సచివాలయంలో పాఠశాల
● శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలు ● ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
చీపురుపల్లిరూరల్(గరివిడి): ఆ పాఠశాలలో 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులకు సరైన తరగతి భవనాలు, కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేదు. ఎన్నో ఏళ్లుగా తరగతి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా సరే నాడు–నేడులో ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. అయినా సరే ఆ శిథిల భవనాల్లోనే ఉపాధ్యాయులు బోధన చేసేవారు. చివరికి ఐదు నెలల క్రితం వచ్చిన మోంథా తుఫాన్ ప్రభావానికి శిథిలావస్థలో ఉన్నా భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం వల్ల శ్లాబ్ నుంచి లీకై న నీరు తరగతి భవనాల్లోకి ప్రవేశించి విద్యార్థలు కూర్చునే గచ్చులు బురదమయంగా తయారయ్యాయి. ఆ భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో గత్యంతరం లేక ప్రత్నామ్నాయంగా విద్యార్థులకు బోధన చేసేందుకు స్థానికంగా ఉన్న సచివాలయాన్ని కేటాయించారు. గరివిడి మండలంలోని ఏనుగువలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం స్థానిక సచివాలయమే పాఠశాలగా మారింది. స్థానికంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పాఠశాల లేకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన ఐదు నెలలుగా సచివాలయంలో బోధన చేస్తున్నప్పటికీ పాఠశాల వాతావరణం ఏమాత్రం కనిపించదు. విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం లేదు. పాఠశాల ఉన్నట్లయితే సరిపడా తరగతి భవనాలతో పాటు విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం ఉంటుంది. పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో పెరుగుతుంది. పాఠశాలలో ఉండే సౌకర్యాలు, సదుపాయాలు, ఆటస్థలం లాంటివి సచివాలయంలో లేనందున పిల్లల్లో పాఠశాలకు వెళ్లాలని, పంపించాలని తల్లిదండ్రుల్లో నిరాసక్తి కలుగుతోంది. ప్రస్తుతం గ్రామంలో విద్యార్థులు చదువుకునేందుకు సరైన తరగతి భవనాలు లేకపోయిన కారణంగా పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం లేదన్న విమర్శలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. ఈ కారణంగా పిల్లలు తక్కువగా ఉన్నారని, తరగతి భవనాలు నిర్మించి ఉంటే పిల్లల అడ్మిషన్లు పెరుగుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల అభివృద్ధికి నోచుకోలేదని వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమం పేరుతో ఎన్నో పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. ఆ పాఠశాలల మాదిరిగా ఈ పాఠశాల తరగతి భవనాలను అభివృద్ధి చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంతో వదిలేశారని ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు సచివాలయానికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికై నా విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా పాఠశాల తరగతి భవనాలను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సచివాలయంలో పాఠశాల


