జూలై 15 కి ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో వేర్వేరు ఇంజినీరింగ్ ఏజెన్సీల ద్వారా నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల భవనాలన్నీ జూలై 15లోగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. హెల్త్ క్లినిక్ భవనాలు, పీఎం హెల్త్ మిషన్ కింద మంజూరైన భవనాలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన 24 హెల్త్ క్లినిక్ భవనాలు, ఇప్పటికే పూరైన వాటిని డీఎంహెచ్ఓకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఇంకా శ్లాబ్ లెవెల్లో ఉన్న వాటిని పూర్తి చేయాలని, ప్రారంభం కాని వాటికి వెంటనే టెండర్లు పిలవాలని తెలిపారు. స్థలం లేని వాటి వివరాలు ఇస్తే స్థలం కేటాయించనున్నామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ భారతి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


