదికలుగా మారాయి. గత ప్రభుత్వం ‘స్పందన’ పేరుతో సచివాలయ గ్రామ, వార్డు స్థాయిలోనే ఫిర్యాదులు తీసుకొని ముఖ్యమంత్రి పేషి దృష్టికి నేరుగా వెళ్లే వ్యవస్థను నిర్మించింది. నిర్థిష్ట సమయంలో అధికారులు పరిష్కరించకపోతే చర్యలు తీసుకొనే పరిస్థితి ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం ఆ వ్యవస్థను నీరుగార్చుతోందనే అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత స్పందన పేరును మార్చుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ప్రారంభం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు అర్జీలు పరిశీలిస్తే అఽత్యధికంగా రెవెన్యూ విభాగానికే 26,849 వినతు లు వచ్చాయి. వీటిలో తొలిసారి పెట్టిన అర్జీకి పరిష్కారం కానివి 80 శాతం వరకు ఉన్నాయి. రెండోసారి ఫిర్యాదును రీ ఓపెన్ చేసినవి వాటిలో 60 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు పీజీఆర్ఎస్ నిర్వహణపై నమ్మకం లేక రీ ఓపెన్ చేయడం లేదని తెలుస్తుంది. మరో వైపు రెవెన్యూ శాఖలో ఇంతవరకు పరిష్కా రం కాకుండా పెండింగ్లో 1,879 వినతులు ఉన్నా యి. వీటిని మళ్లీ రీ ఓపెన్ చేస్తున్నారు. ఈ నెల ఒకటి నాటికి 4.12 శాతం అర్జీలను రీ వెరిఫికేషన్ పోర్టల్లో ఉంచారు. సాక్షి, గజపతినగరం సెల్ : 90102 04447 -
ప్రజాగ్రహం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రజా వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తూ తమనెవ రూ ఆపలేరని... తన మాటే శాసనమని విర్రవీగిన చంద్రబాబు ప్రభుత్వ అహంకారాన్ని కలంతో ప్రజ లు నిలదీశారు. తమ ప్రాణాలకు విలువ లేదా.. ఆరోగ్యమంటే లెక్కలేదా..? అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేసిన కృషిని నేటి కార్పొరేట్ ప్రభుత్వం తుంగలోకి తొక్కుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న యత్నాన్ని ప్రజలు గొంతెత్తి ప్రశ్నించారు. తమ పట్ల ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను.. మోసాన్ని సహించలేని ప్రజలు ఆగ్రహోగ్రులయ్యారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని దించేసి అధికారం ఉంటే కచ్చితంగా దించేసేవారే.. కానీ దానికింకా టైముంది.. అందుకే అందాకా సంతకాలతో తమ నిరసన తెలియజేశారు. కోటి సంతకాల సేకరణకు స్వచ్ఛంద ప్రజా మద్దతు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోగా.. అందులో 5 కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకుని తరగతులు ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. మిగిలిన 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక భారం పేరిట పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయటాన్ని బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ఊరూ వాడా మద్దతు పలికింది. భవిష్యత్తు మీద ఆందోళనతో విద్యార్థి లోకం.. ఆరో గ్య భద్రతపై బెంగతో వృద్ధులు సైతం ఈ సంతకా ల్లో మేము సైతం అని పాల్గొన్నారు. మన్యం ప్రజ లు ఈ ఉద్యమానికి మోసులెత్తగా.. పట్టణ ప్రజలు పరుగులెత్తారు. పల్లెలు పట్టుగొమ్మలయ్యాయి.. విద్యార్థులు వీరులై కదలివచ్చారు. దీంతో మొత్తానికి విజయనగరం... పార్వతీపురం మన్యం జిల్లాల్లో కోటి సంతకాల ఉద్యమం ఘనంగా సాగింది. ఈ సంతకాల ప్రతులు ఇప్పుడు గ్రామాలూ.. మండలాలు.. పట్టణాలను దాటుకుని జిల్లా కేంద్రాలకు చేరుతున్నాయి. ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి గవర్నరుకు అందజేస్తారు. ప్రజా వ్యతిరేకతను గవర్నరుకు వివరించడం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు.. దమననీతిని దేశవ్యాప్తం చేసేందుకు వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించ తల పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న సోమ వారం విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లా కేంద్రంలో ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రాల నుంచి విజ యవాడలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం ఈ నెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గవర్నరుకు కోటి సంతకాలు అందజేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృత పరించేందుకు చేపట్టిన ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలియజేయటం ద్వారా ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గాల వారీగా సేకరించిన సంతకాల వివరాలు.. విజయనగరం : 54,889 ఎస్.కోట : 52,000 గజపతినగరం : 60,000 చీపురుపల్లి : 62,500 నెల్లిమర్ల : 67,019 బొబ్బిలి : 52,500 రాజాం : 51,000 పాలకొండ : 63,000 కురుపాం : 55,000 పార్వతీపురం : 64,000 సాలూరు : 35,000 -
నేడు పీజీఆర్ఎస్
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు ఎస్.రాంసుందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పా రు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని సరిగా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదు ను తీసుకురావాలని సూచించారు. మండల, డివిజన్ అధికారుల కార్యాలయంలో కూడా పీ జీఆర్ఎస్ నిర్వహించాలని ఆదేశించారు. విజయనగరం టౌన్: గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త పూస పాటి అశోక్ గజపతిరాజు ఎంపికవ్వడం తెలు గు వారందరికీ గర్వకారణమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పేర్కొన్నారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం ఆత్మీ య సత్కార సభను నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు గా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజాం : స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో రాజాంకు చెందిన శ్రీ పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివా రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు కత్తులకవిటికి చెందిన ఎన్ఆర్ఐ, సామాజిక సేవా కార్యకర్త దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు, ఆయన బంధువులు ఘనంగా సత్కరించారు. అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్ర దర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కా ర్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్ : శాంతిభద్రతల దృష్ట్యా వైఎస్సార్సీపీ సోమవారం తలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించినట్టు విజయనగరం ఇన్చార్జ్ ఆర్.గోవిందరావు వెల్లడించడంపై జనం విస్తుపోతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత మరింతగా బయటపడి చంద్రబాబు పాలనపై ప్రజాగ్రహం మరింత రెట్టింపు కావడం ఖాయ మనే భావనతోనే ప్రభుత్వమే ఇటువంటి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేసే హక్కు పౌరులకు ఉంటుందని, దీన్ని అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలో ర్యాలీకి అనుమతి కోరారని.. కానీ ర్యాలీ నిర్వహించ తలపెట్టిన ప్రాంతం ముఖ్య వ్యాపార కూడళ్లు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా శాంతి దృష్ట్యా ర్యాలీకి అనుమతి నిరాకరించినట్టు ఇన్చార్జ్ డీఎస్పీ ఆదివారం వెల్లడించడంతో పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు, మేధావులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజా వ్యతిరేక నిర్ణయంపై పోరాటం
విజయనగరం: ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాల్లో కీలకమైన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 15న సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలో తలపెట్టిన ప్రజా చైతన్య ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఏపీ శాసనసభా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 15న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించతలపెట్టిన ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లును ఆదివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్ జంక్షన్ వద్ద గల దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల ప్రతులతో ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించటం ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే విజయనగరం జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులు, మేధావులు, వ్యాపారులు అన్ని వర్గాల ప్రజల స్వచ్ఛంద మద్దతుతో సేకరించిన సుమారు 4 లక్షల సంతకాల ప్రతులను వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో భద్రపరచటం జరిగిందన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించేలా చేపట్టిన కార్యక్రమం విజయవంతమైందన్నారు. సోమవారం నిర్వహించే ర్యాలీలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పక్షాలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదు కోట్ల మంది ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ప్రజా మద్దతుతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇలా సేకరించిన సంతకాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఈ నెల 18న రాష్ట్ర గవర్నరుకు అందజేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, నగర ప్రధాన కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, కార్పొరేటర్లు బండారు ఆనంద్, బోనెల ధనలక్ష్మి, పట్నాన పైడిరాజు, పార్టీ నాయకులు పిన్నింటి సూర్యనారాయణ, భోగాపురపు రవిచంద్ర, కాళ్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
అంతా బాగుందనుకున్నారు... ఇంతలోనే...
● చికిత్స పొందుతూ మృత్యు ఒడికి చేరిన పాలిటెక్నిక్ విద్యార్థి ● కన్నీరుమున్నీరుగా విలపించిన తండ్రి ● ప్రాణం మీదకి తెచ్చిన ట్రాక్టర్ లిఫ్ట్చీపురుపల్లి: తానొకటి తలచితే.. దైవం మరొకటి తలచింది.. అన్న సామెత అక్షరాల ఆకాష్ విషయంలో స్పష్టమయ్యింది. ప్రతీ రోజూ మాదిరిగా కళాశాల విడిచిపెట్టారు. ఆకాష్ ఇంటికో.. వసతిగృహానికో.. వెళ్లిపోవాలనే రోడ్డెక్కాడు. స్నేహితులతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ రోడ్డుపై నడుస్తున్నాడు. కానీ విధి ఆ యువకుడుని మృత్యువు వైపు లాగుతుండడంతో వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ను లిఫ్ట్ అడిగేలా చేసింది. ఆ ట్రాక్టర్ లిఫ్ట్ కాస్త నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆకాష్ను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లింది. ఐదు రోజులుగా కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పాలిటెక్నిక్ విద్యార్థి ఆకాష్(17) శనివారం మృతి చెందాడు. వెల్డింగ్ పని చేసుకుంటూ కొడుకుని బాగా చదివించుకోవాలని ఎంతో కోరికతో పాలిటెక్నికల్ విద్య చదివిస్తున్న ఆకాష్ తండ్రి కన్న కలలు చెదిరిపోయాయి. ఎంతో ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు కళ్ల ముందు విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. ప్రాణాల మీదకు తెచ్చిన ట్రాక్టర్ లిఫ్ట్ జామి మండలంలోని అలమండ గ్రామానికి చెందిన జి.ఆకాష్ పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక ఎస్సీ కళాశాలల బాలుర వతిసగృహంలో ఉంటూ చదువుతున్నాడు. ఈ నెల 6న కళాశాల ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆకాష్ తిరిగి 8న నేరుగా కళాశాలకు వచ్చాడు. ఆ రోజు కూడా తరగతులు ముగించుకుని పట్టణ శివారున ఉన్న కళాశాల నుంచి స్నేహితులతో కలిసి రోడ్డెక్కాడు. వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ను లిఫ్ట్ అడిగాడు. కుర్రాళ్లు లిఫ్ట్ అడిగారు కదాని ట్రాక్టర్ డ్రైవరు ఆపి లిఫ్ట్ ఇచ్చాడు. నలుగురు స్నేహితులతో కలిసి ట్రాక్టర్ ఎక్కిన ఆకాష్ ట్రాక్టర్ కదిలిన కాసేపటికే ఇంజన్ – తొట్టె మధ్య భాగంలో ప్రమాదవశాత్తూ జారి పడిపోయాడు. దీంతో ఆకాష్పై నుంచి ట్రాక్టర్ వెళ్లింది. చికిత్స పొందుతూ మృత్యు ఒడిలోకి ఈ నెల 8న కేజీహెచ్లో చేరిన ఆకాష్కు కలెక్టర్ ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో శస్త్ర చికిత్స కూడా నిర్వహించారు. గత ఐదు రోజులుగా వసతిగృహ సంక్షేమాధికారి మంగళగిరి శ్రీనివాసరావు కేజీహెచ్ వద్దనే ఉంటూ ఆకాష్ యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. శుక్రవారం నాటికి ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు కూడా చెప్పారు. కానీ ఇంతలోనే ఏమైందోగాని శనివారం మృతి చెందడం కలచివేసింది. ఈ మేరకు చీపురుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాంకేతిక నైపుణ్యాలపై పరిజ్ఞానం అవసరం
● విశాఖ ఎఫ్ అండ్ ఓఐసీ, ఎస్టీపీఐ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాత ● జేఎన్టీయూ జీవీలో ఘనంగా జెన్ ఏఐ హ్యాకథాన్ ప్రోగ్రామ్ విజయనగరం రూరల్: ప్రపంచ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలపై పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సిన అవపరం ఎంతైనా ఉందని విశాఖపట్నానికి చెందిన ఎఫ్ అండ్ ఓఐసీ, ఎస్టీపీఐ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాత అన్నారు. స్థానిక జేఎన్టీయూ – జీవీలో హైదరాబాద్కు చెందిన జెన్ ఏఐ వర్సిటీ, జేఎన్టీయూ జీవీ సంయుక్త ఆధ్వర్యంలో ‘జెన్ ఏఐ హ్యాక్థాన్ ఫరధ నెక్ట్స్ జనరేషన్ జాబ్స్’ సాంకేతిక కార్యక్రమాన్ని శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాస్త్రవేత్త సురేష్ బాత మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్య పూర్తయిన తరువాత విద్యార్థులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి ఇటువంటి హ్యాక్థాన్ కార్యక్రమాలకు హాజరవడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. తద్వారా కృత్రిమ మేధస్సును (ఏఐ) ఉపయోగించి సమాజానికి మేలు చేస్తూ, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జెన్ ఏఐ వర్సిటీ చీఫ్ అకాడమీ అధికారి నరేంద్ర అల్లం మాట్లాడుతూ ఏఐలో నైపుణ్యం ఉన్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, మానవ మనుగడలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. జేఎన్టీయూ జీవీ రిజిస్ట్రార్ జి.జయసుమ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుతో భావి తరాల నాయకులు, ఆవిష్కర్తలు, సమస్యలకు పరిష్కారాలు చూపే వారిని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర అల్లం రచించిన పైథాన్ ప్రోగ్రామింగ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శాస్త్రవేత్త సురేష్ బాతను ఘనంగా సత్కరించారు. ప్రోగ్రామ్ కన్వీనర్, జేఎన్టీయూ జీవీ ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, సమన్వయకర్తలు డాక్టర్ జిజె.నాగరాజు, ఆర్డిడివి.శివరామ్, ఆచార్యులు కె.బాబు, జి.స్వామినాయుడు, కెసిబి.రావు, డి.రాజ్యలక్ష్మి, కలేషావలి, ఆర్.గురునాధ, కె.అచ్యుతకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి శృంగవరపుకోట : అరుకు ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువు పాలయ్యాడు. ఎస్.కోట పట్టణంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న షేక్ ఇర్ఫాన్(19) శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎస్.కోట నుంచి మేక మాంసం తీసుకుని, స్నేహితునితో కలిసి అనంతగిరిలో ఇటీవల ప్రారంభించిన దుకాణానికి రాత్రి 9.30గంటల సమయంలో వెళ్తుండగా కాశీపట్నం టోల్గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టాడు. దీంతో ఇర్ఫాన్ బైక్ పై నుంచి ఎగిరి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడిని ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తెచ్చి అక్కడి నుంచి విశాఖకు తరలిస్తుండగా మార్గం మద్యలోనే ఇర్ఫాన్ మృతి చెందాడు. ఇర్ఫాన్ తండ్రి మదీనా బైక్ మెకానిక్గా పని చేస్తుండగా, తల్లి, తమ్ముడు ఉన్నారు. -
జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
● జిల్లా పర్యటనలో టీఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు విజయనగరం అర్బన్: రాష్ట్రంలో సాస్కి (ఎస్ఏఎస్సీఐ) పథకం ద్వారా వచ్చే నిధులతో జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని టీఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీటీ కృష్ణబాబు తెలిపారు. శనివారం ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు రహదారులను పరిశీలించారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆర్అండ్బీ అతిథిగృహాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డితో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రహదారుల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ ఈ ఏడాది సాస్కి పథకం కింద రూ.500 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టామని, వచ్చే ఏడాది నుంచి రూ.2 వేల కోట్లతో మరింత విస్తృతంగా పనులు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి అనుకూల సమయమని గుంతల పూడ్చే పనులను వేగవంతం చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు వేగంగా చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లను పదోన్నతి ఇచ్చి గ్రేడ్–1 వర్క్ ఇన్స్పెక్టర్లుగా తీసుకునేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైల్వే సంబంధిత సమస్యలు పరిష్కారానికి పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డీఓ, రైల్వే అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఆర్అండ్బీ ఈఎన్సీ వి.రామచంద్ర, సూపరింటెండెంట్ ఇంజినీర్ కాంతిమణి, ఆర్డీవో దాట్ల కీర్తి, ఆర్అండ్బీ ఈఈలు, డీఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
కె.సీతారాంపురంలో ఘోర అగ్ని ప్రమాదం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో కె.సీతారాంపురంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని తహసీల్దార్ జి.హేమంత్కుమార్ జిల్లా కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆర్డీవో రామమోహన్రావు శనివారం గ్రామానికి వచ్చి పాపమ్మ మృతదేహాన్ని, బాధితులను పరామర్శించారు. రెవెన్యూ పరంగా ఐదు రోజులకు సరిపోయే ఆహార పదార్ధాలను బాధితులకు అందజేశారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో బాధితులకు పునరావాస కేంద్రాన్ని తహసీల్దార్ ఏర్పాటు చేశారని, ఇల్లు కాలిపోయిన బాధితులకు నష్టపరిహారంగా రూ.13వేలు చొప్పున అందించనున్నట్టు చెప్పారు. ఉప తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ కృష్ణమూర్తి, వీఆర్వోలు గణపతి, రాము, శ్రీనివాసరావు, సుధాకర్, రవి తదితరులు సంఘట జరిగిన నుంచి గ్రామంలోనే ఉండి వివరాలు సేకరించడంతో పాటు, బాధితులకు సేవలు అందించారు. బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్ఐ సాగర్బాబు సంఘటనా స్థలానికి వచ్చి అగ్ని ప్రమాదంలో మృతి చెందిన పాపమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే మృతురాలికి శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం చేయించారు.తెర్లాం: మండలంలోని కొరటాం గ్రామ పంచాయతీ కె.సీతారాంపురం(చిన గొలుగువలస) గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 12 పూరిళ్లు పూర్తిగా కాలిపోగా, 85ఏళ్ల వృద్ధురాలు సజీవ దహనమైంది. దీనికి సంబంధించి శనివారం స్థానికులు, బాధితులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని యాతవీధి(కల్లుగీత కార్మికులు)లో శుక్రవారం రాత్రి 10.30గంటల సమయంలో కోష్టు లక్ష్మి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో అదే వరుసలో ఉన్న 12 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కోష్టు లక్ష్మి ఇంట్లో ఉంటున్న ఆమె అత్త కోష్టు పాపమ్మ(85)మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. ప్రమాదంలో గ్రామానికి చెందిన ఎద్దుమంటి వెంకటమ్మ, కోష్టు చినవెంకటయ్య, పోలారావు, లక్ష్మి, గురువులు, ఆదమ్మ, పెదవెంకట రమణమ్మ, పెదనర్సయ్య, అప్పడు, నక్క రవణమ్మ, చోడి సింహాచలం, రాములుకు చెందిన ఇళ్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంలో సుమారు రూ.6లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని రాజాం అగ్నిమాపక కేంద్రం అధికారులు, రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. సజీవ దహనమైన వృద్ధురాలు పాపమ్మ గ్రామంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో ఇంట్లో ఉన్న కోడలు, పిల్లలు భయంతో బయటకు వెళ్లిపోయారు. మంచంపై ఉన్న కోష్టు పాపమ్మ(85) అనే వృద్ధురాలు బయటకు రాలేకపోవడంతో మంటల్లో చిక్కుకుంది. గ్రామస్తులు స్పందించి ఆమెను మంటల్లో నుంచి బయటకు తీసేటప్పటికే కాలిపోయి మృతి చెందింది. మృతురాలు పాపమ్మకు కోడలు లక్ష్మి, ఆమె కుమారుని పిల్లలు మాత్రమే ఉన్నారు. పాపమ్మ అగ్ని ప్రమాదంలో మృతి చెందడంతో కోడలు, ఆమె మనవరాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. కట్టుబట్టలతో... ఈ అగ్ని ప్రమాదంలో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాదంలో ఇళ్లల్లో ఉన్న సామగ్రి, బట్టలు, తిండి గింజలు, బంగారం, వెండి, నగదు, ఇండేన్ గ్యాస్ సిలెండర్లు, ధ్రువీకరణ పత్రాలు, రేషన్కార్డులు, పెన్షన్ కార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన కోష్టు గురువులకు చెందిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.80వేలు నగదు, 50తులాల వెండి, తిండి గింజలు కాలిపోయాయి. కోష్టు అప్పన్నకు చెందిన అర తులం బంగారు వస్తువులు, సారి సామాన్లకు ఉంచిన రూ.లక్ష నగదు కాలి బూడిదైంది. కోష్టు పెదనర్సయ్యకు చెందిన 10 తులాల వెండి, రూ.20 వేలు నగదు కాలిబూడిదైంది. కోష్టు లక్ష్మికి చెందిన పావు తులం బంగారం, 10తులాల వెండి పట్టీలు, రూ.8వేలు నగదు ఈ ప్రమాదంలో కాలిపోయాయని బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నారు. బాధితులందరికీ కట్టు బట్టలు మినహా ఒక్క వస్తువు కూడా మిగలకుండా కాలిపోయాయి. ప్రమాద విషయాన్ని రాజాం అగ్ని మాపక కేంద్రానికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంబంధిత అధికారులు, సిబ్బంది శకటంతో వచ్చి మంటలను అదుపు చేశారు.కె.సీతారాంపురం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి అధికారులతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు కాలిపోయిన 12 పూరిళ్లు మంటల్లో సజీవ దహనమైన వృద్ధురాలు కోష్టు పాపమ్మ బాధితులను పరామర్శించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో, తహసీల్దార్ రూ.6 లక్షల ఆస్తి నష్టం కె.సీతారాంపురం(చినగొలుగువలస) గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద వార్తను తెలుసుకున్న జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడుతో కలిసి శనివారం ఉదయం గ్రామానికి వచ్చి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలను స్థానిక నాయకులను, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారితో పాటు తెర్లాం ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రతినిధులు నర్సుపల్లి బాబ్జీరావు, గర్భాపు రామారావు, వైస్ ఎంపీపీలు చేపేన సత్యనారాయణ, అప్పలరాజు, కొరటాం ఎంపీటీసీ సాకేటి నాగమణి, గొలుగువలస సర్పంచ్ ప్రతినిధి గులివిందల శంకరరావు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. అగ్ని ప్రమాద బాధితులను బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పరామర్శించారు. -
లోక్అదాలత్లో 9,513 కేసుల పరిష్కారం
విజయనగరం లీగల్: రాజీయే రాజమార్గమని, కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహపూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. జాతీయ లోక్అదాలత్ వల్ల కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు వృథా కాదన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో శనివారం నిర్వహించి జాతీయలోక్అదాలత్లలో 9,513 కేసులు పరిష్కరించినట్టు వెల్లడించారు. వాటిలో సివిల్ కేసులు 424, క్రిమినల్ కేసులు 9,028, ప్రీ లిటిగేషన్ కేసులు 61 ఉన్నాయన్నారు. బీమా కంపెనీకి చెందిన రూ.90 లక్షలను మోటారు ప్రమాద బీమా కేసుల్లో పిటిషనర్లకు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, నాలుగవ శ్రేణి న్యాయమూర్తి బి.అప్పలస్వామి, మహిళా మరియు ఐదవ జిల్లా న్యాయమూర్తి ఎన్.పద్మావతి, కె.నాగమణి, పోక్సోకోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయమూర్తి ఎ.కృష్ణ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి, బార్ అసోసియేషన్ సభ్యులు, కక్షిదారులు పాల్గొన్నారు. జాతీయ లోక్అదాలత్కు హాజరైన కక్షిదారులందరికీ న్యాయవాది కుమారస్వామి మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటుచేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత -
గడ్డివాములు దగ్ధం
తెర్లాం: మండలంలోని గొలుగువలస గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములతో పాటు ధాన్యం పాక్షికంగా కాలిపోయాయి. దీనికి సంబంధించి బాధితులు శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాకేటి శ్రీనివాసరావు, అప్పలనాయుడులకు చెందిన గడ్డివాములు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. గడ్డివాముల పక్కనే నూర్పిడి చేసి నిల్వ ఉంచిన ఽగొట్టిపల్లి గణపతికి చెందిన ధాన్యం కూడా పాక్షికంగా మంటలకు కాలిపోయాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వెళ్లి మంటలను ఆదుపు చేయడంతో ధాన్యం పూర్తిగా కాలిపోకుండా నివారించగలిగామని రైతులు అంటున్నారు. గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్ హేమంత్కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు గ్రామానికి వెళ్లి కాలిపోయిన గడ్డివాములను, పాక్షికంగా దెబ్బతిన ధాన్యాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ ప్రతినిధి గర్భాపు రామారావు, గొలుగువలస సర్పంచ్ ప్రతినిధి గులివిందల శంకరరావు, ఎంపీటీసీ సభ్యురాలు సాకేటి నాగమణి, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు ఉన్నారు. నాకౌట్ దశకు సాఫ్ట్బాల్ పోటీలు వీరవాసరం: వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు. రెండవ రోజు విజయనగరం జిల్లా బాలికల జట్టు గుంటూరు జట్టుపై 02:01 తేడాతో.. విజయనగరం జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 04–01 తేడాతో గెలుపొందాయి. బాలికల క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జట్టు శ్రీకాకుళం జట్టుపై 12–01 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అలాగే బాలుర ఫలితాల్లో విజయనగరం జట్టు విశాఖ జట్టుపై 03–00 తేడాతో, విజయనగరం జట్టు చిత్తూరు జట్టుపై 05–00 తేడాతో విజయం సాధించాయి. బాలుర క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జట్టు ప్రకాశంపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బాల బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాచింకి శ్రీనివాస్ తెలిపారు. ప్రారంభమైన పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు శనివారం స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది ఉండదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని కొనియాడారు. పారా రాష్ట్ర స్థాయి పోటీలను తొలిసారిగా విజయనగరంలో నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎవరికి తక్కువ కాదని, జిల్లాలో ప్రతిభ గల దివ్యాంగ క్రీడాకారులకు కొదవ లేదని వారిని గుర్తించి క్రీడల్లో ప్రోత్సహిస్తున్న పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, మాజీ రోటరీ గవర్నర్ డాక్టర్. ఎం.వెంకటేశ్వరరావు, రాష్ట్ర స్థాయి పోటీల కన్వీనర్ నాలుగెస్సుల రాజు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్, విశాఖపట్నం గౌరవ అధ్యక్షులు డాక్టర్ షీతల్ మదాన్, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గణేష్, సారధి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ప్రదీప్, ప్రతాప్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
బంగారం కోసం వృద్ధురాలి హత్య
● ఆర్అండ్ఆర్ కాలనీ ముడసర్లపేటలో దారుణం భోగాపురం: రెండు తులాల బంగారం కోసం వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీ ముడసర్లపేట గ్రామానికి చెందిన ముడసర్ల అప్పయ్యమ్మ (70) ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెను హత్య చేసి ముక్కు, చెవి, మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు నగలను అపహరించుకుని మృతదేహాన్ని సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకు వద్ద వదిలేసి పారిపోయారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు జీవనోపాధి కోసం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లాడు. చిన్న కుమారుడు భవానీ మాల వేసుకుని కుటుంబంతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ కొండకు వెళ్లాడు. దీంతో ఇంట్లో ఎవరు లేకపోవడంతో దుండగులు ఇంట్లోకి చొరబడి అప్పయ్యమ్మను దారుణంగా హత్య చేసి ముక్కు, చెవి, మెడలో ఉన్న బంగారాన్ని అపహరించుకుని పారిపోయారు. స్థానికులు ఉదయం వాటర్ట్యాంకు దగ్గర విగతజీవిగా పడి ఉన్న అప్పయ్యమ్మ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై పాపారావులు విశాఖపట్నం రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్సీకి తరలించారు. మృతురాలి పెద్ద కోడలు ముడసర్ల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే హత్య చేసిన దుండగులను గుర్తించి అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. -
ధాన్యం సేకరణపై విచారణ
విజయనగరం ఫోర్ట్: తేమశాతం పేరుతో అదనంగా రైతుల నుంచి మిల్లర్లు ధాన్యం తీసుకుంటున్నారనే అంశంపై ‘రైతు కష్టం మిల్లర్ల పాలు..!’ అనే శీర్షికన ‘సాక్షిలో’ శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో సీఎస్డీటీ మూర్తి విచారణ చేపట్టారు. రావివలస వద్ద ఉన్న కనకదుర్గ మిల్లు యాజమాని అదనంగా ధాన్యం తీసుకున్నట్టు రైతులు కరకనాయుడు, పి.దేముడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేశారు. మడ్డువలస నీరు విడుదల వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా రబీ సీజన్కు ప్రాజెక్టు సిబ్బంది శనివారం సాగునీరు విడుదల చేశారు. తొలిరోజు 200 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టగా అవసరం మేరకు నీటి సరఫరా పెంచనున్నారు. ఈ సీజన్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని సిబ్బంది రైతులను సూచించారు. ఆయకట్టు పరిధిలో వంగరలో 996 ఎకరాలు, రేగిడి ఆమదాలవలసలో 6,777 ఎకరాలు, సంతకవిటిలో 6,599 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 3,029 ఎకరాలు, పొందూరులో 99 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఉడకని అన్నం.. రుచిలేని కూర..? ● పోటీల నిర్వహణకు ఏర్పాట్లు లేమి ● ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి క్రీడాపోటీల నిర్వహణపై అసంతృప్తి విజయనగరం: ఉపాధ్యాయుల క్రీడాపోటీల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ... సౌకర్యాలు తక్కువ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పురుషుల విభాగంలో క్రికెట్, సీ్త్రల విభాగంలో త్రోబాల్ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి విజేతలకు విజయనగరం విజ్జి స్టేడియం వేదికగా శని, ఆదివారం డివిజిన్ స్థాయి పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం రూ.20వేలు చొప్పున కేటాయించారు. విజయనగరం డివిజన్ పరిధిలోని 11 మండలాలకు చెందిన క్రీడా పోటీల నిర్వహణపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. నిర్దేశిత సమయానికి పోటీలు ప్రారంభించకపోవడం, కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. క్రికెట్ పోటీల్లో కార్క్ బాల్ను వినియోగించగా... అందుకు అవసరమైన బ్యాట్లు, ప్యాడ్లు, హెల్మెట్, గార్డ్స్ వంటి పరికరాలు సమకూర్చలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన పోటీలను 11 గంటల వరకు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయకపోగా... మధ్యాహ్నం భోజనం కూడా ఉడకని అన్నం... సాంబారు, ఒక్క కూరతో వడ్డించడాన్ని ఆక్షేపించారు. మొదటి రోజు పోటీలను ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ప్రారంభించారు. -
అంతర్జాతీయ వైజ్ఞానిక దృక్పథం అవసరం
విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ విద్య కోర్సుల్లో అంతర్జాతీయ దృక్పథం ఉండాలని, అప్పుడే డిగ్రీ పూర్తయిన తరువాత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జర్మనీ స్మోల్ట్సిక్ అండ్ పార్ట్నర్ ప్రాజెక్టు మేననేజర్ సురేష్ టంకాల అన్నారు. సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ‘సిద్ధాంతం నుంచి వాస్తవంలో రూపంలోకి–ఇంజినీరింగ్ విద్యలో అంతర్జాతీయ దృక్పథాలు’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. సిద్ధాంతాత్మక జ్ఞానాన్ని ప్రాయోజిత ఇంజినీరింగ్ పనులతో అనుసంధానం చేయాలన్నారు. కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డి.వి.రామమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకటలక్ష్మి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధితి జి.రవికిషోర్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్కు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.భార్గవి సమన్వయ కర్తగా వ్యవహరించారు. -
చిన్నారులకు ఆపన్నహస్తం
జామి: తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు విజయ్, గౌతమ్లకు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. చిన్నారుల దీన స్థితిపై ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, దాతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా జడ్జితో పాటు పలువురు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎస్.కోట యూట్యూబ్ ఛానల్కి చెందిన నవీన్రామ్సింగ్ శనివారం జన్నివలస గ్రామానికి వచ్చి పిల్లలకు చిన్నగృహం నిర్మాణం నిమిత్తం రూ.40 వేలును వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు. నిత్యావసర సరుకులు, దుస్తులు వితరణగా అందజేశారు. పలువురు దాతలు చిన్నారులకు అండగా నిలుస్తుండడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి కథనానికి స్పందన -
విశాఖ నుంచి వస్తూ కారు ప్రమాదం
పాలకొండ రూరల్: మండలంలోని అట్టలి గ్రామ మలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను భయోత్పాతానికి గురిచేసింది. విశాఖ నుంచి దంపతులు పాలకొండ వయా పార్వతీపురం మీదుగా జియమ్మవలసకు తమ కారులో వెళ్తుండగా అట్టలి మలుపు దగ్గరకు చేరుకుంటున్న క్రమంలో వారి కారు అదుపు తప్పి కుడివైపు పంటపొలాల్లోకి దూసుకువెళ్లబోతూ అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవగాం విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే 11–కేవీ విద్యుత్ స్తంభం విరిగిపోయింది. నిప్పులు చిమ్ముతూ సిమెంట్ స్తంభం కారుపైకి ఒరిగిపోవటంతో అక్కడివారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అదృష్టవశాత్తు కారు ముందు భాగం నుజ్జవడం మినహా అందులో ప్రయాణిస్తున్న దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికుల సహాయంతో దంపతులు సురక్షితంగా బయటపడి స్వగ్రామం పయనమయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
చెరకు రైతుకు ఊరట
రేగిడి: విజయనగరం జిల్లాలోనే కాకుండా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో చెరకు సాగుచేస్తున్న రైతులకు ఈ ఏడాది ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రభుత్వ అలసత్వం కారణంగా చెరకు రైతులు ఇప్పటికే సాగు తగ్గించేశారు. కాస్తో కూస్తో సాగుచేస్తున్న రైతులను ఆదుకునే పరిస్థితిలో కూటమిప్రభుత్వం లేదు. గతేడాది వరకూ మూడు జిల్లాల చెరకు రైతులకు ఆసరాగా మిగిలిన రేగిడి మండలంలోని సంకలి వద్ద గల ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం ఈ ఏడాది విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి చెరకును సేకరిస్తోంది. గతంలో రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించే ఈ ఫ్యాక్టరీ ఈ ఏడాది ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. మరో వైపు ప్రతి ఏటా దసరాకు చెరకు క్రషింగ్ ప్రారంభించే ఫ్యాక్టరీ ఈ ఏడాది ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించింది. తగ్గిన క్రషింగ్ లక్ష్యం గతేడాది కంటే ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యాన్ని ఈఐడీ కర్మాగారం తగ్గించింది. గతేడాది 3.50 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ లక్ష్యం కాగా, ఈ ఏడాది 2.64 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే క్రషింగ్ లక్ష్యంగా చేసుకుంది. విజయనగరం, శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలోని చెరకు క్రషింగ్కు అనుమతిలిచ్చింది. ఈ ఏడాది ఈ నాలుగు ప్రాంతాల్లో కేవలం 9300 ఎకరాల్లో మాత్రమే చెరకు క్రషింగ్కు రిజిస్ట్రేషన్ నమోదైంది. ఈ మేరకు మాత్రమే సాగును అధికారులు చూపిస్తున్నారు. గతంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే ఇంతటి సాగు ఉండేది. ఈ ఏడాది సాగు తగ్గడం, క్రషింగ్ లక్ష్యం తగ్గడం చూస్తుంటే భవిష్యత్తులో ఈఐడీ ప్యారీ నడపడం కష్టంగా కనిపిస్తోంది. గతేడాది రూ.3,150 ఉన్న టన్ను చెరకు మద్దతు ధర ఈ ఏడాది రూ.3360గా చెరకు మద్దతు ధర ప్రకటించారు. పెట్టుబడులు పోను రైతుకు ఎకరా సాగులో కనిపించే ఆదాయం చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఈ మద్దతు ధరపై పెదవి విరుస్తున్నారు. బొబ్బిలి జోన్లో 75 వేల టన్నుల చెరకును, భీమసింగి ప్రాంతంలో 6వేల టన్నుల చెరకును, చోడవరంలో 20 వేల టన్నుల చెరకును క్రషింగ్కు తీసుకోగా, మిగిలిన చెరకును విజయనగరం జిల్లా నుంచి తీసుకుంటున్నట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది. ప్రతికూల వాతావరణంగతేడాది కంటే ఈ ఏడాది చెరకు పంట దిగుబడి తగ్గింది. ప్రతికూల వాతావరణం కారణంగా పంటకునష్టం సంభవించినట్లు రైతులు వాపోతున్నారు. గతేడాది ఎకరా సాగులో 30 టన్నుల చెరకు దిగుబడి వస్తే ఈ ఏడాది సగటున 25 టన్నుల చెరకు ఒక ఎకరాపొలంలో దిగుబడి వస్తున్నట్లు వెల్లడించారు. ఎకరా సాగుకు రూ.35 వేలు పెట్టుబడి అవుతుండగా, ఈ ఏడాది రూ.40 వేల వరకూ పెట్టుబడులు పెరిగాయని ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గిందని పేర్కొంటున్నారు. సకాలంలో ఎరువులు అందకపోవడం మరో సమస్యగా రైతులు చెబుతున్నారు. ఎట్టకేలకు క్రషింగ్ ప్రారంభం సంకిలి ఈఐడీ ప్యారీ కర్మాగారంలో నెలరోజులు ఆలస్యంగా క్రషింగ్ చెరకు టన్ను ధర రూ.3,360 2.64 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ లక్ష్యం గ్రామాల్లో వడివడిగా చెరకు కటింగ్ పనులుఏప్రిల్ వరకు క్రషింగ్ ఈఐడీ ప్యారీస్ ఫ్యాక్టరీ వద్ద చెరకు క్రషింగ్ ప్రారంభించాం. తొలుత మా ఫ్యాక్టరీ సమీపంలోని రైతులకు కటింగ్ ఆర్డర్లు ఇస్తున్నాం. మాకు విల్లింగ్ ఇవ్వడంతో పాటు చెరకును యాజమాన్య పద్ధతుల్లో సాగుచేసి దిగుబడి సాధిస్తున్న ఇతర ప్రాంతాల రైతులను కూడా గుర్తించాం. ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యం మేరకు మార్చి, ఏప్రిల్ నెలవరకూ గానుగ కొనసాగించే ఆలోచనలో ఉన్నాం. బి. వెంకటసూర్యనారాయణ,జనరల్ మేనేజర్, ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం, సంకిలి, విజయనగరం జిల్లా -
కంటి తనిఖీ కోసం వెళ్లి మృతి
● మృతుడి నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు చీపురుపల్లి: ఆ ఇంటి పెద్ద అకాల మరణం కుటుంబాన్ని కుంగదీసింది. చీపురుపల్లిలో బయల్దేరి విజయనగరం కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. మనిషి లేడనే బాధలో దుఃఖంలో ఉన్నప్పటికీ నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చిన ఆ కుటుంబం ఆదర్శం కాగా ఆయన నేత్రాలు సజీవంగా మిగలనున్నాయి. పట్టణానికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ కర్రోతు అప్పారావు(73) శుక్రవారం ఉదయం విజయనగరంలో కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే మృతిచెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని పట్టణంలోని జి.అగ్రహారం తీసుకొచ్చారు. నేత్రదానం కోసం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల పీఎంసీ చైర్మన్ గవిడి సురేష్ మృతుని కుటుంబసభ్యులకు వివరించగా దీనికి వారు అంగీకరించడంతో మానవీయత స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా రెడ్క్రాస్ నుంచి టెక్నీషియన్ హాజరై మృతుడు అప్పారావు నుంచి కార్నియా సేకరించారు. ఇక్కడ సేకరించిన కార్నియాను విశాఖపట్నంలోని ఎల్వీ.ప్రసాద్ ఆస్పత్రికి తరలించినట్లు గోవిందరాజులు తెలిపారు. విజయనగరం క్రైమ్: ఈ నెల 5న జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలపాలైన నిండు గర్భిణి మౌనిక (28) కేజీహెచ్లో చిక్సిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్సై చంద్ర తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..తోటపాలెంకు చెందిన గర్భిణి మౌనిక లంకాపట్నంలోని కన్నవారింటికి వచ్చింది. ఇంట్లో వంట చేస్తుండగా నైటీకి నిప్పంటుకోవడంతో ప్రమాదం సంభవించింది. దీంతో చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
● పసివారికి సాయం
జామి: తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మారి, పూరిగుడిసెలో నివసిస్తూ.. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతో కాలంగడుపు తున్న జామి మండలం జన్నవిస గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారుల దీనస్థితిపై ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’లోశుక్రవారం ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయమూర్తి ఎ.కృష్ణ ప్రపాద్ శుక్రవారం గ్రామానికి వెళ్లి చిన్నారులు గౌతమ్, విజయ్ ఇంటిని చూసి వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల విద్యాభ్యాసానికి భరోసా ఇచ్చారు. వసతి గృహల్లో విద్యాభ్యాసానికి నచ్చిన చోట తగిన ఏర్పాట్లు చేయిస్తానని భరోసా కల్పిడంతోపాటు చిన్నారులకు, వారి పెద్దమ్మకు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్కట్ స్వచ్ఛంద సంస్థ వారు చిన్నారులకు బట్టలు, నిత్యావసర సరుకులను గ్రామసర్పంచ్ శీరెడ్డి చందునాయుడు, మాతృభూమి సేవాసంఘం సభ్యుడు కొట్యాడ రవి చేతుల మీదుగా వితరణగా అందించారు. కొత్తవలస ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న కృష్ణాపురం గ్రామానికి చెందిన బొజ్జ ప్రసాద్ గ్రామానికి చెందిన రామారావు చేతుల మీదుగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఐసీడీఎస్ పీఓ అచ్యుతకుమారి మిషన్ వాత్సల్య పథకం మంజూరుకు హామీ ఇచ్చారు. పలువురు దాతలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, స్థానికులు వారికి అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారు. స్పందించిన హృదయాలు చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయమూర్తి నిత్యావసర సరుకులు, నగదు వితరణ ‘సాక్షి’ కథనానికి స్పందన -
చింతూరు బస్సు దుర్ఘటనపై దిగ్బ్రాంతి
● మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, ● క్షతగాత్రులకు రూ.5 లక్షలు ప్రభుత్వం అందించాలి ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరసాలూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్రోడ్డులో బస్సు ప్రమాద దుర్ఘటనపై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేట్ బస్సు లోయలో పడి పలువురు మృతిచెందడం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించి ,శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మరణించిన భక్తులకు రూ.15 లక్షలు ఇచ్చినట్లే, తీర్థయాత్రలకు వెళ్తూ మరణించిన భక్తులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలకు తక్కువ కాకుండా ఇవ్వాలన్నారు. కేంద్రప్రభుత్వం రూ.2 లక్షలు ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు ప్రభుత్వమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించడంతో పాటు వారికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఈ రహదారిలో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చర్యలు చేపట్టాలని కోరారు. -
కారుణ్య నియామకపత్రం అందజేత
విజయనగరం రూరల్: బాడంగి మండలానికి చెందిన జి.జోజమ్మను గంట్యాడ మండలంలోని వసంత జెడ్పీ ఉన్నత పాఠశాలలో కార్యాలయ సహాయకురాలిగా నియమిస్తూ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం నియామకపత్రం అందజేశారు. బాడంగి మండలం డొంకినవలస పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు జి.లక్ష్మణరావు మరణించడంతో ఆయన భార్య జోజమ్మకు కారుణ్య నియామకంలో ఉద్యోగం కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ, ఏవో రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు అలుగోలు విద్యార్థినెల్లిమర్ల రూరల్: మండలంలోని అలుగోలు ఉన్నత పాఠశాల విద్యార్థి గణేష్ రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. చింతపల్లి సముద్ర తీరంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో అండర్–14 విభాగంలో పాల్గొని సత్తా చాటాడు. ఈ నెల 20 నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు హజరుకానున్నాడు. ఈ మేరకు శుక్రవారం హెచ్ఎం కస్తూ రి, పీడీలు ధర్మారావు, మహేశ్వరరావు గణేష్ను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. 14న జిల్లా స్థాయి ఖోఖో పోటీలువిజయనగరం: జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న జిల్లాస్థాయి సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏఎంఎన్ కమలనాభ రావు, కె.గోపాల్లు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని కస్పా కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు 2008 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించి ఎత్తు, బరువు, వయస్సు కలిపి 250 పాయింట్ల లోపు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హత్యకేసులో ముద్దాయికి జీవిత ఖైదు, జరిమానావిజయనగరం క్రైమ్: మూడేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ఎం.బబిత తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ హత్య కేసు వివరాలిలా ఉన్నాయి. చీపురపల్లికి చెందిన బంగారి రామ్మోహనరావును ఆగస్టు 18, 2022లో గుర్తుతెలియని వ్యక్తి గాయపరిచినట్టు తమ్ముడు వెంకటేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు. అయితే గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయమై మృతుని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆల్టరేషన్ మెమో ద్వారా పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. దీంతో అప్పటి చీపురుపల్లి సీఐ సంజీవరావు కేసు దర్యాప్తు చేపట్టి విచారణ చేసి హత్య నేరానికి పాల్పడినట్లు రాయిపల్లి మురళిని అరెస్ట్ చేసి రి మాండ్ తరలించి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కోర్ట్ విచారణలో రాయిపల్లి మురళిపై నేరారోపణలు రుజువు కావడంతో వి జయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పీఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గమనించారు. నగరంలోని ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా సులబ్ కాంప్లెక్స్వద్ద ఫుట్ పాత్పై మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని సీఐ ఆర్వీఆర్కే చౌదరి గుర్తించారు. ఈ మేరకు గుర్తు తెలియని మృతదేహం కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వన్ టౌన్లో సంప్రదించాలని సీఐ చౌదరి కోరారు. -
పూరిల్లు దగ్ధం: వృద్ధురాలికి గాయాలు
రాజాం సిటీ: మండల పరిధి బొమ్మినాయుడువలస పంచాయతీ విజయరాంపురం గ్రామంలో ఓ పూరిల్లు దగ్ధంకాగా అందులో నిద్రిస్తున్న వృద్ధురాలు గాయాల పాలైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన లింగాల పైడమ్మ అనే వృద్ధురాలి పూరిల్లు శుక్రవారం వేకువజామున విద్యుత్షార్ట్ సర్క్యూట్కు గురైంది. ఈ ప్రమాదంలో కూడా ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా నిద్రలో ఉన్న వృద్ధురాలి శరీరం కాలిపోవడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమై ఆమెను ఎలాగోలా బయటకు తీసి ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ ఎస్సై పి.అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. వృద్ధురాలిని గ్రామానికి చెందిన మాజీ వలంటీరు, ఆటో డ్రైవర్ దాలి అప్పలనాయుడు రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
పేదోడి పళ్లెంలో ప్రోటీన్ మాయం
పిండి ఇచ్చి.. పప్పు ఎగ్గొడతారా? జనవరి నుంచి కిలో గోధుమపిండిని రూ.16కే ఇస్తామని, ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు 580.15 టన్నులు, మన్యం జిల్లాకు 280.93 టన్నుల పిండి అవసరమని లెక్కలు వేశారు. అయితే, గోధుమపిండితో సరిపెట్టి, అత్యంత ఖరీదైన కందిపప్పును మాత్రం ఎగ్గొట్టే ప్లానన్లో ప్రభుత్వం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత బకాయిలు, పాత సరుకులు సక్రమంగా ఇవ్వకుండా కొత్తవాటితో మసిపూసి మారేడుకాయ చేయడం తగదని ప్రజలు వాపోతున్నారు. కందిపప్పు పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ కొత్త సరుకులు ఏ మూలకు? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.పార్వతీపురం రూరల్: సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పేదవాడికి కనీస అవసరమైన ‘కందిపప్పు’ను అందించడంలో చేతులెత్తేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ గొప్పలు చెబుతున్న సర్కారు..ఆచరణలో మాత్రం పేదోడి కడుపు కొడుతోంది. గత ఏడాది కాలంగా రేషన్ డిపోల్లో కందిపప్పు జాడ లేదు. ఇప్పుడు కొత్తగా జనవరి నుంచి గోధుమపిండి, రాగులు ఇస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం..‘చేతితో ఇచ్చి చేటతో లాక్కున్నట్లు’ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కందిపప్పు కరువై..ముద్ద దిగేదెలా? పేదలకు చౌకగా నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు మండుతుంటే, రేషన్ ద్వారా అందించాల్సిన పప్పును ఏడాదిగా నిలిపివేయడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. పప్పు అన్నానికి కరువైన సామాన్యుడు..బయట మార్కెట్లో రూ.160కి పైగా పెట్టి కొనలేక నానా అవస్థలు పడుతున్నాడు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ప్రభుత్వం..ఇప్పుడు పప్పు గురించి మాట్లాడకుండా గోధుమపిండి, రాగులంటూ కొత్త పల్లవి అందుకోవడం ‘కంటితుడుపు చర్య’గానే కనిపిస్తోంది. ఇచ్చే బియ్యానికి ఎసరు ప్రభుత్వం కొత్తగా రాగులు ఇస్తున్నామంటూ గొప్పగా చెబుతున్నా..దాని వెనుక ఉన్న మెలిక చూసి లబ్ధిదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. రాగులను అదనంగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న బియ్యం కోటాలో కోత విధించి మరీ ఇస్తున్నారు. ఉదాహరణకు 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబానికి..ఇకపై 17 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చి, మిగతా 3 కిలోల బదులు రాగులు ఇస్తారు. అంటే ఉన్న బియ్యాన్ని తగ్గించి, కొత్త సరుకు పేరుతో మభ్యపెట్టడమేనని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఏడాదిగా లబ్ధిదారులకు అందని కందిపప్పు ఇప్పుడు బియ్యంలోనూ కోత పట్టించుకోని ప్రభుత్వం బియ్యం తగ్గించి..రాగులు ఇవ్వడంపై సర్వత్రా విస్మయంపౌష్టికాహార పంపిణీపై పాలకులకు లేని చిత్తశుద్ధి అత్యంత కీలకమైన కందిపప్పును ఏడాది కాలంగా ఇవ్వకుండా పేదలకు మొండిచేయి చూపడం దారుణం. పేదవాడికి చౌకగా ప్రొటీన్లు అందించాల్సిన బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. ‘కొత్తగా రాగులు ఇస్తున్నామంటూ ఆర్భాటం చేస్తూ, ఇప్పుడు ఇస్తున్న బియ్యం కోటాలో మూడు కిలోలు తగ్గించడం అన్యాయం. అదనంగా సరుకులు ఇవ్వాల్సింది పోయి, ఉన్న కోటానే తగ్గిస్తున్నారు. ఇది ప్రజలను మోసగించడమే. గోధుమపిండి వంటి కొత్త సరుకులు సరే.. కానీ, ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పెంచడంపై దృష్టి సారించాలి. కేవలం కొత్త పథకాల పేరుతో పాత లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం మానుకోవాలి. ప్రభుత్వం తక్షణమే కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలి.పాకల సన్యాసిరావు, సీపీఎం, పౌరసరఫరాల సంఘం నాయకుడు, పార్వతీపురం -
8,900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
● 70 లీటర్ల సారా స్వాధీనం ● ఏఓబీలో ఎకై ్సజ్శాఖ విస్తృత దాడులు కురుపాం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్ బి.శ్రీనాఽథుడు ఆదేశాల మేరకు ఏఈఎస్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించినట్లు కురుపాం ఎకై ్సజ్శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు ఆంధ్రా–ఒడిశా ఎకై ్సజ్శాఖల సంయుక్త దాడులను సరిహద్దు గ్రామాలైన సందుబడి, తంలబాయి, రేగలపాడు గ్రామాల్లో దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం సిద్ధం చేసి 8,900 లీటర్ల పులిసిన బెల్లం ఊట ధ్వంసం చేయడంతో పాటు అక్రమంగా తరలించేందుకు ఉంచిన 70 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలి పారు.ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వీవీవీ శేఖర్ బాబు, బోర్డర్ మొబైల్ పార్టీ ఇన్స్పెక్టర్ వెంకటరాజు, రాజాం, చీపురుపల్లి, పాలకొండ ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బందితోపాటు కురుపాం ఎకై ్సజ్ ఎస్సై శేఖర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. -
సెంచూరియన్ వర్సిటీతో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎంఓయూ
భువనేశ్వర్: ఒడిషా, ఆంధ్రప్రదేశ్లోని సెంచూరియన్ యూనివర్సిటీ, చత్తీస్గఢ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రాయోగిక ఫోరెన్సిక్ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి బలమైన వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. -
నిధుల స్వాహాపై అధికారుల విచారణ
● రూ.43.44లక్షలు స్వాహా అయినట్టు నిర్ధారణ రేగిడి: మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన బ్యాంకు మిత్ర (సీఎస్పీ) ఆ గ్రామానికి చెందిన 39 సంఘాలకు సంబంధించి రూ.43.44 లక్షల నగదు సొంతానికి వాడుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. సెర్ప్ డీపీఎం ఎ.చిరంజీవి, బ్యాంకు లింకేజీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జె.లక్ష్మునాయుడు, సీ్త్రనిధి మేనేజర్ సుధాకర్తో పాటు రేగిడి యూనియన్ బ్యాంకు అధికారులు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. సభ్యుల వద్ద నగదుకు సంబంధించి వివరాలు సేకరించారు. సంఘాల నిధుల స్వాహాకు పాల్పడిన సీఎస్పీ అల్లు శ్రీధర్పై చర్యలకు సిఫార్స్ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీపీఎం మాట్లాడుతూ సీ్త్ర నిధికి సంబంధించి రూ.2 లక్షలు, పొదుపు, బ్యాంకు లింకేజీలకు సంబంధించి రూ.41లక్షలకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని చెప్పారు. మహిళా సంఘాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం బాసిన గోవిందరావు, సిబ్బంది పాల్గొన్నారు. గాయపడిన మహిళకు ఎస్పీ సపర్యలు విజయనగరం క్రైమ్: గుర్ల మండల కేంద్రానికి సమీపంలో ప్రమాదానికి గురై గాయపడిన మహిళకు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సపర్యలు చేశారు. దగ్గరుండి ఆటోలో ఎక్కించి నెల్లిమర్ల మిమ్స్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గరివిడిలో జరిగిన అభ్యుదయం సైకిల్యాత్రలో పాల్గొని తిరిగి వస్తుండగా గుర్ల మండలం దుగ్గివలసకు చెందిన దంపతులు బైక్పై వెళ్తూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. వెనుక కూర్చున్న మహిళ తీవ్రంగా గాయపడింది. అటుగా కారులో వస్తున్న ఎస్పీ దామోదర్ గుర్తించి వెంటనే వాహనాన్ని ఆపి గాయపడిన మహిళకు సపర్యలు చేశారు. తాగునీటిని అందించారు. భర్తకు ధైర్యం చెప్పి ఆస్పత్రికి తరలించారు. 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం విజయనగరం అర్బన్: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ నెల 24న నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18 నుంచి వారోత్సవాలను నిర్వహించాలని సూచించారు. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్లో సంబంధిత అధికారులు, వినియోగదారుల సంఘాల సభ్యులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్ధ సత్వర పరిష్కారం’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వినియోగదారుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల, ఇంటర్ స్థాయివారికి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో వరుస ముగ్గురు విజేతలకు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. మొదటి బహుమతి సాధించిన విద్యార్థులను విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు. జాతీయ విననియోగదారుల దినోత్సవాన్ని ఒక పాఠశాల లేదా కళాశాలలో నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం వారోత్సవాల ప్రచారపత్రాన్ని విడుదల చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి జి.మురళీనాథ్, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బి.మన్మోహన్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి.వెంకటరమణ, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు చదలవాడ ప్రసాద్, పీఎస్బీ నాయుడు, ఎం.ఎస్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన అంగన్వాడీలు
–10లో● ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట ధర్నా ● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన పేదోడి పళ్లెంలో ‘ప్రొటీన్’ మాయం సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పేదవాడికి కనీస అవసరమైన ‘కందిపప్పు’ను అందించడంలో చేతులెత్తేసింది.చెరకు రైతుకు ఊరట విజయనగరం జిల్లాలోనే కాకుండా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో చెరకు సాగుచేస్తున్న రైతులకు ఈ ఏడాది ఎట్టకేలకు ఊరట లభించింది. విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీలు కదం తొక్కారు. ఎన్నికల్లో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై చొరవచూపకపోవడంపై మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. పోరాడతాం.. సాధించి తీరుతాం, అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా మార్చాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, అర్హతలను సడలించి మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ కార్యకర్తలుగా మార్చాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, రాజకీయ వేధింపులు నిలిపివేసి రాజాం ప్రాజెక్టులో నలుగురు హెల్పర్లుకు పదోన్నతలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యూటీ అమలకు గైడ్లైన్స్ రూపొందించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, ప్రీస్కూల్ విద్యను బలోపేతం చేయాలన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.పైడిరాజు, కార్యదర్శి అనసూయ, గౌరవాధ్యక్షరాలు వి.లక్ష్మి, జి.శారద, టి.మాలతి, ఎ. ఉషారాణి, ఎం. కృష్ణవేణి, జి.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ నిర్బంధం రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు అంగన్వాడీలు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం పోలీసులతో అడుగడుగునా ఆటంకం కలిగించింది. యూనియన్, సీఐటీయూ నాయకులను గృహ నిర్బంధం చేశారు. జిల్లా కేంద్రానికి బయల్దేరిన వర్కర్లను, నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్సులు, ఆటోల్లో వస్తున్న వారిని మార్గంమధ్యంలోనే నిలుపుదల చేసి వెనక్కి పంపారు. కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిర్బంధాలను అధిగమించి అంగన్వాడీలు భారీగా నిరసన కార్యక్రమానికి తరలివచ్చారు. ఉద్యోగభద్రత కల్పించాలి అంగన్వాడీలకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనాలు చెల్లించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలి. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. – బి.పైడిరాజు, అంగన్వాడీవర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎందుకంత వివక్ష అంగన్వాడీలపై కక్షతగదు. అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు తల్లికి వందనం పథకం అందజేయకపోవడం దారుణం. అంగన్వాడీ కేంద్రాలకు ఇటీవల సరఫరా చేసే పప్పుల్లో నాణ్యత తక్కువగా ఉంటోంది. నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి. – అనసూయ, అంగన్వాడీవర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి -
హౌసింగ్ డీఈ తీరుపై ఆందోళన
రామభద్రపురం: పీఎంఏవై పథకం కింద మంజూరయ్యే ఇంటి గ్రాంటు విషయంలో హౌసింగ్ డీఈ వివక్ష చూపుతున్నారంటూ రామభద్రపురం మండలంలోని నాయుడువలస గ్రామానికి చెందిన ఎస్సీ లబ్ధిదారులు ఆరోపించారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు శుక్రవారం బైఠాయించి నిరసన తెలిపారు. లబ్ధిదారులకు ఇంటి గ్రాంట్ మంజూరయ్యేలా చూడాలంటూ ఎంపీడీఓ రత్నంకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం 106 మంది దరఖాస్తుదారుల వివరాలను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు ఆవాస్ ప్లస్ యాప్లో నమోదు చేశారని, అందులో టీడీపీకి చెందిన 32 మంది పేర్లు మాత్రమే హౌసింగ్ ఏఈ లాగిన్ నుంచి పంపి పరిశీలిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీ ముద్రవేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. సొంతస్థలంలో ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇల్లు నిర్మించుకుందామన్న ఆశ అడియాశగానే మారుతోందని వాపోయారు. న్యాయం జరగకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు నడిమింటి సత్యంనాయుడు, కె.పార్వతి, ఎల్.సింహాచలం, ఎం.అప్పలనరసమ్మ, ఎం. వెంకటలక్ష్మి, ఇ.సింహాచలం, చింతాడ లక్ష్ము, శివ, జీనపాటి బంగారమ్మ, చింతాడ గురువులు, వెంకటరమణ, నవీన్, జీనపాటి సంజీవ్, తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల లబ్ధిదారుల జియోట్యాగింగ్లో వివక్ష టీడీపీ వారికి మాత్రమే గ్రాంట్ మంజూరుకు మొగ్గు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎస్సీ లబ్ధిదారుల ఆందోళన న్యాయం చేయాలంటూ ఎంపీడీఓకు వినతి -
రైతు కష్టం మిల్లర్ల పాలు..!
విజయనగరం ఫోర్ట్: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన వరి పంటను కొందరు మిల్లర్లు దోచుకుంటున్నారు. తరుగు పేరుతో బస్తాకు 4 నుంచి 6 కేజీల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రైతు కష్టాన్ని సొమ్ముచేసుకుంటున్నారు. మిల్లుకు తీసుకెళ్లిన ధాన్యంలో కోత వేయడం వల్ల ఎకరానికి రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు రైతులు నష్ట పోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తేమ శాతం ఎక్కువగా ఉందంటూ బుకాయిస్తున్నారు. ధాన్యం దింపేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. చేసేదిలేక రైతులు మిన్నకుంటున్నారు. ట్రక్ షీట్లో 40 కేజీలుగా కొనుగోలు కేంద్రం సిబ్బంది నమోదు చేస్తుండగా, మిల్లు వద్ద 41 కేజీలు చొప్పన ధాన్యం లెక్కిస్తున్నారు. ప్రశ్నించేవారికి గోనె సంచు బరువు అని మిల్లర్లు చెబుతున్నారు. గోనె సంచి బరువు 50 గ్రాములకు మించి ఉండదు. 80 కేజీల బస్తాకు గోనెపేరు 2 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. తేమశాతం పేరుతో మరో 2 నుంచి 4 కేజీల వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై జిల్లా వ్యవసాయాధికారి వి.తారకరామా రావు స్పందిస్తూ ధాన్యం అదనంగా తీసుకున్న మిల్లులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంట్యాడ మండలంలోని ఓ రైస్ మిల్లు వద్ద ధాన్యం బస్తాలతో బారులు తీరిన వాహనాలు -
ప్రజా వైద్యం.. ప్రజల హక్కు
విజయనగరం రూరల్: పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా మెరుగైన వైద్యం, వైద్యవిద్య అందించాలనే ధ్యేయంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు సర్కారు వాటిని నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయనగరంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజావైద్యం ప్రజల హక్కు అని, విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలన్నారు. చంద్రబాబు సర్కారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కళాశాలలు ఉంటే 500 పడకల ఆస్పత్రి అనుసంధానంగా ఉంటుందని, చంద్రబాబు సర్కారు తీరుతో విజయనగరం ప్రభుత్వాస్పత్రి నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. ర్యాలీ విజయవంతం చేయాలి వైద్యకళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల ఉద్యమానికి 4 లక్షల మందికి పైబడి మద్దతు తెలిపారన్నారు. సేకరించిన సంతకాల ప్రతులతో ఈ నెల 15న జిల్లా కేంద్రంలో భారీర్యాలీ నిర్వహిస్తామన్నారు. విజయనగరంలోని సీఎంఆర్ కూడలి సమీపంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ర్యాలీలో విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, మేధావివర్గాలు, విద్యావంతులు, రాజకీయ పార్టీలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్తిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నరసింహమూర్తి, రవికుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పి.జైహింద్కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేద విద్యార్థులకు వరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందుబాటులోకి తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యారని జెడ్పీ చైర్మన్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేసినట్టు వెల్లడించారు. గ్రామాల్లో 24 గంటలు వైద్యసేవలందించాలనే ధ్యేయంతో వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు సర్కారు వాటిని నిర్వీర్యం చేసిందన్నారు. కోవిడ్ వంటి మహమ్మారిని ఎదుర్కోవడం జగన్మోహన్రెడ్డి సమర్థవంతమైన పాలనకు నిదర్శనమన్నారు. స్క్రబ్స్టైఫస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు సర్కారు విఫలమైందన్నారు. వైఎస్ జగన్ పాలనలో విద్య, వైద్యానికి పెద్దపీట విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో 4 లక్షలకు పైగా సంతకాల సేకరణ ఈ నెల 15న జిల్లా కేంద్రంలో సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
రైతులను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవు
● అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేయాల్సిందే.. ● సీఎస్డీటీ రెడ్డి సాయికృష్ణ రామభద్రపురం: మిల్లులకు ధాన్యం తెచ్చిన రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని సీఎస్డీటీ రెడ్డి సాయికృష్ణ మిల్లర్లను హెచ్చరించారు. సంపత్ స్వర్ణ, ఎంటీయూ–1064 రకాల ధాన్యం మరపట్టించే సమయంలో ముక్క అవుతుడండతో కొనుగోలు చేయలేమని, క్వింటాకు 10 కిలోలు అదనంగా ఇవ్వాలని మిల్లర్లు రైతులకు తెగేసి చెబుతున్నారు. ఆయా రకాలను మిల్లుల వద్ద దింపేందుకు ఇష్టపడడం లేదు. ధాన్యం లోడు చేసిన ట్రాక్టర్లు రోజుల తరబడి మిల్లుల వద్దనే ఉండాల్సిన దుస్థితి. ఇదే అంశంపై ఈ నెల 11వ తేదీన ‘ఎక్కడి ధాన్యం అక్కడే..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. తహసీల్దార్ అజు రఫీజాన్, సీఎస్డీటీ రెడ్డి సాయికృష్ణ మండలంలోని ధాన్యం మిల్లులను పరిశీలించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలుచేయాలని సూచించారు. మరీ నాణ్యతలేని సరుకువస్తే మా దృష్టిలో పెట్టాలని, తాము రైతులతో మాట్లాడుతామని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్వోలు అనిల్, మహేషకుమార్ పాల్గొన్నారు. కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక ఏకగ్రీవం బొండపల్లి: మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్గా వైఎస్సార్సీపీ మదతుదారు షేక్ జైనబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో కో ఆప్షన్ మెంబర్గా పని చేసిన బొండపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ అబ్దుల్ రజాక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ స్థానానికి గురువారం ఎన్నిక నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి ఏవీ సాల్మన్రాజు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా.. పోటీకి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో జైనబీ ఎన్నిక ఏకగ్రీవమైంది. కార్యక్రమంలో ఎంపీపీ చల్లా చలంనాయుడు, వైస్ ఎంపీపీ గొండేల ఈశ్వరరావు, ఎంపీడీఓ జి.గిరిబాల, ఈఓపీఆర్డీ రఘుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం మెరకముడిదాం: మండల కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. మెరకముడిదాం గ్రామానికి చెందిన షేక్ సుభాన్ వైఎస్సార్సీపీ తరఫున గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికల అధికారి డీవీ మల్లికార్జునరావు సుభాన్ ఎన్నికై నట్లు ప్రకటించి ధ్రువీకరణపత్రం అందజేశారు. అనంతరం మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులతో ఎంపీపీ తాడ్డి కృష్ణవేణి అధ్యక్షతన ఎంపీడీఓ గొర్లె భాస్కరరావు సమావేశం నిర్వహించారు. -
భయపెడుతున్న స్క్రబ్ టైఫస్..!
● జిల్లాలో 10 కేసుల నమోదు ● ఆందోళన చెందుతున్న జనం ● సకాలంలో చికిత్స తీసుకోవాలంటున్న వైద్యులు విజయనగరం ఫోర్ట్: జిల్లా ప్రజలను స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడంతో జనం భయాందోళన చెందుతున్నారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. చీపురుపల్లి, బొండపల్లి, గరివిడి తదితర మండలాల్లో కేసులు బయటపడ్డాయి. వ్యాధి నివారణకు సకాలంలో వైద్యసేవలు పొందడంలో అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉండడంతో భయపడుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుగులు కరిచినప్పుడు వ్యాధి వ్యాప్తి : మైట్స్ అనే చిన్న పురుగులు కరిచినప్పడు స్క్రబ్ టైఫస్ జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, కళ్లు ఎర్రబడినట్టు కనిపించడం, దగ్గు, శ్వాసలో స్వల్ప ఇబ్బంది, పొట్టలో అసౌకర్యం వ్యాధి లక్షణాలు. పురుగు కరచినచోట చిన్న నల్లమచ్చ లేదా గాయం లాంటి బొట్టు కనిపిస్తుంది. ఇది దుస్తులు కింద ఉండే భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి ఉండదు. శరీరంలో ఎర్రబడిన దద్దర్లు వల్ల ఆహారం తినాలనిపించకపోవడం లాంటివి ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.... జ్వరం తగ్గక పోవడం, శ్వాసలో ఇబ్బంది, మతిమరుపు, గందర గోళం, మూత్రం తగ్గడం లాంటివి సంభవిస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. సకాలంలో చికిత్స అవసరం.. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది. వ్యాధి పట్ల అలసత్వం వహించరాదు. -
పరువు పాయె..!
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాకు చెందిన రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. పని తీరులో కంటే వివాదాల్లోనే టాప్లో ఉంటారన్న విషయం మరోసారి రుజువైంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే మంత్రి పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఫైళ్లను వేగంగా క్లియర్ చేసిన మంత్రుల్లో సంధ్యారాణి 19వ స్థానంలో నిలవడం గమనార్హం. రెండు కీలక శాఖలను చూస్తున్న ఆమె.. 5–7–2024 నుంచి 9–12–2025 వరకు (17 నెలల్లో) తన పరిధిలో పరిష్కరించిన ఫైళ్లు 545. ఒక్కో దరఖాస్తు పరిష్కారానికి సగటున 8 రోజుల 8 గంటల 20 నిమిషాల చొప్పున తీసుకున్నారు. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న గిరిజన సంక్షేమ శాఖలో ఒక్కో దస్త్రం పరిష్కారానికి 12 రోజులు చొప్పున తీసుకోవడం విశేషం. ‘గిరిజనులంటేనే వెనుకబడిన వారు. వారిని మీరు మరింత వెనుకబాటులోకి నెట్టేస్తున్నార’ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం మన మంత్రి పనితీరుకు అద్దం పడుతోంది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. జిల్లా అభివృద్ధిలోనూ, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శాఖల సంక్షేమంలోనూ చూపే శ్రద్ధ కంటే... వివాదాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రత్యర్థులను విమర్శించడం, దూషించడానికే ఆమె ప్రాధాన్యమిస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీని దూషించడానికే సంధ్యారాణికి మంత్రి పదవి ఉందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. దీనికితోడు.. ఆమె అనధికార పీఏ, కుమారుడి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి.. సొంత నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగినికే న్యాయం చేయలేకపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారని వినిపించింది. ఆమె అనధికార పీఏ ఆగడాలపై బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మక్కువ మండలం డి.శిర్లాం ఆశ వర్కరు మృతి వెనుక కూడా టీడీపీ నాయకుల వేధింపులు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాము మంత్రి కాళ్ల మీద పడి ప్రాథేయపడినా కనికరం చూపలేదని వారు వాపోయారు. మరోవైపు మంత్రి కారు డ్రైవర్ సామాజిక మాధ్యమాల వేదికగా తనను వేధిస్తున్నాడని మాజీ మంత్రి రాజన్నదొర వ్యక్తిగత సహాయకుడు ఇటీవల ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఇలా వరుస వివాదాల వల్ల ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనలోనూ ఆమెకు ఆహ్వానం అందలేదని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి.. కేవలం కక్షసాధింపు రాజకీయాలు, చిరుద్యోగుల తొలగింపులకే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలున్నాయి. వివాదాల్లోనే మంత్రి టాప్.. పౌరసేవల్లో మనం ఎక్కడో..! ఫైళ్ల క్లియరెన్స్లో వెనుకబాటు సమస్యల పరిష్కారంలో అలసత్వం! రాష్ట్రంలోని మంత్రుల్లో సంధ్యారాణిది 19వ స్థానం వివాదాల్లోనే టాప్లో ఉంటారన్న విమర్శలు పౌరసేవల్లోనూ కానరాని చొరవ జిల్లాలో ఇంటబయటా విమర్శలు మరోవైపు పుర, నగరపాలక సంస్థల్లో ప్రజలకు అందిస్తున్న పౌరసేవల్లోనూ పార్వతీపురం మన్యం జిల్లా బాగా వెనుకంజలో ఉంది. పురపాలిక, నగర పంచాయతీల్లో ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణ, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, రహదారుల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, స్వయం సహాయ సంఘాలకు ఆర్థిక సాయం, ఆస్తి పన్నుల వసూళ్లు తదితర ఎనిమిది అంశాలను మదింపు చేసి ర్యాంకులు కేటాయించారు. మొదటి పది స్థానాల్లో జిల్లా చోటు దక్కించుకోలేకపోయింది. అసలే వెనుకబడిన జిల్లా.. ఆపై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయలోపం వల్ల పార్వతీపురం మన్యం ఏ విధంగానూ ముందడుగు వేయలేకపోతోందని గిరిజన సంఘాల నాయకులు అంటున్నారు. -
● యూరియా కష్టాలు యథాతథం
విజయనగరం జిల్లా చిత్తరాపురం సచివాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు విజయనగరం జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. ఖరీఫ్లో యూరియా దొరకక నానా అగచాట్లు ఎదుర్కొన్నారు. రబీలోనూ అదే పరిస్థితి నెలకొంది. సంతకవిటి మండలం చిత్తారపురం సచివాలయం వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూకట్టారు. వాస్తవంగా అక్టోబర్ 10వ తేదీన యూరియా పంపిణీ చేయాల్సి ఉంది. చిత్తారపురం రెవెన్యూ పరిధిలో తమ భూములు ఉన్నాయని, తమకు కూడా యూరియా అందజేయాలంటూ గెడ్డబూరాడపేట, పనసపేట రైతులు డిమాండ్ చేశారు. వచ్చిన యూరియా తక్కువగా ఉండడం, డిమాండ్ అధికంగా ఉండడంతో పంపిణీని నిలిపివేశారు. ఆ రెండు గ్రామాల రైతులకు మరో లోడ్ వచ్చాక పంపిణీ చేస్తామని సీఐ, ఏఓ సీహెచ్ యశ్వంతరావు నచ్చజెప్పడంతో గురువారం పోలీసుల సమక్షంలో రైతుకు బస్తాచొప్పున యూరియా పంపిణీ చేశారు. – సంతకవిటి -
రుక్మిణి సిల్క్స్లో.. వస్త్రాల నిధి
● వస్త్రాలయం ప్రారంభోత్సవంలో సందడి చేసిన నిధి అగర్వాల్ ● సినీనటిని చూసేందుకు తరలివచ్చిన జనం నిధి అగర్వాల్ విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో సినీతార నిధి అగర్వాల్ గురువారం సందడి చేశారు. సినీ పాటలకు స్టెప్పులు వేసి యువతను అలరించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఎస్వీఎన్ లేక్ ప్యాలస్ ఎదురుగా గురువారం చేపట్టిన రుక్మిణి సిల్క్స్ వస్త్రాలయం ప్రారంభోత్సవంలో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి వస్త్రాలయాన్ని ప్రారంభించారు. సినీతార నిధి అగర్వాల్ నాలుగు అంతస్తుల వస్త్రాలయాన్ని సందర్శించారు. వివిధ రకాల చీరలు ధరించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు విక్రయించే రుక్మిణి సిల్క్స్ వస్త్రాలయాన్ని ప్రతి ఒక్కరు సందర్శించాలని కోరారు. రానున్న సంక్రాంతి వరకు కేవలం రూ. 34కే చీరలు, రూ.150కే పురుషుల షర్ట్స్తో పాటు చిన్నపిల్లల దుస్తుల విక్రయాలపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే నెల్లూరు, ఖమ్మం జిల్లాల్లో విశేష ఆదరణ పొందుతున్న రుక్మిణీ సిల్క్స్ వస్త్రాలయం తాజాగా ప్రత్యేక ఆఫర్లు, సరమైన ధరల్లో విజయనగరంలో వస్త్రాల విక్రయాన్ని ప్రారంభించడం సంతోషయదాయకమన్నారు. వస్త్రాలయం అధినేతలు జి.వి.మురళి, జి.శ్రీనివాస్ మాట్లాడుతూ వస్త్రవ్యాపార రంగంలో 30 ఏళ్ల అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా మూడవ బ్రాంచ్ను ప్రారంభించామని, అతి తక్కువ ధరలకే ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. వినియోగదారుల ఆదరణే తమ లక్ష్యమని, భవిష్యత్లో మరిన్ని జిల్లాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి సంక్రాంతి పండగ వేడుకకు అవసరమైన వస్త్రాలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. అభిమానులకు అభివాదం చేస్తున్న సినీ తార నిధి అగర్వాల్ -
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
సీతంపేట: మండల కేంద్రం సీతంపేటకు చెందిన యువకుడు శేషపు చంద్రశేఖర్ (23) గడిగుడ్డి సమీపంలో జరిగిన బైక్ అదుపుతప్పి గురువారం వేకువ జామున మృతిచెందాడు. బుధవారం రాత్రి ఐటీడీఏ నుంచి సీతంపేటలో తాను నివాసముంటున్న ఎస్టీ కాలనీకి ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో గడిగుడ్డి సమీపానికి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జెమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లారు జామున మృతిచెందినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మృతుడికి తండ్రి గోవిందరావు, సోదరుడు వంశీ ఉన్నారు. యువకుడి మృతివార్త విన్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అందరితోనూ సరదాగా ఉంటూ, మంచికి మారుపేరైన చంద్రశేఖర్ అకస్మాత్తుగా మృతిచెందడంతో స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. -
ఐదు తులాల బంగారం అపహరణ
వేపాడ: మండలంలోని రామస్వామిపేట గ్రామంలో దొంగలు బంగారం అపహరించిన సంఘటనపై వల్లంపూడి ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బెహరా ఈశ్వర్రావు, చిలకమ్మ దంపతులు గురువారం ఉదయం బయటకువెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి దొంగలు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా సీక్రెట్ లాకర్ పగలగొట్టి ఐదు తులాలు బంగారం అపరించుకుని పోయినట్లు గుర్తించారు. దీంతో ఈశ్వర్రావు కుమారుడు శంకరరావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గత నెలలో వల్లంపూడిలో ఇదే తరహాలో పట్టపగలే దొంగతనం జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కోరుతున్నారు.


